వికాస్ లో పనిచేస్తున్న రోజుల్లో నా కుటుంబ మిత్రుల కుమార్తె మా వికాస్ లోనే చదువుతుండేది. మాటల సందర్భంలో ఫలానా ‘డైరెక్టర్’ ఎలా చెబుతారు?’ అని అడిగాను. “ఆయన పాఠం చెబుతూ తాను మహాగొప్పగా చెబుతున్నట్లు తెగ ఫీలయి పోతాడాంటీ! విషయమేమిటంటే మనకి ఒక్క ముక్కా అర్ధంకాదు” అన్నది. ఆ పిల్ల చెప్పిన తీరుకి మేం బాగా నవ్వుకున్నాం. తర్వాత పిల్లల్ని కదిపిచూస్తే దాదాపు అందరి దగ్గరా అలాంటి అభిప్రాయమే ఉంది. దాంతో నేనూ, నాభర్తా ఆయా డైరక్టర్లని చూసి “వీళ్ళకి సుడి [అదృష్టం] ఉండి సంపాదించటమే, సామర్ధ్యం ఉండి కాదు” అనుకునేవాళ్ళం. అయితే రెండేళ్ళ తర్వాత అది అదృష్టంకాదనీ, మ్యాచ్ ఫిక్సింగ్ ల్లాగా ర్యాంక్ ఫిక్సింగ్ ల కుంభకోణమనీ అర్ధమైంది. అదెలాగో వివరంగా, వరుసగా చెబుతాను.

వాస్తవానికి గుంటూరు విద్యాకేంద్రంగా పేరు పడటానికి, అక్కడ స్వాతంత్రానికి పూర్వం నుండీ స్థాపించబడిన కళాశాలలూ, పాఠశాలలూ ఒక కారణం. ఏసీ కళాశాల, హిందూ కళాశాల, స్టాల్ బాలికోన్నత పాఠశాల [నేను చదువుకున్నది అక్కడే] వంటి కొన్ని సంస్థలు బ్రిటిషు జమానా నుండి పేరొందినవి. ఎందరో రాజకీయ, సినీ ప్రముఖులు గుంటూరు ఏసి కాలేజీ, హిందూ కాలేజీల పూర్వవిద్యార్ధులే. కరుణశ్రీ వంటి కవులూ, మన్నవ గిరిధర రావు వంటి రచయితలూ గుంటూరు కళాశాలల్లోని అధ్యాపక శ్రేణిలోని వారే. ఆ తర్వాత, ఏసీ కాలేజీ నుండీ, హిందూ కాలేజీ నుండీ కొందరు లెక్చరర్లు, దాదాపు 40 ఏళ్ళ క్రితమే ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలకు ట్యూషన్ల ఒరవడి దిద్దడంతో గుంటూరు విద్యాకేంద్రంగా వాసికెక్కింది. అందులో ఆ తర్వాత రవీ కాలేజీ ప్రైవేట్ కళాశాలల విజయకేతనానికి చిరునామా అయ్యింది. రవీ కాలేజీ నుండి బయటికొచ్చిన లావు రత్తయ్య విఙ్ఞాన్ కాలేజీ స్థాపించాడు. గుంటూరు నుండి తెనాలి వెళ్ళెదారిలో, వడ్లమూడి గ్రామ పరిధిలో, సువిశాల క్షేత్రంలో భారీభవనాలతో ఉన్న విఙ్ఞాన్ విద్యాసంస్థల సముదాయాన్ని, రాష్ట్రపర్యటనలో ఉన్న అప్పటి ముఖ్యమంత్రి ఎన్.టి.ఆర్. చూసి దిగ్ర్భాంతి చెందాడనీ, ఆ తర్వాత ప్రైవేట్ కాలేజీల యజమాన్యాలకి మరిన్ని ‘ఖర్చులు’ పెరిగాయనీ అప్పట్లో మా ప్రాంతంలో చెప్పుకున్నారు.

విఙ్ఞాన్ కళాశాల ప్రాభవం వెలుగుతుండగా రవికాలేజీ మెల్లిగా మరుగున పడిపోయింది. తర్వాత విఙ్ఞాన్ నుండి గణితం, భౌతికశాస్త్రం, రసాయన శాస్త్రం, వృక్ష, జంతు శాస్త్రాల లెక్చరర్స్ అయిదుగురు కలిసి ఒక గ్రూప్ గా బయటికి వచ్చి ‘వికాస్’ కళాశాలను స్థాపించారు. తదుపరి సంవత్సరాల్లో మరో గ్రూప్ [ 5 గురు లెక్చరర్లు] విఙ్ఞాన్ నుండి బయటకు వచ్చి ‘విద్వాన్’ కళాశాలని స్థాపించారు. వికాస్ నుండి విజ్ డం కళాశాల …… ఇలా ప్రైవేట్ కళాశాలలు తామర తంపరగా ఉండేవి. ప్రతీ సంవత్సరం వేసవి సెలవుల్లో, తెలంగాణా, ఉత్తరాంధ్ర , రాయలసీమ ప్రాంతాల్లోని పల్లెపల్లెకూ తిరిగి, విద్యార్ధుల్ని తెచ్చుకోవటం ఇక్కడ ఆచరణలో ఉండేది. [ఇప్పటికీ అంతేననుకొండి] విజయవంతమైన వ్యాపారంలోనూ, విద్యాసంస్థల్లోనూ, అనుభవం సంపాదించిన తర్వాత అందులో పనిచేసే ఉద్యోగులూ, లెక్చరర్లూ బయటికొచ్చి స్వంతంగా వ్యాపారాలూ, విద్యాసంస్థలూ పెట్టటం మామూలే కదా అనుకున్నాము. అయితే అది మామూలుగా నడిచే వ్యాపారం కాదనీ, వ్యాపారానుభవమో, యాజమాన్య పద్దతుల్లో అనుభవమో సంపాదించుకొని, ఆయా లెక్చరర్లు బయటికొచ్చి కాలేజీలు పెట్టలేదనీ, మ్యాచ్ ఫిక్సింగ్ ల వంటి ర్యాంకు ఫిక్సింగ్ ల అనుపానులు తెలుసుకున్నాక, బయటికొచ్చి, ఆ కిటుకుతో కొత్తకళాశాలలు ప్రారంభించి, విజయం సాధించారని 2000 సంవత్సరం తర్వాత నాకు స్పష్టపడింది.

ఇప్పుడంత అవకాశం శ్రీచైతన్య వంటి అతిపెద్ద కార్పోరేట్ కళాశాలలు, చిన్న, ప్రైవేట్ కళాశాలలకి ఇవ్వడం లేదులెండి. విద్వాన్, సురేష కోచింగ్ సెంటర్, విజ్ డమ్ గట్రా చాలా కాలేజీలని over take చేసి దాదాపు monopoly స్థితివైపు లాక్కెళ్ళి పోతున్నాయి. దాదాపు రాష్ట్రం మొత్తం మీద ఒకటి రెండో పెద్ద కార్పోరేట్ విద్యాసంస్థలు ఉన్నాయి. ‘B’ కేంద్రాల్లోని చిన్న ప్రైవేటు కళాశాలలు, పాఠశాలల యజమానులు సంఘాలు పెట్టుకొని రాజకీయనాయకులతో, మంత్రులతో ప్రత్యేకంగా బేరసారాలు చేసుకుంటున్నారు. మరోవైపు ఈ అతిపెద్ద కార్పోరేట్ విద్యాసంస్థలు ఎల్.కె.జి. నుండీ టెక్నో శిక్షణ అంటూ ఫ్రాంఛైజ్ స్కూల్స్, కాన్పెప్ట్ స్కూల్స్ తెరుస్తున్నాయి. అది వేరే కథ.


ఇలా లెక్చరర్లు, కొంతకాలం యాజమాన్యం దగ్గర నమ్మకంగా పనిచేసాక, ’కిటుకు’ తెలుసుకొని బయటికెళ్ళి కొత్త కళాశాలలలో పోటీ ఇస్తోన్నారన్న సమస్య కొంచెం పెద్దది కాగానే, ముందునుండీ పాతుకుపోయిన పెద్దకళాశాలలు, కొత్తగా ఫీల్డులోనికి అడుగుపెట్టిన లెక్చరర్స్ తో ముందు జాగ్రత్త తీసుకోవటం మొదలుపెట్టారు.

అప్పట్లో కార్పోరేట్ కాలేజిల్లో లెక్చరర్లకి సబ్జెక్టుకు ఇంత అన్న కాంట్రాక్టు పద్దతిలో రెమ్యూనరేషన్ ఉండేది. లేదా రోజుకి గంట చొప్పున నెలకు ఇంత అన్న పద్దతి ఉండేది.

ఆయా సబ్జెక్టులలో లెక్చరర్లకి కొన్ని బ్రాంచీలు కేటాయిస్తారు. కొన్ని సంవత్సరాలకి ఆ లెక్చరర్లకి concern branches తప్ప మిగిలిన branches of science లో [command] సాధికారత తగ్గుతుంది. అప్పుడు మేనేజ్ మెంట్ ఆట మొదలుపెడుతుంది. క్రమంగా లెక్చరర్స్ లో insecurity create చేస్తుంది. ఏకారణంగానైనా లెక్చరర్ బయటికి వెళ్ళిపోవలసి వచ్చి, మరోకాలేజీని approach అయితే అక్కడి యాజమాన్యం మొదటిప్రశ్న “మీరు ఏ branch teach చేసేవాళ్ళు?" లెక్చరర్ ’ఫలానా బ్రాంచ్’ లు చెప్పగానే ’ఆ బ్రాంచిలో మాకు బ్రహ్మాండమైన లెక్చరర్స్ ఉన్నారు. మీరు so and so branch deal చెప్పగలరా? ఎక్కువ టచ్ లేదు కదా. కాబట్టి ఇంతే రెమ్యూనరేషన్ ఇస్తాను’తో ఆట మొదలౌతుంది. నిజానికి లెక్చరర్ talented అయితే, కొద్దిపాటి రివిజన్ తో ఏ బ్రాంచ్ అయినా డీల్ చెయ్యగలడు. కానీ దాన్ని మేనేజ్ మెంట్ ఒప్పుకోదు. ఇక నిరంతర నిఘా, తోటివాళ్ళ మధ్య రాజకీయాలు, యజమాన్యానికి చాడీలు మోయటం ఇవన్నీ ఏ ఫీల్డులోనైనా ఉండే సదా మామూలే. ఈ నేపధ్యంలో నేను వికాస్ కళాశాలలోనూ, వీనస్ లోనూ, అరోరా లోనూ క్లాసులూ సంపాదించాను. వికాస్ లో నా కొలీగ్ ఒకరు “ఎక్సల్ కాలేజీ వారికి ప్రస్తుతం లెక్చరర్ల కొరత బాగా ఉంది. మీరక్కడ ప్రయత్నిస్తే కెరీర్ బాగుంటుంది. చూడండి. అక్కడైతే ఎంసెట్ క్లాసులు పొందవచ్చు” అని సలహా ఇచ్చారు. నేను వివరాలు సేకరించాను. ఎక్సల్ కాలేజీలో ఫీజిక్సు డిపార్ట్ మెంట్ డైరక్టరు చలపతి రావుగారు. నేనాయన శిష్యురాలిని. అప్పటికి 55 సంవత్సరాల టీచింగ్ అనుభవం గల, వయస్సు పైబడిన వ్యక్తి. అపార అనుభవశాలి. ఎంసెట్ ఫిజిక్స్ గ్రంధ రచయిత. ఆయనంటే నాకు చెప్పలేనంతగౌరవం. అసలు నేను ఫిజిక్సు మీద మక్కువ పెంచుకున్నదే ఆయన దగ్గర ట్యూషన్ లో చేరాక. దాంతో ఎగిరి గంతేసినట్లు ఎక్సల్ ని అప్రోచ్ అయ్యాను. మా సార్ చలపతిరావు గారిని కలిసి నన్ను నేను గుర్తుచేసుకున్నాను. డెమాన్ స్ట్రేషన్ క్లాసు తీసుకోమన్నారు. అప్పట్లో మన సర్టిఫీకేట్లు ఎవరికీ పట్టేవి కావు. సత్తాతో పాఠం చెప్పగలమా లేదా అన్నదే ప్రామాణికం. డెమో క్లాసు తర్వాత మా సార్ ‘It is Excellent’ అంటూ అప్పటికప్పుడే నాకు జాబ్ ఇచ్చేసాడు. ఆయన దగ్గర టీచింగ్ లో ఎన్నో మెళుకువలు నేర్చుకున్నాను. ఆయనకీ భగవద్గీత అంటే చాలా ఇష్టం. దాంతో తీరిక సమాయల్లో ఆధ్యాత్మికత గురించి చర్చలు చేసేవాళ్ళం. ‘అమ్మాయ్! Thought provoking గా ఏదైనా మాట్లాడు’ అనేవాడాయన. ఎదుటి వాళ్ళు ఏదీ మాట్లాడినా అందులోంచి ఎంసెట్ ప్రశ్ననీ సృష్టించేవాడు. రైల్లో, బస్సుల్లో ప్రయాణిస్తునో, వర్షం పడుతుంటేనూ ఎన్నో ప్రశ్నల్నీ కనిపెట్టి compile చేసిన ఆయన పుస్తకంలో దాదాపు 7000 ప్రశ్నలు, లెక్కలూ ఉండేవి. అదో అద్భుత ప్రపంచం. ఎప్పుడు చూసినా పెన్ను, చిన్న పుస్తకం జేబులో సిద్ధంగా పెట్టుకొని ఎప్పుటికప్పుడు కొత్తప్రశ్నలు కనిపెడుతూ ఉంటారు.

ఒకరోజు మాసార్, సంభాషణలో ‘అమ్మాయ్, భగవద్గీత ప్రాక్టీస్ చేస్తానన్నావు కదా! నీకిష్టమైన శ్లోకం చెప్పు’ అన్నారు. నేను

శ్లోకం:
ధ్యాయతో విషయా పుంస స్సంగస్తేఘాప జాయతే
సంగా త్సంజాయతే కామః కామా త్ర్కోధో భిజాయతే

క్రోధా దృవతి సమ్మోహఃసమ్మోహా త్స్మృతివిభ్రమః
స్మృతిభ్రంశా ద్భుద్ధినాశో బుద్ధినాశా త్ర్పణశ్యతి

భావం:
విషయవాంఛలను సదా మననము చేయుటవలన వాటియందు అనురాగము పుట్టును. అది కామముగా మారి చివరికి క్రోధమగును. క్రోధము వలన అవివేకము, అవివేకము వలన స్మృతిభ్రంశము కలుగును. దాని వలన మనుజుడు బుద్దిని కోల్పోయి చివరికి అధోగతి చెందును.

చెప్పాను. ఎందుకంటే అప్పటికి మేము ఆశ్లోకాన్నే తరచూ గుర్తు చేసుకుంటూ ఆచరించే ప్రయత్నం చేస్తున్నాము. నంబూరు నుండి గుంటూరు చేరిన 9 నెలల్లో మూడిళ్ళు మారవలసి వచ్చింది. అప్పటికి లారీ కి పట్టేటంత ఫర్నిచర్ ఉండేది. గతవైభవ చిహ్నాలుగా మిగిలిపోయిన సోఫా సెట్లు, కార్పెట్లు గట్రా. అద్దెఇల్లు వెదుక్కోవటం, ఫర్నిచర్ రవాణా, సర్ధుకోవటం అన్నవి, ఇంటి అద్దెకు అదనంగా ఉన్న సమస్యలు. అయినా సరే, ‘జీవితంలో ఏ అసాధారణతనీ గుర్తించవద్దు. అప్పటికి పైకి కన్పిస్తున్న కారణాన్నే నమ్మాలి’ అన్నది – ఫ్యాక్టరీ ఖాళీ చేస్తూనే నేనూ నాభర్తా చేసుకున్న నిర్ణయం. ‘1992 ని పూర్తిగా మరిచి పోదాం’ అని ఒకసారి అనుకున్నాక ఇక దాని గురించి మనసులో కూడా గుర్తు తెచ్చుకోలేదు. ఏదిజరిగినా, అప్పుడు పైకి కన్పిస్తున్న కారణాన్నే పట్టించుకోవాలి అని గట్టిగా నిర్ణయించుకున్నాం. అందునా అసాధారణతని గుర్తిస్తే మరిన్ని సమస్యలు రావడం 1995 లో ఫ్యాక్టరీ ఖాళీ చేయడానికి ముందు వరకూ గమనించాం. అంతకంటే ‘ఏది జరిగినా అది విధివ్రాత అనీ, దాదాపు అందరికీ ఇలాంటి సమస్యలు రావడం మామూలేననీ అనుకుంటే’ ఎంతోకొంత నయంగా ఉండటమూ గమనించాం. అందుచేత ‘1992 ని, మన ఫిర్యాదునీ మరిచిపోదాం’ అని ఎంత గట్టిగా నిర్ణయించుకున్నామంటే ఆ తర్వాత దేశంలోగానీ, రాష్ట్రంలోగానీ ఏం జరుగుతుందో మేం పట్టించుకోలేదు. వార్తలు చూడలేదు. 1995 తర్వాత రాజకీయరంగంలోగానీ, వివిధ విషయాల్లో గానీ ఏంజరిగిందో, మేమేదీ పట్టించుకోలేదు. 2005 తర్వాతే తిరిగి పాత న్యూస్ తిరగేసాము. అప్పటికి అంటే 1997 లో మేమేదీ పట్టించుకోలేదు. వార్తా పత్రికల్లో సైతం కళాశాలల వాణిజ్యప్రకటనలూ, డైలీ సీరియల్స్ [అప్పట్లో వచ్చేవి], సినిమా పేజీలూ చూసేదాన్ని. టివీ లో వార్తలు ఎప్పుడొస్తాయో కూడా పట్టించుకునేవాళ్ళం కాదు. మేమూ, మా కెరీర్, మాపాప. ఇంతే. తీరిక దొరికితే మా పాపకి కథలు చెప్పుకునేదాన్ని. భారత భాగవత రామాయణాలతో పాటు తనకి కనీసం పదివేల కథలు చెప్పిఉంటాను. [ఇప్పుడు తనే బ్లాగులోకంలో చదివీ, పుస్తకాల్లో చదివీ నాకు చెబుతుందనుకొండి.]

అందుచేత మా సార్ అడిగినప్పుడు నేను భగవద్గీతలోని ఆ శ్లోకమే చెప్పాను. నాకు కళాశాలలో మంచిపేరు వచ్చింది. అయితే ఎక్కువ క్లాసులు మాత్రం ఇంకా ఇవ్వలేదు. అప్పుడు నేను గుంటూర్లో రాయపాటి శ్రీనివాసరావుని అప్రోచ్ అయ్యి, ఎక్సల్ కాలేజీలో మరో డైరక్టర్ కి నాకు మరికొన్ని క్లాసులు ఇచ్చేటట్లు రికమెండ్ చేయమని అడిగాను. అతడు “ఏమయిపోయారు ఇన్నిరోజులు?" అని అడిగాడు. నేను “ఫ్యాక్టరీ నష్టపోయాక పెళ్ళి చేసుకున్నానండి. ఇదిగో మా పాప” అంటూ మాపాపని చూపాను. అంతకు మించి అతడూ ఏ వివరం అడగలేదు. నేనూ చెప్పలేదు. తర్వాత నాకు రెండు క్లాసులు ఎక్స్ ట్రా ఇచ్చారు.

బాగా చెప్పే లెక్చరర్ గా రెప్యూటేషన్ తెచ్చుకున్నాను. ఎక్సల్ కళాశాలలో మరో డైరక్టరు [తర్వాత ఈయన గుంటూరు నగర మేయర్ అయ్యాడు], "ఇంకా ఎక్కడైనా అవర్స్ చెబుతున్నారా” అని అడిగాడు. అప్పటికి నాకు అరోరా కాలేజీలో క్లాసులున్నాయి. అదే చెప్పాను. “Next year ఏ కాలేజీకీ కమీట్ కాకండి. అన్ని అవర్స్ ఇక్కడే తీసుకుందురుగాని” అని చెప్పాడు. నేనెంతో సంతోషపడ్డాను. ఆపైన మంచి రిజల్ట్ కోసం బాగా కష్టపడ్డాను.

అప్పట్లో నేను వెళ్ళే క్లాసులో వంశీకృష్ణ అనే MPC విద్యార్ధి ఉండేవాడు. సుబ్రమణ్యం అని మరో బై.పి.సి. విద్యార్ధి ఉండేవాడు. ఆ పిల్లలు ఎంత షార్ప్ అంటే – మనం problem చదివి బోర్డు మీద డాటా వ్రాసి ఏ ఫార్ములా ఆప్లై చెయ్యాలో వివరించే లోపు, వాళ్ళు లెక్కచేసి జవాబు చెప్పేవాళ్ళు. వాళ్ళల్లో సుబ్రమణ్యంకి జూనియర్ ఇంటర్ రెగ్యులర్ సిలబస్ లో స్టేట్ ర్యాంక్ [10 లోపు] ఉంది. అప్పటికి ఇంటర్ లోనూ మార్కుల్ని బట్టి ర్యాంకులు ఇచ్చేవాళ్ళు. సుబ్రమణ్యంకీ, వంశీకృష్ణకీ తప్పకుండా ఎంసెట్ లో మంచి ర్యాంకులు [స్టేట్ ర్యాంకులు] వస్తాయని లెక్చరర్స్ అందరం అనుకునేవాళ్ళం. అలాగే వికాస్ లో గాయత్రి అనే విద్యార్ధిని ఉండేది. ఆమె జూనియర్ సిలబస్ లో స్టేట్ సెకండ్ ర్యాంకు పొందింది.

అయితే ఎంసెట్ ఫలితాల తర్వాత చూస్తే ఇంజనీరింగ్ లో వంశీకృష్ణాకి 16th ర్యాంకు వచ్చింది. మెడిసిన్ లో సుబ్రమణ్యంకి 700 పైన, గాయత్రికి 1200 పైన ర్యాంకులు వచ్చాయి. ఆ పిల్లలు రెగ్యులర్ సిలబస్ లో చూపినంత ప్రతిభ, ఎంసెట్ లో మల్టీపుల్ ఛాయిస్ లో చూపించలేదేమో లేక ఎంసెట్ పరీక్షలో టెన్షన్ తోనో, మరోకారణంతోనో బాగా వ్రాయలేదేమో అనుకున్నాను. అయితే ఎక్సల్ కాలేజిలోని రాజేష్ అనే కుర్రవాడికి మెడిసిన్ లో 10 ర్యాంకు వచ్చింది. [ఆపిల్లవాడు ఎక్సల్ కాలేజీ లోని ఒక డైరక్టర్ కి దగ్గరివాడని తర్వాత తెలిసింది] రాజేష్ కి ర్యాంకు రావడం నాకు ఆశ్చర్యం కలిగించింది. ఆ పిల్లవాడి ఉనికి కూడా క్లాసులో తెలిసేది కాదు. నేనే కాదు, తోటి లెక్చరర్స్ గానీ, మిగిలిన సబ్జెక్ట్ లెక్చరర్స్ గానీ ’రాజేష్’ గురించి ఎప్పుడూ రిఫర్ చేయగా వినలేదు. ఆ పిల్లవాడిలో జీల్ నో, నాలెడ్జి నో, internal tests లో ఎప్పుడూ గుర్తించలేదు. ఇది చాలా వింతగా అన్పించినా పెద్దగా పట్టించుకోలేదు.

ఎందుకంటే అప్పటికి నా జాబ్ గొడవల్లో పడింది గనుక. ఎక్సల్ లో ‘నెక్ట్స్ ఇయర్ ఇంకే కాలేజీలో అవర్స్ గురించి కమిట్ కాకండి. మొత్తం ఇక్కడే తీసుకొందురు’ అంటూ నాకు assurance ఇచ్చిన డైరక్టరే తర్వాతి సంవత్సరం నేను కంటిన్యూ కావడానికి వీల్లేదని మా సార్ చలపతి రావుకి చెప్పాడట. కారణమేమిటో నాకు తెలియదు. ప్రత్యేకంగా చెప్పుకోదగిన సంఘటనలైతే ఏవీ లేవు. ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ, నేనెప్పుడూ ఎవరితోనూ ఏవ్యాఖ్యలు చేసేదాన్నికాదు. కాబట్టి ఏకారణంగానైనా ఆ డైరక్టరుకి నామీద కోపం వచ్చే అవకాశం [నాకు తెలిసీ] లేదు. బహుశః ఎవరైనా నామీద అతడికి చాడీలు చెప్పి ఉండవచ్చు. ఈర్ష్యాసూయలు సహజమే కదా అనుకున్నాను. సాధారణంగా ఏ సబ్జెక్ట్ [డిపార్ట్ మెంట్] కి చెందిన వ్యవహారాలు ఆ సబ్జెక్టు కు చెందిన డైరక్టరే చూసుకుంటూ ఉండేవాళ్ళు. అయితే నావిషయంలో మాత్రం ఈ సాధారణ నియమం వర్తించలేదు. మా సార్ తానే ఫిజిక్స్ డిపార్ట్ మెంట్ అయి ఉండి కూడా, నన్ను పిలిచి “అమ్మాయ్! నేనెంత చెప్పినా ఏసు రత్నం ఒప్పుకోవట్లేదమ్మా. నిన్ను తరువాతి సంవత్సరం కంటిన్యూ చెయ్యటం ససేమిరా కుదరదంటున్నాడు. సారీ తల్లీ!” అని చెప్పారు. నేను “సర్! నేను గీత ప్రాక్టీసు చేస్తాను. ఇది నాపని అనుకునీ, మంచి ఫలితం రావాలనీ కష్టపడ్డాను. అయితే పని చేయటమే మనచేతిలో ఉంటుంది గానీ ఫలితం కాదు గదా! మంచి ఫలితం రావాలని పనిచేసాను. ఈ ఫలితం వచ్చింది. ఇదే భగవంతుడిచ్చిన ఫలితం అనుకుంటాను. వస్తాను సార్” అన్నాను. నీళ్ళ నిండిన కళ్ళతో ‘God bless you my child’ అంటూ వీడ్కొలిచ్చాడాయన. ఫలితం చేదుగా ఉన్నా, మాసార్ ఇచ్చిన వీడ్కొలు నాకు ఊరట నిచ్చింది. అయినా అంతటితో ప్రయత్నం వదలకుండా మిగిలిన డైరెక్టర్స్ ని అప్రోచ్ అయ్యానూ, అయినా ఉపయోగం లేకపోయింది. ఇతర కాలేజీల్లో ప్రయత్నించాను. పరిస్థితి ఆశాజనకంగా కన్పించలేదు.

ఇంతలో సూర్యాపేటలోని ఓ చిన్న కాలేజీ, ఫిజిక్స్ లెక్చరర్స్ కోసం ఇచ్చిన పత్రికాప్రకటన నా కళ్ళబడింది. సరే ‘B’ సెంటర్లలోని చిన్న కాలేజీ అయితే మొత్తంగా ఫిజిక్స్ సబ్జెక్టంతా ఒక్కరే డీల్ చెయ్యవచ్చు. సబ్జెక్ట్, టీచింగ్ ఎబిలిటీ improve అవుతుంది అని సీనియర్లు ఇచ్చిన సలహాలు నన్ను ఆలోచింపచేశాయి. ఇంటర్యూకి అటెండ్ అయ్యాను. డెమో క్లాసు తర్వాత డీల్ మాట్లాడు కున్నాము. అది చిన్న కాలేజి. ఆ డైరక్టరు స్యయంగా కెమిస్ట్రీ చెప్పుకుంటాడు. గణితం కోసం గుంటూరు సిద్ధార్ధ కాలేజీ [ఈ కాలేజీ 1997 లో రామబ్రహ్మం కేసులో ఇంటర్ పేపర్ లీక్ విషయం వెలుగుచూడక ముందు వెలిగిపోయింది. రామబ్రహ్మం వెల్లడించిన పేర్లలో ఈ కాలేజీ యాజమాన్యం పేరు కూడా ఉండటంతో తర్వాత ప్రాభవం కోల్పోయింది. ఆ తర్వాత కాలేజీ యాజమాన్యం చేతులు మారింది. రామబ్రహ్మం కేసు బయటపడ్డప్పుడు రాత్రికి రాత్రి కార్పోరేట్ కాలేజీలు కోట్లకొద్దీ డబ్బులు బయటికి తీసి ఉన్నతాధికారులకి ముడుపులిచ్చిందని తదనంతర కాలంలో విన్నాను.] నుండి ఓ లెక్చరర్ ని తెచ్చారు. దాదాపు 300 మంది విద్యార్ధులు ఉండేవాళ్ళు. తెలుగు, ఇంగ్లీషు మీడియంలు రెండూ ఉండేవి. నాకు తెలుగులో ఫిజిక్స్ చెప్పడం కొత్త. అయినా పెద్దగా ఇబ్బంది పడలేదు.

కొత్త విద్యాసంవత్సరం ప్రారంభానికి గుంటూరు నుండి సూర్యపేటకు మకాం మార్చాము. రోజుకి ఎనిమిది అవర్స్ తీసుకునేదాన్ని. ఇంటర్ రెగ్యులర్ సిలబస్ లో ఒక చాప్టర్ పూర్తికాగానే, దానిమీద ఎంసెట్ సిలబస్ కూడా సమాంతరంగా చెప్పాలన్నది డైరెక్టర్ ప్రణాళిక. అలాగే చెప్పెవాళ్ళం. దాంతో పిల్లలు బాగా రిసీవ్ చేసుకున్నారు. కాలేజీ వాళ్ళుగుంటూరు లెక్చరర్స్ ని తెచ్చామంటూ భారీగా వాణిజ్యప్రకటనలు వార్తా పత్రికల్లోనూ, స్థానిక టివీలోనూ ఇచ్చుకున్నారు. అంతేగాక లెక్చరర్స్ పాఠం చెబుతుండగా వీడియో తీసి స్థానిక టీవిల్లో ప్రసారం చేసుకున్నారు. అక్కడి సిటికేబుల్ లో ఆ సౌకర్యం ఉండింది. గుంటూరు లెక్చరర్స్ పట్ల ఉన్న క్రేజ్ కారణంగా, వీడియోలో కన్పిస్తూన్న ఇంగ్లీషు ఉచ్చారణ కారణంగానూ నేను పనిచేస్తున్న కాలేజీకి ఒక్కసారిగా అడ్మిషన్లు పెరిగాయి. అక్కడ సీటుకి ఇంత అని స్కూల్ వాళ్ళకి ఇస్తేగాని రాని అడ్మిషన్లు, స్కూల్ ప్రమేయంలేకుండా విద్యార్ధులే వచ్చి చేరటం అన్నది విశేషం.

గణితం, ఫిజిక్స్ రెండు సబ్జెక్ట్ లకి గుంటూరు నుండి లెక్చరర్స్ రావటం అన్నది ఆ కాలేజికి బాగా రెప్యూటేషన్ తెచ్చి పెట్టింది. పిల్లల తల్లితండ్రులు అడ్మిషన్ల కోసం వచ్చినప్పుడు యాజమాన్యం మమ్మల్ని కూడా పిలిచి, మాట్లాడమనేది. తల్లితండ్రులు తమకున్న సందేహాలు అడిగితే మేంకూడా కౌన్సిల్ చేసాం. అడ్మిషన్లు పూర్తయ్యి క్లాసులు ప్రారంభమయ్యేసరికి దాదాపు నెలరోజులు పట్టింది. అప్పటికి అక్కడున్న సీనియర్ విద్యార్ధులు కొందరు గత సంవత్సరంలో విద్యాభోధన, లెక్చరర్లు బాలేరని వెళ్ళిపోయారట. యాజమాన్యం ఆ పిల్లల ఇళ్ళకి కబురు పెట్టి పిలిచి, ట్రయల్ క్లాసులు చూడమనీ, అప్పటికీ నచ్చకపోతే అప్పుడు టీసీ ఇచ్చేస్తాననీ నచ్చచెప్పింది. ట్రయల్ క్లాసుల తర్వాత దాదాపు అందరూ క్లాసులకి రావటం మెదలు పెట్టారు. ఇంకా కొత్త సూడెంట్సు కూడా వచ్చిచేరారు. జూనియర్ ఇంటర్లో కూడా అడ్మిషన్లు బాగా వచ్చాయి. అన్ని కాలేజిలు 2000/-Rs., 2500/- Rs. తీసుకుంటుంటే, అది స్కాలర్ షిప్ లో కట్ చేసుకునేటట్లు అనే నియమంతో ఉంటే, నేను పనిచేస్తున్న కాలేజీ యాజమాన్యం 6,000/-Rs. రూపాయలు అడ్వాన్సు తీసుకొని మరీ అడ్మిషన్లు ఇచ్చింది. యాజమాన్యం చాలా సంతోష పడింది. సహజంగా మేము [అంటే లెక్చరర్స్] కూడా సంతోషపడ్డాము.

చలపతి రావు గారి స్టూడెంట్ గా చదువుకుని, ఆయన దగ్గర సబార్డినేట్ గా పనిచేసి, సబ్జెక్ట్ లో ఆయన కృషి అంటే నాకు చాలా ఆరాధనగా ఉండేది. ఆయనలాగే నేనూ భౌతిక శాస్త్రంలో పుస్తకం వ్రాయాలని కోరుకునేదాన్ని. అందుచేత పిల్లలకి పాఠం చేప్పెటప్పుడు, ఎంసెట్ క్లాసులు తీసుకునేటప్పుడు ప్రతి అంశాన్ని పరిశీలించేదాన్ని. విద్యార్ధులు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు, ఇంకా ఎలా చెబితే బాగా గ్రహిస్తారు, ఇలాంటి అంశాలన్నీ నోట్స్ వ్రాసుకునేదాన్ని. ఫిజిక్స్ ఫార్మాలాలన్నీ చాప్టర్లవారీగా వ్రాసి, ఇంప్రూవ్ చెయ్యటం మొదలుపెట్టాను. రోజులు వేగంగానూ, పని ఒత్తిడితోనూ గడుస్తున్నాయి. అప్పట్లో నేనూ, నా విద్యార్ధులు కూడా క్లాసుని బాగా ఆనందించే వాళ్ళం. నేను యాజమాన్యంతో ఒక సంవత్సరం పాటు డీల్ మాట్లాడుకున్నాను. లక్షా పదివేల రూ. రెమ్యూనరేషన్ తో ప్రారంభం. ఇప్పటి ఐ.టి. వాళ్ళకి ఇది తక్కువ మొత్తమేమో గానీ 1998 లో టిచింగ్ ఫీల్డ్ లో ఇది తక్కువేం కాదు. అప్పటికి సీనియర్ లెక్చరర్లకి 4 ½ లక్షలు సంవత్సరానికి ఇస్తున్నారన్న వార్తలు బయటి ప్రపంచంలో ఉన్నప్పటికీ వాస్తవంలో అయితే 2 ½ కంటే ఎక్కువ లేదు. అందుచేత ‘కార్పోరేట్ కాలేజీల రంగంలోకి అడుగుపెట్టిన కొద్దిరోజులకే మంచి పేరు తెచ్చుకున్నాను, స్థితిలోకి వచ్చాను. ఫర్వాలేదు. కష్టపడి మంచిఫలితాలు తెచ్చుకుంటే ఇక జీవితంలో స్థిరపడినట్లే’ అనుకున్నాను.

పూర్తిగా విద్యాబోధనలో మునిగి పోయాను. ఓప్రక్క ఇల్లూ, సంసారం, మాపాప. మరోప్రక్క విద్యార్ధులూ క్లాసులు. అప్పటికి మా పాప చిన్నది కావటంతోనూ, ఇక పెద్దవాళ్ళంటూ మరెవ్వరూ లేకపోవటంతోనూ, పాపకి సంవత్సరం నిండేవరకూ నేను దాదాపు ఖాళీగా ఉంటూ, నంబూరులో ఇంట్లోనే ట్యూషన్లు చెప్పాను. నాభర్త యాడ్ ఏజన్సీలో రెప్ గా చేశారు. నేను కాలేజిల్లో ప్రవేశించి బిజీగా ఉన్నప్పుడు నా భర్త మా పాప సంరక్షణ చూశాడు. పాప కొంచెం పెద్దదై స్కూల్లో చేరేవరకూ ఇద్దరిలో ఎవరో ఒకరం కెరీర్ మానుకొని పాపని చూసుకున్నాము.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

3 comments:

నేనూ చైతన్య కాలేజీ లోనే(విజయవాడ)చదువుకున్నాను. చాలా బాగా చెప్పేవారు. ర్యాంకులు కొంటారని అనగా వినడమే కానీ, నాకెప్పుడూ అలా అనిపించలేదు.

మనోహర్ చెనికల గారు,

ఓపిక పట్టండి. అంతా వివరంగా చెబుతాను.

Nenu vijaywada-chaitanya lo chadivanu.2002 passout-MPC.ranks kontunnattu emi anipinchaledu nakeppudu.Week ends lo top marks vachina vaallake EAMCET lonu vachchevi.

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu