సోనియా గాంధీకి 1991 లో రాజీవ్ మరణించగానే AICC అధ్యక్షరాలిగా ఉండమని ఆనాటి సీనియర్లు అడిగారట. రాజీవ్ మరణం కారణంగా ఏర్పడిన సానుభూతి కారణమో, సెంట్ మెంటు కారణమో, లేక ఆనాడు కాంగ్రెస్ ఉన్న స్థితికి గాంధీ – నెహ్రు కుటుంబీకులు తప్ప ఇతరులు కాంగ్రెస్ ని కలిపి ఉంచలేరన్నది కారణమో, కావచ్చు. ఏది కారణమైనా అలాంటి ప్రతిపాదనే సరైనది కాదు. భారత దేశమేమైనా రాచరికమా, వారసత్వంగా సంక్రమించడానికి? రాజో రాణో మరణాంచగానే వారి వారసులకి అప్పగించినట్లు అప్పగించడానికి దేశమేమైనా కుటుంబ ఆస్థా లేక ఎస్టేటా?

1980 నుండి 1984 ల దాకా ఈనాడు రామోజీరావు, ఇందిరాగాంధీ – రాజీవ్ గాంధీల వారసత్వం కాంగ్రెస్ లోనూ, దేశంలోనూ చలామణి అవడాన్ని కఠోర పదజాలంతో దుయ్యబట్టాడు. మీడియాలో అత్యధిక భాగం అతణ్ణి అనుసరించింది. నిజానికి మీడియా వ్యక్తిగా, పత్రికాధిపతిగా అది అతడి బాధ్యత, అలా దుయ్యబట్టటం. అయితే 1984 డిసెంబరులో రాజీవ్ గాంధీ [ఇందిర మరణానంతర ఎన్నికల్లో] దేశప్రధానిగా ఎన్నుకోబడ్డాడు. ఎన్నికల్లో అత్యధిక సీట్లు కాంగ్రెస్ కి వచ్చాయి. ఇందిరా సానుభూతి ప్రభంజనంగా అది పేరుగాంచింది. దాంతో క్రమంగా వారసత్వపు వాదనలు మసకబారాయి. అయితే అప్పటి TDP అధినేత ఎన్.టి.ఆర్., అంతక్రితం వరకూ కాంగ్రెస్ మంత్రిగా ఉంటూ, పార్టీ ఆదేశిస్తే మామమీద పోటీ చేస్తానన్న చంద్రబాబు, తర్వాత తెదేపాలోకి మారి చక్రం తిప్పటం మొదలెట్టిన చంద్రబాబు మాత్రం రాజీవ్ గాంధీ వారసత్వం మీద అడపాదడపా విమర్శలు గుప్పిస్తూనే ఉండేవారు. 1991 లో కూడా సోనియాగాంధీ వారసత్వాన్ని వారంతా వ్యతిరేకించారు. కాకపోతే ఈసారి కొద్దిగా తక్కువ పరిమాణంలో! సరే ఎటూ ఈ ప్రతిపాదనని స్వల్పకాల వ్యవధిలోనే సోనియాగాంధీ ‘గంభీరంగా’ తిరస్కరించింది.

అయితే తదనంతర కాలంలో జరిగిన విచిత్రాల్లో ఒకటి ఏమిటంటే – వారసత్వాన్ని వ్యతిరేకించిన తెదేపా, కాంగ్రెసులు రెండూ కూడా పోటాపోటిగా కుటుంబవారసత్వాల్ని పాటించటం. పరిటాల రవి హత్య చేయబడితే అతడి భార్య పరిటాల సునీతకి టిక్కెటిచ్చి గెలిపించింది తెదేపా చంద్రబాబే. 1984 లో ఇందిరాగాంధీ మరణానంతరం పగ్గాలు చేపట్టిన రాజీవ్ గాంధీకి కనీసం నాలుగేళ్ళ ఎం.పి.గా పనిచేసిన అనుభవమన్నా ఉంది. అదే పరిటాల సునీత వంటి వారైతే అంతకు క్రితం గడపదాటని ఇల్లాళ్ళే. రాజకీయాల్లో అనుభవం, అవగాహన, ఏదీ లేనివాళ్ళు. అలాంటప్పడు చంద్రబాబు ఎలా పరిటాల సునీతకి టిక్కెటిచ్చి MLA చేసినట్లు? ఈనాడు రామోజీరావు ఎందుకు గొంతు చించుకొని అరవనట్లు? అందునా పరిటాల రవి హత్య జరిగినప్పుడు రోజుల తరబడి ఈటివీ వార్తల్లో గుండెలు బాదుకున్నాడు కూడాను. ఇటీవల జరిగిన కప్పట్రాళ్ళ హత్య విషయంలోనూ అంతే. అక్కడికి పరిటాల రవి, కప్పట్రాళ్ళలాంటి వాళ్ళేదో గాంధీ మహాత్మలయినట్లు! ఇక పరిటాల సునీత ఒక్కతే కాదు, రాజకీయాల్లో పార్టీలకి అతీతంగా అలాంటి వారసులు లెక్కకు మిక్కిలిగానే ఉన్నారు. సబితా ఇంద్రారెడ్డి, ఎలిమినేటి ఉమా మాధవరెడ్డి, ఇటీవల పి.జనార్ధన రెడ్డి కుమారుడు విష్ణువర్ధన రెడ్ది. తదుపరి ఎన్నికల్లో వీరంతా MLA లుగా గెలిచి ఉండొచ్చుగాక. వారసత్వాన్ని వ్యతిరేకిస్తూ పార్టీ టిక్కెట్లు ఇస్తున్నప్పుడే ఎలుగెత్తి అరిచే మీడియా అధిపతులు రామోజీరావు, అతడి పుత్రుడు కిరణ్ ఇప్పుడు కిమ్మనరేం? కేవలం ఇందిరాగాంధీకి వారసుడు రాజీవ్ గాంధీ అయితే తప్పు గాని, సోనియాగాంధీలు, రాహుల్ గాంధీలు వారసులు కారా? పరిటాల సునీతలూ, సబితా ఇంద్రారెడ్డిలు వారసురాళ్ళు కారా? అదీ ఈ మీడియా నిష్పక్షపాతం! వీళ్ళు వ్యతిరేకించేది తమని వ్యతిరేకించే వారిని మాత్రమే. అందుకే ఇందిరాగాంధీని వ్యతిరేకించారు, సోనియాగాంధీకి సహకరిస్తారు.

సరే, మళ్ళీ మనం 1991 న్యూఢిల్లీకి తిరిగివద్దాం. సోనియాగాంధీని కాంగ్రెస్ కూ దేశానికీ నాయకత్వం వహించమన్నప్పుడు ఆమె పి.వి. నరసింహారావు పేరుని ప్రతిపాదించిందట. ఆనాటి మీడియా కధనాల ప్రకారం, 1991 నాటికి పి.వి.నరసింహారావు రాజకీయాల నుండి రిటైర్ అవ్వాలనీ, ఢిల్లీ నుండి హైదరాబాద్ కి నివాసం మార్చుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు. తన ఇంటిలోని టన్నుల కొద్దీ పుస్తకాలని కట్టలు కట్టి ఢిల్లీ నుండి ’పేకప్’ చెప్పేప్రయత్నంలో ఉన్నారని విశేషణాలతో వ్రాసాయి పత్రికలు. వాస్తవంగా కూడా ఆయన 1991 ఎన్నికల్లో పోటీ చెయ్యలేదు. ఈ విషయమై ఎవరైనా “పి.వి.నరసింహారావుని మాత్రం ఎందుకు సందేహించకూడదు? ఏమీ, కుట్రలో భాగంగానే వ్యూహాత్మకంగా అతడు పోటీ చెయ్యకపోయి ఉండొచ్చుగా? అలాగే రాజకీయాలకి వీడ్కోలు చెప్పాలనుకున్నాడని ప్రచారించవచ్చుగా” అని వాదించవచ్చు.

ఈ వాదనని పరిశీలించే ముందు మనం మరో అంశం పరిశీలిద్దాం. మన చుట్టు ఉన్న వారిని పరిశీలిస్తే – కొందరు ఎప్పుడూ మౌనంగా ఉంటారు. ఈ మితభాషుల్లో ఒకరు మేధావి కావచ్చు. ఆంగ్లంలో చెబితే ’ఇంట్రావర్ట్’ అన్నమాట. అంటే ఈ మితభాషి తెలివైన వాడవటం చేత, అనవసరంగా మాట్లాడటం ఇష్టం లేక ఎక్కువుగా మౌనం పాటిస్తుండవచ్చు. అలాగ్గాక అతడు మూర్ఖుడు లేదా తెలివిలేని వాడు అయి ఉండే అవకాశం ఉంది. అంటే ఈ మితభాషి వివేకశూన్యుడు కావటం చేత మాట్లాడే కళ తెలిసి ఉండకపోవచ్చు, అసందర్భంగా మాట్లాడి గతంలో అవమానాలు పొంది ఉండొచ్చు, దాంతో ఎక్కువుగా మాట్లాడక మౌనం పాటిస్తుండవచ్చు. కాబట్టి ఒకవ్యక్తి మౌనాన్ని బట్టి ఆవ్యక్తి మేధావో, వివేకశూన్యుడో నిర్ధారించలేం. అదే వారు చేసిన పనులని బట్టి అయితే ఖచ్చితంగా ఎవరు మేధావో, ఎవరు వివేకశూన్యుడో గుర్తించగలం. ఎందుకంటే మాటలు మనల్ని భ్రమపెట్టవచ్చు గానీ చర్యలు అంటే పనులు భ్రమ పెట్టవు కదా! ఆవిధంగా వారి చర్యలూ, వారి Motives, వారి intuitions, వారు మేధావులో, వివేకశూన్యులో నిరూపిస్తుంది.

ఆవిధంగా పి.వి.నరసింహారావు, ఇందిరాగాంధీ తమని తాము భారత దేశంపట్ల నిబద్దత గలవారుగా, కుట్రకు వ్యతిరేకంగా పోరాడిన యోధులుగా నిరూపించుకున్నారు. నాడు జవహర్ లాల్ నెహ్రుతో మొదలైన మిశ్రమ ఆర్ధికవ్యవస్థ, ఇందిరహాయంలో జాతీయమైన బ్యాంకుల వ్యవస్థ, పి.వి. హయాంలో మొదలైన పరిమిత వేగపు సరళీకృత ఆర్ధిక వ్యవస్థల కారణంగా, ఈరోజు ఆర్ధిక మాంద్యపు తుఫానులో చిక్కి ప్రపంచదేశాలన్నీ గడగడలాడుతుండగా భారతదేశం ఇంకా ఆ గడ్డుపరిస్థితి రాకపోవటమే అందుకు నిదర్శనం.

అదేవిధంగా సోనియాగాంధీ, మన్మోహన్ సింగూ, అద్వానీ, దేవేగౌడ, చంద్రబాబు నాయుడు, వై.ఎస్., ఇంకా నేటి రాజకీయనాయకుల్లో అత్యధికులూ తమని తాము కుట్రదారుల మద్దతుదారులుగా నిరూపించుకున్నారు. కావాలంటే ఈ రోజు వార్తల్నీ, సంఘటనల్నీ గమనించండి. నిన్న తిట్టిన పార్టీలతో నేడు పొత్తులు, నిన్న తిట్టిన పార్టీలోకి నేడు దూకటం. అందరిది ఒకటే సూత్రం డబ్బు దోచుకోవటం, సెజ్ ల పేరుతో దేశాన్ని ముక్కలుముక్కలుగా అమ్మటం, జనహితం పట్టకపోవటం. ఎన్నికలెదుర్కోబోతున్న తరుణంలో ఎవరికి వారు పొత్తులు గురించి మొత్తుకుంటున్నారు. ఎన్నికలకోడ్ ని వారు ఉల్లఘించారని వీరూ, వీరు ఉల్లంఘించారని వారు ఎన్నికల అధికారులకి ఫిర్యాదులు చేస్తున్నారు. ఆపార్టీలోంచి ఈ పార్టీలోకి గెంతుతున్న కప్పల్ని నిరభ్యంతరంగా చేర్చుకుంటున్నారు. ఇందుకు ఏపార్టీకూడా అతీతంగా లేదు. అందరికీ గెలుపు గుర్రాలే కావాలట. సామాన్యుడి బాధలు, చుక్కల్లో ఉన్న ధరలూ, ప్రజల సమస్యలూ ఎవరికీ వద్దట. అందుకే ఎవ్వరికీ పట్టటం లేదు.

వాస్తవానికి 1991 లో సోనియాగాంధీ లాంటి కుట్రదారుల మద్దతుదారు, పి.వి.నరసింహారావు పేరుని ప్రతిపాదించిన కారణాలేమిటో తెలియదు. బహుశ ఆయన గతం కారణమనుకుంటాను. స్వాతంత్రానికి పూర్వం, స్వాతంత్రానంతరం, ఆయన రాజకీయ జీవితకాల పర్యంతపు గతమే కారణమనుకుంటాను. హైదరాబాద్ 7 వ నిజాం స్వాతంత్రసమయంలో భారత్ లో విలీనమవ్వడానికి తిరస్కరించి, స్వతంత్రదేశంగా ఉంటానన్నప్పుడు, అలా కుదరని పక్షంలో ‘మధ్య పాకిస్తాన్’ పేరిట పాకిస్తాన్ లో కలిసిపోతానన్నప్పుడు, నిజాం సంస్థానంలోని ప్రజలు పౌరుషవంతులైన యువకుల నేతృత్వంలో నిజాంకి వ్యతిరేకంగా పోరాడారు. రజాకార్లు హిందూ స్త్రీల మీద అత్యాచారాలు, అవమానాలు, జరుపుతున్నప్పుడు, ప్రజల్ని అమానుషంగా హింసిస్తుండగా నాటి యువతరం ప్రజ్వరిల్లి పోరాడింది. 1948, సెప్టెంబరు 13 న సర్ధార్ పటేల్ పోలీసు చర్య వరకూ ఇది కొనసాగింది. ఆనాటి తిరుగుబాటులో నాటి తెలంగాణా యువకులూ, పోరాటయోధులు మాతృదేశ దాస్యవిముక్తికి ప్రాణాలొడ్డి పోరాడారు. అలాంటి వారిలో పి.వి.నరసింహారావు ఒకరు. బహుశః ఆ ద్వేషం కుట్రదారులకు [అంటే సి.ఐ.ఏ.,బ్రిటిషు,ఐ.ఎస్.ఐ.,అనువంశిక నకిలీ కణికుడు] ఉంది. నిజానికి కుట్రదారులు ఆనాడు నిజాంకి వ్యతిరేకంగా పోరాడిన నాటి యువనాయకులందరి మీదా దృష్టి కేంద్రీకరించారు. కాలక్రమంలో వారంతా తెరమరుగై పోయారు, ఓడిపోయారు. పి.వి.నరసింహారావు తన మేధస్సు, ఙ్ఞానం, విఙ్ఞత రీత్యా ఒడిదుడుగులు దాటుకుంటూ రాజకీయ రంగంలో కొనసాగగలిగారు. కాబట్టే ఆయన్ని వేధించేందుకు కుట్రదారులు చాలా వ్యూహాలూ, పధకాలు పన్నారు. అందులో భాగమే ప్రధానిగా ఆయన్ని ప్రతిపాదించడం.

నా వాదనని తార్కికంగా నిరూపిస్తాను. తర్వాత సాక్ష్యాల గురించి చర్చిస్తాను.

ఆయన ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రిగా [1971 నుండి 1973 వరకూ, 1 సంవత్సరం 4 నెలలు] ఉండగా, రాష్ట్రమంత్రిగా ఉండగా కుట్రదారులు ఆయనకి ఎన్నో సవాళ్ళు విసిరారు. ధనిక భూస్వాముల నుండి ఆయన ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు. ఎందుకంటే ఇందిరాగాంధీ తెచ్చిన ’ఎక్సెస్ ల్యాండ్ సీలింగ్’ చట్టాన్నీ నిజాయితీగా, నిక్కచ్చిగా అమలు చేయాలని, పేదప్రజలకి భూమి పంపకం జరిగి తీరాలని ఆయన పోరాడాడు. ఇప్పుడు పేదల్ని తన్ని, తరిమికొట్టి భూములు లాక్కొని ధనికులకు సెజ్ ల పేరుతో అప్పచెబుతున్న కుట్రదారులు, అప్పుడు మాత్రం ఊరుకుంటారా? అప్పట్లో కుట్రదారులు [అంటే సి.ఐ.ఏ., బ్రిటిషు, అనువంశిక నకిలీ కణికుడు, వారి అనుచరులైన బడా భూస్వామ్యరాజకీయనాయకులు] తెలంగాణా ఉద్యమాన్ని లేవనెత్తారు. వాదన ఇప్పటి తెరాస వారిదే. ఏవిధంగా అయితే ఉమ్మడి మదరాసు రాష్ట్రం నుండి భాషాప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించిందో, అదేవిధంగా తెలంగాణా ప్రజలు ఆంధ్రప్రజల నుండి విడిపోవాలనుకుంటున్నారని అలజడి రేపారు. ఉపఎన్నికల్లో, రాజీనామాలు చేసి మళ్ళీ ఎన్నికలు జరిపించుకునీ, వాటిలో ఓడిపోయానా కూడా కె.సి.ఆర్. లు ఈ వాదాన్ని ఇప్పటికీ పొడిగిస్తున్నారు చూడండి. ఇదే డ్రామా అప్పుడు కూడా జరిగింది. తర్వాత చప్పబడింది. నేటి తెలంగాణా ఉద్యమం గురించి మరో టపాలో వివరిస్తాను. ఇక్కడ తెలంగాణా ప్రజలు వేరు, కె.సి.ఆర్.లు వేరని చెప్పటం మాత్రమే నా ఉద్దేశం. తెలంగాణాకి మంచి చేయాలనే ఉద్దేశం నేటి కె.సి.ఆర్.లకి కాదు నాటి కె.సి.ఆర్.లకీ లేదు.

తెలంగాణా ఉద్యమం తర్వాత 1973 లో జైఆంధ్ర ఉద్యమం లేవనెత్తబడింది. పేర్లు వేరైనా వాదన ఒకటే. ఈసారి కోస్తా ప్రజలు విడిపోవాలనుకున్నారు. ఈ సమస్యలన్నిటితో పి.వి.నరసింహారావు ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రప్రభుత్వం బర్తరప్ అయ్యింది. 1973 లో గవర్నర్ పాలన విధించబడింది. ఈ సంఘటన తర్వాత ఇందిరాగాంధీ ఆయన్ని కేంద్రప్రభుత్వంలోకి మంత్రిగా తీసుకొంది. దాంతో ఆయన కెరీర్ ఢిల్లీలో ప్రారంభమయ్యింది. 1973 నుండి 1991 వరకూ ఆయన కాంగ్రెస్ కీ, దేశానికే తన విఙ్ఞతతోనూ, మేధావిత్వంతోనూ ఎంతోకొంత మేలైనా చేయాలని శ్రమించాడు. ఆవిధంగా ఆయన మేధస్సు, తార్కిక ఆలోచనా శక్తి, ఇందిరాగాంధీకి మద్దతుగా నిలబడింది. కుట్రదారులెవరో, ఎక్కడినుండి పనిచేస్తున్నారో తెలియక పోయినా, అలుపెరగని పోరాటం చేసారు వారు. అంతేకాదు ఇందిరాగాంధీ హత్యానంతరం, ఆయన అనుభవం, విఙ్ఞత, మేధస్సు రాజీవ్ గాంధీకి మార్గదర్శనం చేసింది. కుట్ర తీరుని అర్ధంచేసుకునేందుకు ఆ యువనాయకుడికి ఈయన counseling రాజకీయ పరిణతిని నేర్పింది. వాస్తవానికి ఆనాటి కేంద్రప్రభుత్వ చేతుల్లో ఉండే నిఘా సంస్థలూ, గూఢచార సంస్థలకు కుట్రతీరు తెలుస్తుంది. కాని ముందుగా తెలియదు. జరిగాక అర్ధమౌతుంది. అప్పుడు ఆత్మరక్షణ తప్ప మరో గత్యంతరం ఉండదు. ఏ కుటీల పధకమైనా జరగక ముందు తెలిస్తేనే తిప్పికొట్టగలరు. కనీసం ఎంతతొందరగా పసిగట్టగలిగితే అంత తక్కువ ప్రమాదం. అలాంటిది, తీరా కుట్రా, కుటీల సంఘటనలు జరిగిపోయాక, అర్ధమైనా పెద్దగా ప్రయోజనం ఉండదు. కుట్రదారుల చిరునామా తెలియటం అంటే సి.ఐ.ఏ. చిరునామా పెంటాగాన్ అనీ, ఐ.ఎస్.ఐ. చిరునామా ఇస్లామాబాద్ అని తెలియటం కాదు గదా! కాబట్టే ఇండియాలో ప్రధాన ఏజంటు ఎవరో, అసలు కుట్రలకు కేంద్రస్థానం ఎక్కడో, కీలక వ్యక్తి ఎవరో తెలిస్తే, పరిస్థితి మొత్తం మారిపోయింది. కారణాలేమైతేనేం, ఇప్పుడు దృష్టాంతసహితంగా కుట్ర నిరూపించబడుతోంది. కుట్రదారులు, వారి మద్దతుదారులు తమ చర్యలతో సహా expose అవుతున్నారు. ఇది జరగకుండా ఉండేటందుకే ఎప్పుడూ ఆనాటి ప్రభుత్వాన్ని కుట్రదారుల ఏజంట్లుగా ఇండియన్ ఎక్స్ ప్రెస్ గోయంకాలనో, హిందూ ఎన్.రామ్ లనో, మరింకో పత్రికా సంపాదకులుగానో misguide చేసారు.

ఈ స్ట్రాటజీ గురించి ఇంతకు ముందు చాలా సార్లే మనం ముచ్చటించుకున్నాం. ఈ విధంగా ప్రభుత్వదృష్టినీ, దేశభక్తుల దృష్టికీ ఇతర వ్యక్తుల మీదకీ, విషయాల మీదకీ మరల్చి ప్రధాన ఏజంటుని రక్షించుకోవటమే ఇక్కడ వ్యూహం. ఇందిరాగాంధీ హయం నాటికే మెల్లిగా విస్తరించిన, ఆపైన వేగంగా కాళ్ళూనుకున్న కుట్రదారుల నెట్ వర్కుకి రాజకీయ నాయకుల దగ్గరనుండీ, వ్యాపార వర్గాల్లో ప్రభుత్వ ఉన్నాతాధికారుల్లో మద్దతుదారులున్నారు. వారి సాయంతో ప్రభుత్వంలోపల ఏం జరుగుతుందో తెలుసుకోగలరు. అలాగే అధికారంలో ఉన్న ‘దేశం పట్ల నిబద్దత’గల నాయకులకి, బయట ఏంజరుగుతుందో తెలియకుండా చేయగలరు.

తమ నెట్ వర్కు బలంగా ఉంటే, తాము టార్గెట్ గా ఎంచుకున్న వ్యక్తి చుట్టూ ఎంతగా ’ఐరన్ కర్టెన్’ వేయవచ్చో, ఎంతగా తాము సృష్టించిన భ్రమలో ఎదుటి వారిని ఉంచవచ్చో మొన్నీ మధ్య వచ్చిన సినిమా ’కింగ్’ లో చూడవచ్చు.

అందులో హీరో నాగార్జున, హీరోయిన్ త్రిషని తానో గొప్ప సంగీత కళాకారిణిననీ, సెలబ్రిటీననీ నమ్మిస్తాడు, చాలా మామూలుగా! ఎంతో హాస్యం పండింది ఆ సీన్ లో, అది వేరేవిషయం.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు! .

3 comments:

బాగా వ్రాశారు.

ఈనాడు 'ఎల్లో' జర్నలిజంతో పత్రికలంటేనే పొట్టలో పుయ్యాం పుయ్యాం అనిపిస్తుంది.

do you know "jai andhra udyamam is run because pv narasimha rao is from telangana." for evidence you can see m.venkayaiah naidu interview came in eenadu sunday magazine(i think 15th feb)

well written,

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu