1999 ఎంసెట్ రిజల్ట్ ఒక్కసారిగా సూర్యాపేటలో మారుమోగిపోయింది. త్రివేణి కాలేజికి అడ్మిషన్లు భారీగా వచ్చాయి. ఇది పూర్యపు బ్రిలియంట్ కాలేజీతో పోలిస్తే పెద్దకాలేజీ. దాదాపు వెయ్యి దాకా విద్యార్ధులుండేవాళ్ళు. పక్కా భవనాలు ఉండేవి. అప్పటికి శ్రీచైతన్య, వికాస్ లాంటి కార్పోరేట్ కాలేజిల్లో చేరిన విద్యార్ధులు కొందరు వెనక్కి వచ్చి త్రివేణిలో చేరారు. మరోవైపు ర్యాంకులున్నాగానీ బ్రిలియంట్ కాలేజీలో అడ్మిషన్లు మందగించాయట. అక్కడ స్థానిక స్కూల్స్ లో 10th పూర్తిచేసిన విద్యార్ధులకి, ఆయా స్కూళ్ళ యాజమాన్యాలు నచ్చచెప్పి, ఫలానాఫలానా కాలేజిల్లో చేరమని పంపిస్తుంటాయి. అలా ఆయా స్కూళ్ళనుండి తమ కాలేజీకి ఎందరు విద్యార్ధులు వస్తే, సదరు కాలేజీల వాళ్ళు ఆయా స్కూళ్ళ వారికి, తలకు ఇంత అని కమీషన్ ఇస్తుంటారు. ఆ విధంగా తలకు 500/- రూ. చెల్లించి మరీ, బ్రిలియంట్ కాలేజీ వాళ్ళు విద్యార్ధుల్ని పోగు చేసుకున్నారట.

వాస్తవానికి – ఈ నియమం లోకల్ స్కూళ్ళ, కాలేజీలకి మధ్యే కాదు, చుట్టుప్రక్కల ఉన్న ప్రభుత్వకాలేజీలకీ, గుంటూరు, విజయవాడ, ప్రకాశం, హైదరాబాద్ జిల్లాలలో ఉన్న కార్పోరేట్ కాలేజీలకీ మధ్యకూడా వర్తించబడేది. సూర్యాపేట చుట్టు కనీసం 1000 పైగా గ్రామాలు, తండాలూ ఉండేవి. అక్కడి ప్రభుత్వ, ప్రైమరీ, ఉన్నత పాఠశాలల్లో ఉద్యోగాలు చేసే ప్రభుత్వ టీచర్ల సంఖ్య ఆ ఊరిలో ఎక్కువుగానే ఉండేది. ఆ ప్రభుత్వ టీచర్లు దాదాపు కార్పోరేట్ కాలేజీలకి PRO ల లాగా పనిచేసేవాళ్ళు. వారికి చుట్టుప్రక్కల గల ఏపల్లెలో ఉద్యోగం అయినా, సూర్యాపేటలో నివాసం ఉంటూ up and down చేసేవాళ్ళు. బదిలీలు అయినా, ఆ చుట్టుప్రక్కలే musical chair అయ్యేటట్లు manipulate చేసేవాళ్ళు. వాళ్ళలో చాలామందికి సూర్యాపేటలో చక్కని, పెద్ద స్వంత భవంతులు [నివాస గృహాలు] ఉండేవి. ప్రభుత్వ టీచర్లలో కొందరికి సూర్యాపేటలో వడ్డీవ్యాపారాలు, ఇతర వ్యాపారాలు ఉండేవి. పట్టణంలో ఉన్న ప్రైవేట్ స్కూళ్ళు, కాలేజీలలో వాటాలుండేవని చెప్పుకునేవాళ్ళు. వాళ్ళల్లో కొందరు తమ పేరిట జాబ్ కెళ్ళి వచ్చెందుకు నిరుద్యోగుల్ని నియమించుకొని, వారంలో ఓసారి వెళ్ళి రిజస్టరులో సంతకాలు పెట్టుకొని రావటం, మిగిలిన సమయాల్లో తమ వ్యక్తిగత వ్యాపారాలు చూసుకోవటం కూడా కద్దు. అందరూ ఇలా ఉండేవారని అనను గాని, ఇలా ఉండేవారు పెద్ద సంఖ్యలో ఉండేవారు. అంతేకాదు 1998 - 2001 సంవత్సరాలలో టీచర్స్ యూనియన్లలో స్టేట్ లెవల్ లీడర్స్ ఈ జిల్లానుండే ఉండేవాళ్ళు. నేను పని చేస్తున్న త్రివేణి కాలేజీలో కూడా ఈ టీచర్స్ పిల్లలే ఎక్కువుగా ఉండేవాళ్ళు. కాలేజీ మేనేజ్ మెంట్ లోని ఒక డైరెక్టర్ నల్గొండ జిల్లా ప్రైవేట్ కాలేజీల యూనియన్ కి ప్రెసిడెంటో లేక సెక్రటరీగానో ఉండేవాడు.

అక్కడ మరో విశేషం ఏమిటంటే – స్కాలర్ షిప్పులు. విద్యార్ధుల వెంటపడి కాలేజీ యాజమాన్యం స్కాలర్ షిప్పుల అప్లికేషన్లు నింపించి, ఫైల్ చేసి, ఆ స్కాలర్ షిప్పులని తమ ఫీజుగా జమచేసుకునేవి. అసలా షరతు మీదే అడ్మిషన్లు ఎక్కువుగా జరిగేవి. అందులోని మతలబు ఏమిటో నాకు అప్పడర్ధం కాలేదు. అర్ధంచేసుకొనే ప్రయత్నం కూడా నేనేమీ చేయలేదు. ‘అవన్నీ యాజమాన్యం వారి గొడవలు. మనకెందుకు’ అనుకునేదాన్ని. అయితే రెండేళ్ళ తర్వాత 2001 -02 లో మోత్యానాయక్ కేసుతో స్కాలర్ షిప్పుల కుంభకోణం బయటపడినప్పుడు అందులో కాలేజీలకి ఉండే లాభమేమిటో అర్ధమయ్యింది. 1999 – 2000 లో త్రివేణిలో పనిచేసేటప్పుడు యాజమాన్యానికి సంబంధించిన ఏవిషయము నేను పట్టించుకునేదాన్ని కాదు, పరిశీలించేదాన్నీ కాదు. పిల్లలకి పాఠాలు చెప్పడం, స్టాప్ రూంలో కొలీగ్స్ తో ఎంతవరకూ స్నేహమో అంతవరకూ ఉండటం, ఇంట్లో ట్యూషన్లు, పాప, పని. అంతే. సమయం మిగిలితే రామకోటి వ్రాసుకునేవాళ్ళం. ఎందుకంటే ‘ఈ ప్రపంచంలో ఎన్నో మోసాలు, ఘోరాలు జరుగుతుంటాయి. వాటన్నింటికి మనం ఎదిరించలేం, మార్చనూ లేం. మన వరకూ మనం, ఇతరులకి కీడు చెయ్యకపోతే మేలు చేసినట్లే!’ అనుకునేవాళ్ళం. నేను డిగ్రీ చదివే రోజుల్లో రామాయణవిషవృక్షం చదివి, ఆ విషం తలకెక్కించుకొని ‘రాముడు హిపోక్రైట్’ అనీ వితండవాదాలు కొన్నిరోజులు చేశాను. అప్పట్లో నేను చదువుకున్న JKC కాలేజీలో కుమారస్వామి గారు అని ఓ లెక్చరర్ ఉండేవారు. ఆయన ఇంగ్లీషు లెక్చరర్. బాగా చెబుతారు. మంచి వక్త, పండితుడు. ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారికి బావమరిది. మా క్లాసుకు రారు. అయినా గానీ నన్ను నేను పరిచయం చేసుకొని, ఆయనతో వాదన పెట్టుకునేదాన్ని. ఓ ఆదివారం రోజు ఆయన ఇంటికి వెళ్ళి తర్కిస్తుండగా, ఆయన ఓపిగ్గా, నాది ఎంత వితండ వాదమో వాదంతో ఓడించి, విడమరిచి చూపించాడు. అప్పటినుండి మళ్ళీ వెనక్కి మళ్ళి, చిన్నప్పుడు చందమామలో భారత రామాయణాలు చదివిన పాజిటివ్ ఆలోచనా సరళి వైపు మళ్ళాను. విశ్వనాధ వారి వేయి పడగలు ఆ తర్వాత చదివాను. అప్పటినుండీ అనుకునేదాన్ని రామకోటి వ్రాయాలని. అయితే తీరిక దొరకలేదు. సూర్యాపేటలో త్రివేణి కాలేజీలో పనిచేస్తుండగా ఆ తీరిక దొరికింది. నేనూ, నా భర్తా కూడా రామకోటి మొదలుపెట్టాము. ఒక్కోరోజు ఆరు, ఏడు వేల వరకూ వ్రాసేవాళ్ళం. నిజానికి రామనామం వెయ్యిసార్లు వ్రాయటానికి సరిగ్గా గంట సమయం పడుతుంది. ఆ ప్రకారం, రోజుకి గంటచొప్పన, 1000 సార్లు వ్రాస్తూ, కోటి పూర్తి చెయ్యాలంటే 30 సంవత్సరాలు పడుతుంది. ఆ లెక్క గట్టుకుని చూస్తే తమాషాగా అన్పించింది. రామకోటి వ్రాస్తూ, మనల్ని మనం పరిశీలించుకుంటుంటే మనస్సులో కలిగే భావసంచలనం ఇంకా గమ్మత్తుగా అన్పించేది. నా బ్లాగు చుట్టాల్లో కొందరు ‘ప్రతీరోజు ఇంత పొడవాటి టపాలు ఎలా వ్రాయగలుగు తున్నారు’ అని అడిగారు. ఈ ఓపిక వెనక ఉన్న రహస్యం ఏమిటంటే అప్పుడు రామ కోటి వ్రాయడమే. ఒకే పనిని గంటల కొద్ది చేసే సహనం, ఓర్పు రామకోటి నేర్పింది.

అప్పటికి ఇంటి దగ్గర ట్యూషన్ కోసం వచ్చేపిల్లలు సైకిళ్ళు పెట్టుకోవటానికి ఇబ్బంది ఎదురవ్వడంతో ఇల్లుమారాము. మా ఇంటి ఓనరు కూడా ఇంటి అద్దెను 50% పెచ్చాడు. ఇల్లు మారడానికి ఇది కూడా ఒక కారణమే. ఇది మార్కెట్టుకు దూరంగా ఉన్న విశాలమైన వీధి. ఉదయం, సాయంత్రం ఇంటి దగ్గర ట్యూషన్స్, తర్వాత కాలేజీలో క్లాసులు, రామకోటి, ప్రతి మూడు నెలలకు ఒకసారి పుణ్యక్షేత్రాల సందర్శన. ఇంకే గొడవా మాకు పట్టేదికాదు. అప్పుడే కార్గిల్ యుద్ధం సంభవించింది. సూర్యాపేటకు చెందిన ఇద్దరు, ముగ్గురు సైనికులు యుద్ధంలో మరణించారు. వారిలో ఒకరికి విపరీతమైన ప్రచారం వచ్చింది. కాలేజీలో స్టాఫ్ రూంలో తరచూ ఈవిషయాలన్నీ చర్చకు వచ్చేవి. నేనేమో అప్పట్లో వార్తలు చూసేదాన్ని కాదు, చదివేదాన్నికాదు. దాంతో కొలీగ్స్ చర్చిస్తుంటే మౌనంగా వినేదాన్ని. వాళ్ళెదైనా అంటే చిరునవ్వుతో సరిపెట్టేదాన్ని.

అంతలో సెప్టెంబరు సప్లమెంటరీ/ బెటర్ మెంట్ పరీక్షలు వచ్చాయి. ఓరోజు స్టాఫ్ రూంలో కూర్చొని ఉన్నాను. మా ఫిజిక్స్ డిపార్టుమెంటులో జూనియర్ లెక్చరర్ ఒకతను వచ్చి “మేడం ఈ లెక్కలు చేసిపెడతారా?" అంటూ ఓ లిస్ట్ ఇచ్చాడు. అందులో కొన్ని ప్రశ్నలూ, లెక్కలూ ఉన్నాయి. యధాలాపంగా వాటిని చూసి అతడు అడిగిన లెక్కలు చేసిపెట్టాను. నాలుగురోజుల తర్వాత ఫిజిక్స్ పరీక్ష జరిగింది. పరీక్ష అయ్యాక పేపర్ చూద్దును గదా, అవే ప్రశ్నలూ, లెక్కలూ. మా జూనియర్ నాకు ఇచ్చిన లిస్ట్ లోనివే. నాకు ఆశ్చర్యం వేసింది. నా ఆశ్చర్యాన్ని గమనించిన తోటి లెక్చరర్స్ నర్మగర్భంగా నవ్వారు. నాకు తెలిసిన టీచర్లని అడిగాను. వాళ్ళు “ఇదంతా ఇక్కడ మామూలే మేడం! ఒక్క సెప్టెంబర్ ఎగ్జామ్స్ పేపర్సే కాదు, మార్చివి కూడా వారం ముందే లీక్ అవుతాయి” అని చెప్పారు. “మరి సదరు మంత్రి గారు A,B,C సెట్లని లాటరీ తీయాటాలూ, పోలీసు స్టేషన్లకు సమాచారం అందించడాలూ, అప్పటివరకూ పోలీసు స్టేషన్లలో ఉంచబడిన ప్రశ్నాపత్రాలు అప్పుడు పరీక్షా కేంద్రాలకు పంపడాలు – ఇదంతా ఏమిటీ?" అని అడగబోయి మాట మింగేశాను. అడిగితే ‘మరీ ఇంత అమాయకత్వమా’ అన్నట్లు గానో లేక ‘అమాయకత్వం నటిస్తున్నావు’ అన్నట్లుగానో ఎగాదిగా చూస్తారని ఊర్కుండిపోయాను. కానీ మనస్సు, తార్కీక బుద్దీ ఊర్కోవు గదా! ఈ నేపధ్యంలో వికాస్ లో నేను చూసిన సెప్టెంబరు పరీక్షలు, ఎక్సెల్ లో చూసిన మార్చి పరీక్షలు గుర్తుకొచ్చాయి. 1996 - 1997 లో, నేను నంబూరు కమిటీ కాలేజిలో పనిచేస్తున్నప్పుడు ఇంటర్ ప్రశ్నాపత్రాలు కోల్ కతా ప్రెస్ నుండి లీక్ అయ్యాయి. రామబ్రహ్మం అన్న వ్యక్తి అందుకు బాధ్యుడిగా వెలుగులోకి వచ్చాడు. రామబ్రహ్మం కేసుగా అది పేరు పడింది. ఆ తర్వాత అప్పటి రాష్ట్ర ప్రభుత్వం [నారా చంద్రబాబునాయుడు] ప్రైవేట్ కాలేజీలకి రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేసి, కాలేజీలన్నింటి మీదా గ్రిప్ సంపాదించాడు. అలాగే పరీక్షా విధానం మార్చి A,B,C అనే మూడు సెట్లు ప్రచురించడం, జంబ్లింగ్ విధానం వంటివి అమలులోకి తెచ్చింది. ఇన్ని ఏర్పాట్లు మధ్య వారం ముందే సదరు మంత్రిగారు లాటరీ తీయబోయే సెట్టు ఏదో ఇక్కడి కాలేజీలకి తెలియడం చూసి అవినీతి బలం ఎంతటిదో నాకు కొంత అర్ధమయ్యింది.

వికాస్, ఎక్సెల్ లాంటి కార్పోరేట్ కాలేజీల్లో, పరీక్షకు రెండు మూడు రోజుల ముందు ‘ఇది డైరెక్టరు గారు ఇచ్చిన Guess paper. దీన్ని పిల్లలకిచ్చి ప్రిపేర్ చేయించమన్నారు’ అంటూ ట్యూటర్లు, వార్డెన్లు మాకు [లెక్చరర్స్ కి] కొన్ని ప్రశ్నల జాబితా ఇచ్చేవాళ్ళు. అందులో ఉన్న ప్రశ్నలన్నీ ఇంపార్టెంటు ప్రశ్నలు, మరికొన్ని ప్రశ్నలూ ఉండేవి. పరీక్ష అయ్యాక చూస్తే, ఆ జాబితాలోని ప్రశ్నల్లో ఓ పది, పన్నెండు తప్ప, అన్ని ప్రశ్నలూ ప్రశ్నాపత్రంలో ఉండేవి. అప్పట్లో “అబ్బా! మన డైరెక్టర్ గారికి ఎంత టాలెంట్, ఎంత ఎక్స్ పీరియన్స్ కదా! గెస్ పేపర్ చెబితే దాదాపు అందులో ప్రశ్నలే వచ్చాయి” అని మేం [లెక్చరర్స్ + విద్యార్ధులు కూడా] అబ్బురపడేవాళ్ళం. క్రీం సెక్షన్ల, ఇంటెన్సివ్ కేర్ సెక్షన్లలోని విద్యార్ధులతోనూ, ముందునుండీ ర్యాంకులు తెచ్చుకోగల విద్యార్ధులుగా పేరుపడిన వాళ్ళతోనూ, డైరెక్టర్లు ప్రత్యేక క్లాసులు, పరీక్ష రెండుమూడు రోజులు ఉందనగా తీసుకునే వాళ్ళు. ఆ క్లాసుల్లో బిట్స్ తో సహా రివిజన్ చేయబడేవి. తర్వాత అవే బిట్స్, ప్రశ్నలు పరీక్షా ప్రశ్నపత్రంలో ఉండటం, ర్యాంకులు రావటం షరా మామూలే. ఇదంతా పిల్లలు గుర్తించలేరు. లెక్చరర్స్ కూడా తెలుసుకోలేరు. అదంతా డైరెక్టర్ల ప్రతిభా, సామర్ధ్యాలు గానూ, అనుభవ సారంగానూ గుర్తించబడేది. అందులోనూ కార్పోరేట్ కాలేజీల్లో సాధారణంగా [మెరిట్ స్టూడెంట్స్] బాగా చదివే పిల్లలు. మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి, పైస్థాయి కుటుంబాల నుండి వచ్చేవాళ్ళు. వాళ్ళ దృక్పధంరీత్యా కూడా పిల్లల్లో ఓ తపన ఉంటుంది. అలాంటి వాళ్ళు ఎటూ బాగా చదివేవాళ్ళు. Assignment, Week test వంటి కాలేజీ internal పరీక్షలలో ఈ విద్యార్ధులు ఎటూ అన్నిప్రశ్నలు – జవాబులు బాగా నేర్చేఉంటారు.అలాంటి పిల్లలకి గెస్ పేపర్ రివిజన్ మరింత ఉపయుక్తంగా ఉండేది. దాంతో ర్యాంకర్లకి ఎక్కువ మార్కుల రికార్డులు, కాలేజీలకి ఎక్కువమంది 80%, 90% దాటిన మార్కులు తెచ్చుకున్న విద్యార్ధుల గురించిన రికార్డులు ఉంటాయి. అవి మరింత ప్రచారాస్ట్రాలుగా ఉపయోగపడతాయి. ఒకవిధంగా చెప్పాలంటే అది ‘క్లాస్ మోసం’.

ఇక సూర్యాపేట లాంటి ‘B’ సెంటర్లలో జరిగేది ‘మాస్ మోసం’ అన్న మాట. ఇక్కడ చుట్టు ప్రక్కల తండాల నుండి, గ్రామాల నుండి వచ్చిన విద్యార్ధులు, పదవ తరగతి వరకూ గ్రామాల్లో, తండాల్లో, తెలుగు మీడియంలో, ప్రభుత్వ పాఠశాలల్లో చదివి వచ్చిన వాళ్ళు ఉండేవాళ్ళు. ఇంటర్ లో కూడా తెలుగు మీడియం విద్యార్ధులు ఎక్కువగానే ఉండేవాళ్ళు. వీళ్ళ దృక్పధం రీత్యా ‘ఇదీ డైరెక్టరు గారు ఇచ్చిన గెస్ పేపర్. ప్రిపేర్ అవ్వండి’ అంటే వాళ్ళ చెవికి ఎక్కదు. ‘ఇది లీక్ అయిన పేపర్. ప్రిపేర్ అవ్వండి’ అంటేనే స్పందిస్తారు. కాకపోతే లీక్ గురించి అందరూ బహిరంగ రహస్యం పాటిస్తారు. పరీక్ష ముందు రోజు కూడా నిర్భయంగా, స్వేచ్ఛగా క్రికెట్ ఆడుకునేవారు. ఈ స్థితిని ప్రత్యక్షంగా చూడకపోతే నేనూ నమ్మేదాన్ని కాదు. ఇదంతా చూసి నాకు కళ్ళు తిరిగినంత పనయ్యింది. కాలేజీ యాజమాన్యాలు ‘ఇంటర్ పేపర్ లీక్’ని పెద్దమొత్తంలో సొమ్ము చెల్లించి కొనుక్కునే వాళ్ళు. ఫలితంగా వచ్చిన విద్యార్ధుల మార్కుల్ని పత్రికా ప్రకటనలు, కరపత్రాల రూపంలో ప్రచారించి మళ్ళీ విద్యార్ధుల్ని పోగేసి డబ్బు సంపాదించేవాళ్ళు. అందుచేత విద్యార్ధుల సంఖ్య ఎక్కువ ఉన్న కాలేజీలకీ ఈ సదుపాయం బాగా ఉండేది. రెండు మూడు వందల మంది విద్యార్ధులతో నెట్టుకొచ్చే బ్రిలియంట్ కాలేజీ [నేను ముందు సంవత్సరం పనిచేసిన కాలేజీ] వంటి వాటికి ఆ సదుపాయం అందుబాటులో ఉండేది కాదు.

ఈ విషయంలో కొంత సమాచారం, నా దగ్గర ట్యూషన్లకి వచ్చే విద్యార్ధులు, వారి తల్లితండ్రుల [వాళ్ళు గవర్నమెంట్ టీచర్లే] నుండి సేకరించాను. నేను అప్పటికి పనిచేస్తున్న త్రివేణి కాలేజీకి చెందిన విద్యార్ధులు అంతకు రెండు మూడేళ్ళ క్రితం మాస్ కాపీయింగ్ లో పట్టుబడి, ఒక విద్యాసంవత్సరాన్ని కోల్పోయారట. పరీక్షా కేంద్రంలో కాలేజీ యాజమాన్యం manipulate చేసి మాస్ కాపీయింగ్ చేయించిందట. బిట్ పేపర్ లో ఆ కేంద్రంలోని విద్యార్ధులంతా ఒకేమాదిరి జవాబులు వ్రాసారట అందరూ. ఒక బిట్ కు తప్పు జవాబు వ్రాయగా – అన్నీ సరిగ్గా వ్రాసినా, ‘ఏమో పిల్లలంతా బాగా చదివారేమో’ అనుకోవచ్చు. అందరూ ఒకే బిట్ కు తప్పు జవాబు వ్రాస్తారా?’ అన్న వాదనతో మాల్ కాపీయింగ్ నిరూపించబడి కేసయ్యిందట. విద్యార్ధులు ఒక సంవత్సరం కోల్పోయారు కూడా. అక్కడి స్థానిక రాజకీయ నాయకుడు రాంరెడ్డి దామోదర రెడ్డికి [నేటి మంత్రి] త్రివేణి యాజమాన్యం నమ్మకమైన అనుచరులు. అలాంటి పరిచయాలన్నీ ఉపయోగించుకొని కాలేజీ యాజమాన్యం కేసులు మాఫీ చేయించుకుందట. ఇవన్నీ విని ‘అబ్బో! ఈ కాలేజీ యాజమాన్యం వాళ్ళు ఘనులే!’ అనుకున్నాము నేను, నాభర్తా. అయితే ఇదీ నేనెవ్వరితోనూ అనలేదు. ఎవరేం చెప్పినా విని ఊరుకున్నాను. మేమిద్దరమే చర్చించుకునే వాళ్ళం. ‘అందుకే కాబోలు కాలేజీ యాజమాన్యాలు రాజకీయ నాయకులతో చాలా స్నేహంగా ఉంటాయి’ అనుకున్నాం. ఎందుకంటే గతంలో వికాస్ డైరెక్టర్లలో ఒకరు ఎప్పుడూ కోడెల శివప్రసాద్ చుట్టూ తిరుగుతుంటారనీ, మరొకరు నిరంతరం రాజకీయనాయకులతో పేకాట ఆడుతూ terms పెంచుకుంటూ ఉంటారని, అక్కడి వార్డెన్లు, ట్యూటర్లు గుసగుసలు పోతుండగా, అక్కడ పనిచేసే రోజుల్లో విన్నాను. ‘ఇందుకన్నమాట’ అని నేను నాభర్తా విశ్లేషించుకున్నాము. ఇలా ‘B’ సెంటర్లలో ఈ పేపర్ లీక్ ని పచ్చిగా చూడకపోయి ఉంటే ఎప్పటికీ నమ్మేవాళ్ళం కాదేమో అనుకున్నాం.

ఈ సంఘటనకు కొద్దిరోజుల ముందు, నేను సీనియర్ ఇంటర్ క్లాసులో పాఠం చెబుతున్నాను. గాల్వానా మీటర్ గురించి పాఠం చెప్పి పిల్లల్ని సందేహాలుంటే అడగమని ప్రోత్సహించాను. ఆ క్లాసులో రాకేష్ అనే కుర్రావాడున్నాడు. అతడు గత సంవత్సరం[జూనియర్ ఇంటర్ లో] మార్కుల్లో నల్గొండ జిల్లాకో, సూర్యాపేట పట్టణానికో[Dist. first or Town first] ర్యాంకర్. క్లాసులో ఎప్పుడూ గంభీరంగా ముఖం పెట్టుకొని ‘మేధావిని నేను’ అన్నట్లు కూర్చుంటాడు. అల్లరీ చెయ్యడు. అలాగని పాఠం చెప్పినప్పుడు దాన్ని గ్రహించిన తనమూ[Grasp చేసుకున్న], అర్ధమైనప్పుడు పిల్లల ముఖంలో కన్పించే వెలుగూ అతడి ముఖంలో నాకెప్పుడూ కనబడలేదు. పిల్లవాడి తీరే అంత కాబోలు అనుకున్నాను. Internal పరీక్షల్లో మాత్రం అతడికి బాగా మార్కులు వచ్చేవి. ఎందుకంటే పిల్లవాడు బట్టీరాయుడు మరి. ఆరోజు పిల్లల్ని డౌట్స్ అడగమని ప్రోత్సహిస్తూ “రాకేష్! ఎప్పుడూ నువ్వు ఏ డౌట్స్ అడగవు. అసలు డౌట్సు ఎప్పుడూ రాలేదంటే నీకు నేను చెప్పేది మొత్తం అర్ధమై అయినా ఉండాలి. లేదా అసలేం అర్ధం కాకపోయన్నా ఉండాలి” అంటూ ఛలోక్తి వేసాను. ఒకరిద్దరు పిల్లలు చిన్న చిన్న సందేహాలు అడిగారు. నివృత్తి చేసాను. ‘నువ్వేం అడగవే?’ అన్నట్లు ఆ పిల్లవాడివైపు చూశాను. తప్పదన్నట్లు ఆ పిల్లవాడు లేచి ఏదో సందేహం అడిగాడు. తీరా చూస్తే అది బేసిక్ కాన్పెప్ట్ కీ, నిర్వచనానికి సంబంధించినది. దాంతో అసలా పిల్లవాడి తెలివితేటల మీదా, సామర్ధ్యం మీదా నాకు సందేహం వచ్చింది. ఎందుకంటే సందేహం అడిగేటప్పుడు కూడా పిల్లవాడి గొంతులో స్పష్టత గానీ, ఆత్మవిశ్వాసం గానీ లేవు. నా సబ్జెక్ట్ లోనే అలా ఉన్నాడా, లేక మిగిలిన సబ్జెక్టుల్లోనూ అంతేనా అన్న అనుమానం వచ్చి గణిత, రసాయన శాస్త్ర లెక్చరర్స్ ని రాకేష్ activeness గురించి అడిగాను. వాళ్ళు నర్మగర్భంగా చిరునవ్వు నవ్వారు. “మరి ఆ పిల్లవాడికి టౌన్ ఫస్ట్ ర్యాంకు ఎలా వచ్చింది?” అన్నాను. రసాయన శాస్త్ర లెక్చరర్ చిన్న గొంతుతో రహస్యం చెబుతున్నట్లు “మేడం! ఆ పిల్లవాడి పేరెంట్స్ ఇద్దరూ గవర్నమెంట్ టీచర్లు, టీచర్ల యూనియన్ లోనూ, లోకల్ గానూ పరపతి ఉన్నవాళ్ళు. మేనేజ్ మెంట్ కి బాగా దగ్గర. ఈ పిల్లవాడే కాదు, వాడి తమ్ముడు జూనియర్ ఇంటర్ లో రాజేష్ అని ఉన్నాడు. వాడూ అంతే. అయినావాడికి 10th లో టౌన్ ర్యాంకు వచ్చింది. ఇంటర్ లో ఎక్కువపర్సంటేజ్ వస్తే లాంగ్ టర్మ్ కోచింగ్ కి కార్పోరేట్ కాలేజీలు కన్సెషన్ ఇస్తారు. అదీగాక అదో ప్రిస్టేజ్. కొన్ని అలా జరిగి పోతుంటాయి. మనం పట్టించుకోకూడదు” అన్నాడు. నాకు విషయం బోధపడింది.

ఈ మార్కులు, ర్యాంకుల మాయాజాలంలో పడిన పిల్లలకు అసలు నిజంగా తమ సత్తా ఏమిటో, తమ బలాలు, బలహీనతలు ఏమిటో తెలియదు. కామమ్మ మొగుడంటే కామోసనుకున్నట్లు’ కాలేజీ/ స్కూళ్ళ యాజమాన్యాలు నీవు మేధావి అంటే వాళ్ళు తాము మేధావులం అనుకుంటారు. అలాగే కాలేజీ/ స్కూళ్ళ యాజమాన్యాలు ‘నీవు వేస్ట్ ఫేలో’ అంటే వాళ్ళు తమని తాము పనికిమాలిన వాళ్ళు అనుకుంటారు. మొత్తానికి విద్యార్ధులకి మార్కులూ, ర్యాంకులే ప్రమాణాలు తప్ప అసలు తామేమిటి అనే సత్యం ఎప్పటికీ తెలియదు.

ఇది ఎలాంటి దంటే – ఓ తాజా ఉదాహరణ చెబుతాను. నిన్నమొన్నటి దాకా అధిష్టానం, మీడియా, కేంద్రమంత్రి పురంధేశ్వరిని మేధావి అనీ, ఆవిడ వాగ్ధాటిని, ఉపన్యాస పటిమనీ ఆకాశానికి ఎత్తేసింది. అమెరికా శ్వేత సౌధపు ఆహ్వానాలూ ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు సదరు మంత్రిణి అందుకుంది. తీరా ఎలక్షన్లు వచ్చాక, పార్టీ అధిష్టాన దేవత దర్శనం కూడా ఇవ్వలేదు. ‘టిక్కెట్ ఇచ్చిన చోట పోటీ చెయ్ లేకుంటే తప్పకో’ అని కర్కశంగా చెప్పబడింది. ఈ విధంగా రాజకీయరంగంలో, సినిమా రంగంలో, మీడియా ఆయా వ్యక్తుల్ని ‘నందంటే నంది, పందంటే పంది’ చెయ్యగలదు. అలాగే విద్యారంగంలో కార్పోరేట్ కాలేజీలు, స్కూళ్ళ యాజమాన్యాలు [స్థాయిని బట్టి ’బి’ సెంటర్లోని విద్యాసంస్థల యాజమాన్యాలు కూడా] ఆయా వ్యక్తుల్ని [విద్యార్ధులనీ, లెక్చరర్లనీ] సూపర్ అంటే సూపర్, చెత్తంటే చెత్త.

ఒక్కమాటలో చెప్పాలంటే వాళ్ళు చెల్లించాలంటే సత్తురూపాయిని చెల్లించగలరు, చెల్లించకూడదను కుంటే కొత్తరూపాయిని కూడా పక్కన పడేయించగలరు. కార్పోరేట్ కాలేజీ మేనేజ్ మెంట్, బాగా చెప్పె లెక్చరర్స్ ని ఎందుకు తీసుకుంటారంటే ‘ఫలానా కాలేజీలో బాగా చెప్తారు’ అనే పేరుకోసం, అడ్మిషన్లకోసం. కాని లెక్చరర్ తన సామర్ధ్యాన్ని తెలుసుకొని డిమాండ్ చేయకుండా, మొదట నుండి నువ్వు పందివి అని మేనేజ్ మెంట్ అంటుంది, ఆ లెక్చరర్ మేనేజ్ మెంట్ గ్రిప్ లోకి వచ్చిన తరువాత నందివి అంటుంది. అదే ఇక్కడ స్ట్రాటజీ.

ఇదంతా చూసి ‘ఈ రకమైన చదువులతో, ర్యాంకులతో, మార్కులతో ఈ పిల్లలు బయటికొచ్చి తమకు తాము ఉపయోగపడేది ఏముంది, దేశానికి ఉపయోగపడేది ఏముంది?’ అనుకొని మనసంతా చేదుగా అన్పించింది. కానీ ‘సాక్షాత్తూ మంత్రే లాటరీ తీస్తాడు, ముందే ఏది లాటరీ తీస్తాడో కాలేజీలకి లీక్ అవుతుంది. ఇంతగా మంత్రుల దగ్గరనుండీ, పైస్థాయి అధికారులు వరకూ తెలిసే నడుస్తున్న అవినీతి ఇది. ఎవరేం చెయ్యగలరు?’ అన్పించింది.

ఈ ద్వైదీ భావంతో కొట్టుమిట్టాడుతుండగానే ప్రమాదం మరో వైపు నుండి ముంచుకొచ్చింది.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

8 comments:

1994 lo anukunta emcet paper leak ayyindi....tenali lo private college vallu got some 3rd or 6th(girl)......daaani ki judgement nenu inter first year chaduvutunnappudu ante 2001 lo
vachhindi........meeru cheppedi nenu inter chadivina time lo appatike ...chaala mudiripoyndi.......

nenu okati adagaalanukuntunnanu emee anukokandi.....inta mandini vimarsistunnaru..anni lopalu ettichooputunnaru.....meeru vatini aapadaaniki emina chesara.....(ofcourse nenu anni posts chadava ledu endukante eppudu evaro okarini criticise chestunnarani...............)
for example....meeru mee job ni vadali..enduku jl ga try cheyaledu...akkada ento mandi poor students ki help cheya vachhugada...atleast mee valla oka govt college baagupadeda kaada.

ఆపడానికి నేనేం చేసానో తెలియాలంటే అన్ని టపాలు చదవండి.

1976 సం.లో నేను 10th పరీక్ష వ్రాశాను.నంద్యాలలో నేను చదివింది.నేను చదివింది ఒక స్కూలులో,కానీ maths కు tution కు మాత్రం వేరే స్కూలులొ maths భోదించే మాష్టారు దగ్గరకు వెళ్ళేవాడిని.ఆయన బాగా చెప్పేవారు.maths పరీక్ష ముందు రోజున ఆయన మాతో చేయించిన లెక్కలే దాదాపు అన్నీ మరుసటి రోజున పరీక్షలో వచ్చాయి.అప్పుడు ఆయన ఎంత బాగా guess చేసారనుకున్నానుగానీ ఇప్పుడు మీ టపా చూస్తే ఆ కాలంలోనే పేపర్ లీకు వ్యవహారం ఉండివుందేమోనని నాకనుమానం వస్తోంది.

well written

చిలమకూరు విజయమోహన్ గారు,

మేము కూడా ఈ క్లాస్, మాస్ మోసాలని ప్రత్యక్షంగా చూడకపోయి ఉంటే నమ్మి ఉండేవాళ్ళం కాదండి. సూర్యపేటలో నేను పనిచేస్తున్నప్పుడు , నావిద్యార్ధుల తల్లితండ్రుల్లో కొందరు సిగ్గుపడుతూనే చెప్పారు “ఇక్కడ ఇవన్నీ చాలా మామూలే మేడం! నేను M.Sc. in Physics చేశాను. కానీ నాకేమి రాదు. ఏదో కాపీలు, లీకులతో లాగించేశాం” అని చెప్పారు.

అయ్యో, మీరి ఇంతకు ముందే బ్లాగులోకంలో పరిచయమయి వుంటే నేను కోచింగ్ తీసుకొనేటప్పుడు ఇంకొన్ని ఎక్కువ సినిమాలు చూసి 50 లోపు ర్యాంక్ కొట్టివుండేవాడినేమో.కిటుకులు తెలియక ఓ తెగ చదివి చదివి బుర్ర మొద్దుబారిపోయింది.

ఇప్పటి కళాశాలల కలుషిత విద్యావిధానాన్ని బాగా చెప్పారు.

నా బ్లాగ్ లో మీ వ్యాక్య చూసి నేను మీ బ్లాగ్ చూసాను, ఓపికగా మీ టపాలను రెండు గంటల పాటు చదివాను. మీలాగా ఆలోచించేవాళ్ళు చాల వరకు వుంటారు, సమాజంలోని అవినీతిని, కుళ్ళు ను సహించలేరు, కానీ ఏంచేస్తాం మీలాగా ఎదురు తిరిగితే సమస్యల వలయం లో చిక్కుకోవటం తప్పని సరి. ప్రజల్లో చైతన్యం రావాలి, అవినీతి రూపుమాపాలి, చడువుకోలోని స్థితిలో ఉన్న వాళ్లకు చదువు కల్పించాలి. విద్య, వైద్యం ప్రబుత్వం విధిగా అందరికి ఎలాంటి ప్రామాణికాలు లేకుండా కల్పించాలి. ముందుగా మనను మనం ఉద్దరించితే దేశాన్ని ఉద్దరించినట్టే. ఏమంటారు...

SK garu,

ప్రజల్లో మీరు, మేము కూడా ఉన్నామండి. మనందరం కలిస్తేనే ప్రజలు అవుతాం.

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu