నేను నా స్నేహితురాలి ఇంట్లో బస చేస్తున్నప్పుడు, ఓ రోజు నేను ‘సి.ఎం. నేదురమల్లి జనార్ధనరెడ్డి, ఈనాడు రామోజీరావుల మధ్య సంబంధం ఎలాంటిదని’ అడిగాను. ఆమె “మా ఛైర్మన్ [అంటే రామోజీరావు], సోమాజీ గూడలోని మా ఆఫీసు టెర్రస్ పైనున్న గెస్ట్ సూట్ లో జనార్ధన రెడ్డికి పర్సనల్ గా పార్టీ ఇచ్చాడు. సాధారణంగా అంతదాకా ఎవర్నీ రానివ్వడు తెలుసా! అంతగా ఎవర్నీ ట్రీట్ చెయ్యడు. మామూలుగా ఫారెన్ విజిటర్లు మా ఆఫీసుకి వచ్చినప్పుడు, వాళ్ళని మాత్రమే ఆపై అంతస్థులోని అతిధి గృహానికి తీసికెళతాడు. అలాంటిది జనార్ధన రెడ్డికి అంతటి ట్రీట్ ఇచ్చాడు. నిజానికి మర్రి చెన్నారెడ్డి దిగిపోయి జనార్ధన రెడ్డి సి.ఎం. సీటెక్కినప్పుడు అతడి మెడలో పడిన తొలిదండ ఎవరిదో తెలుసా! అది మా ఛైర్మన్ పంపిన పూలదండ” అంది.

నేను “ఏమిటీ! మీ ఆఫీసుకి ఫారిన్ విజిటర్లు వస్తారా?" అన్నాను. ఆమె “అవును. నీకో విషయం తెలుసా! మా ఛైర్మన్ ఫారిన్ విజిటర్లు వచ్చినప్పుడు ఆఫీసు బిల్డింగ్ దిగివెళ్ళి, పోర్టీకోలో వాళ్ళని దగ్గరుండి కారెక్కించి, డోర్ వేసి మరీ సెండాఫ్ ఇస్తాడు” అంది.

"అవునా! ఎందుకలా!” అన్నాను.

ఆమె కొనసాగిస్తూ “నీకింకో విషయం తెలియదు. మా ఛైర్మన్ కి విదేశాల్లో శిక్షణ పొందిన స్వంత అంగరక్షకులున్నారు తెలుసా?" అంది.

నేను మరింత అయోమయంలో పడ్డాను. “ఎందుకు?" అన్నాను.

ఆమె నవ్వేసి “పిచ్చి మొహమా! నువ్వు పెద్దవ్యాపారం చేస్తున్నావు గానీ నీకసలు ప్రపంచఙ్ఞానం లేదే! నడుస్తోన్న భాగోతాలు తెలీకుండా ఏం బిజినెస్ చేస్తావు నీతలకాయ్!” అంది.

ఇలాంటి ప్రతి సంభాషణలని తిరిగి తిరిగి గుర్తు తెచ్చుకున్నాను.

"ఇంతకీ మీ ఛైర్మన్ ఎలాంటి వాడే?" అనడిగాను నాస్నేహితురాలిని. “పెద్ద పర్వరిస్టే! సాగుతుంది అనుకుంటే ఎన్ని విన్యాసాలైనా చేస్తాడు” అంది. నాకు పెద్దగా అర్ధం కాలేదు. అయినా మౌనంగా విని ఊరుకున్నాను.

మరో రోజు నా స్నేహితురాలినుండి కూపీలాగుతూ “పీ.వి.నరసింహారావు పరిస్థితి ఏమిటి? మీ ఛైర్మన్ ఏమంటాడు ఇతడి గురించి” అనడిగాను.

ఆమె వెంటనే జవాబివ్వలేదు. కొద్దిసేపటి మౌనం తర్వాత “గతంలో రాష్ట్రంలోని రెడ్డికులం వాళ్ళు పీ.వి.నరసింహారావుని తెగ వేధించారే! ప్రస్తుతం నేదురుమల్లి జనార్ధనరెడ్డి, అప్పటి రెడ్డి కులపోళ్ళని తీసుకెళ్ళి పీ.వి.నరసింహారావు కాళ్ళమీద పడేస్తున్నాడు. ఆవిధంగా ఆ ముసలి బ్రాహ్మణ నాయకుడి ఈగోని తృప్తిపరచాలని ప్రయత్నం అనుకుంటా” అంది. తర్వాతి సంభాషణని తుంచేసింది. బహుశః అప్పుడే నేను ఆమెకి పట్టుబడిపోయినట్లున్నాను. విషయమేమిటంటే నా స్నేహితురాలైన ఈ అమ్మాయి కూడా అదే కులానికి చెందినదే.

ఈ సంభాషణ తర్వాత ఒకటి రెండురోజులకే ఆమె నన్ను వాళ్ళ ఇంటినుండి బయటికి పొమ్మంది.

వీటిల్లో కొన్ని వ్రాసుకొని మరీ గుర్తు పెట్టుకున్నాను. పరిశీలన కొనసాగించాను. ఆ పరిశీలనలో భాగంగా ఈనాడు వార్తల్నీ, ఇతర పత్రికల వ్రాతల్నీ, డి.డి.వార్తల్ని పోల్చిచూడటం ప్రారంభంచాను. నా స్నేహితురాలు చెప్పినట్లుగానే నేదురమల్లి జనార్ధనరెడ్డి, పీ.వి.నరసింహారావు ఆహాన్ని తృప్తిపరిచేందుకో లేక రెచ్చగొట్టేందుకో ప్రయత్నిస్తున్నది నిజమే అన్పించింది. అయితే పీ.వి.నరసింహారావులో నాకు ఆహం తాలూకూ అంశాలు కనబడలేదు.

అదీగాక, 1991 లో ప్రధానిగా సీటు ఎక్కేముందు, ఆ పదవిని అంగీకరిస్తూ పీ.వి.నరసింహారావు “నాకిప్పుడు 71 ఏళ్ళు. భగవంతుడు ఇప్పుడెందుకు ఈ అవకాశం నాకు ఇచ్చాడో తెలియదు. నాకు చేతనైనంతవరకూ దేశానికి మేలు చెయ్యటానికి ప్రయత్నిస్తాను” అన్న మాటలు నేను నమ్మాను. నిజానికి పార్టీలో పీ.వి. కంటే సీనియర్ గా ప్రణబ్ ముఖర్జీ ఉన్నాడు. కానీ క్రితంలో రాజీవ్ గాంధీతో విభేదించి పశ్చిమ బెంగాల్ లో వేరుకుంపటి పెట్టుకొని, తరువాత మళ్ళీ పార్టీలోకి వచ్చాడు. సాంకేతికంగా పార్టీలోకి మళ్ళీ వచ్చినప్పుడునుండి సీనియారిటీ లెక్కిస్తారు. ఆ విధంగా పీ.వి.నరసింహారావు అభ్యర్ధిత్వం ఖరారు జరిగి, సీటు ఎక్కటం జరిగింది. ఇప్పటి విదేశాంగ మంత్రి ప్రణబ్, సోనియాగాంధీకి, పాకిస్తాన్ కీ, ఆమెరికాకి ఎంత అనుకూలమో ఇప్పడందరికీ తెలిసిన విషయమే.

అప్పటికిదంతా తెలియక పోయినా, నాకు పీ.వి.నరసింహారావులో చెడుగానీ, నెగిటివ్ గానీ, కుట్రకూ, కుట్రదారులకూ అనుకూలత గానీ కనబడలేదు. అప్పట్లో నాకు ‘భగవద్గీత పుస్తకాన్ని చేతుల్లోకి తీసుకొని, కళ్ళు మూసుకొని, భగవధ్యానం చేసి పుస్తకం తెరవటం, ఏ శ్లోకం కళ్ళముందు కన్పిస్తే ఆ శ్లోకభావాన్ని భగవంతుడు నాకిస్తున్న మార్గదర్శకంగా గ్రహించటం’ అన్న అలవాటు ఉండేది. ఇది నేను బాపూజీ వ్రాతల నుండి గ్రహించింది. ఇది డిగ్రీ చదివే రోజుల నుండి నాకున్న అలవాటు. చాలా సందర్భాలలో, చాలా ప్రమాదాల నుండి ఇది నన్ను రక్షించింది. ఇప్పడది మానేసి చాలా సంవత్సరాలే అయ్యింది లెండి. అప్పట్లో గీత ప్రాక్టీస్ చెయ్యటం అంటే అంతే అనుకునేదాన్ని. ఇప్పుడు బుక్ తెరవకుండానే ఆ సందర్భానికి తగిన శ్లోకం మనస్సులో గుర్తు కొస్తుంటుంది.

ఆ రోజుల్లో, అలా ఎప్పుడు గీత తెరిచినా నాకళ్ళముందు ’కర్మణ్యేవాధికరస్తే’ అన్న శ్లోకం గానీ ’హతోవా ప్రాప్యసే స్వర్గం’ అన్న శ్లోకం గానీ నాకు కనబడేవి.


శ్లోకం:
కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన
మా కర్మఫల హేతుర్భూర్మాతే సంగో స్త్వ కర్మణి

భావం:
నువ్వు కర్మ చేయడానికి మాత్రమేగాని, ఆ కర్మఫలానికి అధికారివి కాదు. ప్రతిఫలాపేక్షతో కర్మలను చేయకు. అలాగని కర్మలు చేయడం మానకు.

శ్లోకం:
హతోవా ప్రాప్స్యసే స్వర్గం జిత్వావా భోక్ష్యసే మహీం
తస్మా దుత్తిష్ఠ కౌన్తేయ యుద్దాయ కృతనిశ్చయః

భావం:
అర్జునా! యుద్ధంలో మరణిస్తే స్వర్గం పొందుతావు. గెలిస్తే యీ భూలోక రాజ్యాన్ని అనుభవిస్తావు. కనుక, యుద్ధం చేయాలనే దృఢ నిశ్చయం గలవాడవై, లే.

దాంతో చాలా తర్జన భర్జనలు పడ్డాను. ఎడతెగని ఆలోచనల్లో మునిగేదాన్ని. నాలోనేను ‘పీ.వి.నరసింహారావు ఏం చేస్తాడన్నది నాకు అనవసరం. ఎందుకంటే అది ఫలితం గనుక. నేను చెయ్యవలసిన పని ఏమిటంటే రామోజీరావు ఇండియాకి వ్యతిరేకంగా చేస్తున్న పనుల గురించి, రాజీవ్ గాంధీ హత్య గురించి ప్రధానికి ఫిర్యాదు చెయ్యటమే. ఒకవేళ ఇలా ఫిర్యాదు చేయటంలో నాకు గానీ, నా కుటుంబసభ్యులకి గానీ, నా స్నేహితురాలికి గాని కీడు జరిగితే జరగనీ! ఒకవేళ ఛస్తే మాత్రమేమిటి? ఏదోక రోజు ఎలాగూ చచ్చేవాళ్ళమే గదా! వేలాది మంది అమాయకులు రోజూ మతఘర్షణల్లోనూ, టెర్రరిజంతోనూ, పంజాబ్ లోనూ, ఘట్ కేసర్ రైలు కంపార్టమెంట్లు తగలబెట్టటం లాంటి సంఘటనల్లోనూ చచ్చిపోతున్నారు. వందలాది మంది సైనికులు దేశపు సరిహద్దుల్లో చచ్చిపోతూనే ఉన్నారు. ఇంత ద్రోహం, కుట్రా జరుగుతున్నాయని తెలిసినప్పుడు ప్రధానికి చెప్పడం, పౌరులుగా మన బాధ్యత’ అనుకున్నాను.

నా స్నేహితురాలు ఇంట్లో రాజీవ్ గాంధీ కలర్ ఫోటో చాలా పెద్దది, అందమైనది ఉంది. దాన్నీ ఆమె లోపలి బెడ్ రూమ్ లో పెట్టుకుంది. ఓ రోజు నేను ఆమెని “ఈ ఫోటో ఇంత బాగుంది కదా! ఈ లోపల ఎందుకు? డ్రాయింగ్ రూమ్ లో పెట్టచ్చు కదా!” అన్నాను. ఒక్కసారిగా ఆమెలో విపరీతమైన భయం కన్పించింది. అది చూసి నాకు ఆశ్చర్యం వేసింది. అలాగే ఆమె ‘ఒక్కరోజు’ ఆఫీసుకి సెలవు పెట్టాలన్నా భయపడేది. “దాదాపు మంచమ్మీంచి దిగలేని స్థితిలో ఉంటే తప్ప సెలవు పెట్టకూడదు. ఒకవేళ మనం సెలవు పెట్టినా ఏదో వంకతో మన కొలీగ్స్ ఎవరో ఒకరు చూచిపోవడానికి, మన ఇంటికి వస్తారు. పైకి ఏదో వంక చెబుతారు గానీ నిజంగా మనం ఎందుకు సెలవు పెట్టామో తెలుసుకునేందుకే వస్తారు. మా మేనేజ్ మెంట్ అలా నిఘావేస్తుంది మామీద” అనేది. నేను దీని మీద నొక్కి అడిగినప్పుడు “పిచ్చిమొహమా! నీకు మా ఆఫీసు గురించి తెలియదు పోవే! విఙ్ఞాన్ రత్తయ్య ‘సుప్రభాతం’ అన్న పక్షపత్రిక పెట్టాడు గుర్తుందా? అతణ్ణి మా ఆఫీసుకి పిలిపించి వార్నింగ్ ఇచ్చాడు మా ఛైర్మన్ తెలుసా! దాసరి నారాయణ రావు ఎడిటర్ గా ‘ఉదయం’ పత్రిక మొదలైనప్పుడు మా ఆఫీసు నుండి కొందరు ఉదయంలో చేరారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఘోరంగా ఉంది” అంది.

నిజానికి నా స్నేహితురాలిలో 1991 కు ముందు ఇంతభయం ఉండేది కాదు. 1990 లో తన వివాహానికి ముందు ఆమెని ఈనాడు ఆఫీసుకి నాలుగురోజులు సెలవుపెట్టించి, మాఊరు తీసుకువెళ్ళాను. ఉండవల్లి గుహలూ, మంగళగిరి, అమరావతీ, ఇంద్రకీలాద్రి వంటి చోట్లన్నీ తిప్పాను. మరో రెండు రోజులు సెలవు పొడిగించమని ఫోనులోనే అడిగి సెలవు పొందింది, ఎంతో మామూలుగా, నిర్భీతిగా. అప్పుడే తన గత కొలిగ్స్ తర్వాత ఉదయంలో చేరిన వారినీ పలకరించి వచ్చాం. అప్పుడేమీ ఇంత భయానక స్థితి లేదు. నాకు ఎందుకో ఆమె భయంలో abnormality కన్పించింది.

ఓరోజు మాటల్లో లోపలిగదిలోని రాజీవ్ గాంధీ ఫోటో చూస్తు [2 ½ X 4 అడుగుల సైజు ఉండేది] నా స్నేహితురాలితో రాజీవ్ గాంధీ గురించి సంభాషణ మొదలుపెట్టాను. ఆమె ఆవేశంగా మాట్లాడుతూ “పాపం, అమాయకుడే రాజీవ్ గాంధీ! అన్యాయంగా చంపేసారే! నీకో విషయం తెలుసా? రాజీవ్ గాంధీ హత్యజరిగినప్పుడు మా ఛైర్మన్ ‘అలా జరిగి ఉండకూడదే’ అన్నాడు, చాలా తాపీగా.” అంది.

"అయితే ఏమిటీ?" అన్నాను.

"అదేకాదే, ఎవరయినా విషయాన్ని మొదటిసారిగా వినినప్పుడు అంతనార్మల్ గా ఉండగలరా? అప్పట్లో మా ఆఫీసులో అందరు దీని గురించి గుసగుసలు పోయారు” అంది.

మరో సందర్భంలో “పిచ్చిదానా! నీకు మా ఛైర్మన్ గురించి తెలియదే! కన్నతల్లి చచ్చిపోతే శ్మశానం నుండి డైరెక్టుగా ఆఫీసుకి వచ్చేసిన వాడు మా ఛైర్మన్. అదే కోడలి డెలివరీ అప్పుడు, ముందునుండీ డాక్టర్ల కేర్ లో ఉంచినా, తల్లిపేగు మెడకి పడి చచ్చిపోయిన బిడ్డపుట్టాడు. మా ఛైర్మన్ రెండురోజులు గదిలోంచి బయటకు రాలేదు. తెలుసా!” అంది.

‘అందులో వింతేమిటి? అతడికి కన్నతల్లి మీదకంటే పుట్టబోయే మనవడి మీద మరింత ప్రేమ ఉండొచ్చుకదా!’ అనుకున్నాను. అసలు అతడి తల్లి తండ్రులెవరో, అతడి నేపధ్యం ఏమిటో అప్పటికీ ఎవరికీ తెలియదు. నాకూ తెలియదు. అతడి పుట్టుపూర్వోత్తరాలు అడగాలని పెద్దగా అన్పించలేదు. మొదట పచ్చళ్ళవ్యాపారి అని మాత్రమే తెలుసు. అప్పటికి అతడి చిన్న కుమారుడు సుమన్ విదేశాల్లో చదువుకుంటున్నాడు. పెద్దకుమారుడు కిరణ్ తండ్రికి చేదోడువాదోడుగా ఉంటూ పేపరు నడపడం నేర్చుకుంటున్నాడు. “కిరణ్ కి తర్భీదు ఇస్తూ మాఛైర్మన్ ‘మనకి ప్రాణం పేపరే. దాన్ని జాగ్రత్తగా నడపుకోవాలి’ అంటూ ఉంటాడు. నష్టాల్లో ఉన్న పేపరు మా ఛైర్మన్ కి ప్రాణం తెలుసా” అన్నది నా స్నేహితురాలు.

ఇలా ఆమె చెప్పిన విషయాల్లో కొన్నింటికి, నాకు అప్పట్లో పొంతన కన్పించలేదు. అదే ఆమెతో అంటూ “పత్రిక ఇప్పుడు నష్టాల్లో ఉన్నా, భవిష్యత్తులో లాభాలు తెచ్చిపెడుతుందని, జాగ్రత్తగా చూస్కోవాలని అనుండవచ్చు కదా? అలాగే కన్నతల్లి పోయినా తట్టుకోగలిగి ఉండొచ్చు గదా!” అన్నాను.

నా స్నేహితురాలు నా వైపో సారి సాభిప్రాయంగా చూసి, సంభాషణ దారి మళ్ళించింది. ఆ రోజుల్లో ఆమె చెప్పిన చాలా విషయాలు నేను మొదట్లో పట్టించుకోలేదు. కొన్ని అసలు పొంతన లేనివిగా, అసంబద్దంగా ఉన్నట్లనిపించింది. ‘ఆమె అరగొరగా చెప్పటం వలన అలా అన్పించి ఉండవచ్చు’ అని తర్వాత అనుకున్నాను.

అప్పటికి సోనియా గాంధీ గురించి నాకు ఏమీ తెలియదు. ఏవిధమైన సందేహము లేదు. కుతంత్రాల గురించి నాకు వూహామాత్రం కూడా తెలియదు. నేరాలు – ఘోరాలు చూపించే ప్రైవేట్ టివీ ఛానెళ్ళు అప్పటికి లేవు. నేరప్రపంచపు వార్తలు నేనెక్కువుగా చదవలేదు. ఈనాడు ఆదివారం అనుబంధంలో అజయ్ శాంతి ‘నమ్మలేని నిజాలు’ లో అలాంటి క్రైమ్ స్టోరిస్ చదివినా ’అవి ఎక్కడో పాశ్చాత్యదేశాల్లో జరిగిన సంఘటనలు కదా’ అనుకునేదాన్ని.

నేను సేకరించిన ఈ మొత్తం సమాచారం మా నాన్నగారు[కాటా వెంకట రెడ్డిగారు]] ముందుంచాను. “ఢిల్లీ వెళ్ళి ప్రధాన మంత్రి పీ.వి.నరసింహారావుకి రామోజీరావు గురించి, అతడి కుట్రల గురించి ఫిర్యాదు చేయనా? లేకపోతే మనకెందుకొచ్చిన గొడవ అనుకొని మన వ్యాపారం మనం చేసుకుందామా? చెప్పండి” అన్నాను. వ్యాపార విషయాలైతే నేనే నిర్ణయం తీసుకొనేదాన్ని. ఇది ప్రాణాలతో వ్యవహారం. అందుకే మా ఇంటిలోని అందరి అనుమతి తీసుకున్నాను. మా నాన్నగారు “కాకిలా కలకాలం బ్రతికే కంటే హంసలా అరఘడియ బ్రతికినా చాలు అంటారు పెద్దవాళ్ళు. ఏదైతే అదయ్యింది. ముందుకే వెళ్ళు తల్లీ. ప్రాణాలు పోయినా ఫర్వాలేదు. అంతకంటే పోయేదేం లేదు” అన్నారు.

మా చెల్లి “మన కెందుకొచ్చిన గొడవ అక్కా. పెద్దోళ్ళ వ్యవహారం కదా!” అంది. [ఆమె రెండుసంవత్సరాల క్రితం హత్యో, ఆత్మహత్యో తెలియదు గాని బలవన్మరణానికి గురైంది]. మా అమ్మ “మీరంతా ఏమంటే నేనూ అంతే. అంతకంటే నాకేం తెలుసు?" అంది. మా తమ్ముళ్ళిద్దరూ “వెనక్కి తగ్గదే లేదు” అన్నారు. ఇక నేను వెనుదిరిగి చూడలేదు.

ఇక ఈ పోరాటంలో నేను ఇద్దరు వ్యక్తులకి ఋణపడి ఉన్నాను. ఒకరు మా తండ్రిగారు వెంకట రెడ్డిగారు. ఈ పోరాట ప్రారంభంలో నన్ను వెన్నుతట్టి ప్రోత్సహించిందీ, ఆశీర్వదించిందీ ఆయనే. ఇక రెండవ వ్యక్తి నా భర్త లెనిన్. తనూ నాలాంటివాడే. వివాహానికి పూర్వం తను నా కుటుంబమిత్రుడు. ఈ పోరాటంలో నేను ప్రాణాలు పోగొట్టుకుంటే, అందుకు తానూకూడా సిద్దమే అన్నవ్యక్తి. తనకీ నాలాగే ఈ దేశమంటే ఇష్టం. ఎప్పుడూ నన్ను ఏ విషయంలోనూ అభ్యంతర పెట్టలేదు. ఒక్కోసారి తను నా మార్గదర్శి, సహచరుడూ, అనుచరుడూ. నిజానికి బయటికి కనబడే కలం నాదైతే, నావెనుక కనబడని నా బలం తను. మాకు మా చుట్టూ ప్రపంచం మొత్తంతో ఘర్షణ ఉండనీయండి గాక, ఒక్కసారి ఇంటి తలుపులు మూసుకుంటే, చెట్టుతొర్రలాంటి మాగూట్లో మేమిద్దరం, మాకు ఒక్కర్తి. నవ్వులూ, జోకులూ, కథలూ, కబుర్లూ. నిజానికి నా భర్త, నా కుమార్తె ఫణి గీతా ప్రియదర్శిని, నేను సహచర సైనికులుగా భావిస్తాం. ’భగవంతుడి చేతిలో పనిముట్టు మనం. అంతకంటే సీన్ ఏముంది మనకు?’ అన్పిస్తుంది నాకు.

1992 లో నేదురమల్లి జనార్ధన రెడ్డి ఇంటికీ, ఆఫీసుకీ నా బ్యాటరీ ఇండస్ట్రీకి APS RTC నుండి ఆర్డర్ ఇప్పించమని అడగటానికి రెండుమూడుసార్లు సందర్శించాను. [ఆ ప్రయత్నం ఫలించి తదుపరి ఆర్డర్ వచ్చిందనుకొండి. ఈ సందర్భంలోనే RTC లో ఒక Executive Director మీద నేను Complaint పెట్టింది] ఈ రెండు మూడు సందర్భాల్లో కొన్ని సంఘటనల్ని దగ్గరనుండి పరిశీలించాను.

ఒకసారి నేను నేదురమల్లి జనార్ధన రెడ్డి ఇంటి దగ్గర, ఇతర సందర్శకులతో కలిసి వేచి ఉండగా, ఆంధ్రజ్యోతి అప్పటి యాజమాన్యం [పేరు ఏదో ప్రసాద్] ముఖ్యమంత్రి నేదురమల్లి ఇంటికి వచ్చాడు. ముఖ్యమంత్రే ఫోన్ చేసి స్వయంగా పిలిస్తే వచ్చాడట. అతడు రాగానే సి.ఎం. సెక్రటరీ రిసీవ్ చేసుకొని కూర్చోపెట్టి లోపలికెళ్ళి సి.ఎం.కి చెప్పివచ్చాడు. ఓ అయిదు నిముషాలు విజిటర్స్ లాంజ్ లో కూర్చున్న అతడు చిరాగ్గా “ఎంత సేపు వెయిట్ చెయ్యాలయ్యా! మాకేం పని లేదనుకున్నారా? పిలిచి కూర్చోబెడుతున్నారు. సరే వచ్చి వెళ్ళానని చెప్పండి మీ సి.ఎం.కి” అని లేచాడు. వెంటనే సీ.ఎం. పర్సనల్ సెక్రటరీ [ఇతడు సి.ఎం.కి ప్రైవేట్ సెక్రటరీ. నడివయస్సు దాటిన ముస్లింవ్యక్తి.] హడావుడిగా వచ్చి అతణ్ణి బ్రతిమాలి కూర్చోబెట్టి, లోపలికి వెళ్ళి, నేదురమల్లితో చెప్పివచ్చాడు. మరుక్షణం సి.ఎం. బయటికి వచ్చి అతణ్ణి భుజం చుట్టూ చెయ్యివేసి లోపలికి తీస్కెళ్ళుతూ “అంత కోపమైతే ఎట్లా!” అంటూ, ఇంక ఏవో మాట్లాడుతూ లోపలికి తీసికెళ్ళాడు. సదరు ఆంధ్రజ్యోతి యజమాని మాత్రం కాస్త పెడముఖం గానే లోనికెళ్ళాడు. ఆ తర్వాత సి.ఎం. మిగిలిన విజిటర్స్ ని కలవకుండానే బయటికి వెళ్ళిపోవటంతో నాలాగే అందరం నిరాశగా వెనుదిరిగాం. ఆరోజు నాస్నేహితురాలికి ఇదంతా చెప్పాను. ఆమె ఆంధ్రజ్యోతికీ, ఈనాడుకీ మధ్య కొంత రగడ ఉందనీ, ప్రసాద్ పెద్ద ఇండస్టిలియస్ట్ అనీ చెప్పింది. పత్రికల మధ్య పోటీ రీత్యా ఆంధ్రజ్యోతి, ఈనాడు మధ్య గొడవలుండటం సహజమే కదా అనుకున్నాను. పెద్దగా పట్టించుకోలేదు. అయితే తర్వాత రెండు పత్రికల్లోనూ వార్తల ప్రచురణలో తేడాలుండటం గమనించాను. 1992 తర్వాత సంవత్సరాల్లో ఆంధ్రజ్యోతి మూతపడటం జరిగింది. మొన్నీమధ్య ఆంధ్రజ్యోతి ఇప్పుటి మేనేజింగ్ డైరెక్టర్ రాధకృష్ణ ప్రత్యేక కథనాలు చదివాను.

అలాగే, మరో రోజు ముఖ్యమంత్రి ఇంటికి వెళ్ళి నప్పుడు, మరో సంఘటన నాదృష్టికి వచ్చింది. అప్పటికీ విజిటర్స్ లాంజ్ లో పది, పదిహేను మందిమి వేచి ఉన్నాము. అంతలో ఒక స్త్రీ మరికొందరు బృందంతో కలిసి వచ్చింది. ఆమె అలంకరణ అతిగా ఉంది. ప్రవర్తన అతిశయంగా ఉంది. చూస్తే వారంతా సి.ఎం.ని ఏదో favor అడగటానికి వచ్చినట్లుంది. వారిని lead చేస్తున్న ఆమె తీరు దూకుడుగా ఉంది. ఆమె దాదాపు ముఖ్యమంత్రి వ్యక్తిగత సిబ్బందిని ఆఙ్ఞాపిస్తున్నట్లుగా [ఆర్డర్ చేస్తున్నట్లుగా] తనని సి.ఎం. రూమ్ లోకి allow చెయ్యమంది. సి.ఎం. వ్యక్తిగత కార్యదర్శి కాస్త పెద్దవయస్సువాడు. అతడదేమీ పట్టించుకోలేదు. మిగిలిన సందర్శకుల్ని [మమ్మల్ని] చూపిస్తూ లాంజ్ లో కూర్చోవాల్సిందిగా సూచించాడు. ఆమె అతడివైపు నిర్లక్యపు చూపు విసిరి, తన విజిటర్స్ స్లిప్ మీద ఏదో నోట్ వ్రాసి దాదాపు command చేస్తున్న గొంతుతో దాన్ని సి.ఎం.కి ఇమ్మన్నది. అతడా స్లిప్పు తీసుకొని తన డెస్కు దగ్గరికి వెళ్ళాడు. నేను అతడి డెస్కుకి దగ్గరగా ఉన్న కుర్చీ లో కూర్చోని ఉన్నాను. వారి మాటలునాకు స్పష్టంగా వినపడుతున్నాయి. అతడు ప్రక్కనున్న అటెండర్ తో “చూడపోతే ఈవిడగారు ఈస్లిప్పు చూడగానే సి.ఎం. బయటికొచ్చి తనని రిసీవ్ చేసుకుంటాడనుకుంటన్నట్టుంది. రాత్రి దర్శించుకుంది కదా అందుకు. ఈమె లాంటి వాళ్ళు బొచ్చెడు మంది అతడికి అని తెలియదు, పాపం” అన్నాడు. ఎంతో వ్యంగ్యం అతడి గొంతులో. [భావం ఇది. భాష ఇంకొంచెం ఘాటుగా ఉంది.] వెంటనే వాళ్ళంతా గట్టిగా నవ్వుకున్నారు.

అప్పటికే నేదురమల్లి జనార్ధన రెడ్డి గురించి, అతడి దురలవాట్ల గురించీ కొంత వినే ఉన్నాను. అయినా ప్రత్యక్షంగా అలాంటి సంఘటన చూసేసరికి చాలా ఆశ్చర్యపోయాను నేను. రామోజీరావుని విశ్లేషించుకోవడానికి ఈ సంఘటన నాకు చాలా దోహదపడింది. ‘రామోజీరావు వ్రాతల్లో ఎన్నో విలువలూ, నీతులూ చెబుతాడు. అదే కలంతో నేదురమల్లి జనార్ధన రెడ్డికి ఎంతో ఇమేజ్, కవరేజ్ ఇస్తున్నాడు. ఈ జనార్ధన రెడ్డి చూస్తే ఇంత అవినీతితో ఉన్నాడు. అంటే ఖచ్చితంగా రామోజీరావు వ్రాసేది నీతులు, తిసేది గోతులు అన్నమాట’ అని నిర్దారించుకున్నాను.

అప్పటికి సోనియా గాంధీని సందేహించలేదు నేను. కేవలం వీపిసింగ్ నీ, నేదురమల్లి జనార్ధన రెడ్దినీ, కరుణానిధినీ, రామోజీరావులని కుట్రదారులుగానూ, రాజీవ్ గాంధీ హత్యకు పధకం పన్ని, అమలుచేసిన వారిగానూ సందేహించాను. వీపిసింగ్ తన హయంలో రాజీవ్ గాంధీకి SPG రక్షణ రద్దుచేసాడు. కరుణా నిధికి అప్పటికే ఎల్.టి.టి.ఇ.కి సానుభూతి పరుడుగా, సహాయకారిగా పేరుండటం నాకు తెలుసు. వీళ్ళీద్దరూ స్థానిక తెలుగు పత్రిక ఈనాడు రామోజీరావు చుట్టు తిరుగుతారు. ఇక నేదురమల్లి జనార్ధన రెడ్డికి, రామోజీరావుకీ గల రహస్య సన్నిహిత సంబంధాలు నాకు కొంత అర్ధమయ్యాయి. 1991, మే లో శ్రీ పెరంబూదర్ లో రాజీవ్ గాంధీ హత్య జరిగినప్పుడు అతడి భౌతిక కాయాన్ని ఢిల్లీకి తీసుకెళ్ళేందుకు ప్రత్యేక విమానం వచ్చినప్పుడు, నేదురమల్లి జనార్ధన రెడ్డి activeness ని టివీ న్యూస్ వీడియో క్లిప్పింగ్స్ లో చూశాను. రాజీవ్ భౌతికదేహాన్ని విమానంలో ఉంచేటందుకు నేదురుమల్లి స్వయంగా సాయం పట్టాడు.

అప్పటికి నాకు గూఢచర్యం గురించి తెలీదు, గూఢచార సంస్థల గురించి తెలియదు, కనీసం భారతంలోని కణికనీతి, నారద నీతి కూడా కూలంకషంగా తెలియదు. భారతం చదివినా కధమీది దృష్టి ఎక్కువగాని ఈ కణికనీతి, నారద నీతి, విదురనీతి వంటి వాటిని పట్టించుకోలేదు. అర్ధమూ చేసుకోలేదు. నాకు చేతనైనట్లు నాకు తెలిసిన విషయాలనీ, నా పరిశీలననీ విశ్లేషించుకున్నాను. ఇక అండగా భగవద్గీత ఉండనే ఉంది. వీ.పి.సింగ్, కరుణానిధి, నేదురమల్లిజనార్ధన రెడ్డి, రామోజీరావులని కలిపి ’దుష్టచతుష్టయం’గా నిర్ధారించుకున్నాను. మహా భారతంలోని దుష్ట చతుష్టయం వంటివారు అని అలా పోల్చుకున్నాను. సి.ఐ.ఏ., ఐ.ఎస్.ఐ., ల వంటి వాటి గురించి తెలియనందున అసలీ కుట్ర రూపం ఏమిటో, తీరు ఏమిటో, అది ఎంత పెద్దదో నాకప్పటికి తెలియదు. చిన్నప్పుడు సాంఘిక శాస్త్రంలో చదువుకున్నట్లు భారత ప్రభుత్వం కంటే ఇవన్నీ చిన్నవే అనుకున్నాను. ప్రభుత్వానికి తెలియదు గనుక వీళ్ళ ఆటలు సాగుతున్నాయి అనుకున్నాను.

అప్పటికి అందరు పత్రికా పాఠకుల్లాగే నేనూ, ఇందిరా గాంధీని, అమృతసర్ లోని సిక్కుల స్వర్ణదేవాలయ మ్మీద ఆపరేషన్ బ్లూస్టార్ జరిపిందన్న కోపంతో సెక్యూరిటీ గార్డులు చంపారనే అనుకున్నాను. అలాగే రాజీవ్ గాంధీని శాంతిసేనను శ్రీలంక పంపినందుకు ప్రతీకారంగా ఎల్.టి.టి.ఇ. టెర్రరిస్టులు ధనూ, శివరాసన్, శుభ, మురగన్ వంటివారు చంపారని నమ్మాను.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

2 comments:

All your posts were so interested earlier. But this one particular one seems so baised.

1) Ramoji rao doesnt have special gaurds. I visited his office so many times. there is no gaurds who trained abroad OK.

2) He usually gives send off to all famous visitors not only for foreginers.

dhrruva garu,

I don't know when you visited Ramoji Rao's office. Moreover he had shifted to RFC from Somaji Guda's office since years back. Recently, in other papers, like Sakshi, Jyothi etc it was reffered about his personal security guards in the context of Ramoji Rao's vehicle made accident[hit somebody].

Any way I discussed about his position in 1992 and before 1992 in my above post.

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu