ఈ విధంగా పొదుపు చేసుకున్న డబ్బుని మదుపు చేసుకోవాలనుకునే వాళ్ళని మినహాయిస్తే... షేర్ల స్వల్పకాల క్రయ విక్రయాలకు సిద్దపడే వారంతా, కంపెనీ పంచిఇచ్చే డివిడెండ్లని ఆశించి గాక ‘షేర్ల ధరలు పెరుగుతాయి, పెరిగాక అమ్ముకుని లాభాలు పొందుదాం’ అనుకుని షేర్లలో పెట్టుబడి పెడతారు.

[నిజానికి వీరు పొదుపు ఆలోచన గాక వ్యాపారంలో పెట్టుబడి పెట్టడం అనే ఆలోచనతో షేర్ల క్రయ విక్రయాలలోకి దిగుతారు.]

కాబట్టి, ఖచ్చితంగా వీరిని పొదుపరులు అనకూడదు, మదుపుదారులు అని కూడా అనకూడదు. ఎందుకంటే - షేర్ మార్కెట్ వ్యాపారం ‘మదుపు, పెట్టుబడి’ అనే దశ నుండి ‘జూదం’ అనే స్థాయికి ప్రయాణించి చాలా కాలమయ్యింది. "ఠాఠ్! నేనొప్పుకోను. ఇది మదుపు చెయ్యడమే. జూదమాడటం కాదు" అనడమంటే, అది నిశ్చయంగా ఆత్మవంచనే!

నిజానికి... ఈ అత్మవంచన లేదా జూదంలోకి... తమ సంపాదనలో కొంత పొదుపు చేసుకొని, మదుపు పెడదామనుకునే సామాన్యప్రజలు, ఏ విధంగా నెట్టబడ్డారో తర్వాతి టపాలలో పరిశీలించ వచ్చు.

చాలా కాలంక్రితమే, షేర్ మార్కెట్ లో క్రయ విక్రయాలు జూదపు స్థాయికి చేరాయి. కాబట్టే... వదంతుల కారణంగా ‘ఫలానా షేర్ ధరలు పెరిగాయి/తరిగాయనో’ మాటలు వింటుంటాం. ‘ఫలానా మంత్రి ఫలానా ప్రకటన చేసినందున సెన్సెక్స్ రఁయ్యిమంటూ దూసుకుపోయిందనీ లేదా కుఁయ్యంటూ కూలబడిందనీ’ వింటుంటాం.

ఇప్పుడు కొత్తగా మొదలు పెట్టిన ప్రచారం... క్రికెట్ ఆటలో (అదీ సదరు క్రికెట్ సిరీస్ లేదా వన్‌డే లు మ్యాచ్ ఫిక్సింగ్ అని తేటతెల్లగా వెల్లడైనా కూడా) గెలుపోటములని బట్టి కూడా, షేర్ ధరలు పెరగటం లేదా తరగటం కూడా చూస్తున్నాం. ‘సెంటిమెంటు పనిచేసిందన్న’ సర్వేలూ, విశ్లేషణలూ ఉన్నాయి.

వాస్తవానికి... క్రికెట్ మ్యాచ్ లకీ, షేర్ ధరలకీ సంబంధమేమిటి? క్రికెట్ ఆట గెలుపోటముల వలన వస్తూత్పత్తి నిర్వహించే కంపెనీల ముడిపదార్ధాల ధరలో, లభ్యతలో లేక ఉత్పత్తి చేసిన వస్తువుల ధరలూ లభ్యతలో ఎలా ప్రభావితం అవుతాయి?

ఈ ప్రశ్నలు ఎవరూ వేయరు, మనబోటి వాళ్ళు వేసినా ఎవరూ సమాధానాలు చెప్పరు!

ఇక వస్తూత్పత్తి చేసే కంపెనీలతో బాటు, సేవలందించే సంస్థలూ ‘షేర్లు విడుదల చేయటం’ ప్రారంభిమై చాలా కాలమే అయ్యింది.

ఇక ఇన్ని కారణాలతో, మరికొన్ని కనబడని కారణాలతో... షేర్ల ధరలు పెరగటం/తరగటం సంభవించటంతో... షేర్ హోల్డర్లు కూడా, దీర్ఘకాలిక పెట్టుబడి లేదా పొదుపు చేసిన డబ్బు దాచుకోవటం కోసం గాక ‘స్వల్ప కాలంలో లాభాల పంట పండించు కోవచ్చు’నన్న ఆలోచనతో ట్రేడింగ్ లోకి దిగి బుల్స్ నాశ్రయిస్తుంటారు.

ఇప్పుడంతగా లేదు కాని, 1985-90ల్లో, 1992 దాక కూడా, షేర్ మార్కెట్ గురించి ఊరించే వార్తా కధనాలు, షేర్ ట్రేడింగ్ మీద ఆధారపడిన కధాంశాలతో నవలలూ వెల్లువెత్తాయి కూడా!

ఆర్దిక మాంద్యం రీత్యా ఇప్పుడది కొంచెం మందగించబడింది.

వార్తాపత్రికల్లో ప్రచురించే వార్తాంశాల్లో కూడా... ఫలానా విధంగా షేర్ మార్కెట్లు కుప్పకూలటంలో, రాత్రికి రాత్రి వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి లేదా షేర్ మార్కెట్లు పుంజుకోవటంతో రాత్రికి రాత్రి వందల వేల సామాన్య మదుపర్లు కుబేరులయ్యారనీ... ఉపమాన, ఉత్పేక్ష, రూపకాలంకార సహితంగా వ్రాస్తుంటారు.

"నిన్న... అతడో సామాన్య మదుపరి! వంద నోటుని ఒకటికి పదిసార్లు చూసుకుని ఖర్చుపెట్టేవాడు. ఈ రోజు...!? ఇల్లుపట్టనంతగా కరెన్సీ కట్టలు కలిగి ఉన్న అపర కుబేరుడు, ఒక్కరోజులో అతణ్ణి కోటీశ్వరుణ్ణి చేసిన మహత్తూ.... ఫలానా ఫలానా" అంటూ తెగ వర్ణించి వ్రాస్తుంటారు. (1992 లో హర్షద్ మెహతా అవకతవకలకు ముందు, షేర్ మార్కెట్ బూమ్ వలన ‘చాలామందికి బంగారు పంట పండిందని’ వార్తాపత్రికలు తెగ వ్రాసేసాయి. అవకతవకలు బయటపడిన తరువాత గానీ, అసలు నిజం తెలియలేదు జనాలకి!)

2008 సెప్టెంబరులో ‘ప్రపంచాన్ని ఆర్దికమాంద్యం పట్టికుదుపుతోందన్న’ వార్త...
ఆపశక్యం గాక బట్టబయలైనప్పుడు...
లేమాన్ బ్రదర్స్ వంటి 150 ఏళ్ళ చరిత్ర గల కంపెనీలు దివాళా తీసినప్పుడు...
రోజుకి పదుల సంఖ్యలో ప్రైవేటు బ్యాంకులు దివాళా బాటపట్టినప్పుడు...

వార్తాపత్రికలన్నీ ఇలాగే వ్రాసాయి. ‘మదుపర్ల కుటుంబాలు వేలాదిగా రోడ్డున పడ్డాయి, నిన్న కుబేరుడు ఈ రోజు బికారి’... గట్రా! నిజానికి జూదంలో ఆ ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది.

లాభాన్ని ఆశించి సాహసానికి ఒడిగట్టినప్పుడు, లాభానికి సమాంతరంగా నష్టం వచ్చే అవకాశమూ అంతే ఉంటుంది. అది తెలిసి తెలిసీ దిగారు కదా!

అసలుకే... ‘నత్తల నడకల మీదా, పీతల పరుగుల’ మీదా పందాలు కట్టే జూద మనస్తత్వం పెరిగిన చోట, ఊరించే వార్తాంశాలు మరింత ఆకర్షించటం సహజమే కదా! కానట్లయితే... ‘ఒక ఓవర్ లో ఫలానా ఆటగాడు ఎన్ని పరుగులు చేస్తాడు, ఎన్నో బంతి నోబాల్ అవుతుంది, ఎవరు ఎవరి చేతిలో అవుట్ అవుతారు’ అన్న వాటి మీద వేల కోట్ల రూపాయలు చేతులు మారవు కదా!

[‘నత్తల నడకలూ, పీతల పరుగులూ’ అంటే అతిశయోక్తిగా అనిపిస్తుందేమో గానీ ‘చిత్రహార్ లో ఏపాట వస్తుంది?’ అన్నదాని మీద పందాలు నడవటం, 1990లో గగ్గోలు అయ్యి, సంచలనం సృష్టించిందన్న నిజం, ఆనాటి పెద్దలకి గుర్తుండే ఉంటుంది!]

ఈ విధంగా, మీడియా...
షేర్ మార్కెట్ కి నూటికి నూరు పాళ్ళు సహాయసహకారాలు అందిస్తూ వార్తాంశాలు వ్రాసేచోట...
సామాన్య మదుపర్లు రోడ్దున పడ్డారనీ, కుబేరులు బికారులయ్యారనీ ఏవేవో ఉపమానాలు వ్రాసిన చోట...
అసలు నిజం ఏమిటంటే...
ఆర్దిక మాంద్యం నేపధ్యంలో ఆవిరయ్యిందీ, అవుతోందీ కాగితపు సంపదే!

12 ఫిబ్రవరి, 2008 ఈనాడులో, [ఇంకా చాలా వార్తా పత్రికల్లో] ‘ఆవిరౌతుంది కాగితపు సంపదే’ అంటూ ప్రచురించిన సుదీర్ఘ వ్యాసంలో, స్పష్టంగా ఈ విషయాన్ని ఉటంకించారు.

[మన బ్లాగుల్లోనో, వెబ్ సైట్లలోనో పాత టపాలన్నీ... తేదీల వారీగా ఉంచినట్లుగా...
ఈ వార్తా పత్రికలూ, ప్రైవేటు టీవీ ఛానెళ్ళు... తమ పాత వార్తాంశాలను, లైబ్రరీలాగా...
పాఠకులకి, ప్రేక్షకులకీ అందుబాటులో ఉంచితే...
అప్పుడు ఎవరూ ఎవరికీ చెప్పనవసరం లేకుండానే, సదరు మీడియా వాళ్ళు, ఎప్పుడు, ఎలాంటి ప్రచారాలు చేసారో అర్ధమౌతుంది. ఒకసారి చెప్పిన దానికి పూర్తి విరుద్ధమైనది మరోసారి ఎలా చెబుతారో, ఎప్పుడెప్పుడు చెప్పారో పక్కాగా దొరికిపోతారు కూడా! అందుకే అలాంటి సాహసం వాళ్ళు చెయ్యరనుకొండి.

చేస్తే... పాఠకులు, ప్రేక్షకులు మీడియాని ‘పోస్ట్ మార్టమ్’ చేసేస్తారు మరి!]

అది ఏవిధంగా కాగితపు సంపదో పరిశీలించేముందు... ఓసారి... బ్యాంకులూ, షేర్ క్రయ విక్రయాల నేపధ్యం గురించి పరిశీలించాలి.

నిజానికి పబ్లిక్ ఇష్యూ పేరిట ‘వాటాల అమ్మకం’ అనే ప్రక్రియని, ప్రపంచంలో మొట్టమొదట ప్రవేశపెట్టినప్పుడు.... అన్నీ సానుకూల అంశాలే చెప్పబడ్డాయి, చూపించబడ్డాయి, నమ్మించబడ్డాయి. చెప్పినట్లు,చూపించినట్లు, నమ్మించినట్లు... ఆచరణ కూడా సానుకూలంగా ఉండి ఉంటే, ఆ ప్రక్రియ, ఈ పాటికి ప్రపంచాన్ని, ప్రశాంత సౌభాగ్య స్వర్గధామంగా మార్చగలిగి ఉండేది.

ఆ ప్రక్రియ యొక్క సిద్ధాంతంలో లోపం లేదు. లోపం ఉందల్లా ఆచరణలోనే! సిద్ధాంతంలో అన్నీ సానుకూలాంశాలే చూపించి, ఆచరణలో అన్నీ స్వార్ధ ప్రయోజనాలే నడిపించుకున్న కుతంత్రం అది.

వివరంగా చెప్పాలంటే....

ప్రజలకి, తమ తిండి తిప్పలకీ, రోజు వారీ జీవితాలకీ ఖర్చుపెట్టుకోగా... భవిష్యత్ అవసరాల కోసం, డబ్బు పొదుపు చేసుకుని దాచుకోవటం అవసరం. అది మంచి అలవాటు, భద్రమైన మార్గం, ఆరోగ్యకరమైన అలోచనా ధోరణి కూడా!

ఎక్కడ దాచుకోవాలి? అవసరంలో ఉన్నవారికి అప్పుగా ఇచ్చి ధర్మవడ్డీ పుచ్చుకుంటే... సమాజంలో పొదుపు చేయగలిగినంత ఆదాయం కలవారికీ, అవసరాలకి అంతంత మాత్రం సరిపోయే ఆదాయం గలవారికీ కూడా ప్రయోజనకరం!

కానీ మనిషి బుద్ధి అలా స్థిరంగా ఉండదు కదా! ధర్మవడ్డీ పొందగల అవకాశం ఉంటే, అందులోంచి చక్రవడ్డీ, అవధుల్లేనంత వడ్డీ గుంజాలని ఆశపుడుతుంది. అదే ప్రైవేటు బ్యాంకులుగా రూపొంది విశ్వరూపం చూపించింది. నాటి బడుగుల బ్రతుకలని ఛిద్రం చేసింది. ఈ విషయమై ప్రపంచంలో మిగిలిన దేశాలు ఎలా వ్యవహరించాయో గానీ, భారతదేశంలో మాత్రం, ఇందిరా గాంధీ హయాంలో బ్యాంకుల జాతీయం చేయబడి, ఈ వడ్డీ ఆశకు ఆనకట్ట వేయబడింది.

సరే! బ్యాంకులు జాతీయం చేయబడ్డాయి. అవసరాల కంటే ఎక్కువ ఆదాయం ఉండి దాచుకోగలవాళ్ళు, బ్యాంకుల్లో దాచుకుంటే, ఆ సొమ్ముకి బ్యాంకు వడ్డీ చెల్లిస్తుంది. అదే సొమ్ముని, అవసరాలకి తగినంత ఆదాయం లేని వారికి అప్పుగా ఇస్తుంది. బ్యాంకు ఒక వ్యక్తి కాదు గనుక, ప్రభుత్వ సంస్థ గనక, జలగల్లా రక్తం పీల్చి వడ్డీలు వసూలు చెయ్యరు, చేసేంత దురాశ కలిగి ఉండదు.

బ్యాంకుల్లో పొదుపు చేసుకున్న మదుపర్లకు (అంటే డిపాజిట్లకు) కొంత తక్కువ వడ్డీ చెల్లించి, బ్యాంకుల్లో అప్పు తీసుకున్న వారి నుండి కొంత ఎక్కువ వడ్డీ వసూలు చేస్తే... ఆ స్వల్ప లాభం, బ్యాంకుల నిర్వహణా ఖర్చులకి, సిబ్బంది జీతభత్యాలకి, బ్యాంకుల అభివృద్ధికి పనికి వస్తుంది - ఇదీ బ్యాంకుల జాతీయకరణ నాడు... దేశం పట్ల, ప్రజల పట్ల నిబద్దత గల ఆనాటి నేతలు కన్న తీయటి కల. (దీనిని పీవీజీ తన ‘లోపలి మనిషి’లో బండి మీద కూరగాయలమ్మే పెద్దామెతో సంభాషణతో వివరించారు.)

అయితే, అన్నిటిలాగానే అదీ ఆచరణలో విఫలం కావటమే... ప్రైవేటు బ్యాంకులు దూసుకు రావటం, సూక్ష్మరుణాల సంస్థలు రూపుదాల్చడం, పిట్టల్లా రాలుతున్న బడుగుల జీవితాల ఉదాహరణలతో... ఇప్పుడు మనం చూస్తున్న వాస్తవానికి కారణం!

ఏ పధకాన్నైనా, ఏ సిద్ధాంతాన్నైనా, ఆచరణలో వైఫల్యానికి గురి చెయ్యడమే... కుట్రదారులైన ‘నకిలీ కణిక వ్యవస్థ పనితీరు’ అనటానికి ఇది మరొక సజీవ, తాజా ఉదాహరణ!

మరోసారి బ్యాంకుల విషయానికి వస్తే... ఆచరణలో విఫలమై, ఇప్పుడు ఫిక్సిడ్ డిపాజిట్లకు కూడా ముష్టి వడ్డీ ఇస్తూ, పూర్తిగా డిపాజిటర్లని బ్యాంకుల గడప తొక్కకుండా తరిమి వేసాయి గానీ, మా చిన్నప్పుడు 5 1/2ఏళ్ళకు సొమ్ము రెట్టింపయ్యే ఫిక్సిడ్ డిపాజిట్లకు ఆదరణ బాగా ఉండేది.

ఇప్పుడు (ఈ ఒకటిన్నర దశాబ్దంలో) బ్యాంకు వడ్డీలని మరింత మరింత కృశింప జేసి, అనివార్యంగా, చిన్న మొత్తాలని పొదుపు చేసుకునే సామాన్య ప్రజలు కూడా ప్రత్యామ్నాయాలు వెదుక్కునేటట్లు చేయటం కూడా కుట్రలో భాగమే!

ఇంట దాచుకోలేరు, దొంగ భయం ఉంటుంది. పోలీసులు ఆ సమస్యను నివారించరు. వడ్డీలకిచ్చుకోలేరు, ఎగవేత భయం ఉంటుంది. వసూలు చేసుకోవటానికి తల ప్రాణం తోక ఉంటే దాంట్లోకి వస్తుంది. అనివార్యంగా షేర్ల వైపు అడుగులు వేయటం పెరిగింది. దోపిడిలో ఇదీ భాగమే. ఎలాగంటే... నిజానికి బ్యాంకులు... డబ్బు ఎక్కువ ఉండి పొదుపు, మదుపూ చేసుకునే వారికి... అవసరాలకి అప్పుకోసం దిక్కులు చూసే వారికీ... మధ్యలో అనుసంధాన కర్త వంటివి. వ్యవహర్తలా ఇద్దరి అవసరాలూ తీరుస్తాయి.

సరిగ్గా... ఇలాంటి సత్ర్పయోజనమే, భారీగా వస్తూత్పత్తి చేసే సంస్థలు (కంపెనీలు) పెట్టుబడులు సమీకరించుకునేందుకు, పబ్లిక్ ఇష్యూ విడుదల చేయటంలో ఆశించబడింది.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

గత టపాల్లో చెప్పినట్లు... ఏ కారణం చేతనైనా కంపెనీ షేర్ ధర ఏకబిగిన పడిపోతూనే ఉందనుకొండి. అప్పుడొస్తుంది తంటా! అప్పుడు స్థిరాస్థి క్రయవిక్రయాల రిజిస్ట్రేషన్ సమయంలో ప్రస్తావన కొచ్చే... మార్కెట్ వాల్యూ Vs బుక్ వాల్యూ వంటి ప్రక్రియ తెర మీదికి వస్తుంది.

గత టపాలో చెప్పిన ఉదాహరణే కొనసాగిస్తే.... పబ్లిక్ లిమిటెడ్‌గా అవతరించిన జగన్మాయ కంపెనీ, తనకి అవసరమైన పది కోట్ల రూపాయల పెట్టుబడిని సమీకరించుకునేందుకు కోటి షేర్లని మార్కెట్టులో విడుదల చేసిందను కొండి. వ్యాపార క్రమంలో సదరు కంపెనీ షేరు విలువ, ఒక్కొక్కటీ వంద రూపాయలకు పెరిగిందను కొండి.

ఆ ప్రకారం, బ్యాంకులో జగన్మాయ కంపెనీ తన కోటి షేర్లను భరోసాగా ఉంచి (అంటే కోటిx100రూ. =100కోట్ల రూ.) అందులో 80% అంటే 80 కోట్ల రూపాయల పరిమితి గల ఖతాను నిర్వహిస్తుంది. ఏకబిగిన కంపెనీ షేర్ ధర పడిపోతుంటే... అలా పడిపోయి పడిపోయి జగన్మాయ కంపెనీ షేరు ధర యాభై రూపాయలకి పడిపోతే... అప్పుడు దాని ఖాతా పరిమితి కాస్తా 40కోట్లై కూర్చుంటుంది. అప్పుడు జగన్మాయ కంపెనీకి, కాసులకు కరువొస్తుంది కదా!

అప్పుడు, అది, షేర్ బజార్ లో (దలాల్ స్ట్రీట్ వంటివి) గుర్తింపు పొందిన ఏజంట్ల ద్వారా, తన షేర్లను తానే బినామీగా కొంటుంది. బుల్స్ గా పిలవబడే ఈ లైసెన్స్‌డ్ ఏజంట్లు, కంపెనీలతో, అలాంటి ప్రయోజనాలు (favors) నెరవేర్చేంత సత్ససంబంధాలు కలిగి ఉంటారు. దీన్ని ‘బైబ్యాక్’ అంటారు.(గతంలో గుట్టుచప్పుడు గాకుండా నడిచే ఈ వ్యవహారాలు, ఇప్పటి ఆర్దికమాంద్యం నేపధ్యంలో ఇటీవలే వెలుగు చూస్తున్నాయి.

మొన్నామధ్య, ‘దాదాపు అన్ని కంపెనీలూ... అవసరమైనప్పుడు అంతో ఇంతో బైబ్యాక్ చేస్తాయంటూ’ చల్లగా చావుకబురు వినిపించారు.)

పత్రికల వార్తల్లో పెయిడ్ వార్తలు వ్రాయించుకున్నట్లు, ఒకప్పుడు కవులు తామే వెనక నుండి డబ్బు ఖర్చు పెట్టుకుని తమకి తామే సన్మానాలు ఏర్పాటు చేసుకున్నట్లు, గత టపా ‘ఈవెంట్ మేనేజ్‌మెంట్‌’లో చెప్పినట్లు, ఎలాంటి సంఘటనలైనా కిరాయి వ్యక్తుల్ని పెట్టి జరిపించే సంస్థలు పుట్టాక, బైబ్యాక్ పెద్ద విషయమేమీ కాదు! నల్లడబ్బు, దొంగ ఖాతాలు, స్విస్ ఖాతాలు... నిర్వహించే కంపెనీలకు ఇదంత కష్ట సాధ్యమూ కాదు.

ఆ విధంగా పడిపోతున్న తమ కంపెనీ షేరు ధరని తామే నిలబెట్టుకుంటే... తాజాగా లావాదేవీలకు గురైన షేరు ధర ‘బుక్ వాల్యూ Vs మార్కెట్ వాల్యూలలో ఏది గరిష్టమైతే అది పరిగణింపబడుతుంది’ వంటి నియమం ప్రకారం, తాజా ధర పరిగణింపబడి, కంపెనీ బ్యాంకు ఖాతా పరిమితి కృంగిపోకుండా నిలబడి ఉంటుంది. అది కంపెనీలకు ఆయువుపట్టు వంటిది గనక గండం గడిచిపోతుంది.

ఎటూ... ఈ విధమైన బైబ్యాక్ ప్రతిరోజూ నిర్వహించనక్కరలేదు కదా! ఏకబిగిన షేరు ధర తగ్గిపోతున్నప్పుడు, అదీ వారానికోసారి నిలబెట్టుకున్నా ‘బచ్‌గయా’ అనుకోవచ్చు.

నిజానికి లాభాల ప్రకటనలతో, మీడియా ప్రచార ప్రకటనల హోరుతో ఏకబిగిన షేర్ ధర పడిపోవటం సాధారణంగా జరగదు. అన్నీ సజావుగా నడిచి గతంలో అది సుసాధ్యంగానే ఉండేది.

కాకపోతే ప్రపంచమే ఆర్దిక మాంద్యంలో చిక్కుకుని, ఇప్పుడే అంత గడ్డుస్థితి ఏర్పడింది. దీనికి కార్యకారణ సంబంధాలని తర్వాత పరిశీలిద్దాం. ఇప్పటికి జగన్మాయ కంపెనీ ఉదాహరణతో విశ్లేషణ కొనసాగిస్తాను.

ఈ విధంగా షేర్ ధర పడిపోకుండా సర్వప్రయత్నాలు చేసుకుంటూ కెరీర్ సాగిస్తే... సదరు జగన్మాయ కంపెనీ, సంవత్సరమంతా 80 కోట్ల బ్యాంకు ఖాతా పరిమితిలో నిధులని ఉపయోగించుకొందనుకొండి.

80కోట్లకు కనిష్ఠంగా నెలకు వందకు 2 రూపాయల ధర్మవడ్డీ ప్రకారం లెక్కవేసినా... సంవత్సరానికి 19.2 కోట్ల రూపాయల, నికర ఆదాయం ఉంటుంది. ఇందులో బ్యాంకుకి కట్టే వడ్డీ మినహాయించినా ఇంకా సొమ్ము మిగులే!

అలాంటిది 80 కోట్ల సొమ్ము, అంత తక్కువ వడ్డీతో వ్యాపార విస్తరణకి, లావాదేవీలకి అందుబాటులో ఉన్నప్పుడు... 80 కోట్లకి రమారమి వడ్డీ రూపేణానే 20కోట్లు సంవత్సరానికి జోడవుతాయి. అందులో షేరుకు సంవత్సరానికి 2రూపాయల లాభాన్ని (డివిడెండుని) పంచినా కంపెనీకి అయ్యే ఖర్చెంతని?

కోటి షేర్లుx2 రూ. =2 కోట్ల రూపాయలు. దీనిని కూడా త్రైమాసికంగా డివిడెండు కాబట్టి వాటిని సంవత్సరానికి దఫాలుగా, నాలుగు భాగాలుగా చెల్లింపు జరుగుతుంది. అంటే త్రైమాసికానికి 50లక్షలు షేర్ హోల్డర్లకు చెల్లిస్తే సరిపోతుంది.

ఎటూ షేర్ హోల్డర్లు కూడా... కంపెనీ తమకి పంచే లాభాల వాటా (డివిడెండు)ని దృష్టిలో పెట్టుకుని గాక, మార్కెట్టులో పెరిగే షేరు విలువని దృష్టిలో పెట్టుకునే షేర్లని కొంటారు కదా! దాంతో కంపెనీకి తాము ఉపయోగించుకుంటున్న 80కోట్లకుగాను గిట్టుబాటయ్యే 20కోట్ల వడ్డీ సొమ్ములో 2కోట్లని అదీ నాలుగు విడతలుగా చెల్లిస్తే... డివిడెండ్లు పంచిన కంపెనీగా తమ షేరధర మరింత పెరిగి, మరింత సొమ్ము తమకు వినియోగించుకునేందుకు అందుబాటులోకి వస్తుండగా... డివిడెండ్లు పంచడం మరింత లాభాదాయకమా, కాదా?

అందుకోసం లేని లాభాలు ఉన్నట్లుగా చూపటం సంభవమా, కాదా? అదే ఇప్పుడు చాలా కంపెనీల్లో నడుస్తోంది. ఉదాహరణకి మొన్నామధ్య డివిడెండ్ ప్రకటించిన లార్సెన్&టూబ్రో కంపెనీ విషయాన్నే తీసుకుందాం. ఒకో షేరుకు 12.50రూ.ల లాభవాటా (డివిడెండ్) ని కంపెనీ ప్రకటించింది. దాదాపుగా 73 కోట్ల 65లక్షల పైచిలుకు వాటాలు మార్కెట్టులో ఉన్నాయి. నిన్నటి రోజు (అంటే అక్టోబరు 18వ తేదిన) 71,245 షేర్లు ట్రేడింగ్ కు (అంటే క్రయవిక్రయాలకు) గురయ్యాయి.

సదరు ఎల్&టీ కంపెనీ షేరు ధర ఒక్కొక్కటీ 2,034 రూపాయలు. నిన్నటి ట్రేడింగ్ లో కొంత తగ్గుదలకి గురయ్యి 2,015 రూ.లకు పడిపోయింది. అంటే రెండు వేల పైచిలుకు ధర గల ఒకో వాటా కలిగి ఉన్న షేర్ హోల్డర్‌కు, కంపెనీ ఇచ్చిన లాభం 12రూపాయల ఏభైపైసలు. నిశ్ఛయంగా 12రూపాయల యాభై పైసల లాభం కోసం ఏ మదుపుదారుడూ 2,034 రూపాయల పెట్టుబడి పెట్టడు. అదీ కంపెనీ ఆరునెలలకి ఒకోసారి పంచే లాభం!

మొన్న షేర్ ఒక్కింటికి 12.50 రూ.ల డివిడెండుని ప్రకటించిన ఎల్&టి, తరువాత రోజు... 200 కోట్ల పెట్టుబడిని సేకరించేందుకు నూతన బాండ్లు విడుదల చేసింది. కనీస పెట్టుబడి 5000 రూ.లు కాగా... స్థిర ఆదాయ హామీ, 20,000రూ.ల వరకూ పన్ను రాయితీ, అదనపు ఆకర్షణలు! ఇన్ని ఆకర్షణలతో బాండ్లు విడుదల చేయనుండగా, ఇప్పటికే లావాదేవీల్లో చలామణి అవుతున్న షేర్ల మీద డివిడెండు ఇవ్వటం, మరింత ఆకర్షణీయంగా ఉంటుంది కదా! రేపటి పెట్టుబడి సమీకరణకు, నేటి డివిడెండు పంపకం బలాన్నిస్తుందన్నది సతర్కమే కదా!

అలాంటిదే బ్యాంక్ ఆఫ్ బికనీరు&జైపూర్ ది. ఒక్కో షేర్ మీద 7.50 రూ.ల డివిడెండు ప్రకటించిన తర్వాతి రోజున 800కోట్ల రూ.ల పెట్టుబడి సేకరణకు కొత్త ఇష్యూ ప్రకటించింది.

ఇంత నేపధ్యం ఉన్నప్పుడు... డివిడెండుకు వందల రెట్లలో షేర్ ధరలు పెరగటం మామూలే! వస్తూత్పత్తి చేసే సంస్థలతో బాటుగా, సేవల రంగంలోని సంస్థలూ షేర్లు విడుదల చేయటం ఒక ఆసక్తిదాయకమైన అంశం.

అలాంటప్పుడు నిశ్చయంగా, మదుపుదారులు కంపెనీ ఇవ్వనున్న, ఇవ్వజూపుతున్న లాభాలని ఆశించి షేర్లు కొనడం లేదు. ప్రైమరీ ఇష్యూనాడు షేర్లు కొని... సుదీర్ఘ కాలం వేచి ఉండే షేర్ హోల్డర్స్ ని మదుపుదారులు అనవచ్చు.

బ్యాంకుల్లో డబ్బు దాచుకుంటే తక్కువ వడ్డీ వస్తుంది గనుక,
ఇంట దాచుకుంటే దండుగ + దొంగల భయం గనుక,
ఇతరులకి వడ్డీకిస్తే ఎగవేత భయం గనుక షేర్లలో,
బాండ్లల్లో భద్రత చూసుకొని వీరు పెట్టుబడిపెడతారు.

అయితే... ఇలాంటి వారు, చాలాసార్లు మోసగించబడుతూనే ఉంటారు. లిస్టింగ్ లో మాయమై పోయే కంపెనీల షేర్లు వీళ్ళ దగ్గర మురిగి పోతుంటాయి. పెట్టుబడి పెట్టి, రోజు వారి తమ జీవన పోరాటంలో తాము మునిగి పోయి, ఆనక కళ్ళు తెరిచి "ఫలానా కంపెనీ షేర్లు ఎక్కడా (quote)కోట్ అవ్వటం లేదు. నా దగ్గర ఇన్ని షేర్లున్నాయి. ఎవరిని అడగాలి? ఎలా నా సొమ్ము నేను తిరిగి పొందాలి?" అంటూ పత్రికల్లో కాలమ్స్ నిర్వహించే నిపుణులకి వ్రాస్తుంటారు.

అంబుడ్స్‌మెన్ ల వంటి సంబంధిత అధికారులకి, అధికార వ్యవస్థలకి ఫిర్యాదులు పెట్టుకుని దీనంగా దేవుడికి దణ్ణాలు పెట్టుకుంటారు. ఇలాంటి వాళ్ళని మినహాయిస్తే... షేర్ల స్వల్పకాల క్రయవిక్రయాలకు సిద్దపడే వారంతా, కంపెనీ పంచి ఇచ్చే డివిడెండ్లని ఆశించి గాక... `షేర్ల ధరలు పెరుగుతాయి, పెరిగాక అమ్ముకుని లాభాలు పొందుదాం' అనుకుని షేర్లలో పెట్టుబడి పెడతారు.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

విజయ దశమి పండుగ రోజున, విజయం కోసం వినూత్నంగా ఆలోచించాలని చెప్పే ఓ చిన్ని కథతో నా టపా ప్రారంభిస్తున్నాను.

దీని మూలకథ ఇంటర్ తొలి ఏడాది పిల్లలకి ఆంగ్ల పాఠంలో ఉంది. ఇక కథలోకి!

అనగా అనగా....

ఓ ఊళ్ళో ఓ పేదరైతు ఉండేవాడు. అతడి కొక కూతురు. చక్కని పిల్ల! ఆ ఊళ్ళో ఓ వడ్డీ వ్యపారి కూడా ఉండేవాడు. ఇతడు నడివయస్సు వాడు, అనాకారి. పైగా దుర్భద్ధి గలవాడు.

ఈ పేద రైతు ఎంతగా రెక్కలు ముక్కలు చేసుకున్నా తిండికే చాలీ చాలనట్లు గడిచేది. రైతు భార్యా, కూతురూ కూడా వ్యవసాయంలో సాయం చేసేవాళ్ళు. అయినా పరిస్థితి అంతే!

ఇలా ఉండగా... ఓసారి రైతు భార్యకి బాగా జబ్బు చేసింది. వైద్యం కోసం డబ్బు అవసరం పడి, వడ్డీ వ్యాపారి దగ్గర పదివేల రూపాయలు అప్పు చేసాడు రైతు. భార్యా జబ్బు నయమైంది గానీ, వడ్డీ కొండలా పెరిగి, పదివేలు కాస్తా ఏభైవేలై కూర్చుంది. అప్పు తీర్చగల దారీ తెన్నూ కూడా రైతుకి కాన రాలేదు. ఏం చెయ్యాలో తోచక బెంగ పడసాగాడు.

అప్పటికే... వయస్సులో ఉన్న రైతు కూతురి మీద కన్ను వేసి ఉన్న వడ్డీవ్యాపారి, రైతు మీద బాగా వత్తిడి పెంచాడు. ఓ రోజు రైతు ఇంటికి వచ్చి "అప్పు కడతావా? జైలుకి పంపించమంటావా?" అంటూ పీక మీద కూర్చున్నాడు.

రైతు కాళ్ళావేళ్ళా పడి బ్రతిమాలాడు. వడ్డీ వ్యాపారి "సరే! ఇంతగా బ్రతిమాలుతున్నావు గనుక, నీకు ఓ అవకాశం ఇస్తున్నాను. మనమంతా యేటి గట్టు మీదికి వెళ్దాం. అక్కడ చిన్న చిన్న రాళ్ళు చాలా ఉన్నాయి. నేను, నా చేతి సంచిలో ఒక తెల్ల్రరాయి, ఒక నల్ల రాయి వేస్తాను. నీ కూతుర్ని సంచిలోంచి ఒక రాయి తీయమను.

ఆమె తెల్లరాయి తీసిందో, ఆమె నన్ను పెళ్ళి చేసుకోవాలి. అంతేగాక, నేను నీ బాకీ మాఫీ చేస్తాను. ఆమె నల్లరాయి తీసిందో, ఆమె నన్ను పెళ్ళి చేసుకోనక్కర లేదు. అంతేగాక, నేనే నీకు, నీ బాకీకి రెట్టింపు సొమ్ము, అంటే లక్ష రూపాయలు ఇస్తాను. అసలామె ఈ పందానికే ఒప్పుకోకపోతే, తక్షణం నిన్ను జైలుకి పంపిస్తాను" అన్నాడు.

రైతు, అతడి భార్య కోపంతో పెదవులు కొరుక్కున్నారు. నిస్సహాయతతో గుడ్లనీరు కుక్కుకున్నారు. రైతు కూతురు నివ్వెరపోయి చూస్తోంది. చివరికి, చేసేది లేక, రైతు కుటుంబం ఈ పందానికి ఒప్పుకొంది. ఇదంతా తెలిసి చుట్టు ప్రక్కల వాళ్ళు కొందరు పోగయ్యారు. అందరూ కలిసి యేటి గట్టుకు వెళ్ళారు. అక్కడ గుండ్రని చిన్నచిన్న రాళ్ళు చాలా ఉన్నాయి.

రైతూ, అతడి భార్యా చాలా ఆందోళనతో ఉన్నారు. అందరూ గోలగోలగా మాట్లాడుతున్నారు. వడ్డీ వ్యాపారి క్రిందికి వంగి, రెండు రాళ్ళు తీసి సంచిలో వేసాడు. రైతు కూతురు అందమైనదే కాదు, చురుకైనదీ, తెలివైనదీ కూడా!

ఎవరిగోలలో వాళ్ళుండగా, వడ్డీ వ్యాపారి, రెండు రాళ్ళూ తెల్లటివే తీసి సంచిలో వేయడాన్ని ఆ పిల్ల గమనించింది. (ఈ కుతంత్రం కడుపులో ఉంచుకునే, వడ్డీ వ్యాపారి అంత ధీమాగా పందెం కట్టాడు.)

ఇంతలోనే వడ్డీ వ్యాపారి, సంచి ఆమె చేతికిస్తూ, అందులోంచి ఒక రాయిని తియ్యమన్నాడు. దాంతో అప్పటి వరకూ ఆసక్తిగా పందెం గురించి మాట్లాడుతున్న వారంతా, మాటలాపి కుతుహలంగా చూడసాగారు.

ఇప్పుడా అమ్మాయి ఏం చెయ్యాలి?

మామూలుగా ఆలోచిస్తే... ఆ పిల్ల మూడు రకాలుగా స్పందించవచ్చు.

1]. ఆమె సంచిలోంచి రాయిని తీయటానికి నిరాకరించవచ్చు.
[కానీ అలా చేస్తే, ఆమె తండ్రిని జైలుకు పంపిస్తానని ముందే షరతు విధించాడు వడ్డీ వ్యాపారి. కాబట్టి అది ప్రమాద హేతువు.]

2]. అతడు సంచిలో రెండూ తెల్ల రాళ్ళే వేసాడని అందరికీ చెప్పి, సంచి తెరచి చూపించి, అతడి మోసాన్ని బహిర్గతం చేయవచ్చు.
[కానీ అలా చేస్తే, వడ్డీ వ్యాపారి "అరే! పొరబాటు జరిగింది. నేను ఒకటి తెల్లరాయి, మరోటి నల్ల రాయి అనుకున్నాను. రెండూ తెల్లవే తీసాను కాబోలు. ఈ సారి తెల్లదొకటీ, నల్లదొకటీ వేద్దాం! కావాలంటే మరెవ్వరైనా వెయ్యండి. అప్పుడు ఆమెని సంచిలోంచి రాయి తియ్యమందాం" అంటాడు.

ఆ విధంగా చేసినా తెల్లదో నల్లదో తీయటానికి 50% అవకాశం ఉంటుంది. రైతు కూతురు నల్ల రాయి తీసిందో బ్రతికి పోతుంది. ఖర్మగాలి తెల్ల రాయి తీసిందా, అయిపోతుంది. అదీగాక... ఈసారికి తప్పుని కప్పిపుచ్చుకున్నదే గాక, మోసం బయటపెట్టే ప్రయత్నం చేసినందుకు, వడ్డీ వ్యాపారి మరింత జాగ్రత్త పడతాడు. మరోసారి మరింత పకడ్బందీగా పధకాలు వేస్తాడు. కాబట్టి, అదీ పాక్షికంగా ప్రమాదహేతువే.]

3]. ఎటూ వడ్డీ వ్యాపారి కుతంత్రాలని అరికట్ట లేననుకొని, సంచిలోంచి రాయి తీసేందుకు సిద్ధపడాలి. తప్పకుండా తెల్ల రాయే వస్తుంది కాబట్టి, తండ్రిని జైలు కెళ్ళకుండా కాపాడటం కోసం, తన జీవితాన్ని బలిపెట్టుకునేందుకు సిద్ధపడాలి.

[కానీ ఇలా చేయటం అంటే - తెలిసి తెలిసీ జీవితాన్ని నష్టపోవటమే!]

అయితే... ఇలా సాధారణంగా గాక, అసాధారణంగా, వినూత్నంగా ఆలోచిస్తే...?
ఆమె ఏం చేయవచ్చు?

రైతు కూతురు తెలివైన అమ్మాయి. ఆమె వడ్డీ వ్యాపారి చేతి సంచిలో చెయ్యి పెట్టి, ఒక రాయిని బయటకు తీసింది. గుప్పిలి తెరవబోతూ, కావాలని రాయిని నేల మీదకు జార్చింది. క్షణాల్లో అది నేల మీద పడి ఉన్న బోలెడు రాళ్ళల్లో కలిసి పోయింది.

రైతు కూతురు గాభారా పడుతున్నట్లుగా "అయ్యో! పొరబాటున చెయ్యి జారి, రాయి నేలపై పడిపోయింది?" అంది. అందరూ ‘ఇప్పుడెలాగా?’ అన్నట్లు చూస్తున్నారు. వడ్డీ వ్యాపారి బిత్తర పోయి చూస్తున్నాడు.

రైతు కూతురు అంతలోనే తమాయించుకున్నట్లుగా "సరే, ఏం పోయింది? ఎటూ సంచిలో ఉన్నది రెండు రాళ్ళే కదా? ఇప్పుడు సంచిలో మిగిలి ఉన్న రాయి ఏదో చూస్తే, నేను తీసింది ఏ రాయో తెలిసి పోతుంది కదా?" అంది.

అందరూ అవునన్నారు. ఆమె సంచి తెరచి, అందులోని తెల్ల రాయిని బయటకి తీసి "ఇదిగో, ఇందులో తెల్లరాయి ఉంది. అంటే నేను నల్ల రాయిని తీసానన్న మాట! కాబట్టి ఇప్పుడు నేను ఈ వడ్డీ వ్యాపారిని పెళ్ళి చేసుకోనక్కర్లేదు. అంతేగాక, ఈ వడ్డీ వ్యాపారి మా నాన్నకి లక్ష రూపాయలు ఇవ్వాలి" అంది.

వడ్డీ వ్యాపారి ఏడ్చుకుంటూ, రైతుకి లక్ష రూపాయలు చెల్లించి, మొత్తుకుంటూ ఇంటికి పోయాడు.

రైతు కుటుంబం సంతోషంగా ఇంటికి తిరిగొచ్చింది.

ఇదీ కథ!

ఈ కథలో... రైతుకుటుంబం వంటిదే, ప్రస్తుతం సమాజంలో సామాన్యుడి పరిస్థితి! ఆ దేశం ఈ దేశం అన్న తేడా లేకుండా, ప్రపంచ వ్యాప్తంగా ఇదే స్థితి సామాన్య పౌరులది!

ప్రభుత్వాధికారంలో ఉన్న రాజకీయ నేతలూ, ఉన్నతోద్యోగులూ, కార్పోరేటు బడా వ్యాపారులూ... ఇలా సంపన్నుల జాబితాలోకి చేరే వారిలో అత్యధికులు, కథలోని వడ్డీ వ్యాపారి వంటి వారే!

ఇప్పటి వరకూ వాళ్ళ ‘అతి’తెలివి తేటలు సాగాయి, సాగుతూనే ఉన్నాయి... సామాన్యులు కుదేలయ్యారు, అవుతూనే ఉన్నారు.

కథలోని రైతు కూతురు... సాధారణ ధోరణిలో గాకుండా వినూత్నంగా ఆలోచించింది. వడ్డీ వ్యాపారి లాంటి దొంగని, కన్నంలో అతడి చేయి ఉండగానే, తేలుతో కుట్టించింది. ఇక వాడు కిక్కురు మనలేడు. వాడి మోసాన్ని వాడి మెడకే చుట్టి, పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకుంది.

వాడి దురాశలోనే వాణ్ణి ముంచి, వాడి పాపానికి అంతకంతా కట్టించింది. ప్రస్తుతం సామాన్య ప్రజలకి కావాల్సింది, ఇలాంటి వినూత్న ఆలోచనా విధానమే!

అప్పుడు ఖచ్చితంగా...
మనం మన ధరిత్రిని, మన దేశాన్ని కాపాడుకోగలం.
భారతీయతని కాపాడుకోగలం
మానవీయతని కాపాడుకోగలం
మన జీవితాలని, మన భవిష్యత్తుని కాపాడుకోగలం
మన చిన్ని పాపల చీకూ చింతాలేని బాల్యాన్ని కాపాడుకోగలం!

అలాంటి వినూత్న ఆలోచనా విధానాన్ని, ఆ మహిషాసుర మర్ధని, మనందరికీ అనుగ్రహించాలని కోరుకుంటూ....

అందరికీ విజయ దశమి శుభాకాంక్షల!

ఇక ఈ కథకి అనువర్తన ఏమిటంటే -

లేని లాభాలు ఉన్నాయని చూపిస్తే షేర్ ధరలు పెరుగుతాయి. బయట పడితే సత్యం కంప్యూటర్స్, గుట్టుగా కొనసాగితే... టాటాలు, బిర్లాలు, బజాజ్‌లు, అంబానీలు! అంతో ఇంతో... అన్ని కంపెనీలూ లాభాలను ఎక్కువ చేసి చూపిస్తాయని, సత్యం కంప్యూటర్స్ మోసం బయటకు వచ్చినప్పుడు అందరూ అంగీకరించిందే!

చిల్లపెంకులూ, గులకరాళ్ళతో నిండి ఉన్న బిందెని, బంగారం మణిమాణిక్యాలతో నిండి ఉందని చెప్పినట్లుగా, లేని లాభాలు ఉన్నాయని చెబుతాయి కంపెనీలు. గడువు ముగిసినప్పుడు లేదా దివాళా తీయటం లేదా రహస్య విషయాలు బయటకు రావటం వంటి సంఘటనలు జరిగినప్పుడు వాటాదారులు నష్టపోతారు. మొన్నటి సత్యం కంప్యూటర్స్ మాదిరిగా!

నిజానికి సత్యం కంప్యూటర్స్ చిన్న ఉదాహరణ! పచ్చిగా బయటపడిన ఉదాహరణ! ఇలాంటివి గుట్టుచప్పుడు గాకుండా చాలా జరిగిపోతుంటాయి. లిస్టింగ్‌లో ఉన్న కంపెనీల షేర్లు బుల్‌ల/ఏజంట్ల మాటలు నమ్మి కొన్నాక, ఆనక ట్రేడింగ్‌లో, సదరు కంపెనీలు కనబడవు. కొన్నాళ్ళ తర్వాత చూసుకుంటే, అవెప్పుడో కన్ను మూసిన కంపెనీలని తేలుతుంది. అప్పటికే అవి దివాళా తీసేసి ఉంటాయి. అంబుడ్స్‌మన్‌కి అర్జీ పెట్టుకున్నా, ఏడ్చి మొత్తుకున్నా, నష్టం పూడదు.అమాయక షేర్ హోల్డర్ ఆ విధంగా మోసపోతూ ఉంటాడు.

ఆ విధంగా కాకపోతే... ఒక కంపెనీ దివాళా తీసినప్పుడో, ఆర్దిక మాంద్యాలు సంభవించినపుడో, హర్షద్ మోహతాలు, కేతన్ ఫరేఖ్‌లు బయటపడ్డప్పుడో చాలా కంపెనీలు దివాళా తీసినప్పుడో... బిందెనిండా చిల్ల పెంకులున్నాయని వాటాదారులకి అర్ధమౌతుంది. కాబట్టి కూడా... ‘పొదుపు చేయాలనుకునే వాళ్ళు షేర్లల్లో మదుపు చేయటం కంటే ఇతర మార్గాల్లో అంటే మ్యూచువల్ ఫండ్స్, భీమా సంస్థలలో పెట్టుబడి పెట్టుకోవటం మంచిదనీ...’ ‘షేర్లు కొనటం, స్వల్ప వ్యవధిలోనే అమ్మటం వంటి వ్యాపార ధోరణి ఉన్న వాళ్ళు, షేర్ల క్రయవిక్రయాలకు దిగటం మంచిదనీ’ ఇటీవల ప్రచారంలోకి వచ్చింది.

అదీ ఆర్ధిక మాంద్యం నేపధ్యంలో ఊపందుకున్న ప్రచారాల్లో ఒకటి. రెండు దశాబ్దాల క్రితమైతే, తెలివైన పెట్టుబడి షేర్లలో పెట్టటం అనే ప్రచారం ఉండింది. ఇందుకు దారితీసిన పరిస్థితులు గురించి తర్వాతి టపాలో వివరిస్తాను.

"లేని లాభాలు ఉన్నాయని చూపిస్తే వాళ్లకి ఏం లాభం? వాటాదారులకి (share holders) లాభాలు పంచడం అంటే నష్టపోవటమే కదా? కంపెనీలు ఎందుకలా చేస్తాయి?" - అనిపిస్తుంది సామాన్యులకి! కాబట్టి అది నిజమని నమ్మబుద్దికాదు. ఎందుకంటే - దీని వెనుక ఉండే కారణం అత్యంత బలమైనది; అది బయటకు రానిది కూడా కాబట్టి!

అంతే కాదు, చిల్ల పెంకులు నింపిన బిందెని, బంగారం మణిమాణిక్యాలని చెప్పి అమ్మినట్లుగా, కంపెనీలన్నీ, "అసలేమీ లేకుండానే లక్షల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నాయా?" అనుకుంటాం కూడా! చేస్తాయి? "ఎందుకు, ఎలా చేస్తాయి?" అంటే... వివరంగా చెబుతాను.

జాతీయ బ్యాంకుల బ్రాంచీలు అన్ని ఊళ్ళల్లో ఉంటాయి. ఆ బ్రాంచీల మేనేజర్లు, తమ వినియోగదారుల నుండి డిపాజిట్లు సమీకరించటం, ఖాతాదారులని ప్రోత్సహించటం, అర్హులకి అప్పులివ్వడం చేస్తుంటారు. ఖాతా ప్రారంభించాలని గానీ, ఋణం కావాలని గానీ, బ్యాంకుకు వచ్చేవారి గురించి అవగాహనతో ఉంటారు.

అందుకోసం కూడా... ఖాతాదారులతో, స్థానిక ప్రముఖులతో, ఇతరులతో, సత్సంబంధాలు కొనసాగిస్తారు. ఖాతా ప్రారంభించేందుకు కూడా, బ్యాంకు సిబ్బందికి తెలిసిన మరో ఖాతాదారు సిఫార్సు చేయాలన్న నియమం ఉంటుంది. ఎందుకంటే - వ్యక్తుల గుణగణాలు తెలిస్తేనే, ఆర్ధిక వ్యవహారాలు నడపటం భద్రంగా ఉంటుంది. మొత్తంగా ఖాతాదారులతో, బ్యాంకు మేనేజరుకు ఉండే వ్యక్తిగత సదభిప్రాయం, ఇక్కడ ముఖ్యమైనది.

అలాగే, అప్పు అడిగిన వారి గురించి కూడా బ్యాంకు మేనేజరు, క్షేత్రాధికారి (field officer)... ఇద్దరి వ్యక్తిగత అభిప్రాయం పరిగణనలోకి తీసుకోబడుతుంది. అదే సమయంలో, ఋణార్ది అడిగిన అప్పు మొత్తాన్ని బట్టి, బ్యాంకు మేనేజరు చర్య ఉంటుంది.

ఉదాహరణకి, ఒకే బ్యాంకుకు చెందిన ఒక బ్రాంచి మేనేజరు, ఏభైవేల వరకూ అప్పు మంజూరు చేయగల అధికారం కలిగి ఉంటే, మరో బ్రాంచి మేనేజరు, రెండు లక్షల వరకూ అప్పుని మంజూరు చేయగల అధికారం కలిగి ఉంటారు. దీనిని ‘బ్రాంచి లిమిట్’ అంటారు. అది దాటితే ఋణార్ది ఫైలు పైఆఫీసుకి (అంటే మెయిన్ బ్రాంచి, జోనల్ ఆఫీసు ఇలాగన్న మాట) పంపబడుతుంది.

ఈ విధంగా ఒకో బ్రాంచికి, మేనేజరుకి, ఒక లిమిట్ ఉంటుంది. అయితే, ఈ లిమిట్, సదరు బ్రాంచి మేనేజరు సమీకరించగల డిపాజిట్ల మొత్తం మీద ఆధారపడి ఉంటుంది. ఎక్కువ డిపాజిట్లు సేకరించగలిగిన మేనేజరుకి, బ్రాంచికి, ఎక్కువ ‘లిమిట్’ ఉంటుంది. అంటే బ్యాంకు చేసిన వ్యాపార పరిధి (క్రెడిట్ డెబిట్ రేషియో మాదిరిగా)ని బట్టి, లిమిట్ నిర్ధారింపబడుతుంది.

అది ఆయా మేనేజర్లకు వ్యక్తిగత పరపతి (అంటే కెరీర్ రికార్డు) పెంచుతుంది. పదోన్నతి సమయాల్లో ఇదీ పరిగణించ బడుతుంది. బదిలీ, పదోన్నతి, డిపార్టుమెంటులో అంతర్గత పరీక్షలు... ఇలాంటి అన్ని విషయాల్లో ఈ ‘డిపాజిట్ల సేకరణ, దాని మీద ఆధారపడిన బ్రాంచి లిమిట్’ యొక్క ప్రమేయం ఉంటుంది.

అందుకోసం... బ్రాంచి మేనేజర్లు, తమ బ్రాంచి పరిసర ప్రాంతాల్లో నివసించే వారితో, వ్యాపారం చేసే వారితో, చక్కని సంబంధాలు పెంచుకుంటారు. ‘దీనికీ, షేర్ మార్కెటుకీ సంబంధం ఏమిటీ?’ అనుకోకండి. ఆ సంబంధం అర్ధం చేసుకునేందుకే ఇదంతా చెబుతున్నాను. మరికొంత వివరించే ముందు, ఇక్కడ మరో విషయం కూడా పరిశీలించాలి.

సాధారణంగా... స్థలం లేదా ఇళ్ళు వంటి స్థిరాస్తుల క్రమవిక్రయాలు జరిగినప్పుడు, రిజిస్ట్రేషన్ చేయిస్తాం. అందుకోసం స్టాంపు డ్యూటి పేరిట పన్ను చెల్లిస్తాం. అప్పుడు, రిజిస్ట్రార్ ఎంత పన్ను కట్టాలో లెక్కలు వేసి చెపుతాడు. ఒక ఇల్లు లేదా ఖాళీ స్థలం యొక్క విక్రయాన్ని రిజిస్టర్ చేయమన్నప్పుడు, సదరు ప్రాంతంలో మార్కెట్ రేటుని గానీ లేదా ప్రభుత్వ రికార్డుల్లో నమోదై ఉన్న రేటుని గానీ... రెండింటిలో ఏది ఎక్కువో దాన్ని బట్టి, పన్ను శాతాన్ని లెక్కిస్తారు.

అంటే - ఓ వందగజాల చోటుని, గజం వందరూపాయలు పెట్టి, మొత్తం పదివేలకు రిజిస్టరు చేయమని అడిగామనుకొండి. ‘ఆ ప్రాంతంలో గజం వెయ్యి వరకు పలుకుతుందన్న’ మాట ఉందనుకొండి. దీన్ని మార్కెట్ వాల్యూ అంటారు. అప్పుడు మనం, 100x1000=లక్ష రూపాయలకు స్టాంపు డ్యూటీ కట్టాల్సి ఉంటుంది.

అయితే, అదే సమయంలో... మన కంటే ముందుగా జరిగిన క్రయ విక్రయాలలో, గజం అయిదు వందలకి రిజిస్టర్ చేయబడిందనుకొండి. దీన్ని బుక్ వ్యాల్యూ అంటారు. అప్పుడూ, రెండింటిలో గజానికి వెయ్యి రూపాయిలే ఎక్కువ గనుక, మార్కెట్ రేటు ప్రకారమే పన్నుకట్టాల్సి వస్తుంది.

మన ఖర్మకాలి, ఏ ధనిక వ్యక్తయినా, తెల్ల డబ్బుని నల్లడబ్బుగా మార్చుకునేందుకో లేక, నల్ల డబ్బుని తెల్లగా మార్చుకునేందుకో, మరొకందుకో, గజం రెండు వేల రూపాయల చొప్పున రిజిస్టర్ చేయించుకున్నాడనుకొండి. నిజానికి, గజం ఏ రెండు వందలో పెట్టి కొన్నా సరే, అతడి కారణాల రీత్యా, సదరు ధనిక వ్యక్తి, ఎక్కువకి పన్ను కట్టాడనుకోండి.

[ఋణాలకు హామీగా ఇవ్వదలుచుకున్న స్థలాలను, ఇలా ఎక్కువ ధర చూపి రిజిస్టర్ చేసి, లక్ష ఖరీదు చెందని భూమిని తనఖా పెట్టి, పది లక్షల లోన్ పొందవచ్చు. కాకపోతే... బ్యాంకు మేనేజరునీ, ఫీల్డ్ ఆఫీసరునీ, న్యాయసలహా ఇచ్చే నోటరినీ, న్యాయ సలహాదారునీ, ఇంకా కొందరు ఇతర అధికారులనీ ఒప్పించుకోవలసి వస్తుంది. డబ్బు ఎటూ ఒప్పిస్తుంది కదా! ఇలాంటి కాగితపు మోసాలు చాలానే నడుస్తుంటాయి.]

అప్పుడు మనమూ... గజానికి రెండు వేల చొప్పున స్టాంపు డ్యూటి కట్టాల్సి వస్తుంది. ఇలాంటి సందర్భాలలోనే... రిజిస్ట్రార్ కీ, ఆ కార్యాలయ సిబ్బందికీ లంచాల పంట పండుతుంది. ఏ ధరకు స్టాంపు డ్యూటి కట్టాలో నిర్ణయించే క్రమంలో లంచాలకు భారీ అవకాశాలు పుడతాయి మరి!

ఈ రెండు పరిస్థితులూ (అంటే బ్యాంకు మేనేజరు బ్రాంచి లిమిట్, మార్కెట్ వాల్యూ Vs బుక్ వాల్యూలలో ఏది ఎక్కువైతే దాని ప్రకారం రిజిస్ట్రేషన్) షేర్ మార్కెట్ లో ప్రభావం కలిగి ఉంటాయి.

ఎలాగంటే...

ఉదాహరణకి ‘జగన్మాయ ప్రైవేటు లిమిటెడ్’ అనే కంపెనీ ఉందనుకొండి. అందులో పరిమిత సంఖ్యలో భాగస్వాములుంటారు. కంపెనీ వారందరి ఉమ్మడి అస్తి అవుతుంది. అయితే అది వారి వ్యక్తిగత ఆస్తి కూడా!

ఇప్పుడు సదరు జగన్మాయ కంపెనీ... తన ఉత్పత్తి సామర్ధ్యాన్ని వ్యాపార పరిధిని విస్తరించ దలిచిందనుకొండి. అందుకు భారీ స్థాయిలో పెట్టుబడి అవసరమైంది. భాగస్వాములు స్వంత నిధులు సమకూర్చినా చాలవు. బ్యాంకులలో ఋణాలు పొందినా సరిపోదు. అప్పుడు ప్రైవేటు లిమిటెడ్ కంపెనీని పబ్లిక్ లిమిటెడ్ చేయబూనుతారు.

అప్పటికే కంపెనీ, సమాజంలో కొంత మంచి పేరుని సంపాదించిదనుకొండి. కంపెనీ వ్యాపార సామర్ధ్యం మీద నమ్మకం ఉంటుంది. దాంతో మార్కెట్‌లో దానికి కొంత పరపతి ఉంటుంది. ‘ఫలానా వ్యక్తి మంచివాడు, నిజాయితీ పరుడు, మాట ఇస్తే తప్పని వాడు...’ ఇలా పదిమందిలో నమ్మకం కలిగించుకున్న వ్యక్తి ఉన్నాడనుకొండి. అలాంటి వ్యక్తికి అవసరమై ఎవరినైనా అప్పు అడిగితే ఇస్తారు. అది ఆ వ్యక్తికి ఉన్న పరపతిగా చెప్పవచ్చు. (ఇక్కడ ఆర్దిక శాస్త్రం చెప్పే పరపతి నిర్వచనం నాకు తెలియదు. సామాన్యుల పరిభాషలోని పరపతి గురించి మాత్రమే నేను ఉటంకించాను.)

అదే విధమైన మంచి పేరు, నమ్మకం, పరపతి... సదరు జగన్మాయ కంపెనికి సమాజంలో ఉందనుకొండి. అప్పుడు, కంపెనీ పబ్లిక్ ఇష్యూకి వెళ్ళి, ప్రజల నుండి పెట్టుబడి సొమ్ము సేకరిస్తుంది. అందుకోసం ప్రభుత్వ నిబంధలనీ, లాంఛనాలనీ పూర్తి చేస్తుంది. (నిజానికి ఈ ప్రక్రియ కూడా, మనకి, పాశ్చాత్య దేశాల నుండి సంక్రమించిందే లెండి.)

తమకి అవసరమైన మొత్తాన్ని, పది రూపాయల ముఖ విలువ గల షేర్లుగా విభజించి, తదనుగుణమైన సంఖ్యలో, షేర్లను అమ్మకానికి పెడుతుంది. మాట వరసకి.... ఓ కోటి షేర్లు అమ్మకానికి పెట్టిందంటే అర్ధం, పది కోట్ల రూపాయల పెట్టుబడిని ఉద్దేశించిందని.

నిబంధనల ప్రకారం, ఆ కోటి షేర్లలో కొన్నిటిని, అప్పటి వరకూ భాగస్వామ్యులైన పరిమిత వ్యక్తులకీ, కొన్నిటిని సదరు కంపెనీలో పని చేసే ఉద్యోగ కార్మిక సిబ్బందికి కేటాయించి, మిగిలిన వాటిని విక్రయించవలసి ఉంటుంది.

కంపెనీ వ్యాపార సామర్ధ్యం మీద నమ్మకంతో సదరు షేర్లను కొనుగోలు చేసిన వారంతా ఆ కంపెనీలో వాటాదారులౌతారు. ఆ కంపెనీ ప్రైవేటు లిమిటెడ్ గా ఉన్నప్పటి పరిమిత భాగస్వాములు, ఉద్యోగ కార్మిక సిబ్బంది ప్రతినిధులు, కంపెనీ మండలిలో సభ్యులౌతారు. అదే విధంగా, షేర్ హోల్డర్ల తరుపున కూడా, ప్రతినిధులు, మండలిలో ఉంటారు.

అప్పటికే కంపెనీ, తన వ్యాపార సామర్ధ్యాన్ని, కంపెనీకి రానున్న బంగారు భవిష్యత్తునీ, తమ సానుకూలాంశాలని ప్రచారించుకుని కూడా, ప్రజలని తమ షేర్లు కొనేటట్లుగా ఆకర్షిస్తుంది. బ్యాంకు, ఇతర అధికారిక సంస్థల ద్వారా, మొదట షేర్లు విక్రయం చేస్తారు. తర్వాత ట్రేడింగ్, షేర్ మార్కెట్ అధికారిక భవనాలలో జరుగుతుంది.

ఆ ఫ్లోర్ మీదికి, గుర్తింపు పొందిన షేర్ మార్కెట్ ఏజంట్లు వెళ్ళి క్రయ విక్రయాలు జరపగల అధికారం కలిగి ఉంటారు. అందుకు దరఖాస్తు చేసుకుని, గుర్తింపు పొందుతారు. ఇంకా బోలెడు ఫార్మాలిటీస్ [లాంభనాలన్నీ] అన్నీ, ఫార్మల్ గా కాగితాల మీద సజావుగా నడిచి పోతాయి.

ఇక ఇప్పుడు ‘అసలు లోపలి కథ’ ఉంటుంది. షేర్ల విక్రయం ద్వారా సమీకరించిన సొమ్ముతో, కంపెనీ తనకు ఇది వరకే ఖాతాలున్న బ్యాంకులతో లావాదేవీలు జరుపుతుంది.

ఆర్దిక లావాదేవీలన్నీ బ్యాంకు ఖాతా ద్వారానే నిర్వహించాలి కాబట్టి కూడా, ఇది తప్పని సరి!

కంపెనీ వ్యాపార వ్యవహారాలు కొనసాగుతుండగా, మరో వైపు దాని షేర్ ల క్రయవిక్రయాలు మార్కెట్ లో కొనసాగుతుంటాయి. షేర్ ముఖ విలువ ‘పది రూపాయలు’ కాస్తా కంపెనీ వ్యాపార విస్తరణ, లాభనష్టాల అంచనా, ప్రజలలో షేర్ పలుకుబడిలని బట్టి, మార్పు చేర్పులకు గురౌతుంది. సాధారణంగా, పదిరూపాయల ముఖ విలువ, పెరుగుతుంది.

కంపెనీ మూడు నెలలకి, ఆరునెలలకి... ఇలా నిర్ణీత కాల వ్యవధిలకి, తన లెక్కాపత్రాలని, లాభనష్టాలని, షేర్ హోల్డర్స్ అందరికీ బాహాటంగా ప్రకటిస్తుంది. దానిని బట్టి, షేర్ ధర పెరగటం లేదా తరగటం, జరుగుతుంటుంది.

ఇక ఈ షేర్ ధరలని బట్టి, కంపెనీకి బ్యాంకులో లావాదేవీల లిమిట్ పెరుగుతుంది. అంటే - షేర్ ధర ఎక్కువ పలికి నప్పుడు కంపెనీకి బ్యాంకులో వాడుకోదగిన సొమ్ము లిమిట్ కూడా ఎక్కువ ఉంటుంది. ఓ రకంగా... అది బ్యాంకుకీ, కంపెనీకి మధ్య భరోసా మీద ఆధారపడి ఉంటుందనాలి. అయితే, ఇది బ్యాంకు దృష్ట్యా చూస్తే, భద్రతా కారణాల రీత్యా, స్వల్పకాల పరిమితికి లోబడి ఉంటుంది.

అంటే - కంపెనీ షేరు ధర వంద రూపాయలు ఉందనుకొండి. ఉదాహరణకి కంపెనీకీ, బ్యాంకుకీ మధ్య లక్ష షేర్ల భరోసా ఉందనుకొండి. కంపెనీ వంద లక్షలు (అంటే కోటి రూపాయల) భరోసా నుండి, 80% లేదా 75% (అది ఆయా కంపెనీకి బ్యాంకుకీ మధ్య అంగీకారమై ఉంటుంది.) వరకూ, కంపెనీ వాడుకునే స్వేచ్ఛ కలిగి ఉంటుంది. బ్యాంకు మేనేజర్ కి ఉండే బ్రాంచి లిమిట్ లాగా, అదే దాని లిమిట్ అన్నమాట.

అంతలో... దబ్బున షేర్ ధర పడిపోయి, 50 రూపాయలైందనుకొండి. అప్పుడు కంపెనీ లిమిట్, అర్ధ కోటిలో, 80% లేదా 75% అయిపోతుంది. అయితే... అదైనా ఇదైనా... పక్షం రోజులు లేదా వారం రోజులు... ఇలా, నిర్ణీత స్వల్ప కాల పరిమితికి లోబడి ఉంటుంది. ఎందుకంటే - షేర్ ధర పడిపోయినా, పెరిగినా, అది మళ్ళీ మార్పు చేర్పులకి గురౌతుంది గనక!

అయితే, ఏకబిగిన ధర పడిపోతూనే ఉందనుకొండి. అప్పుడొస్తుంది కంత! ఇక్కడే, స్థలం రిజిస్ట్రేషన్ సమయంలో ప్రస్తావన కొచ్చే, మార్కెట్ వాల్యూ Vs బుక్ వాల్యూ వంటి ప్రక్రియ, తెర మీదకి వస్తుంది.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

షేర్ మార్కెట్ వ్యాపార విస్తరణ గురించి చెప్పేముందు, ఓ చిన్న కథ చెబుతాను.

అనగా అనగా...

సుధనా పురం పేరుకు తగ్గట్లుగా ధనవంతులున్న ఊరు. పేద్దది కాకపోయినా ఓ మోస్తరు పట్టణమే! ఆ వూళ్ళో అన్ని వృత్తుల వాళ్ళు ఉన్నారు. రకరకాల దుకాణాలు, వివిధ రకాల వ్యాపారులూ ఉన్నారు. చుట్టుప్రక్కల చాలా పల్లెలకూ అది కూడలి కావటంతో, ప్రతిరోజూ ఆ ఊరికి వచ్చిపోయే వాళ్ళకీ కొదవలేదు.

ఇలా ఉండగా... ఓసారి ఆ ఊరికి కనకయ్య అనే నడివయస్సు వ్యక్తి, కుటుంబంతో సహా వచ్చాడు. రావటం రావటమే ఊళ్ళో పెద్ద బజారులో ఓ భవనం కొన్నాడు. పట్టు వస్త్రాల దుకాణం తెరిచాడు. మనుష్యుల్ని పెట్టి ఊరంతా ‘టాం టాం’ గా తన వస్త్ర వ్యాపారం గురించి ప్రచారం చేయించాడు.

అది ఆ ఊరికి కొత్త కావటంతో, సహజంగానే, కనకయ్య పేరు ఒక్కసారిగా ఊళ్ళో మారుమోగిపోయింది. త్వరలోనే అతడి వ్యాపారం మూడుపువ్వులు ఆరుకాయలుగా ఉందనే మాట ఊరంతా పాకిపోయింది. క్రమంగా ఊళ్ళో ఇంకొన్ని స్థలాలు, తోటలూ కొన్నాడు.

క్రమంగా అతడు వడ్డీ వ్యాపారం కూడా ప్రారంభించాడు. ఏది చేసినా... ‘కనకయ్య నిజాయితీగా వ్యాపారం చేస్తాడనే’ పేరు తెచ్చుకున్నాడు. ‘అవసరానికి అప్పుకి వచ్చారు కదా!’ అని ఎక్కువ వడ్డీ గుంజే వాడు కాదు. అప్పుడప్పుడూ పేద సాదలకి దాన ధర్మాలు కూడా చేసేవాడు.

ఇలా ఉండగా... ఓ రోజు కనకయ్య, పట్టణాధికారి దగ్గరికి వెళ్ళి "అయ్యా! రాత్రి నాకు ఓ కల వచ్చింది. ఆ కలలో దేవుడు కన్పించి ‘కనకయ్యా! ఇటీవల నీవు కొన్న జామ తోటలో ఈశాన్య మూల తవ్వు. అక్కడ నీకు ఓ స్వర్ణ కలశం దొరుకుతుంది. దాన్నిండా బంగారు నాణాలు, మణిమాణిక్యాలూ ఉన్నాయి. అయితే... అది తవ్వితీసిన నాటి నుండి ఐదేళ్ళపాటు దాన్ని తెరవకూడదు.

సరిగ్గా ఐదేళ్ళ తర్వాత దాన్ని తెరిచి, అందులో పదోవంతు, పేదలకి అన్నసంతర్పణ చెయ్యి. మిగిలింది నువ్వు తీసుకో! నీ నిజాయితీ వ్యాపారానికి మెచ్చి, ఆ బిందెని నీకనుగ్రహిస్తున్నాను. అయితే ఓ షరతు! ఆ బిందెని నీవు ఊరు దాటించకూడదు. ఊరందరి సమక్షంలోనే దాన్ని తవ్వించాలి. అప్పుడు ఊరులోని అందరు కూడా నా అనుగ్రహం కోసం నీలా నిజాయితీగా ఉండటానికి ప్రయత్నిస్తారు’ అని చెప్పాడు. పదిమంది పెద్దల సమక్షంలో అక్కడ పూజాదికాలు నిర్వహించి, ఆపైన తవ్వకం చేపట్టాలని నా సంకల్పం. అందుచేత మీ దగ్గరికి వచ్చాను" అన్నాడు.

అది విని పట్టణాధికారి ఆశ్చర్యపోయాడు. సరే కానిమ్మని పురోహితుణ్ణి పిలిచి పూజకి ముహుర్తం పెట్టించారు. ఆ వార్త ఆ నోటా ఈ నోటా పాకింది. ముహుర్తం రోజున సగం ఊరక్కడే పోగయ్యింది.

శాస్త్రోక్తంగా పూజ నిర్వహించి తవ్వటం ప్రారంభించారు. చెప్పుకోదగినంత లోతు తవ్వాక ఓ బిందె దొరికింది. మట్టి తుడిచి శుభ్రం చేసి చూస్తే, అది తళతళాలడుతున్న సువర్ణ కలశం! పోతపోసిన మూతతో ఉన్న ఆ బిందె చాలా బరువుగా కూడా ఉంది.

అందరూ ఆశ్చర్యంతోనే కనకయ్యని అభినందించారు. కనకయ్య బిందెనింటికి తీసుకుపోయాడు. అది మొదలు కనకయ్య వ్యాపారం మరింత అభివృద్ది చెందసాగింది. ఆ విషయం కనకయ్యే స్వయంగా ప్రకటించుకున్నాడు.

ఇలా సంవత్సర కాలం గడిచింది. అంతలో కనకయ్యకి దూరాన ఉన్న స్వంత ఊరు నుండి కబురొచ్చింది. స్వంత ఊళ్ళో తల్లిదండ్రులూ, అత్తమామలూ... వృద్దులైన కారణంగా అనారోగ్యంతో ఉన్నారనీ, చివరిరోజులలో కనకయ్య కుటుంబసమేతంగా తమ వద్దే ఉండాలని కోరుతున్నారనీ!

దాంతో కనకయ్య... తన ఇల్లూ, పొలాలూ, తోటలూ, వ్యాపార దుకాణాలని అమ్మడానికి పెట్టాడు. బాగా నడుస్తున్న వ్యాపారం కాబట్టి మంచిధర పలికింది. మొత్తం ఆస్తంతా అమ్మి రొక్కంగా మార్చుకున్నాడు. ఇక మిగిలింది... భూమిలో దొరికిన బంగారు లంకె బిందె!

భగవంతుడు విధించిన నియమం ప్రకారం దాన్ని ఊరు దాటించకూడదు. ఆ విషయమై పట్టణాధికారిని సలహా అడిగాడు కనకయ్య. పట్టణాధికారి పదిమంది పెద్దలతో సదస్సు పెట్టి, విషయాన్ని చర్చించాడు. అందరూ కలిసి "కనకయ్యా! బిందెని తగిన ధరకు అమ్మి, అందులో పదోవంతుతో పేదలకి అన్న సంతర్పణ చేసి, మిగిలింది నువ్వు తీసికెళ్ళు. గడువు రోజున కలశాన్ని కొనుక్కున్న వ్యక్తి, దాన్ని తెరిచి ఆ సంపదని ఉపయోగించుకుంటాడు" అని తీర్మానించారు. కృతజ్ఞతలు చెబుతూ కనకయ్య వారికి మంచి బహుమతులిచ్చాడు.

ఆ ప్రకారం కనకయ్య బిందెని అమ్మకానికి పెట్టాడు. అప్పటికే ‘అందులో చాలా బంగారు నాణాలు, విలువైన మణిమాణిక్యాలు ఉన్నాయనీ, సాక్షాత్తూ దేవుడు కలలో కనబడి ఎక్కడుందో చెప్పటంతోనే అది లభించిందనీ, అది ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకి అదృష్టం కలిసి వస్తుందనీ, ఆ బిందె లభించిన తర్వాతే కనకయ్య వ్యాపారం మరింత లాభాలతో నడిచిందని’ ప్రచారాలు ఉండటంతో... చాలామంది దాన్ని కొనడానికి పోటీపడ్డారు. దాంతో వేలంపాట నిర్వహించవలసి వచ్చింది.

ఉళ్ళోని మరో ఐశ్వర్యవంతుడు దాన్ని లక్షవరహాలకు కొన్నాడు. కనకయ్య అందులో పదివేల వరహాలు పెట్టి అన్న సంతర్పణ చేసి, మిగతా సొమ్ము మూటగట్టుకొని కుటుంబంతో సహా స్వంత ఊరుకు తరలిపోయాడు. వెళ్ళేముందు పట్టణాధికారికి, సదస్సులోని పెద్దలకి మరోసారి భారీగా కానుకలు ఇచ్చాడు. అన్నిరకాలుగా అందరికి లాభంగా అన్పించింది కాబట్టి, అందరూ సంతోషంగా కనకయ్యకి దగ్గరుండి వీడ్కోలు చెప్పారు.

కొన్ని రోజులు గడిచాయి. బంగారు బిందె కొన్న భాగ్యవంతుడికి, ఒక్కసారిగా లక్ష వరహాలు ఏకమొత్తంగా మదుపు పెట్టడంతో చేతిలో డబ్బు ఆడక వచ్చింది. దాంతో అతడూ దాన్ని అమ్మకానికి పెట్టాడు. మరొకరు కొన్నారు. మరేవో కారణాలతో అతడూ దాన్ని అమ్మేశాడు. అలా బంగారు బిందె క్రమంగా చేతులు మార జొచ్చింది.

‘అది ఎవరి దగ్గరుంటే వారికి అదృష్టం కలిసి వస్తుందన్నారు కదా! మరి ఎందుకు చేతులు మారుతోంది!?’ అని ఎవరికీ సందేహం రాలేదు. ఎందుకంటే అమ్ముకునే ప్రతివారికి అమ్మేటప్పుడు ఏదో ఒక కారణం ఉంటూ వచ్చింది.

అలా అలా... వ్యక్తుల చేతులు మారి, క్రమంగా ఒక్కరే కొనటం సాధ్యం గాక పోవటంతో, పదిమంది కలిసి సమిష్టంగా కొనటం, అమ్మటం కొనసాగింది. ఐదేళ్ళు గడిచాయి.

ఈ లోపున పట్టణాధికారి పదోన్నతి రావటంతో రాజధానికి వెళ్ళిపోయాడు. అతడి స్థానంలోకి కొత్త అధికారి వచ్చాడు. అప్పుట్లో కనకయ్యకి కలశం అమ్ముకొమ్మని సలహా ఇచ్చిన పదిమంది పెద్దల సదస్సులో కూడా, సభ్యులు మారిపోయారు. కొందరు మరణించారు. కొందరు దేశాంతరాలు పోయారు. వెరసి ఇప్పుడందులో అందరూ కొత్తవారే ఉన్నారు.

కలశం తెరిచే గడువు రోజు నాటికి, దాన్ని అయిదు వందల మంది సాధారణ ప్రజలు, ఒక సమూహంగా ఏర్పడి, సమిష్టిగా కొని ఉన్నారు. వాళ్ళంతా తమకున్నంతలో సాదాసీదాగా బ్రతుకు గడుపుతూ, పొదుపుచేసిన సొమ్ము తలా కొంత వాటాలుగా వేసుకొని, సువర్ణ కలశాన్ని కొన్నవారు.

ఎంతో ఆశగా... గడువురోజున, కలశానికి పుజాదికాలు నిర్వహించి, పట్టణాధికారి, పెద్దల సదస్సు సమక్షంలో, సీలు పగల కొట్టి కలశాన్ని తెరిచారు.

చూస్తే ఏముంది?

దాన్నిండా బరువుగా ఉండే చిల్లపెంకులూ, గులకరాళ్ళూ ఉన్నాయి.

పాపం! కలశ ప్రస్తుత యజమానులు గుండెలు బాదుకుని బావురుమన్నారు.

పట్టణాధికారి "నేను కొత్త వాణ్ణి! గతంలో ఏం జరిగిందో నాకు తెలియదు, నా బాధ్యతా లేదు" అన్నాడు. అదే మాట పెద్దల సదస్సుదీ! కనకయ్యే ఇలా చేసాడా? లేక చేతులు మారినప్పుడు ఎవరయిన ఇలా చేసారా? దానాదీనా ‘విత్తు ముందా? చెట్టు ముందా?’ అన్న ద్వంద్వం తయారయ్యింది.

వెరసి... పనికిమాలిన చిల్లపెంకులను, గులక రాళ్ళనూ ఎంతో వెలపోసి కొన్నట్లయ్యింది. మొదట అందరూ లాభ పడ్డారు. చివరకి, గడువు ముగియటం అనే అంతిమ సంఘటన నాటికి, దానిలో ఎవరయితే వాటాదారులో... వాళ్ళే నష్ట పోయారు! అంతే కాదు, ఐదేళ్ళుగా ఎందరి చేతులో మారిన సువర్ణకలశం మీద, ఎన్నో క్రయవిక్రయాలతో, ఎంత వ్యాపారం జరిగిందో లెక్కలు వేస్తే... అప్పటికి యాభైలక్షల వరహాలని తేలింది.

వెరసి... ఏమీ లేని దాని మీద యాభై లక్షల వరహాల వ్యాపారం జరిగిందన్న మాట!

అందులో విశేషం ఏమిటంటే - మొత్తం యాభై లక్షల వరహాల వ్యాపారంలో... ఒక్క వరహా ఖరీదయ్యే ముడి సరకూ వాడ బడలేదు, ఒక్క వరహా ఖరీదయ్యే వస్తూత్పత్తీ జరగలేదు. ఇక ఉపాధికి బాటలు వేయటం కలలో మాటే!

ఇదీ కథ!

ఇక ఈ కథకి అనువర్తన ఏమిటంటే -

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

వార్తాపత్రికలు జిల్లాల సంచికలతో ‘విభజించి వార్తలు ప్రచారించటం’ ప్రారంభించాక, అన్ని వార్తలూ అందరికీ తెలియటం అరుదై పోయింది కదా! అందుచేత, మూడు రోజుల క్రితం... ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి పత్రికల కర్నూలు జిల్లా ఎడిషన్లలో ప్రచురితమైన ఒక వార్తాంశం, చాలామందికి తెలియక పోవచ్చు.

అందులో ఏదో లొసుగుంది. అసత్యమో, అసహజమో అయిన లొసుగు! ఓసారి క్రింది వార్తాంశం పరిశీలించండి.


చదవగానే జుగుప్సా, ఆవేశాలతో మనశ్శరీరాలు సెగలూ, పొగలూ అయ్యాయి. తర్వాత ఫాలోఅప్ వార్తల కోసం వేచి చూశాను. ఎక్కడా ఏ చప్పుడూ లేక పోవటంతో ఆశ్చర్యం వేసింది.

ఇక్కడ.... నాకు, అసత్యమో, అసహజమో అయినదేదో ఉందని ఎందుకు అనిపించిందంటే -

పట్టపగలు, జనసమ్మర్ధం ఉన్న బస్టాండుకు ఎదురుగా సత్రంలో, ఎందరో జనం గుడ్లప్పగించి చూస్తుండగా... మద్యం మత్తెక్కినా, కామపు కొవ్వెక్కినా... మనిషన్న వాడు బహిరంగంగా కామక్రియ జరపగలడా?

అలా చేస్తుంటే గుంపుగా ఉన్న జనం చూస్తూ ఊరుకుంటారా? (స్త్రీలు భయందోళలకి లోనయ్యారని విలేకర్లు వ్రాసారు.)

అధికార, ప్రతిపక్ష రాజకీయ నాయకులు దీని మీద ఉలుకూ, పలుకూ లేకుండా ఎలా ఉన్నారు?

ఎంతగా మిడ్‌నైట్ మసాలాలు, సినిమాల్లో రేప్‌సీన్లూ చూసి సున్నితత్వం కోల్పోయారన్నా, కళ్ళెదుట... వికలాంగురాలైన స్త్రీ మీద, అందునా ఆమె కాళ్ళావేళ్ళా పడి బ్రతిమాలుతున్నా... కామాంధుడు అత్యాచారానికి పాల్పడితే, జనం చూస్తూ నిల్చుంటారా? ఎవరో అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేయటంతో పోలీసులు వచ్చి బాధితురాలిని వైద్య పరీక్షలు చేయించేందుకు ఆసుపత్రికి తీసుకుపోయి ఆనక కేసు నమోదు చేశారట.

పోలీసులొచ్చేలోగానే, సదరు కాముకుడు (ఇతడి పేరు గొపాల్ అని వార్తాంశపు తొలి వాక్యంలోనే వ్రాయబడింది.) తీరిగ్గా పని కానిచ్చుకొని పారిపోయాడు. ఇంత జరుగుతుంటే - నిజంగా ప్రజలు చూస్తూ ఊరుకుంటారా? అంత చేవ జచ్చి ఉన్నారా? అంతగా తామసం తలకెక్కి ఉన్నారా?

వీధిలో కుక్కలు సంభోగానికి సిద్దమౌతున్నప్పుడు కూడా, ‘పిల్లలు, ఆడవాళ్ళు ఉన్నారు’ అన్న స్పృహతో... సాధారణంగా ఎవరైనా వాటిని ప్రక్కకి అదిలిస్తారు.

అలాంటిది, పట్టపగలు, పదిమంది చూస్తుండగా, మనిషి పందిలా కామక్రియకి పాల్పడితే, సినిమా చూస్తున్నట్లు చూస్తూ నిలబడతారా?

మొన్న కీర్తన అనే ఏడేళ్ళ చిన్నారిని, కన్నతల్లి కర్కశంగా, ప్రియుడితో కలిసి హింసిస్తే, నలుగురూ కలిసి ఆ యిద్దర్నీ నాలుగు పీకి పోలీసులకి అప్పచెప్పారు.

కీచక పర్వం నిర్వహిస్తూ విద్యార్దినులని వేధించాడని ఆరోపించబడినా, నిజంగానే వేధించినా, అలాంటి ఉపాధ్యాయులని పదిమందీ కలిసి పళ్ళురాలగొట్టిన వార్తలు వింటున్నాం.

చివరికి డబ్బున్న వాడనుకున్న పార్క్‌ఉడ్ అయూబ్ వ్యవహారం వెలుగు చూసినప్పుడు కూడా, ఆ ఊరి ప్రజలు, సదరు పాఠశాల ముందు మూగి అయూబ్‌ని శిక్షించాలని నినదించారు.

అలాంటిది... ఈ ఊరు, ఉయ్యాలవాడలో చూస్తూ నిలబడిపోతారా? అందునా... స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పౌరుషాన్ని ఇప్పటికీ అప్పుడప్పుడన్నా గుర్తుకు తెచ్చుకుంటారిక్కడి ప్రజలు!

అలాంటిది, నిజంగా అలా చూస్తూ ఊరుకున్నారంటే - సదరు నేరస్తుడు ఆ ఊర్లో పేరుమోసిన రౌడీ అయినా అయి ఉండాలి, తెగబలసిన... ధనమూ, అధికారమూ ఉన్నవాడైనా అయి ఉండాలి.

అలాంటప్పుడు... సదరు కాముకుడి బ్యాక్‌గ్రౌండ్ ఏమిటి? ‘గోపాల్’ అని పేరు వ్రాయగలిగిన విలేకరులకి తెలిసే ఉండాలి కదా? ఎందుకు ఫాలో‌అప్ వెలుగు చూడలేదు. లేక ప్రజలకి, పోలీసులకి, విలేకరులకి కూడా ‘యాచకురాలి గురించి అంతకంటే ప్రాధాన్యత ఏముందిలే?’ అనిపించిందా?

ఎందుకంటే ... దేశంలో ఎన్నోసార్లు ఎన్నోచోట్ల బాంబులు పేలినా ముంబై తాజ్‌లో పేలితేనే అంతటా గగ్గోలు పుట్టింది. అంతే సంచలనమూ మీడియా చేసింది.

అలాగే... దేశంలో నిత్యమూ ఎందరో పేద, మధ్యతరగతి ప్రజల బిడ్డలు కిడ్నాపులకీ, హత్యలకీ గురైనా, విజయవాడ రియల్ ఎస్టేట్ వ్యాపారి కుమార్తె నాగవైష్ణవి కిడ్నాపూ, హత్య మాత్రమే పతాక శీర్షికలకి, రోజు వారీ వరుస సంచలనాలకి నోచుకుంది.

ఆ విధంగా... కేవలం డబ్బున్న వాళ్ళ మాన ప్రాణాలు మాత్రమే విలువైనవై, సాధారణ పేదల మనశ్శరీరాలు, మానప్రాణాలు పనికి మాలినవై పోయాయి. కాబట్టి - ప్రజలూ, పోలీసులూ, మీడియా కూడా ఈ విషాయంలో మిన్నకున్నాయా?

లేకపోతే... బహిరంగ, లజ్జాహీన, నీచత్వాన్ని కూడా పట్టించుకోనంత ప్రత్యేక కారణం ఏమి ఉంటుంది?

మామూలుగా ఏ చిన్న సంచలనం దొరికినా, చర్చా గోష్టులు నిర్వహించే మీడియా కూడా గమ్మునుందంటే - ప్రభుత్వం, పోలీసు శాఖా కూడా... "మరీ గొడవైతే అసహ్యంగా ఉంటుంది( ప్రభుత్వానికి కూడా!)... ఇక్కడితో సద్దుమణిగిద్దాం" అనుకున్నాయా? నిజానికి... అదీ ఒక రకంగా సరైనదే! అయితే నేరగాడిని కఠినంగా శిక్షించినప్పుడు మాత్రమే ఈ గోప్యత లేదా మౌనం కొంత అర్ధవంతంగా ఉంటాయి.

ఇంతకీ ఈ నేరగాడు గోపాల్ ఎవరో, అతడి నేపధ్యమేమిటో తెలియదు. ఇక అతడిని ఏ విధంగా శిక్షిస్తారో, ఇంకేం తెలుస్తుంది? అసలు శిక్షిస్తారో లేదో!

ఏది ఏమైనా... సమాజంలో పశుప్రాయత పెరిగిందనాలా? ప్రజల్లో పిరికితనం పెరిగిందనాలా? అసలా వార్తలో చెప్పింది నిజమేనా? నిజమైతే రాజకీయ నాయకులు నిశ్శబ్దాన్ని ఎందుకు పాటిస్తున్నారు? ఎక్కడో ఏదో లొసుగుంది. అసత్యమో, అసహజమో అయిన లొసుగు! అసలేం జరిగిందో ఆ గ్రామస్థులకి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. ఆ నిజం తెలిస్తే లొసుగెక్కడుందో తెలుస్తుంది. ఎందుకంటే తర్కానికి అసత్యం గానో, అసహజంగానో తేలుతోంది మరి! ఏమంటారు?

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

ఈ షేర్ మార్కెట్ మాయాజాలం ఎంతగా మెలికలు తిరిగిన సందుగొందుల ప్రయాణమో గమనించాలంటే, ఇటీవల బ్రిటన్‌లో జరిగిన దిగువ ఉదంతాన్ని పరిశీలించండి.

>>> ఆంధ్రజ్యోతి, 3 అక్టోబరు, 2010
డెత్ బాండ్స్ మరణంతో వ్యాపారం
బ్రిటన్ భారీ కుంభకోణం

నేను పోయిన తరువాత ఎంత సొమ్ము నా వాళ్లకు వస్తే మాత్రం ఏం లాభం- అదేదో నా మరణానికి ముందే నాకు దక్కితే బెటర్ కదా అనుకునే బీమా పాలసీదారులతో జరిపిన మృత్యుబేహారుల వ్యాపారక్రీడ ఇది. అయితే మృత్యు అంచనాలు తప్పటంతో మొత్తం వ్యవహారం బెడిసికొట్టింది. మరికొద్ది సంవత్సరాల్లో మరణిస్తారని అంచనాలు వేస్తే.. వారు సంవత్సరాల తరబడి బతికేయటంతో 'చావు తెలివితేటలు' వికటించాయి. ఫలితంగా ఈ మహామాయ జూదక్రీడలో చిక్కుకుపోయిన అనేక మంది కళ్లు తేలేయాల్సి వచ్చింది.

కాదేది వ్యాపారానికి అనర్హం.. ఎదుటివారి మృత్యువైనా సరే.. మనకు కలిసివస్తే అదే పదివేలు.. సరిగ్గా ఈ మార్కెట్ మంత్రాన్నే నమ్మిన కొందరు బ్రిటిష్ వ్యాపారులు తీరా అది కాస్తా తుస్సు మనడంతో బొక్కబోర్లాపడ్డారు. అమెరికన్ల మృత్యు పేటికలపై కలల సామ్రాజ్యాలను నిర్మించుకోవాలని వారు చేసిన ప్రయత్నం అనేక మంది జీవితాలనునాశనం చేసింది. మెరుగైన రాబడి-భద్రమైన జీవితం అంటూ మురిపించిన కీడాటా ఇన్వెస్ట్‌మెంట్స్ చివరకు చేతులెత్తేయడంతో కుప్పకూలిపోయారు. మృత్యుబాండ్ల పేరిట సాగిన ఈ వ్యాపార క్రీడ చివరకు బ్రిటీష్ ఇన్వెస్టర్ల పాలిటే మృత్యుపాశంగా మిగిలిపోయింది. బ్రిటన్ పర్సనల్ ఫైనాన్స్ ఇండస్ట్రీని అతలాకుతలం చేసి మూడు దశాబ్దాల్లో అతిపెద్ద కుంభకోణంగా ఖ్యాతి గడించింది. ముచ్చటగా మూడు కంపెనీలు ఆడిన ఈ కాస్ట్‌లీ గేమ్‌లో వేల కోట్ల రూపాయల మేర బ్రిటీషర్ల సంపదకు రెక్కలు వచ్చాయి.

మృత్యుబాండ్లు అంటే..
సాధారణంగా జీవిత బీమా పాలసీ తీసుకున్న వారు మరణించిన తర్వాతే బెనిఫిట్స్ లభిస్తాయి. అదికూడా వారసులు మాత్రమే వీటిని అనుభవిస్తారు. బతికి ఉండగానే ఈ ప్రతిఫలాన్ని అనుభవించే అవకాశం లభిస్తే.. సరిగ్గా ఈ పాయింట్‌తోనే సెకండరీ లైఫ్ ఇన్సూరెన్స్ మార్కెట్ ఒకటి అమెరికాలో పుట్టుకువచ్చింది. ఈ వ్యాపారం చేసే కంపెనీ మొదట అమెరికన్ల నుంచి పాలసీలను కొనుగోలు చేస్తుంది. ఆ తర్వాత పాలసీదారుడికి బదులు సొంతంగా ప్రీమియంలను బీమా కంపెనీలకు చెల్లిస్తుంది. చివరకు పాలసీదారుడు మరణించిన తర్వాత వచ్చే బెనిఫిట్స్‌ను పొందుతుంది. ఇదీ టూకీగా ఈ కంపెనీల వ్యాపార రహస్యం. అయితే.. ఇందులోనే అసలైన కిటుకు ఒకటి దాగి ఉంది.

ఈ చెయిన్‌లో భాగంగా పాలసీదారుడికి చెల్లించేది నామమాత్రం కాగా కంపెనీలకు లభించే బెనిఫిట్స్ కొన్ని రెట్లు ఉంటాయి. అందుకే పాలసీలు అక్కర్లేదని భావించే ధనిక అమెరికన్లకు గేలం వేసే ఏజెంట్లకు భారీ కమిషన్లను ముట్టజెప్పడానికి ఈ కంపెనీలు వెనుకాడేవి కాదు. యుఎస్ సెకండరీ లైఫ్ మార్కెట్ లక్షల కోట్ల రూపాయలకు చేరుతుందని అంచనాలు వెలువడటంతో ఈ బిజినెస్ మూడు పూవులు, ఆరు కాయలుగా వర్ధిల్లింది. ఈ పాలసీలను కొనుగోలు చేయడానికి అవసరమైన నిధులను బాండ్లను జారీ చేయడం ద్వారా సెకండరీ లైఫ్ కంపెనీలు సమకూర్చుకునేవి. ఇందుకోసం ఎంత వడ్డీని చెల్లించడానికైనా వెనుకాడకపోయేవి. బ్రిటన్ కుంభకోణంలో ఈ బాండ్లే కీలక పాత్ర పోషించాయి.

ఎలా జరిగింది..
బ్రిటీష్ చరిత్రలో బిగ్గెస్ట్ కుంభకోణంగా పరిగణిస్తున్న ఈ ట్రాజెడీలో ప్రధాన సూత్రధారులు కీడాటా అధిపతి స్టివార్ట్ ఫోర్డ్, కాగా మరొకరు ఎస్ఎల్ఎస్ అధిపతి ఎలియాస్. వీరిద్దరి నిర్వాకానికి అకౌటింగ్ దిగ్గజాలు, అంతర్జాతీయ ఫైనాన్స్, బ్యాంకింగ్ సంస్థలు, రెగ్యులేటరీలు తలోచేయి వేశాయి. తద్వారా లైఫ్‌ను కాస్త ముందుగానే సెటిల్ చేసుకుందామని ప్రయత్నించిన బ్రిటీషర్ల కొంపలను కొల్లగొట్టాయి. రిస్కు ఎక్కువగా ఉండే స్టాక్ మార్కెట్లలో గాకుండా అమెరికన్ డెత్‌బాండ్లలో పెట్టుబడి పెట్టి ఏటా 8 శాతం వడ్డీని చెల్లిస్తామని కీడాటా ప్రచారాన్ని చేసింది. ఏడేళ్ల తర్వాత చెల్లించే అసలు సొమ్ము కూడా భద్రంగా ఉంటుందని నమ్మబలికింది. లైఫ్ సెటిల్ పథకం పేరుతో కొన్నేళ్లలో రిటైర్ అయ్యే బ్రిటీషర్లకు గాలం వేసింది. ఇందుకోసం యుఎస్ కంపెనీ ఎస్ఎల్ఎస్ నుంచి డెత్‌బాండ్లను కొనుగోలు చేయడానికి 2005లో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ బాండ్లనే తిరిగి వేలాది మంది బ్రిటీషర్లకు విక్రయించింది. చివరకు ఈ బాండ్లు మెచ్యూరిటీ దశకు రావడం, అందులో చాలావరకూ డిఫాల్ట్ కావడంతో అసలు కథ బయటపడింది.

దారి మళ్లిన నిధులు..
ఎస్ఎల్ఎస్ డెత్‌బాండ్లను కీడాటా కొనడం, వాటిని విక్రయించడం.. కొంతకాలం వరకూ ఈ వ్యవహారం సాఫీగానే సాగిపోయింది. ఈ వ్యాపారంలో భారీ నిధులను కళ్లజూసిన ఎస్ఎల్ఎస్ అధిపతి ఎలియాస్ వాటిని దారి మళ్లించారు. ఈ నిధులతో మలేషియాలో డ్రాగన్ బ్లేజ్ పేరుతో ప్రీమియం క్లబ్లును నెలకొల్పడం, బ్రెజిల్‌లో ఆరు లక్షల ఎకరాల రెయిన్ ఫారెస్ట్‌ను కొనుగోలు చేశారు. ఈ అవకతవకలను కప్పిపుచ్చుకోవడానికి కీడాటాకు విక్రయించిన బాండ్లను గుంపగుత్తగా మరోసారి అంతర్జాతీయ ఫైనాన్స్ సంస్థలకు తాకట్టుపెట్టారు. సరిగ్గా ఈ సమయంలోనే వచ్చిన ఆర్థిక సంక్షోభంలో ఎలియాస్ భారీగా నష్టపోయారు. 2007లోనే ఈ వ్యవహారాన్ని పసిగట్టిన కీడాటా అధిపతి స్టివార్ట్ ఫోర్డ్ ఎస్ఎల్ఎస్ నుంచి డెత్‌బాండ్లకు స్వస్తి పలికి తనే సొంతంగా లైఫ్‌మార్క్ పేరుతో యుఎస్ సెకండరీ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీని స్థాపించారు.

లైఫ్‌మార్క్‌తో డెత్‌బాండ్లను జారీ చేయించి, వాటిని కీడాటాతో కొనిపించడం మొదలుపెట్టారు. ఈ మధ్యకాలంలో ఎస్ఎల్ఎస్ విక్రయించిన బాండ్లు మెచ్యూరిటికి రావడం, అవి డిఫాల్ట్ కావడంతో మోసం బయటకు వచ్చింది. సరిగ్గా ఈ మధ్యకాలంలోనే ఎలియాస్ ఆల్కహాల్‌కు బానిసై మరణించడంతో ఇదంతా ఫోర్డ్ పీకకు చుట్టుకుంది. కనీసం లైఫ్‌మార్క్ ద్వారా లోటును భర్తీ చేద్దామని ప్రయత్నించినా.. అంచనా వేసిన దానికంటే ఎక్కువ కాలం బతికిన అమెరికన్లతో కథ అడ్డం తిరిగింది. ఈ కారణంగా ప్రీమియం భారం పెరగడం, డెత్ బెనిఫిట్స్ ఆలస్యం కావడంతో నిధుల సంక్షోభం తలెత్తింది.

చివరకు బ్రిటీష్ మార్కెట్ రెగ్యులేటర్ ఎఫ్ఎస్ఎ కన్నెర్ర చేయడం, కుంభకోణంలో భాగమైన అకౌటింగ్ సంస్థలు పక్షపాతంతో వ్యవహరించడంతో పరిస్థితి విషమించింది. చివరకు జీవితకాలం కష్టపడి పొదుపు చేసిన బ్రిటీషర్ల సొమ్ము కాస్తా ఆవిరైపోయింది. కీడాటా ఆస్తులను కరిగించి, లైఫ్‌మార్క్‌ను లిక్విడేట్ చేస్తే గానీ ఎంతో కొంత సొమ్ము లభిస్తుందని ఎఫ్ఎస్ఎ అంటోంది. అయితే.. లైఫ్‌మార్క్ యుఎస్ లిస్టెడ్ కంపెనీ కావడంతో సమస్య మొదటికి వచ్చింది. ఆరుగాలం కష్టించి కూడబెట్టుకున్న బ్రిటీషర్ల సొమ్ము కుంభకోణంలో చిక్కుకోవడం విషాదమైతే.. ఇప్పటికీ ఈ సొమ్ము వెనుకకు వస్తుందని వీరు ఆశపెట్టుకోవడం బాధ కలిగిస్తోంది.


Pasted from: http://www.andhrajyothy.com/businessNewsShow.asp?qry=2010/oct/3/business/3buss1&more=2010/oct/3/business/businessmain&date=10/3/2010


ఇక్కడ ‘అనుకున్నదొకటి, అయినది మరొకటి’ అన్నట్లుగా... పాలసీదార్లు దీర్ఘకాలం బ్రతకటంతో వ్యాపారం బెడిసి కొట్టింది. ఆర్ధిక మాంద్యం నేపధ్యంలో, సదరు వ్యాపారవేత్త... వత్తిళ్ళు తట్టుకోలేక మద్యపాన వ్యసనుడై మరణించటంతో, విషయం బైటికి పొక్కింది.

‘కాదేదీ వ్యాపారానికనర్హం’ కాబట్టి - ఎంత అమానుష వ్యాపారమైనా పాశ్చాత్య దేశాలలో లిస్టింగ్ అవుతుంది. షేర్లు అమ్ముకుంటుంది. ప్రభుత్వం ఏ అభ్యంతరమూ చెప్పదు. మరి అది స్వేచ్ఛావిపణి కదా!

అలాంటి చోట.... ‘పాలసీదారులు సుదీర్ఘ కాలం బ్రతకటం మూలంగా కదా మనికి ఈ నష్టాలొస్తున్నాయి’ అనుకొని... మృత్యుబాండ్లు జారీ చేసిన సదరు కంపెనీ, తెరవెనుక, వయస్సు మీరిన తమ పాలసీదారులని ఎవరికీ అనుమానం రాకుండా చల్లగా కడతేర్చమని, ఏదో ఒక సంస్థకి కాంట్రాక్ట్‌కు నియమించినా ఆశ్చర్యం లేదు. కాదేదీ వ్యాపారానికనర్హం అనుకున్నాక, స్టార్ ఆసుపత్రులు, అలాంటి కాంట్రాక్టులు పుచ్చుకున్నా అనుకునేందుకేమీ లేదు.

నిజానికి, భారతీయ ఆధ్యాత్మికతలో ‘జాతస్య హి ధృవో మృత్యుః’ అనుకోవటం పరిపాటి. "చావు అనివార్యమైంది. ఆస్తిపాస్తులు వెంటరావు. ఆపదల్లో ఆదుకోగలిగిందీ కొంత మేరకే! ‘చేసిన కర్మము చెడని పదార్ధము’ కాబట్టి మంచిపనులు చేసుకో! మన మంచే మన పిల్లల్ని కాపాడుతుంది" అనుకునే వాళ్ళు, ఒకప్పుడు, ఎక్కువమంది!

భారతీయత మీద నకిలీ కణికుల కుట్ర ప్రారంభమయ్యాక... క్రమంగా ఆధ్యాత్మికత కనుమరుగౌతూ వచ్చింది. "మంచి వాళ్ళకి రోజులు కావు, ఎప్పుడైనా చెడుకే గెలుపు. ఇవాళా రేపూ, అవినీతి పరులే అభివృద్ది చెందుతున్నారు" అనే ప్రచారం హోరెత్తి, ప్రజల జీవన విధానంలో, అవినీతి అంతర్భాగమైంది.

‘అక్రమార్కులకే మళ్ళీ పట్టం! నిన్న సస్పెన్షన్, ఈ రోజు పదోన్నతి! అవినీతిపరులకే అధికారం!’ గట్రా శీర్షికలతో... మీడియా దీన్ని ఇతోధికంగా, సుదీర్ఘ కాలంగా, చాపక్రింద నీరులా, నిరూపించుకుంటూ, నిర్వహించుకుంటూ వచ్చింది. ప్రజాదృక్పధాన్ని ప్రభావపరచటంలో ఇది ప్రధాన భాగం.

కాబట్టే...."నానా గడ్డీ కరిచి డబ్బు సంపాదించినా, మీడియా చేత సెలబ్రిటీలుగా కీర్తిపాటలు పాడించుకున్నా, చేసుకున్న కర్మకి దేవుడేసే శిక్ష వేస్తాడన్న" విషయాన్ని... మీడియా శక్తివంచన లేకుండా దాచేస్తుంది.

"మనం ఉన్నా, పోయినా..., మనం చేసుకున్న మంచిచెడులే మన పిల్లల్ని రక్షించినా, శిక్షించినా!" అనే నమ్మకాలతో ఎక్కువశాతం ప్రజలు నిజాయితీగా బ్రతుకుతున్న పరిస్థితి నుండి, ‘మనం పోయిన తరువాత మన పిల్లలకి డబ్బు అందివ్వాలనే’ తాపత్రయం నుండి ప్రారంభమై, ‘నేను పోయాకా ఎవరెట్టాపోతే నాకేం? నేను బ్రతికున్నంత కాలం బావుకుంటాను’ అనుకోవటం దాకా ప్రయాణించి నడుస్తున్నదే ప్రస్తుతం బ్రిటన్‌లో బయటపడిన జీవిత భీమా వ్యాపారం.

ఒకప్పుడు జీవిత భీమా వ్యాపారం, భారత్‌లో పరిచయం చేయబడినప్పుడు, అది ఆనాటి తరానికి జీర్ణం కావటానికి సమయం పట్టింది. దశాబ్దాల క్రితం... జీవిత భీమా ఏజంట్లు, పాలసీదారులని ఆకర్షించే ప్రయత్నాల మీద జోకులు, సెటైర్లు నడిచేవి. కొన్ని కథలు ప్రఖ్యాతి పొందాయి కూడా! రైల్లో ప్రయాణిస్తున్న కొత్తగా పెళ్ళైన జంటని పట్టుకుని... ఎల్‌ఐసీ ఏజంటు, "ఒక వేళ జరగరానిది జరిగి మీకేమైనా అయితే, మీ భార్య గతేమిటని" సుత్తి కొడుతుంటే సరికి, బెదిరిపోయిన నవ వధువు ఏడుపు లంకించుకొందనీ, అది చూసి వరుడూ కళ్ళునీళ్ళు పెట్టుకున్నాడనీ, కాస్సేపటికి రైలు బోగీ అంతా ఏడుపులతో మారు మ్రోగిందనీ...! ఇలా!

జీవిత భీమా వ్యాపారంలోకి స్వేచ్ఛ ప్రవేశిస్తే, చివరికి అది మృత్యు విశృంఖల వ్యాపారంగా మారుతుందనే స్పృహ ఉందో, లేక సెంటిమెంట్లు దాటలేదో, భారత్‌లో గత ప్రభుత్వాలు, జీవిత భీమా వ్యాపారంలోకి ప్రైవేటు సంస్థలని అనుమతించలేదు. ఈ 1 1/2 దశాబ్దంలోనే పలు జీవిత భీమా సంస్థలు ప్రవేశించాయి.

జీవిత భీమాలో, అసలు ప్రయోజనం లేదని నేను అనటం లేదు. అనుకోకుండా ఇంటికి అధారమైన వ్యక్తి మరణిస్తే, నడిసముద్రంలో నావలా అల్లాడే కుటుంబాన్ని, తెరచాపలా ఒడ్డుకి చేర్చే పాలసీలు ఉండటం, అవి వాస్తవంగా కుటుంబాన్ని ఆదుకోవటం కూడా చూసి ఉన్నాను. అయితే అలాంటి ప్రయోజనాలతో బాటుగా... జీవిత భీమా పాలసీలు తీసుకుని, నామినీగా తమ పేర్లు పెట్టుకుని, వరుసగా పెళ్ళిళ్ళు చేసుకోవటం, భార్యల్ని ఎవరికీ అనుమానం రాకుండా కడ తేర్చటం వంటివి చేసిన, వైట్‌కాలర్ నేరగాళ్ళు గురించి కూడా గతంలో విన్నాం.

ఇదిగో, ఇప్పుడు, అమెరికా, లండన్ సాక్షిగా... అలాంటి వైట్‌కాలర్ దురాగతాల్ని చూస్తున్నాం. ‘అర్ధాంతరంగా తాను పోతే తన కుటుంబం గతేం కాను?’ అనుకున్న భయమూ, తమ వాళ్ళ మీద ప్రేమ+శ్రద్ధలతో ప్రారంభమైన, ప్రచారమైన జీవిత భీమా వ్యాపారం... చివరికి "ఆఁ తాను చచ్చాక ఎవరెట్లా పోతే తనకేం? భీమా సొమ్ము ఇప్పుడే చేతికందితే పోలా?" అనుకునే దగ్గరికి ప్రయాణించింది.

ఇది తొలిమెట్టు అమానుషం! అక్కడి నుండి వ్యాపార కంపెనీలు, పాలసీలను కొని, వాటిని మళ్ళీ లిస్టింగ్ చేసి, వాటాలు జనాలకమ్మడం, మరో అమానుషం. (సదరు కంపెనీ యజమాని, ఆ సొమ్మంతా పెట్టి జూదశాల తెరిచాడు. దాన్ని ఏ మాటతో, ఎంత అమానుషమనాలో చేతకాక మిన్నకుంటున్నాను.)

ఇంతగా ‘చావుల మీదా వ్యాపారమా?’ అని ప్రభుత్వమూ మందలించలేదు, నియంత్రించనూ లేదు. మరి అది స్వేచ్ఛా వ్యాపారం!

ఇందులో మనల్ని విభ్రాంతి పరిచే విషయం ఏమిటంటే - సదరు కంపెనీ నిర్వహించిన కోట్ల టర్నోవరు గల వ్యాపారంలో, ఒక వస్తువు ఉత్పత్తి చేయబడలేదు. ఒక ముడి సరుకు లేదు. కార్మికుల రూపేణా ఉపాధి అవకాశాలూ లేవు. కేవలం మనిషి ‘భావాల’ మీద జరిగిన కాగితపు వ్యాపారం అది.

ఒకప్పుడు మంచి పనులు చేసే వ్యక్తులున్న, దానధర్మాలు చేసే వ్యక్తులున్న సమాజంలో, ప్రక్కవాడి క్షేమం కోరుతూ బ్రతికే స్థితి నుండి, ఇప్పుడు కంపెనీ లాభాలు రావాలని కోరుకోవటం అంటే - పాలసీదారులు త్వరగా చనిపోయి కంపెనీకు లాభాలు రావాలి, తద్వారా తమకు[మృత్యుబాండ్లు కొన్నవారికి] ఆ లాభాలు పంచబడాలని కోరుకునే స్థితికి చేరటం! ఈ తీరుగా మానవ జాతి ఎక్కడికి ప్రయాణిస్తున్నట్లు!?

"ఎవ్వరికైనా చావు తప్పనిది. రాసిపెట్టి ఉన్నది జరగక తప్పదు" అనుకుంటూ జీవితాన్ని ఎదుర్కునే దగ్గర నుండి, మృత్యుభయం సృష్టించబడింది. అందులో నుండి ఓ భద్రత సృష్టించబడింది. దాన్నుండి... ఇతింతై అంతటా విస్తరించిన వ్యాపారం, ప్రపంచమంతా ఆక్రమించింది.

ఇక్కడ మీకు ఓ చిన్న కథ చెబుతాను.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

పేపరు మిల్లులకీ, పరిసర ప్రాంత అటవీ సంరక్షణకీ సంబంధించిన ప్రణాళికా రచనలకీ ఆచరణకీ మధ్య ఉన్న వ్యత్యాసం లాంటిదే మరో చిన్న ఉదాహరణ పరిశీలించండి.

ఇది నా స్వానుభవం కూడాను!

మనకి రాష్ట్రాల్లో ఆర్టీసీ లుంటాయి కదా! APSRTC, KSRTC గట్రాలు. వీటన్నింటికీ బ్యాటరీలు, ఆయిల్ ఫిల్టర్లు, టైర్లు గట్రాలను సరఫరా చేసేందుకు... కాంట్రాక్టులని ఖరారు చెయ్యడానికి, ఢిల్లీలో, ASRTU అని ఓ ప్రభుత్వ సంస్థ ఉంటుంది. ASRTU అంటే All States Road Transports Undertaking అని!

ఒకటికి రెండుసార్లు, నేను ఈ సంస్థ నిర్వహించే బిడ్‌లో పాల్గొన్నాను. అప్పుడు మనం ఫిల్ చేసి దాఖలు చెయ్యాల్సిన టెండరు ఫారాలలో... ఉదాహరణకి మా బ్యాటరీల విషయంలో అయితే, ఎన్నిKVAల బ్యాటరీలను, ఏ ధరకు సరఫరా చేయగలమో Quote చెయ్యాలి. KVAలని సాధారణంగా ప్లేట్ల సంఖ్యలో కూడా చెబుతారు.

అంటే 25 ప్లేట్ల బ్యాటరీలు, 21ప్లేట్ల బ్యాటరీలు... ఇలాగన్న మాట. వాటి ధరతో పాటు, ఆ ఏడాదిలో ప్రపంచవ్యాప్తంగా సీసం ధర టన్నుకు వెయ్యి రూపాయలు పెరిగినట్లయితే, మన బ్యాటరీని వందకు ఎన్ని రూపాయలు (ఎంత శాతం) పెంచుతామో కూడా, మనం Quote చెయ్యవలసి ఉంటుంది. అలాగే... టన్నుకి సీసపు ధర వెయ్యిరూపాయలు తగ్గితే, మనం ఎంత తగ్గించగలమో ముందే చెప్పాలి. దాదాపుగా ధర పెరగడం తప్పితే, తగ్గడం ఉండదను కొండి, అది వేరే సంగతి.

ఇక్కడ మెలికేమిటంటే - బ్యాటరీ ఉత్పత్తి చేపట్టే పరిశ్రమలలో చిన్న స్థాయి వాటికి (ఇవి పూర్తిగా దేశీయ కంపెనీలు, నా ఫ్యాక్టరీ మాదిరిగా!), అంతర్జాతీయంగా రాబోయో ధరవరల్లో మార్పు చేర్పులు అంచనా వేసేంత అవగాహన ఉండదు. అదే Amco, Exide, Standard వంటి బహుళ జాతి కంపెనీలకి, ఆ సమాచారం కరతలామలకంగా ఉంటుంది.

అంతేకాదు వాటి ధరలని వాళ్ళే నియంత్రించగలరన్న విషయం, మామూలు చిన్న కంపెనీలకు తెలియను కూడా తెలియదు. ఇక మామూలు జనాలకి తెలిసే ప్రసక్తే లేదు. అదే ఇప్పుడయితే... బహుళ జాతి కంపెనీల సిండికేట్ వాటి ధరలని ఎలా నియంత్రిస్తాయో పేపరు చదివే సామాన్య జనాలకి కూడా తెలిసి పోయింది. అది ఈ 18 సంవత్సరాల్లో వచ్చిన మార్పు.

ASRTUలో బిడ్ ఓపెనింగ్ ప్రోగ్రాంకి నేను వెళ్ళినప్పుడు... Exide, Amco సంస్థల సంబంధిత ఉద్యోగులు కూడా ఆ కార్యక్రమానికి రావటం తటస్థించింది. ఒక చిన్న పారిశ్రామిక సంస్థ నడిపే, మహిళా పారిశ్రామిక వేత్తగా నన్ను వాళ్ళంతా ఆశ్చర్యంతో చూశారు, ప్రోత్సహించారు.

అయితే టెండరు Quote చేసే పద్దతిలోనే... దేశీయ లఘు సంస్థలకు పురిటి సంధి కొట్టించే ఇలాంటి అంశాలు చాలానే ఉన్నాయి. ఆ విషయమై ఆ సమావేశంలో జరిగిన చర్చతోనే, నాకు అప్పటి అవగాహన కలిగింది.

మామూలుగా రాష్ట్ర RTCలలో, మేం బ్యాటరీలకు ఆర్డర్లు అడిగితే... డైరెక్టర్లు, క్రింది స్థాయి ఉద్యోగులు "స్థానిక కంపెనీల ఉత్పత్తులు చౌకగా ఉండొచ్చుగాక, పనిచేయక పోతే, మేం పైవాళ్ళ చేతుల్లో తిట్లు తినాల్సి వస్తుంది. అదంతా మాకెందుకు? సంస్థకు లాభాలు చూపెట్టడం మా పని. చిన్నపరిశ్రమలని ప్రోత్సహించమని కాగితాల మీద, నోటితో చెబుతారు. అదే నష్టాలొచ్చినప్పుడు ‘చిన్న కంపెనీలతో మనకెందుకు? బ్రాండెడ్‌కు ఆర్డరివ్వాల్సింది?’ అంటారు" అనేవాళ్ళు.

నిజానికి ఇక్కడ మనం ఉప్పు ప్యాకెట్ కొన్నట్లు, ఆర్టీసీ ఏం కొనదు. ముందు ట్రయల్ ఆర్డరు కొద్ది సంఖ్యలో(100లోపే) ఇచ్చి, అవి బాగా పనిచేస్తేనే, తరువాత ఆర్డరు ఇస్తారు. అదే ఆర్టీసీ డైరక్టర్లకు బినామీ పేరు మీద ఉన్న యూనిట్లకు పేపరు మీదే ఆర్డరు ఇస్తారు, పేపరు మీదే స్క్రాప్ క్రింద ఆ సరుకు బయటకు వస్తుంది. అంటే బ్యాటరీలు తయారి ఉండదు, సరఫరా ఉండదు. బ్యాటరీ గ్యారంటీ అయిపోయిన తరువాత తుక్కు క్రింద సరుకు బయటకు కూడా వస్తుంది. మొత్తం పేపర్ మీదే ఇదంతా నడుస్తుంది. మరి ఇలా చేస్తే ఆర్టీసీ నష్టాల పాలుగాక ఛస్తుందా?

"రాష్ట్రంలోని చిన్న కంపెనీలకు మీ వాడకంలో 10% వాటాగా ఆర్డర్లు ఇవ్వాలి కదా! ప్రోత్సహించండి సార్!" అని అడిగితే... మరో సారి పైన చెప్పిన రికార్డే మళ్ళీ వినిపిస్తారు. ‘తాము ASRTU సర్టిఫై చేసిన కంపెనీల ఉత్పత్తులకే ఆర్డరు చేస్తామనీ, అదే తమకి సురక్షితం అనీ’ తెగేసి చెబుతారు. సదరు ASRTUలో, చిన్న కంపెనీలని, బహుళ జాతి కంపెనీలు నలిపి నామరూపాల్లేకుండా చేసే విధానాలే అమలులో ఉంటాయి.

వెరసి దేశీయ కంపెనీలు, మార్కెట్టులో నిలదొక్కుకోలేవు. మాటల్లో అయితే మంత్రి మహామహులు పేజీల కొద్దీ ఉపన్యాసాలు, దేశీయ కంపెనీలని, చిన్న సంస్థలనీ ప్రోత్సహిస్తామంటూ ఊకదంపుడుగా చేసిపోతారు.

దీనికి తాజా ఉదాహరణ పరిశీలించండి. గ్రామీణ ప్రాంతాల్లో, చిన్న చిన్న పట్టణాల్లో (మచ్చుకి మా నంద్యాల వంటి పట్టణాలు) చిన్న పాఠశాలలుంటాయి. తిప్పికొడితే 200 మంది విద్యార్ధాలుంటే ఎక్కువ! చుట్టుప్రక్కల వాళ్ళు పోతే ఆ స్కూళ్ళకి ప్రక్క ఊళ్ళనుండి, పట్టణంలో దూరంగా ఉన్న ప్రాంతాల నుండి, వ్యాన్‌కి వచ్చే వాళ్ళ సంఖ్య 40-50 మంది మాత్రమే ఉంటారు. ఇలాంటి స్కూళ్ళన్ని వ్యక్తిగత పేరుమీద నడిచేవై ఉంటాయి.

అయినా, అలాంటి స్కూళ్ళు, ప్రభుత్వ నియమాల ప్రకారం, పసుపురంగు వేసిన స్కూలు వ్యానులని నిర్వహించక తప్పదు. అయితే ఈ సంవత్సరం... ‘పాతబస్సులు, పాతవ్యానులూ నిర్వహిస్తున్నారనీ, దాంతో ప్రమాదాలకు గురై చిన్నారి విద్యార్ధులు మృత్యవాత పడుతున్నారనీ’... ప్రభుత్వం పాత వ్యానుల స్థానే కొత్త బస్సులు/వ్యానులు ప్రవేశపెట్టటం తప్పనిసరని, పాఠశాలల యాజమాన్యాలకి ఆదేశాలు జారీ చేసింది.

అసలుకే ఆయా చిన్నపాఠశాలలు కార్పోరేట్ పోటీకి తట్టుకోలేక, ఏదో కుంటుతూ నడుస్తున్నాయి. ఇక్కడ నేను, స్కూళ్ళు డొక్కు వ్యానులే మెయిన్‌టెయిన్ చేయాలని, విద్యార్ధుల ప్రాణాలు గాలికోదలాలనీ చెప్పటం లేదు. ఆ మాటకొస్తే.... కార్పోరేట్ స్కూళ్ళు వ్యానులు/బస్సులు ప్రమాదాలకి గురైన సంఘటనలు తక్కువేం కాదు.

ఇంకో విషయం ఏమిటంటే - ఇలాంటి చిన్నపట్టణాలలో ట్రాఫిక్ పెద్దగా ఉండదు, ప్రమాదాలు పెద్దగా జరగవు. [ప్రభుత్వం చూపించే ఇంత నిబద్దత... పల్లెల్లో, చిన్న పట్టణాల్లో ట్రాన్స్‌కో నిర్లక్ష్యం వలన కరెంటు షాకులతో ఇంతకంటే ఎక్కువ మంది మరణించినా, మచ్చుకి కూడా కనబడదు. కనీసం ఆ ప్రమాదాలకి విద్యుత్ సంస్థ ఉద్యోగిని కూడా బాధ్యుణ్ణి చేయరు. అదీ ప్రభుత్వానికి ప్రజల మీద ఉన్న శ్రద్ధ!]

అయితే వ్యానుల నిర్వహణ, కండీషన్‌లతో నిమిత్తం లేకుండా, స్కూళ్ళ ఆర్దిక స్థితిగతులు గురించి concern లేకుండా, ఒక్క ఉదుటున జారీ చేయబడిన ఆదేశాల గురించి చెబుతున్నాను.

సాధారణంగా ఇలాంటి చిన్న బడుల్లో చేరే విద్యార్ధుల ఆర్ధిక స్థితిగతులు అంతగొప్పగా ఉండవు. దిగువ మధ్య తరగతి పిల్లలుంటారు. ఫీజులు అరగొరగా కడుతుంటారు. యాజమాన్యాలు ఏదో నడిపేస్తుంటాయి. యాజమాన్యాలు కూడా ‘ఎక్కడో పెద్ద స్కూళ్ళల్లో టీచర్‌గా చేరితే వచ్చే జీతం కంటే స్వంతంగా తమ స్కూలుకు కష్టపడితే అంత కంటే ఎక్కువ వస్తుంది అనీ, స్వతంత్రంగా జీవంచవచ్చనీ’ నడుపుతుంటారు.

అలాంటి చోట... ముందస్తు ఏర్పాట్లకు అవకాశం లేకుండా, ఒక్కసారిగా వచ్చిపడ్డ ఆదేశాలతో, ఈ చిన్న స్కూళ్ళు కుందేలయ్యాయి. ఇలాంటి ఒడిదుడుగులు తట్టుకోలేక, ఇలాంటి చిన్న స్కూళ్ళు మూతబడితే, కార్పోరేట్ స్కూళ్ళ ఆక్రమణ పెరిగిపోతుంది.

అలాగ్గాక చిన్న స్కూళ్ళు... చచ్చీచెడి, తల తాకట్టు పెట్టి కొత్త వ్యాన్లు/బస్సులు కొంటే, కార్పోరెట్ వాహన ఉత్పత్తిదారులకి లాభం! అయితే అటు కార్పోరెట్ స్కూళ్ళకు, లేకపోతే ఇటు కార్పోరేట్ వాహన కంపెనీలకు ప్రయోజనం సమకూరుతుంది. ఇలా రెండు వైపులా పదునైన కత్తితో... ప్రభుత్వం యధాశక్తి, కార్పోరేట్ సంస్థలకి ఉపయోగపడుతుంది.

ఈ విధంగా బడా సంస్థలకి భారీగా దోచిపెడితే, వాటి నుండి తమకి భారీగా నిధులందుతాయి. ఇదే ప్రస్తుతం ప్రభుత్వాధినేతల పనితీరు. రాష్ట్రాల్లో అయినా, కేంద్రంలో అయినా!

ఇలాంటివే అన్ని ఉత్పత్తుల విషయంలోనూ అటు ఇటూగా ఉంటాయి. దేశీయ చిన్న కంపెనీల విషయంలో ఇంత సవతి ప్రేమ చూపించే ప్రభుత్వాలు (సవతి ప్రేమ అని ఎందుకన్నానంటే - మాటల్లో ప్రోత్సాహం, వాస్తవంలో దుంపనాశన విధానం ఉంటాయి గనక.), అదే షేర్ మార్కెట్ దిగ్గజాలైన కార్పోరేట్ కంపెనీల విషయంలో అయితే... నిత్యసేవకు ఎంతగా సదా సర్వసంసిద్దంగా ఉంటాయో, ఇప్పుడు ఆర్దిక మాంద్యం నేపధ్యంలో... కొన్ని సంవత్సరాలుగా మనమంతా చూస్తూనే ఉన్నాం.

నిజానికి ఇది మన కళ్ళెదుటే ఉన్నా, అర్ధం చేసుకోవటానికి చాలా సంక్లిష్టంగా కనిపించే మార్కెట్ మాయాజాలం!

ఎప్పుడో హర్షద్ మెహతాలో, కేతన్ పరేఖ్‌లో, సత్యం రామలింగ రాజులో... షాకిచ్చినప్పుడు... ఒక్కసారిగా ఉలిక్కిపడతాం, అర్ధం చేసుకునేందుకు హైరానా పడతాం. అప్పుడే మీడియా కూడా నానా గల్లంతూ చేస్తుంది. తర్వాత మెల్లిగా చల్లారుస్తుంది. ఆనక అన్నీ మామూలే!

నిజానికి పైకి నారికేళ పాకంలాగానో, పరమ పాషాణ పాకంలాగానో కనిపించే, షేర్ మార్కెట్ మాయా జాలంలో, మీడియా+కార్పోరేట్ సంస్థలు+మీడియా కీర్తించిన ఆర్దిక సిద్ధాంతకర్తలు కలగలిసి... కృత్రిమంగా సృష్టించిన వింత పదాలు, వాటి గందరగోళ నిర్వచనాలు, అంతూదరీ దొరకని అంతరార్ధాలని పట్టించుకోకుండా... సత్యాన్వేషణ చేస్తే... అదేమీ అంత అంతుబట్టని జడపదార్ధమేమీ కాదు!

ఒక చిన్న ఉదాహరణ చెబుతాను.

మనం ఏ విశాఖ పట్టణంకో లేదా మచిలీ పట్నంకో వెళ్ళి, సముద్ర తీరానికి వెళ్ళాలనుకున్నామనుకొండి. సందుగొందుల్లో తిరుగుతున్నాం. ఒకోసారి డెడ్‌ఎండ్ అయిపోతున్న వీధుల్లో, దారిలేక వెనక్కి తిరగాల్సివస్తుంది. మెలికలు తిరిగి.... ఉత్తరానికో, దక్షిణానికో వెళ్ళాల్సి వస్తుంది. ఏ రోడ్డు పట్టుకు వెళ్ళాలో కొత్తవాళ్ళకి అర్ధం కాదు.

అయితే సముద్రం తూర్పు దిక్కున ఉంది. ఎటు మెలికలు తిరిగినా... ‘ప్రధానంగా తూర్పు వైపునే ప్రయాణించాలన్న’ దానిమీద దృష్టిపెడితే, అంతిమంగా సముద్ర తీరాన్ని చేరతాం కదా! ఇదీ అలాంటిదే!

ఇక ఈ షేర్ మార్కెట్ మాయాజాలం ఎంతగా మెలికలు తిరిగిన సందుగొందుల ప్రయాణమో గమనించాలంటే, ఇటీవల బ్రిటన్‌లో జరిగిన దిగువ ఉదంతాన్ని పరిశీలించండి.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

~~~~~~~~

దేశాన్ని ఆర్ధికాభివృద్ది బాటలో పయనించేలా చేయాలన్నా, ప్రజల జీవన స్థాయిని పెంచాలన్నా, ఒక నిర్ధిష్టమైన ప్రణాళికతో ముందుకెళ్ళాలి.

అసలు `ఒకదేశం ఆర్దికంగా అభివృద్ది చెందింది' అంటే - ఏ ప్రామాణికాలని బట్టి నిర్దారణ చేయాలి? ఓ దేశంలో ఉపయోగిస్తున్న నత్రికామ్లం, గంధకికామ్లాల పరిమాణాన్ని బట్టా, విద్యుత్తును బట్టా లేక ముడి చమురును బట్టా? ఏ వస్తువుల్ని ఎంత పరిమాణంలో ఉత్పత్తి చేసారో, దాన్ని బట్టా? ఏయే పంటలు ఎన్ని లక్షల టన్నుల పండించారో, దాన్ని బట్టా?

ఓ దేశపు తలసరి సబ్బు వినియోగాన్ని బట్టి కూడా అయా దేశ జనుల జీవన స్థాయిని లెక్కించడం, ఒకప్పుడు ఆచరణలో ఉండేది. ఒకవేళ ఆయా దేశీయులు దేశవాళీ సున్నిపిండి, షీకాయ, కుంకుళ్ళ వంటివి ఎక్కువగా వాడితే... వాళ్ళది అట్టడుగు జీవన స్థాయేనన్నమాట. వెరసి కార్పోరెటు కంపెనీల సబ్బుల వాడితేనే, ఆ దేశపు జన జీవన స్థాయి ఉత్తమంగా ఉన్నట్లు?

ఈ రకమైన ప్రామాణికాలకీ, ప్రస్తుతం... ఏయే దేశాల్లో ఎంతెంతమంది సంపన్నులున్నారో, ఆ జాబితాని బట్టి ఆయా దేశాలని గొప్పవిగా పరిగణించటానికీ తేడాలేదు. ఉదాహరణకి... అమెరికాలో 300మంది పైచిలుకు సంపన్నులుంటే, భారత్‌లో 60 మంది పైచిలుక సంపన్నులున్నారన్నట్లు?

అధికారిక లెక్కల్లోనే... రెండు దేశాల్లోనూ ఎందరు పేదలున్నారో, ఎందరు నిరుద్యోగులున్నారో... ఆ లెక్కలు మాత్రం సవ్యంగా బయటికి రావు. బయటికొచ్చేవన్నీ అరగొర సత్యాలే! అలాంటప్పుడు, సంపన్నుల సంఖ్యని బట్టి దేశాల గొప్పదనం లెక్కించటం ఎంత వరకూ సబబు?

ఈ నేపధ్యంలో... అసలొక దేశపు ఆర్దికాభివృద్దిని ఎలా లెక్కించేటట్లు? ఓ ప్రక్క ఆకాశహర్మ్యాలుంటే... మరోప్రక్క ఫ్లైఓవర్ల క్రింద పట్టాపరుచుకు పడుకునే అభాగ్యులుంటారు. ఎప్పుడు ఈ తారతమ్యం తగ్గుతుందో, ఎప్పుడు సమాజంలో... సంపదలతో తులతూగే వారి సంఖ్య కన్నా, కూడు గూడు విద్యా వైద్యాలకి కొదవలేని జనాభా సంఖ్యకు ప్రాధాన్యత పెరుగుతుందో, అప్పుడు అనుకోవచ్చునేమో... "ఈ దేశం అభివృద్ది చెందింది, చెందుతోంది" అని!

ఇలాంటి నేపధ్యంలో.. ఆర్దికాభివృద్ది గణాంకాలే పెద్ద కాకిలెక్కలైన చోట... అభివృద్ది కోసం ప్రభుత్వం చేపట్టే ప్రణాళికలకి, పధక రచనలకీ, వాస్తవంలో వాటి ఆచరణకీ మధ్య హస్తమశకాంతరం (ఏనుగుకీ దోమకీ ఉన్నంత వ్యత్యాసం) ఉంటుంది, నింగికీ నేలకీ మధ్య ఉన్నంత దూరం ఉంటుంది.

ఒక ఉదాహరణ గమనించండి. ఒకప్పుడు కాగితపు వినియోగాన్ని బట్టి, ఆ దేశపు అభివృద్ది లెక్కించవచ్చని వాదన కూడా ఉంది. పాశ్చాత్య దేశాలలో మరుగుదొడ్డిలో నీటికి బదులు కాగితాన్ని వాడే అలవాటు ఉంది. అటువంటప్పుడు అది ఏపాటి సరైన లెక్క?

ఇక, ప్రభుత్వం ఒక కాగితపు మిల్లుకు అనుమతి ఇచ్చిందనుకొండి. అది ప్రభుత్వరంగంలో అయినా, ప్రైవేటు రంగంలో అయినా! దాదాపుగా పేపరుమిల్లు అటవీ ప్రాంతంలోనే మంజూరవుతుంది. మిల్లురాక ముందు, అక్కడ చెప్పుకోదగినంత అడవి ఉంటుంది. మిల్లు ప్రారంభించే ముందే, మిల్లుకు, అందులోని కార్మికులు ఇతర సిబ్బంది ఆవాసాలకు ఎంత స్థలం కావాలో లెక్కలు గడతారు.

అది పోను, పరిసరాల్లో మిగిలిన అటవీ ప్రాంతాన్ని 20 భాగాలుగా విభజిస్తారు. తొలిభాగంలోని చెట్లు నరికి మిల్లుకు ముడిసరుకుగా తొలి సంవత్సరంలో వాడతారు. అప్పుడే చెట్లు కొట్టిన ప్రాంతంలో మళ్ళీ మొక్కలు నాటాలి. మిల్లు యాజమాన్యం, అటవీ శాఖ, ఉమ్మడిగా బాధ్యత వహించాలి. మొక్కలు నాటటం, పెంపకానికి మిల్లు కొన్ని నిధుల్ని కేటాయిస్తుంది. సిబ్బందిని అటవీ శాఖ నియమిస్తుంది.

రెండో సంవత్సరం రెండోభాగం (2nd sector)లోని చెట్లు నరికి వాడుకుంటారు. అక్కడా మొక్కలు నాటి పెంచాలి. ఇలా... ఇరవై ఏళ్ళు తిరిగి, ఇరవయ్యో భాగంలోని చెట్లు నరికేటప్పటికి, తొలిభాగంలోకి మొక్కలు పెరిగి, చెట్లై, అడవి చిక్కదనం అలాగే ఉండాలి. ఇరవై ఒకటో ఏటికి తొలిభాగంలోని చెట్లు మిల్లు ముడి అవసరాలకు అందుబాటులోకి రావాలి.

అయితే... ఇందులో, చెట్లు నరకటం మాత్రమే జరుగుతుంది. మొక్కల పెంపకం, నిధుల ఖర్చు అన్నీ కాగితాల మీద మాత్రమే ఉంటాయి. వాస్తవంలో మిల్లు చుట్టూ కార్మికుల సిబ్బంది నివాసాల సమూహాలు విస్తరించి ఉంటాయి, అడవి మాత్రం అతిపల్చగా అయిపోయి, దాదాపు బోడిగుండులాంటి స్థలం... కనుచూపు మేరా విస్తరించి ఉంటుంది. ఢిల్లీ రైలు మార్గంలో సిరిపూర్-కాగజ్ నగర్ చుట్టు ప్రక్కల చూస్తే... ఇది పచ్చినిజమని ఎవరికైనా అర్ధమౌతుంది.

అటవీ సిబ్బంది సాక్షిగా, సహాయ సహకారాల చేయూతగా, మిల్లు సొమ్ము ఖర్చయిపోతుంది, ప్రభుత్వపు సొమ్మూ ఖర్చుయిపోతుంది. అడవి మాత్రం అయిపు లేకుండా పోతుంది. కార్మికులు, ఇతర సిబ్బంది, వంట చెఱకు దగ్గర నుండి, తమ సుదూర బంధుమిత్రులకు డ్రెస్సింగ్ టేబుళ్ళు, డైనింగు టేబుళ్ళు, మంచాలు, కొయ్య సోఫాల సెట్లూ బహుమతిగా పంపుతుంటారు.

ఎక్కడుంది తేడా? పధకంలో లోపం లేదు. ఆచరణలో మాత్రం, పైనుండి క్రింది వరకూ అంతా అవకతవకలే! అవినీతిలోనూ, అక్రమార్జనలోనూ పోటీపడుతూ మరీ, రాజకీయులూ, అధికారులూ, ఉద్యోగులూ, కార్మికులూ, కూలివాళ్ళు, సామాన్య ప్రజలూ... అందరూ... యధారీతి, ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ, తలా కొంచెం, అడవిని ‘హాం ఫట్’ చేస్తారు.

"ఆఁ మనమొక్కరం మడిగట్టుకు కూర్చుంటే సరిపోతుందా?" అంటూ... అరుగుకబుర్లు కూడా చెబుతారు. నియంత్రించాల్సిన ప్రభుత్వానికీ, అటవీ సిబ్బందికీ కూడా, అవినీతి జాడ్యం ఉన్నప్పుడు జరిగేది ఇదే కదా!?

ఇక ఈ అవినీతికి అదనంగా, మావోయిస్టుల వంక మరొకటుంటుంది. ఆ మావోయిస్టులు, సైనికులనీ, పోలీసులనీ మట్టుబెడుతూ, ఆత్మరక్షణ చేసుకుంటూ, విరాళాలు సమకూర్చుకుని డంపుల్లో దాచుకుంటూ... ఇక్కడ ఆంధ్రా నుండి నేపాల్ దాకా అడవి కారిడార్ ఏర్పాటుచేసుకుంటారు. మన శతృదేశమైన చైనాతో సంబంధాలు కలిగిఉంటారు. అంతర్జాతీయంగా ఆల్‌ఖైదా, ఎల్టీటీతో సంబంధాలుంటాయి. కాశ్మీర్ అతివాదులకు మద్దతు పలుకుతుంటారు.

ఈ మావోయిస్టు సమస్యని చూపించి, అటవీ శాఖ మాత్రం, అడవిని హారతి కర్ఫూరంలా మాయం చేసేస్తుంటుంది. ఫారెస్ట్ రేంజర్లకి ఇబ్బంది కలిగించే నక్సల్స్ సమస్య, ఎర్రచందనం దగ్గర నుండి మామూలు కలప దాకా... స్మగ్లింగ్ చేసే ముఠాలకి, ఎందుకు ఇబ్బంది కలిగించదో, ఎవరికీ అర్ధం కాదు. బోడిగండైన అడవిని చూపించి, ఎర్రపార్టీలు, రాజకీయులు పేదలకు/గిరిజనులకు పొలాలు/స్థలాలు పంచాలని పట్టుబడ్తారు. మొన్నామధ్య ఓ రాజకీయ నాయకుడు, పనికి ఉపాధి హామీ పధకం క్రింద, ఏకంగా అడవిలో చెట్లు కొట్టించాడు. అదీ వాళ్ళ జ్ఞానం!

వెరసి నేను చెప్పదలుచుకున్నదేమిటంటే - ఈ దేశాన్ని నాశనం చేయటానికి ఇన్ని అవకాశాలు ఉన్నాయి గానీ, బాగు చేయటానికి రాజకీయ నాయకులకు గానీ, అధికారులకీ గానీ ఒక్క అవకాశమూ కనిపించటం లేదు. అదే స్థితి జనాలది కూడా. ఇదే, పెద్దగా ఆలోచించకుండానే తలా ఒక చేయి వేసి మరీ, ఈ దేశం మీద అమలుపరుస్తున్న కుట్ర.

[ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే - అమలు చేస్తున్న వాళ్ళకి తెలియకపోయినా, సదరు పధక రచన చేస్తున్నది మాత్రం ఒక వ్యవస్థ కావటం!]

మేము 1995లో, శ్రీశైలంలో ఉండగా... కొన్నిరోజులు అటవీ శాఖ అధ్వర్యంలో నడిచే ఎన్జీవో (నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్)లో పనిచేశాము. ‘వన సంరక్షణ సమితి’ పేరుతో నడిచే ఆ సంస్థలు, గిరిజనుల భాగస్వామ్యంతో, అటవీ సంరక్షణకు తోడ్పడాలి. గిరిజనులకి ఆ విషయమై అవగాహన కలిగించడం ప్రధాన లక్ష్యం. ఆ సందర్భంలో హాజరైన సెమినార్‌లో, దగ్గరగా... ఆటవీ శాఖ అవినీతిని చూసి అదిరి పడ్డాము.

"తోటి వాళ్ళు (ఫలానా రేంజ్ వాళ్ళు) అంతలా సంపాదించుకుంటుంటే మాకు కొంచెమన్నా అవకాశం ఉండాలి కదా సార్?" అని రేంజర్లు, పైఅధికారిని సదరు సెమినార్‌లో, బహిరంగంగా, డిమాండింగ్‌గా అడిగేసారు.

అప్పట్లో ఓసారి... బైర్లూటి చెక్‌పోస్ట్ దగ్గర ఓ సంఘటన గమనించాము. చెక్‌పోస్ట్‌లో కాపాలాగా ఉన్న అటవీశాఖ ఉద్యోగి, ఏదో పనిమీద ఓ గంట ఎక్కడికో వెళ్ళాడు. అతడి పేరు గోపాల్. అతడు రాగానే, ఓ కట్టెలు కొట్టుకునే మహిళ "అయ్యో! గోపాలన్నా! నువ్వట్లా బోతివి. ఇట్లా గొక లారీ కొచ్చె! అయిదొందల రూపాయల మాల్‌బోయె గదన్నా!" అంది, లబలబలాడుతూ!

‘మినీ లారీడు చెక్కదుంగలు, అయిదొందలేమిటి?’ అని నాకు అర్ధం కాలేదు. తర్వాత వివరణలో అర్ధమైంది ఏమిటంటే "ఆ లారీని ఆపితే, చెక్‌పోస్టు సిబ్బందికి వొచ్చే ‘లంచం’ అయిదుదొందలు రూపాయలు. అది నష్టమైందే అన్న బాధని ఆ కట్టెలమ్ముకునే మహిళా, అటవీ ఉద్యోగీ పంచుకున్నారు. ఇలాంటి సమాచారం ఇచ్చినందుకు, పరస్పర ప్రతిఫలాలుంటాయి.

లారీలో దొంగ కలప పట్టుకుపోయే వాళ్ళని అడిగితే... ‘చెక్‌పోస్టుకి అయిదొందలు చొప్పున పంచుకుంటూ పోయిందే గాక, ఎక్కడి కక్కడ, పైనుండి క్రింది దాకా, నెలవారీ మామూళ్ళిస్తామండి. ఏతావాతా మాకు మిగిలేదెంత? ఏదో... అట్టట్లా సంపాదించుకునేదే మేమైనా!" అంటారు.

జీతం తీసుకునే అటవీ సిబ్బందికి "లారీకలప, ఎంత మేర అడవి నరికితే వస్తుంది?" అన్నధ్యాస ఉండదు. "పట్టుకుంటే ఎంత లంచం వొస్తుంది?" అన్న లెక్క ఉంటుంది. పైనుండి క్రింది దాకా ప్రభుత్వ శాఖల్లో (ఏదైనా ఒకటే) ప్రేరేపించబడిన అవినీతి ఇది! ‘యధారాజాః తధా ప్రజాః’ అన్నట్లుగా క్రింది స్థాయి పేదవాడి దాకా ఇంకిన అవినీతి దృక్పధం ఇది.

ఇక ఎలా మిగులుతుంది ఈ ధరిత్రి... ప్రశాంతంగా, పచ్చగా?

ఇక ఈ విషయం ప్రక్కన బెట్టి మళ్ళీ అటవీరంగం నుండి ఆర్ధిక రంగంవైపు దృష్టి మరలిస్తే...

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

భారతీయత మీదా, మానవత్వం మీదా నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గమూ సుదీర్ఘ కాలంగా అమలు పరచిన, పరుస్తోన్న కుట్రలో, ఆర్ధిక రంగం కీలకమైన వాటిల్లో ఒకటి.

అందునా... జీవితాలు దమ్మిడీలతో ముడిపడ్డాక, ఆర్దిక రంగం ద్వారా... ఎవరినైనా, దేనినైనా ప్రభావ పరచవచ్చు కదా! ఇందుకోసం నెత్తికెత్తుకున్న ఆర్దిక సిద్ధాంతాలన్నీ కాగితపు సత్యాలు, మిధ్యాపులులు!

అదెలాగో పరిశీలించాలంటే...

ద్రవ్యోల్పణపు లెక్కల్లో ఎన్ని లొసుగులున్నాయో ఇప్పటికే తేటతెల్లమయ్యింది. అది పెరిగినా తరిగినా... టీవీ వార్తల్లో చెప్పుకునేందుకు, వార్తా పత్రికల్లో వ్రాసుకునేందుకు తప్పితే, తిండితిప్పల కవసరమయ్యే నిత్యావసరాల ధరలూ, వేషభాషల కవసరమయ్యే దుస్తులూ చెప్పులూ గట్రాల ధరలూ, నీడా నిప్పుల కవసరమయ్యే సిమెంటు, ఇనుము ధరలూ, భవిష్యత్తు కవసరమయ్యే చదువూ సంధ్యల ఖర్చులూ.... అన్నీ పెరుగుతూనే ఉంటాయి.

సగటు మనిషి దైనందిక జీవితపు ఆదాయవ్యయాలకీ, ఈ ‘ద్రవ్యోల్పణం, వృద్దిరేటు, తలసరి ఆదాయాల’ లెక్కల డొక్కలకీ సంబంధమేమిటో సామాన్యుల బుర్రలకి ఛస్తే అర్ధం కాదు. అర్ధం చేసుకునేందుకు ప్రయత్నించేంత తీరికా మిగలదు.

మన్మోహన్ సింగ్‌లకూ, మాంటెక్ సింగ్ అహ్లూవాలియాలకూ, చిదంబరాలకూ, తత్సమాన ఆర్దిక ‘దిగ్గజాల’కు మాత్రమే అర్ధమౌతాయేమో!

ఇక మరో భ్రాంతి... వృద్ధిరేటు, అదే పారిశ్రామిక వృద్ధి రేటు! ఒక దేశపు పారిశ్రామిక వృద్దిరేటును లెక్కగట్టేటప్పుడు, నిర్ణీత కాలవ్యవధిలో (అంటే సంవత్సరానికి, లేదా త్రైమాసికం గట్రాలన్న మాట.) ‘ఏయే వస్తూత్పత్తి ఎంతెంత జరిగింది, ఎంతగా విక్రయ వినిమయాలు జరిగాయి’ అనే విషయాలు కూడా పరిగణిస్తారు.

అయితే, ఈ వృద్దిరేటు లెక్కింపుల్లో ఒక దేశపు ఫార్మాస్యూటికల్ ఉత్పత్తులని (అంటే రోగాలకు వాడే మందులు) కూడా పరిగణనలోకి తీసుకుంటారు. ఒక దేశంలో మందుల ఉత్పత్తి, విక్రయం, వాడకం ఎక్కువ అయ్యాయంటే, సదరు దేశంలో జనాలు... రోగాలు రొప్పులు వంటి ఈతి బాధలతో బ్రతుకీడుస్తున్నారనే కదా అర్ధం!? అప్పుడే కదా ఔషధాల ఉత్పత్తి, విక్రయం, వినిమయం పెరుగుతుంది!?

అంటే... ఓ ప్రక్క జనాలు రోగాలొచ్చి ఏడుస్తుంటే, వృద్దిరేటు పెరిగిందని ప్రభుత్వం చంకలు గుద్దుకోవటం కాదా ఇది? ఇదా వృద్ది రేటు? ఇదా దేశాభివృద్ది? ఇంతకంటే దగుల్బాజీ లెక్కలూ, ఆర్దిక సిద్ధాంతాలూ ఏముంటాయి? అందుకే వాటిని కాగితపు సత్యాలనీ, మిధ్యాపులులనీ అన్నాను.

ఇక తలసరి ఆదాయాల లెక్కలు చూస్తే... అదో దౌర్భాగ్యపు లెక్క.

ఉదాహరణకి, ఓ ఊళ్ళో వందమంది ప్రజలున్నారనుకొండి. అందులో 10 మందికి, సంవత్సరానికి, 10 లక్షల రూపాయల ఆదాయం వస్తుందనుకొండి. మరో పదిమందికి, సంవత్సరానికి, లక్ష రూపాయల ఆదాయం వస్తుందనుకొండి. మిగిలిన 80 మందికి, సంవత్సరానికి, 24 వేల రూపాయల ఆదాయం వస్తుందను కొండి.

అప్పుడు మొత్తంగా... ఆ వూరిలోని వందమంది ఆదాయం ఎంత? (10x10లక్షలు)+(10x1లక్ష)+(80x24వేలు) = 100లక్షలు + 10లక్షలు + 19.20లక్షలు = 129.20 లక్షలు. సగటున ఒక్కొక్కరి ఆదాయం ఎంత? 1.292 లక్షల అంటే దాదాపు లక్షా ముఫై వేలన్న మాట! నిజానికి జనాభాలో 80% మందికి ఆ పైనున్న ముఫైవేల ఆదాయం కూడా ఉండదు.

ఆర్దిక గణాంకాలు మాత్రం, ఆ ఊరి తలసరి ఆదాయం, సంవత్సరానికి, లక్షా ముఫైవేలుగా లెక్కగడుతుంది. దాన్ని ఆధారంగా చేసుకుని, అన్ని ప్రణాళికలూ రచిస్తుంది. అప్పుడు అంతిమ లాభం... వందమంది జనాభాలోని అధికాదాయ వర్గం 10% మందికీ, తగినంత ఆదాయం ఉన్న మరో 10% మందికీ లభిస్తుంది తప్ప, అధిక సంఖ్యలో ఉన్న 80% మంది సామాన్యులకి కాదు. వెరసి మట్టిగొట్టుకు పోయేది పేదలూ, సామాన్యులే!

కాబట్టే - మనం దశాబ్దాలుగా వింటున్న ‘ధనికులు మరింత ధనవంతులౌతున్నారు, పేదలు మరింత పేద వాళ్ళవుతున్నారు! అవే పడికట్టు మాటా పుట్టింది. అది సత్యమే అయినప్పటికీ, ఇప్పటికీ పరిష్కార బాట పట్టనిది కూడా ఇందుకే! మేడిపండులో పురుగుల్లాగా, ఆర్దిక సిద్ధాంతాల లెక్కల్లో ఇన్ని లొసుగులున్నప్పుడూ... సదరు లొసుగులన్నీ, ముఖేష్ అంబానీలకూ, రతన్ టాటాలకు, లక్ష్మీమిట్టళ్ళకూ, బజాజ్ లకూ, అజీం ప్రేమ్‌జీలకూ అనుకూలంగా ఉన్నప్పుడు... ఇదే కదా జరిగేది?

ఇది అచ్చంగా... ముంబై నగరంలో నారిమన్ పాయింట్‌నో, తాజ్ హోటళ్ళనో చూపించి, "ఇవిగో ఇంత ఆకాశ హర్మ్యాలున్నాయి. చూడండి ఇదెంత భాగ్యవంతమైన నగరమో" అన్నట్లుంటుంది. ముంబై నగరం చుట్టూ, నగరంలోనూ, మురికి వాడలెన్ని ఉన్నాయో ముంబై వాసులకి తెలుసు. బయటి నుండి వచ్చేవాళ్ళు, ప్రధాన రహదారుల్లో తిరిగి "ఆహా!ఓహో!" అనుకుంటే - కనిపించేది కాగితపు సత్యలే, మిధ్యాపులులే!

ఇంకా దీనికి మెరుగులద్దుతూ శ్రీమాన్ కేంద్ర మంత్రులూ, ప్రధానమంత్రి..."రాత్రికి రాత్రి ధరలు తగ్గించేందుకు మా చేతిలో మంత్రదండమేం లేదు" అంటారు. మనదేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ధరలు పెరుగుతున్నాయి. ఇది అసాధారణమేమీ కాదు" అంటారు.

"ఫలానా ఫలానా సిద్ధాంతాల కారణంగా, లేదా ఫలానా దేశంలో ఫలానా పరిస్థితుల వల్ల, మనకిక్కడ ధరలు పెరుగుతున్నాయి" అంటారు. ఫలానా దేశంలో, ఫలానా ప్రకృతి వైపరీత్యం వల్ల, ఫలానా పంట దెబ్బతిని, మనకిక్కడ సదరు వస్తువుల ధరలు పెరిగినట్లయితే... మరి... మరో ఫలానా దేశంలో, మరో ఫలానా పంటేదో బాగా పండటం వల్ల, మనకిక్కడ ఆ ఫలానా వస్తువుల ధరలన్నా తగ్గాలి కదా?

పెరగటానికి పలు కారణాలు కన్పిస్తాయి గానీ, తగ్గడానికి తక్కువలో తక్కువగా... ఒక్క కారణమన్నా కనబడదు మరి! కనబడే... బ్లాక్ మార్కెట్‌ని అరికట్టడం, అక్రమ నిల్వలని, పరాయి దేశాలకు పోర్టుల సాక్షిగా దొంగరవాణాలని పట్టుకోవటం, మార్కెట్ నియంత్రణ వంటి చర్యల్ని మాత్రం... ఛస్తే తీసుకోరు. నల్లబజారు అమ్మకాలలో వాటాలు అవసరం మరి! మన నాయకులు ‘నిల్వలు సంమృద్దిగానే ఉన్నాయం’టారు, ధరలు మాత్రం దిగిరావు! మొన్నటి బియ్యం, పప్పుధాన్యాల దగ్గర నుండి, నిన్నటి రైతుల ఎరువుల దాకా... ఇదే వరుస.

కాబట్టే - సిమెంట్ ఇనుము ధరలు అందుబాటులో ఉన్నాయనుకొని ఇళ్ళ నిర్మాణాలు ఇబ్బడిముబ్బడిగా మొదలెట్టాక, సరిగ్గా సరైన సమయంలో సిమెంటు ఇనుముల ధరలు పెరుగుతాయి. ప్రభుత్వం, సిమెంటు సిండికెటు నుండి సూట్‌కేసులు తీసుకొని, మూగా చెవుడూ గుడ్డితనం పాటిస్తుంది.

అదే షేర్ మార్కెట్ పడిపోతుందనండి. ఎంత ఉలికి పాటు వస్తుందో! టపా టపా కార్పోరెట్ కంపెనీలకు అనుగుణంగా, అన్ని సవరింపులూ జరిగిపోతాయి. కాగితపు సంపద కరిగి ఆవిరై పోతుందనే కంగారు ఎంతగా కలవరం కలిగిస్తుందో?

షేర్ మార్కెట్ మాయాజాలాన్ని పరిశీలించే ముందు మరికొన్ని అంశాలు పరిశీలిద్దాం.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!




నిన్న సాయంత్రం, టీవీలో కామెన్వెల్త్ క్రీడల ప్రారంభ సంరంభం చూస్తున్నంత సేపూ (మధ్యలో డీడీ ప్రసారాల్లో అంతరాయం షరా మామూలుగానే!) చిన్నపిల్లల్లా కేరింతలు కొట్టాము.

నిజంగా... విశ్వవీణపై శతకోటి భారతీయుల హృదయరాగం కనిపించింది.
భిన్నత్వంలో ఏకత్వం వినువీధి మారుమ్రోగేటట్లు వినిపించింది.

హిమవన్నగాల నుండి, హిందూ మహాసాగరం దాకా విస్తరించిన... విభిన్న సంస్కృతుల, విశిష్ట కళలు, విశేష వేషభాషలు! పైకి వైవిధ్యంగా కనబడుతున్నా... అంతర్లీనంగా ఐక్యమై కనిపించే భావనలతో.... భారతీయ ఆత్మ అక్కడ సాక్షాత్కరించినట్లనిపించింది.

శబ్దపవిత్రతకు చిహ్నంగా, శఃఖనాదంతో ప్రారంభమైన వ్యాఖ్యానం కూడా, ఆద్యంతం ఆకర్షణీయంగా సాగింది. పైగా క్లుప్తంగా, స్పష్టంగా!




ఇక, రకరకాల డోలు చప్పుళ్ళతో....! దేశంలోని నలుమూలల నుండి డప్పు వాయిద్య కళాకారులు....! పెద్ద పెద్దవి, పొడవుగా, భారీగా ఉన్న డోళ్ళు! గుండ్రంగా చిన్నగా ఉన్న డోళ్ళు! ఆ డప్పు చప్పుడులో భారతీయుల గుండె చప్పుడు విన్పించింది.

మామూలుగానే... డప్పు చప్పుడుకీ భారతీయుల రక్తానికీ అవినాభావ సంబంధముంది. పుట్టినప్పుటి నుండీ పోయే వరకూ, డోలూ సన్నాయిలు మనకు స్వాగత వీడ్కోలు నిస్తాయి. ఇప్పటికీ ‘వంద వాయిద్యాల ఆధునిక ఆర్కెస్ట్రాలు యువతని కట్టిపడేస్తున్నాయని’ ఎంతగా ప్రచారం హొరెత్తిస్తున్నా... డప్పు మోత వినబడగానే, ఆడుతున్న క్రికెట్ బ్యాట్‌ని క్రింద పారేసి, చిందేసే చిన్నారులని చూస్తూనే ఉంటాం. అంతగా డప్పు చప్పుడు... మన రక్తంలో ఇంకిపోయింది.

ఇక ఆ వాయిద్యాలని విభిన్న ఆకృతులతో, అలంకారాలతో మెరిపిస్తూ, తదనుగుణంగా ఉన్న ఆహార్యంతో... కళాకారులు లయబద్దంగా కదులుతూ, అంతకంటే లయబద్ధంగా భేరీలు మ్రోగించారు. ఆ అరంభం చాలా హుషారు తెప్పించింది. ఎవరో బుడతడు, పాండిచ్చేరి పిడుగట, కేశవ్! ఉస్తాద్‌ని అనుకరిస్తూ జులపాల జుట్టుని ఊపినా, తబలా వాయిస్తున్నంతసేపూ చిరునవ్వుతో ముద్దుగా ఉన్నాడు.


గాజులు అలంకరించుకున్న చేతుల ఆకృతిలో నిలబడి, పిల్లలు, తాళబద్ధంగా కదులుతుండగా... హరిహరన్ ‘స్వాగతం’ కూడా బాగుంది. క్షణాల్లో మువ్వన్నెల జండారంగుల్లోకి మారిన పిల్లలు, చకచకా వేసిన, భారతీయతలో భాగమైన గోరింటాకు చేతుల బొమ్మలు... పిల్లల సత్తాని, మన కళల వైవిధ్యపు సత్తాని కూడా చూపించాయి.



హీలియం నింపిన తోలు బొమ్మలు వయ్యారంగా కదులుతూ, మన ప్రాచీన కళకి ఆధునిక హంగుల సోయగాలని అద్దినట్లు, అందంగా కదిలాయి.

71 దేశాల జట్లను పరిచయం చేస్తూ, చీరకట్టుల్లో, సాంప్రదాయ దుస్తుల్లో... అందమైన యువతులు, అందాన్ని హుందాగా ప్రదర్శించారు. కాకపోతే... చీరకట్టు చేతకాలేదేమో, కుచ్చిళ్ళ దగ్గర ఉబ్బెత్తుగా ఉండి, చాలామంది బొద్దుగా కనిపించారు. కానీ రంగు రంగుల చీరలు! పట్టు, జలతారు, కుట్టుపువ్వులు అలంకరించిన చీరలు!

పాల్గొనే దేశాల జండా రంగులని ప్రతిబింబిస్తూ... ‘భారతదేశపు సుసంపన్నతకు నిదర్శనమా!?’ అన్నట్లు... కంచిపట్టు, పోచంపల్లి, బెంగాల్ కాటన్, వారణాళి పట్టు, కాశ్మీరీ పట్టు... అసలు భారతదేశంలో ఎన్ని విశిష్టతలున్నాయో ప్రపంచం విభ్రాంతి పడేలా ప్రదర్శించినట్లనిపించింది. ఎంతో చక్కని అలంకారాలతో, సంస్కృతీ సాంప్రదాయాలు మూర్తీభవించిన ముగ్ధత్వం... వెరసి భారతీయ స్త్రీత్వం! మనోహరంగా తోచింది.

నేతల ఉపన్యాసాలు ప్రారంభం కాగానే, కల్మాడీ ఏదో మాట్లాడుతున్నాడు... అంతలోనే మా టీవీ ఎంచక్కా దృశ్యం మాయంచేసి గుర్రుగుర్రు మంది. అంచేత ఎవరేం మాట్లాడారో, ఏ తంటాలు పడ్డారో మా కంటికి కనబడలేదు. :)

మళ్ళీ టీవీ మామూలుగా అయ్యేసరికి సాంస్కృతిక కార్యక్రమాలు వస్తున్నాయి. నాకైతే అవి చాలా నచ్చాయి. చూస్తున్నంత సేపూ ఎంత ఆనందించానో!





కూచిపూడి, భరత నాట్యం, మోహినీ ఆట్టం, ఒడిస్సీ, కథక్, మణిపురి.. శాస్త్రీయ నృత్యల్లోనూ ఎంత వైవిధ్యమో, అంత ఉత్కృష్టం! కళ ప్రయోజనం... ‘కళాకారులనీ, ప్రేక్షక శ్రోతలని మమేకం చేయటమే కదా!’ అన్పించేటట్లు. రంగురంగుల్లో... రకరకాల హంగుల్లో... వేల కొద్దీ సంవత్సరాలు... తరం నుండి తరానికి సంక్రమించిన వారసత్వంగా... ఎవరెంతగా నాశన మొనర్చ ప్రయత్నించినా, తిరిగి చిగురించే చేవగల కొమ్మలుగా... ఎంత సమ్మోహనంగా నిలిచాయో!

వాటితో పోటీపడుతూ జాన పదాలు! ‘భల్లె భల్లే’ అని భుజాలెగరేసే పంజాబీ భాంగ్రా లేకపోతే నిండుదనం లేదు. దాండియా, ఈశాన్య రాష్ట్రాల జానపద నృత్యాలు... దేనికదే, వేటికవే... ఎంతో ప్రత్యేకంగా, అందంగా.... ‘ఎంత విశాలమైనది ఈ భారతదేశం! ఎంత విభిన్నమైనది ఈ విశాల ఖండం!’ అన్పించేటట్లు.... "నిజమే. అందుకే ఇది ఉపఖండం" అనిపించేటట్లు... అందరినీ ఒప్పించేటట్లు ఉండింది.

ప్రాచీన ప్రాచ్య కళలని, జీవన శైలిని ప్రతిబింబిస్తూ... సంగీత సాధన చేస్తున్న గురుశిష్యులని చూపించారు. ఎంతో చక్కగా... గురువు, శిష్యురాలిని భుజమ్మీద చెయ్యేసి, తండ్రిలా నడిపిస్తూ నేర్పిస్తూ.. తీసికెళ్ళటం హృద్యంగా అభినయించారు. ఉదయాన్నే చేతనత్వాన్ని  సంతరించుకునే దృశ్యాన్ని, భారతీయుల జీవన విధానాన్ని, అద్భుతంగా అవిష్కరించారు.

ఓ వైపు సూర్యానమస్కారం చేసే బ్రాహ్మణుడు... మరో వైపు కసరత్తులు చేస్తున్న యోధుడు, చేటలు రోకళ్ళు చేతబట్టిన గృహిణులు, నీటి కుండల దొంతరని నెత్తిన బెట్టి కదిలిన మహిళలు... చదివిన పదిపుస్తకాల జ్ఞాపకాలు, ఒక్కసారిగా ఒకేక్షణంలో స్ఫురణకి తెచ్చినట్లుందా ప్రదర్శన!


కాశ్మీరు నుండి కన్యాకుమారి దాకా భారతీయ యాత్రని కళ్ళకు కడుతూ ‘A Tribute to Common Man of India'గా చెప్పబడిన రైలు బండి ‘ఛయ్య ఛయ్యా’ అంటూ చలాకీగా... పల్లెలోని టీ కొట్టుని, పొద్దున్నే పేపరు దగ్గర నుండి సాయంత్రం మల్లెపూల మాలలు దాకా, అన్నిటినీ ఇంటి గడప దాకా తెచ్చి అందించే చిన్న వ్యాపారుల రాజ వాహనం సైకిలునీ, ఎలష్కన్లప్పుడు మైకులు పట్టుకుని వచ్చి వంగివంగి దణ్ణాలు పెట్టే రాజకీయాలోళ్ళనీ... కార్మికుణ్ణీ, కూలీవాణ్ణీ అందర్నీ యిముడ్చుకుంటూ... కూర్చున్న చోట నుండి కదల కుండానే భారతదేశాన్నంతటినీ తిప్పి చూపించేసింది.


అన్నింటినీ మింగేస్తూ... బాలీఉడ్ తారల వాసన గానీ, క్రికెట్ కంపుగానీ రాకపోవటంతోనో ఏమో, హోటల్ తిండిలాగా కాకుండా, మన వంటింటి తాళింపు పరిమళంలాగా హాయిగా అనిపించింది.

ఇసుకలో వేళ్ళు కదుపుతూ, క్షణాల్లో బాపూ సత్యగ్రాహ సన్నివేశాన్ని ఆవిష్కరించిన యువకుల్ని చూస్తే... భారతీయులు అరవైనాలుగు కళలు కాదు, ఆరొందలరవై కళలు నేర్వగలరనిపించింది. 

అన్నిటిలోనూ అద్భుతంగా తోచింది... పతంజలి మహర్షి ప్రసాదించిన యోగశాస్త్ర ప్రదర్శన! ఒంటినిండా దుస్తులు వేసుకున్న బాల బాలికలు, (ముఖ్యంగా కొందరబ్బాయిలు పంచెలు కట్టుకొని ఎంత ముద్దుగా ఉన్నారో!) క్లిష్టమైన, ఆకర్షణీయమైన యోగాసనాలు ప్రదర్శించి ఆకట్టుకున్నారు. నేపధ్యంలో విన్పించిన సంస్కృత శ్లోకాలు కూడా, రాగయుక్త ఉచ్చారణతో సహా.... ఎంత చక్కగా ఉందంటే, వివరించి చెబితే అతిశయోక్తిగా అన్పించేంత!



కుండలినీ యోగంతో, కఠోర సాధనతో, ఒకప్పుడు సాధకులు ఆత్మని శరీరం నుండి వేర్పరచి, విశ్వంతారాళంలో విహారం చేసి, తిరిగి శరీరంలోకి ప్రవేశపెట్టే వాళ్ళట. ఎక్కడో చదివాను! అది నిజమోకాదో, సాధ్యమో లేదో గానీ... వందల వేల కోట్లు ఖర్చుపెడితే గానీ, అదీ అరగొరగానే చేయగల ‘రాకెట్టుతో అంతరిక్ష యానం’, యోగ సాధనతో చేయగలగటం! అసలలా ఊహించగలిగారంటేనే, సాధనకు రూపకల్పన చేశారంటేనే ఎంత జ్ఞాన సంపన్నులై ఉండాలీ పతంజలి వంటి ఆనాటి మహర్షులు!?

విద్యుత్ పరికరాల సాయంతో బుద్ధుణ్ణి, బాపూజీ ఆవిష్కరించిన తీరు గానీ, కుండలినీ యోగంతో శరీరంలో చక్రాలని శిరో భాగానికి ఉర్ధ్వాభిముఖంగా ప్రయాణింపచేయాటాన్ని గానీ... ప్రదర్శించినప్పుడు, ‘సాంకేతికత అసలు ప్రయోజనాలు ఇలాగే ఉండాలి కదా!’ అన్పించింది. ఊహాశక్తి లేనివాళ్ళకు కూడా, ఒక ఊహని కళ్ళకి కట్టినట్లుగా సాక్షాత్కరింప చేయటం కంటే, చక్కని ప్రయోజనం ఏముంటుంది?

నేను బీజింగ్‌లో జరిగిన ఒలెంపిక్స్ ప్రారంభపు ప్రత్యక్షప్రసారాన్ని కూడా చూశాను. (ఆ రోజూ మధ్యమధ్యలో డీడీ అంతరాయలనీ అందించింది లెండి. అది మామూలే కదా!) ఆ రోజు బర్డ్శ్‌నెస్ట్‌లో... చైనా ప్రదర్శించిన టెక్నాలజీ చూసి, నిజంగానే అబ్బురమనిపించింది.

ఆ రోజు చైనా అత్యున్నతంగా కనబడే ఆధునిక సాంకేతికతని ప్రదర్శించింది. ఆహుతులైన దేశదేశాల జట్లని పరిచయం చేసేటప్పుడు, అందమైన చైనా యువతులు, మెరిసిపోతున్న ఎర్రని దుస్తుల్లో ఆకట్టుకున్నారు. అయితే... అందరూ ఒకే రంగు, ఒకే డిజైను! ఎంత బాగుందనిపించినా వందమంది అమ్మాయిల్ని ఆ దుస్తుల్లో చూశాక ఇక ఆకర్షణ అనిపించదు.

అయితే నిన్న భారతీయ యువతులు, ఆహ్వానం పలుకుతూ ఒకో జట్టుకు ముందు నడుస్తుంటే, ప్రతీ వారినీ ఆసక్తిగా పరిశీలించటం అప్రయత్నంగానే చేసేస్తాం. ఆయా దేశపు జట్ల జెండా రంగును ప్రతిబింబిస్తూ, ఆయా రంగుల్లో, భారతీయ సాంప్రదాయ చీరకట్టులో... ఎంతో చక్కగా... సంస్కృతీ సాంప్రదాయాలని ప్రదర్శించారు.

ఆనాడు చైనా, బీజింగ్‌లో, టెక్నాలజీ రూపేణా... భాగ్యవంతమైన శరీరాన్ని ప్రదర్శిస్తే, ఈనాడు ఇండియా, ఢిల్లీలో, విభిన్న కళల రూపేణా... సుసంపన్నమైన భారతీయ ఆత్మని ప్రదర్శించినట్లుంది! ఇది చైనాని తక్కువ చేయటానికి, వ్రాయలేదు. ‘మనం మాత్రమే గొప్ప, తక్కిన వాళ్ళంతా దిబ్బ’ అనే ఉద్దేశమూ నాకు లేదు.

ప్రకృతిలో... శరీరం లేని ఆత్మ, ఆత్మలేని శరీరం అస్తిత్వం లేనివి. ఆత్మా, శరీరమూ పరస్పరాశ్రితాలు! శరీరం లేనిదే ధర్మ సాధన సాధ్యం కాదు. ఆత్మ నివసించనిదే శరీరం మనజాలదు. కాబట్టి, రెండూ ముఖ్యమైనదే! శరీరమూ, ఆత్మా... అచ్చంగా భౌతిక, భావ వాదాల్లాంటివి. దేనికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో, ఎక్కడికి ఏది అవధో... నిర్ణయించుకోగలగటంలోనే జీవితపు నేర్పు ఉంది.

ఈ విషయం ఇక్కడితో వదిలేసి, మళ్ళీ కామన్వెల్త్ ప్రారంభాని కొస్తే... మొత్తంగా ఆ ప్రదర్శనలో, భారతీయ ఆత్మ.... ‘భిన్నత్వంలో ఏకత్వమై’ అంబరమంత అపరిమిత పరిమాణంలో వెలుగులు చిమ్మింది - అన్నది మాత్రం పరమ సత్యం.

ఎంత అవినీతి జరిగిందో... అది మన్మోహన్, సోనియా, కల్మాడీ, షీలా దీక్షిత్, జైపాల్ రెడ్డి గట్రాలకి తెలియాలి. "ఎంత అభాసుపాలు చేస్తారో ఏమో" అనుకునే పరిస్థితుల్లో.... కామెన్వెల్త్ ఆరంభం మాత్రం, నిజంగా అదరగొట్టింది, అద్భుతమనిపించింది.



ఆతిథేయ దేశం, ఇండియా జట్లు... 70 జట్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జెండా మోస్తున్న అభినవ్ బింద్రా, సుశీల్, విజయేందర్‌ల చిరునవ్వులో... వందకోట్లపైగా ఉన్న భారతీయుల పెదవుల మెరుపు కలగలిసి పోయింది. ఆహుతులంతా కూడా, చప్పట్లు చరుస్తూ ఆహ్వానించిన తీరు బాగుంది. గృహస్తూ బాగున్నాడు, అతిధులూ బాగున్నారు అన్నట్లుగా!

చివరికి పాకిస్తాన్ జట్టు వచ్చినప్పుడు కూడా... ఈ గడ్డ మీద ఇంత నెత్తురు చిమ్మించినా, నిన్నమొన్ననే కసబ్ జైలు సిబ్బందిని కొట్టినా, ‘భారత్ మాత్రం పెద్దమనస్సునీ హుందాతనాన్నీ చాటుకుందా?’ అన్నట్లు, ఆహాద్లంగా ఆహ్వానించారు. ‘శతృవునైనా ఆదరించగలగటం భారతీయులకే చెల్లు’ అన్నట్లుగా! 



అయితే ఇందులో మరకలా మిగిలిన కొనమెరుపు ఏమిటంటే - ఏఆర్ రెహమాన్ పాట, ప్రదర్శన! ‘యారో... ఇండియా బులాలియా’ పాటలో బులా....దీర్ఘం, సా...గి, రసస్ఫూర్తి రాహిత్యంతో ఉండగా... ‘జయహో’ అంటూ అతడు ముగింపుగా పాడిన పాటలో, అతడి కిరువైపులా నాట్యం చేసిన అమ్మాయిలు... ‘ఈనాడు పత్రిక’ శుక్రవారం ప్రచురించే బ్రిసా చీరలు ధరించి అర్ధనగ్నంగా ఫోటోలకు ఫోజులిచ్చే మోడళ్ళలా ఉన్నారు. పమిటలేని చీరవంటి వస్త్రధారణతో, వక్షస్థలం మీద పూసల కుట్టిన లోదుస్తులు (బ్రాసియర్లు) ధరించి, శరీరాన్ని ఊపుతూ చేసిన ఆధునిక నాట్యం!

సింబాలిక్‌గా... "అదిగో అంత ఘన వారసత్వ సంపద వంటి మహోన్నత సంస్కృతి నుండి... ఇదిగో ఇంత నాసి పరిమాణానికి మేం ప్రయాణించాం" అని చెప్పకనే చెప్పినట్లుంది!

"దీనినే... ‘ప్రాచీన సంస్కృతీ సాంప్రదాయాలతో బాటు, మేం ఆధునికతనీ అందుకోగలం’ అని చెప్పినట్లుంది కదా...." అని సరిపెట్టుకుందామన్నా...

అర్దనగ్నంగానో, పూర్తి నగ్నంగానో, శరీరాన్ని ప్రదర్శించేదీ... ఆధునిక సంస్కృతి అయితే, ఆ ఆధునిక సంస్కృతి భారతీయులకి వద్దనుకోవటం ఉత్తమం!

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu