మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవినీతి పై పోరాటం చేస్తాడట అదీ బాపూఘాట్ సాక్షిగా ప్రతిన బూనాడట. తొలి పేజీ వార్తగా ‘ఈనాడు’ ప్రచురించింది. తద్వారా తమ లజ్జారాహిత్యాన్నే కాదు, జనాలు గొప్ప ‘గజనీ’లన్న తమ నిశ్చితాభిప్రాయాన్నీ వెళ్ళబుచ్చారు… ఈ రాజకీయ-మీడియా ముఖ్యులు!

అదేదో తన హయాంలో ధర్మం నాలుగు పాదాలా నడిచినట్లు, నీతిని తాను నేల నాలుగు చెరుగులా నడిపినట్లు చంద్రబాబు ప్రకటించటం, ‘ఈనాడు’ పెద్దచ్చరాల్లో ప్రచురించటం!

ఆరేళ్ళ క్రితం అయ్యవారి అవినీతి నానాటికి పెచ్చరిల్ల బట్టే…అది+ వ్యవసాయ స్థితిగతులు చూపెట్టి, పంచె ఎగ్గట్టి, వై.యస్సార్ పాదయాత్ర ప్రారంభించాడు. అతడి అవినీతి ఇతడికి కలిసి వచ్చిందన్నట్లు, చంద్రబాబు వ్యతిరేక ఓట్లు మూటగట్టుకొని ముఖ్యమంత్రై, ‘అతడి కంటే ఘనుడు ఆచంట మల్లన్న’ అన్నట్లు, మరికొన్ని వేల కోట్లు మింగి, దారుణ మరణం పాలయ్యి, కొడుక్కి ‘మహానేత’ అయిపోయాడు.

‘పత్రికలు తమ చేతిలోది, ప్రజల జ్ఞాపక శక్తి తాత్కాలికమైనది’ అనుకొని, చంద్రబాబు అవినీతిపై పోరాడతాననటం, ఈనాడు ‘అదిగదిగో చూడండంటూ’ ప్రచురించటం గాకపోతే…

చంద్రబాబు అవినీతి మీడియాకి తెలియదా, గుర్తు లేనిదా?

ఓ చిన్న ఉదాహరణ చెబుతాను. నా స్వానుభవం లోనిది.

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నరోజుల్లో 1997 ఇంటర్ పరీక్షలు జరుగుతున్నాయి. అప్పటికి నేను నంబూరు పల్లెలో కమిటీ కాలేజీలో పని చేస్తున్నాను. ‘ఇక పరీక్షలై పోతాయి, ఎంచక్కా సెలవలొస్తాయి’ అనుకుంటూ ఉన్నాం. ఆ రోజు లెక్కల పరీక్ష జరిగింది. సాయంత్రం టీవీ స్క్రోలింగ్ లో ‘పేపర్ అవుట్ అయ్యిందనీ, పరీక్షలు తిరగ బెడతారనీ’ ప్రకటన వచ్చింది.

అదే రామబ్రహ్మం కేసు! కొన్ని రోజుల పాటు పేపర్లలో పతాక శీర్షికల్లో వార్తగా ఉండిన కేసు! కోల్ కతా (అప్పటికి కలకత్తానే) ప్రెస్ నుండి రామబ్రహ్మం ప్రశ్నాపత్రాలు పట్టుకొచ్చాడని…అదనీ ఇదనీ చాలానే వ్రాసారు.

ఆ దెబ్బతో… ప్రైవేట్ కాలేజీలని, చంద్రబాబు, అర్జంటుగా క్రమబద్దీకరించాడు.

అప్పటికి ప్రైవేటు జూనియర్ కాలేజీల పరిస్థితి ఏమిటంటే –

ఓ రెండంతస్థుల బిల్డింగ్ అద్దెకి తీసుకొని (గుంటూరు వికాస్ సోమయ్య బిల్డింగ్ లాంటిదన్నమాట) ఓ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాధ్స్ లేదా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ లెక్చరర్లు నలుగురు కలిసి, ఓ ఇద్దరు భాషా అధ్యాపకుల్ని తోడుగా తీసుకొని, ప్రభుత్వానికి విద్యార్ధికి ఓ వెయ్యి రూపాయల ఫీజు కడితే చాలు… ఓ కాలేజీ నడిపేయవచ్చు.

కాలేజీలు నడుపుతున్న యజమాన్యాలకు కూడా… పాఠాలు బాగా చెప్పగల లెక్చరర్ పట్ల కొంత జాగ్రత్త ఉండేది. “ఎందుకొచ్చింది! బాగా చెబుతారన్న పేరున్న లెక్చరర్లు మనకి కావాలి. అదీగాక, చెప్పగల సత్తా ఉన్న లెక్చరర్ కి, మనం తగినంతగా జీతం ఇవ్వకపోతే… బయటకి పోయి స్వంత కాలేజీ పెట్టుకున్నాడంటే – మనం ఇచ్చే జీతం వారా ఫీజులు రాకపోవు. మనకే రిస్క్” అనుకుంటూ… కొంత గాకపోతే కొంతన్నా ‘మంచి పేమెంట్’ ఇచ్చేవాళ్ళు, మరికొంచెం ఎక్కువగానే ‘గుడ్ డీల్’ చేసేవాళ్ళు.

రామబ్రహ్మం పైకారణంతో, చంద్రబాబు, కాలేజీలని క్రమబద్దీకరించాక… శ్రీ చైతన్య లూ, నారాయణలూ తెగ బలపడి పోయి… శ్రీ చైతన్యలు సురేష్, విద్వాన్, విజ్ డమ్ లనీ మింగేసి తమలో విలీనం చేసుకున్నట్లూ,

‘కోరా’ లని రత్నంలు విలీనం చేసుకున్నట్లూ, రత్నం లాంటి కోచింగ్ సెంటర్లని మరో xyzలూ…వెరసి చిన్నా చితకా కాలేజీలు రాలిపోయి, కార్పోరేట్ కాలేజీలు మిగిలి పోయాయి.

కాలేజీల యజమాన్యాలు, లెక్చరర్లని… “తొక్కలోది మీరు చెప్పినందుకే, మాకు ర్యాంకులూ, మార్కులూ వొచ్చాయనుకుంటూన్నారా? మా లాబీయింగు మాకుందమ్మా!” అన్న డీల్ చేయటం మొదలై, తర్వాత్తర్వాత అదే నికరమై కూర్చొంది.

ఇంతా చేసి ‘రామబ్రహ్మం శిక్షించబడ్డాడా?’ అంటే – అదీ లేదు. ఆ కేసు నేపధ్యంలో అప్పటికి గుంటూరు ఎస్.పి.గా ఉన్న ఏ.కే.ఖాన్ (ఇప్పటి నగర పోలీసు కమీషనర్) కు, గుంటూరు వికాస్, సిద్దార్ధ గట్రా యాజమాన్యాలు, రాత్రికి రాత్రి కోట్లు గుమ్మరించాయని మా లెక్చరర్ల వర్గంలో ఓ ‘రూమర్’ పాకింది. నిప్పులేనిది పొగరాదన్నట్లు అందులో చాలానే నిజముంది.

విశేషమేమిటంటే – ఆ తర్వాత నాలుగైదేళ్ళకు కూడా ‘రామబ్రహ్మం’ ప్రభ తరగలేదు, సరికదా పెరిగి పోయింది. ఎంతగా అంటే – నాగార్జున విశ్వవిద్యాలయానికి రామబ్రహ్మం ఏవో పనుల నిమిత్తం [అంటే లాబీయింగ్ అన్నమాట] వచ్చాడంటే…ముందో రెండు, వెనకో రెండు కార్లతో, కాన్వాయ్ వేసుకుని వచ్చేవాడు. ఇది నాకు స్వయంగా తెలిసిన సమాచారం. మా మిత్రులు విశ్వవిద్యాలయంలో అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ గా ఉండేవాళ్ళు. వాళ్ళీ విషయంతో బాటు మరికొన్ని వివరణలు కూడా ఇచ్చారు.

అదీ చంద్రబాబు గారి, తెర వెనక సహకారం అవినీతికి! అలాగ్గాక, తాను నీతికి నిలబడే వాడే అయితే, 1997 లోని రామబ్రహ్మాన్ని, పేపరు లీకుల కేసు వ్యవహారాన్ని, 2004లో దిగే వరకూ ఎందుకు తేల్చలేదంట?

‘రామబ్రహ్మం’ అనబడే ఓ వ్యక్తిని పైకారణం(over leaf reason) పెట్టుకుని, పేపర్ లీకు వ్యవహారాన్ని తెర మీదకు తీసి, ఆ నెపంతో ప్రైవేటు కాలేజీలని క్రమబద్దీకరిస్తున్నానంటూ… అవినీతిని(ఇంటర్ పేపర్ లీక్, ర్యాంకుల ఫిక్సింగ్) సెంట్రలైజ్ చేసుకుని, సొమ్ము పిండుకున్న వెన్నుపోటు చక్రవర్తి ఈ చంద్రబాబు. మామకే కాదు, ప్రజలకూ ఇతడు ప్రతి విషయంలో చేసింది వెన్నుపోటు పరిపాలనే!

అలాంటి వెన్నుపోటుల్లో రామబ్రహ్మం కేసు ఒకటి. ఆ దెబ్బతో… ప్రైవేటు జూనియర్ కాలేజీలు కాస్తా కార్పోరేట్ జూనియర్ కాలేజీలై పోయాయి. చంద్రబాబు నాయుడే అధికారంలో కొనసాగి ఉంటే ‘బి సెంటర్ల’లలో కూడా… చిన్న కాలేజీలు మాయమై, శ్రీ చైతన్య, నారాయణ వగైరా కార్పోరేట్ కాలేజీలే వెలిగి పోతుండేవి.

తమ జీతాలు పెంచమని, హక్కుల కోసం ఉద్యమించిన అంగన్ వాడీ కార్యకర్తలని, ఆడవాళ్ళని కూడా కనికరం లేకుండా విరగ బాధించిన చంద్రబాబు…

కరెంట్ ఛార్జీలు తగ్గించాలని ఉద్యమాలు చేసిన ప్రజల మీద పోలీసు కాల్పులు జరిపిన చంద్రబాబు…

ఈ రోజు బాపూఘాట్ దగ్గర, గాంధీజీ పేరు చెప్పుకుంటూ, ఉద్యమాల గురించి మాట్లాడుతున్నాడు. వాటిని విరగ ప్రచారం కావిస్తున్నది రామోజీరావు పత్రిక ‘ఈనాడు’.

ఎటూ ఇదంతా ప్రజలకి గుర్తుండదనీ, జనాలు గొప్ప ‘గజనీ’లనీ చంద్రబాబు, రామోజీరావుల అభిప్రాయం! తమ ప్రచారంతో… ప్రజలకి ‘నిన్న జరిగింది ఈ రోజు మరిపించగలం’ అన్నది ఈనాడు నమ్మకం. వెరసి రాజకీయ నాయకులూ, మీడియా కింగులూ కలిసి నడిపిస్తున్న మహా నాటకమే నేటి రాజకీయం!

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!
~~~~~~~~

గత టపాలో చెప్పినట్లుగా గ్రామీణుల జీవితాల్లో తత్త్వాలు, పనితో పాటు పాటలూ ఉండేవి. జీవితాలని గాడి తప్ప నివ్వకుండా, క్రమశిక్షణని గుర్తు చేస్తూ, పదార్ధం వెంట పరుగుని నియంత్రించేవి.

అంతేగాక, గ్రామాలలో రైతుల జీవితాలు ఎప్పుడూ క్రియాశీలతతో, సందడితో, పండుగలతో ముడిపడి ఉండేవి. పసితనం నుండీ రైతు కుటుంబాల్లో పిల్లలు, వ్యవసాయపు పనులని పరిశీలిస్తూ, పని నేర్చుకుంటూ పెరిగేవాళ్ళు. పొలాల్లో శ్రమించే సత్తువ కోల్పోయి, ఇంట్లో విశ్రాంతి తీసుకునే తాతల దగ్గర, వాళ్ళు తాళ్ళు పేనే పని చేస్తుండగా, ఆ పనిని పరిశీలిస్తూ, దాని గురించి ప్రశ్న లేసి విసిగిస్తూ… తాతయ్యలు చెప్పే కథలూ కబుర్లూ వినటం… ఆ పిల్లలకి పరిపాటి. వాళ్ళ చదువంతా కలిపి ‘పెద్ద బాలశిక్ష’ మాత్రమే! (నిజానికి ఆ పేరుతో, వారి చదువుల అంశాలన్నీ, తర్వాత పుస్తకంగా సంకలించ బడ్డాయి.)

అందులో వాళ్ళు వ్రాయటం, చదవటం, చిన్నపాటి లెక్కలు వేయటం నేరుస్తారు. బద్దింపు విధానంలో కూడికలు, తీసివేతలూ, హెచ్చింపులూ, భాగింపులే గాక, వడ్డీ లెక్కలూ, నిష్పత్తుల లెక్కలూ, అనుపాతాలూ నేరుస్తారు. సగటు కట్టడాలూ, శాతాలూ లెక్కించడాలూ అర్ధం చేసుకుంటారు. అంతే! డిఫరెన్షియల్స్, ఇంటెగ్రల్స్ అంటూ కాలిక్యులస్ లూ, ట్రిగనోమెట్రీలు వాళ్ళకి అవసరం లేదు.

రేఖాగణితంతో కొద్దిపాటి పరిచయం, వాళ్ళకి ఆకృతులని గుర్తించే నేర్పు వచ్చేలా చేస్తుంది. పరిసరాల విజ్ఞానం, భౌగోళిక గుర్తింపులూ తెలుస్తాయి. పంచాంగపు లెక్కలు తెలుస్తాయి. ఋతువులూ, సంవత్సరాల పేర్లూ, రాశీఫలాలు గట్రా గురించి, కొంత అవగాహన కలుగుతుంది. జీవశాస్త్రం, వృక్షశాస్త్రం అంటూ మనం సవాలక్ష పేర్లతో నేర్చుకునే బాదరబందీ ఏదీ లేకుండా, వాళ్ళ వృత్తికి తగినంత పరిజ్ఞానం తెలుసుకునేవాళ్ళు.

అది నేటి సైన్స్ అంత అధునాతనమైనదీ, విస్తారమైనదీ, సాంకేతికమైనదీ గాకపోయినా, ఖచ్చితంగా ఇంగిత జ్ఞానంతో కూడినది. మార్కుల కుంభకోణాలు, ర్యాంకుల కుంభకోణాలు లేనిది.

చివరిగా పెద్దబాలశిక్షలో ఉండే చిన్న కథలతో… ఇరుగుపొరుగు సంబంధాలు, నీతి విషయాలు, ఇతరులతో మెలిగే వ్యవహారశైలి, రాజు, గ్రామ పెద్ద, కరణాలు గట్రాల పరిపాలనా విధానం గురించి, పరిచయం కలుగుతుంది. దాంతో వాళ్ళ ప్రాధమిక విద్య పూర్తయినట్లే!

అయిదేళ్ళ దాక అమ్మానాన్నల వెనక, అవ్వాతాతల ఒడుల్లో, మాటలూ పాటలూ నేర్పిన పిల్లలు, తోటి పిల్లలతో ఆడుకుంటూ, ఇంటి పరిసరాల్లో పశుపక్ష్యాదుల్ని పరిశీలిస్తూ, ప్రాధమిక జ్ఞానాన్ని ఒంట బట్టించుకునే వాళ్ళు. అంతేగానీ, ఇప్పటి పిల్లల లాగా father’s father is a grand father అని బట్టి పట్టే వాళ్ళు కాదు.

అయిదేళ్ళు వచ్చి అక్షరాభ్యాసమనే కార్యక్రమం పూర్తయ్యేదాకా, వ్రాత పనిముట్లు (బలపం, పెన్సిలూ, పెన్ను గట్రాలు) ముట్టుకోనక్కర లేదు. ఇక బండెడు పుస్తకాల బరువూ, హోంవర్కుల వత్తిళ్ళూ ఎక్కడ? అయిదేళ్ళ వయస్సు వరకూ, హాయిగా, స్వేచ్ఛగా, పెద్దవాళ్ళ వాత్సల్యాన్ని ఆనందిస్తూ ‘బడుద్దాయ్’ల్లా తిరిగేసే వాళ్ళు. తర్వాతే ‘పెద్దబాల’ శిక్ష కూడా!

పిల్లల సామర్ధ్యం, ఆసక్తి, ధారణ శక్తిని బట్టి, పెద్ద బాలశిక్ష లేదా తత్సమాన చదువుని వాళ్ళు, రెండు నుండి మూడేళ్ళ కాలంలో పూర్తి చేసేవాళ్ళు. కొందరికది అయిదేళ్ళు పట్టటం కూడా అసాధారణం కాదు.

ఇక అప్పుడు వాళ్ళ విద్య, ఇతిహాసాల వైపుకీ, నీతి శాస్త్రాల వైపుకీ మళ్ళుతుంది. ఇతిహాసాల నుండి కథల పూర్వకంగా పిల్లలు… ఒక దృక్పధాన్నీ, తాత్త్విక దృష్టినీ, నీతిపరమైన హద్దుల్నీ నేర్చుకునేవాళ్ళు. కొన్ని శ్లోకాలని, పద్యాలని బట్టి వేయించటం ద్వారా… వాళ్ళ జ్ఞాపకశక్తినీ, ధారణ శక్తినీ పెంచటం ఉండేది. నీతి శాస్త్ర పద్యాలూ నేర్పేవాళ్ళు.

అప్పటికి సగం చెక్కిన శిల్పంలా మలచబడిన పిల్లలు… మెల్లిగా ఒక వ్యక్తిత్వాన్ని, తమదైన మేధస్సునీ, వ్యవహారశైలినీ, దృక్పధాన్ని అలవరుచుకుంటారు.

ఇదంతా పూర్వయ్యేటప్పటికి పిల్లలు, 10 నుండి 12 ఏళ్ళు సంతరించుకుంటారు. ఇక అప్పుడు పిల్లల ఆసక్తి, నైపుణ్యం, సామర్ధ్యాలని బట్టి, తల్లిదండ్రుల ప్రోత్సాహం, ఇష్టాయిష్టాల మీద ఆధారపడి, పిల్లలు, పై చదువులకి అంటే ప్రత్యేకమైన విద్యల నార్జించేందుకు పంపబడే వాళ్ళు.

ఉదాహరణకి పిల్లవాడికి సంగీతమంటే ఆసక్తి ఉంటే, తల్లిదండ్రులందుకు సమ్మతిస్తే, ఆ పిల్లవాడి కోసం గురువు అన్వేషింపబడేవాడు. సంగీతం నేర్పగల గురువు కోసమన్న మాట. తగిన గురువును వెతుక్కొని, అభ్యర్ధించుకొని, గురువుని ఆశ్రయించి, సేవలతో, వినయ విధేయలతో గురువుని ‘ఇంప్రెస్’ చేసుకుని, విద్య నేర్చుకునే వాళ్ళు. విద్యాభ్యాసం పూర్తయ్యాక, స్థోమతని బట్టి, గురువు ఆనతిని బట్టి, గురుదక్షిణ సమర్పించుకునే వాళ్ళు.

సాహిత్యం, తర్కం, గణితం, ఖగోళ జ్యోతిష్యాది శాస్త్రాలు, చిత్రలేఖనం, శిల్పం ఇత్యాది కళల విషయంలోనూ ఇంతే! వ్యాపారం, వైద్యం, వంటి ఇతర సేవలు (ఆయుర్వేదం వంటివి) కూడా ఇదే విధంగా కొనసాగేవి.

ఇది సమాజంలో ఎంత బలంగా వేళ్ళూనుకు పోయిన సంస్కృతి అంటే –

నా చిన్నప్పుడు మా నాన్న దగ్గర ‘ఆటోమొబైల్ ఎలక్ట్రిషియన్’ పని నేర్చుకునేందుకు పది పన్నెండేళ్ళ పిల్లలు వచ్చి చేరేవాళ్ళు. వాళ్ళల్లో కొందరు మా ఇంట్లోనే ఉండేవాళ్ళు. తిండి తిప్పలు సమకూర్చి, మా నాన్న వాళ్ళకి పనినేర్పే వాళ్ళు. వాళ్ళలో చిన్న వాళ్ళు మమ్మల్ని ‘అక్కా’ అని పిలిస్తే, పెద్ద వాళ్ళని మేం ‘అన్నా’ అని పిలిచేవాళ్ళం.

పని కొంచెం బాగా నేర్చుకున్నాక, వాళ్ళు మా నాన్నకి పనిలో సాయం అందించేవాళ్ళు. అప్పుడు వాళ్ళకి మా నాన్న ‘బేటా’ పేరుతో, దినసరి భత్యం చెల్లించే వాళ్ళు. అదీ మా ఇంట్లోనే తింటూ, మా ఇంట్లోనే ఉండేవాళ్ళకి గాకుండా, బయట నుండి వచ్చే వాళ్ళకి!

ఈ విధంగా వాళ్ళ సామర్ధ్యాన్ని బట్టి అయిదారేళ్ళు (కొందరైతే పది పన్నెండేళ్ళ) పని నేర్చుకున్నాక, వాళ్ళు స్వంతంగా వర్క్ షాప్ తెరుచుకునేటప్పుడు, పని నేర్పిన గురువుకి ‘గురుపూజ’ నిర్వహిస్తూ, వాళ్ళ షాప్ కి పూజ, గురువు చేతే చేయించుకునేవాళ్ళు.

అలాంటి సంధర్బాలలో మా అమ్మానాన్నలకి పట్టుబట్టలూ, బంగారు నగలు (గొలుసూ, ఉంగరాల వంటివి) పెట్టి సత్కరించటం, నాకు ఊహ వచ్చాక కూడా తెలుసు. అదే గురుదక్షిణ అన్నమాట!

“పిడికెడు అన్నం పెట్టి పని నేర్పు మేస్త్రీ! నీ పేరు చెప్పుకుని బ్రతికేస్తాడు!” అంటూ తమ కొడుకుల్ని మా ఇంట్లో వదిలే వాళ్ళు. ఎప్పుడూ చూసినా మా ఇంట్లో కనీసం ముగ్గురైనా ఇలాంటి కుర్రాళ్ళు ఉండేవాళ్ళు!

అంత బలమైన ముద్ర గలది గురుకుల వ్యవస్థ. ఇప్పుడు అది పూర్తిగా మారి పోయిందనుకొండి, అది వేరే విషయం!

ఇక ఈ విధంగా ఏ ఇతర కళ లేదా శాస్త్రాల మీదా అధ్యయనాసక్తి, అభ్యాసనాసక్తి లేని పిల్లలు, లేదా ఆసక్తి ఉన్నా తల్లిదండ్రుల ప్రోత్సహించని పిల్లలు, తమ వారసత్వ విద్యని వృత్తినీ చేపట్టే వాళ్ళు.

సహజంగానే అది వారి వారసత్వపు విద్య అయ్యేది. అంటే కుల వృత్తి మాదిరిగా నన్న మాట. వారి తల్లిదండ్రుల వృత్తినే వాళ్ళూ స్వీకరించటం జరిగేది. రైతు కొడుకు రైతు గానూ, కుమ్మరి కొడుకు కుమ్మరి గానూ, వడ్రంగి కొడుకు వడ్రంగి గానూ!

నిజానికి జన్మతః లేదా, కులాన్ని బట్టి, వృత్తి అవలంభించటం అనేది, క్రమంగా సంభవించిన పరిణామం. అన్నివృత్తులూ వాటి వాటి పాత్రతని బట్టి సమాదరించబడిన నాడు, వైషమ్యాలు అంత ఎక్కువగా సమాజంలో పెచ్చరిల్లని నాడు, అహంకారం, కుంచిత ధోరణి వంటి మానసిక వికారాలు సమాజంలో పెచ్చరిల్లని నాడు, అదంతా చాలా మామూలుగా జరిగి పోగలిగేది. ‘అగ్రవర్ణం, అగ్రకుల వృత్తి, నిమ్న కులం, నిమ్న కులవృత్తి’ అనే అంతరాలు ఏర్పడిన నాడు, ఘర్షణ నెలకొనటం సహజమే కదా!?

గతంలో అంతా మంచే అని కాదు గానీ, అప్పటి సామాజిక వ్యవహార శైలినీ, జీవన వ్యవస్థనీ ఏ విధంగా కాలుష్య పరిచారో… అదే, కుట్ర తీరు! దానిని వివరించే ప్రయత్నమే ఇది!

ఇప్పుడు నటుల సంతతి నటనా వృత్తి చేపడుతున్నారు. కార్పోరేట్ కంపెనీల అధినేతల సంతానం, తండ్రుల కుర్చీలని వారసత్వంగా అందుకుంటున్నారు. రాజకీయ నాయకుల కెరీర్ ని, కొడుకులూ కూతుళ్ళు కోడళ్ళు అల్లుళ్ళతో సహా బంధువులంతా, అంది పుచ్చుకుంటున్నారు. దాని గురించి… ఇప్పుడు, ఏ మీడియా, ఏ అధునాతన రచయితలూ/రచయిత్రులూ, అభ్యుదయ వాదులూ, మాట్లాడటం లేదు గానీ… ఒకప్పుడు చాకలి కొడుకు చాకలే కావాలా? మంగలి కొడుకు మంగలే కావాలా? అంటూ… BC లనీ SC లనీ ST లనీ వర్గ విభజనలు చేసి మరీ, చిచ్చు పెట్టారు. [ఆ చిచ్చు నేటికీ కొనసాగటం చూస్తూనే ఉన్నాం కదా!] కుల వృత్తులతో కూడిన ప్రాచీన హైందవ సమాజమంత భ్రష్ఠమైనది మరొకటి లేదని ఎలుగెత్తి అరిచారు. అదలా ఉంచి మళ్ళీ వ్యవసాయ రంగం దగ్గరికి వస్తే…

ఈ వారసత్వ విద్యలనీ, వృత్తులనీ వాళ్ళు తమ తల్లిదండ్రుల నుండీ, అవ్వాతాతల నుండీ, ఇతర పెద్దల నుండీ అభ్యసించేవాళ్ళు. అయితే అబ్బాయిలే ఎక్కువగా, ఈ వృత్తి విద్యలని అభ్యసించే వాళ్ళు. అదే విధంగా ‘అక్షరాస్యత’ అంటే ‘పెద్ద బాలశిక్ష’ణ కూడా, పూర్తిగా అబ్బాయిలకే అందుబాటులో ఉండేది. అమ్మాయిలది దాదాపుగా మౌఖిక విద్యే! కొంతమంది అమ్మాయిలకు ఈ ప్రాధమిక విద్య అందినా తర్వాత అమ్మాయిలందరూ ఇంటిని నిర్వహించటమే నేర్చుకునేవాళ్ళు.

ఈ పాత పద్ధతుల్లోని అన్ని ప్రతికూలతలని పరిహరించి, సానుకూలతలని మాత్రమే గ్రహించి,

అదే విధంగా మన ఇప్పటి పద్దతుల్లోని ప్రతికూలతలని తొలగించి, సానుకూలతలని గ్రహించి,

అన్నిటినీ మేళవించి, ఇప్పటి పరిస్థితులకీ, అవసరాలకీ అనుగుణంగా మెరుగు పరచి… మన పిల్లల విద్యా వ్యవస్థని నిర్మించుకుంటే… అది ఎంత హాయిగా, ఎంత వత్తిడి రహితంగా ఉంటుందో కదా!?

ఇక ఈ వృత్తి విద్యల్లో… రైతు కుటుంబాల విషయాని కొస్తే…ఒక రైతు కుమారుడు, తన ప్రాధమిక విద్యాభ్యాసం ముగించాక, (ముగించక పోయినా సరే) వారికి పదిహేనేళ్ళ వయస్సుండగా… మేనమామ పంచెలుపెడతాడు. దాంతో వారి వృత్తి జీవితపు పండుగ ప్రారంభమౌతుంది.

ఏ వృత్తి అవలంబించే వారికైనా, మేనమామ పంచెలు పెట్టాడంటే, వాళ్ళిక పెద్ద వాళ్ళయ్యారనీ, బాధ్యతాయుత జీవితంలోకి అడుగుపెట్టారనీ అర్ధం! బాల్యం అయిపోయిందనీ, బాల్య చేష్టలిక తగ్గించుకోవాలనే హెచ్చరిక, ఆ పండుగ జరిపే ఆచారంలో ఉంటుంది. ఇదే పోలిక, 11 ఏళ్ళ వయస్సుకి ఆడపిల్లకి మేనమామ ఓణీలివ్వడంలోనూ ఉంటుంది.

ఇక తొలిసారి నాగలి పట్టించే రోజున కూడా పండుగ చేస్తారు. పిల్లవాడి చేత నాగలికీ, ఇతర వ్యవసాయ పనిముట్లకీ, ఎద్దులకీ పూజ చేయిస్తారు. పిల్లవాడి తలపై అక్షతలు జల్లి పెద్దలంతా దీవిస్తారు. అదే ఆడపిల్ల అయితే, తొలిసారి కవ్వం పట్టించే రోజున ఇలాగే చేస్తారు.

మా చెల్లెళ్ళకు చెయ్యలేదు గానీ, నాకైతే…కవ్వం పట్టించే రోజున, మా ఇంట్లో అమ్మ దేవుడికి పొంగలి నా చేత వండించి నైవేద్యం పెట్టించింది. గుంజకి కట్టిన పెద్ద కవ్వానికి, క్రిందా పైనా తాడుతో కట్టి, నాన్న నాకు కవ్వాన్ని ‘హాండిల్’ చెయ్యటం నేర్పారు. సినిమాల్లో చూపిస్తారు చూడండి, అలాంటి నిలువెత్తు పెద్ద కవ్వం మా ఇంట్లో ఉండేది. ఆవులూ గేదెలూ ఉండటంతో, పాలూ మా ఇంట్లో సమృద్దిగా ఉండేవి.

ఆ నిలువెత్తు కవ్వం మీద మోజు కొద్దీ, కొన్ని రోజులపాటు జడగంటలు పెట్టుకుని ముస్తాబై, ఆపైన పెరుగు చిలికేదాన్ని. (ఆ తర్వాత టైమ్ లేదంటూ కాలేజీకి పరిగెడితే, చివరికి నాన్న టేబుల్ ఫ్యాన్ కి రెక్కలు తీసేసి, చిన్ని కవ్వం తగిలించి, స్టాండు ని భూమికి లంబంగా గాకుండా సమాంతరంగా రాడ్డుకి బిగించి, మజ్జిగ మెషిన్ తయారు చేసారు. దానితో అమ్మ వెన్న తీసేది.)

ఆ విధంగా మగపిల్లల చేత నాగలి, ఆడపిల్లల చేత చల్లకవ్వం పట్టించిన రోజున, పాలు పొంగించి పొంగలి చేయటం, పూజలు చేయటం, పండుగ జరపటంలో… పాడి పంటలు తమ ఇంట పొంగి పొర్లాలనే ఆకాంక్ష ఉంటుంది.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!


20 జనవరి, 2011 తేదీన ‘ఈనాడు’ పత్రిక… ‘నలుపు ఊబి’ శీర్షికతో స్విస్ బ్యాంకు, ఇతర విదేశీ బ్యాంకుల్లో దాచబడిన లక్షల కోట్ల డాలర్ల గురించి వ్యాసం ప్రచురించింది. ‘న్యూస్టుడే ప్రత్యేక విభాగం’ పేరిట వ్రాయబడిన ఈ వ్యాసంలో ‘ఎంత ఉండొచ్చు? ట్యాక్స్ హెవెన్స్, కానరాని తెల్లదారి, చీకటి దారులు, వికీలీక్సే శరణ్యం’ గట్రా ఉపశీర్షికలున్నాయి.


ఇందులో ట్యాక్స్ హెవెన్స్ ని ఒకసారి గమనించండి.
>>>

ఇప్పుడు సర్వనామాలతో చెబుతోన్న అమెరికా, బ్రిటన్ చుట్టుప్రక్కల గల చాలా దీవులతో సహా, 40 దేశాలు, ఎటువంటి బెడద లేకుండా… గోప్యంగా డబ్బు దాచిపెడతామని ప్రచారం చేసుకుంటున్న టాక్స్ హెవెన్స్ అట. అదే సమయంలో, వీటిల్లో చాలా దీవులు పర్యాటక హెవెన్స్ కూడా! ఎంచక్కా టాక్స్ హెవెన్స్ లోని బ్యాంకుల్లో దాచుకున్న నల్లసొమ్ము తాలూకూ కార్డ్సు గోక్కుని, అక్కడ ‘ఒళ్ళు పట్టించుకోవటం’ దగ్గరి నుండి చాలా సుఖాలే పొందవచ్చు.


వాటిల్లో చాలా పర్యాటక కేంద్రాల గురించి… ఈ పత్రికలూ, మీడియానే ఎన్నోసార్లు, ఊరిస్తూ కధనాలు వ్రాసి, ప్రచారం చేసి ఉన్నాయి. అయితే ఒక్కసారంటే ఒక్కసారి కూడా…అక్కడగల ఈ ‘నల్లసొమ్ము లభ్యత’ గురించి వ్రాయలేదు. ఇప్పుడు వికీలీక్స్ వంటి [వాటి పాలిటి] ఉపద్రవాల కారణంగా, ఈ పాటి అయినా వ్రాయడం జరుగుతోంది.


ఇక్కడో విషయం గమనించండి. ఆయాదేశాలు ‘ఎటువంటి బాదరబంది లేకుండా గోప్యంగా డబ్బు దాచిపెడతామని’ ప్రచారించేటప్పుడు… ఈ మీడియాకి తెలియదా, అది దొంగతనంగానూ, అక్రమంగానూ దండుకున్న సొమ్మేనని? మీడియా పనే ఇలాంటి ‘దారుణాల’ని బయటపెట్టటం కదా? మరి దశాబ్దాలుగా ఆ ‘హెవెన్’లని వేలెత్తి చూపెట్టలేదేం?


ఇంకా పైగా, అలాంటి దేశాలతో ఒప్పందాల కారణంగా, డబ్బుదాచిన పెద్ద దొంగల వివరాలు, తమ దగ్గరున్నా బయటపెట్టలేమంటున్నారు, యూపీఏ ప్రభుత్వం+ఆర్ధిక వేత్త అయిన ప్రధానీ! దొంగలు దొంగలు ఊళ్ళుపంచుకున్నారన్నట్లుగా లేదూ ఇది!?


తమ దోపిడికి అనుకూలంగా తాము చేసుకున్న ఒప్పందాలు!


ఏ దేశంలోనైనా… ప్రపంచవ్యాప్తంగా… సామాన్యుణ్ణి బక్కవాణ్ణి చేసి…దోచుకున్న సొమ్ము, దాచుకున్న సొమ్ము! దాని వివరాలు బయటపెట్టమని ఒప్పందాలు చేసుకున్న వాడూ తోడు దొంగే కాదా? ఇంతకీ ఆ ఒప్పందాలు, ఎవరు, ఎప్పుడు, ఏనాటి ప్రభుత్వము తరుపున చేసుకున్నారో… మీడియా ఇప్పటికీ స్పృశించటం లేదు.


నిజంగా మీడియాకి నిజాయితీ, అక్రమాలని బయట పెట్టాలనే సంకల్పమే ఉంటే, ఇప్పటి వికీలీక్స్ చేస్తున్న పనిని, దశాబ్దాల క్రితమే మీడియా చేసి ఉండాలి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మీడియా సంస్థల్లో…‘ఈనాడు’ గొప్పగా ప్రచారించుకునే ‘ఫోర్డ్స్’, ‘న్యూయార్క్ టైమ్స్’, మరో xyzలలో…ఒక్కటంటే ఒక్కటన్నా!


కానీ ఇంతవరకూ ఎవరూ ఆ పని చెయ్యలేదు. ఎందుకంటే – ఇవన్నీ నడుపుతోంది ఒకే గూఢచర్య సంస్థ కాబట్టి! అది నకిలీ కణిక వ్యవస్థ కాబట్టి! శతాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా అల్లుకున్న గూఢచర్య వలయం కాబట్టే, ఇంత పకడ్బందీగా నిర్వహించుకోగలిగాయి.


అలాంటి చోట… నెం.5 వర్గపు పనితీరు కారణంగా, ఇప్పుడు వాళ్ళకి ‘కానికాలం’ వచ్చి, వెలుగు చూస్తున్న నిర్వాకాలు, వెల్లడౌతున్న గూఢచర్య స్ట్రాటజీలలో ‘నల్లడబ్బు వ్యవహారం బహిరంగమౌతూ, చర్చలకి దారి తీయటం’ ఒకటి.


అలాంటి చోట, ఇలాంటి ఎన్నో వ్యవహారాలని బయట పెడుతున్న వీకీలీక్స్ గురించి, అసాంజె వంటి వ్యక్తి గురించి… ‘ఈనాడు’ ఉటంకింపుని మరోసారి పరిశీలించండి.
>>>


హైదరాబాద్ సహా వివిధ నగరాల్లో, వ్యక్తుల వివాదాల్లో సెటిల్ మెంట్లు, దందాలు చేసే రౌడీల గురించి, మనకి తెలుసు. చివరికి సినిమాల్లో కూడా చూసి ఉన్నాం. [అందులో వినోదపు మిళాయింపుకి నవ్వుకునీ ఉన్నాం.]


చిన్నప్పుడు చదువుకున్న ‘రెండు పిల్లులూ – రొట్టెముక్క – కోతి కథ’లో లాగా…


ఓ సారి ఓ నల్లపిల్లి, ఓ తెల్లపిల్లి, తిండి కోసం వెదకసాగాయి. వాటికి ఓ ఇంట్లో రొట్టె కనిపించింది. నల్లపిల్లి మనుషులు వస్తే హెచ్చరించేందుకు కాపలాగా ఉంది. తెల్లపిల్లి రొట్టె దొంగిలించుకు వచ్చింది. తీరా తినబోతే పంచుకునే దగ్గర పేచీ వచ్చింది. కావలి ఉంది తను కాబట్టి తనకి పెద్ద ముక్క రావాలంది నల్లపిల్లి. కొట్టుకొచ్చింది తను కాబట్టి తనకే పెద్ద వాటా అంది తెల్లపిల్లి.


కొట్లాడుకుని కోతిని తీర్పు చెప్పమన్నాయి. తక్కెడ తెమ్మంది కోతి. తెచ్చాయి పిల్లులు. పంచుతానంటూ రొట్టెని రెండు ముక్కలు చేసి, తక్కెడ రెండు పళ్ళాలలో ఉంచింది కోతి. ‘ఇటెక్కువుందే!’ అంటూ ఓ ముక్కలోంచి కొంత తినేసింది. ‘అటెక్కువుంది!’ అంటూ మరో వైపులోంచీ కొంత తినేసింది. అలా…అలా…మొత్తం తినేసి చక్కాపోయింది.


పిల్లలకి చెప్పే ఈ కథలోని ‘వివాదాలు పడవద్దు’ అనే నీతిని కాసేపు పక్కన బెడితే…


ఈ కథలోని కోతిలా, వివాదపడ్డ ఇరుపక్షాల నుండీ డబ్బు దండుకొని, అందులో ఎవరు తమకి ఎక్కువ ముట్టచెబితే, లేదా ఎవరి పరపతి నుండి తమకి ఎక్కువ ప్రయోజనమో, (ఎక్కువ exchange favours ఉన్నాయో) వాళ్ళకి ప్రయోజనం చేకూరుస్తూ… రౌడీలు సెటిల్ మెంట్లు చేస్తారు. (కాలక్రమేణా వాళ్ళే రాజకీయ నాయకులై పోవటమూ కద్దు.)


ఇలాంటి రౌడీలు మరికొంత ముదిరి…ఏ డబ్బునా వాడికో, సెలబ్రిటీలకో లేదా అలాంటి పరపతి గలవాడికో… వాళ్ళకి నచ్చిన స్థలమో, పొలమో మరో ఆస్థో కనబడితే…సదరు రౌడీని చేరి…‘ఫలానా ఏరియాలో ఫలానా సర్వేనంబరులో ఉన్న స్థలం లేదా పొలం నాకు చేసిపెట్టు’ అంటే చాలు!


ఈ రౌడీలు రంగంలోకి దిగి, ఆ స్థలం లేదా పొలం యజమానిని బెదిరించో, చావదన్నో…రిజిస్ట్రేషన్ తో సహా చట్ట పూర్వకంగా ఆస్థి లాగేసుకుంటారు. కాగితాల ప్రకారం… సజావుగా…సదరు యజమాని, ఈ రౌడీ గారిని ఆశ్రయించిన ప్రముఖుడికి తన ఆస్థిని అమ్మినట్లు ఉంటుంది. రౌడీలకి ప్రముఖుడి నుండి భారీ మొత్తం ముడుతుంది. అదీ వీళ్ళు నడిపే దందా?


అలాంటి రౌడీతో అసాంజ్ (వీకీలీక్స్) కు పోలికెలా పెట్టినట్లు?


రౌడీ గాళ్ళు చేసేది దందా! ఆ సొమ్ముతో చేసేది జల్సా! స్వలాభం కోసం, స్వసుఖం కోసం… దౌర్జన్యాలు , హింసా కూడా చేసే వాడు రౌడీ! అక్రమాల రహస్యాలనీ, గూఢచర్యం గుట్టుముట్లనీ వెల్లడిస్తున్నవాడు వికీలీక్స్ అసాంజె! మాన ప్రాణాలకు ప్రమాదం ఉన్నా లెక్క చెయ్యకుండా…దేశాల పెద్దలు చేసిన అక్రమాల గురించీ బయట పెట్టిన వాడు వీకీలీక్స్ అసాంజె! అతడికి రౌడితో పోలికా?


అసాంజె దీ, అలాంటి ఇతరులదీ… న్యాయం కోసం పోరాటం!


సమాజ హితం కోసం పోరాటం!


ప్రపంచవ్యాప్తంగా సామాన్యులపై దోపిడికి వ్యతిరేకంగా పోరాటం!


దేశాల కతీతంగా బడాదొంగలకి వ్యతిరేకంగా పోరాటం!


కాబట్టే… అతడి మీద ‘ఆకలి, ఆడది’ ప్రయోగింపబడుతున్నాయి. లైంగిక వేధింపుల కేసులకు లోనై అసాంజ్ జైలుపాలయిన సంగతీ, షరతులతో విడుదలైన సంగతీ తెలిసిందే! అతడి ‘ఆకలి గురించీ, ఆర్ధిక ఇబ్బందుల గురించీ, ఇల్లూ వాకిలి లేకుండా దేశాల దిమ్మరిలాగా నలుగుతున్న విషయాలు గురించీ’ తెలిసిందే!


అలాంటి చోట …రౌడీలతో అసాంజ్ కు పోలికా?


వివాదాలు పడ్డవాళ్ళ మధ్య రౌడీలు సెటిల్ మెంట్లు చేయగలరు (అందులో వాళ్ళ దందా, స్వలాభం సంగతి పక్కనుంచినా!) అయితే అసాంజ్!? స్విస్ బ్యాంకులూ, లీక్టైన్ స్టైన్ వంటి టాక్స్ హెవెన్లలో దాచబడిన నల్లసొమ్ముని వెనక్కి రప్పించలేడు కదా!?


అలా డబ్బు వెనక్కి రప్పించగల ఈ దేశపు ప్రధాని (ఏ దేశపు వాడైనా ఇంతే చేస్తాడనుకోండి) నిస్సిగ్గుగా సాక్షాత్తూ సుప్రీం కోర్టుకీ, మంత్రివర్గ సహచరులకీ, ప్రజలకీ కూడా ‘విదేశాలతో ఉన్న ఒప్పందాల కారణంగా, అసలు నల్లడబ్బు దాచిన ఘరానా దొంగలు వివరాలు కూడా బయటపెట్టలే’నంటున్నాడు. తమ దగ్గర ఆ వివరాలు ఉన్నా సరే! ఇక ఆ డబ్బు వెనక్కి తెప్పించేదెక్కడ? అంతగా తాము ప్రజలకు వ్యతిరేకమనీ, దోపిడి గాళ్ళకు అనుకూలమైన సహదోపిడి గాళ్ళమనీ నిరూపించుకుంటున్నాడు.


అలాంటి చోట…అసాంజ్…సమాచారాన్ని బయట పెడుతున్నాడు. ఆ విధంగా రహస్యాలు వెల్లడి కావటమే ఈ గూఢచారులకి మృత్యుశయ్య కావచ్చు గాక! రౌడీల్లాగా ‘డబ్బు సెటిల్ మెంట్’లు మాత్రం అసాంజ్ చెయ్యలేడు.


మరెలా అసాంజ్ ను రౌడీలతో పోల్చినట్లు, ఈనాడు ప్రత్యేక విభాగం? సదరు మీడియా అధిపతి రామోజీరావుకీ, అతడి కుమారులకీ ఉన్న దుగ్ధే తప్ప… ఆ పోలికలో ఔచిత్యం ఏ కొంచెమైనా ఉందా!?


ఎంతగా భావాలని కలుష పరచటం ఇది?


తెలంగాణా నాయకుడూ, పచ్చి తాగుబోతూ, పరమ వదరబోతూ అయిన కేసీఆర్ ని… డిసెంబర్ 10, 2009న ‘తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ షురూ’ ప్రకటన నేపధ్యంలో ‘బక్క మహాత్ముడనీ’, ముఖేష్ అంబానీని ‘వ్యాపార మహాత్ముడనీ’ పొగడటం, ఎంతగా భావాలని కలుషి పరచటమో, రౌడీలతో అసాంజ్ ని పోల్చడం కూడా అంతగా భావాలని కలుషపరచటమే!


బిన్ లాడెన్ నీ, బిల్ గేట్స్ నీ ఒకే గాటన కట్టేసినట్లు?


అసాంజ్ కు రౌడీలతో సారూప్యత చెప్పి, మరోసారి…‘ఈనాడు’, దాని అధిపతి రామోజీరావు, తమకు మంచిపట్ల గల వ్యతిరేకతని మరోమారు నిరూపించుకున్నారు.


మరోమాటగా చెప్పాలంటే నకిలీ కణిక వ్యవస్థకి మరో దృష్టాంతం ఇది. మరింతగా స్పష్టపడుతున్న, పడనున్న దృష్టాంతం కూడా!


మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

గణతంత్ర దినోత్సవ కానుకగా… ఈ చిన్న కల్పిత కథ… మీ కోసం!
~~~~~~~

జనవరి 26,

గణతంత్ర దినోత్సవం.

ఉదయం ఎనిమిది గంటలయ్యింది. ఢిల్లీ చలి! చల్లటి గాలి!

పెరేడ్ కెళ్ళాలి. జండా ఆవిష్కరణ కార్యక్రమం ఉంది.

ప్రధానమంత్రి నివాసంలో, దైనందిన కార్యక్రమాలన్నీ టైమ్ ప్రకారం జరిగి పోతున్నాయి.

అదే స్థితి రాష్ట్రముఖ్యమంత్రుల, మంత్రుల నివాసాల్లోనూ!

కొంచెం భిన్నంగా ఉన్నా…చాలామంది పార్లమెంటు సభ్యుల, శాసన సభ్యుల, బ్యూరోక్రాట్ల నివాసాల్లోనూ… రిపబ్లిక్ డే ఉత్సవాలకి హాజరయ్యేందుకు ఉద్యుక్తులౌతున్న వాతావరణమే నెలకొని ఉంది.

ప్రధాని నివాసంలో…

రాజ్ పథ్ కి బయలు దేరబోతున్న ప్రధానమంత్రికి ఎదురుగా, పార్సెల్ పట్టుకుని నిలబడ్డాడు సహాయకాధికారి.

“ఏమిటిది?” ప్రధాని ప్రశ్న!

“పార్శెల్ సర్! ఒకటి పాక్ సరిహద్దుల్లో కావలి కాస్తున్న సైనికుల దగ్గరి నుండి! మరొకటి ఈ దేశపు మారుమూల పల్లెలోని రైతుల నుండి!”

“ఏముంది వాటిల్లో!”

“విప్పి చూడలేదు సర్!”

‘కానీయ్’ మన్నట్లుగా ప్రధాని సైగ!

విధేయత ప్రకటిస్తూ తల ఊపిన అధికారి పార్సెల్ విప్పాడు.

మొదటి పార్సెల్ లో చిన్నపెట్టె!

అందులో మట్టి ఉంది!

రక్తంతో తడిసిన మట్టి!

చిన్న నోట్ కూడా ఉంది!

అందులో…

“గౌరవనీయులైన నాయకమ్మన్యులకు!

చలిలో, ఎండల్లో, వానల్లో…దేశపు సరిహద్దుల్లో…కుటుంబాలకి దూరంగా… దేశపు భద్రతను నిర్వహిస్తున్నామనే తృప్తితో, నిరంతర అప్రమత్తతలో కావలి కాసే సైనికులం మేం!

యుద్దాలంత పెద్ద కారణాలు అక్కర్లేదు. ఏదో కారణాన కాల్పులకి పాల్పడే శతృమూకల తూటాలు చాలు! శతృదాడిని తిప్పికొడుతూ, నేలకొరిగిన తోటి సైనికులకి కన్నీటి నివాళులర్పించిన వాళ్ళం మేం!

అయినా మాకు బాధలేదు. దేశపు పరువునీ, ప్రతిష్ఠనీ కాపాడుతున్నామన్న తృప్తి ముందు ‘బాధ’ మాసిపోయింది.

ఎందుకంటే – తోటి సైనికుల రక్తంతో తడిసిన ఈ దేశపు మట్టి వాసన, మా ఊపిరిలో ఉంది.

అది మమ్మల్ని నిరంతర కర్తవ్య దీక్ష వైపు నడిపిస్తోంది.

ఈ మట్టి స్పర్శ… ఈ దేశం,

అవినీతిమయ రాజకీయుల నుండి,

అక్రమాల పరిపాలనా విభాగం నుండి,

విఫలమౌతున్న రాజ్యాంగపు అమలు నుండి… రక్షింపబడి తీరుతుందన్న ‘నమ్మకం’ మాలో నింపుతోంది.

అందుకే…

సైనికుల రక్తంతో తడిసిన ఈ మట్టి, మీకూ ‘ఏమైనా…’ గుర్తు చేయగలదేమోనని, ఆశిస్తూ…

ఈ కానుక మీకు!

జై జవాన్!”

అని వ్రాసి ఉంది!

అది చదివిన ప్రధానమంత్రి ముఖం పాలిపోయింది.

కార్పోరేట్ కంపెనీల వత్తిడిని తల్చుకుని, అంతలోనే తేరుకొని “రెండవ పార్సెల్ విప్పు” అన్నాడు.

“యస్ సార్!” అంటూనే అధికారి రెండో పార్సెల్ విప్పాడు.

అందులోనూ ఓ పెట్టె!

దాన్లోనూ మట్టే ఉంది.

చమటతో తడిసిన మట్టి!

అందులోనూ చిన్న చీటీ ఉంది.

వణుకుతున్న చేతుల్తో, అది అందుకుని చదవటం మొదలెట్టాడు.

అందులో

“గౌరవనీయుడైన దేశ నాయకుడా!

చలిలో, ఎండల్లో, వానల్లో… ఆరుగాలం పాటు కురిసే వానలకీ, కాలువల్లోంచి పొలాల్లోకి పారే నీళ్ళకీ మా చెమటని కూడా కలగలిపి, తిండి పండించే రైతులం మేం!

పండిన పంట చేతి కొచ్చే లోపున…విత్తన కంపెనీల చేతుల్లో బాలరిష్టాలు దాటుకొని, మందుల కంపెనీల చేతుల్లో కుదేలై…కూలీల డిమాండ్లలో కునారిల్లి…ఎలాగోలాగ…పండించిన పంట మార్కెట్లకి తెచ్చుకొని అమ్మేవేళ, నేల చూపులు చూసే ధరల్ని చూసి బిక్కమొఖం వేస్తున్నాం.

ఏదైనా అమ్మేవేళకి అడవి ధరలు,

కొనేవేళకి కొరివి ధరలు!

అన్నివేళలా రాజకీయ నాయకుల ఉపన్యాసాల హోరులు!

ధర్నాల దరువులు!

మరో ప్రక్క సెజ్ ల ఆక్రమణలని చూస్తూ నిట్టూర్పులు!

ఇన్ని ఈతి బాధలనూ సహనంగా భరిస్తూ, మేం చిందించిన చమటతో తడిసిన మట్టి ఇది!

బాధలు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న తోటి రైతుల భార్యబిడ్డల కార్చిన కన్నీళ్ళు కూడా, మా చెమటలో ఇంకి పోయాయి. ఈ మట్టిలో కలిసి పోయాయి.

అందుకే… ఇప్పటికీ వానలు కురుస్తున్నాయి. నీళ్ళు పారుతున్నాయి. పొలాల్లోని మట్టి మా చెమటతో తడిచి, అన్నం పప్పుగా ఆకృతి తాలుస్తోంది.

అందుకే…మేం చెమటకార్చటం ఆపలేదు, శ్రమించటమూ ఆపలేదు.

ఎందుకంటే – మా చెమటతో తడిసిన ఈ మట్టి మా తరతరాలది.

వేల సంవత్సరాలుగా మా పూర్వీకులు నేర్పిన శ్రమ సంస్కృతిది.

ఆ సంస్కృతే ఇన్ని కష్టనష్టాలకి ఓర్చి నిలబడటం మాకు నేర్పింది.

సహనంగా సమస్యల పరిష్కారం కోసం వేచి ఉండే నిబ్బరాన్ని నేర్పింది.

అందుకే…

మా రైతుల చెమటతో తడిసిన ఈ మట్టి, మీకూ ‘ఏమైనా’ గుర్తుకు తెస్తుందేమోనని ఆశిస్తూ…

ఈ కానుక మీకు.

జై కిసాన్”

అని వ్రాసి ఉంది.

తర్వాత విచారిస్తే… ఒక్క ప్రధానమంత్రికే కాదు, కేంద్రమంత్రులకీ, రాష్ట్రముఖ్యమంత్రులకీ, మంత్రులకీ, పార్లమెంటు సభ్యులకీ, శాసన సభ్యులకీ, ప్రతి పక్ష నాయకులకీ, బ్యూరోక్రాట్లకీ కూడా ఇలాంటి పార్సెల్స్ అందాయని తెలిసింది.

సైనికుల రక్తంతో తడిసిన మట్టి!

రైతుల చమటతో తడిసిన మట్టి!!

‘వీళ్ళల్లో ఏ కొంచెం మార్పునైనా తెస్తుందా లేదా?’ అనే ఉత్సుకతతో, ఆసక్తితో… వందకోట్లకు పైగా భారతీయుల చూపు వాళ్ళపై నిలిచి ఉంది!

జవాబింకా రాలేదు!

గత టపాలో వివరించినట్లుగా భర్త కష్టాలని పంచుకునేందుకు రాజ్యభోగాలు వదలి భర్తతో అడవులకు తరలిన సీతా దేవిని మరచిపోయిన ఆధునిక శ్రీమతులు కొందరు, భర్తలు ఓటమిలో ఉన్నప్పుడు విడాకులు తీసుకోవటానికి వెనుకాడటం లేదు. ఉద్యోగంలో సస్పెండ్ అయినప్పుడో, వ్యాపారంలో కష్టాల పాలైనప్పుడో… వృత్తిలో అవకాశాలు పోగొట్టుకున్నప్పుడో… ప్రముఖల జీవితాల్లో కూడా ‘ఇలాంటి విడాకుల’ సంఘటనలని చూస్తూనే ఉన్నాం కదా!?

ఈ విధంగా సమాజంలో… ‘విడాకులు పెరిగిపోయిన, సర్ధుబాటు ధోరణి తరిగిపోయిన’ నేపధ్యం నేటిది. ఒకప్పుడు ఇతిహాసాలు మానసిక శాస్త్రవేత్త (సైకాలస్ట్, సైక్రియాట్రిస్ట్) ఇంకా ఫ్యామీలీ కన్సల్టంట్ ల పాత్రలని కూడా నిర్వహించేవి. పురాణాలు కాదు సుమా! పురాణాలలో ప్రకోపపూరితాలైన చాలా ప్రక్షిప్తాలు వచ్చి చేరాయి. హోటల్ కి వెళ్ళి, సాంబారులో తానే బొద్దింక వేసి యాగీ చేసే రేలంగి లాగా… నకిలీ కణిక వ్యవస్థ నిర్వహించిన స్ట్రాటజీ ఇది.

ఇతిహాస గాధలు, ప్రజలు తమ జీవన శైలిని రూపొందించుకునేందుకు తోడ్పడేవి. ఇప్పుడు మానసిక నిపుణులకు డబ్బు చెల్లించి, అప్పాయింట్ మెంట్ల కోసం వేచి ఉండి, గోడు వెళ్ళబోసుకుని, వాళ్ళు చెప్పింది నోరెళ్ళ బెట్టుకుని వింటున్నారు. వ్యాపార దృష్టితో చూసినా కూడా అపారమైన సంపాదనే! ఇతిహాసాలపై ప్రజల ఆదరణని తుడి చేస్తే ఇలాంటి ప్రయోజనాలు కూడా లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి.

ఎందుకంటే – ఒక్క రాముణ్ణి, రాముడి కుటుంబాన్ని చూస్తేనే… ఎలా ఉండవచ్చో, ఎలా ఉండకూడదో అవగతమౌతుంది మరి!

మరోసారి రామాయణ గాధలోకి పరికిస్తే – శ్రీరామ వనవాసంలో సీతారామ లక్ష్మణులు చిత్రకూట పర్వత ప్రాంతంలో నివసిస్తున్నారు. సీతారాములు అడవి తాలూకూ అందాల్నీ, ప్రశాంతతనీ ఆస్వాదిస్తున్నారు. ఒకరికొకరైన ఆ సతీపతులు పరస్పర సాన్నిహిత్యాన్నీ ఆస్వాదిస్తున్నారు. ఏకాంతాన్నీ, హడావుడి లేని విరామాన్నీ, తీరికదనాన్నీ ఆనందిస్తున్నారు.

రాజప్రాసాదంలో దొరకని అవకాశాలవి. మనసారా వాటిని ఆనందిస్తున్నారు. సీతారాములకి ‘తాము రాజభోగాలని కోల్పోయామనే దుగ్ధో, దుఃఖమో’ లేవు. ప్రకృతి ఒడిలో ప్రశాంతతనీ, సహజ సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ, ఎక్కడ ఉంటే అక్కడే ఉన్న సానుకూలాంశాలని ఆనందిస్తూ గడిపారు.

ఇప్పుడు చాలామందికి అర్ధం కూడా కాని మానసిక స్థితి అది. ‘నగరాలని వదిలి, గ్రామాల్లో జీవితాన్నే భరించలేం’ అనుకునే వారికి రాజప్రాసాదాలని విడిచి అడవి ప్రశాంతతని సహించగలరా? హడావుడి జీవితంలో ప్రకృతి పరిశీలనా మరుగున పడిపోయింది, సహచరులతో సాన్నిహిత్య జీవితమూ కొరవడింది. బ్రతుకు పోరాటమే మొత్తం నిండిపోయింది.

నిజానికి మనం దేని కోసం పరుగులు పెడతామో ‘అది’ మనల్ని మరింత పరుగు పెట్టిస్తుందే తప్ప అందుబాటులోకి రాదు. అయితే ‘పనిచేయటం నావంతు. ఫలితం వచ్చేదే అయితే వస్తుంది. రానిదైతే నేనేం చేసినా రాదు. ఏ ఫలితమైనా దేవుడిచ్చేది’ అనుకుంటే… పరుగు తాలుకూ ఆయాసం ఉండదు. కృషి ఫలితం వొట్టిపోదు కూడా! ఇది నా స్వానుభవం! పరికించి చూస్తే ‘ఎవరికైనా ఇది జీవితంలో అనుభవాని కొచ్చేదే’ అనుకుంటాను.

ఒకప్పుడు బుద్దియోగాన్ని (అంటే ఫలితాన్ని ఆశించకుండా, భక్తి జ్ఞాన వైరాగ్యాలతో కర్మలనాచరించటం) ‘నిరాశావాదం’(పెసిమిజం) అని ప్రచారించారు. ‘ఫలితాన్ని ఆశించక పోవటమంటే, అసలు ఆ పని చేయటంలో ఉత్సాహం ఎక్కడి నుండి వస్తుంది?’ అని ప్రశ్నించారు.

నిజానికి, ఆచరిస్తే… అందులో ప్రయోజనాలేమిటో, ప్రమాదాలేమిటో, మంచి చెడుగులేమిటో తెలుస్తాయి గానీ, శుష్క చర్చలతో ఒరిగేదేమిటి? ఒడ్డున నిలబడి, నీటిలో ఈదటం గురించి చర్చలు చేయటం వంటిదే అది!

నీటిలోకి దిగి ఈదితే గదా, సాధక బాధకాలేమిటో, లాభనష్టాలేమిటో తెలిసేది!?

ఇక, రామాయణంలో, భరతుడు… అడవుల్లో ఉన్న శ్రీరాముడిని చేర వచ్చినప్పుడు, అతడు తల్లి కైక వరాలతో తనకు సంక్రమించిన రాజ్యాన్ని తిరిగి శ్రీరామునికి అర్పించేందుకు వస్తున్నాడని తెలియక, శ్రీరాముడిపై దండయాత్రకి వస్తున్నాడనుకొని, లక్ష్మణుడు భరతుడిపై దాడి కుద్యుక్తుడై దురుసోక్తులు పలుకుతాడు. రాముడతడిని వారించి, క్రోధమెంత అనర్ధదాయకమో చెబుతాడు.

‘ఆవేశంలో కూడా అనరాని మాటలంటున్నావు. శాంతించు’ అంటూ వారిస్తాడు. మూల రామాయణంలో వాల్మీకి శ్లోకాల కంటే, ప్రజా బాహుళ్యంలో రాముడు ఇలా శాంతమూర్తిగా, ధీరగంభీరంగా ఉంటాడు. శోకమూర్తిగా మూర్ఛితుడిగా ఉండడు. ఈ విషయాన్ని హేటువాదులు ఇష్టాపూర్వకంగా మరిచిపోయారు.

ఇక రామభరతుల సంభాషణలోనూ, రామగుహుల సంభాషణలోనూ, శ్రీరాముడితో మునీశ్వరుల చర్చల్లోనూ ఎన్నో విషయాలు చెప్పబడ్డాయి. సీతాదేవితో మునిపత్నుల సంభాషణలు కూడా, ఎంతో ఆసక్తికరంగా జ్ఞానపూర్ణంగా ఉంటాయి.

నిజానికి, అనసూయా దేవి తదితర మునిపత్నులతో సీతాదేవి సంభాషణలోనే… ప్లాష్ బ్యాక్ గా… సీతాకళ్యాణం వర్ణింపబడుతుంది. సీత తన పెళ్ళి విశేషాలన్నీ చెప్పాక “అమ్మాయీ! శివధనుర్భింగం ఇత్యాది అన్ని విషయాలూ నాకు తెలిసినవే! అయినా, నీ నోటి నుండి వినాలని ముచ్చటపడి అడిగాను” అంటుంది, అత్రిమహాముని సతీమణి అనసూయ. ఆమె త్రిమూర్తులకే మాత!

ఆ విధంగా ఫ్లాష్ బ్యాక్ గా సీతారామ కళ్యాణ గాధ రామాయణంలో అరణ్యకాండలో వస్తుంది.

శ్రీరామ వనవాస కాలంలో, రామలక్ష్మణులు దండకారణ్యంలో ఉన్న ఖరదూషణులు, వాళ్ళ అనుచరులూ అయిన, పదివేల మందికి పైగా రాక్షసుల్ని సంహరిస్తారు. అసురుల సంఖ్యతో పోలిస్తే ఆ అరణ్యంలో ఉన్న సాధుజనులు, తాపసుల సంఖ్య స్వల్పం. అసురులు సృష్టిస్తున్న అలజడి అక్రమాలు అపారం.

అచ్చం, ఇప్పుడు మన దేశం నిండా అసంఖ్యాకంగా ఉన్న అవినీతిపరులు, వాళ్ళు సృష్టిస్తున్న అలజడులూ, అక్రమాల పరిస్థితి వంటిదే అది. అప్పటి తపోజనుల మాదిరిగానే ఇప్పుడూ, అవినీతి జోలికెళ్ళని నీతిపరుల సంఖ్య స్వల్పమే! అప్పటి రక్కసుల మాదిరిగానే, ఇప్పటి అవినీతి రక్కసుల అక్రమాలూ అపారమే కదా!

అలాంటి అసురులనీ, వారి అక్రమాలనీ అంత మొందించాడు రాముడు. ఇది గుర్తుకొచ్చినప్పుడు ‘ఇప్పుడూ అలాంటి రామలక్ష్మణులరుదెంచి ఈ అవినీతి పరుల పీడ వదిలిస్తే ఎంత బాగుణ్ణు!’ అనిపించడం ఖాయం.

అయితే… శ్రీమాన్ రంగనాయకమ్మలు మాత్రం, తెగ విషవాదనలు కురిపించారు సుమా! వాళ్ళపాటికి వాళ్ళు దండకారణ్యంలో ఉన్న ఖరదూషణాది అసురులు, అక్కడి స్థానికులట. వాళ్ళ జీవన శైలి వారిదట. వాళ్ళ సహజ ప్రవృత్తి ప్రకారం వాళ్ళున్నారట.

అనివార్యమై అరణ్యవాసం వచ్చిన రాముడు, తన కీర్తి కండూతి తీర్చుకోవటం కోసం, అస్తిత్వం కోసం, వాళ్ళని తనకున్న ఆధునిక ఆయుధ సాంకేతికతతో వాళ్ళని చంపాడట. రాక్షసులతో పోలిస్తేనట రాముడిది ఆధునిక ఆయుధ సాంకేతికత అట. అదే ‘రాక్షసులకి మాయా యుద్ధాల తెలుసు కదా!?’ అంటే… ‘అదంతా కల్పితాలనేస్తారు’ ఈ రచయితలు/త్రులు.

అలాంటి చోట… శ్రీరాముడంటూ, అతడిది ధర్మాచరణంటూ, తర్వాతి కాలం నాటి కవులూ గాయకులూ, రాముడికి గొప్పదనం అంటగట్టారట. ‘రాముడిది ధర్మాచరణ అయితే, బ్రిటీషు వాళ్ళదీ ధర్మాచరణే ననాలి’ అనేంత బలంగా వాదించారు, సదరు విష రచయితలూ/రచయిత్రులూ!

ఎందుకంటే – రాముడు ధనుస్కుబాణాల టెక్నాలజీతో ఆధిక్యత చూపినట్లే, యూరోపియన్లు, బ్రిటీషు వాళ్ళూ, ఈస్ట్ ఇండియా కంపెనీ గట్రాలు, తుపాకి టెక్నాలజీతో స్థానికులైన ఇండియన్ల మీద ఆధిక్యత సాధించారట. ఇదీ వాదన!

నకిలీ కణిక వ్యవస్థకి స్పష్టమైన తోడ్పాటు ఇది. అప్పటికి స్పష్టపడక పోయినా, ఇప్పుడు 70MM లో ఆవిష్కృతమైన, అవుతోన్న తోడ్పాటు ఇది! అందుకే – సదరు రచయితలూ/రచయిత్రులకు… మీడియా, ఎనలేని తోడ్పాటునిచ్చి, వారి విష వృక్ష రచనలకీ, ఉపన్యాసాలకీ… తిరుగులేని ప్రచారాన్ని ఇచ్చింది.

నిజానికి, శ్రీరాముడితో, ఈస్ట్ ఇండియా కంపెనీ, బ్రిటీష్… పోల్చదగినవా? శ్రీరాముడు తన కంటే బలమైన రాక్షసులతో పోరాడాడు. ఈస్ట్ ఇండియా కంపెనీ, బ్రిటీష్ వాళ్ళలా… బక్కచిక్కిన వాళ్ళ మీదా, సామాన్య ప్రజల మీదా జులుం చూపెట్టలేదు. అందునా రాక్షసులకి మాయా యుద్ధం తెలియటమే కాదు, ఆనాటికి ఆధునాతన ఆయుధాలున్నాయి. శస్త్రాస్తా ప్రయోగాలు తెలుసు!

ఆ రాక్షసులు సాధుజనుల మీదా, తపస్సు చేసుకునే మునుల మీదా, సీత మీదా హింసకి పాల్పడ్డారు. అంతే గాక, శ్రీరాముడు రాక్షసుల మీదా, రాక్షసుల లంక మీదా గెలిచాక, వారి సంపదని అయోధ్యకి లూటీ చేసుకు పోలేదు, ఈస్టిండియా కంపెనీ, భారత్ లో చేసినట్లు… బ్రిటీషు వాళ్ళు, భారత్ తో సహా ప్రపంచమంతా చేసినట్లు!

పైగా… సదరు ఖర దూషణాది రాక్షసులకూ, దండకారణ్యం స్థానికం కాదు. వాళ్ళు అక్కడి స్థానికులూ కాదు. లంక నుండి, లంకేశ్వరుడి బలాధిక్యతతో విస్తరించిన వారే! ఇవన్నీ వదిలేసి, ఒక్కమాటతో చెప్పాలంటే మంచి వదిలేసి, మొత్తంగా రామాయణ భారతాల వంటి ఇతిహాసాల మీద దాడి చేయటమే పరమ కర్తవ్యంగా పని చేసారు సదరు రంగనాయకమ్మలు!

మొత్తంగా హిందూ మతాన్ని ధ్వంసం చేయటం అనే ‘అసైన్ మెంట్’ని ఇతోధికంగా నిర్వహించారు. కుట్రకు మద్దతుదారులే వీళ్ళంతా, తెలిసి చేసినా, తెలియక చేసినా వాళ్ళు చేసింది మాత్రం హిందూమతం మీద, భారతీయత మీదా కుట్రే!

రంగనాయకమ్మల గురించీ, ఇంకా అలాంటి ఇతర రచయితల గురించీ, వారి రచనలైన రామాయణ విషవృక్షాల వంటి విషతుల్య ప్రచురణల గురించీ, ప్రత్యేకించి ఎందుకు చెబుతున్నానంటే – తమ కుట్ర పూరిత రచనలతో, హిందూ వ్యతిరేక చర్యలతో, వాళ్ళు… తెలుగు యువత నుండి, హిందూ ఇతిహాసాలని తుడిచేసారు.

ఇతర భాషల్లో ఇలాంటి అసైన్ మెంట్లని, మరెవరో రచయితలు/రచయిత్రులు నిర్వహించి ఉంటారు. తమిళ రంగనాయకమ్మలూ, కన్నడ రంగనాయకమ్మలూ, హిందీ రంగనాయకమ్మలూ గట్రాలన్న మాట.

ఇక ఇప్పుడు, నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గం, అందులోని కీలక వ్యక్తులకి… అంతగా ఆ అవసరమూ లేకుండా పోయింది. ఇప్పటికే దాదాపుగా, ఇతిహాస గాధలని సమాజం నుండీ, యువతరం నుండీ తుడిచి వేసారు. ఇప్పుడు చాలామంది యువతీ యువకులకి, భారత రామాయణ గాధలు తెలియదు. ఆ మానవీయ విలువలూ తెలియవు. అయినా ఇంకా అప్పుడప్పుడు, ‘ద్రౌపది’ వంటి నవలల్నీ… అలాంటి రచనలు చేసే ‘మేథావులు’ డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ లకి నీరాజనాలనీ… చూస్తూనే ఉన్నాం కదా!

గతంలోని రంగనాయకమ్మలకి మచ్చుతునకలే (రెప్లికాలు) వర్తమానంలోని యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్లు!

దీన్ని సోదాహరణంగా వివరించాలంటే – మరోసారి రామాయణ విషవృక్షపు కాలుష్యాన్ని పరిశీలించాల్సిందే!

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

ఈనాటి వ్యవసాయం ఎలా ఉందో మనకి ప్రత్యక్షంగా తెలిసిందే! ఆనాటి వ్యవసాయం గురించి పెద్దలు పదిల పరిచిన చరిత్ర, సాహిత్యం, కళారూపాలు, జీవన శైలీ, ఆచార వ్యవహారాలు మనకి చాలా సమాచారాన్నే చెబుతాయి.

దాశరధి రంగాచార్య గారి ‘నా జీవన వేదం’లో మన ముందు తరాల వారి సామాజిక జీవనపు తీరుతెన్నులు కళ్ళకి కట్టినట్లు కనిపిస్తాయి. మా అమ్మా, నాన్నల నుండీ, ఇతర పెద్దల నుండీ, వారి చిన్నప్పుడు వారి పల్లె జీవితం గురించీ, నాటి వ్యవసాయపు తీరు గురించి విని ఉన్నాను.

మా తాత వ్యవసాయం చేస్తుండగా చూసి ఉన్నాను. కంది మినప చేలో కలుపు తీయటం, పరిగె ఏరటం, చాలు సరి చేయటం, గట్రా… నాకు స్వయంగా తెలుసు.

కల్లం తడిపేందుకు కుంట నుండి నాలుగు కడవల నీళ్ళు తెచ్చేసరికి ‘బేర్’ మన్నాను. అప్పటికి నాకు ఏడేళ్ళు ఉంటాయి. కంది చేను కోతకి వచ్చాక, కాపలా ఉండేందుకు మంచె మీద ముందుగా ఎండిన కంది కంప పరచి చిన్న గూడూలా పేర్చారు. అదేదో చందమామ కథలో బొమ్మలాగా, సినిమాల్లో చూసిన సీనులాగా అనిపించి, బోలెడు సరదా వేసింది.

రాత్రికి నేనూ వస్తానని మారాం చేసాను. ‘చాలా చలిగా ఉంటుంది, వద్దు!’ అంటే ‘నేను తట్టుకోగలనని’ బీరాలు పలికాను. మా తాత నన్నూ మా చిన్న పిన్నినీ తీసికెళ్ళాడు. తీరా రాత్రి చలికి వణికి పోతూంటే అప్పుడు తొలిసారిగా నాకు అర్ధమయ్యింది, మాటకీ చేతకీ చాలా తేడా ఉంటుందని!

‘ఆఁ తట్టుకోగలం లే!’ అని తేలిగ్గా అనేసుకుంటాం. తీరా ఆ పరిస్థితిని తట్టుకోవాలంటే అందుకు చాలా శక్తి కావాలి.

కానీ… పొలంలో, వ్యవసాయపు పనుల్లో అప్పటి నా అనుభవం నాకు గాఢమైన జ్ఞాపకాలుగా మిగిలి పోయాయి. పొలంగట్టున, తుమ్మచెట్టు నీడలో కూర్చుంటే మధ్యాహ్నపు ఎండలో, పైరు మీది నుండి అప్పుడప్పుడూ వీచే సన్నని గాలి సోకి, గమ్మత్తుగా అనిపించేది. అమ్మమ్మ అన్నం ముద్దలు కలిపి దోసిట్లో పెడితే భలే మజా వచ్చేది.

వ్యవసాయంతో నాకున్న ఈ కొద్దిపాటి పరిచయానికి, చదివిన పుస్తకాలు, తెలుసుకున్న పెద్దల జ్ఞాపకాలు, అనుభవాలు, మరికొంత అవగాహన నిచ్చాయి.

ముందు తరాల వారి వ్యవసాయంలో విత్తన కంపెనీలు లేవు, ఎరువుల కంపెనీలు లేవు, తెగుళ్ళ మందుల కంపెనీలూ లేవు. రైతులు స్వయంగా తమ పొలంలో నుండీ కొన్ని బలమైన మొక్కల్ని ఎంచుకొని, వాటిని శ్రద్ధతో మరింత బలంగా పెంచి విత్తనాలు సేకరించుకునేవారు.

ఈ ఏడు పంట బాగా పండిన వారి పొలాల్లో నుండి తర్వాతి ఏడాదికి విత్తనాలు సేకరించి పంచుకునేవాళ్ళు. ‘పాడి పంట’ అనే నానుడి సాక్షిగా పశుపోషణ వ్యవసాయం పెనవేసుకుని ఉండేవి గనుక ఎరువూ ‘నైదిబ్బల’ పేరుతో సమకూర్చుకోగలిగి ఉండేవాళ్ళు.

పచ్చిరొట్ట ఎరువు వంటి మెళకువలూ తెలిసి ఉండేవాళ్ళు. వేప కషాయాలూ, గోమూత్రాలూ తెగుళ్ళకి వాడేవాళ్ళు(ఈ పద్దతులు మళ్ళీ ఇప్పుడు అనుసరిస్తున్నారు.). పక్షులతో స్నేహం, సహజీవనం… పురుగుల నుండి క్రిమి కీటకాల నుండీ రక్షణ కన్పించేది.

మాంసాహారం తినే మనిషి ముందు కోడి కూరా, తోట కూరా పెట్టారనుకొండి ఏది ఎంచుకుంటాడు? ఖచ్చితంగా కోడి కూరనే!

పిట్టలూ అంతే! పైరు మీద పురుగులూ, క్రిమి కీటకాలూ దొరకుతుంటే పంట కాన పడవు. కంకుల ఏపు బారినప్పుడు డబ్బాల్లో రాళ్ళు పోసి గలగలాడిస్తూనో, వడిసెల తిప్పుతూనో పక్షుల్ని అదిలించుకునేవాళ్ళు. ఎందుకంటే – పైరు ఏపుబారి, కోత కొచ్చినప్పుడు, పిట్టలు తినే పరిమాణం కంటే, అవి వాలటం వలన రాలే గింజల పరిమాణం ఎక్కువ గనుక. అప్పుడు ‘పొలి పొలి’ అంటూ అరుస్తూనో, వడిసెల తిప్పుతూనూ పిట్టల్ని అదిలించడం తప్పనిసరి!

అట్లయ్యీ… కోతలకి ముందు, తొలి కాపు కంకుల్ని కోసుకొచ్చి, గ్రామ దేవత గుడిలో చెట్లకీ, తమ ఇంటి కిటికీలకీ వేలాడ దీసే వాళ్ళు. అది ఆచారంగా పాటించ బడినా, అందులో పిట్టల పట్ల సమాదరణ, సహజీవన సూత్రాలే ఇమిడి ఉన్నాయి.

ఇదంతా వ్యాపారం పేరుతో యూరోపియనులనే సముద్రపు దొంగలు, భారత దేశంలోకి అడుగు పెట్టక ముందు సంగతి! అంత ఖచ్చితంగా ఎలా చెప్పవచ్చునంటే – తమ తెగుళ్ళ మందులు అమ్ముకునేందుకు, పైరు పంటల మీదికి తామే తెగుళ్ళని వదిలే కుత్సితపు బుద్ది, వారి వ్యాపారంలో భాగం గనుక! ఇప్పుడది మనుషుల మీద సైతం, ప్రపంచ వ్యాప్తంగా ప్రయోగించబడటం మనం అనుభవిస్తున్నదే గనుక!

కాబట్టే శతాబ్దాల క్రితం… సమాజంలో కొన్ని మూఢాచారాలే ఉండనీ, అజ్ఞానపూరిత భయాలే ఉండనీ, రోగాలూ కరువు కాటకాలూ, చోర భయాలూ ఉండనీ గాక, ప్రజలు సుఖంగా సౌకర్యంగా బ్రతికేంత సంపద కలిగి ఉండేవాళ్ళు. బ్రతుకు పట్ల సంతృప్తితో ఉండేవాళ్ళు. నిరంతర అసంతృప్తి వాదంతో పరుగులు పెడుతూ ప్రశాంతత కోల్పోయి లేరు.

ఆపాటి, ప్రశాంతత కోల్పోకుండా, నిరంతరం అప్రమత్తం చేసేందుకు తగిన గురువులు ఉండేవాళ్ళు, ఆచార వ్యవహారాలుండేవి. చివరికి బిచ్చ మెత్తుకునేందుకు వచ్చే వాళ్ళు కూడా తత్వాలు పాడేవాళ్ళు. అందుకే వాళ్ళని సాధువులని పిలుస్తూ, ప్రజలు గౌరవించేవాళ్ళు. కొన్ని కులవృత్తుల వాళ్ళు కూడా, బిక్షమడుక్కోవడమే వృత్తిగా కలిగి ఉన్నా… దానికీ గౌరవాదరణలుండింది కూడా ఈ కారణంగానే!

జంగమ దేవతలని సాక్షాత్తూ శివుడి అంశగా తలిచేవాళ్ళు. బుడబుడకల వాళ్ళనీ అంతే! చిన్నపాటి ఇంద్రజాలాలని ప్రదర్శించే ఈ కుల వృత్తి గలవాళ్ళు, గ్రామాలలో ఆదరణని పొందేవాళ్ళు. సోది చెప్పే ఎరుకుల కులవృత్తి కాలక్రమంలో వేశ్యావృత్తిని కూడా సమాంతరంగా పాటించడం జరిగింది.

ఇలాంటి మరికొన్ని కులవృత్తులే గాక, దేశాటన చేస్తూ తత్త్వాలు పాడుతూ తిరిగే వాళ్ళు, చివరికి పశువుల మందలని తోలుకుంటూ దేశాల వెంట వాళ్ళు కూడా, ప్రజలని తగినంత స్ఫూర్తి పరుస్తూ ‘మృత్యువు అనివార్యమనీ, పదార్ధ సంపాదనా పరుగు మితి మీరితే అనర్ధదాయక మనీ’ ఎరుక పరుస్తుండేవాళ్ళు.

నిజానికి కులవృత్తిగా తత్త్వాలు పాడుతూ తిరిగే పామరులే వాళ్ళు. అయితే యాదృచ్చికంగా వినబడినా… పదే పదే వినబడే ఇటువంటి తత్త్వాలు… పాడేవాళ్ళని, వినేవాళ్ళనీ కూడా… ఒక క్షణం కాకపోతే మరోక్షణం లోనన్నా ఆలోచనలో పడవేస్తాయి. పరిణతిని పెంచుతాయి.

దీనికి విపర్యయంగా, నేటి మీడియా, సినిమా వంటి మాధ్యమాలు… పదేపదే దుస్తులు విప్పేసిన దుడ్డు సుందరీ మణులనీ, బక్క చిక్కి ఎముకలు ప్రదర్శించే సన్న సుందరీ మణులనీ (దుస్తులు విప్పటం మాత్రం కామన్ పాయింటు), వాళ్ళని చూస్తూ చొంగ కార్చే మగవాళ్ళనీ (అందులో పూజారి గెటప్ లూ, ముసలి వగ్గు గెటప్ లూ తప్పనిసరి!) చూపిస్తూ ‘జీవితాన్ని ఎంజాయ్ చెయ్యటమంటే ఇదే – ఇలాగే బావుకోవాలి’ అని బ్రెయిన్ వాష్ చేస్తున్నాయి. పసివాళ్ళ దగ్గరి నుండి ముది వయస్సు వాళ్ళ దాకా!

అప్పటిదీ ఇప్పటిదీ కూడా బ్రెయిన్ వాషే కావచ్చుగాక! కనీసం అది సమాజానికీ, సంఘ ప్రశాంతతకీ మేలు చేసే బ్రెయిన్ వాష్! ఎందుకు చెప్తున్నానంటే – ఒకప్పుడు మతాచారాలూ, సాంఘీక కట్టుబాట్లూ ప్రజలని, స్త్రీలని, అణగారిన వర్గాలని బ్రెయిన్ వాష్ చేసాయని, రంగనాయకమ్మలూ, స్త్రీవాదులూ, హేటు వాదులూ తెగ వాదించారు లెండి.

ఏ విషయంలోనైనా పరిమితి దాటితే విషప్రాయమే! అప్పుడు దానిలో అహంకార పూరితుల స్వార్ధమూ, అధికారమూ చేరతాయి.

ఏదేమైనా, ఒకనాడు సమాజంలో ఆచరణలో ఉన్న తత్త్వాలు, ఆచార వ్యవహారాలు ప్రజలని ‘సంపాదన పట్ల భోగలాలస పట్ల మితిమీరిన పరుగు తీయకుండా కొంత నియంత్రించేవి’ అన్నది సత్యం.

చివరికి సంక్రాంతి ముగ్గులలో కూడా ఈ విషయాలు స్పష్టంగా ఆచరణలో ఉండేవి. మా చిన్నప్పుడు, మా అమ్మమ్మ సంక్రాంతి నెల పట్టగానే గీతలతో పెద్ద పెద్ద ముగ్గులు వేస్తూ వాటికి అర్ధాలు చెప్పేది. వాటిల్లో ఒకటి తాబేలు ముగ్గు. గుండ్రని గీతల ఆకృతిలో, ఆరు వైపుల కొన్ని గీతలు బయటికి మలిచేది. ఏమిటిది అంటే “ఏమోనర్రా! ఇది తాబేలు ముగ్గు. సంక్రాంతి నెలలో తప్పకుండా వెయ్యాలి” అనేది.

తర్వాత ఎక్కడో చదివాను, అది గీతా శ్లోకాన్ని గుర్తుకు తెస్తుందనీ, ఆ విధంగా మనిషికి స్థిర బుద్దిని గుర్తు చేస్తుందనీ!

గీతాశ్లోకం:
యదా సంహరతే చాయం కూర్మోంగానీవ సర్వశః
ఇంద్రియా ణీంద్రియార్థేభ్య స్తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా||
భావం:
శరీరావయవాలను తన లోపలకు ముడుచుకునే ‘తాబేలు’ వలె, యింద్రియాలను విషయాల నుంచి మరల్చి తన వశ మందుంచుకొనే వాడి బుద్ధియే స్థిరమైంది.

అంతగా ఆచార వ్యవహారాలు ఆధ్యాత్మికత గురించీ, తాత్విక చింతన గురించీ… ఆలోచించని వాళ్ళని కూడా, ఆలోచించేలా ప్రేరిపించేవి. అదే కోవకి చెందినవి తత్త్వాలు, పనిపాటల్లోని పాటలూ!

మచ్చుకి కొన్ని చూడండి.

ఇల్లు ఇల్లని యేవు, ఇల్లు నాదని యేవు
ఇల్లెక్కడే నీకు చిలకా!
వొస్తావు వొంటిగా! పోతావు వొంటిగా!
నడిమినీ మజిలీ ఉత్తి నాటకమే రామ చిలకా!
తోలు తిత్తి ఈ కాయం, తూటులూ తొమ్మిదీ
పోయేది తెలియదే చిలకా!

మరొకటి:
మిడిసి పడకురా నరుడా
మిత్తి వెన్నంటి ఉంది చూడరా!

ఎప్పుడు మీద పడనున్నదో తెలియనిది మృత్యువు. బ్రతికి ఉండగానే నాలుగు మంచి పనులు చేసుకో! వెంట వచ్చేది మంచి చెడు కర్మఫలితాలే గానీ… ఇళ్ళూ వాకిళ్ళూ, చేలూ తోటలూ, నగలూ నాణ్యాలూ కాదని చెప్పే తత్త్వాలివి.

ఫలానా ‘తాత’ తత్వాలు పాడతాడు అంటూ గౌరవంగా చెప్పుకునే వాళ్ళు, ఇలాంటి తత్వాలు పాడే వారి గురించి!

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

సంక్రాంతి సంబరాలతోపాటుగా చదువు కునేందుకు ఓ చిన్న కథ!

అనగా అనగా…

ఓ రాజు గారుండే వాడు. అతడికి చిత్ర విచిత్రమైన ఆలోచనలొస్తుండేవి. దానికి తోడు తన కొచ్చేవన్నీ బహు గొప్ప ఆలోచనలని ఆయన గారికి మహా దొడ్డ విశ్వాసం.

ఓ రోజు రాజా వారు వ్యాహ్యాళికి వెళ్ళారు. రధం మీద ఝామ్మని పోతూ ఉంటే, దారిలో ఆయనకి చాలామంది ముసలి వాళ్ళు తారస పడ్డారు. కొందరు మనుమలతో ఆడుకుంటుంటే, ఇంకొందరు తీరిగ్గా కూర్చొని కబుర్లాడు కుంటున్నారు. మొత్తంగా ముసలి వాళ్ళంతా విశ్రాంతి తీసుకుంటూనో, మరేదో కాలక్షేపం చేస్తూనో కనిపించారే తప్ప, కుర్రకారు యువతీ యువకుల్లా ఒళ్ళొంచి బరువు పనులు చేస్తూ ఎవరూ కనిపించలేదు.

ఠక్కున… రాజు గారికి ‘తన రాజ్యంలో ముసలి వాళ్ళంతా వృధా’ అనిపించింది. తిండి దండగ యవ్వారమే అనిపించింది. దాంతో ‘యువతరం తప్ప వయస్సు మళ్ళిన జనం తన రాజ్యంలో ఉండరాదని’ శాసనం చేసేసాడు.

‘తన రాజ్యంలోని ప్రజలంతా వయస్సు మళ్ళిన తమ తల్లిదండ్రుల్ని రాజ్యం అవతల కొండల్లోని అడవుల్లో విడిచి పెట్టి రావాల్సింది’గా దండోరా వేయించాడు.

ప్రజలు నివ్వెర పోయారు. తమ ఇంటిలోని పెద్ద వాళ్ళని అడవుల్లో వదిలేస్తే… ఆకలి దప్పలకి అల్లాడి, అడవి జంతువుల వాతబడి, ఎండా వానలకి తట్టుకోలేక మృతి చెందడం ఖాయం.

అలాగని ఇంట్లో పెట్టుకుంటే రాజు గారు తమ తలలనీ, తమ పెద్దల తలలనీ తీయించడమూ ఖాయమే! అలాగని చాటింపు వేసారయ్యె! ఏం చెయ్యాలి? కొందరు తమ పెద్దల్ని ప్రక్క రాజ్యంలోని చుట్టాలింటికి పంపారు. ప్రక్క రాజ్యాల్లో చుట్టాల్లేని వాళ్ళల్లో కొందరు తామే ఊరొదిలి పోయారు.

ఈ వలసలు చూసి ప్రక్క రాజ్యాల రాజులు జాగ్రత్త పడ్డారు. దాంతో ప్రజలు చేసేది లేక, పెద్దల్ని అడవుల్లో వదిలి, ఏడ్చుకుంటూ, లోలోపల రాజు గారిని తిట్టుకుంటూ గడప సాగారు.

ఆ రాజ్యంలో ఓ ముసలామె ఉండేది. ఆమెకి ముగ్గురు కొడుకులు. కొడుకులకి తల్లంటే ప్రాణం. ముసలామెకి కొడుకులంటే తగని ప్రేమ. రాజు గారి శాసనం వీళ్ళకి కొరడా దెబ్బలా తాకింది. ఓ నాటి అమావాస్యకి అవ్వకి అరవై ఏళ్ళు నిండాయి. రాజు గారి చట్టం ప్రకారం, అరవై నిండితే అడవుల్లో ఉండాల్సిందే!

అది కొడుకులకి సుతరామూ ఇష్టం లేదు. కానీ చుట్టుప్రక్కల వాళ్ళెవరైనా రాజభటులకి సమాచారం అందిస్తే ముప్ప తప్పదు. అంచేత, ఏడుపు బిగబట్టుకుని, తల్లిని తీసుకుని రాజ్యానికావల ఉన్న కొండపైకి ఎక్కారు. కొండ కొసన, చిక్కని అడవికి చేరాక, తల్లిని విడిచి పెట్టి రాలేక వెక్కి వెక్కి ఏడ్చారు.

తల్లి కొడుకుల్ని ఓదార్చి సుద్దులు చెప్పింది. జాగ్రత్తగా మసలుకొమ్మంది. ఏడవకుండా పోయి రమ్మంది. వదల్లేక వదల్లేక తల్లిని వదలి, ఇంటి ముఖం పట్టారు కొడుకులు. చిక్కని అడవిలో తాము వచ్చిన దారేదో అర్ధం గాక బిక్కముఖం వేసారు.

కొడుకుల్ని చూసి అమ్మ నవ్వింది.

“వెర్రినాగన్నల్లారా! దారి కనుక్కోలేరని, వచ్చేదారిలో తుంగ మొక్కల కొసళ్ళు తెంపుకుంటూ వచ్చాను. ఆ గుర్తు పట్టుకుని ఇల్లు చేరండి” అంది.

కొడుకులు కళ్ళు తుడుచుకుని చుట్టూ పరికించారు. ఏపుగా పెరిగిన తుంగ మొక్కల కొసళ్ళు తెంపి ఉన్నాయి. ఆ దారి బట్టుకు ఇల్లు చేరారు. ఇల్లు చేరింది మొదలు ముద్ద దిగలేదు. ఏ పని చేస్తున్నా తల్లి గుర్తొస్తోంది. అమ్మ లేకుండా బ్రతక లేమని పించింది.

ఓ వారం గడిచే సరికి…

‘ఎవరికీ తెలీకుండా తల్లిని తెచ్చుకుని ఇంటి లోపలే ఉంచుకొని సాకుదాం!’ అనుకున్నారు. గుట్టు చప్పుడు గాకుండా కొండ దాపు చేరారు. తల్లిని ఎక్కడ వదిలి వచ్చారో! ఎలా ఉందో? ఆనవాలెలా పట్టడం?

పరికించి చూస్తే కొండ వాలు వెంట ఆవ మొక్కలు మొలిచి ఉన్నాయి. అన్నీ ఒకేసారి మొలిచినట్లు, కొండపై దాకా…వాలుదారి వెంట… వంకర్లు తిరిగి… ఒకే ఎత్తులో ఉన్నాయి. ‘ఇది అమ్మ ఉపాయమే’ అనుకొని, ఆనందంగా ఆవ మొక్కల ఆనవాలు పట్టుకుని కొండ ఎక్కారు.

పైకెక్కి చూస్తే అమ్మే…ఎండాకులు పోగేసి మంటేసుకుని, అందులో దుంపలేరుకుని తంపట వేసుకుని తింటూ, కాలం వెళ్ళ బుచ్చుతోంది. కొడుకుల్ని చూసి ముచ్చటగా నవ్వింది. చిరు వెన్నెలలో ఆ నవ్వు, కొడుకులకి కొండంత అండగా అనిపించింది.

“అమ్మా! నువ్వు లేకపోతే బతకలేం. ఇంటికి పోదాం”అన్నారు కొడుకులు.

“నాకు తెలుసర్రా! అందుకే, మీరు నన్ను తీసుకు వచ్చేటప్పుడు, కొంగులో ఆవాలు మూటగట్టుకు వచ్చి, ఓ చేత్తో దారంట జార విడుస్తూ వచ్చాను” అంది అమ్మ.

అదే దారిలో ఇంటికొచ్చేసారు తల్లీ కొడుకులు.

అది మొదలు, అమ్మని బయటికి కనబడి నీయకుండా ఇంట్లోనే ఉంచి, బ్రతక సాగారు కొడుకులు. ఎవ్వరికీ అనుమానం రాలేదు.

ఇలా ఉండగా ఓ సారి…

రాజు గారికి కొన్ని చిత్రమైన ఆలోచనలు తోచాయి. ఆ ప్రకారం…`రాజు గారు చెప్పే పనులు చేసిన వారికి, మంచి బహుమానం ఇస్తారని’ చాటింపు వేయబడింది. ఎవరు వెళ్ళినా బహుమతి గెలుచుకోలేక పోయారు.

ఓ రోజు ముగ్గురు కొడుకులూ రాజు గారి సభకి వెళ్ళారు.

రాజు గారు…శంఖంలోంచి దారం గుచ్చాలనీ, భస్మంతో తాడు చెయ్యాలనీ చెప్పారు. కొడుకులు ముగ్గురూ మర్నాటికి గడువు అడిగి ఇంటికి వచ్చారు.

మరునాటి సభకి బోలేడుమంది, వింత చూడ్డానికి ఎగబడి వచ్చారు. రాజు గారు కుతుహలంగా చూస్తున్నారు.

అవ్వకొడుకులు, రాజు గారిచ్చిన శంఖాన్ని తీసుకుని, దానికి లోపల సన్నగా బెల్లం పాకం పూసారు. ఓ దారం తీసుకుని, ఓ చీమకి దాన్ని కట్టారు. శంఖం ఈ వైపున చీమని వదిలి, రెండో వైపున ఓ చిన్న బెల్లం ముక్కని ఉంచారు. చీమ బెల్లం వాసనకి, శంఖం లోంచి దూరి, ఈ వైపు నుండి ఆ వైపుకి వచ్చింది.

ఇంకేముంది? శంఖం లోంచి దారం దూరి పోయింది.

ప్రజలంతా చప్పట్లు కొట్టేసి ఆనందపడ్డారు. రాజు గారూ అబ్బురపడ్డారు.

రెండో పనిగా… అవ్వ కొడుకులు, ఓ పలక తీసుకుని, దానిపైన తాడుని ఉంచారు. దాని కొసకి నిప్పంటించారు. కాసేపటికి తాడు మండి బూడిదయ్యింది. చిత్రం! ఆ బూడిద, తాడు ఆకారంలోనే మెలికలు తిరిగి ఉంది.

అదే బూడిద తాడు! రాజు గారు చప్పట్లు కొట్టారు. ప్రజలు కేరింతలు కొట్టారు.

రాజు గారు మెచ్చేసుకుని, అవ్వ కొడుకులకి బహుమానం ఇవ్వబోయారు.

కొడుకులన్నారు కదా… “మహారాజా! ఈ తెలివి మాది కాదు. మా అమ్మది! ఈ బహుమానం మాకొద్దు. మీరామెని మా ఇంట్లో ఉండనిస్తే, అదే మాకు పెద్ద బహుమతి!” అన్నారు.

రాజు గారికి ఆశ్చర్యం వేసింది. ప్రజలంతా కూడా “అవును మహారాజా! పెద్ద వాళ్ళకి జీవితానుభవం ఉంటుంది. వాళ్ళు తిండి దండగ మనుషులు కాదు. వాళ్ళ తెలివీ, అనుభవంతో యువజనానికి సలహాలిస్తారు. అంచేత మా పెద్ద వాళ్ళని మాతో ఉండనీయండి. రేపు మీరు పెద్ద వాళ్ళయితే, యువరాజు గారు మిమ్మల్ని విడిచి ఉండాలి. మీరు యువరాజుని విడిచి ఉండగలరా! అంచేత పెద్దవాళ్ళని ఇళ్ళకి పిలిపించండి” అన్నారు.

రాజు గారికి ‘తనవి చిత్ర విచిత్రమైన ఆలోచనలు కాదు, వాటిల్లో కొన్ని తలతిక్క ఆలోచనలనీ’ అర్ధమయ్యింది. దాంతో తన శాసనాన్ని రద్దు చేసేసాడు.

ప్రజలంతా అడవుల్లో వది లేసిన తమ పెద్ద వాళ్ళని ఇళ్ళకి తెచ్చుకుని పండగ చేసుకున్నారు. రాజు గారు అవ్వనీ, ఆమె కొడుకుల్నీ మెచ్చుకుని బోలెడు బహుమాన లిచ్చాడు.

అప్పటి నుండీ అందరూ హాయిగా ఉన్నారు.

ఇదండీ కథ!

ఇది పాత చందమామలో చదివిన జపాన్ జానపద కథ. ఇందులో రాజు గారు మూడు పనులు చెబుతారు. నాకు రెండే గుర్తున్నాయి. ఎవరికైనా మూడోది గుర్తొస్తే కథని కొనసాగించగలరు!

"ఈ భోగి పండగ భోగభాగ్యాలనీ…
సంక్రాంతి సంబరాలనీ…
కనుమ పండుగ కమ్మని అనుభూతుల్నీ…
మొత్తంగా ఈ ఉత్తరాయణం మీ అందరికీ ఉత్తమోత్తమ జీవితాన్ని అందించాలనీ కోరుతూ,
అందరికీ కనుమ పండగ శుభాకాంక్షలు!"

ఈ టపాల మాలికలో గత టపా: రేణుక జమదగ్ని – మంచిమీద నమ్మకం! [భారతీయ ఇతిహాసాల మీద నకిలీ కణికుడి కుట్ర – 7] [Dec.17, 2008]
http://ammaodi.blogspot.com/2008/12/7.html

రామాయణంలో, సీతా కళ్యాణం విషయానికొస్తే – స్వయంవరంలో వధువు తండ్రి, జనక రాజర్షి పెట్టిన వర పరీక్ష `శివధనస్సు ఎక్కుపెట్టడం’. ఇది వరుని సామర్ధ్యానికి పరీక్ష. అంతేగాని, ఇక్కడ కన్యాశుల్కమో లేక వరకట్నమో లేవు. కన్యాశుల్కం, (పెళ్ళి కోసం వధువు తల్లిదండ్రులకు డబ్బు చెల్లించడం), వర కట్నం (పెళ్ళి కోసం వరుని తల్లిదండ్రులకు డబ్బు చెల్లించడం) సతీసహగమనం, వగైరా దురాచారాలు సమాజంలోకి ఇతిహాసానంతర కాలంలో కొన్ని వర్ణాలు, కొన్ని వర్గాల ప్రజల అహంకారం కారణంగానూ, అజ్ఞానం కారణం గానూ, మూర్ఖత్వం కారణం గానూ ప్రవేశించాయి.

వీటిని ఇతిహాసాలకి అంటగట్టకూడదు. మతం గురించిన ఈ చర్చని నేను మరొక సారి కొనసాగిస్తాను.

ఈ విషయంలో నకిలీ కణిక వ్యవస్థ, దాని అనుబంధ కుట్రదారులు, వారి అనుచరులైన రచయిత రచయిత్రులు ఇతర వ్యక్తులు ‘దురాచారాలన్నింటికి మూలం ఇతిహాసాలు అంటే రామాయణ భారతాలంటూ’ బనాయించారు. విపరీతంగా ప్రచారించారు. ఇది 100% అసత్యం.

కావాలంటే మీరు, లక్ష శ్లోకాల భారతాన్ని, కనీసం ఉషశ్రీ సరళమైన తెలుగులో వ్రాసిన, టీటీడీ వారు ప్రచురించిన… రామాయణ, భారత భాగవతాల్ని చదివి నిర్ధారించుకోవచ్చు.

ఇంకా రామాయణాన్ని లోతుగా చూస్తే –

శ్రీరామ పట్టాభిషేకపు ఏర్పాట్లు జరుగుతుంటాయి. మందిరాల అలంకరణ విషయంలో రాణుల చెలికత్తెల మధ్య వివాదం సంభవిస్తుంది. వీళ్ళు అచ్చంగా పనివాళ్ళు, సేవకురాళ్ళు! మానసిక స్థాయిగానీ, పరిణతీ గానీ లేని వర్గం. సేవక వృత్తిలో ఉన్నవారిలో పరిణతీ, మానసిక స్థాయి, పరిపక్వత ఉండదని నా ఉద్దేశంకాదు. ఇక్కడ, ఈ రాణుల పనికత్తెలలో మాత్రం అవి లేదన్నది చెప్పడమే నా ఉద్దేశం.

తమ అహంకారం, తమ భావోద్రేకాలతో వాళ్ళు గొడవపడ్డారు. అందులో కౌసల్యాదేవి పనికత్తెలు, కైకేయి పుట్టింటి నుండి వచ్చిన అరణపు దాసి మంధరని తులనాడుతూ “ఇప్పటి దాకా నీ ఆధిపత్యాన్ని అంగీకరించి మేమంతా నోరు మూసుకున్నాం. ఎందుకంటే నీవు రాజు గారి ముద్దుల భార్య చెలికత్తెవని. ఇక ఆ రోజులన్నీ అయిపోయాయి. రేపటి నుండి రాముడు రాజు, మా రాణి కౌసల్య రాజమాత. ఇక నోరు మూసుకొని పడి ఉండటం ఇప్పుడు నీ వంతు” అన్నారు.

చూడండి. ఇక్కడ రాణుల మధ్య కూడా లేని ఈర్ష్య, వైషమ్యం, ఆధిపత్య పోరాటం. వీళ్ళ మధ్య ఉన్నాయి. అహంకరించడానికి కారణం అక్కర్లేదు అన్నట్లుగా లేదూ వారి వ్యవహారం?

ఇది విని మంధరకు మండి పోయింది. స్థాయి తక్కువ వారి ఇరుకు మనస్సు ఇక్కడ మనకి కన్పిస్తుంది. మంధర ఈ వివాదాన్ని ఇక్కడితో విడిచి పెట్టలేదు. దీన్ని కైకేయి దాకా మోసుకెళ్ళింది. ఆవిడలో ఆహాన్ని, అనుమానాన్ని రేపింది.

‘భరతుణ్ణి మేనమామ ఇంటికి పంపి, రామ పట్టాభిషేకం చేయబోతున్నారని, దశరధుడూ, కౌసల్యా, రామూడూ కలిసి కైకని అవమానించబోతున్నారని’ బ్రెయిన్ వాష్ చేసింది. గతంలోని వరాల మాట గుర్తు చేసింది. అంతే! ఫలితం – దశరధుడి మరణం, సీతా రామ లక్షణులు అడవికి పయనం, భరతుడు త్వజించిన తల్లి, రాజ్యం – మొత్తంగా తమ జీవితాల్లోనూ, రాజ్య వ్యవహారంలోనూ పెను తుఫాను!

దీనికంతటికీ కారణం… కైక తానో దేశానికి రాణియై ఉండి, ఓ పనికత్తె చెప్పుడు మాటలకు లొంగి తెచ్చిపెట్టుకున్న ఉపద్రవం.

రామాయణంలోని ఈ కథని ఉటంకిస్తూ పెద్దలు ‘చెప్పుడు మాటలు ఎంత చెడ్డవో, అలా చాడీలు చెప్పేవారిని దూరంగా ఎందుకుంచాలో’ చెప్పేవాళ్ళు. మానసిక స్థాయి లేని వాళ్ళని దగ్గరికి రానివ్వకూడదనీ, లేకుంటే వారి భావోద్రేకాలు మనకీ అంటించేసి, మనకి బ్రెయిన్ వాష్ చేసి, అప్పటి వరకూ కాస్తో కూస్తో మనం ‘బ్యాలెన్స్ ఆఫ్ మైండ్’ అంటే ‘ఆత్మ సంయమనం’ సాధిస్తే, దాన్ని సర్వనాశనం చేస్తారని… ఈ కథ మనకి చెబుతుంది. ఇలాంటి కథలు, మనకు ఎన్నో రీతులూ, జాగ్రత్తలూ చెబుతాయి.

కనుకనే వేల సంవత్సరాల పాటు సమాజంలో… వ్యక్తుల జీవితాల్లో… శాంతి సౌఖ్యాలు మొదలంటా నశించి పోకుండా, ఇతిహాసాలు భారతజాతిని సంరక్షించాయి. నకిలీ కణికుడూ, అతడి వ్యవస్థా, ఇతిహాసాలని రూపుమాపింది ఇందుకే. ఫలితంగా మనం ‘ప్రజా జీవితంలో అపరిపక్వత, మానసిక స్థాయి లేకపోవడం’ చూస్తున్నాం.

డబ్బుల కోసం బాంబులు వేసి జనాల్ని చంపే తీవ్రవాదుల్లో గనుక ‘ఆ స్థానంలో మన కుటుంబ సభ్యులే ఉంటే, మనలాగే ఇంకెవరో మన వాళ్ళ మీద బాంబులు వేస్తే, ప్రాణం ఎవరిదైనా ఒకటే కదా!’ అని ఆలోచించగలిగే మానసిక స్థాయి, పరిపక్వత ఉంటే… నకిలీ కణిక వ్యవస్థకి ‘కసబ్’లు దొరికే వారా? ముంబై ముట్టడు ల్లాంటి దారుణాలు జరిగేవా?

కైకేయి వరాలు, వాటి పూర్వపరాల గురించి ‘ప్రజా దృక్పధంపై నకిలీ కణికుడి కుట్ర’ అన్న శీర్షికలో చర్చించాను. ఆ శీర్షికను నా ఆంగ్ల బ్లాగు ‘Coups On World’ లో ‘Coup On Public attitude’ అన్న టపాలో పరిశీలించవచ్చు.

కైకా దేవి రాముణ్ణి పిలిచి తన వరాల గురించి, వాటిని తండ్రి దశరధుడు అంగీకరించిన విషయం గురించీ చెబుతుంది. రామునికి బదులుగా భరతుడికి పట్టాభిషేకం జరపాలనీ, రాముణ్ణి 14 ఏళ్ళు అడవిలో పంపాలనీ దాని సారాంశం.

శ్రీరాముడు తన పట్టాభిషేక వార్తని ఎంత నిర్వికారంగా అందుకున్నాడో, అంతే నిర్వికారంగా, తన అరణ్యవాస ఆజ్ఞనీ అందుకున్నాడు. ఈ ‘బ్యాలెన్స్ ఆఫ్ మైండ్’ గురించే భారతీయుల్లో చాలామంది కలలు కనేవారు. భగవద్గీతలో ‘స్థితప్రజ్ఞత’గా చెప్పిన ఈ స్థితిని అందుకోవటానికి, ఎందరో మహానుభావులు ఎంతో సాధన చేసి, తమ వెనక వారికి మార్గదర్శకులయ్యారు.

ఐతే రామాయణంలో రాముడి ఒక సవతి తల్లి కైక, తన స్వార్ధం కోసం, రాముణ్ణి అడవికి పంపితే, మరో సవతి తల్లి సుమిత్ర తన కొడుకు లక్షణుణ్ణి రామునికి తోడుగా అడవికి పంపుతుంది.

ఈ విధంగా రామాయణం మనకి ‘ఎలా ఉండాలో, ఎలా ఉండకోడదో, ఏది చేయవచ్చో, ఏది చేయ కూడదో’ చెబుతుంది.

రామాయణ కవి వాల్మీకి, రమ్యంగా రచించి పాడిన రామాయణ శ్లోకాలలో, రాముడు 100 సార్లు మూర్ఛపోనివ్వండి, మరో 300 సార్లు ‘ఈ తరుణంలో శాస్త్రం ఎలా ప్రవర్తించాలని నిర్దేశించిందబ్బా?’ అని ఆలోచించనివ్వండి… సామాన్య ప్రజల హృదయాల్లోకి అవేవీ చేరలేదు. రామాయణం నుండి ఎంత ‘మంచి’ నేర్చుకోగలం అన్నదే ప్రజల్ని ఉత్తేజితుల్ని చేసింది, నీతి సత్యం, ధర్మం ఆచరించేందుకు ఉత్ర్పేరకం అయ్యింది.

అటువంటిది ఈ ‘మంచి’ అంతా వదిలేసి, విషం చల్లటం నకిలీ కణిక వ్యవస్థ, వాళ్ళ అనుచరగణానికి ప్రధమ కర్తవ్యం అయ్యింది. దానికి విపరీత ప్రచారం కావించడం మీడియా ప్రధాన కర్తవ్యం అయ్యింది. ఇది చెప్పటం లేదా కుట్ర ప్రధాన ఉద్దేశాన్ని, కుట్ర అస్థిత్వాన్ని?

మళ్ళీ రామాయణం దగ్గర కొస్తే – లక్ష్మణుడు కైక వరాల మాట విని కోపోద్రిక్తుడై కత్తి దూసినప్పుడు, రాముడు అతణ్ణి చల్లబరచి అంటాడు – “తల్లిదండ్రుల ఆజ్ఞ పాటించడం మన కర్తవ్యం” అని! రామలక్ష్మణులు తాటకి సుబాహులనే రాక్షసుల్ని అప్పటికే సంహరించిన సమర్ధులు. వాళ్ళు తమ ఆ శక్తిని, తమ సుఖాల కోసం వాడలేదు. ఒక్క వేటులో కైక తల నరికేసి ‘ఇది నా సింహాసనం’ అనలేదు. తమకున్న శక్తిని, సామర్ధ్యాన్ని స్వార్ధం కోసం కాక… ‘ప్రజల్ని, ప్రపంచాన్ని కాపాడటం కోసం, శాంతిని పెంచటం కోసం, ధర్మాచరణ కోసం’ ఉపయోగించారు.

ఇక్కడ నకిలీ కణక వ్యవస్థ, వాళ్ళ ఏజంట్లూ, ఉద్దేశపూర్వకంగా… సుమిత్ర దేవినీ, ఆవిడ నిస్వార్ధ బుద్దినీ మరిచి పోయారు. కైకనీ, ఆవిడ స్వార్ధాన్ని పేపర్లో పెద్దచ్చరాల్లో వేసి మరీ ప్రచారించారు. మీరు ఇది స్పష్టంగా గమనించాలంటే 40 నుండి 50 ఏళ్ళ క్రితం ప్రచురింపబడిన రామాయణం పైని విమర్శలని (విషవృక్షంతో సహా) తిరగెయ్యండి.

దశరధుని కుటుంబం, భరతుడితో సహా, స్వసుఖాల కోసం, సింహాసనం కోసం ఒకరిపై ఒకరు కుట్రలు పన్నుకోలేదు. ఒకరి కోసం మరొకరు తమ స్వసుఖాలని త్యాగం చేసికొన్నారు. తమ సుఖాలని… ధర్మాచరణ కోసం, ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం అన్న ఆచరణని కొనసాగించటం కోసం, త్వజించారు.

ఇది భారతీయుల నమ్మకం ప్రకారం త్రేతాయుగం. తర్వాతి యుగం ద్వాపరం లో కౌరవ పాండవులు సింహాసనం కోసం యుద్ధాలు చేసుకొన్నారు. దుర్యోధనుడు పాండవుల మీద కుట్ర పన్నాడు.

తర్వాతి యుగం కలియుగం. చరిత్రలో ఎన్నో రాచకుటుంబాలు పాలనాధికారం కోసం కుట్రలు పన్నుకొన్నది మనం చదివాం. మగధి రాజులు (గుప్తులూ) మౌర్య గుప్తులూ, పాండ్యులూ, చోళులూ, విజయ నగర రాయల వంశీయులూ… ఇలా ఎందరో. వారిలో ఎవరైతే ప్రజలకి మంచి చేసారో, స్వార్ధాన్ని జయించి ధర్మాచరణకి పాటు పడ్డారో వారే ప్రజా హృదయాల్లో నిలిచి పోయారు.

బింబిసార తనయుడు అశోకుడు, రాజ్యకాంక్షతో యుద్ధాలు చేసినప్పుడతణ్ణి ప్రజలు ‘ఛండాశోకు’డన్నారు. బౌద్ధుడై ప్రజలకు ఉపయోగపడే పనులు చేసినప్పుడు ‘ధర్మాశోకు’డన్నారు. అశోకుడు ఛండాశోకుడుగా మిగిలి ఉంటే అలాగే ఉండిపోయేవాడు. ధర్మశోకుడయ్యాడు కాబట్టే, ప్రజా హృదయాల్లో చిరస్మరణీయుడయ్యాడు.

ఇక మళ్ళీ రామాయణ గాధ దగ్గరి కొస్తే… మేనమామ ఇంటి నుండి స్వదేశానికొచ్చిన భరతుడు, తల్లి వరాల కారణంగా కారడవులకి తరలిపోయిన సీతారామలక్ష్మణుల గురించి, పుత్ర వియోగ దుఃఖంతో పరలోకానికి తరలిపోయిన తండ్రి గురించీ విని విభ్రాంతుడౌతాడు.

క్షణికమైన భావోద్రేకాలతో, స్వార్ధ పూరితంగా వరాలు కోరిన తల్లినీ, ఆ వరాల కారణంగా తనకు సంక్రమించిన రాజ్యాన్నీ కూడా త్వజిస్తాడు. అన్నరాముడి అరణ్యవాసం పూర్తయ్యే దాకా, 14 ఏళ్ళపాటు తానూ రాజధానికి ఆవల, నందిగ్రామంలో నార బట్టలతో సన్యాసాశ్రమ జీవనం కొనసాగిస్తాడు.

వెరసి దశరధ పుత్రులు రాజ్య భోగాలూ, స్వసుఖాలూ వదలి ఆశ్రమ జీవనులయ్యారు. దశరధుడు పరలోక గతుడయ్యాడు. కైక, దాసి మంధర తాలూకూ ఈర్ష్యను తనపై ప్రభావం చూపేటంతగా entertain చేసినందుకు ప్రతిఫలమే అదంతా!

మంధరతో తోటి దాసీల కలహమూ, కైక మదిలో మంధర రగిల్చిన ఈర్ష్యాక్రోధాల అగ్నికి ముందు క్షణం వరకూ, మహారాజు దశరధుడి కుటుంబం, కోసల దేశం, అయోధ్యా నగరం ఎంతో ఉత్సాహంతో, సంతోషంతో ఉన్నాయి.

ఒక్క క్షణంలో అదంతా అంతులేని విషాదానికి దారి తీసింది. నిజానికి ఒక్క క్షణం చాలు, ఎవరి జీవితాల్లో నైనా ఆనందం నుండి దుఃఖానికీ, సురక్షితం నుండి ప్రమాదానికి ప్రయాణించడానికి! ఎందుకంటే అది కాలం! ఒక్క క్షణమే అయినా అది బలవంతమైన కాలం! మనం అతిక్రమించలేని కాలం! గడిచిపోయాక, ఎట్టి పరిస్థితిల్లోనూ తిరిగి తేలేని కాలం!

పోగొట్టుకున్న సంపదనో, ఉద్యోగాన్నో, వ్యాపారాన్నో, తిరిగి పొందగలమేమో గానీ, గడిచి పోయిన కాలాన్ని మాత్రం తిరిగి పొందలేం. అందుకే శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలోని విభూతి యోగంలో ‘అన్నిటిలోకి బలవత్తరమైన కాలాన్ని నేనే’ నంటాడు.

మరోమాటగా చెప్పాలంటే… ఇలాంటి వాస్తవాలని భగవద్గీత సిద్ధాంత రూపేణా చెబుతుంది. విజ్ఞతా వివేకాలు గల వారు, పండితులు దానిని గ్రహించగలరు. వాటినే భారత రామాయణ భాగవతాది ఇతిహాసాలు, కథాపరంగా చెబుతాయి. విజ్ఞతా వివేకాలు గల వారూ, పండితులే గాక, సామాన్యులూ, పామరులూ కూడా గ్రహించగలరు.

పసిపాపల దగ్గరి నుండీ బోసి నోటి బామ్మల దాకా అందరికీ, కథలంటే ప్రీతే కదా!

అదీగాక, నేటి గణిత శాస్త్రంలో ఓ సిద్ధాంతాన్ని(Theory) చెప్పినప్పటి కంటే, దాని అనువర్తన(application)తో కొన్ని లెక్కల్ని వివరించి నప్పుడు, అది విద్యార్ధులకి మరింత బాగా అవగతం కావటం అందరికీ తెలిసిందే కదా! భగవద్గీత సిద్ధాంతం(Theory) అయితే, ఇతిహాసాలు దాని అనువర్తన(application)!

అందుకే వివేకనంద స్వామి ‘భగవద్గీత అనబడే వజ్రాన్ని పొదిగేందుకు సంభవించిన కథ భారతం’ అని తెగేసి చెప్పారు.

అలాంటి చోట…ఇతిహాసాలని ప్రజల దృక్పధం నుండి తుడిచేస్తే…సామాన్యుల దగ్గరి నుండి సెలబ్రిటీల దాకా… అందరూ, జీవిత సత్యాలని మరిచి పోతారు. జీవనానుభూతుల్ని మరచి పోతారు. కాలం కంటే, ప్రకృతి కంటే తామే అధికులమనే భ్రమలకూ, భ్రాంతులకూ లోనవుతారు. అహంకారమూ, మూర్ఖత్వమూ మెండవుతాయి.

కావాలంటే గమనించి చూడండి… ఏ బుల్లెట్ ట్రెయిన్ ల గురించో, బుర్జ్ ఖలీఫా వంటి భవంతుల గురించో వ్రాసేటప్పుడు… మీడియా, ఏయే విశేషణాలని ఉటంకిస్తుంది?

అతడు కాలాన్ని జయించాడు. గంటకి ఇన్ని కిలో మీటర్లతో ప్రయాణించే xyz వాహనాన్ని రూపొందించాడు గట్రా!

లేదా

ఫలానా వ్యక్తి ప్రకృతిని జయించాడు. So and so సాధించాడు.

ఏ ఘన కార్యమైనా సాధించ నివ్వండి గాక, కాలాన్ని, ప్రకృతినీ జయించటమే!

ఈ అనంత విశ్వంలో మన పాలపుంత ఎంత? అందులో మన సూర్య కుటుంబం ఎంత? అందులో మన భూమి, మనం, ఎంతటి వాళ్ళం? ఇంత బ్రహ్మాండమైన ప్రకృతిలో, విశ్వంలో మనమా ప్రకృతిని జయించిందీ?

ఒక్క సునామీ వస్తే…అప్పటి వరకూ శతాబ్దాలో, దశాబ్దాలో చేసామని చెప్పుకునే అభివృద్ధి, నిర్మాణాలూ శిధిలావస్థకు చేరతాయి.

ఒక్క భూకంపవస్తే… గుండ్రంగా తిరిగేసే బుర్జ్ ఖలీఫాలు నేలమట్టమై పోతాయి.

హుందాగా, ఆకాశంలోకి నిలబడిన జంట భవనాలు WTC, ఒక్క విమాన దాడిలో కుప్పకూలటం చూసి పదేళ్ళవ్వస్తోంది కాదా!? [ఈ విషయంలో భవన నిర్మాణం, విమాన విధ్వంసమూ రెండూ మానవ నిర్మాతాలే!]

మనిషా ప్రకృతిని జయించేది? నిశ్చయంగా కాదు.

మహా అయితే కాలుష్య పరచగలడు, అంతే!

అది కనిపెట్టారు, ఇది సృష్టించారు, సృష్టికీ ప్రతిసృష్టి చేసారు అని ప్రచారించుకోవటమే గానీ… దేన్నైనా ప్రకృతిలో నుండే తీసుకున్నాడు కదా!?

ఖచ్చితంగా చెప్పాలంటే మట్టిని తీసుకుని ఓ చక్కని బొమ్మని చెయ్యగలడేమో గానీ, మట్టిని సృష్టించలేడు కదా!?

ఒక రూపం నుండి మరో రూపానికి మార్చగలడు, అంతే!

విద్యార్ధులకి చెప్పే… భౌతిక శాస్త్ర పాఠం…శక్తి నిత్యత్వ సూత్రం లాగా! ఒక రూపం నుండి మరో రూపానికి మార్చగలమే గానీ, శక్తిని సృష్టించలేము, మరియు నాశనం చేయ్యలేము.

కాబట్టి సైన్స్ కూడా మనిషికి ‘నువ్వు నిమిత్తమాత్రుడవు’ అనే చెబుతుంది. దీన్నే మన ఇతిహాసాలూ చెబుతాయి.

కాబట్టే – నకిలీ కణిక వ్యవస్థ, భారతీయ ఇతిహాసాలని ప్రజల నుండి తుడిచి వేయాలని ఎడతెగకుండా పని చేసింది, చేస్తూనే ఉంది.

దాంతో నేటి మనిషి మానవీయత మరచిపోయాడు. స్వార్ధం కోసం నమ్మకద్రోహాలకి, చుట్టుప్రక్కల గలవారి మీదా, బంధుమిత్రుల మీదా కుట్రలు పన్నడానికీ సిద్ధమౌతున్నాడు. కార్యాలయంలో ప్రక్క వారిమీద పైఅధికారికి చాడీలు చెప్పడం, ఉన్నవీ లేనివీ కల్పించి ప్రచారించటం, వ్యాపార పోటీ… గట్రా ఏ పేరుతో పిలిచినా, వాటి అసలు రూపం కుట్రా కుతంత్రాలే! ‘అడుగంటు దాక పాకిన అవినీతి’ అన్నా, పేరు మార్పు తప్ప మరొకటి కాదు.

కనుకనే, భర్త కష్టాలనీ పంచుకునేందుకు రాజ్యభోగాలు వదలి భర్తతో అడవులకు తరలిన సీతా దేవిని మరచిపోయిన ఆధునిక శ్రీమతులు కొందరు, భర్తలు ఓటమిలో ఉన్నప్పుడు విడాకులు తీసుకోవటానికి వెనుకాడటం లేదు. ఉద్యోగంలో సస్పెండ్ అయినప్పుడో, వ్యాపారంలో కష్టాల పాలైనప్పుడో… వృత్తిలో అవకాశాలు పోగొట్టుకున్నప్పుడో… ప్రముఖల జీవితాల్లో కూడా ‘ఇలాంటి విడాకుల’ సంఘటనలని చూస్తూనే ఉన్నాం కదా!?

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!
~~~~~~~~

కనుచూపు మేర దాకా పరుచుకున్న పచ్చని పొలాలు, కంటి నిండా పరుచుకొని, చిన్నప్పుడు నాన్న చేతుల మధ్య భద్రంగా ఉన్నప్పుడు పొందిన ధైర్యాన్నీ, Protective feeling నీ గుర్తుకు తెస్తుంది.

ఎంత గొప్పగా ఉన్నా, rich గా, భారీగా ఉన్నా… ఏ ఆకాశ హర్మ్యాలూ, ఏ ఫ్లైఓవర్లూ, ఎనిమిది లైన్ల బిజీ జాతీయ రహదార్లూ కూడా… ఇలాంటి సహజ భావనలనీ, పసితనపు గురుతుల్నీ మన కివ్వలేవు.

ఈ సందర్భంలో, చిన్నప్పుడు చదువుకున్న చిన్న కథ ఒకటి చెబుతాను.

అనగా అనగా…

ఒకానొకప్పుడు భాగ్యపురం అనే రాజ్యం ఉండేది. నదీనదాలు, చెరువులూ దొరువులతో చక్కని నీటి వసతి కలిగి ఉండేది. రాజ్యం చుట్టూ అడవులూ కొండలూ ఉండటంతో, ఏటికేడాది, ఆయా ఋతువుల్లో చక్కని వర్షాలు పడేవి. భూమి సారవంతమైనదీ, ఆ రాజ్య ప్రజలు కష్టపడి పని చేసే తత్త్వం గలవాళ్ళూ కావటంతో పంటలు బాగా పండేవి. భాగ్యపురం సుసంపన్నంగా ఉండేది.

ప్రజలంతా కూడా ఏ లోటూ లేకుండా హాయిగా జీవించేవారు.

ఇలా ఉండగా… ఓ యేడాది భాగ్యపురంలో పైర్లు ఏపుగా పెరిగాయి. కోతల కాలం వచ్చింది.

ఓ రోజు ధనలక్ష్మి ధాన్యలక్ష్మి…ఇద్దరూ అదృశ్య రూపంలో భూలోక విహారానికొచ్చారు. మాటల్లో వాళ్ళిద్దరికీ వివాదం ఏర్పడింది. తామిద్దరిలో

‘ఎవరు గొప్ప?

ఎవరిని జనులెక్కువగా ఇష్టపడతారు?

ఎవరినెక్కువగా ఆరాధిస్తారు?’ అని తర్కించుకోసాగారు.

‘నేనేంటే నేనని’ ఇద్దరూ వాదించుకున్నారు. అప్పటికప్పుడే వాస్తవం తేల్చుకోవాలనుకున్నారు. అప్పటికి ఆ దేవతలిద్దరూ భాగ్యపురం పొలాల్లో ఉన్నారు. కోతలైపోయి, కల్లాల్లో పంట నూర్పిడి చేసి, రాశులు పోసి ఉంది. ప్రజలు ధాన్యం సంచుల కెత్తుకుని ఇళ్ళకి పోతున్నారు.

ధనలక్ష్మి ధాన్యలక్ష్మి…దారి కిరుప్రక్కలా బంగారు నాణాలు, రకరకాల ధాన్యమూ రాశులుగా ఉండేలా సృష్టించారు.

ఒక్కసారిగా ప్రజలు దారికి రెండుప్రక్కలా ఉన్న ధాన్యరాశులన్నీ, ధనరాశుల్నీ చూశారు. ఒక్క ఉదుటున తమ చేతుల్లోనూ, నెత్తి మీదనూ ఉన్న ధాన్యపు మూటల్ని పక్కన పారేసి, ధనరాశుల వైపు పరుగులు తీసారు.

ఆబగా అందినంత బంగారు నాణాల్ని మూట గట్టుకుని నెత్తికెత్తుకుని, ధాన్యపు రాశుల్ని తొక్కుకుంటూ, చిమ్ముకుంటూ, చిందులేసుకుంటూ, ఇళ్ళకి పోయారు.

‘చూశావా? జనులందరికీ నేనంటేనే ఎక్కువ ఇష్టం!’ అన్నట్లుగా ధాన్యలక్ష్మిని చూస్తూ కళ్ళెగరేసి నవ్వింది ధనలక్ష్మి. ఆ నవ్వులో విజయగర్వం తొంగి చూస్తోంది. ధాన్యలక్ష్మి కి చాలా బాధనిపించింది. వికలమైన మనస్సుతో అక్కడి నుండి నిష్క్రమించింది.

జనాలకి ఇదేం తెలియదు. ఎంతో ఆనందంగా, ఇంటికి చేర వేసుకున్న బంగారాన్ని చూసి మురిసిపోతూ, కబుర్లు చెప్పుకున్నారు. కాస్సేపలా ఆకలీ దప్పికా అన్నీ మరిచి పోయారు. ఎంత సేపుంటారు అలా?

ఆకలి వేసింది. అన్నం తిందామని ముద్ద ముడితే ఏముంది? మెతుకులన్నీ బంగారమై పోయాయి. బంగారు అన్నం మెతుకులు ఎంతందంగా మెరిసి పోతున్నాయో? కానీ ఏం లాభం? తినలేరు కదా? మళ్ళీ అన్నం వండుకుందామని బియ్యం ముట్టుకుంటే గింజలన్నీ గలగల్లాడుతూ బంగారమై పోయాయి. వంకాయ, బెండకాయ్, టమాటా, పచ్చి మిరపకాయ్… ఏది చూసినా బంగారమే!

కనీసం దాహం తీర్చుకుందామని నీరు, మజ్జిగ, ఏది తీసుకున్నా… అదంతా బంగారు ద్రవంగా ఉంది. అరటి పండు, మామిడి పండు…అన్నీ బంగారమే! జనాలకి ఏం చెయ్యాలో తోచలేదు.

ఆకలి, దాహం… నీరసం వచ్చేసింది. మెల్లిగా వాళ్ళకి తమ తప్పిదమేమిటో తెలిసి వచ్చింది. ధాన్యలక్ష్మిని ధ్యానిస్తూ, క్షమించమని ప్రార్ధించారు.

ఆ తల్లి… దయార్ధ్ర హృదయంతో బిడ్డల తప్పుల్ని మన్నించి అన్నపానీయాలు అనుగ్రహించింది.

ప్రజలు, అవధులు తెలుసుకుని ఆనందించారు.

ఇదీ కథ!

చిన్నప్పుడు ఎక్కడో చదివిన కథ! ఆలోచిస్తే సత్యాన్ని మన బుర్రలకి ఇంకించగల కథ!

నిజంగా ఎంత ధనవంతులైనా, డబ్బూ బంగారం తినలేరు కదా!? పిజ్జా బర్గర్ లన్నా కూడా, అవీ పిండీ కూరగాయలూ, నూనె, మసాలాల వంటి సేంద్రియ పదార్ధాలతో తయారు చెయ్యాల్సిందే గానీ… కరెన్సీ నోట్లో, ఎటీఎం కార్డులతోనో తయారు చెయ్యరు కదా?

అందుకే భద్రాద్రి రామదాసు
“లక్షాధికారులైనా లవణామన్నమే గానీ
బంగారు కణికలు మింగ లేరనుచు మంచి
పలుకే బంగారమాయెనా… కోదండ రామా!”

అంటూ హృద్యంగా సత్యసంకీర్తన చేసాడు.

[ఇటీవల ఈనాడు వంటి దినపత్రికలు ఆదివారపు సంచికల్లో బంగారు తళుకులు అద్దిన చాక్ లెట్లూ, మిఠాయిలూ ఇప్పుడు ధనవంతులైన సెలబ్రిటీలు తింటోన్నారని తెగ రొదపెట్టేసాయి, ఇప్పటికీ అప్పుడప్పుడూ పెడుతూనే ఉన్నాయి.]

ఎంత సుసంపన్నులైనా, భాగ్యవంతమైన దేశాలైనా, ఎన్ని రంగాలలో అభివృద్ది చెందినా… నిర్లక్ష్యం చెయ్యకూడని రంగం వ్యవసాయం!

అలాంటి చోట… దాదాపు ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా మన దేశంలో, వ్యవసాయం ఎంతగా నిర్లక్ష్యానికీ, అధోగతికి గురౌతోందో నేడు అందరికీ ప్రత్యక్షంగా తెలిసిందే!

మూకుమ్మడిగా…పచ్చని వ్యవసాయ భూముల్ని మెరకపోసి రాళ్ళు వేసి రాత్రికి రాత్రి ప్లాట్లుగా మార్చడం, బక్కచిక్కిన రైతుల్ని చావదన్ని మరీ, చక్కటి నీరుపారుదల ఉన్న పచ్చని పొలాలు లాక్కుని, సెజ్ లుగా మార్చడం… నిత్యకృత్యంగా చూస్తూనే ఉన్నాం!

పదవిలో ఉండగా, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ‘వ్యవసాయం దండగా’ అన్నాడని ప్రతిపక్షాలు ముఖ్యంగా కాంగ్రెస్ దుమ్మెత్తి పోస్తుంటుంది. అది ‘అసత్యప్రచారం’ అని అతడూ ఎదురు దాడి చేస్తుంటాడు. ఈ వాద ప్రతివాదనల సంగతేమో గానీ, చంద్రబాబు నాయుడు ‘హైటెక్ ముఖ్యమంత్రి’ అనే బిరుదునీ, కిరిటాన్నీ తగిలించుకొని, ప్రపంచపు అంచుల దాకా పెట్టుబడుల సమీకరణ అనే పైకారణంతో ఉరుకులు పెట్టాడు గానీ, వ్యవసాయ రంగం మీద ఇసుమంత దృష్టి కూడా పెట్టలేదన్నది మాత్రం నిర్వివాదాంశం!

ఇక, మొన్నామధ్య, మన ఘన ప్రధాని మంత్రీ, ప్రసిద్ధ ఆర్ధికవేత్తా అయిన మన్మోహన్ సింగ్, కొద్ది రోజుల క్రితం పీఠమెక్కిన మన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిలు… ‘ఈ రోజుల్లో వ్యవసాయం పూర్తిగా నష్టాలమయం అయ్యిందనీ, ప్రపంచవ్యాప్తంగా పరిస్థితి అదేననీ’ సెలవిచ్చారు.

రాజకీయ రంగం, కార్పోరేట్ రంగంతోనూ, నేర ప్రపంచంతోనూ మిళితమై, రైతు నడ్డి విరిచేస్తుంటే… ప్రపంచవ్యాప్తంగా నైనా, దేశవ్యాప్తంగా నైనా, రాష్ట్ర వ్యాప్తంగా నైనా వ్యవసాయం నష్టభరితం గాక లాభపూరితం ఎలా అవుతుంది?

పెదాలకీ, గోళ్ళకీ వేసుకునే రంగు దగ్గరి నుండీ తలకి రుద్దుకునే షాంపూల దాకా…

విత్తనాల దగ్గరి నుండీ కాలి చెప్పుల దాకా…

ప్రతీ ఉత్పత్తిదారుడూ, తన ఉత్పత్తికి తానే ధర నిర్ణయించుకోగలడు.

అందుక్కావలసిన అన్ని చట్టాలనీ ప్రభుత్వమే చేస్తుంది, అమలు బాధ్యతని కూడా చక్కాగా నిర్వహిస్తుంది.

ఏ దళారీ, మధ్యలో జోక్యం చేసుకోడు.

ఎటూ వినియోగదారుడు నోరుమూసుకుని కొనుక్కుంటాడను కొండి.

అలాగే…

నాడి పట్టుకు రోగం కనిపెట్టి చికిత్స చేసే వైద్యుడూ…

తగవులు పడితే దావాలు వేసి న్యాయం చేస్తాననే లాయరూ…

చదువులు చెప్పి బ్రతుకులు బాగు చేస్తాననే విద్యా సంస్థలూ…

అందరూ…

చివరికి పొలంలోకి దిగి, నాట్లు, కలుపులూ కోతలూ నిర్వహించే కూలీలతో సహా…

అందరూ…

తమ చాకిరికి తామే ధర నిర్ణయించుకుంటారు.

ఏ దళారీ, మధ్యలో జోక్యం చేసుకోడు.

అయితే

ఉత్పత్తి దారుడుగా రైతు, తాను ఉత్పత్తి చేసిన ధాన్యానికి ధర తాను నిర్ణయించుకోలేడు.

తన చాకిరికీ, తాను కార్చిన చెమటకీ, ధర తాను నిర్ణయించుకోలేడు.

అందుకోసమే ప్రభుత్వం కనీస మద్దతు ధర నిర్ణయిస్తుంది. అయినా వెనక తట్టున మిల్లర్లకీ, దళారీలకీ దన్నిస్తుంది.

మిల్లర్లూ, దళారీలు… కాకులూ గద్దల్లా రైతు కష్టాన్ని ఎగదన్నుకు పోకుండా, చట్టాల అమలుని మాత్రం చెయ్యదు. కంటి తుడుపుగా చట్టాలు మాత్రమే చేస్తుంది. అమలుని గాలి కొదిలేస్తుంది.

అలా రైతుని చావగొడితే గానీ… ఆనక వ్యవసాయాన్ని సైతం, కార్పోరేట్ సంస్థలకి అప్పు చెప్పేందుకు వీలు కాదు మరి!

ఇప్పుడు విదేశాలలో వ్యవసాయ ఉత్పత్తి గురించీ, అభివృద్ధి గురించీ చెబుతూ… మీడియా సంస్థలు…

‘ఫలానా దేశంలో ఫలానా ధాన్యం లేదా పంట దిగుబడి ఇన్ని మిలియన్ లేదా ట్రిలియన్ టన్నులనీ, అది ప్రపంచ ఉత్పత్తిలో ఇంత శాతం అనీ, గతంలో కంటే ఇంత శాతం వృద్ధి చెందిందనీ’ గణాంకాలని తేటతెల్లంగా ప్రచారం చేస్తాయి. పదే పదే ప్రచారిస్తాయి.

కానీ ఒక్కసారంటే ఒక్కసారి కూడా, ఆయా దేశాల్లో వ్యవసాయం బక్క రైతులో దుక్కరైతులో… (ఎవరైతేనేం? వ్యక్తిగతంగా వ్యవసాయం చేసుకునే రైతులు) ఎక్కువ నిర్వహిస్తున్నారో, కార్పోరేట్ సంస్థలు ఎక్కువ నిర్వహిస్తున్నాయో చెప్పరు.

ఎందుకంటే… ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో, వ్యవసాయ రంగంలో వేళ్ళూనుకొని ఉంది కార్పోరేట్ సంస్థలూ, పెద్ద పెద్ద పెట్టుబడి దారులూ! రష్యా బోల్ష్విక్ ల దగ్గరి నుండీ ఇప్పటికీ అదే చరిత్ర! అప్పుడప్పుడూ తిరుగుబాట్లూ జరిగినా, నామ రూపాలు మారిన అదే దోపిడి!

వ్యక్తిగతంగా వ్యవసాయం చేసుకు జీవించే రైతు కుటుంబాలని నలిపేసి, రైతుల నడ్డి విరిచేస్తే… ఆపైన కార్పోరేట్ వ్యవసాయానికి అడ్డంకు లుండవు కదా! చంద్రబాబు దగ్గరి నుండి మన్మోహన్ సింగ్ దాకా… పదవిలో కూర్చున్న నాయకులు చేసిందీ, చేస్తోందీ ఆ ‘కార్పోరేట్ సాయమే’.

కాబట్టే – ఎకరా రూపాయి నుండి వంద రూపాయలకి సెజ్ లని, కంపెనీలకీ కట్టబెట్టేసారు. ఎదురు తిరిగిన రైతులని చావగొట్టి రక్తం కళ్ళ చూసారు, చూస్తున్నారు. ఎన్ని సోంపేటలని ప్రత్యక్షంగా చూసాం కాదు?

భారత దేశ రాజ్యాంగంలో ఉటంకింపబడిన కార్మిక చట్టాలేవీ సెజ్ లలో వర్తించవు. అవి యాజమాన్య ఇష్టారాజ్యాలు! ఈ విషయం మీడియా ప్రజలకి చేరేంతగా ఎన్నడైనా ప్రచారించిందా? లేదు! ఎందుకంటే... వ్యవసాయ రంగం ద్వారా భారతదేశం మీద జరుగుతున్న కుట్రలో ప్రధానపాత్ర మీడియాదే గనక!

ఇంకా, గొప్పగా… విదేశాల్లో అవుల మందల్ని మన దేశంలో, మేకల మందల్నీ, గొర్రెల మందల్నీ పెంచినట్లుగా పెంచరనీ, విశాలమైన గడ్డి మైదానాల్లో వేల కొలదీ ఆవుల్ని మల్లేయడానికి హెలికాప్టర్లలో తిరిగే… పశుల కాపరులుంటారని ప్రచారిస్తుంది.

నిజం చెప్పాలంటే… ఆ విశాల క్షేత్రమూ ఆ పశువుల కాపరిది కాదు, వేల సంఖ్యలో పశువులూ అతనివి కాదు, వాటిని మళ్ళించడానికి అతడుపయోగించే హెలికాప్టరూ అతడిది కాదు. అతడొక ఉద్యోగి, అంతే! ఆ ఉద్యోగం ఊడిన మూడు నెలలకే బ్రతుకు రోడ్డున పడే చిరుద్యోగి!

మన దేశంలో రోడ్డు ప్రక్కనా, బీడు భూముల్లో రేగు కంపల్లో, తుమ్మ గుబురుల్లో జీవాల్ని (మేకల్నీ, గొర్రెల్నీ వాళ్ళలాగే పిలుస్తారు.) మేపుకునే పశుల కాపరి, హెలికాప్టర్ లో తిరగక పోవచ్చు.

టై కట్టుకుని మెడలో ఐడెంటిటీ కార్డు తగిలించుకోక పోవచ్చు.

రబ్బరు చెప్పులేసుకుని, ఓ చేతిలో కర్ర, భుజమ్మీద గొంగళీ, పట్టాచుట్టిన ప్లాస్టిక్ సీసాతోనో, మట్టి కుండ (తాబేటి బుర్ర అని పిలుస్తారు)తోనో మంచి నీళ్ళు తీసుకుని, చెట్లమ్మాటా, చేల గట్టమ్మటా జీవాల్ని మేపుకుంటూ బ్రతుకుతుండవచ్చు.

కానీ… అతడి మందలో యాభై మేకలున్నాయన్నా అతడు లక్షాధికారే! స్వతంత్రుడే! షిప్టు ప్రకారం డ్యూటికి పోనవసరం లేనివాడు, ఎవ్వరి ఆజ్ఞనూ పాటించ నవసరం లేదు. ఉద్యోగం ఊడుతుందన్న భయం లేదు.

విదేశాల్లో వ్యవసాయ కార్పోరేట్ సంస్థలకి ఇచ్చినట్లే ఈ పశువుల కాపరలకు కూడా భీమా సరిగా అందేటట్లు చూస్తే, వారూ మరింత ధనవంతులు కాగలరు. ఈ తేడాని మీడియా అసలు వివరించదు. అదీ దాని ప్రచార మాయాజాలం!

నిజానికి మన దేశంలో, ప్రాచీన కాలంలో వ్యవసాయం ఎలా ఉండేదీ అంటే… లాభాల రాశుల్ని ఎవరెస్టు శిఖరాల్లా కుప్ప పోసిందనలేం.

కానీ, రైతు సగర్వంగా, సంతృప్తిగా… వత్తిళ్ళూ ఆయాసాలూ, ఆత్మహత్యలూ లేకుండా… ‘తాను తిని పదిమందికి తిండిపెట్టే మారాజూ’లా ఉండేది. దైన్యంతో… తానే రాజకీయ నాయకుల ముందో, ప్రభుత్వాధికారుల ముందో, దళారీల ముందో, చేతులు ముకుళించుకు నిలబడి లేడు.


ఆనాటి వ్యవసాయం గురించి… నాటి సాహిత్యం, కళలు, చరిత్ర మనకి మరిన్ని ఆధారాలు చెబుతాయి.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

నిన్నటి టపా: సుదర్శన్ వ్యాఖ్య ‘కన్ను’ రాడియా టేపులు ‘కాలు’ [నకిలీ కణికుడి వ్యవస్థ గురించి కొన్ని దృష్టాంతాలు[Circumstantial] – 18]


అనగా అనగా…

ఓ పల్లెటూర్లో సుందరయ్య అనే రైతు ఉండేవాడు. అతడికున్న కొద్దిపాటి పొలాన్ని సేద్యం చేసుకుంటూ, కాలం వెళ్ళదీసేవాడు. అతడికున్నదల్లా ఓ చిన్న ఆవుదూడ మాత్రమే!

ఆ లేగదూడంటే సుందరయ్యకి చాలా ఇష్టం. ఏమాత్రం తీరిక దొరికినా దాన్ని నిమురుతూ, పచ్చిక మేపుతూ గడిపేవాడు. పిల్లాజెల్లా లేని సుందరయ్యకి ఆ దూడంటే అమిత ప్రేమ. ‘ఎంతో ముద్దుగా ఉన్న ఆ లేగ దూడకి మాటలు కూడా వస్తే ఎంత ముచ్చటగా ఉంటుంది కదా?’ అనుకునేవాడు.

ఇలా ఉండగా… ఓ రోజు ఆ ఊరికి ఓ సాధువు వచ్చాడు. అతడు కన్యాకుమారి నుండి హిమాలయాలకు వెళ్తూ, మార్గవశంలో తమ ఊరిలో బస చేసాడనీ, అతడికి చాలా మహిమలున్నాయనీ ఊళ్ళో అందరూ చెప్పుకోసాగారు. రోజూ సాయంత్రం అతడికి పళ్ళూ ఫలాలు సమర్పించుకుని, అతడు చెప్పే నాలుగు మంచి మాటలు విని, వస్తున్నారు. తమ సమస్యలు చెప్పుకుని, ఏదైనా మార్గం చూపమని ప్రాధేయ పడుతున్నారు కొందరు.

ఇదంతా చూసిన సుందరయ్య ఎలాగైనా తన దూడకి మాటలొచ్చేలా చెయ్యాలనుకున్నాడు. సాధువు కాళ్ళ మీద పడి “అయ్యా! నాకున్నదొకే ఆవు దూడ. ఎంతో అమాయకంగా ముద్దుగా ఉంటుంది. అదే నాకు కొడుకూ, కూతురూ కూడా! దానికి గానీ మాటలు వస్తే ఎంత ముచ్చటగా ఉంటుందో! తమరే ఎలాగైనా దానికి మాటలొచ్చేలా చెయ్యాలి. ఏ మందో, మూలికో ఇవ్వండి” అని బ్రతిమిలాడాడు.

“నాయనా! అది ప్రకృతి విరుద్దం. మరేదైనా… నీ కోసం, కోరుకో” అని ఎంత నచ్చజెప్పినా ‘ససేమిరా’ అన్నాడు.

చివరికి సాధువు ఓ మూలిక ఇచ్చి “దీన్ని సాది దూడగొంతులో పొయ్యి. ఇక అది వసపోసిన పిట్టలా గలగలా మాట్లాడేయగలదు” అని తన దారిన తాను పోయాడు.

ఏనుగెక్కినంత సంబర పడుతూ సుందరయ్య ఇంటికి వచ్చాడు. ఆ మూలికని సాది, రసం తీసి దూడ గొంతులో పోసాడు.

ఆశ్చర్యం!

ఆవు దూడ ‘అంబా అంబా’ అనటం మానేసి, కబుర్లు చెప్పటం మొదలెట్టింది. సుందరయ్య మురిసి పోయాడు. రెండు రోజుల పాటు పనీపాటా మానేసి, దూడ కబుర్లు వింటూ గడిపేసాడు.

మూడో రోజు రాత్రి, ఉరుములూ మెరుపులతో వాన మొదలయ్యింది. అప్పటికే సుందరయ్య అన్నం తినేసి, దూడకి గడ్డి వేసి, దీపం ఆర్పేసి ముసుగు తన్ని నిద్దర పోయాడు.

పాకలో దూడకి చలిగాలి వీస్తోంది. సన్నగా వాన జల్లూ మీద పడుతుంది. దాంతో సుందరయ్యని పిలిచింది. తననీ ఇంట్లో పడుకోనివ్వమంది. మాంఛి నిద్రలో ఉన్న సుందరయ్య ఇవేవీ వినలేదు. దాంతో దూడకి వళ్ళు మండి పోయింది. తటాలున అది తిట్లు లంకించు కుంది.

పెద్దగా పిడుగు పడిన ధ్వనికి సుందరయ్యకి మెలకువ వచ్చింది. అప్పటికే దూడ…
“ఓ సుందరయ్యా! నీ మొహం మండా! నువ్వేమో వెచ్చగా ఇంట్లో పడుకుంటావా? నన్నీ పాకలో పారేస్తావా? సన్న జల్లుకి వళ్ళు తడిచి పోతోంది. చలికి వణుకు పుడుతోంది. నువ్వు మాత్రం దుప్పటి గప్పుకు హాయిగా పడుకుంటావా? నన్నూ లోపల పడుకోనివ్వరా దేభ్యం మొహమా?” అంటోంది.

సుందరయ్యకి ఓ క్షణం ఏదీ అర్ధం కాలేదు. దూడ తనని తిడుతోందని అర్ధమయ్యాక… “నిన్ను ఇంట్లోకి తీసికెళ్తే ఎలా? ఇల్లంతా పేడ కంపు రాదూ?” అన్నాడు.

దూడ “మా జాతి ఇచ్చే పాలూ పెరుగులు ఇంట్లో పెట్టుకుంటావు గానీ, మా పేడ మాత్రం నీకు కంపు కొడుతోందేం?...” అంటూ తర్కాలు తీసి, శాపనార్ధాలు పెట్టసాగింది.

అది మొదలు సుందరయ్య ఇంట్లో నిశ్శబ్దం చచ్చిపోయింది. ప్రతీక్షణం దూడ సుందరయ్యని ఎందుకో ఒకందుకు తిట్టి పోస్తూనే ఉంది.

దెబ్బకి సుందరయ్యకి దూడ మీద మోహం కాస్తా నశించి పోయింది. ఉరుక్కుంటూ ఊళ్ళోకి పోయి, సాధువు గురించి వాకబు చేసాడు. అప్పటికే సాధువు ప్రక్కనున్న ఊళ్ళు దాటి, ఉత్తర దిశగా హిమాలయాల కేసి సాగిపోయాడని తెలిసింది.

పడుతూ లేస్తూ, సాధువుని వెదుక్కుంటూ పరుగెత్తాడు సుందరయ్య. చివరికి ఓ ఊళ్ళో సాధువుని కలిసి, విషయమంతా చెప్పి, దూడకి మాట్లాడే శక్తి పోయి, యధావిధిగా…పూర్వపు దూడలా మారేందుకు మరో మందో మాకో ఇమ్మని బ్రతిమాలాడు.

అతడి గోడంతా విన్న సాధువు, ఎంత దయగా చిరునవ్వు నవ్వుతూ “చూశావా నాయనా! నేను చెబితే విన్నావు గాదు” అంటూ మరో మూలిక ఇచ్చాడు. “దీన్ని సాది దూడకి తాగించు. వచ్చిన మాటలు వచ్చినట్లే పోతాయి” అన్నాడు.

సుందరయ్య సాధువు కాళ్ళ మీద పడి పదేపదే కృతజ్ఞతలు చెప్పుకున్నాడు.

సాధువు నవ్వుతూ “చూడు నాయనా! ప్రకృతిలో ఒదిగిపో! సంతోషంగా బ్రతికేస్తావు. ప్రకృతిని నీకు అనుకూలంగా ఉపయోగించుకో! సౌకర్యంగా సుఖంగా బ్రతికేస్తావు. కానీ, ప్రకృతిని ధిక్కరించకు. అతిక్రమించకు. అష్టకష్టాలూ పడతావు. అది ప్రకృతి స్వభావం” అన్నాడు.

సుందరయ్య బుద్ధిగా తలూపాడు.

అనుభవంతో తత్త్వం బోధపడింది మరి!

అదండీ కథ!

2011 అందరికీ ఆనందాన్నివ్వాలనీ, నిజాలని దర్శింప చేయాలనీ కోరుతూ…

అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు!

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu