ఇక్కడో ముఖ్యమైన విషయం చెప్పాలి. ఎన్.టి.ఆర్. మొదటసారి అధికారంలోకి రాగానే చేసిన పనుల్లో ఒకటి రాష్ట్రంలో రిజర్యాయర్లలో పూడికలు తీయించే సంస్థని రద్దు చేయటం. దానితో రిజర్యాయర్లలో ఏటికేడు ఇసుక పూడుకుంది. రిజర్వాయర్ల నీటి నిలవ సామర్ధ్యం పడిపోయింది. దాంతో దీర్ఘకాలంలో వ్యవసాయం ఎంతగా దెబ్బతిన్నదో ఇప్పుడు మనకి బాగా తెలుసు. కాబట్టే బాగా వర్షాలు కురిస్తే వరదలొస్తాయి. ఒక్క ఏడాది వర్షం కురవకపోయినా తరువాతి పంటకు నీళ్ళుండవు. చిత్రమేమిటంటే ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలైనా దాన్ని పునరుద్దరించక పోవటం. ఇప్పుడేమైనా పునరుద్ధరించారేమో నాకు తెలియదు. [ఎందుకంటే కొన్ని శాఖలలో అందరు మర్చిపోయిన తరువాత మళ్ళీ నిశ్శబ్ధంగా పునరుద్దరిస్తారు. ఉద్యోగులు ఉంటారు. పని మాత్రం జరగదు. ఎవరయినా ప్రశ్నించినప్పుడు మాత్రం ’లేదే ఎప్పటి నుండో ఉంది’ అని మాత్రం జవాబు వస్తుంది. మనకి బాగా తెలిసి అప్పట్లో దాన్ని రద్దు చేశారు కదా అంటే ’ఆ. అప్పుడు రద్దు చేశారు. తరువాత మళ్ళీ పునరుద్దించారు’ అంటారు. అప్పటికీ అది ఎప్పటి నుండి పునరుద్దరించబడిందో మాత్రం చెప్పరు. ఇలాంటి జిమ్మిక్స్ ప్రభుత్వం, మీడియా కూడా కలిసి చేస్తున్న సందర్భాలు చాలా ఉన్నాయి.]

ఏమైనా ఎన్.టి.ఆర్. ఒకవైపు రిజర్యాయర్లు ఇసుకతో పూడుకు పోయే ఏర్పాట్లు చేసి వ్యవసాయాన్ని దెబ్బతీసి, మరోప్రక్క తెలుగు తమ్ముళ్ళు ఆకలి డొక్కలకి గంజి నీళ్ళు పోస్తున్నానంటే దాన్ని కుట్ర గాక మరింకే పేరుతో పిలవాలి? అంతే కాదు, తిరుమల తిరుపతి లోని అన్నమయ్య వారసులని మిరాశీదార్ల పేరుతో నిలువనీడ లేకుండా చేసింది కూడా అతడి హయంలోనే. శ్రీ వేంకటేశ్వర మహత్యం లాంటి సినిమాలు నిర్మించి నటించిన ఈ సినిమా దేవుడు నిజ జీవితంలో అంతగా భారతీయ సంస్కృతిని భ్రష్ఠపరచటానికి కుట్రదారులకి తోడ్పడిన వాడు. దీన్ని గురించిన పూర్తివివరాలు Coups On World లోని The writings and activities of Mr. Ramoji Rao before 1992 and after 1992 లో చూడగలరు. లేదా Fire Pot లో Annamayya’s heirs Vs Nizam’s heirs చూడగలరు.

రాజకీయ రంగంలో నకిలీ కణికుడి కుట్రలో ఎన్.టి.ఆర్. పాత్ర గురించి ముగించే ముందు మరో విషయం ప్రస్తావిస్తాను. ఇంతకు ముందే చెప్పినట్లు ఎన్.టి.ఆర్. రాజకీయ రంగప్రవేశం, ప్రజాదరణ ’తెలుగు వాడి ఆత్మగౌరవం’ అన్న నినాదంతో ముడిపడ్డాయి. అయితే ఆ నినాదం చేతల్లో ఎలా అపహాస్యం చేయబడిందో ’చెప్పుల’ వ్యవహారం తేటతెల్లం చేసింది. మరో ఆంశం ఏదంటే – రెండు రూపాయలకు కిలో బియ్యం పధకం. ఈ పధకం ప్రకారం తెల్ల రేషన్ కార్డున్న పేదలకు తలకు నెలకు 5 కిలోలు చొప్పున కిలో బియ్యం రెండు రూపాయలు లెక్కన ఇస్తారు. ఎన్.టి.ఆర్. ఆరోజుల్లో ఈ పధకం గురించి తన ప్రతీ ఉపన్యాసంలోనూ ఊదర బెట్టేవాడు. [నిజానికి ఇలాంటి పధకాలు ఆ నాటికే తమిళనాడు లో అంతకు ముందే అమల్లో ఉన్నాయి. గంజి సెంటర్లు లాంటివి కూడా.] సాధారణంగా అతడి ఉపన్యాసంలో “అలో లక్ష్మణా, ఆకలో రామచంద్రా అంటోన్న నా తెలుగు తమ్ముళ్ళ కింత గంజి నీళ్ళు పోస్తున్నాను” అన్న మాటలు ఉండేవి. సినిమా రంగలో ఉన్నప్పుడు ఏమీ చేయలేదు, కోట్ల ఆస్థి కొడుకుల కిచ్చి తమ్ముళ్ళకి గంజి పోస్తున్నాడంటూ ఆ రోజుల్లో కొందరు జోకులు కూడా పేల్చారు.

ఆ విధంగా తెలుగు వాళ్ళకి ఎన్.టి.ఆర్. జయప్రదంగా బిచ్చగాళ్ళ ముద్రవేశాడు. నిజానికి తెలుగునాడు భూములకి భారతదేశ ధాన్యాగారం అన్నపేరు ఉంది. ఆంధ్రప్రదేశ్ ను ’అన్నపూర్ణ’గా పిలిచేవారు. అప్పటికి 35 ఏళ్ళ కేంద్రకాంగ్రెస్ పాలనలో, ముఖ్యంగా ఇందిరాగాంధీ హయంలో హరిత విప్లవం పేరిట అధిక ధాన్యోత్పత్తి జరిగిన రికార్డు ఉంది. [ఈ రోజు కిలో బియ్యం 30/- రూపాయలకు మనం చచ్చినట్లు కొంటూ, తింటూ ఉంటే ముఖ్యమంత్రి మాత్రం కిలో 20/- లకే దొరుకుతున్నాయంటున్నాడే, - అలాంటి దొంగ లెక్కల రికార్డ్ కాదది.] అన్నపూర్ణ స్థితి నుండి బిచ్చగాళ్ళ స్థితికి పరోక్షంగా పూర్వపు ప్రభుత్వాలు, అధికారికంగా ఎన్.టి.ఆర్. లాగిపారేశాడు. బిచ్చగాళ్ళకి ఆత్మగౌరవం ఉండదనటం నా ఉద్దేశం కాదు. ఆకలో దేవుడా అనే వాళ్ళకు ’గంజి నీళ్ళంటూ’ రెండురూపాయల కిలో బియ్యల్లాంటి సంక్షేమ పధకాలతో శాశ్వతంగా బిచ్చగాళ్ళని చేయటమే తప్పా, వారి గౌరవాన్ని నిలబెట్టటం కాదు అని చెప్పడం మాత్రమే నా ఉద్దేశం.

వాస్తవానికి, రాష్ట్రం లేదా దేశం అంతటి దారిద్ర్య స్థితికి దిగజారినప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి లేదా దేశ ప్రధాన మంత్రి ఏంచెయ్యాలి? రైతుల్ని ఉత్తేజ పరచి, ఉత్సాహపరచి, వ్యవసాయాన్ని ప్రోత్సహించి, కావలసిన వసతులు సమకూర్చి ఎక్కువ పండేలా చూడాలి. ఎరువుల కంపెనీలు, పురుగుమందుల కంపెనీలు, విత్తన కంపెనీలు రైతుల్ని మోసగించకుండా, దోచుకోకుండా చూడాలి. మార్కెటింగ్ రంగంలో అధికారులూ, దళారులు రైతుని దగా చేయకుండా, దోచుకోకుండా నియత్రించాలి. ఇరిగేషన్, విద్యుత్ శాఖ అధికారులు, ఉద్యోగులూ రైతుల్ని లంచాల కోసం వేధించకుండా, నీరూ, కరెంటూ ఇచ్చేటట్లు చూడాలి. చెరువులు, రిజర్వాయర్లు, నదుల మీద ప్రాజెక్ట్ లు కట్టాలి. కడుతున్నామని లెక్కలు చెబుతూ డబ్బులు మింగకూడదు. కాలువలు తవ్వాలి, రాష్ట్రంలో లేదా దేశంలో మౌలిక వసతులు పెంచి పారిశ్రామిక అభివృద్ధి జరిగేటట్లు చూడాలి. ఆ విధంగా విద్యా, ఉపాధి అవకాశాలూ, ప్రజల జీవన స్థాయి పెంచాలి. Gross capita income, Per capita income పెరిగేలా చూడాలి. అంతేగానీ ద్రవ్యోల్బణం రేటు తగ్గినా పెరిగినా, నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోతూనే ఉండేలాంటి దొంగ లెక్కలు చెప్పకూడదు. [దీని గురించిన వివరమైన చర్చ Coups On World లోని Coup on Business …….. లో ఉంది. తెలుగులోకి తర్వాత అనువదిస్తాను] తిండిగింజలు, ఇతర నిత్యావసరాలు ప్రజలకి అందుబాటులోకి తేవాలి. మొత్తం దీనికి విపర్యంగా జరుగుతుంది. పేపరు మీద అన్ని నీతులే ఉన్నాయి. వాస్తవం మాత్రం దినికి విరుద్దంగా ఉంది. దీన్నే కుట్రగా నేను అంటున్నాను. ఎందుకంటే అన్ని ప్రభుత్వాలు దానినే కొససాగిస్తున్నాయి గానీ, సరిదిద్దటం లేదు కాబట్టి. జై జవాన్ – జై కిసాన్ నినాదం ఎక్కడ, నేడు రైతు, సిపాయిల పరిస్థితి ఎక్కడ?

శాశ్వత పరిష్కారాలు శాశ్వతంగా వదిలేసి సంక్షేమ పధకాలంటూ ప్రజల సొమ్ముని ఖర్చు పెడితే పర్వవసానం ఏమిటి? రాష్ట్రం లేదా దేశం మరింతగా ఆర్ధికంగా బలహీనం అవ్వదా? [ఆ పర్యవసానాలే కదా నేడు అనుభవిస్తున్నాం?]

ఇక్కడ చైనా సామెతగా ప్రసిద్ధి చెందిన ఓ సామెత గురించి చెప్పుకోవటం సమంజసంగా ఉంటుంది. “ఆకలిగొన్న వ్యక్తికి చేపనిస్తే ఆ రోజుకి అతడి ఆకలి తీరుతుంది. అదే చేపలు పట్టడం నేర్పిస్తే జీవితమంతా అతడి ఆకలి తీరుతుంది” – అని.

అటువంటప్పుడు ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి గానీ, ఓ దేశ ప్రధానమంత్రిగానీ చేయవలసిందేమిటి? చేపనివ్వడమా లేక చేపలు పట్టడం నేర్పడమా? ఏది వారి బాధ్యత? సంక్షేమ పధకాలా? ఉపాధి కల్పనా? వాస్తవానికి ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పధకాలు, ఓటర్ ఆకర్షక పధకాలు లేదా జనాకర్షక పధకాలు ప్రజల్ని, పేదల్ని మరింత సోమరులని చేస్తాయి. [ఇప్పుడున్న జాతీయ ఉపాధి పధకం కారణంగా రైతులకి కూలీలు దొరకటం లేదని బాధ పడటం – ఒకరికి పదిమంది రైతులు చెబుతున్నారు. పూర్తివివరాలు Coups On World లోని Coup on Agriculatural ….. లో చూడగలరు. తెలుగులోకి తర్వాత అనువదిస్తాను.]

సంక్షేమ పధకాలు ప్రజలకీ, పేదలకీ సోమరితనం తెస్తాయన్న విషయం నేను ఊహించో, కల్పించో చెప్పటం లేదు. ఒక సజీవ ఉదాహరణ చెబుతాను. 1995 లో నేనూ, నా భర్త ఎన్.జి.వో. లో అంటే Non Government Organization లో పనిచేశాం. అందులో భాగంగా కొన్ని గిరిజన తండాలనీ పర్యటించాం. మేం అటవీ శాఖ అధికారులతో పాటుగా, జీపుల్లో వెళ్ళినప్పుడు ఆ తండాల్లోని గిరిజనులు పరిగెత్తి వచ్చి మా చుట్టూ మూగే వాళ్ళు. వాళ్ళల్లో క్రొత్త పధకాల గురించి ఎంతో ఆశ. ఒక్క మాటలో చెప్పాలంటే పధకం పేరిట వచ్చే డబ్బు పట్ల ఆశ. వాళ్ళల్లో చాలా మందిలో తమ జీవితాల్ని అభివృద్ధి చేసుకోవాలనే ధృడ చిత్తం లేకపోవటం చూశాను. ఏదో స్కీం పేరిట ఎంతో కొంత డబ్బు కొన్ని దినాలు తినటానికి, తాగటానికి వస్తే చాలు పధకం పేరేదైనా సరే, ఏ సంస్థ ఆ పధకాన్ని నిర్వహిస్తున్నా సరే! వారికి పధకం విషయం గానీ, దాని ఉపయోగం గురించి గానీ పట్టదు. ఆ పధకాన్ని కేంద్రం, లేదా రాష్ట్రం లేదా స్వచ్చంధ సంస్థ లేదా ఐ.రా.స. ఎవరు స్పాన్సర్ చేస్తున్నా వాళ్ళకి అవసరం లేదు. [మరి అప్పుడప్పుడూ పేపర్లో మెరిసే విజయ గాధలు మాటేమిటీ అంటారేమో! ప్రభుత్వాలైనా, స్వచ్చంద సంస్థలైన కొన్ని రికార్డ్ కోసం విజయం సాధిస్తాయి. చాలా భాగం అవినీతిమయం అవుతాయి. మనకి మాత్రం పేపర్లలో, మీడియాలో విజయం సాధించినవి మాత్రం చూపించి ఆ పధకం విజయం సాధించింది, ఏదో కొన్ని ప్రాంతాల్లో విఫలమైనాయి అని చెబుతారు.]

అదే తండాలకి మేం మామూలు ఉద్యోగులుగా పధకాలను వివరించడానికి, వాటినెలా ఉపయోగించుకోవాలో మోటివేట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఇంత కూడా శ్రద్ధ కనపరిచే వారు కాదు. మనం వారి వెంట పడి చెప్పినా పెదవి విరిచే వారు. ఇంకా కొందరైతే గుసగుసగా “ఏమైనా కొత్త పధకాలు వస్తాయా? మీ వాటా మీరు తీసుకుందురు గానీ” అనేవారు. వారికి పధకాల అంతిమ ప్రయోజనం కంటే, ఏ పేరుతో డబ్బు వస్తే దాన్ని ఆయా ఉద్యోగులతో కలిసి పంచుకోవటానికి సర్వసన్నద్ధంగా ఉండే వాళ్ళు. వాళ్ళల్లో చాలామందికి కావలసింది ఈజీ మనీ. ఆ రోజుకి తినడానికి తాగడానికి డబ్బొస్తే చాలు, ఎలా వచ్చినా సరే! తమ జీవన స్థాయి పెంచుకోవాలన్న స్పృహ వాళ్ళల్లో చాలా మందికి లేదు. [ఇలాంటి వారి శాతమే మన ఓటర్లలో ఎక్కువ అన్నది గమనార్హం.]

నిజం చెప్పాలంటే – వాళ్ళల్లో ఎవరైతే జీవితంలో పైకి రావాలన్న తృష్ణ కలిగి ఉన్నారో అలాంటి వాళ్ళు కష్టపడుతూ ఉన్నారు, అవకాశాలు వెదుక్కుంటూ, దొరికితే అంది పుచ్చుకుంటూ, దొరకనప్పుడు అవస్థలు పడుతున్నారు. మిగిలిన వాళ్ళు కష్టపడకుండా ఆనందించటానికి మార్గాలు వెదుక్కుంటూన్నారు. ఇలాంటి వారి సహకారంతోనే ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులలో చాలామంది Disputes చేయగలుగుతున్నారు. కాబట్టే కోట్లాది సొమ్ము ఖర్చవుతోంది గానీ పేపరు మీద తప్ప ప్రగతి ఎక్కడా కనబడటం లేదు.

ఉదాహరణకి – పేద మహిళలకి ప్రభుత్వం ఇచ్చిన పాడి పశువుల ఋణమేళాని తీసుకొండి. పరిశీలనకి ఒక్కో గేదె 10,000 రూపాయలు అనుకొండి. సదరు ప్రభుత్వ ఉద్యోగులు అధికారులూ కలిసి ఒక్కగేదేని 10 మందికి ఇచ్చినట్లు చూపుతారు. [అందుకే గేదేలకు ఫోటోలు, నంబర్లు తెచ్చారు. గానీ శతకోటి దరిద్రాలకి అనంత కోటి ఉపాయలంటారు పెద్దలు] 10 గేదేలకి లక్ష రూపాయలవుతుంది. కానీ ఒక్క గేదేనే ఉపయోగించారు. లబ్ధిదారుల్లోంచి 10 మంది ఈ ఉద్యోగులతో కుమ్మక్కు అయినందున తలా 2,000 రూపాయలు తీసికొంటారు. దాంతో 20 వేలు+10 వేలు =30 వేల రూపాయలుపోను, లక్షరూపాయల్లో 70 వేల రూపాయలు ఉద్యోగుల నుండి రాజకీయ నాయకుల దాకా [Top to bottom] పంపకమౌతుంది. ఈ నిష్పత్తిలో డబ్బుపరిమాణం మనం ఊహించలేనంత పెద్దది. ఇలాంటి Disputes ఇప్పుడు మనం దాదాపు అన్ని రంగాల్లోనూ చూస్తునే ఉన్నాం కదా! ఇందులో ప్రధాన భూమిక ప్రజా జీవనంలోని అవినీతి కాదా? కేవలం ప్రభుత్వ ఉద్యోగులూ, రాజకీయ నాయకులు మాత్రమే అవినీతి పరులా? ప్రజలకీ అందులో వాటా లేదూ?

ప్రజస్వామ్యానికి అబ్రహం లింకన్ చెప్పిన నిర్వచనం ప్రజల కోసం, ప్రజల చేత ఎన్నుకోబడినది అని. అందులో నిజం సంగతి తెలీదు గానీ నేటి సమాజంలో అవినీతి ’ప్రజల చేత, ప్రజల యొక్క’ అయిపోయింది. ఈ పరిస్థితికి బాధ్యులెవరు? ప్రతీ ఒక్కరు – ఎవరైతే తమ బాగు గురించి తమ శ్రేయస్సు గురించి నిజాయితీగా ఆలోచించడం లేదో, ఎవరైతే ఈ అధునిక అభివృద్ధి చెందిన రోజుల్లో Disputes అన్నవి సహజం అనుకుంటున్నారో, ఎవరైతే విలువలు వదిలేసి డబ్బు వెనక పరిగెడుతున్నారో, ఎవరైతే అవినీతికి పత్యక్షంగానో, పరోక్షంగానో తోడ్పడుతున్నారో అలాంటి ప్రతీవ్యక్తి దీనికి బాధ్యుడే! ఇక్కడే అవినీతిలో ప్రతీ వ్యక్తీ తప్పనీసరిగా భాగస్వామి అయ్యేటట్లు చేయటం, కాదనీ నిజాయితీగా బ్రతకలేని స్థితిని కల్పించడమూ కుట్రలోని పార్శ్యం. ఒక వ్యక్తిగా ఎవరూ దీనిని ఎదుర్కోలేరు. అందుకే Divide and Rule Policy ఎంచుకున్నారు కుట్రదారులు.

ఈ నేపధ్యంలో ఇప్పుడు ప్రతీ పార్టీ, కిలో రెండూ రూపాయలకే కాదు, రూపాయకే లేదా ఉచితంగా నైనా ఇవ్వడానికి సిద్ధమౌతుంది. ఇంటికో కలర్ టివీ, ఋణమాఫీ ల్లాంటి ఓటు ఆకర్షక మంత్రాలు చెబుతున్నారు, ఓట్ల కోసం అలాంటి పధకాలు అవధులు గమనించకుండా అమలు చేస్తున్నారు. [ఇది ప్రపంచమంతటా ఉన్నట్లే ఉంది.]

ఈ రాజకీయ నాయకులకి అప్పటికి తమ పబ్బం గడుపుకొని ఓట్లు రాల్చుకోవటం తప్పితే పర్యవసానంగా కాలగతీలో దేశానికొచ్చే ప్రమాదం పట్టడం లేదు.

1989 ఎలక్షన్లలో అప్పటి నేషనల్ ఫ్రంట్, యావద్దేశంలోనూ 10 వేల రూపాయల లోపు రైతు ఋణాలను మాఫీ చేస్తానని ఎన్నికల మ్యానిఫెస్టోలో వాగ్థానం చేసింది. అధికారంలోకి వచ్చాక అమలు చేసింది. అందులో భాగంగా 10 ఎకరాల మాగాణి గల మా బంధువొకరు కూడా లబ్ధి పొందారు. అయితే మరో ప్రక్క దేశ ఆర్ధిక స్థితి కుదేలయ్యింది. పర్యవసానంగా, తరువాత వచ్చిన చంద్రశేఖర్ ప్రభుత్వం [1990-91] లో బంగారాన్ని అంతర్జాతీయ విపణిలో కుదవబెట్టవలసి వచ్చింది.

ప్రస్తుతం కూడా దాదాపు అన్ని పార్టీలు అన్నీ ఉచితంగా, బియ్యంనీ, ఇళ్ళనీ ఇస్తామన్న వాగ్థానాలు చేస్తున్నాయి. ఇదంతా కేవలం ఎన్నికల్లో ఓట్ల కోసమే. ఎన్నికలయ్యాక ఇప్పుటి ఎన్నికల ఖర్చుల్ని Sponsor చేసినందుకు కార్పోరేట్ కంపెనీలకి అన్నీ కట్టబెట్టేస్తారు. సెజ్ ల పేరుతో భూములిస్తారు. కార్పోరేట్ కంపెనీలకి అనుకూలంగా రూల్స్ మార్చి ప్రజల్ని దోపిడీ చేసుకోనిస్తారు. ప్రతిఫలంగా మళ్ళీ లంచాలు తీసుకుంటారు. ఇదీ పరస్పర సహకారం, అనుశృత చక్రం.

ప్రాధమికంగా ఆలోచిస్తే ప్రస్తుతం రాజకీయ రంగంలో ఉన్న వారెవరైనా ప్రజలకి మేలు చేస్తున్నారా? ఏ ఒక్కరైనా ఏ మాత్రమైనా ప్రజాసేవ చేస్తున్నారా? రాజకీయాల్ని వ్యాపారంగానూ, కెరీర్ గానూ భావిస్తున్నారు కాదా? రాజకీయాలు వ్యాపారం, ఆదాయా మార్గం అనుకోకపోతే ఎన్నికల్లో గెలవడానికి వందల కోట్లు రూపాయలు ఎందుకు ఖర్చు[పెట్టుబడి] పెడుతున్నారు? లేకపోతే ఎన్నికల తరుణంలో ఎందుకు ఓటు ఆకర్షక పధకాలు ప్రకటిస్తున్నారు? తాము ఇప్పుడు ప్రకటించే ఈ పధకాలు దీర్ఘకాలంలో ప్రజలకీ దేశానికీ ప్రమాదకరమైనవనీ వారికి తెలియదా? ఈ పరిస్థితి ఒక పధకం ప్రకారం జరుగుతున్న తీరు కాదా? చిన్న వ్యాపారమే ఒక పద్ధతి ప్రకారం జరపకపోతే వ్యాపారం ముందుకు సాగదు. అలాంటిది ఈ పరిస్థితులు వాటాంతట అవే వస్తాయా లేక పధకం ప్రకారం జరిపితే వస్తాయా? అలోచించండి.

ఇలాంటి ఈ జనాకర్షక పధకాలకు మన రాష్ట్రంలో ఆద్యుడు ఎన్.టి.ఆర్.

కుక్కమూతి పిందెలు గట్రా నీచమైన భాషని, జనాకర్షక పధకాలని రాజకీయ రంగంలో ప్రారంభించిన తొలి రాజకీయ నాయకుడు ఎన్.టి.ఆర్. అన్ని విషయాల్లో తర్కాన్ని రూపుమాపి, విమర్శకుల నోళ్ళు మూయించడానికి ఎన్.టి.ఆర్. సినిమా గ్లామర్ ఉపయోగపడింది. ఇక రామోజీ రావు పత్రికా బలం, మరింతగా ఎన్.టి.ఆర్. గ్లామర్ నీ పెంచేసి, తార్కికంగా ప్రశ్నించడాన్ని, విశ్లేషణల్నీ, విమర్శల్నీ, రాజకీయ రంగ భవిషద్దర్శనాన్ని కాలరాచింది. ఇదే స్ట్రాటజీ మన కంటే ముందు తమిళనాడు లో ఉపయోగించారు.

ఆ విధంగా నకిలీ కణికుడూ, అతడి మద్ధతు దారులైన ఇతరులు ఎన్.టి.ఆర్. నీ, అతడి సినిమా గ్లామర్ నీ ఆ విధంగా జయప్రదంగా ఉపయోగించుకొని రాజకీయ రంగంలో విలువల్ని వెళ్ళగొట్టేసారు. పైకి చూపించడానికి, ప్రజల్ని నమ్మించడానికి కొన్ని మంచిపనులు ఎన్.టి.ఆర్. చేత చేయించారు. బుద్ధపూర్ణిమ, టాంక్ బండ్ లాంటి ప్రాజెక్టులూ, మరికొన్ని మౌలిక వసతులూ! తొలిసారిగా యువకులకీ, పట్టభద్రులకీ రాజకీయ రంగంలో అవకాశాలు కల్పించడంతో అందరూ ఎన్.టి.ఆర్. ని ఆశావహదృక్పధంతో చూశారు.

ఏమో మార్పు తీసుకురాకపోతాడా అని ఎందరో అప్పట్లో ఎదురు చూశారు. విషాదమేమిటంటే ఆనాటి ఆ చదువుకున్న కొత్త రాజకీయ నాయకులే ఈనాటి కోడెల శివప్రసాదులూ, దేవేందర్ గౌడ్ లూ, కడియం శ్రీహరిలూ. ఇక వీరిలోని నిజాయితీ గురించి ఏ వివరణలూ అక్కర్లేదనుకుంటాను.

ఇక – 10 నిజాలు మాట్లాడి 90 అబద్దాలాడిన వాడిని సత్యవాది అంటామా అబద్దాల కోరు అంటామా? అబద్దాలు కోరనే కదా! 10 మంచి పనులు చేసి 90 చెడ్డపనులు చేసిన వాణ్ణి మంచి వాడంటమా, చెడ్డ వాడంటామా? మరి అలాంటప్పుడు కొన్ని మంచిపనులు చేసి అందుకు కొన్ని రెట్లు ఎక్కువగా కుట్రదారులకు చెడ్దపనులు చేసిపెట్టిన వాణ్ణి మంచివాడు అనాలా, చెడ్డవాడు అనాలా? ఎన్.టి.ఆర్. కుట్రదారులకు చేసిపెట్టిన మరికొన్ని పనులు Coup On Indian Epics లోనూ, Coup On Business&.... లోనూ కూడా చర్చించాను.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

4 comments:

ఒక టపాలో ఏదయినా విషయాన్ని చర్చిస్తూన్నప్పుడు దానికి సంబంధించి గత టపాల్లో ఏదయినా పేరాగ్రాఫ్ ఉంటే ఆ పేరాకి లింక్ వెయ్యడం ఎలా? ఎవ్వరికయినా తెలిస్తే చెప్పగలరు.

లింక్స్ గురించి తెలియదు కానీ, snapshot అనో ,snips అనో ఒకటుంది.
మన లింక్ మీద మౌస్ ఉన్నప్పుడు ఆ సైటు స్క్రీన్ షాట్ కనిపిస్తుంది.

కరెక్ట్ గా తెలుసుకొని మళ్ళీ చెప్తాను.

పధకాల గురించి మీరు చెప్పింది అక్షరాలా నిజం. జయప్రకాష్ నారాయణ గారు ఈ విషయం ప్రతీసారీ చెప్తూనే ఉన్నారు. కానీ పట్టించుకునే వారేరీ,

ముందు పాత టపాలో ఒక హైపర్ లింక్ టాగ్ తయారు చెయ్యాలి. అందుకోసం పాతటపా తెరిచి "Edit HTML" ఎంచుకుని మీకు కావల్సిన పేరాకి ముందు "" అని పెట్టండి.
ఇప్పుడు ఆ పేరాకి లంకె వెయ్యడానికి "http://ammaodi.blogspot.com/2009/02/18.html#para1" అని ఇవ్వండి. ( ఉదాహరణ కోసం ఈ టపా చిరునామానే పెట్టాను)
=====
ఇక మీ టపా విషయానికి వస్తే, ఎప్పటిలాగే చాలా బాగా రాశారు. సంక్షేమ పధకాల పేరిట ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నారు. దేశాన్ని దివాళా తీయుస్తున్నారు. నిరక్షరాస్యత మరియు ప్రజలలో చైతన్యం రాకపోవటమే దీనికి కారణం. మీరు గతంలో ఎప్పుడో రాసినట్టు " ఆకలి అభిమానాన్ని చంపుతుంది ". ( తీవ్రవాదం గురించి రాసినప్పుడనుకుంటా)
భాదేమిటంటే విద్యాధికులు కూడా ఈ ఈజీమనీకి అలవాటు పడటం. ఈ ప్రపంచాన్ని కాపాడాలంటే భగవానుడు కనీసం పది అవతారాలు ఒకేసారి ఎత్తాలి.

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu