స్వాతంత్ర సమరం నాడు గుర్తురాని దేశభక్తి, ప్రజల పట్ల సేవాసక్తి ఈ సినిమా హీరోకి[NTR] 1981 లో కలిగింది. అప్పటికి ఇతడికి ముసలి తనం వచ్చేసింది. ఆ వయస్సుకీ, అప్పటికే భారీతనాన్ని సంచరించుకున్న ఉదరపూరిత దేహానికీ [బొజ్జ], ముడుతలు బడిన మొహానికి సినిమాల్లో ఇక ’కథానాయక’ పర్వం కొనసాగే అవకాశాలు సన్నగిల్లాయి. అప్పటికే అతడి సినిమాలు కొన్ని ముక్కిమూలిగి హిట్ అయితే మరికొన్ని డబ్బు, ’కృషీ’ వెచ్చించి హిట్ అన్పించుకుంటున్నాయి. ఇప్పుడు ఎన్.టి.రామారావు వారసులు బాలకృష్ణ సినిమా ’లక్ష్మీనరసింహ’ హిట్ మాదిరి అన్నమాట. ఈ చిత్రవిజయ [శతదినోత్సవ] ఉత్సవాల వ్యవహారంలోనే వివాదం ఏర్పడి సదరు సినిమా హీరో బాలకృష్ణ, ఆ సినిమా నిర్మాత బెల్లంకొండ సురేష్ మీద కాల్పలు జరిపాడన్న కేసు అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ కేసులో కాల్పులుబారిన పడ్డ బెల్లంకొండ సురేష్ కి కూడా నయమై ఇంటికి పోయాడు గానీ, పాపం బాలకృష్ణ మాత్రం ఆ షాక్ తట్టుకోలేక ’కేర్’ ఆసుపత్రి వైద్య శిఖామణి సోమరాజు రక్షణలో చాలా రోజులే ఉన్నాడు. ఆ పైన చాలా మామూలుగా ప్రాసిక్యూషన్ వారు సాక్ష్యాలు చూపటంలో ఫెయిలయ్యడంలో కోర్టు బాలకృష్ణ కేసు కొట్టేసిందనుకొండి. [ఇంతకీ మరి తుపాకీ దానంతట అదే గాల్లోకి లేచి, మనం దెయ్యం సినిమాల్లో చూసినట్లు, తూటాలు పేల్చిందంటారా? ఏమో పేల్చినా పేల్చి ఉండొచ్చు!]

అయ్యో, ఎన్.టి.రామారావు దగ్గర నుండి వాళ్ళబ్బాయి దగ్గరి కెళ్ళి పోయాం. మళ్ళీ వెనక్కి వచ్చేద్దాం. 1981 నాటికి ఎన్ని ఉపాయాలు పన్నినా ఎన్.టి.రామారావు సినిమాల్లో చాలా సినిమాలు బాక్సాఫీసు దగ్గర తుస్సుమన్నాయి. అలాంటి సమయంలో అతడికి ప్రజాసేవ చేయాలనే ఆసక్తి, అనురక్తి, స్ఫూర్తి కలిగాయి. ఏ మీడియా కూడా, అతడి గతంలో ‘అతడికి లేని దేశభక్తి’ గురించి గానీ, ప్రజా సేవాసక్తి గురించి గానీ, హఠాత్తుగా కలిగిన ప్రజలపై ప్రేమ గురించిగానీ ప్రశ్నించలేదు. మీదు మిక్కిలి, ఈనాడు పత్రిక, స్వయంగా రామోజీరావు ఎన్.టి.రామారావుకిచ్చిన ’గోబెల్’ ప్రచారం జగద్వితమే. అది అప్పట్లో కొత్తట్రెండ్. రోడ్డు ప్రక్కన స్నానాలూ, గడ్డం గీయడాలు, ఒకటే సెన్సేషన్. అన్న షర్టేస్తే మాస్! ఇడ్లీ తింటే మాస్, నిద్రలేస్తే మాస్, ఏం చేసినా మాసే!

ఎన్.టి.రామారావు సినిమాల్లోకి వచ్చేందుకు కొంచెం ముందు, అతడి రాజకీయ రంగ ప్రవేశానికి బాటలు వేస్తూ కొన్ని సినిమాలు తీయబడ్డాయి. [ఇప్పటి చిరంజీవి కోసం గతంలో ’ఠాగూర్’ ’స్టాలిన్’ గట్రా సినిమాలు నిర్మింపబడినట్లన్న మాట] అలాంటి సినిమాల్లో ఒక సినిమాని [ చండ శాసనుడో, బెబ్బులి పులో] అప్పటి రాష్ట్ర కాంగ్రెసు ప్రభుత్వం నిషేధించింది. నింద ఇందిరా గాంధీకి అంటగట్టబడింది.] నిజానికి అప్పటికే కాంగ్రెసు పార్టీలో చాలామందే ఈ నకిలీ కణికుడి అనుచరులు తయారయ్యారు. ఎన్.టి.రామారావు రాజకీయ రంగ ప్రవేశాన్ని మరింత సంచలనం చేయటానికే ఇలాంటి వివాదాలు సృష్టించబడ్డాయి. అప్పట్లో ఇది చాలా నిగూఢమైన గూఢచర్య తంత్రం. ఇప్పడది ఎంతో మంది సినిమా తారలకీ, క్రికెట్టు తారలకీ, వ్యాంప్ నటీమణులకీ నిత్య మంత్రం అయిపోయిందిలెండి.

ఎందుకు ఆ సినిమా ప్రదర్శన నిషేధింపబడిందో – ఆనాటి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికీ, ఆనాటి ముఖ్యమంత్రికీ, చలన చిత్ర శాఖామంత్రి కే తెలియాలి.

అదీ సంచలనం సృష్టించుకున్నతీరు. ఆ విధంగా సమాజంలో ప్రతీ వ్యక్తికీ ఎన్.టి.రామారావు రాజకీయ రంగప్రవేశంపై ఓ ఆసక్తిని సృష్టించారు. ఓసారి ఆనాటి పత్రికలు [ఈనాడు, ఇంకా ఇతర పత్రికలు], రేడియోల వార్తలు గుర్తు తెచ్చుకొంటే ఇది మరింత స్పష్టంగా అర్ధమౌతుంది.

ఇందుకు మరో ఉదాహరణ ఇస్తాను. అప్పట్లో వాసిరెడ్డి సీతాదేవి అని ఓ రచయిత్రి ఉండేది. [ఈమధ్యే పోయారు లెండి] ఆవిడ రాష్ట్రసాహిత్య అకాడమీ డైరక్టరు వంటి ప్రభుత్వ పదవులేవో నిర్వహించేది. 1980 ల్లో ఆవిడ ’మరీచిక’ అంటూ ఓ నవల వ్రాసింది. దాన్నెందుకు ప్రభుత్వం నిషేధించిందో తెలియదు గానీ [ఆ నవల చదివాను. అయినా ప్రభుత్వం ఎందుకు ఆ రచనని నిషేధించిందో నాకు అర్ధం కాలేదు.] ఆవిడ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ కోర్టు కెక్కింది. ఈ విషయాలన్నీ పత్రికల్లో సంచలన వార్తలయ్యాయి. ఆవిడకీ, ఆవిడ నవలకీ చాలా ’పాపులారిటీ’ వచ్చింది. ఆనక ప్రభుత్వం ఆ నిషేధాన్ని ఎత్తివేసింది. [తర్వాతే ఆ నవల చదివాను లెండి.] తర్వాత కమల్ హాసన్ నటించిన ఆకలి రాజ్యం సినిమా కూడా ఇలాగే నిషేధానికి గురైంది. ఆ తర్వాత అది పబ్లిసిటీ స్టంట్ గా ప్రజల్లో పేరుపడింది. ఇప్పుడా పబ్లిసిటి స్టంట్ ని మనం వ్యాంప్ డాన్సర్లు విషయం దగ్గర నుండి పలుచోట్ల చూస్తూనే ఉన్నాం కదా!

ఇలాంటి పబ్లిసిటి స్టంట్లు, వ్యూహలు ఎన్.టి.రామారావు రాజకీయ రంగప్రవేశం విషయమై రచింపబడీ అమలు చేయబడ్డాయి. ఇక ఇందులో ఈనాడు రామోజీ రావు తోడ్పాటు జగమెరిగిన సత్యం, అతడు ఒప్పుకున్న సత్యం. [దాని కాయన కమ్మకుల సమర్థన, కాంగ్రెసు ద్వేషం గట్రా గట్రా కారణాలు చెప్పాడు లెండి. ఒక్కోసారి ఒకో కారణం. ఎన్.టి.ఆర్ ని భుజానికెత్తుకున్నప్పుడు ఓ కారణం, అతణ్ణి చెత్తకుండీ లోకి విసిరేసి అతడి అల్లుణ్ణి భుజానికెత్తుకున్నప్పుడు మరో కారణం. ఇలా ఊసరవెల్లి రంగులు మార్చినట్లు కారణాలు మార్చటం ఈ మీడియా మాంత్రికుడికీ, రాజకీయ దర్శకుడికీ బాగా అలవాటు.]

అలా ఈనాడు ఆనాడు ఎన్.టి.ఆర్.కి – రోడ్డుప్రక్కన స్నానం, క్షౌరం, దంతధావనం గట్రాగట్రా దినచర్యనంతా పెద్దపెద్ద ఫోటోలతో ఫస్టు పేజీల్లో ముద్రించింది. అతడి ఉదయపు అల్పాహారం, మధ్యాహ్న భోజనం, అతడి దినచర్య మొత్తం ఓ వార్తా సంచలనం అయిపోయింది. అతడు మాజీ సినిమా హీరో అవడంతో సహజంగానే అది ప్రజల్లో కుతుహలాన్ని, మోజునీ రేపింది. దీనికి తోడు ఎన్.టి.ఆర్. తన గ్లామర్ తో, నటనా చాతుర్యంతో, వాగ్ధోరణితో పేదల బిడ్డల నెత్తికొని హత్తుకుంటూ, తల్లుల్ని దీవిస్తూ, వృద్ధ మహిళల నుండి హారతులు దీవెనలు అందుకుంటూ, [ఇప్పుడందరూ అదేచేస్తున్నారు గానీ అప్పడందరికీ అది చాలా కొత్త సుమా!] వారితో కలిసి తింటూ, చాలా హడావుడీ సృష్టించాడు. ప్రత్యేకంగా తయారు చేసిన వ్యానుకి చైతన్య రధం అని పేరుపెట్టి రాష్ట్రమంతా అతడు సుడిగాలి పర్యటనలు చేశాడు. వీటికి తోడు ఎన్.టి.ఆర్. కాషాయాంబర ధారణ మొదలుపెట్టాడు. అతడి ఉపన్యాసాలతో ప్రజల్లో కాంగ్రెసు పై నిప్పులు కురిపించాడు. [అదే కాంగ్రెసు స్వాతంత్ర సమరం చేస్తున్నప్పుడు మన నటుడు ఎంచక్కా సినిమాల్లో వేషాలు వెదుక్కుంటూ, పొట్టకూడు సంపాదించుకుంటూ, కళా సరస్వతిని ఉద్దరించే పనిలో ఉన్నాడు. ఈతడి మొదటి సినిమా ‘మనదేశం’ చూసిన వాళ్ళకి ఇది బాగానే గుర్తుండి ఉంటుంది. మరిన్ని వివరాలు తరువాత టపాల్లో వ్రాస్తాను.] ఈ అగ్నికి ఈనాడు పత్రిక ‘వార్తాకదంబాలు’ అన్న గాలి తోడయ్యింది. సాధారణంగా ఎన్.టి.ఆర్. ఆనాటి ఉపన్యాసాల్లో “నేను సర్వసంగ పరిత్యాగిని. అందుకే కాషాయంబరాలు ధరించాను. లక్షలాది ఆదాయాన్ని, కోట్లాది సంపదనీ వదులుకొని మీకోసం వచ్చాను. లక్షలాది ఆదాయాన్ని, కోట్లాది సంపదనీ, సినిమా రంగాన్ని త్వజించి, మీకోసం, తిండి లేని నా తమ్ముళ్ళ కోసం, రాజకీయల్లోకి వచ్చాను” అనేవాడు. అంతేకాదు, ప్రజల కిచ్చేందుకు తన దగ్గర బూడిద తప్ప మరేం లేదు అని కూడా అనేవాడు. వీటన్నింటిని చూస్తే మనకు చిరంజీవి గుర్తుకు వస్తూన్నాడు కదు. అదే స్ట్రాటజీ. [రామోజీ రావు స్ట్రాటజీ.]

ఇక్కడ ఓ విచిత్రం ఏమిటంటే – ఏ పత్రిక కూడా అతడి ఉపన్యాసాల్లోని వితర్కాన్ని లేదా కుతర్కాన్ని ప్రశ్నించలేదు. “అతడు తన లక్షలాది ఆదాయాన్ని, కోట్లాది ఆస్థిని వదిలేసి ప్రజల కోసం వచ్చానంటాడు. ఆస్థి ఎవరికి వదిలివచ్చాడు? అతడేమీ తన ఆస్థిని ప్రజలకి ఇవ్వలేదు. తన ప్రతి పైసాని తన సంతానానికే గదా వదలివచ్చాడు లేదా ఇచ్చాడు? మరి ఇలాగంటాడేమిటి?" అంటూ ఏ పత్రికా అనలేదు. ఒకటి రెండు సందర్భాల్లో ఈ వాదన లేచినా, పురిట్లోనే సంధి గొట్టుకుపోయింది. అన్ని పత్రికలూ ట్రెండ్ మార్చేసుకున్నాయి, వ్రాసిన పాత్రికేయులు కలం మార్చేసుకున్నారు, మార్చుకోలేని వాళ్ళు ఇళ్ళకెళ్ళిపోయారు.

ఇక ఈనాడు పత్రిక ఎన్.టి.ఆర్. ఉపన్యాసాలని వేల డెసిబుల్స్ కి పెంచి ప్రచారించింది. వాడవాడలా ఆడియో క్యాసెట్లు మారుమ్రోగాయి.

ఏ పత్రిక కూడా “సినిమా కెరీర్ ని 60 ఏళ్ళ వయస్సులో వదిలేయటం లక్షలాది ఆదాయాన్ని త్యాగం చేయటమౌతుందా? ఎటూ వృద్ధాప్యంలోకి వచ్చాక పడుచు హీరోయిన్లతో పరిగెట్టలేకపోతున్నాడు గనుక కెరీర్ వదిలేసాడు. సినిమా వ్యాపారం కంటే రాజకీయాలు మరింత లాభసాటి కాబట్టి అందులోకి వచ్చు ఉండొచ్చు గదా?" అన్న తర్కాన్ని ప్రచురించలేదు. మీడియాకి పబ్లిక్ వ్యక్తుల్ని, రాజకీయ నాయకుల్ని వాళ్ళ వాదనల్లోని నిజనిజాలని ఎండగడుతూ, విశ్లేషిస్తూ ప్రశ్నించవలసిన బాధ్యత లేదా? ఏ విషయంలోనైనా నిజాల్ని వెలికి తీయటం, అబద్ధాలని ప్రజలకి తెలియజెప్పటం, కట్టుకధల్ని తూట్లు పొడవటం, యదార్ధాన్ని విశేషించటం పత్రికలు బాధ్యతకాదా? మీడియాకి వ్యక్తుల నిజాయితీనీ, దేశభక్తినీ, వాళ్ళ ప్రవర్తనలోని వైరుధ్యాల్ని ప్రశ్నించే బాధ్యత లేదా?

ఇలాంటి బాధ్యతలన్నిటినీ హఠాత్తుగా, ధృఢంగా ఆనాటి పత్రికలన్నీ మరచిపోయాయి. నిజానికి పత్రికలకి సాధారణంగా వాటి బాధ్యతలు గుర్తుండదు గానీ పత్రికా స్వేచ్ఛలాంటి హక్కులు మాత్రం ఎల్లప్పుడూ గుర్తుంటాయి.

ఇలాంటి వ్యూహాత్మక మీడియా మద్దతుతో అలనాటి అందాల మేటి నటుడు ఎన్.టి.ఆర్. రాజకీయ వేదిక మీద తన నటనా చాతుర్యం, వాగ్ధాటితో తన పాత్ర తాను పోషించాడు. అతడి ఉపన్యాసాలకు ప్రజలు ఉర్రూతలూగారు. నాటకీయమైన ఉచ్ఛారణలో అతడి ఉపన్యాసాలు “నేల ఈనిందా? ఆకాశం వర్షించిందా? ఎక్కడిదీ ఇంత ప్రజ?" అంటూ ఉరిమేది.

ఇదంతా అతడికీ తిరుగులేని విజయాన్ని తెచ్చిపెట్టింది. అందునా అప్పటికి రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవి ’కుర్చీలాట’లా మారిపోయింది. కాంగ్రెస్ నిండా కుళ్ళు, స్వార్ధ రాజకీయ నాయకులే. ఒకడు ఈ రోజు సి.ఎం. సీట్లో కూర్చోగానే మరుక్షణమే 100 గొంతులు అతణ్ణి క్రిందికి లాగే ప్రయత్నం మొదలు పెట్టేవి. అసంతృప్తి అన్నది ఆనవాయితీ అయిపోయింది. దీనికి తోడు ఆనాటి ముఖ్యమంత్రి టి.అంజయ్య, అతది యాదగిరి హెలికాప్టర్, అతడి ప్రవర్తనతో ఎంతో హాస్యాస్పదం అయిపోయి ఉన్నాడు. ఈనాడులో ప్రతిరోజూ అంజయ్య కాలికి దారంతో కట్టబడిన హెలికాప్టర్ యాదగిరి బొమ్మతో కార్టూన్లూ ప్రజల్ని కడుపుబ్బ నవ్వించేవి. కాంగ్రెస్ వాళ్ళు ప్రతిదానికి ఢిల్లీ వెళ్ళవలసి వచ్చేది. అధిష్టానం అనుమతి లేకుండా ఏది చేయడానికి లేకుండా ఉండేది. తదుపరి సంవత్సరం [24/02/82 to 08/01/83] వ్యవధిలో ఇద్దరు ముఖ్యమంత్రులు భవనం వెంకట్రామి రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డిలు మారారు. అప్పటికే ఇందిరా గాంధీ ఎవ్వరినీ నమ్మగలిగే స్థితి లేక మంత్రులనీ, ముఖ్యమంత్రులనీ మారుస్తుందన్న అపఖ్యాతి మూటగట్టుకొని ఉంది.

ఇలాంటి స్థితిలో ఎన్.టి.ఆర్. లేవనెత్తిన ‘తెలుగు వాడి అత్మగౌరవం’ అన్న నినాదం అందర్నీ ఆకట్టుకొంది. అప్పటికి ప్రతీ తెలుగువాడికీ, కాంగ్రెసు స్థితిపట్లా, ఆ పార్టీ దుష్ట పద్దతుల పట్లా, మంత్రులూ, ముఖ్యమంత్రులూ ఢిల్లీ వీధుల్లో రాష్ట్రంలో అధికారం కోసం యాచన చేయడం పట్ల, బిచ్చగాళ్ళలా ఉన్న వారి ప్రవర్తన పట్లా అసహ్యం పెరిగిపోయి ఉంది. కాబట్టి అందరూ ఎన్.టి.ఆర్. నీ అతడి ఆత్మగౌరవం నినాదాన్ని హర్షించారు.

అయితే తమాషా ఏమిటంటే ఈ ఎన్.టి.ఆర్. ముఖ్యమంత్రి అయ్యాక ’ఒన్ మాన్ షో’ చేసాడు. [పెద్దల్లుడూ, చిన్నల్లుడూ ఉండే వాళ్ళు లెండి] ఓసారి ఈయన మొత్తం మంత్రులందర్నీ ఒక్కసారిగా రాజీనామా చేయమన్నాడు, చేయింపించాడు. అలా తనకి ఉన్న సూపర్ పవర్ నీ చూపెట్టి, ప్రజస్వామ్యాన్ని పరిహాసం చేశాడని అప్పట్లో అందరూ అన్నారు. ఆ విధంగా అతడు తన మంత్రుల సహచరుల ఆత్మగౌరవాన్ని అపహాస్యం చేసాడు. ఇంతేగాక ఓసారి ఆయన ఎలక్షన్లలో ఓ మహత్తర ప్రకటన చేశాడు. “నా చెప్పుల్ని నిలబెట్టినా ఎన్నికల్లో గెలుస్తాయి”అంటూ. [సినిమాల్లో శ్రీరాముని వేషం, శ్రీకృష్ణుడి వేషం లాంటి దేవుళ్ళ వేషాలు వేసి ఈయనకి తానే దేవుణ్ణనే స్వాతిశయం, అందుకే తనకి తాను ’మేము’ అని సంబోధించు కొనే స్వోత్కర్ష ఉండేవంటారు.] అలా – ఆయన తన అహంకారాన్ని, తెలుగు ప్రజల పైన తృణీకారాన్ని [అధికారంలోకి రాకముందున్న ఆత్మగౌరవం కాస్తా అధికారం వస్తే తృణీకారామైపోయింది.] చూపెట్టుకున్నాడు. కాకపోతే తెలుగువాడికి వొళ్ళుమండి పోయింది లెండి. దెబ్బతో కాంగ్రెస్ అభ్యర్ధి చిత్తరంజన్ ఎన్.టి.ఆర్.ని ఓడించి, ఆ దెబ్బతో మంత్రి అయిపోయాడు.

ఇలా అపహాస్యం చేయబడిన తెలుగువాడి ’ఆత్మగౌరవం’ గురించి ఏనాడూ, ఏ పత్రికా, ఈనాడుతో సహా నోరు మెదపలేదు. నా చెప్పుల్ని నిలబెట్టినా గెలుస్తాయన్న అతిశయాన్ని, అహంకారాల్ని స్వయంగా తెలుగు ఓటరే ఎదుర్కొన్నాడు, గానీ మీడియా కాదు.

ఆ రోజుల్లో అతడు నెలకు రూపాయి జీతంగా తీసుకున్నాడు. ఈవిషయాన్ని మటుకు పత్రికలన్నీ పాజిటివ్ గానో లేదా నెగిటివ్ గానో ఎలుగెత్తిచాటాయి. తెదేపా పుట్టిన 9 నెలల్లో అధికారంలోకి రాగలిగాడు. సహజం గానే ఇది నిఘా సంస్థల దృష్టిని ఆకర్షించింది. అందునా ఎన్.టి.ఆర్. అద్భుత విజయం వెనుక ఈనాడు పత్రికే ఉంది. అయితే ఈ అసాధారణ అద్భుత విజయాన్ని సాధారణం చేయడానికా అన్నట్లు ఈశాన్య భారతంలో అస్సాంరాష్ట్రంలో ప్రఫుల్లకుమార్ మహంత [విద్యార్ధి నాయకుడు] అస్సాం గణపరిషత్తు పార్టీని స్థాపించిన 6 నెలల్లో అధికారాన్ని అధికారాన్ని చేజిక్కించుకున్నాడు. దాంతో ఎన్.టి.ఆర్. విజయం సాధారణమైనదే అన్న భావన కలిగింది; ప్రచారమూ జరిగింది. అయితే ఒక అసాధారణాన్ని సాధారణం చేయటం కోసం పదే పదే అలాంటివే జరిపించడం అన్నది గూఢచర్య తంత్రం లో ఓ భాగం. 1991 లో రాజీవ్ గాంధీ హత్య జరిగినప్పుడు RDX వాడకం మానవబాంబులు ప్రపంచానికి చాలా కొత్త. RDX కేవలం CIA లాంటి అగ్రదేశాల నిఘా సంస్థల దగ్గర మాత్రమే ఉంటుందని వార్తలొచ్చాయి. ఆ తర్వాత ఈ 17 ఏళ్ళల్లో RDX ప్రపంచమంతా కుప్పలు కుప్పలుగా, మానవబాంబులు గుంపులు గుంపులుగా కనబడటం లేదూ?

ఎన్.టి.ఆర్. విషయమై ఈనాడు ’కవరేజ్’ మీద విమర్శలు చెలరేగినప్పుడు, ఈనాడు రామోజీ రావు తనకి తాను గట్టిగా సమర్ధించుకున్నాడు. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఓ వర్గం వారి [రెడ్డి కులస్తులు] డామినేషన్ రాజకీయాల్లో పెరిగిపోయిందనీ అందుచేత రామోజీరావు తనదైన కమ్మకులానికి మద్దతిస్తున్నాడని వార్తలొచ్చాయి. అదే సమయంలో అడపాదడపా రామోజీరావు ఈనాడు పత్రికల్లో రాజకీయరంగంలో ఏయే హోదాల్లో ఎందరెందరు ఏయే కులస్తులు ఉన్నారో, చివరికి IAS,IPS అధికారులలో కూడా ఏ కులస్థులెంత మంది ఉన్నారో జాబితాలు ప్రచురింపబడేవి. ఇటీవలి కాలంలో కూడా అలాంటి జాబితాలు దర్శనమిచ్చాయి. మరోప్రక్క రామోజీరావు కులగజ్జి మీద సంపాదకీయాలు ’బహుపద కర్మధారయ’ సమాసాలతో వ్రాసేవాడు. అదే వ్యక్తి ఇప్పుడు మార్గదర్శి నేపధ్యంలో తాను కాంగ్రెసుకు వ్యతిరేకినని చెప్పుకుంటున్నాడు. నిజానికి ఇతడు కాంగ్రెస్ కి వ్యతిరేకి కాడు. ఎవరైతే భారతదేశానికి నిబద్ధులో, ఎవరైతే నిజాయితీ గల దేశభక్తులో, వాళ్ళకి వ్యతిరేకుడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇతడు భారతవ్యతిరేకి.

వాస్తవానికి ఇతడు ఎప్పటికి ఏది పనికొస్తుందో ఆ వాదనని అడ్డంపెట్టుకొనే అవకాశవాది. నీతులన్నీ పేపరు మీద వ్రాతలై ఉంటాయి. చేతలన్నీ తద్భిన్నంగా ఉంటాయి. ఇందుకు ఉదాహరణలు కోకొల్లలు. ఇడుపుల పాయ వ్యవహారమే తీసుకొండి. ఈనాడు పత్రిక వ్రాతల ప్రకారమే, 30 సంవత్సరాల క్రితం ఆ భూమి వై.ఎస్. రాజశేఖరరెడ్డి కుటుంబం ఆక్రమించింది. 30 ఏళ్ళ క్రితం ఇప్పటి ముఖ్యమంత్రి తండ్రి వై.ఎస్.రాజారెడ్డి ఆక్రమించిన భూమి అది. పేపరు వ్యక్తి అయివుండీ, అందునా అన్యాయంఎక్కడ జరిగినా పసిగట్టి ఎండగట్టే బాధ్యత భుజస్కంధాల మీద వేసికొన్న నిజాయితీ నిలువెత్తు రూపమైన వ్యక్తికి, 34 ఏళ్ళుగా పత్రిక నడుపుతున్న, వ్యవస్థ వంటి వ్యక్తికి తెలియదా గతంలోని ఈ నిజం? మరి ఇప్పుడెందుకు, ఆ వై.ఎస్. రాజశేఖర రెడ్డి మార్గదర్శి మీద అరుస్తున్న నేపధ్యంలో ఇతడు ఇడుపుల పాయ వివాదం మీద అరుస్తున్నట్లు? ఏమి, ఇప్పుడు వై.ఎస్. రాజశేఖర రెడ్డికీ, రామోజీ రావుకీ మధ్య సంబంధాలు బెడిసి కొట్టాయా? అందుచేత ఇద్దరూ ఒకరి లొసుగులు మరొకరు తవ్వుకుంటున్నారా? దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నారని మన పెద్దలంటారు. అలా దొంగలు మధ్య పంపకాల సంబంధాలు అంటే terms బాగున్నంత కాలం దొంగలెవ్వరూ [ఒకరి వివాదాల పట్ల మరొకరు] రచ్చచేయరు. సంబంధాలు బెడిసికొట్టినప్పుడు వివాదాలు, కుంభకోణాలు బయటపెట్టుకుంటారు. ఈ రాజ రామోజీల యుద్ధం నిజమో నాటకమో మరిన్ని వివరాలకు గత టపా చూడగలరు.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు! .

10 comments:

నిజాన్ని ఎదుర్కోవటానికి చాలా ధైర్యం కావాలి. ఆ ధైర్యం లేని పిరికి దురభిమానులు చాలా మంది ఉన్నారు. నా ఉద్దేశ్యంలో మీకు కనీసం పది బెదిరింపు వ్యాఖ్యలొస్తాయి దీని మీద. ఏదేమైనా నిజాన్ని ఎలుగెత్తి చాటుతున్నందుకు మీకు శుభాకాంక్షలు

good analysis. This should be sent to TDP and NTR family members, who always say that NTR is like a GOD. He made several mistakes in his political life. NTR's political life would have ended with his first term(1983-88)only...had not Nadendla Bhaskara Rao brought him down in 1985. With that sympathy only, NTR could come to power again. So people forgot the mistakes he done during 1983-85 and voted for him in 1985 mid-term elections.

ఒక తెలుగువాడిని అప్రతిష్ట పాలు చెయ్యడం ఒక్క ఆంద్ర వాడికే సాధ్యం అని నిరూపించారు. ఆంద్రలొ పుట్టనందుకు గర్విస్తున్నాను.

ఎన్.టి.ఆర్ గురించి మీరు చెప్పిన విషయాలు ఆలోచించేవిగా ఉన్నాయు. మంచి సమాచారం ఇచ్చినందుకు నెనర్లు

90s lo kooda NTR garu hit icharu...

inko vishayam ante... 90% mandi NTR kante daridrulu rajakiyallo vunnaru...

47 lo freedom vachindi... 81 lo party pettadu ante... 34 years... 34 years lo entha marpu vastundi anedi meeku ippudu teleyadu... meeru inko 34 years tarvatha alochinchadi... ee blog open chesi chadavandi appudu telustundi...

anyways... your article is informative....

all the best

This comment has been removed by the author.

Gems Of Hindupur,

ఎన్.టి.ఆర్. మీద మీకున్న అభిమానం నాకు అర్ధం అయ్యింది. నటుడిగా అతణ్ణి నేనూ అభిమానిస్తాను. రాజకీయ నాయకుడిగా అతడిలోని లోపాలను ఒప్పుకోను. ఎన్.టి.ఆర్. మీద వీరాభిమానంతో నా టపాని ఏకపక్షంగా విమర్శించకుండా మీ అభిప్రాయం వ్యక్తపరచిన తీరు నాకు నచ్చింది. కృతఙ్ఞతలు.

ఒక అసాధారణాన్ని సాధారణం చేయటం కోసం పదే పదే అలాంటివే జరిపించడం అన్నది గూఢచర్య తంత్రం లో ఓ భాగం.........
దీన్ని గురించి కొంచం వివరించండి.ఆ విధంగ చెయివలసిన అవసరం ఎమిటి దాని వలన use ఎమిటి.plz give Reply.

Anonymous గారూ,

అసాధారణాన్ని సాధారణం చేయటం కోసం పదే పదే అలాంటి సంఘటనలు జరిపించే గూఢచార తంత్రంకి ఒకటి, రెండు ఉదాహరణలు ఎన్.టి.ఆర్. Vs ప్రఫుల్ల కుమార్ మహంత, RDX, మానవబాంబులు – నా టపాలో ఇచ్చాను.

ఇక ఈ తంత్రం ఉపయోగం గురించి అడిగారు – మొదటిసారి ఒక అసాధారణ విషయం జరిగినపుడు అందరి దృష్టి దానిమీదే కేంద్రీకరింపబడుతుంది. సహజంగానే దాన్ని తరచి తరచి లోతుగా చూస్తారు. అందుచేత ఇదే రకం సంఘటనల్ని మరికొందరి మీదా జరిపించి లేదా పదే పదే జరిపించి సదరు అసాధారణం అసాధారణం కాదు, సాధారణమేనని నమ్మిస్తారు. దీన్నే ’A’ అన్న సంఘటన జరిగాక అలాంటిదే ’B’ అనే సంఘటన జరిపించి ’A’ని erase చేయటం అనవచ్చు. అప్పుడు ఈ అసాధారణం గురించి ఎవరైనా ఏమైనా చెప్పుబోయారను కొండి శ్రోతలు ఏమంటారంటే – రామ్ గోపాల్ వర్మ సినిమా ‘క్షణం క్షణం’ లో శ్రీదేవి, వెంకటేష్ తను దొంగగా ఎందుకు మారాడో అన్న కథని [ఆ సినిమాలో అది కట్టు కథే లెండి] చెబుతుంటే, అమాయకంగా మొహం పెట్టి, "ఈ సినిమా నేను చూశా” అంటుంది. అదే మని వెంకటేష్ కోపగిస్తే “అది కాదండీ. మీరు చెబుతుంటే నాకు ముందే తెలిసిపోతుంది” అంటుంది. అలాంటి ప్రయోజనమే ఈ గూఢచార తంత్రం నుండీ లభిస్తుంది. ఈ తంత్రాన్ని సినిమాల్లో ఎక్కువు ఉపయోగించి కూడా జనం బుర్రల్లో నాటుకునేటట్లు చూస్తారు. అందుకని కూడా సినిమా ఫీల్డ్ ని గ్రిప్ చేస్తారు.

********

i want to know are there any human without some defects

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu