ఎప్పటిలాగా ముందుగా ఓ కధవ్రాసి, దాని విశ్లెషణా, మనజీవితాల్లో కధాసారపు అనువర్తనా మీకు వివరించాలనుకొన్నానండి!

కానీ చిన్న బిర్రే....క్!

ఈలోగా సరదాగా కాసిన్ని కబుర్లూ, సామెతలూ, చెణుకులూ.

*** *** *** *** *** *** *** *** *** *** *** *** *** ***

నవంబరు 24 న కేంద్ర ప్రభుత్వ కుర్చీవ్యక్తి నాయకురాలు నాగమ్మ[సోనియమ్మ] “ఉగ్రవాదాన్ని మతంతో ముడి పెట్టవద్దు” అని చాలా విశాలహృదయంతో ప్రకటించింది.

నవంబరు 26 న ముంబాయి మీద దాడి చేసిన ఉగ్రవాదులు తాము దక్కన్ ముజాహిదీలమనీ ప్రకటించుకున్నారు.

ఈ ముట్టడి వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని, సంఘటన జరిగిపోయాక ప్రధాన మంత్రి చల్లగా సెలవిచ్చారు. అఖండ హైదరాబాద్ దేశాన్ని కోరుతూ చేశామంటున్నది దక్కన్ ముజాహిదీన్ సంస్ధ. దీనివెనుక ఆల్ ఖైదానే ఉండనీయండి, పాకిస్తానే ఉండనీయండి, పాతబస్తీనే ఉండనియ్యండి, ఉన్నది మాత్రం ముస్లిం ఉగ్రవాదులే.

[మనం గమనించాల్సిన మరో ముఖ్య విషయం ఏమిటంటే, భారతదేశంలో ఎక్కడ ఏ బాంబులు పేలనీయండీ, ఉగ్రవాదం పెచ్చరిల్లనీయండి, వాటి మూలాలు మాత్రం హైదరాబాద్ కి ముడిపడి ఉంటాయి.]


మరి ఉగ్రవాదాన్ని మతంతో గాక దేనితో ముడిపెట్టాలి? ఈవిడతో ముడిపెట్టాలా?

ఇది చదివినప్పుడు గుర్తుకొచ్చిన సామెత ఏమిటంటే

’పట్టినోడు పక్కె అంటే పక్కనున్నోడు జెల్ల అన్నాట్ట’

[అంటే సాక్షాత్తూ చేపని పట్టినోడు, తను పట్టిన చేప పక్కె రకానికి చెందింది అంటే పక్కనున్నవాడు కాదు అది జెల్లరకం అన్నాట్ట.]

ఉగ్రవాదం చేసిన వాడు మతం పేరు చెబుతుంటే, ప్రక్కనున్న ఈవిడ కాదంటోంది. ఔరా! ఏం విచిత్రం?

*** *** *** *** *** *** *** *** *** *** *** *** ***


నవంబరు 26 రాత్రి 10:30 గంటలకీ ముంబైలో వరుస బాంబులు పేలి వందల ప్రాణాలు గాల్లో కలిసాయి. మరికొన్ని వందలమంది గాయాల పాలయ్యారు.

ఇందుకు ఒక్కరోజు ముందు అంటే నవంబరు 25 సాయంత్రం, సప్తగిరి ఛానెల్లో భారత హోం శాఖ ప్రధాన కార్యదర్శి మధుకర్ గుప్తా, పాకిస్తాన్ పర్యటనకు వెళ్ళిన వార్త చూసి ఇది వ్రాస్తున్నాను.

సామెత వ్రాసే ముందు మరికొంత వివరణ వ్రాస్తాను.

డిసెంబరు6, 1992 లో అయోధ్యలో బాబ్రీ మసీదు కూలినప్పడు ఆ జిల్లాకు ఎస్.పి.గా ఉన్న మధుకర్ గుప్తా అనే ఈ ఐ.పి.యస్. అధికారి ఆ తర్వాత 15 సంవత్సరాలలో పదోన్నతల నిచ్చెనలో పై కెగబాకి 2007 కల్లా కేంద్ర హోంశాఖ ప్రధాన కార్యదర్శి హోదానధిష్టించారు. అయన పాక్ పర్యటనకి వెళ్ళిన మర్నాడు ఇంత దారుణ మారణ కాండ జరగడం [వాజ్ పేయ్ హయంలో ఇండియా-పాక్ బస్ సర్వీసు ప్రారంభించిన తర్వాత కార్గిల్ యుద్దం జరిగినట్లు] యాదృచ్చికమే కావచ్చు లేదా వ్యూహత్మకం కావచ్చు, లేదా ప్రణాలికా బద్దమే కావచ్చు. ఉగ్రవాద నిరోధానికి మార్గాలు అన్వేషించడానికి, చర్చించడానికి ఆయన పాక్ సందర్శనకు వెళ్ళారట.

ఈ సందర్భంలో గుర్తొస్తున సామెత ఏమిటంటే

‘కొండనాలుకకి మందేస్తే ఉన్న నాలుక ఊడొచ్చిందట’.

*** *** *** *** *** *** *** *** *** *** *** *** *** ***

ఇప్పటి వరకూ, మనం సినిమా పాటలకి పేరడి చూశాం కదా! ఇప్పడు సరదాగా హోంశాఖ ప్రధాన కార్యదర్శిలాంటి వారి శాంతి చర్చలకి పేరడీ చూద్దామా?

ముందుగా అసలు వారి చర్చ ఎలా ఉంటుందంటే:

భారత్ కార్యదర్శి: ఇది చాలా దురదృష్టకరం! ఇలా ఉగ్రవాదం పెచ్చరిల్లటం, మాదేశ ప్రజలూ, మీ దేశ ప్రజలూ ప్రాణాలు కోల్పోవటం మనం సహించకూడదు. ఈ ఉగ్రవాదాన్ని ఎలాగైనా అరికట్టాలి.

పాక్ కార్యదర్శి: అవునవును. మీరన్నది అక్షరాలా నిజం. ఉగ్రవాదాన్ని మనమంతా కలిసి తుదముట్టించాలి.

ఇకపేరడీ ఎలా ఉంటుందంటే:

భారత్ కార్యదర్శి: ఏమిటండీ ఇది? 1992 లో మా శాయశక్తులా, బాబ్రీ మసీదు కూలగొట్టే సంఘటనని రక్తికట్టించాం. సాంకేతికంగా, న్యాయశాస్త్రపరంగా, చట్టబద్దంగా మీకెంతో సహకరించాం. అయినా మీరు ఇండియాని, స్వాతంత్రానికి పూర్వంలాగా ముక్కచెక్కలు చెయ్యలేకపోయారు. ఆ తర్వాత, ఇప్పడూ మేమింతగా సహకరిస్తూన్నా, ఏవో కొన్ని బాంబులు వేయడం తప్పితే ఇండియా అంతు చూడలేక పోతున్నారు. ఇలా అయితే ఎలా? మీ పని తీరు ఏం బాలేదు. మెరుగుపరుచుకోండి.

పాక్ కార్యదర్శి: మాఫ్ కీజియె! మీరంత అగ్రహించకండి. మీరన్నది నిజమే. ఇక చూడండి, మేం మరింత రెచ్చిపోతాం. దయచేసి మీరు మాత్రం మీ సహకారాన్ని ఆపకండి. మరింత పెంచండి. మేం మా శాయశక్తుల దాన్ని ఉపయోగించుకుంటాం.]

తరువాత చూశారుగా ముంబాయిలో భీభత్సం.

*** *** *** *** *** *** *** *** *** *** *** *** *** ***

26/11/2008, వార్త చదివి ఇది వ్రాస్తున్నాను. భారత పర్యాటక శాఖా మంత్రి అంబికా సోని, విదేశీ పర్యాటకుల్ని ఆకర్షించడానికి, పర్యాటక శాఖాదాయపు అభివృద్ది కోసం ఇచ్చిన ప్రకటన [అంటే స్టేట్ మెంట్ అన్నమాట].

ఆర్ధిక మాంద్యం మూలంగా ఉద్యోగాలు కోల్పోయి, తీసికొన్న బుణాలు తిరిగి చెల్లింపువాయిదాల ఒత్తిడి నుండి మనశ్శాంతి పొందటానికి భారత్ ని పర్యటించవలసినదిగా ఆవిడ పర్యాటకులకి స్వాగతం చెప్పారు. అంతేగాక భారత సందర్శించడానికి ఇది తగిన సమయమనీ ముక్తాయించారు.

పర్యాటక శాఖాభివృద్దికై పనిచేస్తూన్న ఆవిడ చిత్తశుద్దిని శంకించలేం గానీ, అది చదవగానే

’ఊరు వెల్లువ పాలయితే పిల్లి పాలకేడ్చిందన్న’సామెతా,

’ ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే, చుట్టకి నిప్పుడిగాడట మరోకడూ’ అనే సామెతా గుర్తు రావడం లేదూ?

ఉద్యోగం పోయి, తీసుకొన్న అప్పలే కట్టలేక భవిష్యత్తేమిటిరా దేవుడా అని తలపట్టుకూర్చున్న వాణ్ణి, మనశ్శాంతి కోసం మాదేశం పర్యటించు [ఉచితంగా కాదు, నీ డబ్బుల్తోనే సుమా] అనడం అంటే ఇంకే మనాలి? అంతే కాదండోయ్! మరోసామెత కూడా గుర్తొస్తుంది.

’మొదల్లేదు మగడా, అంటే విసిరి పెసర పప్పొండు పెళ్ళమా!" అన్నాడట ఓ భర్త.

నిజమే కదూ! ఎంతగా ప్రభుత్వమే వ్వాపారం చేస్తోన్నా, మరీ ఇంత సంస్కారహీనమూ, అమానుషమూనా? ఇలాంటి అలోచనాధోరణి ఉన్న ప్రజానాయకులకు మనపట్ల మాత్రం ఏపాటి ప్రేమ ఉంటుంది?

*** *** *** *** *** *** *** *** *** *** *** *** *** ***

1975-77 ల్లో ప్రముఖంగా విన్పించిన జోక్ ఇది.

ఈ జోక్ నేపధ్యమేమంటే :

1970 లనుండి, 75 లతర్వాత ఇందిరా గాంధీకి ప్రభుత్వం లోపలా, దేశంలో లోపలా ఎన్నో సమస్యలు ఎదురై, ఆవిడ అంతశ్చేతన ఆవిడకి ’ఎక్కడో ఏదో జరుగుతోంది’అని చెప్పింది కాబోలు, దాని కావిడ ’విదేశీ హస్తం’ అని పేరు పెట్టింది. దానితో ప్రధాన మంత్రిగా ఇందిరా గాంధీ ఓ ప్రకటన చేసింది.

“భారతదేశం మీద విదేశీ కుట్ర జరుగుతోంది. ఏదో విదేశీ హస్తం మనదేశంలో పనిచేస్తోంది” - ఇదీ ఆప్రకటన.

[అందుకే కాబోలు ఆవిడ ఎవ్వరిని నమ్మక, మంత్రులను, ముఖ్యమంత్రులను తరచు మారుస్తూ అపఖ్యాతిపాలయ్యింది. ఇప్పటికి పాకిస్తాన్ బయటకు వచ్చింది. తర్వాత ఇంకా ఏ విదేశీ శక్తులు బయటకు వస్తాయో!]

ఇక పై ప్రకటన మీద పత్రికల్లో జోకులు వెల్లువెత్తాయి.

వాటిల్లో ఇది నాకు బాగా గుర్తుండి పోయిన జోక్. ఈనాడులో ప్రచురితమైంది.

ఇక జోక్ ఏమిటంటే:
ఓ రాజకీయ నాయకుడు, ఓ బహిరంగ సభలో, మైకు ముందు నిలబడి ఉపన్యాసం దంచుతుంటాడు. అంతలో అతని సెక్రటరీ పరుగెత్తుకొచ్చి “సార్! ఇప్పడే డాక్టర్ రిపోర్టు వచ్చింది. మీ భార్య గర్భవతట” అంటాడు.

వెంటనే ఈ రాజకీయ నాయకుడు ఆవేశంగా “ఠాఠ్! నేను నమ్మను. ఇందులో ఏదో విదేశీ హస్తముంది” అంటాడు.

ఇలాంటి జోక్ లతో అసలువిషయాన్ని ప్రక్కదారి పట్టించారు.

అయితే ఈనాడు మనందరమూ చూస్తూనే ఉన్నాం కదా - ఏ విదేశీ హస్తానికి స్వదేశంలోనూ, పరదేశాల్లోనూ ఎవరు సహకరిస్తున్నారో గానీ, నిరాటంకంగా భారతదేశపు నడి బొడ్డున బాంబులు పేల్చి ప్రాణాలు తీయగలగడాన్ని, భయోత్పాతం సృష్టించడాన్నీ, సెజ్ ల పేరుతో దేశాన్ని అమ్మేయడాన్ని, వైట్ హౌస్ కు సాగిలపడటాన్ని, పాక్ వెళ్ళి ’జిన్నా జిందాబాద్’ అనడాన్ని.

ఇది జోక్ లాంటి నిజమా? నిజం లాంటి జోకా?

*** *** *** *** *** *** *** *** *** *** *** *** ***

ఇక ఇలాంటి రాష్ట్ర, కేంద్రప్రభుత్వాలని భరిస్తూన్న దేశ ప్రజల్ని చూస్తూంటే గుర్తు కొస్తూన్న మరో సామెత ఏమిటంటే

"కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదినట్లు"

అలాగే లేవూ ప్రజల అగచాట్లు?

*** *** *** *** *** *** *** *** *** *** *** *** ***

ఎప్పట్లాగే ముందుగా ఓ కథ చెప్పి, దాని విశ్లేషణా, మన జీవితాల్లో కథాసారపు అనువర్తనా వివరించి, నాబ్లాగు అతిధుల్ని అలరించాలని ఇది వ్రాస్తున్నాను.

అనగా అనగా ...

రామాపురం అనే ఊర్లో రాజశేఖరం అనే యువకుడుండే వాడు. ఇతడు కొంచెం అమాయకుడు. దానికి తోడు ఙ్ఞాపకశక్తి పెద్దగా ఉండేది కాదు. అతడికి పెళ్ళై భార్య విశాలాక్షి కాపురానికొచ్చింది. విశాలాక్షి అణకువ గల పిల్ల. పనీ పాటలు తెలిసిన అమ్మాయి.

ఓసారి రాజశేఖరుడు ఏదో పని ఉండి ప్రక్కఊరు రాఘవాపురం వెళ్ళాడు. పని పూర్తయ్యాక ఆ ఊళ్ళోనే ఉన్న మేనత్తని చుట్టపు చూపు చూడబోయాడు. రాక రాక వచ్చిన మేనల్లుణ్ణి అతడి మేనత్త ఎంతో సంతోషంగా ఆహ్వానించి ఆదరించింది. పిండి వంటలతో భోజనం పెట్టింది. భోజనంలో వడ్డించిన బూరెలు రాజశేఖరానికి తెగనచ్చేసాయి. ఒకటికి రెండు అడిగి పెట్టించుకొని తిన్నాడు.

“అత్తా! వీటి పేరేంటి?” మొహమాట పడుతూ అడిగాడు రాజశేఖరుడు. ఆవిడ అభిమానంగా నవ్వుతూ “బూరెలంటారు నాయనా? మరి నాలుగు కట్టివ్వనా?”అంది.

"వద్దులే అత్తా! విశాలాక్షికి అన్నీ వచ్చు. వండించుకు తింటాలే!” అంటూ ఇంటికి బయలుదేరాడు. ఆరోజుల్లో ప్రయాణం అంటే కాలినడక లేదా ఎద్దుల బళ్ళే శరణ్యం కదా! మనవాడు నడుచుకుంటూ బయలుదేరాడు. ఎక్కడ పిండి వంట పేరు మరిచిపోతానో అనుకుంటూ “బూరెలు, బూరెలు” అని వల్లిస్తూ అడవిదారి వెంట నడవ సాగాడు.

దారిలో చిన్న నీటి పాయ వచ్చింది. ఎగిరి దాని మీదుగా దూకూతూ వూపు కోసం “హైసర బజ్జ” అన్నాడు.

అంతే!

బూరెల పేరు మరిచిపోయి, ’హైసరబజ్జా’ అని జపం చేస్తూ ఇల్లు చేరాడు. ఇంటికి రాగానే భార్యని పిలిచి తన మేనత్త వడ్డించిన పిండివంట రుచిని తెగ వర్ణించి, తనకు వండి పెట్టమన్నాడు.

"వాటినే మంటారని చెప్పారు, మీ మేనత్త గారు?" అనడిగింది విశాలాక్షి.

"హైసరబజ్జ!” టక్కున చెప్పాడు రాజశేఖరం.

అదేం పిండి వంటో విశాలాక్షి కి అర్ధం కాలేదు.

"ఎలా ఉన్నాయి? తియ్యగానా, కారంగానా?" అంది.

"తియ్యగా ఉన్నాయి. గుండ్రంగా అరచేతి మందాన ఉన్నాయి?" అన్నాడు.

“దేనితో చేస్తారో?” మెల్లిగా గొణిగినట్లు అడిగింది.

“వరిపిండి తో నట” కొంచెం కరుగ్గా చెప్పాడు రాజశేఖరం.

ఇంకా ఏమంటే భర్తకి ఎంత కోపం వస్తుందోనని విశాలాక్షి లోపలికెళ్ళిపోయింది. ఎంత ఆలోచించినా భర్తకంత నచ్చిన ఆ ‘హైసర బజ్జ’ ఏమిటో ఆమెకు అర్ధం కాలేదు.

చివరకి కుడుములై ఉంటాయను కొని, బియ్యప్పిండి, బెల్లం కలిపి, అరచేతి మందాన ఆవిరిలో ఉడికించి గుండ్రని కుడుములు చేసింది. చిన్నపళ్ళెంలో తెచ్చి భర్త ముందు పెట్టింది.

ఎంత నచ్చినా, మేనత్త ఇంట్లో తనివి తీరా బూరెలు తినడానికి మొహమాట పడ్డ రాజశేఖరం, ఇప్పడు భార్య వండి పెడితే తెగ లాగించెయ్యాలని ఆశగా ఎదురుచూస్తూన్నాడు. భార్య తెచ్చిన కుడుములు చూసేసరికి అతనికి కోపం నషాళానికంటింది. [కోరిక లేదా కామం తీరక పోతే క్రోధం పర్యవసానమని భగవద్గీత చెబుతుంది]

భార్య అలుసుగా కనబడి ఒక్క పెట్టున ఆ పిల్ల చెంప ఛెళ్ళుమనిపించాడు. విశాలాక్షి ఘోల్లుమంది.

ఈ గొడవుకి ప్రక్కింటి పిన్నిగారు పరుగెత్తుకొచ్చింది. అప్పటికే విశాలాక్షి చెంప వాచి పోయింది.

అది చూసి ప్రక్కింటి పిన్నిగారు “అయ్యో! అదేమిటి నాయనా, అమ్మాయిని అలా కొట్టావు? పిల్లబుగ్గ బూరెలా పొంగి పోయింది చూడు” అంది మందలింపుగా.

"ఆ అదే పిన్నిగారు, అదే! బూరె బూరె!” అన్ని మరిచి పోయి ఆనందంగా గావుకేక పెట్టాడు రాజశేఖరం.

నొప్పి, అవమానం మరిచిపోయి ఫక్కున నవ్వింది విశాలాక్షి.

విషయం తెలిసాక విరగబడి నవ్వారు ప్రక్కింటి పిన్నిగారు.

రాజశేఖరం భార్యకి క్షమాపణ చెప్పుకొన్నాడు.

బియ్యం నానపోసి దంచి విశాలాక్షి తియ్యటి బూరెలు చేసి పెట్టింది.

ప్రక్కింటి పిన్నిగారితో సహా అందరూ ఆనందంగా ఆరగించారు.

ఇదీ కథ!

ఈ కథలోని రాజశేఖరం కి లాగా ప్రజలక్కూడా అమాయకత్వం ఎక్కువనీ, దీర్ఘకాల ఙ్ఞాపక శక్తి తక్కువనీ ఈ స్వార్ధ మీడియా అధిపతుల ప్రగాఢ నమ్మకం. అది పాక్షిక సత్యం కూడా!

అందుకే ప్రజల దృష్టి ఒక విషయం మీదనుండి మరో వైపుకి మరల్చాలను కొన్నప్పడు సంచలన వార్తలు వ్రాస్తారు. ఏ సంచలనాలూ లేకపోతే సంచలనాలు తామే సృష్టిస్తారు లేదా తాము నిలబెట్టిన బొమ్మలు చేత సృష్టింపచేస్తారు. ఇది నిజానికి మనం ఇర్వింగ్ వాలెస్ వ్రాసిన ప్రఖ్యాత ఇంగ్లీషు నవల ‘ఆల్ మైటీ’ల్లాంటి వాటిల్లో చదివిందే, కృష్ణంరాజు నటించిన ‘అంతిమ తీర్పు’ ల్లాంటి సినిమాల్లో చూసిందే. అయితే నవలల్లో చదివీ, సినిమాల్లో చూచీ “ఔరా!” అని అబ్బురపడతాము గానీ అది మన కళ్ళ ముందే జరుగుతున్నా గుర్తించలేం.

ఖచ్చితంగా చెప్పాలంటే ఇది ఈ స్వార్ధమీడియా అధిపతులు చేస్తోన్న ప్రజాదృక్పధపు హైజాక్! మనం విమానాన్ని, షిప్పుల్నీ హైజాక్ చేయటం గురించి వార్తల్లో చదువుతుంటాం, చూస్తుంటాం, వింటుంటాం. కానీ నిజానికి మీడియా, ప్రజాభిప్రాయాన్ని హైజాక్ ప్రతిరోజూ చేస్తోంది. అది స్లో పాయిజన్ లాంటింది. ******

ఇక, వార్తా ప్రపంచంలో ఓ సామెత ఉంది.

‘మధ్యాహ్నమైతే వార్తా పత్రిక వృధా పత్రిక’ అని. [ఆఫ్టర్ నూన్, ది న్యూస్ పేపర్ ఈజ్ ఎ వేస్ట్ పేపర్] పత్రిక వేస్ట్ కావచ్చేమో గానీ, అది మన బుర్రలో నాటిన అభిప్రాయాలూ, ఆలోచనలూ, బీజాలు మాత్రం వృధాకావు.

ఉదయాన్నే కాఫీ కప్పతో పాటు మనం అలవోకగా అవలోకించే పేపరు మనలో మనవి కాని ఆలోచనల్ని, భావాల్నీ నాటుతోందనీ, మన వ్యక్తిత్వాన్ని నియంత్రిస్తోందని మనమే తెలుసుకోలేనంత నేర్పుగా ఈప్రక్రియ అంతా సాగుతోంది.

ఒకవేళ ఎవరి అంతరాత్మ అయినా బలమైనదై, ఈ మీడియా మాయాజాలానికి అంటే అప్రకటిత బ్రెయిన్ వాష్ కి లొంగలేదనుకోండి.

ఇక ఇక్కడ ’పదే పదే అదే ప్రచారం అనే నల్లమేక - నలుగురు దొంగలు’ స్ట్రాటజీ రంగప్రవేశం చేస్తూంది “అందరు అదే అభిప్రాయం [ఏ అభిప్రాయమైతే మీడియా ప్రచారం చేసిందో, అది] తో ఉన్నారు. అది అభివృద్ది చిహ్నం. నువ్వే వేరు అభిప్రాయంతో ఉన్నావు. ఇది నలుగురికీ తెలిస్తే నామోషీ. నువ్వు నాగరికం [ఫ్యాషన్ లేదా మోడ్రన్ లేదా అడ్వాన్స్ డ్] కాదని అందరూ అనుకొంటారు”. ఈ స్లోపాయిజన్ మనమీద ప్రమోగింప బడుతుంది. ఎప్పడైనా వ్యక్తి, వ్యవస్థ కంటే బలహీనుడు కదా! కాబట్టే ఈస్వార్ధ మీడియా అధిపతులు ప్రమోగించిన ‘విభజించి పాలించు’ అన్న తంత్రం [దీని గురించి మరో టపాలో వివరణ వ్రాస్తాను.]తో వ్యక్తిగతంగా ఎవరైనా ఈస్వార్ధమీడియా చేసే బ్రెయిన్ వాష్ కు లొంగిపోవలసినదే. అప్పటికీ మన వెన్నెముక గట్టిదై, ఆత్మశక్తి బలమైనదై, మనం వారి బ్రెయిన్ వాష్ కి లొంగలేదను కోండి. ఇక అప్పడు ఈ కింగ్ మేకర్స్ యొక్క మరో అనుచరగణమైన మనస్తత్త్వ శాస్త్రనిపుణులు రంగప్రవేశం చేసి మనకి స్ర్కిజోఫినియా లేకపోతే స్ల్పిట్ సైకాలజీ అదీ కాకపోతే పలక లేని పేర్లున్న మాయరోగాలేవో అంట గట్టేస్తారు. దెబ్బతో మన ఆత్మశక్తి కాస్తా అపరిచితుడు సినిమాలోని విక్రమ్ ల్లాగా అయిపోవాలన్న మాట.

ఇంత మాయాబలానికి ఇక లొంగకపోవడం సామాన్యజనానికి దాదాపు అసాధ్యమై కూర్చొంటుంది. దాంతో ఇక నిరాఘాటంగా ఈ మీడియా బలం నడుస్తూంటుంది.

కాబట్టే జనందృష్టి మరల్చడానికి సంచలన వార్తలు పుడుతాయి. మీడియా ప్రపంచంలోని నానుడి ఒకటి ఇక్కడ మనం చెప్పకోవాలి. అదేమిటంటే

’కుక్క మనిషిని కరిస్తే అది వార్తకాదు, మనిషి కుక్కని కరిస్తే అదీ వార్త!’

కాబట్టి సంచలనాల కోసం సంఘటనలు సృష్టిస్తారు. లేదా జరిగిన సంఘటనల్నే సంచలనాత్మకంగా వ్రాస్తారు.

’దృష్టాంతరాలు’ పరికించండి. అంటే కొన్ని ’హైసర బజ్జ’లన్న మాట.

1. రాత్రికి రాత్రి ఎవరో సెంటర్లో ఉన్న అంబేద్కర్ బొమ్మమెళ్ళో చెప్పలు దండ వేస్తారు. మర్నాటి కల్లా రగడ మొదలు. ప్రతీకారంగా గాంధీ బొమ్మ మెళ్ళో చెప్పలు దండలు పడతాయి. ఇక కీర్తీశేఘలైన దేశనాయకులకి మతమో, కులమో అంటగట్టి కులసంఘాలన్నీ రోడ్లపైకొచ్చి, వైశ్యులు పొట్టిశ్రీరాములు పక్షనా, రాజులు అల్లూరి సీతారామరాజు పక్షాన, ఇలా ఓ ఘర్షణ మొదలౌతుంది. ప్రతికల్నిండా పతాక శీర్షికలూ, విలేఖర్లకి చేతినిండా పని. అప్పటి దాకా ప్రజలు తలమునకలుగా ఉన్న సమస్య మరుగునపడి పోతుంది.

2. హఠాత్తుగా నోరు చేసుకొన్న మంత్రి మరిడప్పలూ, తెలంగాణా నాయక విసిఆర్ లూ ఏవో దురుసు వ్యాఖ్యలు చేస్తారు. అంతే ఏమంద రామం కో లేక గుంపు గోంగూర గాడికో మనోభావాలు దెబ్బతింటాయి.

3. ఎవరో, ఎందుకో, హఠాత్తుగా, ఏ జూపార్కులోనో, ఏ పెద్దపులికో [సాకీ, నెహ్రూ జూపార్కు] బ్రతికి ఉండగానే తోలువలిచేస్తారు.

4. ఏ గౌతమీ ఎక్స్ ప్రెస్ కో నిప్పంటుకుంటుంది. లేదా ఏ ఘటకేసర్ దగ్గరో రైలు భోగీల్ని తలుపులు మూసి కిరోసిన్ పోసి ప్రయాణికుల్ని తగలేస్తారు. లేదా ఏ నరసరావు పేట దగ్గరో ఆర్.టి.సి. బస్సుని తలుపులు మూసి ప్రయాణకుల్తో సహా తగలబెట్టేస్తారు.

5. గోద్రాల్లాంటి సంఘటనలూ ఇందుకు అతీతం కాదు. విమాన హైజాకులూ, బాంబు దాడులు కూడా ఒక్కోసారి ఈ హైసర బజ్జ ప్రయోజనాన్ని చేకూరుస్తాయి. కాకపోతే టెర్రరిస్టు కార్యకలాపాలకి గల అనేకానేక ప్రయోజనాల్లో ఈ హైసర బజ్జ ఒకానొక ప్రయోజనం మాత్రమే.

6. అంతేకాదు జులై22, 2008 లో పార్లమెంట్ లో ప్రభుత్వ విశ్వాసపరీక్షలో వెలుగు చూసిన ఓటుకు నోటు కుంభకోణం - ఆ తర్వాత వరుసగా జులై 25న బెంగుళూరులో వరుసబాంబులు పేలాయి. జులై26 న అహ్మదాబాద్ లో, జులై 27,28 న సూరత్ లో బాంబులు పడ్డాయి. దెబ్బకి దృష్టంతా అటుపోయింది. నిజానికి నిండుప్రాణాలు బలై ఉన్న సందర్భంలో ఎవరూ మరో గొడవ గురించి ఆలోచించేంత లేదా చర్చించేంత అమానుషంగా ఉండరు కదా! ఇది చాలదూ విజయవంతంగా ప్రజాదృష్టిని హైజక్ చేయటానికి?

7. కొద్ది నెలలు క్రితం, అంటే సెప్టెంబర్ 13కు ముందు భారత్ - అమెరికా అణు ఒప్పందం నేపధ్యంలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం చాలా అబద్దాలాడిందనీ, పార్లమెంట్ నే తప్పదోవ పట్టించిందనీ ఓ ప్రక్క గొడవ జరుగుతుంది. మరోప్రక్క అమెరికాలో జార్జిబుష్ సెనెట్ కి రోజుకో పత్రం చొప్పన సమర్పిస్తున్నాడనీ, వాటిల్లో భారతప్రభుత్వం ప్రజలకి, పార్లమెంట్ కు అబద్దాలు చెప్పిందనీ నిరూపితమవుతునే ఉంది. ఆనేపధ్యంలో వరుసగా ఢిల్లీలో బాంబుపేలుళ్ళు జరిగాయి. అంతే. ఈ బాంబు గొడవుల్లో అణు ఒప్పందం ప్రక్కకు పోయింది. చాలా మామూలుగా జరిగిపోయింది. దీనివలన ఎవరు లబ్ధి పొందారు?

8. 2001 లో బషీర్ బాగ్ కాల్పుల తర్వాత, హఠాత్తుగా హైదరాబాద్ లో విపరీతంగా వర్షం కురిసి, నాలలు మూసుకున్నాయి. హైదరాబాద్ నగరం వరదలు పాలయ్యింది. మొత్తం దృష్టి వరదలు మీదుగా కొట్టుకుపోయింది. ఆనాడు తెలియక పోయినా ఈనాడైతే కృత్రిమ వర్షాలు కురిపించవచ్చనీ, కాంట్రాక్టుకి ఆపని చేసి పేట్టే బెంగూళూరు సంస్ధలున్నాయనీ ఈనాడు అందరికీ తెలుసు కదా!

9. ఒక్కోసారి ఏ రాష్ట్రప్రాంతీయ నాయకుడికో హఠాత్తుగా మిగిలిన రాష్ట్రాల వాళ్ళు తమ రాష్ట్రాన్ని దోచుకుపోతున్నారని ఙ్ఞానోదయం అవుతుంది. అంతే! ప్రక్క రాష్ట్రాలవాళ్ళని వెంటబడి కొడతారు. [మొన్న మహారాష్ట్రలో రాజ్ ఠాక్రే చేసినట్లన్న మాట.] వెంటనే మిగిలిన రాష్ట్రాలకూ ఈ నిప్ప అంటుకుంటుంది. దానితో ఇక రాజీనామాల డ్రామాలు, బెదిరింపు రాజకీయాలు, ఇలా ఎన్నో పద్దతులు. ఇవి అన్నిప్రజలలో ఉత్కంఠం రేపేటట్లు మీడియా చూపుకొని వాటి ఆదాయం పెంచుకొంటాయి, ఇది మరో విషయం.

10. హఠాత్తుగా ప్రభుత్వమే ఏవో రూల్స్, చట్టాలు తెస్తుంది. అంటే కొన్ని నెలలు క్రితం కేంద్ర గ్యాస్ సంస్ధలు వంటగ్యాస్ సిలిండర్ల మీద, వ్వాపార దుర్వినియోగం నివారణ కోసమై రకరకాల విన్యాసాలూ చేసినట్లన్నమాట. అది జనాలందరినీ నానా ఇబ్బందులకి గురి చేస్తూంది గనుక దృష్టి దాని మీదకి మరల్చక ఛస్తారా?

11. ఏ పత్రిక వారికో, వారి వ్యతిరేక రాజకీయ నాయకుల అవినీతి భాగోతాలు[దశాబ్ధాల క్రితం నాటివి అంటే ఇడుపులపాయ భూముల వంటివన్నమాట] హఠాత్తుగా తెలుస్తాయి లేదా గుర్తుకొస్తాయి. అంతే! ఇక అవి కొన్నాళ్ళు పతాక శీర్షికవుతాయి. నిజంగా ఆ అవినీతి నిరోధంపైనా, ప్రజసమస్యలపైనా పత్రికలకి చిత్తశుద్ది ఉంటే, ఆ సమస్యలు పరిష్కరింపబడే దాకా పత్రికలు పోరాడాలి కదా? కొన్నాళ్ళు మాత్రం వ్రాసి మరో క్రొత్త సమస్య, మరో క్రొత్త సంచలనం చేసుకొంటాయి. అదేమంటే ప్రజల సమస్యల్ని అందరి దృష్టికి తేవడం మాత్రమే తమ బాధ్యత అంటాయి.

ఇంట్లో నాన్న “బియ్యం అయిపోయాయి. తేవాలి” అంటేనో, అమ్మ “అన్నం వండాలి. లేకపోతే ఆకలి తీరదు” అంటూ సమస్యల్ని పిల్లల దృష్టికి తెస్తే సరిపోతుందా? బియ్యం వాటంతట అవే వచ్చి అన్నమైపోయి పిల్లల ఆకలి తీరుస్తాయా? లేక పిల్లలే బియ్యం తెచ్చుకొని, అన్నం వండుకొని అమ్మానాన్నల ఆకలి కూడా తీర్చాలా?

ఇలాగయితే స్వాతంత్రం కూడా అప్పటి పత్రికలు ప్రజల దృష్టికి తెచ్చి తమ బాధ్యత అయిపోయింది అంటే మనకు స్వాతంత్రం వచ్చేదా?

ఏది పత్రికల బాధ్యత?

ఈపాటి దానికి మళ్ళీ పత్రికల్ని పల్లెత్తు మాట అన్న, పత్రికా స్వేచ్ఛ అంటూ తమ హక్కుల్ని ఎలుగెత్తి చాటుతారు. [ఇందిరాగాంధీ హయంలో జరిగిన ఈ పత్రికా స్వేచ్ఛ పోరాటం, దాని వెనక నున్న కుట్ర గురించి మరో టపాలో వివరంగా వ్రాస్తాను]
వీరప్పన్ లనీ, మొద్దు శీనుల్ని ఇంటర్యూ చేసేంతగా నేరగాళ్ళ ఆనుపానులు నక్కీరన్ గోపాలన్ దగ్గరనుండి అన్ని పత్రికలు, టీవీల విలేఖర్లకీ, సంపాదకీయులకీ తెలుసు. కానీ పోలిసులకి మాత్రం చెప్పరు. సామాన్య ప్రజలకి నేరాల గురించి, నేరస్తులగురించి పోలిసులకి చెప్పాల్సిన బాధ్యత ఉంది గాని పత్రికల వారికి, అంటే మీడియా వారికి అలాంటి బాధ్యతలుండవు.

ఇక ఈస్వార్ధ మీడియా అధిపతులు అంటే కింగ్ మేకర్లకి, రాజకీయ పార్టీలు, పార్టీలనాయకులు అంటే కింగ్ లూ ఇచ్చే సహకారం గురించి చెప్పాలంటే, అది మరో పెద్ధకథే అవుతుంది.

చివరగా ప్రజాదృష్టి హైజాక్ గురించి మరికొంత వివరంగా....

ఇటివలి సినిమా ’ఇడియట్’ [రవితేజ] లో ఆచిత్ర దర్శకుడు ఈ విషయాన్ని మరింత హాస్యంగా, రసవత్తరంగా చిత్రించాడు.

ఆచిత్రంలో, రాష్ట్ర సరిహద్దులోని చెక్ పోస్ట్ దగ్గర పోలిస్ ఆఫీసర్ పాత్ర జీవా వేసాడు. హాస్యనటుడు ఆలీ ఒక్కోసారి ఒకో ద్విచక్ర వాహనం మీద వస్తాడు. ప్రతీసారి బస్తాలో ఇసుక తెస్తాడు. “ఎందుకురా?” అంటే ‘బీదర్ లో ఇసుక చల్లటం తన హాబీ’ అంటాడు.

ప్రతీసారి జీవాకి, అతడి అంతశ్చేతన చెబుతునే ఉంటుంది. "ఎక్కడో ఏదో జరుగుతోంది" అని. కానీ పాపం! ఎక్కడ ఏం జరుగుతుందో గుర్తించలేకపోతాడు.

ఈ ఒత్తిడి తట్టుకోలేక డబ్బులొచ్చే పోస్ట్ నుండి సిటీకి ట్రాన్స్ ఫర్ చేయించుకుంటాడు జీవా. ఓ రోజు ఆలీ కన్పిస్తే కుతూహలం కొద్దీ, కేసులేమీ పెట్టనని హామి ఇచ్చి మరీ అప్పడు ఏం జరిగిందో చెప్పమని అడుగుతాడు.

ఆలీ విశాలంగా నవ్వుతూ "ఏమండీ! రకరకాల బండ్లమీద వచ్చా. ఎంత సేపూ బస్తా ఏమిటి? ఇసుక ఏమిటి? ఎందుకు అన్నారే గానీ ‘బండి ఏమిటి? సీ బుక్ ఏది’ అనడిగారా? ఎవరండి మీకు ఉద్యోగం ఇచ్చింది? రికమెండేషన్ కేసా?" అంటాడు. జీవా " రెయ్" అంటే, మళ్ళీ ఆలీ “నమస్కారం ఎస్.పి.గారు!” అంటూ మరోసారి జీవాదృష్టిని హైజాక్ చేసి పారిపోతాడు.

జీవాలాగే పత్రికాపాఠకులు, టివీ పేక్షకులయిన ప్రజలకీ అంతశ్చేతన చెబుతునే ఉంటుంది ’ఎక్కడో ఏదో జరుగుతుంది’అని. ప్రపంచ విస్తారత రీత్యా, మనిషి పంచేంద్రియలకున్న పరిమితులరీత్యా, మనకున్న జీవితంలోని వేగానికి ఎక్కడ ఏం జరుగుతుందో అంతశ్చేతనకి తెలుస్తున్నది కాని నిరూపించలేని స్ధితి ఉంది అంతే! కానీ ఎంతోకాలం నిజాన్ని ఎవరూ దాచలేరు!

నిజాములైనా నిజం ముందు ఓడిపోయారు కదా?

గమనించి చూస్తే ఇలాంటి దృష్టాంతాలు మీకు ఇంకా చాలానే కన్పిస్తాయి.

గమనిక: వీటన్నింటికీ సాంకేతికంగా నిరూపణలేమిటి, బుజువు పత్రాలున్నాయా, విడియో టేపులు ఉన్నాయా, లేదా ఫోను సంభాషణ రికార్డులు ఉన్నాయా అని కాదు మనం అలోచించాల్సింది.

ఈ హైసరబజ్జ ల్లాంటి వాటితో ప్రజాదృష్టి హైజాక్ లతో ’తుది లబ్ధి ఎవరు పొందారు?’ అన్న విషయం పరిశీలిస్తే చిక్కుముడులన్ని మంచువిడిపోయినట్లు విడిపోతాయి.

తరువాత టపాల్లో మరికొన్ని మాయలు.

అందాకా … అమ్మకడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు.

ఎప్పట్లాగే ముందుగా ఓ కథ చెప్పి, దాని విశ్లేషణా మన జీవితాల్లో కథాసారపు అనువర్తనా వివరించి, నాబ్లాగు అతిధుల్ని అలరించాలని ఇది వ్రాస్తున్నాను.

అనగా అనగా .....

చింతలపల్లి అనే ఓగ్రామం ఉండేది. ఆ గ్రామాధికారి పేరు ఆదిశేషయ్య. అతడి భార్య పేరు అనసూయమ్మ. కొద్దిరోజులు క్రితం వారి కుమార్తె పెళ్ళి అయ్యింది. ఇక పిల్లని చీరె సారెలతో అత్తవారింటికి పంపాలి.

ఓ రోజు ఉదయాన్నే అనసూయమ్మ భర్తతో “ఏమండోయ్! ఎల్లుండి గురువారం. ఆరోజు అమ్మాయిని అత్తవారింటికి పంపాలి. పది మణుగులు నేతి మిఠాయిలు కావాలి. సుబ్బయ్య మిఠాయిల దుకాణం నుండి తెప్పించండి” అంది.

ఆది శేషయ్య సాలోచనగా “అలాగే” అన్నాడు.

వెళ్ళి వీధి అరుగు మీద కూర్చున్నాడు. అనసూయమ్మ పనులు హడావుడిలో పడిపోయింది. రెండు ఘడియల తర్వాత చూస్తే ఆదిశేషయ్య వీధి అరుగు మీదే కూర్చోని ఏవో కచేరి [ఆఫీసు] కాగితాలు చూసుకుంటున్నాడు.

అనసూయమ్మ వీధి అరుగు దగ్గరికి వచ్చి భర్త వైపు ప్రశ్నార్ధకంగా చూసింది.

కాస్త ఆగమన్నట్లుగా ఆదిశేషయ్య చేసైగ చేసాడు. ఆవిడ మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయింది. మధ్యాహ్నమయ్యింది. అప్పటికీ ఆది శేషయ్య వీధి అరుగు మీదే కూర్చోని, కచేరీ పనుల నిమిత్తమై తనకోసం వచ్చిన గ్రామస్తులతో మాట్లాడుతున్నాడు. అనసూయమ్మ అసహనంగా ఇంట్లోంచి బైటకొచ్చింది. ఆదిశేషయ్య నింపాదిగా ఉన్నాడు.

భోజనాలవేళ ఆవిడ భర్తమీద ఖయ్యిమంది. “పిల్లకి సారె చీరె లిచ్చి పంపాలి, మిఠాయిలు తెప్పించమంటే బెల్లం కొట్టిన రాయిలాగా ఉలకరు, పలకరేం?” అంది రుసరుసలాడుతూ.

ఆదిశేషయ్య నిమ్మకు నీరెత్తినట్లు, నింపాదిగా “ఆపని మీదే ఉన్నానులే!” అన్నాడు.

అనసూయమ్మ తెల్లబోయింది. మాట్లాడకుండా వూరుకొంది. సాయంత్రమైంది. మిఠాయిలింటికి రాలేదు.

రాత్రి భోజనాల వేళ భర్తకి మరోసారి గుర్తు చేసింది అనసూయమ్మ.

“ఎల్లుండి కి కదా మిఠాయిలు కావాలి? రేపు తెస్తానులే!” అన్నాడు ఆదిశేషయ్య.

"ముందుగా చెప్పకపోతే అన్నిరకాలూ దొరకవద్దూ?" దీర్ఘం తీసింది అనసూయమ్మ.

"మరేం ఫర్లేదు. అన్నిరకాలూ ఉంటాయి. నామీద భరోసా ఉంచు” తొణకని కుండలా చెప్పాడు ఆదిశేషయ్య.

ఇంకేమన లేక మౌనంగా వూర్కొంది అనసూయమ్మ.

మర్నాటి సాయంత్రం వరకూ కూడా అదే తంతు నడిచింది వీధి అరుగుమీద. చేసేది లేక అనసూయమ్మ చూస్తూ ఊర్కొంది.
సాయంత్రానికి ఆదిశేషయ్య పనివాణ్ణి వెంట బెట్టుకుని సుబ్బయ్య మిఠాయి దుకాణానికి బయలుదేరాడు. కాస్సేపటికల్లా ఇరవై మణుగులు నేతి మిఠాయిలు ఇంట దిగాయి. అనసూయమ్మ తెల్లబోయింది.

భర్తకి మంచినీళ్ళందిస్తూ “కావలసింది పది మణుగులైతే ఇరవై మణుగులు తెచ్చారేం? డబ్బు దండుగ కాదూ?” అంది.
"అదేం లేదు! ఇరవై మణుగులు కలిపి ఐదు మణుగుల ఖరీదుకే వచ్చాయి” అన్నాడు ఆదిశేషయ్య విజయదరహాసంతో.

"అదేలా?" ఆశ్చర్యంగా అడిగింది అనసూయమ్మ.

గుబురుమీసాలు సవరించుకొంటూ చెప్పాడు ఆదిశేషయ్య.

"పిచ్చిదానా? నీకన్నీ తొందరే! హుటాహుటిన నిన్నే సుబ్బయ్య దుకాణానికి మిఠాయిల కోసం వెడితే మణుగు ఖరీదు నాలుగింతలుండేది. నిన్న పొద్దున నువ్వు చెప్పగానే అరుగు మీద కూర్చొని నాతో పనిబడి వచ్చిన వారందరితో ‘సుబ్బయ్య కొట్లో మిఠాయిలు చద్ది వాసన వస్తూన్నాయంటగా?’ అంటూ గాలివార్త వదిలాను. అది నమ్మింది కొందరూ, నాతో పని ఉంది కాబట్టి నన్ను ప్రసన్నం చేసికొనేందుకు నమ్మినట్లు నటించినది కొందరూ. ఏమైతేనేం? మొత్తానికి అందరూ కలిసి సుబ్బయ్యకొట్లో మిఠాయిలు చద్ది వాసన వస్తున్నాయనీ పుకారు, గాలివార్తని ఊరంతా టాంటాం వేసారు. ఒకరికి పదిమంది అదే మాట అనేసరికి నిన్న సాయంత్రానికి సుబ్బయ్య మిఠాయిల ధర సగానికి సగం తగ్గించి అమ్మాడు. వార్త ప్రచారం ఆగకపోయేసరికి ఈరోజు సాయంత్రానికి ధర నాలుగో వంతుకి తగ్గించాడు. ఇప్పడు ఇరవై మణుగుల నేతి మిఠాయిలు, ఐదు మణుగుల ధరకే వచ్చాయి”.

అనసూయమ్మ భర్త తెలివితేటలకు తెగ మురిసిపోయింది. కించిత్తు గర్వంగా ఆదిశేషయ్య అనసూయమ్మ కేసి చూస్తూ “చూసావా? ఏ పని చేసినా మనచేతికి తడి అంటకుండా చేయాలి, నేర్పుగా ఓర్పుగా పని చక్కబెట్టాలి” అన్నాడు తత్త్వం బోధిస్తూన్నట్లు.

“నిజమే సుమా!” అంటూ తలూపింది అనసూయమ్మ.

ఇదీకథ!

ఈ కథలో సుబ్బయ్య అన్యాయమైపోయాడు. తనకు జరిగిన అన్యాయానికి, నష్టానికి ఆదిశేషయ్య కారణమని గాని, అతడు కావాలనే అబద్ధపు వార్తల్ని ప్రచారం చేసాడనీ, చేయించాడనీ తెలుసుకోలేడు. ఒకవేళ తెలిసికొన్నా దాన్ని ఋజువు చేయలేడు, అస్సలు ఆదిశేషయ్య ని తన నష్టానికి బాధ్యుడిగా నిందించలేడు, ఫిర్యాదు చేయలేడు. ఎవ్వరినీ నిదించలేడు. విషయం తెలిస్తే మౌనంగా, తెలియక పోతే అమాయకంగా నష్టపోవడమే తప్ప సుబ్బయ్యకి మరో గత్యంతరం లేదు.

అలాగని, సుబ్బయ్య తన మిఠాయిల నాణ్యతమీద నమ్మకం కొద్దీ ధరలు తగ్గించకుండా ఉండి ఉంటే .... పుకారు/వార్తప్రచారం వల్ల అతడి అమ్మకాలు పడిపోతాయి. అప్పడు మిఠాయిలు నిజంగానే పాడవుతాయి. చద్ది వాసనే వేస్తాయి. అప్పడిక పుకారే నిజమైకూర్చుంటుంది. దానితో వార్త వచ్చాక మిఠాయిలు చద్ది పడ్డాయా, మిఠాయిలు చద్దిపడ్డాకే వార్త ప్రచారమయ్యిందా అన్న ప్రశ్న ’విత్తుముందా, చెట్టుముందా?’ అన్న ద్వంద్వంలాగా పరిణమిస్తుంది.

అదే .... పదేపదే అదే వార్తని ప్రచారం చేయడంలోని బలం!

‘కంటిన్యూయస్ కాంపెయిన్’ - ఇదీ నేటి మీడియా సూత్రం.

నిరవధిక ప్రచారంతో పాలని నీళ్ళనీ, నీళ్ళనీ పాలనీ నమ్మించవచ్చు - ఇదీ నేటి మీడియా తంత్రం.

నిజానికి కార్పోరేట్ వ్యాపారులూ, కార్పోరేట్ పారిశ్రామికవేత్తలూ, రాజకీయ నాయకులూ, నేటి మీడియా అధిపతులు. పత్రికా రంగ యజమానులూ, టీవీ రంగ యజమానులూ చేస్తోంది వ్యాపారం, చెబుతోంది ప్రజాసేవ. తీస్తోంది గోతులు, చెబుతోంది నీతులు.

నిజానికి పైన చెప్పిన గ్రామాధికారి కథ, మన పంచ తంత్రంలోని పాచి, చద్ది కథ ’నల్లమేక - నలుగురు దొంగలు’కు రూపాంతరేమే. నలుగురు దొంగలు విడివిడిగా ముసలి బ్రాహ్మణుణ్ణి, నల్లకుక్కని తీసుకెళ్ళూతున్నావేమిటంటూ నల్లమేకని నల్లకుక్కగా నమ్మస్తారు. తనమీద తను నమ్మకం కోల్పోయిన ముసలివాడు తనకు తానుగా, తనమేకను విడిచిపెట్టేస్తాడు.

ఎంచక్కా దొంగలు దాన్ని బిరియానీ చేసుకుతింటారు. ప్రచారమే పెట్టుబడి అయినప్పడు నలుగురు దొంగలు కాకపోతే 40 మంది, కాక పోతే 400 మంది గుంపవుతారు. నాలుగు సార్లు కాకపోతే 40 వేలసార్లు ప్రచారం చేస్తారు. నల్లమేకను కుక్కను కొని విడిచి పెట్టేవరకూ ప్రచారం చేస్తారు. ఇంతకంటే లాభసాటి వ్వాపారం మరింకేమిటి?

ఇదికాదా ఈనాడు మనం ప్రసార మాధ్యమంలో అంటే వార్తా పత్రికల్లో, టీవీ ఛానెళ్ళలో చూస్తోన్న ఊదరగొట్టుడు?

పత్రికలు తమ కిష్టమైన వారికి అనుకూలంగా వార్తలు వ్రాస్తాయి. పుకార్లు లేపుతాయి. కింగ్ మేకర్స్ వంటి ఈపత్రికాధిపతులు, తాము కింగ్స్ చేయాలనుకొన్నవారు రోడ్డు ప్రక్కన స్నానం చేసినా వార్తగా వ్రాస్తారు, ఫోటోలు వేస్తారు. గడ్డం గీచుకున్నా వార్తే! రోడ్డు ప్రక్కనే నిద్రపోయాడన్నా వార్తే! చిన్నపిల్లల్ని ఎత్తి ముద్దులాడారనీ, గొంగళి, కంబళి కప్పకున్నాడనీ, అది చేసాడనీ, ఇది చేసాడనీ .... ఏం చేసినా వార్తే.

తాము ఇవ్వదలుచుకుంటే ఎంత ఇమేజ్ అయినా ఇవ్వగలరు. అది ఒక్క రాజకీయ రంగం లోనే కాదు, సినిమారంగం, వ్యాపార రంగం, క్రీడారంగం లాంటి ఏరంగాన్నైనా మీడియా ఇలాగే శాసించగలదు. ఇది ఒక రాష్ట్రానికో, దేశానికో పరిమితం కాదు. ప్రపంచవ్యాప్తంగా ఇదే పద్దతి.

కాబట్టే, నైనా సెహ్వల్ ప్రపంచటైటిల్ గెలిచినా వార్త మామూలుగా వ్రాయబడుతుంది. ఓ మూల, ఓ రోజు ప్రింటవుతుంది. ఇక అంతే! అదే సానియామిర్జా అయితే? ఆవిడ ఆడినా, ఓడినా వార్తే! ఆవిడ గెలవక పోయినా ర్యాంకింగ్ మాత్రం పెరిగిపోతుంది. మరీ వరసబెట్టి ఓడిపోతుంటే, ఇమేజ్ కవరింగ్ కోసం వివాదాలు సృష్టింపబడతాయి. అదీ లేదంటే “అమ్మో సానియా! ఏం సమయస్ఫూర్తి” అంటూ ఆవిడ వాక్చాతుర్యం మీద వ్యాసాలు వ్రాయబడతాయి. ఇది ఒక్క ఉదాహరణ మాత్రమే.

ఇలాంటి దృష్టాంతాలు మనచుట్టు వందలూ, వేలల్లో ఉన్నాయి.

మరో ఉదాహరణ : 1970 – 80 ల్లో ఇందిరాగాంధివి నియంతృత్వ పోకడలనీ, అనువంశీక పాలననీ పత్రికలు దుమ్మెత్తి పోసాయి. అందుచేత తాము ఇందిరాగాంధికీ, ఆవిడ రాజకీయ పార్టికీ వ్యతిరేకులమంటూ, ఏకంగా కోర్టుకే లిఖిత పూర్వకంగా చెప్పాడు ఒక పత్రికాధిపతి.

మరి ఇప్పడు ఈనాటి కేంద్రప్రభుత్వ కుర్చీ వ్వక్తి, రాజ్యాంగేతర శక్తిగా, నియంతృత్వపోకడలనీ [‘టిక్కట్లు అమ్ముకున్నారనో, మరో ఆరోపణో చేసారో ఖబడ్డార్! పదవులూడతాయ్ జాగ్రత్త’ అంటూ విమర్శించిన వారిని ఇంటికి పంపేస్తున్నా సరే!] అనువంశిక పాలననీ ఏపత్రికా విమర్శించదూ, కిక్కురు మనదూ? ఎందుకనీ?

అందరూ ఒకే గూటి పక్షులా? లేక అంతర్గత మ్యాచ్ ఫిక్సింగా?

కావాలంటే గమనించి చూడండి. దీపికా పదుకోణే బాయ్ ఫ్రెండ్ ఎవరో అంటూనో, ధోనీ జులపాలజుట్టు పై ముషారప్ మురిపాలు అంటూనో పత్రికలు ఊదరపెట్టియటం మన కళ్ళముందూ రోజూ జరుగుతున్నదే! షావుకారు జానకి, అభినేత్రి వాణిశ్రీ అంటూ నాటి నుండీ అదే ప్రచార ఒరవడి. ఏకంగా కొందరు నటిమణులు కొరకు ఊర్వశిలాంటి బిరుదులు, లేదా బిరుదులు కొరకూ నటీనటులూ సృష్టించబడ్డారు.

ఇలా రాజకీయ రంగంలోనూ, సినిమారంగంలోనూ, క్రీడారంగంలోనూ, అలాగే మిగిలిన రంగాల్లోనూ తమ పట్టుని పత్రికలు నిరూపించుకొన్నాయి. దానితో గాడ్ ఫాదర్ [దేవుడిచ్చిన తండ్రి]లు పుట్టుకొచ్చారు. ఘోష్ట్ రచయితలు, కళాకారులూ పుట్టుకొచ్చారు. నిజం చచ్చిపోయింది. సరస్వతీ దేవి మాయమైపోయింది.

ఏరంగానికైనా కింగ్ మేకర్ దే రాజ్యమైపోయింది. ప్రతీ రంగంలోనూ మోనోపల్లీ సృష్టించబడింది.

మీరు గమనించి చూడండి – 1975ల వరకూ కూడా సినిమా నేపధ్య సంగీతరంగంలో ఘంటసాల, మాధవపెద్ది, సత్యం, పిఠాపురం నాగేశ్వర రావు, పి.బి. శ్రీనివాస్, ఎ.ఎమ్. రాజా, కె.బి.కె. మోహన్ రాజు, రఘునాధ్ పాణిగ్రాహి, ఇలా చాలామంది గాయకులు ఉండేవాళ్ళు. అలాగే లీల, సుశీల, జానకి, జిక్కి, జమునా రాణి, రాణి, రమోల, ఎల్.ఆర్. ఈశ్వరి, స్వర్ణలత, ఎమ్.ఎస్.తిలకం, రావు బాలసరస్వతి - ఇలా చాలామంది గాయనీమణులు ఉండేవాళ్ళు. వీళ్ళంతా కలిసి సరదాగా ’రహస్యం’ అని అక్కినేని నటించిన ఓ జానపద చిత్రంలో పార్వతీ కణ్యాణం అనబడే యక్షగానాన్ని ఆలపించారు కూడా.

అలాంటిది 1980లలో ఒకే ఒక్క గాయకుడు - ఎస్.పి. బాలసుబ్రమణ్యం. ఇద్దరే గాయనీమణులు - సుశీలా, జానకి ఎందుకనీ? ఒకరంగంలో ఒకరో ఇద్దరో మోనోపల్లీ అయితే కింగ్ మేకర్లకీ అంటే పత్రికాధిపతులకి, ఆ రంగాన్ని నియంత్రించడం సులభం. పైసలు, పట్టు పటిష్టం. ఇప్పడు అంటే 1992 తర్వాత మళ్ళీ పూర్వపు స్థితి కొంత తిరిగి కన్పిస్తోంది. కారణమేమిటో గానీ మీడియా పట్టు బిగింపులు మరింత ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.

అయితే, ఇలా మనం పరిశీలిస్తూ పోతే మాత్రం, ఒకో రంగంలోనూ ఎన్నో దృష్టాంతాలు కన్పిస్తాయి.

ఇలాంటి మీడియా లీలలు ఎన్నో! మరెన్నో! మనం బుద్దిని విప్పార్చి చూడాలేగానీ మనచుట్టూ అవే అక్షరసత్యాలు, పచ్చి నిజాలు.

తదుపరి టపాలో మరికొంత మాయజాలం ....

అందాకా … అమ్మకడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు.

పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి, శవాన్ని దించి భుజాన వేసికొని, ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు.

ఇది మనం చిన్నప్పటి నుండీ చందమామ భేతాళ కధా ప్రారంభంలో చదివి మురిసిపోయే వాక్యం.

అలాంటిదే ఈ అమ్మఒడి టపా తొలివాక్యం.

ఎప్పటిలాగే ముందుగా మీకో కథచెప్పి, దాని విశ్లేషణా, మన జీవితాల్లో కథసారపు అనువర్తనా వివరించి, నాబ్లాగు అతిధుల్ని అలరించాలని ఇది వ్రాస్తున్నాను.

ఇది మనం చాలాసార్లు విన్న, చెప్పిన, చదివిన కథ. కాని మన జీవితాల్లో దాని అనువర్తనా ప్రభావం మాత్రం, మనం గమనించనిదీ, చాలా ముఖ్యమైనదీను.

ఓసారి సముద్రంలో తుఫాను రేగింది. ఎగసి పడే అలలకీ, సుడి గాలికీ ఓ కప్ప విధివశాత్తు చిక్కుకొని ఎగిరివచ్చి దాపులనున్న గ్రామంలోని బావిలో పడింది. సముద్రపు కప్పని చూచి ఆ బావిలోనే చాలాకాలం నుండీ నివసిస్తూన్న కప్ప గెంతుకుంటూ దగ్గరికొచ్చింది.

"ఎవరు నువ్వు? ఎక్కడి నుండి వచ్చావు?" వింతగా చూస్తూ సముద్రపు కప్పని అడిగింది బావికప్ప.

"నేను సముద్రపుకప్పని. సముద్రం నుండి ఎగిరి వచ్చి, ఖర్మకాలి ఈ బావిలో పడ్డాను” అంది కొంచెం దర్పం, కొంచెం విచారం కలిపిన స్వరంతో సముద్రపు కప్ప.

"ఎందుకంత విచారం? ఈ బావి చాలా పెద్దది" అంది ఓదార్పుగా బావి కప్ప.

సముద్రపు కప్ప నిస్పృహగా బావి కప్పవైపో చూపు విసిరి "సముద్రం చాలా పెద్దది!" అంది.

"ఎంత పెద్దది?" అంది బావికప్ప కుతూహలంగా!

"చాలా చాలా పెద్దది." అంది సముద్రపు కప్ప.

పాపం! తన జీవితంలో సంభవించిన అంత పెను విషాదాన్ని ఇంకా అది జీర్ణించుకోలేదు. దాని నిర్వేదంలో అది ఉంది.

ఇదంతా పట్టించుకోని బావికప్ప "ఎంతపెద్దది సముద్రం? ఇంత ఉంటుందా?" అంటు బావిలో ఓ వృత్తం గీచి చూపెట్టింది.

సముద్రపు కప్పకి నవ్వొచ్చింది. ఆపైన బావి కప్పపై జాలేసింది. ఓపిగ్గా "కాదు. ఇంకా పెద్దది" అంది.

"అవునా? అయితే ఇంతపెద్దదా?" ఈసారి ఇంకొంచెం పెద్దవృత్తం గీచి అడిగింది బావికప్ప కళ్ళింత చేసి,

ఈసారి సముద్రపు కప్పకి ఏడుపొచ్చింది.

"కాదు. చాలా చాలా పెద్దది." అంది విసుగ్గా.

బావికప్ప ఇంకా పట్టుదలగా మరి కొంచెం పెద్దవృత్తం గీచి "ఇంత పెద్దదా?" అనడిగింది.

ఇక తట్టుకోలేక కెవ్వున కేకపెట్టి ఘొల్లుమంది సముద్రపు కప్ప. ఇక ఎంత చెప్పినా బావికప్ప సముద్రపు విస్తారతని అర్ధం చేసుకోలేదని అర్ధం చేసుకొంది.

బావికప్పపై జాలి పడింది.

ఇదీ కథ!

ఉన్నచోటు వదలి ఎక్కడికీ వెళ్ళని వ్యక్తి విషయపరిఙ్ఞానం చాలా పరిమితమైనదని చెప్పడానికి మన పెద్దలు చెప్పిన కథ ఇది. అందుకే దేశాటనం వ్యక్తి వికాసానికి అవసరమని పూర్వం నుండీ మన వాళ్ళ నమ్మకం. ఙ్ఞాన శూన్యుణ్ణి బావికప్పనీ, నూతిలో కప్పనీ విశ్లేషణలతో చెప్పడం మనందరికీ తెలుసు.

అలాగే పదిచోట్లు తిరిగినవాణ్ణి, "ఆయన దేశాలు తిరిగాడు. ఆయన కెన్నో తెలుసు!" అంటూ గౌరవించడం పరిపాటి. కాబట్టే ఆ రోజుల్లో కాశీకి వెళ్ళి వచ్చిన వాణ్ణి ఊరంతా కలిసి సన్మానించేవాళ్ళు. ఇప్పటికీ తమవాళ్ళు విదేశీ పర్యటనలకి వెళ్తోంటే వీడ్కోళ్ళూ, తిరిగి వస్తూంటే స్వాగతాలు పత్రికల్లో ప్రకటించి మరీ గౌరవించడం మనం ప్రతిరోజూ చూస్తూనే ఉన్నాం.

ఎందుకంటే ‘మనం చూడని ఎన్నో ప్రదేశాలు వాళ్ళు చూచి, ఎన్నో విషయాలు, సంస్కృతులూ పరిశీలించారు. కాబట్టి వాళ్ళు మనకంటే ఙ్ఞానం కల వారు’ అని మనం నమ్ముతాం. అలాంటి వాళ్ళు అభిప్రాయాల్ని గౌరవిస్తాం, సలహాలని ఆచరిస్తాం.

మనమేకాదు, పురాణకాలం నుండి ఈ మంచి లక్షణం మానవుల్లో ఉంది. కాబట్టే నారద మహర్షిని మిగిలిన మునులు “మహర్షీ! మీరు త్రిలోక సంచారులు” అంటూ గౌరవించడం మనకు తెలిసిందే.

మునులని, రాజులూ, ప్రజలూ గౌరవించడం మనం చదివిందే. “యోగులూ, ఋషూలూ, మునులూ దేశాలు తిరుగుతారు. వారికి స్వార్ధం ఉండదు. వాళ్ళేం చెప్పినా, ప్రజాహితం కోరి చెబుతారు” అని ప్రజలు నమ్ముతారు. అది ఆనాడు.

అయితే ఆనాడే కాదు, ఈనాడూ ప్రజలు అంతటి గౌరవాన్ని మీడియాకి ఇచ్చారు. కాబట్టే స్వాతంత్రసమరం కాలంలో బ్రిటీషు వారు రాజకీయపాలన నెపంతో చేస్తోన్న వ్వాపార దోపిడికి వ్యతిరేకంగా దేశభక్తులూ, మానవతా మూర్తులూ పోరాడుతూ అందుకు పత్రికారంగాన్ని ఆయుధంగా తీసికొన్నారు.

ప్రజలు కూడా ఆనాడు ఋషులని గౌరవించినంతగా పత్రికల్ని గౌరవించారు. “మనం తిరగని ప్రదేశాలకు పత్రికలు వెళ్ళగలవు. మనం తెలుసుకోలేని విషయాలు పత్రికలు తెలుసుకోగలవు. వాళ్ళకి స్వార్థం ఉండదు. వాళ్ళేం చెప్పినా ప్రజాహితం కోరి చెబుతారు” అని ప్రజలు నమ్మారు.

కాబట్టి ఆనాటి పత్రికలు ప్రజల్లో జాతీయతా భావాన్ని ప్రేరేపించి, వారిలో స్ఫూర్తి నింపగలిగాయి.

ఈనాటి కంటే ఆనాడు సమాచార రంగం చాలా వెనకబడి ఉంది. ప్రజల్లో పేదరికం, నిరక్షరాస్యత, అనవగాహన అపరిమితం. ఈ నాటి లాగే ఆనాడూ కంచే చేను మేస్తోంది. కాని ఆనాడు చేనులోని ఏ మొక్కకా మొక్కా, నిస్సహాయంగా చూస్తూ ఊరుకోలేదు. పత్రికలు నింపిన స్వాతంత్ర స్ఫూర్తితో, దేశభక్తి జ్వాలతో రగిలిపోయాయి. బక్కచిక్కిన ఒక సామాన్యుడు, మహాత్ముడై ఇచ్చిన సంయమన సందేశంతో సత్యాహింసల సాధనచేశాయి. గడ్డి పోచలు తాడై మదపుటేనుగును కట్టేసినట్లు, బ్రిటీషు వ్వాపార మదపుటేనుగుని బంధించి, అరేబియా సముద్రానికావల పారేసాయి. అంతటి అపూర్వ సంఘటనకి పత్రికలు చేసిన చేయూత ఇక్కడ ప్రధానాంశం.

స్వాతంత్ర సమరకాలంలోనే కాదు, ఇప్పడు కూడా పత్రికలకి ప్రజల్లో అంత పట్టు, ప్రభావం ఉన్నాయనడానికి 1992 లో ఈనాడు పత్రిక నిర్వహించిన దూబగుంట్ల సారవ్యతిరేక ఉద్యమం లాంటి ఉదాహరణలు కోకొల్లలు.

అందుకే పత్రికారంగం, టీవీ రంగం - మొత్తంగా మీడియా అంటే ప్రసారమాధ్యమం వ్వాపారుల్ని, కుట్రదారుల్ని, కుటీల సామ్రాజ్యవాదుల్ని ఆకర్షించింది.

క్రమంగా స్వార్ధవ్వాపారులూ, కుట్రదారులూ, కుటీలాత్ములూ పత్రికాధిపతులుగా, టీవీ సంస్థల యజమానులుగా అవతారం ఎత్తారు. ఆనాటి దేశభక్తులు తెల్లవాళ్ళని పత్రికలే ఆయుధంగా తీసుకొని వెళ్ళగొట్టారు. విలువలతో పత్రికలు నడిపారు. ఈనాటి స్వార్ధపరులు తెల్లవాళ్ళని మించిన ‘కారు నల్లవాళ్ళు’. బ్రిటీషు వాడి వ్వాపారదోపిడీ వీళ్ళ వ్వాపార దోపిడీ ముందు దిగదుడుపే! ఈ స్వార్ధమీడియా అధిపతులు విలువలు గల జర్నలిస్టుల్నీ, సంపాదకుల్నీ, పత్రికల యజమానుల్ని క్రమంగా దివాళా తీయించి రంగంలోనుండి తరిమేసారు. కాబట్టే కాలగతంలో కృష్ణాపత్రిక, ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభలాంటివి సమాజం నుండి మాయమైపోయాయి. బ్రిటిషు వాళ్ళలాగా బహిరంగంగా గుర్తించబడేలాగా కాకుండా, మరింత నేర్పుగా, రహస్యంగా, గూఢంగా తమవ్వాపారదోపిడీ చేయడానికి పత్రికలే సరైన ఆయుధమనీ, దాన్ని మరింత పకడ్బందీగా ఈ స్వార్ధమీడియా అధిపతులు ఉపయోగించుకుంటున్నారు. పైకి ఎన్నో నీతులు చెబుతారు, వ్రాస్తారు. రాజుకంటే, రాజు తయారీదారుడు [అంటే కింగ్ కంటే కింగ్ మేకర్] మరింత బలవంతుడని వీళ్ళకి బాగా తెలుసు. కాబట్టే సినిమారంగం, క్రీడారంగం లాంటి ఆకర్షక రంగాల్నుండి క్రొత్త బొమ్మల్ని తెచ్చి మంత్రుల్నీ, ముఖ్యమంత్రుల్నీ చేస్తుంటారు. ఎందుకంటే అన్నీ వ్వాపారాలకంటే రాజకీయ వ్వాపారం మరింత లాభదాయకం కదా!

ఎటూ ప్రజలు పత్రికలమీద, ప్రసారమాధ్యమాల మీద నమ్మకం కలిగిఉన్నారు. దాన్ని ఆధారం చేసుకొని పాలని నీళ్ళనీ, నీళ్ళని పాలనీ నమ్మించడం తేలిక. ప్రచారంతో దేన్నైనా నమ్మించవచ్చన్నది ఈ స్వార్ధమీడియా అధిపతుల ప్రగాఢ నమ్మిక.

దానితో మీడియా ప్రజలమీద ప్రయోగించిన తంత్రం అంటే స్ట్రాటజీ ఫలితాల్ని మనం చూస్తూన్నే ఉన్నాం గదా?

తమకు అనుకూలమైన నాయకులమీద పుష్పవర్షం, పొగడ్తలవాన. తమకు విరోధులైన వారిమీద తిట్లవర్షం, విమర్శలవాన. యుక్తులూ, ఎత్తులు, పైఎత్తులూ! ప్రజహితమన్నది పత్రికారంగం నుండి ఎప్పడో పారిపోయింది. ఇప్పడంతా పెట్టుబడిదారు లాభమే. ఈ పరిస్థితుల్లో సాక్షి మరింత పెద్ద అంగలు వేసింది.

ఈ మీడియా మాయాజాలం గురించి ఇంకాచాలా చెప్పాలి.

తదుపరి టపాలలో మరింత వివరంగా, దృష్టాంతాలతో సహా [అంటే సర్కంస్టాన్షియల్ గా అన్నమాట] వివరిస్తాను.

అందాకా … అమ్మకడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు.

ఎప్పటిలాగా ముందుగా ఓ కధవ్రాసి, దాని విశ్లెషణా, మనజీవితాల్లో కధాసారపు అనువర్తనా మీకు వివరించాలనుకొన్నానండి!
కానీ చిన్న బిర్రే....క్!
ఈలోగా సరదాగా కాసిన్ని కబుర్లు!
*** *** ***
సాక్షిలో రామోజీ రామాయాణం చదివి ఇది వ్రాస్తున్నాను.
అది రామాయణం కాదండీ! రామోయణం!
అసలింతకీ ఏం జరుగుతోంది ఆరెఫ్సీలో?
స్వయంగా రామోజీరావు కుమారుడే చ్చెప్పినట్లుగా డబ్బుతో ఎవరినైనా కొనేయవచ్చు ఏమైనా చేసేయవచ్చు అని రామోజీరావు ప్రగాఢ విశ్వాసం. అసలు దేవుణ్ణే నమ్మని, తానే స్వయంగా చెప్పుకున్న కొండంత వ్వవస్థ వంటి వ్వక్తి. తండ్రి దెవుణ్ణి నమ్మని నాస్థికుడైతే,ఆయన పెద్దకుమారుడు ముస్లీం గడ్డం, గుండూ పెట్టుకొని తండ్రి వెనకాలే తిరుగుతుంటాడు.
రెండో కుమారుడు శ్రీహరిస్వరాలు, సుమనోహరాలూ అంటూ కృష్ణుడి వేషం వేసికొని తండ్రికి ఎదురుతిరుగుతుంటాడు.
అసలేం జరుగుతోంది ఆరెఫ్సీలో?.... నాకు తెలియాలి! నాకు తెలియాలి! నాకు తెలియాలి!......ఇట్లు సీతమ్మ.
ప్లీజ్! ప్లీజ్! మీకు తెలిస్తే చెప్పరూ!
*** *** ***
సినిమారంగం నుండి రాజకీయ రంగంలోకి కోత్తగా అడుగుపెట్టిన నాయకులు ఇంద్ర, సమరసింహ రెడ్డిల్లాంటి సినిమాలని గుర్తు చేసి, మీసం మెలేసి తొడ గొట్టారట.
అది చూసి, ప్రజలెక్కడ ఆకర్షించ బడీపోతారోనని భయపడి పోయారో ఏమో, మరో అధికార రాజకీయ నాయకుడు చలన చిత్ర కధా నాయికల్లాగా (పేదలకి ప్రేమని పంచుతున్నారట) గాల్లోకి ముద్దులు విసిరాడట.
వీళ్ళంతా మరికొంచెం ముందుకిళ్ళి, ప్రజల్ని ఆకర్షించడానికి సినిమా హిరోయిన్లలాగా కురచ దుస్తులేసుకుని ప్రజలముందుకు వస్తే?
పాపం! ప్రజల గతేం కాను?
*** *** ***

ఎప్పట్లాగే ముందుగా ఓ కథ చెప్పి, దాని విశ్లేషణ, మన జీవితాల్లో కథాసారపు అనువర్తనా మీకు వివరిస్తానండీ! ఇది భేతాళుడు విక్రమాదిత్యునికి చెప్పిన కథ.

పూర్వం విచిత్రపురం అనే రాజ్యం ఉండేది. దానికి రాజు తంత్రవర్మ. ఇతడు కాస్తభోగలాలసుడూ, మరికాస్త స్వార్ధపరుడూనూ. అయితే ప్రజల అదృష్టం కొద్దీ ఇతడి మంత్రులు కొంత బుద్ధిమంతులు. అందుచేత రాజ్యపాలన కొంత సజావుగా సాగుతూ ఉండేది.

ఇలా ఉండగా, ఓ రోజు, ఈ రాజు అడవికి వేటకు వెళ్ళాడు. మధ్యాహ్నం వరకూ జంతువుల వేటలో గడిపాడు. ఇక విశ్రాంతి తీసికొందామని నది ఒడ్డు చేరాడు. అక్కడ అతడి కొక అందమైన యువతి కన్పించింది. ఆమెని చూడగానే రాజుకి కన్ను చెదిరింది. మెల్లిగా ఆమెని చేరి “ఓ సుందరీ! నీవెవ్వరు? ఇంత నిర్జనారణ్యంలో ఒంటరిగా ఎందుకు సంచరిస్తున్నావు?” అనడిగాడు.

అందుకామె అలవోకగా ఓ చిరునవ్వు నవ్వి “రాజా! నేను ముని కన్యను! ఈ అరణ్యంలోనే మా నివాసం” అంది.

రాజు ఆమె పైన తనకు గల మోహన్ని వ్యక్తపరిచాడు. ఆమె “రాజా! నేను ముని వృత్తిలో నున్నదానిని. మీరు దేశాన్నేలే మహారాజులు. మీలాంటి వారు మాలాంటి వారాని కోరదగునా? కానీ, కోరి మీరు నన్నడిగినప్పడు కాదనడం సరికాదు. నాతల్లిదండ్రులను అర్ధించి నన్ను పొందండి” అంది. వీరిలా మాట్లాడు కొంటూ ఉండగా, హఠాత్తుగా వాళ్ళ ముందో రాక్షసుడు ప్రత్యక్షమయ్యడు. చెట్టంత రాక్షసుడు భీకరంగా గర్జిస్తూ ఒక్కవుదుటున రాజుని గుప్పిట బంధించి మ్రింగబోయాడు.

తంత్రవర్మ ఒక్కపెట్టున పెద్దగా ఏడుస్తూ “వద్దు. వద్దు! నన్ను చంపవద్దు” అన్నాడు.

“ఒక్క షరతు మీద నిన్ను వదిలేస్తాను” అన్నాడు రాక్షసుడు.

“చెప్పు. తప్పక నెరవేరుస్తా” అన్నాడు రాజు.

"నీరాజ్యంలో తల్లిదండ్రులిద్దరూ ఉన్న బాలుణ్ణి, నీకు బదులుగా నాకు సమర్పించేటట్లయితే, నిన్నువదిలేస్తాను" అన్నాడు రాక్షసుడు.

రాజు తంత్రవర్మ సరేనన్నాడు. రాక్షసుడు వదిలిందే క్షణం, రాజధానికి పరుగెత్తాడు. సైనికుల్ని పంపి రాజ్యంలో పేదవారి గురించి ఆరా తీయించాడు. చివరికి ఓ బ్రాహ్మణ కుటుంబాన్ని ఎంచుకున్నాడు. ఆ పేద వారింట భార్యా,భర్త, ముగ్గురు కొడుకులూ ఉన్నారు. వారు ఆపూట కూటికి కూడా లేని పేదవారు. రాజు బ్రాహ్మణ దంపతలకి పెద్దఎత్తున డబ్బాశ పెట్టి వారి ముగ్గురు కొడుకుల్లో ఒకరిని తనకి ధారాదత్తం చెయ్యమని అడిగాడు. [అదే ఇప్పటి పాలకులైతే తన్ని తీసికెళ్ళెవాళ్ళు. పాపం తంత్రవర్మ ఎంత స్వార్దపరుడైనా, ఎంతో కొంత నీతిపరుడే. అందుకే బేరమడిగాడు.]

ఆ బ్రాహ్మణుడు "రాజా! నాపెద్ద కొడుకంటే నాకు చాలా ఇష్టం. రేపు నేను ఛస్తే నాకు తలకొరివి పెట్టవలసింది వాడే కదా! అందుచేత నాపెద్దకొడుకుని ఇవ్వను. మిగిలిన ఇద్దరిలో నీకు కావలసిన వాణ్ణి తీసుకుపో!" అన్నాడు.

అంతలో అతడి భార్య "మహారాజా! నాచిన్నకొడుకంటే నాకు తీరని ముద్దు. అంతే గాక రేపు నేను ఛస్తే, నాకు తలకొరివి పెట్టవలసినవాడు చిన్నవాడు. అందుచేత నా చిన్నకొడుకుని మీరు తీసికెళతానంటే నేను ఒప్పకోను. కావాలంటే మా రెండవకొడుకుని తీసుకుపొండి" అన్నది.

రాజు వారికి డబ్బుచ్చి, రెండో కొడుకుని కొనుక్కున్నాడు. ఆ బాలుణ్ణి తీసికెళ్ళి రాక్షసుడికి సమర్పించాడు. ముదురుగా, అరిషర్వర్గపూరితమైన, దుర్గంధభరితమైన రాజు శరీరం బదులుగా, తనకు ఆహారం కాబోతున్న బ్రాహ్మణబాలుడి లేత శరీరాన్ని ఆబగా చూస్తూ రాక్షసుడు పిల్లవాణ్ణి మింగబోయాడు.

సరిగ్గా ఆ పిల్లవాణ్ణి గుప్పట బిగించి, నోట బెట్టబోతుండగా ఆ బాలుడు గట్టిగా ఫకాలు మని నవ్వాడు. మరుక్షణం రాక్షసుడు పిల్లవాణ్ణి నేలదించి తలెత్తకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు.

భేతాళుడింత వరకూ కథచెప్పి, విక్రమాదిత్యుణ్ణి చూసి "విక్రమాదిత్య మహారాజా! ఎందుకు బ్రాహ్మణ బాలుడు నవ్వాడు? అది చూసి రాక్షసుడు బాలుణ్ణి మ్రింగకుండా ఎందుకు వదిలి పెట్టిపోయాడు? తెలిసీ సమాధానం చెప్పకపోతే నీ తలవెయ్యివక్కలౌతుంది. జవాబు చెప్పి మౌనభంగం చేశావో నేను నీకు అధీనం కాను" అన్నాడు.

విక్రమాదిత్యుడు పెదవులమీద చిరునవ్వు మెరుస్తుండగా,

"భేతాళా! ఆబాలుడి నవ్వులో "ఇరుగు పొరుగు వారు కొట్టవచ్చినప్పుడు కాపాడవలసిన వారు తల్లిదండ్రులు. తల్లిదండ్రులే దయమాలి బిడ్డలను హింసిస్తూ ఉంటే కాపాడవలసిన వాడు రాజు. రాజే కృరుడై ప్రజలని బాధిస్తుంటే కాపాడవలసినది దైవం. అలాంటి దైవమే దయమాలి నన్ను చంపబోతుంటే ఇంక నేమి గతి?" అన్నభావం ఉన్నది. అది చూసి రాక్షసుడే అయినా బాలుడితో పోల్చుకుంటే తనకు గల బలం తాలూకూ దైవత్వాన్ని గుర్తిరిగి రాక్షసుడు పిల్లవాణ్ణి విడిచి పెట్టిపోయాడు" అన్నాడు.

ఇదీ కథ!

ఈ కథలోని సారాంశాన్నే మన పెద్దలు "కంచే చేనుమేస్తే?" అనే సామెత ద్వారా చెబుతుంటారు. అందుకే పెద్దల మాట చద్దిమూట అన్నారు. [చద్దిమూట అంటే నిన్నోమొన్నో వండిన అన్నం అని అర్ధం కాదు. ప్రయాణాల్లో, ఎప్పడు కావాలంటే అప్పడు తినేందుకు, అమ్మకట్టిచ్చిన అన్నం మూట అని అర్ధం. అంటే రెడీ టూ ఈట్ పాకెట్ అన్నమాట]

ఏదేమైనా సామెతలంటే, అలాంటి తక్షణావసరాన్ని తీర్చగల మంత్రాల్లాంటివీ అన్నదీ మాత్రం నిజం.

మనం భౌతిక శాస్త్రంలోనో, కంప్యూటర్ శాస్త్రంలోనో సమస్యలను తక్షణం పరిష్కరించేందుకు వాడే త్యరితగతి సూత్రాల్లాంటివి [అంటే షార్ట్ కట్ ఫార్ములాలన్నమాట] మన పెద్దలు కూర్చిన సామెతలు.

సరే! ఇంతకీ ’కంచే చేను మేస్తే’ అనే సామెత దగ్గరికి తిరిగి వస్తాను.

భేతాళుని కథలోని రాక్షసుడికైనా తనకంటే బలహీనుడైన బ్రాహ్మణ బాలుడి పైన దయ కలిగిందేమో గాని ఈ నాటి ప్రభుత్వాలకు మాత్రం అలాంటి భావాలు, బాధ్యతలు అస్సలు గుర్తుకు రావు.

చూడండీ, అందుకెన్ని తార్కాణాలు మన జీవితాల్నిండా నిండి ఉన్నాయో!


1. ముడి చమురు ధర బ్యారెల్ 147 డాలర్లుకు పెరుగుతున్నప్పడు ప్రభుత్వం ఆఘమేఘాల మీద దేశంలో పెట్రోధరలు పెంచింది. అదే ఇప్పడు 48 డాలర్లుకు పడిపోయినా ప్రభుత్వం ఢంకా భజయించి మరీ పెట్రోధరలు తగ్గించేది లేదని ప్రకటించింది. అదే విమానయాన సంస్థలకి ఇంధనధరలైతే తగ్గించింది.
ఇది కాదా కంచే చేను మేయటం అంటే!

2.దేశంలో కూరగాయల ధరల దగ్గరి నుండి నిత్యావసరాల ధరలు మండి పోతుంటే కిమ్మనని ప్రభుత్వం అభివృద్ధి శాతం పెరిగిందనీ, ద్రవ్యోల్బణం తరిగిందినీ లెక్కలు చెబుతుంది. ‘ధరలు నియంత్రించండి బాబోయ్’ అని ప్రజలు మొత్తుకుంటే కేంద్ర విత్తమంత్రి, మహా చిరాకు పడిపోయి, "రాత్రికి రాత్రి ధరలు తగ్గించటానికి నాదగ్గర మంత్రదండమేం లేదు. ప్రపంచవ్యాప్తంగా ధరలు పెరుగుతున్నయి" అనేశాడు. అదే సెన్సెక్స్ పడిపోతుంటే రోజుకో ప్రకటన చేస్తూ, రెపోరేట్లు తగ్గిస్తూ నానా ప్రయత్నాలు చేస్తోన్నాడు.

ఇది కాదా కంచే చేను మేయటం అంటే?

3.రైతుని విత్తన సంస్థలూ, ఎరువుల సంస్థలూ, దళారులూ నిలువునా ఆర్పేస్తూంటే నిమ్మకు నీరెత్తినట్లుండే ప్రభుత్వం, కార్పోరెట్ వ్యాపారుల ఆస్థూలు కాపాడానికి సెన్సెక్స్ మీద నానా డాన్సులు చేస్తూన్నది.

ఇది కాదా కంచే చేను మేయటం అంటే?

4.రాజకీయనాయకుల జీతభత్యాలని పెంచుకోవడం, వ్యాపారాలు చేసుకోవాటానికి అనుకూలంగా చట్టాలకు సవరణలు చేసుకోవటం తెలుసుకాని, రైతుల పంటలకి మద్దతు ధర పెంచడానికి మాత్రం నానా లెక్కలు చెబుతారు.

ఇది కాదా కంచే చేను మేయటం అంటే?

5. దేశంలో విదేశీకుట్రదారులు యధేచ్ఛగా ఎర్రకోట, పార్లమెంట్ మీద దాడులు, వీధుల్లో బాంబులు వేస్తూంటే నాయకులు వాళ్ళనూ పట్టుకోకుండా ఖండనప్రకటనలు చేయడమేకాకుండా, ప్రజలందరు ముక్తకంఠంతో విద్రోహ చర్యలను ఖండించాలి అంటారు అవేమయినా టపాసులా మనం దగ్గరుండి తీవ్రవాదుల చేత కాల్పించాటానికి? “హలో! మిస్టర్ ప్రెసిడెంట్!” అంటూ 2001 లో భారత ప్రధాని వాజ్ పేయి, పాక్ కాబోయే ప్రెసిడెంట్ [ముషారప్ సైనిక జనరల్ నుండి పాక్ ప్రెసిడెంట్ గా అవతరించే తరుణంలో] బయట ప్రపంచానికి ఇంకా పాక్ ఆవిషయాన్ని ప్రకటించిక ముందే టెలిఫోన్ చేసి విస్మయపరిచాడని అప్పట్లో అన్మి పత్రికలతో పాటు తెలుగు పత్రికలు కూడా [ఈనాడుతో సహ] వ్రాసాయి. భారత నిఘా సంస్థలు అంతటి సామర్థ్యంతో పార్లమెంట్ పై జరిగిన ఆనాటి దాడుల్ని గానీ, కార్గిల్ దురాక్రమణల్ని గానీ, దేశంలోని ప్రముఖ నగరల్లో జరుగుతున్న ఈనాటి బాంబుదాడుల్ని గానీ ముందుగా పసిగట్టి, ఆరికట్ట లేకపోతున్నాయి. ఎంతవిచిత్రం?

ఇది కాదా కంచే చేను మేయటం అంటే?

6. పండుగలప్పడు కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపాలనుకోనే, భారతీయుల భావాల మీద వ్యాపారం చేసేందుకు ప్రభుత్వం, పండుగ ప్రత్యేక బస్సులూ రైళ్ళలో, తత్కాల్ పేరిట ప్రత్యేక ఛార్జీల[దాడులు] మోతలు మోగిస్తూ, లాభలోస్తూన్నాయంటూ కోతలు కోస్తుంది. పైగా రైల్వే మంత్రిగారు రైల్వేలను అత్యంత లాభాలతో నడిపిన అనుభవాతిశయంతో దేశవిదేశీయులకి పాఠాలు సైతం చెబుతున్నారు. మరి ఆ అనుభవం బీహర్ ను అభివృద్ధి చేయటంలో చూపలేదే? అక్కడా తినుడే, ఇక్కడా తినుడే.

ఇది కాదా కంచే చేను మేయటం అంటే?

7. చట్టసభలలో ప్రశ్నలడిగేందుకు సభ్యులు డబ్బులు తీసుకొంటున్నారు, ప్రభుత్వాన్ని పడదోయటానికి లేదా నిలబెట్టటానికి తమ ఓటుకి డబ్బు లేదా పదవులకి [అవి సి.యం.పదవి లేదా కేంద్ర పదవులు లేదా టి.టి.డి. ఛైర్మన్ పదవుల్లాంటివి] అమ్ముడుపోతున్నారు, చివరికి ఆవకాయ నుండి ఆర్మీ వరకు అన్నింటిలోనూ ముడుపులు తీసుకుంటూ దొరికిపోతునే ఉన్నారు.

ఇది కాదా కంచే చేను మేయటం అంటే?

8. బియ్యం ధరలు స్థానిక మార్కెట్లలో భయోత్పతం కలిగిస్తోంటే నియంత్రించాల్సిన ప్రభుత్వం నింపాదిగా ప్రకటనలతో కాలం గడుపుతుంది. మరో ప్రక్క షిప్పుల కొద్ధి బియ్యం బైటకి రహస్యంగా తరలి పోతుంది. రహస్యంగా తరలిపోవటం సాధ్యమా? అధికారులకీ, రాజకీయ నాయకులకీ, మంత్రులకీ తెలీయకుండా షిప్పుల్లో స్మగ్లింగ్ జరగటానికి అదేమన్న సైకిల్ మీద బియ్యం మూటవేసుకొని ప్రక్కఊరికి పోవటమా?

ఇది కాదా కంచే చేను మేయటం అంటే?

9. నిరుద్యోగులు వీధి చివరన చిన్నబడి పెట్టుకొని పొట్టపోసుకొంటే నానా రూల్స్ చెప్పె ప్రభుత్వం, కార్పోరెట్ విద్యాసంస్థలకి, కార్పోరెట ఆసుపత్రులకి సకల సహాయ సహాకారాలు అందిస్తూ, పేద విద్యార్థులకు కార్పోరెట విద్య, పేదావాడికి కార్పోరెటు వైద్యం, 108, 104 అంటూ అవినీతిని కేంద్రీకరించి ప్రజాధనం దోచుకొంటుంది..

ఇది కాదా కంచే చేను మేయటం అంటే?

10. మన ముందు తరాల వాళ్ళు నానా చావులు చచ్చి, ఎన్నో త్యాగాలు చేసి, సత్యాగ్రహాలు చేసి, స్వాతంత్రం తెస్తే, దాన్ని వాషింగ్టన్ లోనూ, వాఘాలాంటి సరిహద్దులలో బెల్లం, చింతపండూ అమ్మినట్లు ప్రస్తుత ప్రభుత్వాలు అమ్మేస్తూన్నాయి.

ఇది కాదా కంచే చేను మేయటం అంటే?

11. కార్పోరేట్ కంపెనీలకీ, అంబానీ సోదరులకీ, మిట్టల్, టాటాలకీ వెసులుబాట్లు కల్పించడానికి రకరకాల చట్టాలు, చట్టాల్లో మార్పులు చేశారు.[ఏ ప్రభుత్వమయినా, ఒకదానితో మరోటి పోటి పడి చేశాయి, చేస్తూన్నాయి.] ఖచ్చితంగా చెప్పాలంటే 200 సంII ఏళ్ళక్రితం పాలెగాళ్ళు భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళకి ధారాదత్తం చేస్తే, ఈనాటి పాలకులు సెజ్ ల పేరుతో భారత రైతుల్ని చావతన్ని పచ్చటి పొలాల్ని, సజీవ గ్రామాల్ని ఎంచక్కా విదేశీయులకి, బడా స్వదేశీయులకి బహుమానంగా ఇస్తూన్నారు. మరో ప్రక్క ప్రాజెక్టులు కట్టి బీడు పొలాలకు నీళ్ళు ఇస్తూన్నామంటూ ప్రకటనలు గుప్పిస్త్నూరు.? ఏమి హాస్యం?

ఇది కాదా కంచే చె చేను మేయటం అంటే?

12.బక్క రైతు రుణం కోసం బ్యాంకు కెళితే, నిరుద్యోగి యువకుడు చిన్న కుటీర పరిశ్రమ కోసం అప్పంటు బ్యాంకు కెళితే బ్యాంకులు చాంతాడంత నియమ నిబంధనలు చెబుతాయి. అదే కార్పోరేట్ కంపెనీల వాటాధరలు [సెన్సెక్స్] పడిపోతుందంటే నేటి కేంద్ర ప్రభుత్వానికి ఎంతగా ప్రాణం విలవిలలాడి పోతుందో!
ఇది కాదా కంచే చేను మేయటం అంటే?

13. గల్లీ స్థాయి నాయకుడి నుండి అమెరికా ప్రెసిడెంట్ స్థాయి నాయకుల వరకూ స్వంత వ్యాపార సంస్థలో లేక కార్పోరేట్ కంపెనీల్లో వాటాలో కలిగిఉన్నారు కాబట్టి, వాటికి లాభం చేకూర్చటానికి చట్టలను సవరించటం గట్రా గట్రా చేస్తూన్నారు.

ఇది కాదా కంచే చేను మేయటం అంటే?

14. చివరిగా చిన్న రహస్యం! దిగిపోయే ప్రభుత్వం, వచ్చేప్రభుత్వం దోచుకోవడానికి అనుకూలంగా కొన్ని చట్టాలు చేసి పోతుంది. అంతేగాక ఓటమి తధ్యమన్నప్పడు ప్రతిపక్షపార్టీ అధికారంలోకి వచ్చేటట్లు, వారికి అనుకూలంగా, పాలక పార్టీ మరిన్ని తప్పలు చేస్తూంది. ఇది చాలా ఆశ్చర్యం. ఇక్కడ మాత్రం వాళ్ళ మధ్య రహస్య ఐక్యత, వ్యవస్థీకృత సర్థుబాటు చాలా ఉంటుంది. ఉదాహరణకు సెజ్ ల మీద బి.జె.పి. చట్టం చేసింది. అలాగే బ్లాక్ మార్కెట్ మీద చర్యలు తీసుకోనే అధికారం, కేంద్రం ప్రభుత్వం చేతిలో ఉండేటట్లు చట్టాలు మార్చారు. దానిని యు.పి.ఏ. ప్రభుత్వం చాలా సంవత్సరాల పాటు బి.జె.పి. ని విమర్శించింది కాని చట్టాన్నిమాత్రం తన చేతి నుండి వదులుకోలేదు.

ఇది కాదా కంచే చేను మేయటం అంటే?

ఇలా అన్నిరకాలుగా కంచే చేను మేస్తుంటే, చేను ఏం చేయ్యాలి?
నిట్టూరుస్తూ నిసృహాయంగా చచ్చిపోవాలా?
ఆక్రోశిస్తూ కృంగి కృశించి నశించాలా?
“ఆ ఇదంతా మామూలే! ఇవన్నీ పట్టించుకొంటే ఎలా?” అని చేనులోని ఏ మొక్కకా మొక్కా అనుకొంటూ, నిర్లక్ష్యంగా కాలం గడపాలా?

ఏం చేయలబ్బా?

ఇందులకేదో నిమిత్తముండి యుండవలయును

ముందుగా చిన్నకథ వ్రాసి మన జీవితం మీద దాని అనువర్తనతో నాబ్లాగు అతిధులందర్నీ అలరించాలను కొంటున్నానండీ!

ఈ కథ పంచతంత్రం లేదా సంపూర్ణ నీతి చంద్రికలోని పాచి చద్ది కథ. అయితే దాని అనువర్తన అంటే అప్లికేషన్ మాత్రం మన జీవితంలో నిత్యసత్యమైనది.

మిత్రలాభంలో హిరణ్యకుడనే ఎలుక తన గత వృత్తాంతం [ప్లాష్ బ్యాక్] చెప్పే సందర్భంలోనిదీ కథ.

ఇక కథలోకి వస్తాను.

చంపకవతి అనే పట్టణముండేది. అక్కడ సన్యాసులు చాలా మంది నివసిస్తూ ఉండేవాళ్ళు. వారిలో చూడాకర్ణుడనే సన్యాసి ఒకడుండే వాడు. అతడి కుటీరంలో హిరణ్యకుండనే ఎలుక ఓ కలుగు చేసికొని ఉండేది. ప్రతిరోజూ చూడా కర్ణుడు తాను భోజనం చేశాక మిగిలిన వంటకాలని భిక్షాపాత్రలో పెట్టి చిలుక కొయ్య మిద పెట్టి నిద్ర పోయేవాడు.

ఈ ఎలుక చప్పుడు చేయకుండా వచ్చి, చిలుక కొయ్య మేదికెగిరి ఆ వంటకాలని తినేసి పోతూ ఉండేది. ఓ రోజు చూడకర్ణుడు తనస్నేహితుడైన వీణాకర్ణుడనే మరో సన్యాసితో మాట్లాడుతూన్నాడు. కానీ అతడి దృష్టంతా చిలకకొయ్య మీదేఉంది. మాటిమాటికి పైకి చూస్తూ చేతికర్రతో నేలమీద అప్పుడప్పుడూ తట్టూతూ ఎలుకని దడిపించే పనిలో కొంత మునిగి ఉన్నాడు.

అది చూసి వీణాకర్ణుడు "చూడాకర్ణుడా! ఎందుకలా మాటిమాటికి పైకి చూస్తూ నేలమీద కర్రతో తట్టుతున్నావు?" అని అడిగాడు.

చూడాకర్ణుడు "ఒక ఎలుక ప్రతిదినము చిలుకకొయ్య మీదికి ఎగిరి భిక్షా పాత్రలోని పదార్ధాలని తిని పోతున్నది. నాకు దీని బెడద ఎక్కువుగా ఉన్నది" అన్నాడు.

అదివిని వీణా కర్ణుడు చిలుక కొయ్యవైపు చూశాడు. అది నేల నుండి సుమారు అయిదారు అడుగుల ఎత్తున ఉంది. "ఎక్కడి ఎలుక? ఎక్కడి చిలుకకొయ్య! ఇంత అల్పజంతువునకు అంతఎత్తుకు ఎగిరే బలమెక్కడి నుండి వచ్చినది. మామూలు ఎలుకలు రెండు మూడడుగుల కంటే ఎత్తుకు గెంతలేవే? ఇది అయిదారడుగులు ఎలా ఎగిరి చిలుకకొయ్యమీది పద్దార్ధాలు మ్రింగగలుగుతోంది? ఇందులకేదో నిమిత్త ముండి యుండవలయును.

ఒకసారి నేనో బ్రాహ్మణుని ఇంట భిక్షకు పోయి ఉంటిని. అదే సమయంలో ఆబ్రాహ్మణుడు తనభార్యను చూచి "రేపు అమావాస్య. బ్రాహ్మాణులకు భోజనము పెట్టవలయుసు. ఏమేమి వంటకాలు చేయగలవు?" అన్నాడు. దానికావిడ కొంత పెడసరంగా "మగవాళ్ళు వస్తుసంభారాలు తెచ్చి, ఇంటపడేస్తె ఆడవాళ్ళు వండి వార్చుతారు గానీ, మీరు తేనిసరుకులు ఎక్కడి నుండి వస్తాయి?" అంది.

అదివిని అతడు కోపంగా "ఉన్నంతలో జరుపుకోవాలి గానీ, ఆర్భాటం చేయాలని పేరాస పడకూడదు" అన్నాడు.

దానికావిడ సౌమ్యంగా "అలాగే కానివ్యండి. రేపటి కార్యక్రమం ఉన్నంతలోనో సరిపెడతాను" అనిచెప్పంది. తర్వాత నువ్వులు కడిగి, దంచి ఎండపోసింది. ఆ రోజు ఎండ తీవ్రంగా ఉండటంతో నేను వారింటి ఎదురు చెట్టునీడలోని అరుగు మీదే విశ్రమించాసు. ఇంతలో ఓ కోడి వచ్చి ఆబ్రాహ్మణి ఆరబోసిన నువ్వులు కాళ్ళతో జీరి చెలిగి పారేసింది.

బ్రాహ్మణుడది చూసి, "ఈ నువ్వులు అంటుపడ్డవి. బ్రాహ్మణ భోజనానికి పనికి రావు. కాబట్టి వీటిని మారకం వేయి" అని భార్యకు చెప్పాడు. ఆవిడ సరేనని వాటిని చేట కెత్తింది. ఇంతలో నేను ఆవీధిలోని మరో ఇంటికి భిక్షకు పోయాను. ఆ బ్రాహ్మణి సరిగ్గా ఆ ఇంటికే వచ్చి "వదినా! ఈ నువ్వు పప్పు పుచ్చుకొని నువ్వులిస్తావా?" అని ఆఇంటి గృహిణిని అడిగింది. పాపమా ఇల్లాలు ఆనందంగా అంగీకరించి చేటలో నువ్వులు తీసికొని వచ్చి ఈమెతో మాట్లాడుతూ ఉంది. అంతలో ఆమె భర్త వచ్చాడు. "ఏమి బేరమాడు తున్నావు" అన్నాడు.

ఆవిడ సంతోషంగా "చేరడు నువ్వులిచ్చి దంచిన నువ్వుపప్పు పుచ్చుకొంటున్నాను" అంది.

ఆవిడ భర్త, ఆమాటలు విని "ఓసి వెర్రిదానా! చేరడు ముడి నువ్వులకు బదులుగా ఎవరయినా దంచిన నువ్వుపప్పులిచ్చెదరా! ఈమె ఇలా తెచ్చి ఇవ్వడానికి ఏదో రహస్యకారణం ఉండి ఉంటుంది. కాబట్టి ఆ నువ్వుపప్పు పుచ్చుకోకు" అన్నాడు.

అలాగే ఈ ఎలుకకు ఇంత బలం ఉండటానికి ఏదో రహస్య కారణం ఉండి ఉంటుంది. కారణం లేకుండా ఏవీ సంభవించవు" అంటూ ముగించాడు వీణా కర్ణుడు.

అదివిని సాలోచనగా చూడాకర్ణుడు "చూడగా ఈ ఎలుక ఇక్కడే ఎక్కడో ఓ కలుగు చేసికొని ఉంటున్నట్లుంది. దానికింత బలం ఉండాటానికి నిమిత్తమేది తెలిసినదికాదు. త్రవ్వి చూచెదను గాక" అన్నాడు.

ఆ తర్వాత చూడాకర్ణుడు ఒక గునపం తెచ్చి కుటీరమంతా వెదికి ఎలుక కలుగును కనిపెట్టి, తవ్వి పారేసాడు. ఆశ్చర్యం! మామూలుగా ఎలుక కలుగులో వడ్లూ, బియ్యం, గోధుమలులాంటి ధాన్యమో మరేదైనా తిండితిప్పలో ఉంటాయి గదా! కాని హిరణ్యకుడి కలుగులో కొన్ని బంగారు, వెండి నాణాలు కూడా ఉన్నాయి.

[నిజంగానే కొన్ని ఎలుకలు బంగారు, వెండి లాంటి మెరిసేవాటిని కలుగుల్లోకి లాక్కెళతాయి తెలుసా! నా చిన్నప్పుడు మాపిన్ని రెండు వరుసల బంగారు మంగళ సూత్రం గొలుసు పోయింది. ధాన్యం బస్తాలున్న గదిలో ఆవిడా, ఆవిడ భర్తా నిద్రపోయేవాళ్ళు. గొలుసుపోయిన తగాదాలో ఉమ్మడి కుటుంబం కాస్తా వేరు కాపురాలు పడ్డాయి. ఆర్నెల్ల తర్వాత, ధాన్యం బస్తాలు తీసినప్పుడు, బస్తాలు క్రింద ఎలుక కలుగు కనబడింది. తవ్వితే కుంచెడు [రమారమి రెండు కిలోలు] వడ్లూ, వాటితో పాటే బంగారు గొలుసు, ఇంకా మెరిసే పట్టు లేసుతాళ్ళు కనబడ్డాయి. శాస్త్రీయ కారణం నాకు తెలీదుగానీ కొన్ని ఎలుకలకి బంగారు రంగు మీద మోజుంటుందని మాత్రం చెప్పగలను.]

చూడాకర్ణుడు ఆనందంగా ఆ వెండి బంగారు నాణాల్ని సంగ్రహించి వీణా కర్ణుణితో "నీవు చెప్పినది నిజమే. ఈ ఎలుక దగ్గర రహస్య సంపద ఉన్నది. అందుకే దానికి మామూలు ఎలుకల కన్నా చాలా ఎక్కువ బలం ఉంది" అని చెప్పాడు.

కాబట్టి ప్రతీ అసాధారణ విషయం వెనుకా ఏదో కారణముండి ఉంటుంది.

అంటే ప్రతీదాని వెనుకా ....

ఇందుల కేదో నిమిత్త ముండి యుండవలయును.
ఎలాగంటే ……..
1. 2001 వరకు ప్రపంచవ్యాప్తంగా అందరూ అన్న మాట, మనం విన్నమాట. అమెరికా నిఘా సంస్థ సి.ఐ.ఏ. కి ప్రపంచంలో ఎక్కడ ఏచీమ చిటుక్కుమన్నా విన్పిస్తుంది అని. అలాంటి సి.ఐ.ఏ. మీదికి, ఆమెరికా డబ్యూ.టి.సీ. మీదికి ఇస్లాం తీవ్రవాద సంస్థ [ఆల్ ఖైదా లేదా తాలిబాన్లూ లేదా బిన్ లాడెన్ అనుచరులు] దాడి చేస్తే, పాక్ లాంటి చిన్నదేశం, ఐ.ఎస్.ఐ. లాంటి చిన్న నిఘా సంస్థ [అమెరికాతో పోలిస్తే పాక్ చిన్న దేశమే గదా! ] అమెరికా లాంటి అగ్రదేశం, సి.ఐ.ఏ. లాంటి గొప్పనిఘా సంస్థ పాక్ నూ ఏమి చేయలేక పోతుంది. [తాలిబాన్లనూ, లాడెన్ లకూ తలదాచుకూనే గూడైన సరే!] పాక్ లాంటి చిన్నదేశం, ఆమెరికా లాంటి అగ్రదేశాన్ని లెక్కచేయడం లేదు. మీదు మిక్కిలి ఏ పార్టీ వారైనా అమెరికా ప్రెసిడెంట్లు మాత్రం పాకిస్తాన్ ని ముద్దుగా బుజ్జగిస్తోనే ఉన్నారు.

ఎక్కడి పాక్! ఎక్కడి అమెరికా!
ఎక్కడి ఐ.ఎస్.ఐ! ఎక్కడి సి.ఐ.ఏ.
పాక్ కీ, ఐ.ఎస్.ఐ. కీ ఇంత బలం ఉండటమేమిటి?
ఇందుల కేదో నిమిత్త ముండి యుండవలయును.


2. అఖండ భారతం నుండి వేరుపడ్డ దేశాలు పాకిస్తాన్, బాంగ్లాదేశ్ లు. బాంగ్లాదేశమైతే భారత్ సాయంతో ప్రాణం పోసుకున్న పసికూన [క్రికెట్ భాషలో] అలాంటి బాంగ్లా ముస్లిం తీవ్రవాదులు, పాక్ ముస్లిం తీవ్రవాదులతో కలిసి భారత్ నడిగడ్డపై బాంబులతో పిల్లకాయలు గోళీ కాయలతో ఆడుకున్నంత సులభంగా ప్రజల ప్రాణాలతో ఆడుకొంటుంటే, ఏ ఇంటి దొంగలు సహకరిస్తోన్నారో గానీ, నిఘా సంస్థలు ముందుగా ప్రమాదాన్ని పసికట్టలేక పోతున్నాయి. ప్రమాదాన్ని పసికట్టనే లేని చోట, నివారణ కలలోని మాట కదా! ఇంటి మంత్రి నింపాదిగా సూట్లు మారుస్తూ, క్రాఫ్ సవరించుకొంటూ ఖండన ప్రకటన చేస్తాడు. ప్రధమ మంత్రి గారు ఇది పిరికి చర్య అంటూ విచారం ప్రకటిస్తారు. ఇంక కుర్చీ వ్యక్తి [చైర్ పర్సన్ అన్నమాట] విచార వదనంతో ఆసుపత్రిని సందర్శించి బాధితుల్ని ఓదారుస్తారు. ఇదంతా ఇంత నాటకీయంగా జరుగుతోందంటే

ఇందులకేదో నిమిత్త ముండి యుండవలయును.

3. ఇందిరా గాంధీ లాంటి కాంగ్రెసు అధిష్ఠాన అధి నాయకురాలికే 1966 లనాటి నుండి 84 దాకా మొరార్జీ దేశాయి నుండి నీలం సంజయరెడ్డి, కాసు బ్రహ్మానంద రెడ్డి, దేవరాజ్ అర్స్ లదాకా అందరూ అసమ్మతి సెగపెట్టగలిగిన వారే. రెడ్డి కాంగ్రెసులు, అర్స్ కాంగ్రెసులూ అంటూ ఆవిడ పార్టీని నిట్టనిలువుగా బోలెడు సార్లూ చీల్చగలిగిన వారే! ఇక ఆవిడ అనువంశిక పాలన గురించి, నియంతృత్వ పోకడల గురించి ప్రింట్ మీడియా ఎంత ఉతికి పారేసిందో మనందరికీ తెలుసు.

ఆశ్చర్యకరంగా ఈనాటి కాంగ్రెసు అధిష్ఠానానికి ఎదురుతిరగాలంటే అర్జున సింగ్ లాంటి సీనియర్లు అదిరిపోతారు, శివరాజ్ పాటిల్ లాంటి సీనియర్లు వినయవిధేయితలు చూపడానికి పోటీ పడతారు, అసమ్మతి చూపడం అంటే కలలో కూడా కలవరపడి లేస్తారు. అసమ్మతి చూపిస్తే దశాబ్దాల సీనియారిటీ గల మార్గరెట్ ఆల్వాలాంటి వ్యక్తులు, క్రమశిక్షణా చర్యలకు గురై తెరమరుగౌతారు. ప్రింట్ మీడియా అయితే కిక్కురు మనదు. మరి ఇంతటి అసాధారణ పట్టు కాంగ్రెసు అధిష్ఠానికి ఉందంటే

ఇందులకేదో నిమిత్తముండి యుండవలయును.

4. ఆంధ్రప్రదేశ్ లో 1956 నుండీ ఈనాటి దాకా కాంగ్రెస్ ముఖ్యమంత్రులెవరూ …. నీలం సంజీవ రెడ్డి నుండీ దామెదరం సంజీవయ్య, కాసు బ్రహ్మనంద రెడ్డి, పి.వి. నరసింహ రావు, జలగం వెంగళ రావు, మర్రి చెన్నారెడ్డి, నేదురమల్లి జనార్ధన రెడ్డి, కోట్ల విజయ భాస్కరరెడ్డి దాకా ఏ ఒక్కరు అసమ్మతి సెగ తప్పించుకోలేక పోయారు. గట్టిగా ఐదేళ్ళు కాదు, మూడెళ్ళు కూడా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోలేక పోయారు. అలాంటిది 2004 సుండి ఈనాటి వరకు ఒకే వ్యక్తి ఏకఛత్రాధిపత్యంగా కదలకుండా ఐదేళ్ళూ కాంగ్రెస్ ముఖ్యమంత్రి కుర్ఛీలో కూర్చో గలిగాడంటే ....

ఇందులకేదో నిమిత్త ముండి యుండవలయును.

5. చివరగా, మన ఆఫీసులో మన కోలిగ్ సుబ్బారావుకి బాస్ దగ్గర మనందరి కంటే మస్తుహవా
నడుస్తోందంటే
ఇందులకేదో నిమిత్త ముండి యుండవలయును.

కోపం, సహనం లేదా శాంతం. ఈ ద్వంద్వం మన జీవితంలో ఎంతో ముఖ్యమైనది. కోపం, సహనం. మొదటిది శతృవు, రెండోది మితృవు. కాని మనలో అసలు కోపం అన్న గుణమే లేకపోతే లేదా సహనం ఎక్కువైతే అది అసమర్ధతకి , నిష్క్రియా పరత్వానికి [అంటే ఏపనీ చేయకపోవటానికీ దారి తీస్తుంది.

కాబట్టే జీవితంలో ఏ ద్వంద్వమైనా వాటి పరిమితికి లోబడి వుండాలి. ఒక హద్దు దాటితే సహనం మన శతృవు గాను, కోపం మితృవుగాను మారిపోగలవు. ఏ భావానికి ఏది పరిమితో, ఏ అవధి వరకూ ఏ భావన ఆయా పరిస్థికి అవసరమో తెలిసివుండటమే వివేకం, వివేచన.


తన కోపమే తనకు శతృవు, తన శాంతమే తనకు రక్ష.


ఈ సూక్తిని మనం ఎన్నో సార్లు చదివి వుంటాం, విని వుంటాం. పదే పదే ఇలాంటి సూక్తులు విన్నప్పుడు "అబ్బా నీతులతో పిచ్చెక్కిపోతోంది. ఈ నీతుల బదులు నాలుగు జోకులు చెప్పచ్చుగదా!" అని విసుక్కునీ వుంటాం.


కోపం, సహనం అనే శతృమితృల గురించి చర్చించే ముందు రెండు చిన్న వాస్తవ సంఘటనల్ని మీకు వివరిస్తాను.


1]. కొన్నినెలల క్రితం, తమిళనాడు లో జరిగిందీ సంఘటన.


ఓ చిన్ని కుటుంబం బస్టాండుకు వచ్చింది. భర్త, భార్య, ఆమె చేతుల్లో నెల వయస్సున్న చిన్ని బిడ్డ. ఇంతలో బస్సు వచ్చింది. భర్త బస్సుని ఆపాడు. చేతిలో చిన్న బిడ్డతో తల్లి బస్సెక్క బోయింది. బస్ కండక్టర్ తగినంత సమయం ఇవ్వకుండా, ఆమె బస్సు ఎక్కక ముందే విజిల్ ఊదాడు. డ్రైవరు బస్సుని ముందుకు కదిలించాడు. ఆవిడ ముందుకు తూలిపడబోయి నిలదొక్కుకుంది. అది చూసి భర్తకి చాలా ఆందోళన ఆపై కోపం వచ్చాయి. అతడు బస్సు కండక్టర్ ని తిడుతూ, కండక్టర్ కాలరు పట్టుకొని ఒక్క వుదుటున క్రిందికి గుంజాడు. కండక్టర్ అమాంతం క్రిందికి పడ్డాడు. అదే సమయంలో డ్రైవరు బస్సుని ముందుకు దూకించడంతో కండక్టర్ అదే బస్సు చక్రాలక్రింద పడి నలిగిపోయాడు. క్షణాల్లో ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఈ వ్యక్తిని పోలీసులు అరెస్తు చేసి కేసు పెట్టారు. తర్వాత జైలు కెళ్ళాల్సి వుంటుంది. [ఈ వార్తని వార్తాపత్రికల్లో చదివాను.]


ఒక్క క్షణంలో ఇద్దరి జీవితాలో దారుణం జరిగిపోయింది. ఎవరీ దారుణాన్ని వాళ్ళ జీవితాల్లోకి ప్రవేశపెట్టారు? ఒకవేళ ఆ కుటుంబం బస్సుని అందుకోలేక పోయినంత మాత్రాన ఏం నష్టం? ఇక బస్సులే వుండవా? ఒక వేళ లేకున్న ప్రయాణం ఆగిపోతుంది. గాని ప్రాణాలు పోవుకదా! ఒక్క క్షణం బస్సు కండక్టర్ వేచి వుండి, ప్రయాణీకుల్ని బస్సుఎక్కనిస్తే ఏం ప్రమాదం ముంచుకొస్తుంది? సరే! ఈ బస్సు కండక్టర్ కి తన వృత్తి పట్లా, వృత్తి బాధ్యతపట్లా నిబధ్ధత లేదు. ఓ తల్లి పట్లా, ఆమె చేతుల్లోని రోజుల బిడ్డ పట్లా సానుభూతి, సహకారం లేవు. అయితే ఆమె భర్తకి కండక్టర్ మీద కలిగిన కోపంతో ఏం సాధించాడు? ఇద్దరిలో కనీసం ఏ ఒక్కరికైనా తమ కోపం మీద, అహం మీదా ఏమాత్రం నియంత్రణ ఉన్నా , రెండు కుటుంబాలు ప్రశాంతంగా బ్రతికేవి కదా! ఆ వ్యక్తి, బస్సు కండక్టర్ - ఇద్దరూ హాయిగా ఉండే వారు గదా! తన భార్యాబిడ్డలు ఇబ్బంది పడటం, ప్రమాదం బారిన పడతారేమో అన్న ఆలోచననే అతడు భరించలేక పోయాడు. తాను జైలు కెళ్ళాక వాళ్ళు అనాధలవ్వడాన్ని ఎలా భరించగలడు?


ఈ దారుణానికి మూల కారణం ఏమిటి? కోపమే కదా! అతడు కొన్ని క్షణాలు తన కోపాన్ని నియంత్రించు కోగలిగి ఉంటే, లేదూ ఒక్క క్షణం సహనం తో ఉండ గలిగి ఉంటే అతడి జీవితం ఎలా ఉండేది? పోనీ, ఆ బస్సు కండక్టర్ ఒక్కక్షణం తన అహన్ని, తొందరపాటునీ నియంత్రించు కొని ఉంటే అతడు, అతడి కుటుంబమూ హాయిగా ఉండే వాళ్ళు కదా!


2.] మరో సంఘటన. ఈ మధ్యనే, తిరుపతిలో ఓ వైద్యురాలు ఆత్మహత్య చేసుకొంది. సహాధ్యాయిని ప్రేమించి పెళ్ళాడిన యువతి . భర్తతో తగవు పడి, స్నానాల గదిలో ఉరిపోసుకొని చనిపోయింది. చదువుకొని జీవితంలో చక్కగా స్థిరపడీ, ఆమె తన జీవితాన్ని కడతేర్చుకోవడమే గాక భర్త జీవితాన్ని అశాంతిలోకి, సమస్యల్లోకి నెట్టివేసింది. భార్యాభర్తల అసహనం వారి జీవితాల్ని నాశనం చేసింది. ఇద్దరిలో ఏ ఒక్కరైనా కొన్ని క్షణాలు కోపాన్ని నిగ్రహించుకోగలిగినా, లేదూ కొన్ని క్షణాలు సహనంతో ఉండగలిగినా, ఇద్దరి జీవితాల్లోనూ అంత దారుణ విషాదం సంభవించ కుండా ఉండేది కదా! ఇందులో మరింత దారుణం ఏమిటంటే ఆమె 5 నెలల గర్భవతి కూడాను. ఈ లోకం లోకి రాక ముందే, అమ్మ బొజ్జలోనే ఓ బుజ్జి ప్రాణి ప్రాణాలు కోల్పోయింది.


ఇలాంటి ఎన్నో సంఘటనల్ని ప్రతిరోజూ మన చుట్టూ గమనిస్తూనేఉన్నాం. కోపం పెరిగీ, సహనం తరిగీ మనమూ తరచూ చేదు అనుభవాల్ని ఎదుర్కొంటూనే ఉన్నాం.


ఈ నేపధ్యంలోనే చిన్నప్పుడు మనం అంతా, చదివి వదిలేసిన ఓ చద్ది మరియూ పాత పంచతంత్రం కథని మళ్ళీ ఓసారి మీ దృష్టికి, క్రొత్త దృష్టితో చూడమన్న అభ్యర్ధనతో తీస్తుకొస్తున్నాను.


ఆపరీక్షితకారి అనే బ్రాహ్మణుని కథ


ఒకా నొకప్పుడు గౌడ దేశం లోని ఓ అగ్రహారం లో దేవశర్మ అనే బ్రాహ్మణుడు ఉండే వాడు. అతడు వేదాల్ని, సకల శాస్త్రాల్ని అధ్యయనం చేశాడు. అరిషడ్వర్గాల్ని [ఆరు భావోద్రేకాలు: కామ, క్రోధ, లోభ , మోహ, మద, మాత్సర్యాలు] అధిగమించడ మెలాగో తెలిసినవాడు.


అతడికి సంతానం లేదు. ఇది తప్ప అతడికి మరే కొరతా లేదు. అతడి భార్య యాఙ్ఞసేని. తనకు సంతానం లేకపోవడం చేత ఆవిడ బిడ్డల తల్లులైన తన ఇరుగుపొరుగు స్త్రీలను చూసి ఎంతో ముచ్చట పడుతుండేది బిడ్డల కోసం ఆరాటంతో ఆవిడ సాధువుల్ని, సాధువేష ధారుల్నీ కూడా భక్తిగా కొలిచేది. స్వాముల కాళ్ళ మీద పడి వేర్లూ, తాయత్తులూ కట్టించు కొంటూ ఉండేది. రాయి కనబడితే రాయికి, గుడి కనబడితే గుడికీ మ్రొక్కేది. ఎవ్వరే తీర్ధం పేరు చెబితే ఆ తీర్ధానికి పోయి మునకలు వేసేది. లోకంలో లేని వ్రతాలూ, నోములూ నోచేది. ఇలా కొంత కాలం గడిచింది.

కొన్నాళ్ళకి దేవుడి దయ కలిగిందో ఏమొ, యాఙ్ఞసేని గర్భవతై పండంటి కొడుకుని కన్నది. లేక లేక పుట్టిన బిడ్డని దేవశర్మ, యాఙ్ఞసేని ఆ బిడ్డని అపురూపంగా పెంచసాగారు. కంటికి రెప్పలాగ కాపాడుతూ, బిడ్డని గుండెల మీద బెట్టుకు పెంచుతూండె వారు. పిల్లవాడి పాదాలు తల్లిదండ్రుల అరచేతుల్లో తప్ప నేల నంటనంత అపురూపంగా కొడుకుని పెంచసాగారు.

ఓ రోజు యాఙ్ఞసేని కొడుకుకి స్నానం చేయించి, పాలిచ్చి, నిద్రపుచ్చి వుయ్యాలలో పడుకోబెట్టింది. బిడ్డని జాగ్రత్తగా చూస్తుండమని భర్తకి చెప్పి, ప్రక్క వీధి లోని పుట్టింటికి వెళ్ళింది.

ఆ రోజు పర్వదినం కావటంతో ఆ నగరపు రాజు దేవశర్మకు పవిత్రదానమియ్య దలిచి ఆహ్వానం పంపాడు. దేవశర్మకు రాజు గారిచ్చే ద్రవ్య కనక వస్త్ర ధాన్య దానం అత్యంత అవసరం.

అతడికేం చేయాలో తోచలేదు. "చాలా కాలం తర్వాత రాజుకి నా మీద దయ కలిగింది. పండిత ప్రకాండులెందరో ఉండగా దానం నాకే ఇవ్వదలిచి కబురంపాడు. నా భాగ్యమిట్లుండి , రాజు ఆహ్వానం పంపగా, నా అభాగ్య దేవత ఈ సంధర్భం లోనే నాకీ ఇబ్బంది తెచ్చి పెట్టింది. నా భార్య ఎప్పుడు రావాలి, నేనెప్పుడు రాజమందిరానికి పోవాలి. పోనీ నా భార్య రాక పోయినా రాజుమందిరానికి పోదామంటే పిల్లవాడికి రక్షణ గా ఇంట్లో ఇంకెవ్వరూ లేరు ఆలస్యం చేస్తే రాజు ఈ దానాన్ని ఇంకెవ్వరికైనా ఇచ్చేయగలడు . ఏం చేయను? ఓ వుపాయం ఉన్నది. నా ఇంట పెంపుడు ముంగిస వున్నది గదా! ఎంతో కాలం నుండీ దాన్ని నేను ప్రేమగా పెంచున్నాను . ఈ ముంగిని నా బిడ్డకు కాపలాగా పెట్టి రాజ మందిరానికి వెళ్తాను. దానం పుచ్చుకొని ఇంటనున్నట్లే పరుగెట్టుకొని వెనక్కి వస్తాను."

ఇలా ఆలోచించి దేవశర్మ తన పెంపుడు ముంగిసని చేతుల్లోకి తీసికొని, ప్రేమగా దాని శరీరం నిమిరి, ఊయలలోని బిడ్డని చూపించి కాపుండ మని సైగలతో సూచించి రాజమందిరానికి పోయాడు . ఆచారప్రకారం దానం పుచ్చుకొని రాజుని దీవించి పూజాదికాలు నిర్వహించాడు. ఆ అరఘడియ పాటూ అతడి దేహం రాజ మందిరం లోనూ, మనస్సు ఇంట వుయ్యాల లోని కొడుకు మీదనూ వున్నాయి.

ఆ సమయం లో ఓ నల్ల త్రాచు వారింటి మిద్దె పైనుండి లోనికి జారి ఉయ్యాల తాడు మీదుగా బిడ్డ పానుపు పైకి ప్రాకుతోంది. ముంగిస పాముని చూసింది. రాబోయె ప్రమాదం పసి కట్టింది. ఒక్క ఉదుటున పైకెగిరి పాము మెడ పట్టుకొంది. పాముని ముక్కలు ముక్కలు చేసి నేల మీద పారేసింది. రక్తపు చుక్కలు నేలంతా పడ్డాయి.

ఇంతలో దేవశర్మ రాజ మందిరంలో ఆచార వ్యవహారాలు పూర్తి చేసుకొని, దానం పుచ్చుకొని ఇంటి ముఖం పట్టాడు. కొడుకు మీది ప్రేమ, అభద్రతా తనని తరుముతుండగా కాలి మడమలు నేలనంటనంత వేగంగా ఇల్లు చేరాడు.

ముంగిస తన యజమాని పద సవ్వడి విన్నది యజమాని బిడ్డని కాపాడాను కదా అన్న ఆనందంతోనూ , తనకి అప్పగించిన పనిని విజయవంతంగా చేసేను గదా అన్న సంతోషం తోనూ, యజమాని పట్ల దానికి గల ప్రేమ తోనూ, ముంగిస పరుగున దేవశర్మకు వీధి వాకిట్లోకి ఎదురుబోయింది. దాని నోరు రక్తం తో నిండి ఉంది. లోని గది లోనుండి వీధి వాకిలి వరకూ రక్తపు బిందువులు పడి ఉన్నాయి.

ఎంతో ప్రేమ తోనూ, కృతఙ్ఞత తోనూ, ముంగిస దేవశర్మ కాళ్ళు నాకుతున్నది. దేవశర్మ ముంగిసనీ, దాని రక్తపు మూతినీ చూసాడు. ఒక్కసారిగా అతని గుండె బ్రద్దలైనంత పనయ్యింది. తుఫానులో ఊగే చెట్టులా అతని శరీరం వణికింది. ముంగిస తన బిడ్డని చంపి ఉంటుందని ఈ బ్రాహ్మణుడు అనుకొన్నాదు. విపరీతమైన కోపం తో ఊగి పోయాదు.

"ఓసి పాపిష్ఠి దాన! ఎంతోకాలం నుండి చేర దీసి పెంచానన్న కృతఙ్ఞతైనా లేదే నీకు? ఎలా చంప గలిగావు నా బిడ్డని" అంటూ మితిమీరిన కోపం తోనూ, ఆ చిన్ని ముంగిస కన్నా ఎంతో బలమైన వాడి నన్న అంతర్గత అహం తోనూ, ముందు వెనుకలు ఆలో చించని తొందర పాటు తనం తోనూ, లావు పాటి కర్రతో ముంగిస నెత్తిమీద బలంగా కొట్టాడు.

ఆ దెబ్బ సరిగ్గా ముంగిస తల పైన ఆయువు పట్టు పైన తగిలింది దాని కనుగ్రుడ్డ్లు వెలికి వచ్చాయి. నేల మీద పడింది . హోరుగాలిలో చిరుకొమ్మలా విలవిల లాడింది. పెద్దగా ఒక్క అరపు అరిచి ప్రాణాలు విడిచింది. తానెంతో ప్రేమగా దగ్గరికి వస్తే యజమాని ఎందుకు తనని కొట్టాడో అర్ధం కాని అమాయకత్వం దాని కళ్ళల్లో ఉంది. తానెంతో భాధ్యత గా యజమాని కొడుకు ప్రాణం కాపాడితే, అతడెందుకు తనని చావ గొట్టాడో అర్ధం కాని అయోమయం దాని చూపుల్లో ఉంది. ఆ బాధని చావు దాని కళ్ళల్లో శాశ్వతం చేసింది.

ఇదేమీ దేవశర్మ పట్టించు కోలేదు. అతడక్కడ ఆగనూ లేదు. ఇంటిలోనికి ఒక్క అంగలో పరుగు పెట్టాడు. గట్టిగా ఏడుస్తూ ఉన్నాడు. కొడుకు చని పోయి ఉంటాడని మానసికంగా సిధ్ధమై పోయాడు. ఒక్క ఉదుటున ఉయ్యాల చేరాడు . ఉయ్యలలో పరుపు మీద బిడ్డ ఆదమరచి నిద్రిస్తూనే ఉన్నాడు. బిడ్డని సజీవంగా చూసాక గాని దేవశర్మ ఆవేశం, ఆక్రోశం తీరలేదు. అప్పటికి గాని అతనికి బాహ్య స్పృహ కలగ లేదు. అప్పుడు చూశాడతడు నేల మీద పడి ఉన్న నల్ల త్రాచు శరీర ఖండాల్నీ, రక్తపు బిందువుల్నీ.

అప్పటికి గాని అతడికి పరిస్థితి అర్ధం కాలేదు. ఇప్పుడతడు ముంగిస కోసం ఆక్రోశపడ సాగాడు. రొమ్ము మీద, గుండెల మీద, తల మీద, కడుపు మీద కొట్టుకుంటూ బిగ్గరగా ఏడ్వటం మొదలు పెట్టాడు.

"ఎంత మూర్ఖుణ్ణి నేను! నా పెంపుడు ముంగిస నా బిడ్డ ప్రాణాలు కాపాడింది. నిజం చెప్పాలంటే నా ప్రాణాల్నే కాపాడింది. కానీ, నేనది నా బిడ్డని చంపేసిందనుకొన్నాను. అది ప్రేమగా నా దగ్గరికి వస్తే, నేను దాన్ని చంపి వేశాను. ఏ విషయమూ పరిశీలించ లేదు. ఒక్క నిముషమైనా ఆలోచించ లేదు. కొద్ది క్షణాలు ఆగి ఉన్నా , లేదూ కొన్ని అడుగులు ఇంటి లోపలికి వేసినా నిజం తెలుసుకొని ఉండేవాణ్ణి. నా పెంపుడు ప్రాణిని కాపాడుకొని ఉండేవాణ్ణి. నా కొడుకు పుట్టక ముందు నుండీ ఆ ముంగిసని నా స్వంత కొడుకు లాగా ఈ చేతుల్లో పెంచాను. ఇప్పుడు ఇదే చేతుల్తో దాన్ని చంపేసాను. ఎవ్వరు నాకు దాన్ని ప్రాణాలతో వెనక్కి ఇవ్వగలరు ? ఎవ్వరు కాలాన్ని వెనక్కి తేగలరు? ఎవ్వరు జరిగి పోయిన దారుణాన్ని వెనక్కి త్రిప్పగలరు? వేదాలు చదివీ, అరిషడ్వర్గాలని అణిచే మార్గాలని యెరిగీ, చర్య చేపట్టే ముందు ఒక్క క్షణం సహనం తో ఆలో చించ లేక పోయానే! నిజంగా, జీవితంలో క్రోధం ఎంత ప్రమాదకరం? కోపం ఎంత కీడు కలిగిస్తుంది. కోపం నా నిజ మైన శతృవు ."

అతడెంత ఏడ్చినా , ఇప్పుడెంతగా పశ్చాత్తాప పడినా అతడి అమాయకపు పెంపుడు ముంగిస మాత్రం అతడికిక లేదు.

ఇదీ కథ!

మనకి బాగా తెలిసిన కథ!
ఈ కథ లేదా ఇలాంటి కథ మన బుర్రలో నిక్షిప్తమైతే, అది మనలో 'కోపం తోనూ, తొందరపా టుతనం తోనూ పని చేయడం' అనే స్వభావాన్ని నివారిస్తుంది. పిల్లలు ఇలాంటి కథలు చదివితే, ఇలాంటి నీతి వాళ్ళ మెదడు లోకి ఇంకిపోతుంది. అది వారిలో కోపాన్ని, తొందర పాటునీ నివారిస్తుంది. అంతేగాని సమరసిం హారెడ్డి ,ఆది, ఇంద్ర,ధూం,సూపర్ లాంటి కథలతో పగలూ ప్రతీకారాలూ తప్ప ఏం తెలుసుకొంటారు?

ఉదాహరణకి, చిన్నప్పుడు మనం సైకిలు నేర్చుకొంటూ పడ్డామను కొండి. ఎంత పెద్దైనా, మనం పడబోతున్న తరుణంలో ఆ అనుభవం తాలూకూ హెచ్చరిక మన అంతః శ్చేతన మనకు ఇస్తుంది. ఆ స్పృహ మనల్ని క్రింద పడకుండా నివారిస్తుంది.

పిల్లలు ఇలాంటి కథలు విన్నప్పుడు లేదా చదివినప్పుడు, వారి నిది కదిలిస్తుంది. ఎందుకంటే పిల్లలకి సహజంగానే పెంపుడు జంతువులంటే ప్రేమ ఎక్కువ గనుక. కథ లో బ్రాహ్మణుని కోపానికి బలైంది పెంపుడు జంతువు గనుక. కాబట్టి ఇలాంటి నీతి కథలు పిల్లలో సహనాన్ని పెంచి, తొందర పాటు తనాన్ని, కోపాన్ని తగ్గిస్తాయి .

కాబట్టే 'కథా అన్న ప్రకరణం [అది కథ వినటం కావచ్చు, కథ చదవటం కావచ్చు, లేదూ కథ చెప్పటం కావచ్చు] మనిషిని ప్రభావితం చేస్తుంది.

ఈ కథ వెనకలే, ఈ కథ చెప్పిన పాత్రకు శ్రోత పాత్ర "నిజమే గాని, శతృవు కోట మీదికి దాడికి వచ్చినప్పుడు ముందు వెనుకలు ఆలో చించాలంటూ జాగు చేయగలమా?" అంటుంది.

ఆ విధంగా, కోపానికి సహనానికి మధ్య సరి హద్దులే వో పంచతంత్రం వివరిస్తుంది. అది నిజంగా పంచ తంత్రం కాదు. సంపూర్ణ నీతి చంద్రిక. పిల్లలకే కాదు, పెద్దలకి సైతం అది నిదానం ప్రధానం ఎప్పుడో ఎంతవరకే, అలాగే ఆలస్యం అమృతం విషం ఎప్పుడో ఎంతవరకో విశ్లేషించుకో గలిగే వివేచనని మనకి అవ్యాజం గా అందిస్తుంది.

రసం పిండేసిన చెరకు పిప్పి లాటి నీతి కథలే చదివి పంచతంత్రం లో అవే ఉన్నయనుకొంటే పొరపాటే.

కావాలంటే మరో సూక్తిని పరిశీలించండి. స్ప్రుశించుచునే ద్విపంబును, ఆఘ్రాణించుచూనే యురగంబును, పాలించుచూనే నృపాలుండును, నవ్వుచూనే దుర్జనుడునూ హింసింతురని విచక్షణులు పలుకుదురు.

అంటే తాకుతూనే కుట్టి తేలు లాంటి ప్రాణులు [ద్విపం అంటే తొందం, నోరు రెంటి తోనూ త్రాగగల ప్రాణులు] గాలి ఊదుతూనే [బుసకొడుతూనే] కాటు వేసి పాములూ, పరి పాలిస్తూనే రాజూ, నవ్వుతూనే చెడ్డవాడూ మనల్ని హింసిస్తారని విచక్షణా ఙ్ఞానం గల వారు [పెద్దలు] చెబుతారు.

ఎంతనిజం కదా! తేళ్ళ బారినా, పాముల బారినా పడక పోయినా, పాలకులు బారినా చెడ్డవారి బారినా మనం ప్రతిరోజూ పడుతూనే ఉన్నాం కదా!

ఈ సూక్తి, కుందేళ్ళ మడుగుని ఏనుగులు పాడు చేస్తుంటే తెలివిగా కుందేళ్ళు నీళ్ళలో చంద్రుణ్ణి చూపెట్టి ఏనుగుల్ని బెదరగొట్టి పంపేసిన కథ లోనిది. ఇలాంటి ఎన్నో చక్కని నిజాలూ, ప్రకృతి పోలికలూ, సూక్తులూ పంచతంత్రం నిండా ఉన్నాయిఈ కథని మనం ఎన్నో సార్లు, ఎన్నో చోట్లా చదివాం. పిల్లల పాఠాల్లో ఉంది. సినిమాల్లో, బడుల్లో నృత్య నాటికలుగా, డ్రామాలుగా చూసాం. కానీ ఎక్కడన్న ఒక్క నీతన్నా చెప్పబడుతుందా?

కేవలం రసం పిండేసిన చెరుకు పిప్పి లాంటి కథ తప్ప! అందుకే పంచతంత్రాన్ని సంపూర్ణ నీతి చంద్రిక అంటారు. కృతకంగా నీతులు చేర్చి మన వాళ్ళు కథలు చెపుతారన్న అబధ్ధపు ప్రచారాన్ని నమ్మేసి, నిజమే కాబోలను కోవడం తప్పితే నిజంగా అందులో ఏముందో చదివే ఓపికా, తీరికా మనకి ఉంటే ఆ నిధి లోంచి చాల రత్నాల్ని ఏరుకోవచ్చు.

మీరే మంటారు?

ఈ టపాకి నిజానికి మంగలి వాని బంగారం-రాజకీయాధికారం అని అచ్చ తెలుగులోనే శీర్షిక పెట్టాలనుకున్నాను. కాని ఎక్కడ మంగలి వారి మనోభావాలు దెబ్బతింటాయో, ఎక్కడ మంద కృష్ణమాదిగలాగా ఏ గుంపురామమంగలి గారి కులసంఘ సభ్యులంతా కలిసి బ్లాగు లోకమ్మీద దాడి కొస్తారోనని భయపడి ఆంగ్లాన్ని ఆశ్రయించి బార్బరు అంటు ప్రయోగించాను.

ఇక విషయంలోకి వస్తాను.

ఒకప్పుడు అక్బర్ ఆస్థానంలో ఓ ఆస్థాన మంగలి ఉండేవాడు. అతడు తన వృత్తిలో చాలా నేర్పరి. అతడు గడ్డం గీస్తే అక్బరుకి మల్లెపూల చెండుతో చెంపలు తడిమినట్లుంటుంది. అతడు తలపైన ॒క్షౌరం చేస్తే ప్రేమగా తన మనమరాలు తన జుట్టుతో ఆడుకున్నంత హాయిగా ఉంటుంది. అతడు తైలమర్దనా చేసి ఒళ్ళంతా మాలీషు చేస్తే ఏదో లోకంలో విహరించినట్లుంటుంది. అందుచేత అక్బరుకి ఈ మంగలంటే కాస్త అభిమానం పెచ్చు. దానితో మంగలికి కూడా పాదూషా దగ్గర కాస్త చనువు ఉండేది.
ప్రతి రోజూ మంగలి ॒క్షుర కర్మ చేసేటప్పుడు పాదుషా యధాలాపంగా ఏదో మాట్లాడుతుండేవాడు. పాదుషా తనపాలన గురించి ప్రజలేం అనుకొంటున్నారని అంటే మంగలి పాదుషాని ప్రజలు దేవుడంటున్నారని, ఆయన పాలన అంతనీ ఇంతనీ పాదుషాని ఆకాశాని కెత్తేసేవాడు. తన పాలనలో ప్రజలు ఎలా ఉన్నారని అక్బరు అడగటం ఆలస్యం ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లుతున్నారనీ, సిరిసంపదలతో తులతూగు తున్నారనీ చెప్పేవాడు. అందులో కొంత నిజం, మరికొంత ఎక్కువ అతిశయోక్తులు ఉండేవి.

ఇదంతా గమనిస్తున్న బీర్బలు మంత్రి వ్యవహరాన్ని ఇలాగే వదిలేస్తే ॒క్షేమం కాదనుకొన్నాడు. మంగలి, పాదుషా గారి శరీరానికి తైలం వేస్తే ఫరవాలేదు. మనస్సుకి వేస్తున్నాడు. అది పరిమితి దాటితే ప్రమాద హేతువే. ఏ శతృరాజైనా ఈ మంగలినే వేగుగా ప్రయోగిస్తే?
అందుచేత బీర్బలు మరునాడు నుండి పాదుషా క్షురకర్మ చేయుంచు కొనేటప్పడు తానూ పాదుషా ప్రక్కనే ఉంటూ పిచ్చాపాటి మాట్లాడసాగాడు. ఓ రోజు అలాగే పిచ్చాపాటి మాట్లాడతుండగా, తరచుగా పాదుషా అడిగే ప్రశ్నను ఈ సారి బీర్బల్ అడిగాడు, అక్బరు వారి పాలనలో ప్రజలెలా ఉన్నారని. మామూలుకంటే ఎక్కువ హుషారుగా మంగలి ప్రజలంతా భోగభాగ్యలతో తులతూగుతున్నారనీ, హాయిగా ఏ కష్టమూ లేకుండా ఉన్నారనీ, అంతా పాదుషా వారి చలవేననీ తెగతైలం వేసేశాడు.

ఇంతలో పాదుషాకి ॒క్షురకర్మ చేయటం పూర్తయింది. మంగలి కత్తి గట్రా శుభ్రం చేసుకోవటానికి ప్రక్కకి వెళ్ళాడు. బీర్బలు మంగలి పొదిని తెరిచాడు. అక్బరు, బీర్బల్ చర్యల్ని గమనిస్తూ మౌనంగా ఉన్నాడు. బీర్బల్ మంగలి పొది వెదుకుతున్నాడు. ఆశ్చర్యం! ఆ మంగలి వాని పెట్టెలో [పొది] లో కోడి గ్రుడ్డంత బంగారం ముద్ద ఉంది. గప్ చుప్ గా బీర్బల్ దాన్ని తీసి దాచేసాడు. ఏ పనీ బీర్బల్ వృధాగా చేయడనీ తేలిసిన అక్బర్ ఏం జరుగుతుందో చూడదలిచి ఏమి అనలేదు.

ఇంతలో మంగలి వచ్చి తన పెట్టి అడుగున బంగారం పోయిన సంగతి తెలియదుగనుక మామూలుగా కత్తి గట్రా సర్దుకొని పాదుషా దగ్గర సెలవు తీసికొన్నాడు.

మరునాడు మంగలి ముఖం వాడి పోయి ఉంది. ప్రపంచంలోని కష్టమంతా తనకే వచ్చినట్లున్నాడు. అతడి ముఖంలో దిగులూ, దుఃఖమూను.

చాలా నీరసంగా, నిస్తేజంగా పాదుషా వారికి గడ్డం గీస్తున్నాడు. నిన్నటి ప్రశ్ననే బీర్బల్ మళ్ళీ మంగలిని అడిగాడు. మంగలి నిట్టూరుస్తూ "ఏం చేప్పను హుజూర్! ప్రజలంతా నానా ఈతి బాధలతో సతమతమౌతున్నారు. దరిద్రం, అనారోగ్యం వారిని కుదిపెస్తున్నాయి. ఎటు చూసినా బాధార్తులే!" అన్నాడు.

అక్బరు కూ చాలా ఆశ్చర్యం వేసింది. అయినా మౌనంగానే ఉన్నాడు. ఈ రోజు మంగలి కత్తి కడగటానికి వెళ్ళినప్పడు బీర్బల్ మంగలి పొదిలో బంగారాన్ని యధాతధంగా పెట్టెసాడు. ఇదేమీ తెలియని మంగలి అదే దుఃఖభారంతో పాదుషా దగ్గర సెలవు పుచ్చుకొని వెళ్ళిపోయాడు.

మరునాడు మంగలి ముఖం వెలిగిపోతుంది. హుషారుగా, ఆనందంగా పాదుషా వారికి క్షురకర్మ చేస్తున్నాడు. బీర్బల్ యధాలాపంగా అడిగినట్లు రోజుటి ప్రశ్నను వేశాడు. మంగలి ఎంతో ఆనందంగా "ప్రజలు ఆనందంతో నాట్యం చేస్తున్నంత హయిగా జీవిస్తున్నారు" అంటూ వెనకటి జవాబే చెప్పాడు. ఇందతా చూస్తూన్నా అక్బర్ ఫకాలుమని నవ్వాడు. మంగలికేమీ అర్దంకాలేదు. పాదుషా చిరునవ్వుతో "పోయిన నీ బంగారం తిరిగి దొరికినందుకు చాలా ఆనందంగా ఉన్నట్లున్నావు" అన్నాడు. మంగలి మ్రాన్పడి పోయాడు. "హుజూర్! నా బంగారం పోయి దొరికినట్లు తమరికెలా తెలుసు?" అన్నాడు.

అక్బర్ మాట్లాడకుండా చిరునవ్వుతో అతడికి బహుమతి ఇచ్చి పంపేశాడు. బీర్బల్ వైపు సహేతుకంగా చూశాడు.

బీర్బల్ చిరునవ్వునవ్వి "హుజూర్! తనపెళ్ళి విశ్వకళ్యాణం అనీ, తన చావు జగత్ర్పళయమనీ కొందరనుకొంటారు. పచ్చిస్వార్దం తప్ప అందులో మరేమి ఉండదు. అలాంటి వాళ్ళా మాటల్లో విశ్వసనీయత ఉండదు. అలాంటి వారి నివేదీకల్ని నమ్మరాదు" అన్నాడు.

అక్బర్, బీర్బల్ సునిశిత ఆలోచనా పటిమని మెచ్చుకొన్నాడు.

ఇదీ కథ!

విశేషమేమంటే ఈనాటి రాజకీయనాయకులంతా అలాంటి మంగలి వారే! కోడిగ్రుడ్డంతా బంగారం ఏమిటంటే అధికారం. తాము అధికారంలో ఉంటే ప్రజలంతా సుఖశాంతులతో, అష్టైశ్వర్యాలతో ఉన్నారనీ, కిలో రెండు రూపాయిల బియ్యమో, జన్మభూమో, జలయఙ్ఞమో, రాజీవ్ ఆరోగ్యశ్రీయో లేదా భారత్ వెలిగిపోతుందనో లేదా సెన్సెక్స్ ర్యాలీతో భారత్ బలియశక్తిగా మారిందనో తొక్కో తోలో ప్రజల్ని ఆనందంతో ఉబ్బితబ్బిబ్బు చేస్తున్నట్లు, సుఖలెక్కువై ప్రజలు మత్తెక్కి పోయరనీ అంటారు. అదే బంగారం అంటే అధికారం పోయిందనుకోండి. ఈ రాజకీయ నాయకులంతా అచ్చంగా మంగలివాడి లాగానే ప్రజలు నానా బాధలూ పడుతున్నారని, దారిద్ర్యంతో నానాయాతనలు పడుచున్నారనీ, ఆకలి చావులు ఛస్తున్నారనీ అంటారు. అప్పడు పాదయాత్రలూ, ప్రజాఅంకిత యాత్రలూ, మీకోసం యాత్రలూ చేస్తూ గర్జనలూ, ఘోషలూ పెడుతుంటారు.

ఆంధ్రప్రదేశ్ నుండీ అమెరికా దాకా, చిరంజీవిలాంటి రాబోయే రాజకీయ నాయకుల దగ్గరి నుండీ ఒబామాలాంటి అయిపోయిన రాజకీయ నాయకుల దాకా అందరిదీ ఇదే బాట.

ఒక రాజకీయ గుంపు [అంటే పార్టీలన్నమాట] సెజ్ లతో అభివృద్ధి, సెన్సెక్స్ తో, జలయఙ్ఞంతో అభివృద్ధి అంటుంది. మరో గుంపు ఒకసారి ఐటి తోను, యూజర్ చార్జిల తోను, లేదా అన్ని ఉచితం తోను అభివృద్ధి అంటుంది. మరో గుంపు హిందూ ఉగ్రవాదమే అభివృద్ధి అంటుంది. మరో గుంపు ప్రభుత్వ ఆస్తులన్నీ ప్రజలకి పంచి పెడ్తే చాలు ప్రజలంతా అభివృద్ధి సాధిస్తారు అంటుంది. ఇంక అలా ఇలా కాదని మరో గుంపు ఏకంగా జిహదీతో సర్వనాశనమే సమస్తం అంటుంది. ఇప్పడు క్రొత్త సినిమా గుంపు అన్నింటి మేదా అవగాహన ఉంది అది ఏంటో చెప్పను చేసిచూపిస్తా అంటుంది. పళ్ళూడాక కదా ప్రజలకి అర్ధమౌతుంది, ఏ రాయ అయినా ఒకటే పళ్ళూడడానికి అని?

ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా రాజకీయనాయకులంతా ఇంతే! కిలో రెండు రూపాయిల బియ్యం కాకపోతే, సబ్ ప్రైమ్ లూ. ఇక్కడ ఆంధ్రాలో బియ్యం ప్రజావసరమూ, ఆకర్షణీయ పధకమూ అయితే అమెరికాలో స్వంత ఇల్లు ప్రజావసరమూ, ఆకర్షణీయము అయ్యింది. కాకపోతే చేపలు పట్టడం నేర్పడం వదిలిపెట్టి చేపలిచ్చే సంక్షేమ పధకాలు స్వంత ఇంటి నుండి కడుపుకింత తిండి ఉంటే చాలు అనే దగ్గరకి ఎవ్వరినైనా తిరోగతి పట్టిస్తాయి. వ్యవసాయాన్ని, వస్తూత్పత్తిని అభివృద్ధి కాదంటూ, అప్పులు తెచ్చి రోడ్లూ, సిలికాన్ పార్కులూ చూపి అదే అభివృద్ధి అంటూ రాజకీయ మాంత్రికులు మనల్ని ద్వంద్వంలో ముంచి తమ పబ్బం గడుపుకొంటున్నారు.

అవునా, కాదా! ఆలోచించండి!

చివరగా ఒక చెణుకు!

దూరదర్శన్లో జనంతో ముఖ్యమంత్రి దగ్గరనుండి చేయూత, ప్రగతి, ప్రభుత్వం ఇచ్చే ప్రకటనల్లోని ’తైలమర్దనం’[స్వంత గోకుడు] ను చూసిన స్ఫూర్తితో ఈ చెణుకు విసురుతున్నాను. బాగుంటే నవ్వుకోండి, లేకుంటే మరింత మంచి చెణుకు మీరు విసరండి.

మణెమ్మ లేదా మునెమ్మ లేదంటే వీరమ్మ, కాకుంటే పేరమ్మ నోరంతా తెరచి ఇలా చెపుతుంది. "ఇంతకు ముందు రోగమెస్తుందని భయమయ్యెడిది. ఇప్పుడు రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్డిచ్చిండ్రు. భయం లేకుండా ఉన్నాం. కిలో బియ్యం రెండు రూపాయలకి ఇస్తూన్నారు, హాయిగా ఉన్నాం."

ఇక చెణుకు ఏమిటంటే ...
సుబ్బమ్మ ప్రకటనలో అంటుంది "ఇంతకు ముందు చావోస్తుందని భయం వేసేది. ఇప్పుడు మెగాస్టార్ రాజచంద్రన్న పాడెశ్రీ కార్డిచ్చిండ్రు. భయం లేకుండా హాయిగా ఉన్నాం." [ఈ మధ్య ఓ ఊరిలో సెజ్ పేరుతో శ్మశాన భూమిని కూడా లాగేసుకున్నారని, శవంతో రోడ్డుపై బైఠాయించారనీ వార్త చదివిన స్ఫూర్తితో ఇది వ్రాసాను. ఇలాగే సెజ్ లతో, అభివృద్ధి చెస్తే రాను రాను శవం కాల్చాడానికీ, పూడ్చడానికి కూడా చోటు దొరక్కపోవచ్చు. అప్పడు పాడిశ్రీ కార్డు ఎంతో ఆకర్షణీయ పధకం అవుతుంది. బహుశ రాబోయె ప్రభుత్వం [ఏ పార్టీ అయినా ఒకటే] ఇదే పధకం తలకెత్తుకున్నా మనం ఆశ్చర్యపోకూడదు సుమా!]

బుడుగ్గాడి పకోడి కలల్లాంటివి

నేను నాలుగో, అయిదో తరగతి చదువుతున్న రోజులు. అప్పటికింకా టీవీలు మన జీవితంలోకి రాలేదు గనుక ఇప్పటి పిల్లల్తో పోలిస్తే అప్పట్లో మనం అమయకప్పిల్లలమే. [కప్పీలం కాదండి, పిల్లలం]
ఓ రోజు మా అభిమాన పంతులమ్మ [అభిమానం లేకపోతే ఆవిడ చెప్పిన కథ మనం నమ్మం కదా!] అలీబాబా 40 దొంగల కథ చెప్పారు. అది అమ్మ ఒడిలో అప్పటిదాకా నేను విన్న రాజుగారు-ఏడుగురు కొడుకులు-ఏడుచేపల కథల్లా లేదు. నాకా కథ మహా అద్భుతంగా అంపించింది. నిజానికి మా బడి నాకు మరో అమ్మ ఒడి. మా పంతులమ్మ చెప్పిన ఆ కథ నన్ను ఏదో లోకాలకి తీసుకెళ్ళిపోయింది. నాకూ అలాంటి గుహ కనిపిస్తే బాగుణ్ణని బోలెడంత ఆశ. అలాంటి గుహ కనబడిపోతుందని నా అదృష్ఠం మీద నాకు మహా నమ్మకం.

కొన్నిరోజుల పాటు మధ్యాహ్నం భోజనం సమయంలో అమ్మ కట్టిచ్చిన టిఫిన్ డబ్బా గబగబా లాగించేసి పరిగెట్టేసేదాన్ని. గుంటూర్లోని మా స్టాల్ గాళ్స్ హైస్కూలు చాలా పెద్దది. తరగతి గదుల భవనాల వెనకాల చిన్నపాటి చిట్టడివి లా వుండేది. ప్రహరీ గోడలు ఎత్తుగా వుండేవి.

ఎవ్వరూ చూడకుండా బాస్కెట్ బాల్ కోర్టు ప్రక్కనుండి, ఆ చిట్టడివి లోని చెట్లనీ, చిన్నపాటి పాముపుట్టల్నీ దాటుకునీ ప్రహరీ గోడ దగ్గరికి వెళ్ళి నిలబడేదాన్ని.

అటు ఇటు చూసి ఎవరూ నన్ను చూట్టంలేదని నిర్ధారించుకున్నాక
"ఖుదాకా కసం
హసన్ కా హుకుం
ఖోల్ కరో శశేం"అనేదాన్ని.
ప్చ్! ఏ గోడలోనూ ఏ గుహ తెరుచుకోలేదు.
ఇంకొంచెం గట్టిగా మంత్రం చెప్పినా తెరుచుకోలేదు.
ఇంకా గట్టిగా ....మరీ గఠ్ఠిగా.
ఉహూ! గుహ తెరుచుకుంటేనా!
చోటు మార్చి చూశాను. అయినా లాభం లేదు.
చివరికో రోజు మంత్రం మార్చి
"ఖుదాకా కసం
ఆదిలక్ష్మి కా హుకుం
ఖోల్ కరో శశేం" అన్నాను.
గుహ తెరుచుకోలేదు గాని బడి బంట్రోతు అబ్రహాము తాత నన్ను చూసేసాడు.
అటొస్తే పాములు కరుస్తాయని, మా పెద్ద పంతులమ్మ గారికి చెబుతానని బెదిరించాడు.
అయినా అతని కళ్ళుగప్పి మరో నాలుగైదుసార్లు ప్రయత్నించాను. బంగారం గుహ కనిపిస్తే మా బళ్ళో అందరికీ మిఠాయిలు పెట్టేసి, అమ్మానాన్నలకి అందరికీ బంగారం చూపెట్టేసి రాత్రికి రాత్రి సెలబ్రిటి [ఆ మాట అప్పటికి తెలీదనుకోండి. నాయకురాలినన్నమాట] అయిపోవాలని నా ఆశ. ఆశ తీరలేదు. చాలా నిరుత్సాహం వచ్చేసింది.

అంతలో అల్లాడీన్ అద్భుత దీపం కథ విన్నను.
మళ్ళీ నా ఆశ బ్రతికిపోయింది.
ఎక్కడైనా అద్భుత దీపం, కాకపోతే కనీసం పాత దీపం అయినా దొరుకుతుందని ఆశగా వెదికేదాన్ని.

చివరికి బడినుండి ఇంటికి, ఇంటినుండి బడికి నడిచే దారిలో కూడా ఎక్కడన్న, రోడ్డు ప్రక్కన అద్భుత దీపం కనిపిన్స్తుందేమోనని కళ్ళతో రోడ్డుని పరిశీలిస్తూ నడిచాను.
[కొంచెం పెద్దయ్యాక బాపూరమణల 'బుడుగు, తనని తాను అల్లాడిన్ గా ఊహించుకొని మాంత్రికుడు వచ్చినపుడు "మిఠాయిలిస్తే నేను రానురా మేజిక్కుల వాడూ! నారాయణ కొట్లో వేడి వేడి పకోడీలు కొనిస్తే వస్తాను రురేయ్!" అనడం చదివి "అహా! మనమే కాదు. మనలాంటి కలల రాయుళ్ళే అందరూ అని తెలుసుకున్నాను. అప్పటి వరకూ ఇంకెవరికైనా తెలిస్తే ఎగతాళి చేస్తారని భయమేసేది.]

అలా నా చిన్నప్పుడు అల్లాడీన్ అద్భుత దీపం కోసం, అలీబాబా బంగారు గుహ కోసం తెగ వెదికాను, దొరకలేదు.

బోల్డు కొంచెం పెద్దయ్యక తెలిసింది. అద్భుత దీపాలు, బంగారు గుహలూ మరెక్కడో వుండవనీ, మన మనస్సులోనే వుంటాయనీ!
ఆ స్వయం ప్రేరణ అర్ధమయ్యాక జీవితం పట్ల చాలా వరకు బెంగ తీరింది.

బ్లాగరుల ఇళ్ళల్లోని బాలలోకానికి నా చిన్ని తొలికానుక.
అనగా అనగా ఒక ఊరు.
ఆ ఊరిలో ఓ కొలను
కొలను గట్టున ఓ చెట్టు.
కొలనులో ఓ చేప.
చెట్టు మీద ఓ పిట్ట.
ఓ రోజు చేప వొడ్డుకొచ్చింది.
దానికి పిట్ట కనబడింది.
“ఏయ్ పిట్ట!” పిల్చింది చేప.
“ఎందుకూ పిలిచావు?” అంది పిట్ట.
“ఆడుకుందామా?” అంది చేప కళ్లు ఆర్పుతూ.
“ఏమాటా?” అంది పిట్ట తోక ఊపుతూ.
“దాక్కొనే ఆట” అంది చేప.
“సరే దాక్కో” అంది పిట్ట.
“నువ్వూదాక్కో” అంది చేప.
జర్రున నీళ్ళల్లో మునిగింది చేప.
తుర్రున చెట్టు కొమ్మల్లోకి ఎగిరింది పిట్ట.
నీళ్ళల్లో చేప చాలా సేపు దాక్కుంది. అక్కడి నుండి ఇక్కడికీ, ఇక్కడి నుండి అక్కడికీ ఈదింది. బండల మాటున, నాచు చాటున నక్కింది. ఎంత సేపు దాక్కున్నా పిట్ట రాలేదు. “ఓస్! పిచ్చిపిట్ట! నన్ను కనుక్కోలేక పోయింది” గొప్పగా అనుకొంది చేప.
చెట్టు కొమ్మల్లో పిట్ట చాలా సేపు దాక్కోంది. ఓ కొమ్మ గుబురులోంచి ఇంకో చిక్కగా ఉన్నా మరో కొమ్మ గుబురు లోకి ఎగిరింది. తొంగి తొంగీ కొలను వైపు చూసింది. ఎంత సేపు దాక్కున్నా చేప జాడ లేదు. “ఓస్! తిక్క చేప! నన్నసలు కనిపెట్టలేక పోయింది”అనుకొంది పిట్ట .
పాపం! చేప నీళ్ళల్లో, పిట్ట కొమ్మల్లో ఇప్పటికీ అలాగే దాక్కుని వుండి పోయాయి .

నమస్తే! 'అమ్మ ఒడి' బ్లాగ్ లోనికి స్వాగతం.
నేనూ కూడలి లో చేరాను, ఓ బ్లాగరి నయ్యాను.
అమ్మ ఒళ్ళో చిన్ని బిడ్డగా మనం తిన్న
ఆవకాయ బద్దలు, వెన్న ముద్దలూ
చందమామని చూస్థు అమ్మ ఒళ్ళో విన్న
పేదరాసి పెద్దమ్మ కధలు
మళ్లీ ఓసారి గుర్తు తెచ్చుకుందామని
ఈ బ్లాగ్ వ్రాస్తున్నాను.
జీవితంలో ద్వంద్వాలు, పరిమితులు
కధలతో కలగలిపి కబుర్లాడదామని వ్రాస్తున్నాను.
నా ఈ బ్లాగ్ మిమ్మల్ని వినోదింప చేయగలదనీ,
మీ విజ్ఞాన వివేచనల నిధుల్ని మరింత పరిపుష్టం చేయగలదని
ఆశిస్తూ వ్రాస్తున్నాను.

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu