దశావతారం సినిమా వచ్చి ఇప్పటికి చాలా నెలలు గడిచాయి. ఎన్నో సమీక్షలూ వచ్చాయి. అందులోని కమల్ హాసన్ నటన గురించీ, ఆయన ధరించిన 10 పాత్రల గురించి, ఆ పాత్రల మేకప్ కోసం కమల్ చూపిన సహనం గురించి, సాంకేతిక పరిఙ్ఞానం గురించి ఎన్నో విషయాలు చాలా మంది విశ్లేషించారు.

’భగవద్గీత’ కళ్ళతో చూస్తే దశావతారం సినిమా మనకి కనబడే తీరుని ఇక్కడ నేను విశ్లేషిస్తున్నాను. ఆదివారం ఆనందంగా చదువుకుంటారని ఆశిస్తాను.

ఈ సినిమా ప్రారంభంలోనే ’గోవింద్’ పాత్రధారి అంటాడు “భారత దేశంలోకి అల్లా, క్రీస్తు ప్రవేశించక ముందే, కొట్టుకోవడానికి మరే దేవుళ్ళు లేక ముందే, శివవిష్ణువులిద్దరూ రెండు వర్గాలై తమ భక్తుల రూపంలో కొట్టుకున్నారని”. [అడ్డబొట్టుపెట్టుకున్న వారిని అంటే శైవుల్ని వైష్ణవులు రక్తాలొచ్చేలా కొట్టారని, నిలువు నామం పెట్టుకునే వైష్ణవుల్ని శైవులు చంపించారని చరిత్ర చెబుతుంది. సింహాచలం స్థల పురాణంలో కూడా ఈ ప్రసక్తి కొంత ఉంటుంది.] ఇంకా “సీతాకోక చిలుక రెక్కల చప్పుడుకీ, భూప్రకంపనలకీ, సునామీలకీ సంబంధం ఏమిటంటారేమో. అనేక సంఘటనల సమాహారమే చరిత్ర!” అంటూ ప్రేక్షకుల్ని 12 వ శతాబ్ధానికి తీసికెళ్ళతాడు. తెరమీద గోవిందరాజస్వామి విగ్రహం, దానిని పెకలిస్తున్న తీరు, కమల్ హావభావాలు, కుళోత్తుంగ చోళునిగా నెపోలియన్ నటన – అన్నీ నాకు చాలా అద్భుతంగా అన్పించాయి.

ఇక ఆ కథలోని కొన్ని ముఖ్యపాత్రల్ని తాత్త్విక దృష్టితో చూస్తే…………

1]. రంగరాజనంబి:
తను నమ్మిన దానికోసం ప్రాణాలిచ్చిన వ్యక్తి. రాజు చూపించిన సామదానభేదదండోపాయాలకు లొంగి “ఓం నమశ్శివాయః” అనబోతున్నడేమో అన్పిస్తుంది చూస్తుంటే. భార్యపిల్లల వైపు నుండి గోవిందరాజస్వామి విగ్రహం వైపు తిరిగి, ఆ పాదాలపై చేతులేసి దుఃఖించేటప్పుడు “ఇదేమిటి స్వామి! నిన్ను నమ్మి ఇంతకు తెగబడ్డానే! చూస్తు ఊరుకుంటున్నావా?" అనే ఆక్రోశం కన్పిస్తుంది. అంతలోనే ఊపిరి దమ్ముబట్టి ఒక్కసారిగా “ఓం నమో నారాయణాయః” అనేటప్పుడు, అన్నాక ప్రజల్లో ఉత్తుంగధ్వనులు విని ఱొమ్ముపొంగుతుండగా రంగరాజనంబి ముఖంలో ఓ ధృఢనిశ్చయం కన్పిస్తుంది. భార్య భగవన్నామ మంత్రాన్ని మార్చమనప్పుడు, కొడుకు ముద్దుమాటలతో బ్రతిమాలినప్పుడు గోచరమైన వత్తిడిని దాటినతనం కన్పిస్తుంది. చోళుడూ, నంబి – ఇద్దరి వాదనల్లో ఎవరి మొండితనం వాళ్ళది. నిజానికి ఏపేరైతేనేం దేవుణ్ణి పిలవడానికి, కొలవడానికి?

కానీ ఆ నమ్మకం కోసం చావుకి సిద్దపడ్డాడు నంబి. శరీరంలోకి ఇనుపగొలుసుల కళ్ళేలు గుచ్చి వేలాడ దీసిన నప్పుడూ చలించడు. సముద్రంలో దేవుడి విగ్రహంతో పాటూ మునిగిపోతున్నప్పుడు రంగరాజనంబి విశాలమైన కళ్ళల్లో ఓ అయోమయం. “ఇదేమిటి? ప్రహ్లాదుణ్ణి కాపాడటానికి స్తంభాన్ని చీల్చుకొచ్చిన నృసింహుడిలా భగవంతుడు తనని కాపాడటానికి రాలేదేమిటి? తనూ, తనతో పాటు దేవుడి విగ్రహమూ సాగరంలో కలిసిపోతున్నామేమిటి?" అన్న అయోమయం. తన సాధన ఇంకా పరిణతి పొందాలేమో అని ప్రేక్షకులకి [నాకు]అన్పిస్తుంది.

2]. గోవిందు:
శాస్త్రవేత గోవిందు పాత్ర, పూర్వజన్మలో రంగరాజనంబి ఏమో అన్పించేటట్లు అవే పోలికలతో దర్శకుడు చూపించాడు. ఈ వ్యక్తి భగవంతుణ్ణి అంతగా నమ్మడు. అలాగని పూర్తిగా నమ్మకుండానూ ఉండడు. కానీ అతడి పట్టుదల మాత్రం మానవత్వం మీదే! ఆ రసాయన ఆయుధం ప్రజలకి హానికలిగించకూడదనీ, దుష్టుల చేతిలో పడకూడదనీ, తన ప్రాణాలకు తెగిస్తాడు. ఆ ఛేజింగ్ మనం సినిమా మొదటి నుండి చివరివరకూ చూస్తాం. మంచి కోసమో, శాస్త్రఙ్ఞానాభిలాషతోనో, కెరీర్ అనుకొనో తమలాంటి శాస్త్రవేత్తలు చేసే ప్రయోగాలు జగత్తుకి నష్టం కలిగిస్తున్నాయని బాధపడతాడు. అలాగని పరిశోధనల్ని వీడిపోని తృష్ణ అతడిది. ఇతడి లక్ష్యం మతం కాదు, మానవత్వమే. సి.ఐ.ఏ. మాజీ ఏజంట్ ఫ్లెచ్చర్డ్ [ఇతడి లక్ష్యం మతం కాదు, డబ్బు!] తనను వెంటాడు తున్నప్పుడు కూడా, అతడు బందీలుగా పట్టుకున్న ముస్లిం [పొడవాటి కమల్ హాసన్ పాత్ర] కుటుంబాన్ని, ఆ కుటుంబంలోని చిన్నపిల్లాడిని కాపాడటానికి వెనక్కి తిరిగి వస్తాడు. ఎవరో ముక్కుముఖం తెలియని వారి ప్రాణాల మీద కూడా అతడికి ఎంతో Concern. కానీ మతం విషయంలో ఇంకా రాని స్పష్టత అతడి పాత్రలో ఉంటుంది. “దేవుడు లేడని నేనెప్పుడన్నాను? ఉండి ఉంటే బాగుండేదంటున్నాను” అంటాడు కథానాయకతో, దాదాపు సినిమా చివరిలో. ఆ సమయానికి 12వ శతాబ్ధంలో కుళోత్తుంగ చోళుడు ముంచివేసిన గోవిందరాజస్వామి విగ్రహం, సునామీలో బయటపడి ఉంటుంది. దానికి గొలుసులతో కట్టబడిన రంగరాజనంబి అస్థికలు కూడా ఉంటాయి. వీళ్ళిద్దరూ దాన్ని ఆనుకునే ఒకరి కొకరు పరోక్ష సంభాషణలతో Propose చేసుకుంటారు.

ఇదంతా చూస్తున్నప్పుడు గీతలోని ఆత్మ సంయమయోగంలో చెప్పబడిన జన్మాంతర గతులు గుర్తుకు వస్తాయి. ‘జీవుడు వాసనలు మోసుకొస్తాడు,’ ‘కర్మఫలాన్ని బట్టి ఆయాజన్మలు ఎత్తుతారనీ’, ‘పూర్వజన్మ కర్మానుసారం, యోగంచేత ఆకర్షింపబడతారనీ’ చెప్పబడిన తత్త్వం గుర్తుకు వస్తుంది. ముందుజన్మలాంటి నంబి పాత్ర దేవుడు అన్న Concept దగ్గర ఉంటే తరువాతి జన్మలాంటి గోవిందు పాత్ర మానవత్వపు దిశలో ప్రయాణిస్తుంటుంది.

3]. పుణ్యకోటి:
అదే పుణ్యకోటి పాత్ర! ఇతడి దగ్గర భూమి మన ఇల్లు అనుకునేంత విశాలదృష్టి ఉంటుంది. కులం, మతం, ప్రాంతం అన్నీ హద్దులు దాటేసి పృద్ధ్వీ కుటుంబాన్ని చూడగలగటం, జీవితానికి గమ్యం మానవత్వమే అన్నట్లు, మతం పరమార్ధమూ అదే అన్నట్లు, పిల్లల్ని కాపాడి, ఆ ప్రయత్నంలో తన ప్రాణాలు పోతున్నప్పుడు కూడా తెరచి ఉన్న ఆ విశాలమైన కళ్ళల్లో ఓ స్పష్టతా, ఓ సంతృప్తి ఉంటాయి. పిల్లల్ని కాపాడగలిగానన్న తృప్తి, ఆనందం ఉంటాయి. చనిపోతున్న భయం కానీ, అయోమయం కానీ మచ్చుకైనా ఉండవు. నల్లగా అందవికారంగా ఉన్న ఆ మొహంలో మానవత్వమే వెలుగు చిమ్ముతున్నట్లుగా ఉంటుంది.

4]. బామ్మ:
దాన్నే గుర్తించిందా అన్నట్లు – ఆ వృద్ద మహిళ కృష్ణవేణి బామ్మ, 50 సంవత్సరాలుగా తనకొడుకు దశావతారం చనిపోయాడంటే నమ్మని మొండి బామ్మ – తన కొడుకుగా పుణ్యకోటిని గుర్తిస్తుంది. గుండెలు తట్టుకుంటూ రోదిస్తుంది. నాకైతే ఆవిడపాత్రలో సామాన్య భారతీయ ‘అమ్మ’ కనిపించింది. భారతమాత కన్పించింది. మానవత్వం ఉన్నవాణ్ణే తన పుత్రుడిగా అంగీకరించిన విశ్వమాత కనిపించింది. కొడుకు పోయాడంటే ఒప్పు కోని మొండి బామ్మ, ఆవిడ నమ్మకాన్ని బ్రతికించడానికి పార్సెళ్ళు పంపవలసి వచ్చిన గయ్యాళి బామ్మ, “ఈ పింజారి వెధవ తెచ్చిన ఈ డబ్బాలో ఏముందో? ఉండవే! దేవుడి కిచ్చేస్తే ఆయనే చూసుకుంటాడు!” అంటూ ఆ క్రిమి ఉన్న పెట్టెను గోవిందరాజస్వామి ఉత్సవ విగ్రహంలో పారేసిన మూర్ఖపు బామ్మ! కానీ మానవత్వాన్ని మాత్రం గుర్తించగలిగిన అమ్మ.

5]. ముస్లింయువకుడి పాత్ర :
ఇక కమల్ హాసన్ నటించిన మిగిలిన పాత్రల్లో పొడవైన ముస్లిం యువకుడు. అమాయకత్వం తప్ప ఆ సామాన్యుడిలో నాకు ఇంకేం కనబడలేదు. అందర్నీ దేవుడే కాపాడాడు అనుకుంటాడు. అంతే! ఏ వాదమూ చేయడు. తనకు జన్మనిచ్చిన తల్లి రక్తం తనలో ఉందిగనుక తన రక్తం తల్లికి ఎక్కిస్తే సరిపోతుందనుకుంటాడు. రక్తంలో గ్రూపులుంటాయనే సైన్స్ అతడికి తెలియదు. పెద్దగా సైన్సు గురించి కూడా గొడవపడడు. లక్ష్మి కోసం గోవిందు తిరిగి వస్తాడని నమ్ముతాడు. లక్ష్మి కూడా నమ్మదు. అలా మంచితనాన్ని నమ్మేసే సగటు మనిషి. తనకి సాయం చేసిన వ్యక్తికి సాయం చేయాలనుకొనే వ్యక్తి. అంతే, ఏ సిద్దాంతచర్చలూ లేవు. ఏ వాదనలూ లేవు. కోట్లాది సామాన్యులకి, మతాల కతీతంగా ప్రతీక – అతడి పాత్ర.

6]. జపనీయుడి పాత్ర:
ఇక లూకా సోదరుడైన జపనీయుడి పాత్ర. తన చెల్లిని గోవిందు చంపాడనుకొని ప్రతీకారంతో వచ్చిన అతడు అసలు నిజం తెలిసే సరికి గోవిందుకి సాయం చేస్తాడు, సునామీ వచ్చినప్పుడు, ముందుగా గుర్తించి గోవిందుని పడవలోకి పడదోసి కాపాడతాడు, అతడిని కాపాడటం కోసం ఫ్లెచ్చర్డ్ తో తలపడి పోరాడతాడు. అరిష్వర్గాలని దాటే దారిలో ఉన్న పాత్ర. ’హిరోషిమా’ గుర్తొస్తుందా అన్న ఫ్లెచ్చర్డ్ కి ’పెరల్స్ హార్బర్’ గుర్తొస్తుందంటూ దీటుగా జవాబు చెప్పిన పౌరుషం అతడిది. అణుబాంబు దెబ్బతిన్న జపనీయుల్లోని ఘోష అతడి పాత్రలోనూ, అతడి చెల్లెలు లూకా పాత్రలోనూ కన్పిస్తుంది. ’హిరోషిమాలో పుట్టిపెరిగిన అమ్మాయిని నేను చెప్పుతున్నాను విను అన్నయ్య! ఏంజరిగినా భోజనం మానేయకూడదు!’ అంటుందామె. ’అన్నం పరబ్రహ్మ స్వరూపం’ అంటారు. అన్నం తింటే అరిష్వర్గాలు అదుపులో ఉంటాయని, అప్పుడు మనిషి సరిగా అలోచిస్తాడని అంటారు.
అన్నట్లుగానే దెబ్బతిన్న బెబ్బులిలాగా ఫ్లెచ్చర్డ్ తో పోరాడి మరణిస్తుంది. ఆమె భర్త సురేష్ లా మరణానికి ఫోనుచేసి పిలిచి మరీ చావుని కొనితెచ్చుకోదు.

7]. అవతార్ సింగ్:
పరిణత ప్రకారం రంగరాజనంబి – గోవిందు – పుణ్యకోటిల వరుసకు చాలా వెనుక ఉన్న పాత్ర ఇది. సాధారణ ముస్లిం యువకుడి పాత్రకులాగే ఇదీ ఓ సమాంతర పాత్ర. అది అమాయకత్వం నిండిన పాత్ర అయితే అవతార్ సింగ్ భావవాదం నుండి మరింత భావవాదం వైపు లేదా ఆత్మవాదం వైపు అప్పుడప్పుడే మరలుతుంటాడు. డాక్టరు తనకి కాన్సర్ అని చెప్పినప్పుడు, ఆపరేషన్ తప్పనిసరి అయితే ప్రాణాలు నిలబడతాయి, పాడలేకపోవచ్చు అన్నప్పుడు – ఓ క్షణం ఆలోచించుకొని “డాక్టర్! పాటే నా ప్రాణం. పాడలేని నాడు నేను లేను. [పాట తనకు కీర్తిని, డబ్బునీ తెచ్చిచ్చే కెరీర్. కళ కూడా. కళాకారుడికి కళ భావమే, పదార్ధం కాదు.] ఆపరేషన్ చేయించుకోను అంటాననుకున్నారు కదూ! అనేవాణ్ణేమో ఈవిడ [భార్యవైపు చూపిస్తూ] పరిచయం కాకపోయిఉంటే! ఇప్పుడు అనను. నాకు నా భార్య పిల్లలు కావాలి. వాళ్ళకి నేను కావాలి” అంటాడు. అనుబంధాలు, ప్రేమ, వృత్తి కంటే కూడా గొప్పవని చెబుతుంది ఆ పాత్ర మనకి.

8]. ఫ్లెచ్చర్డ్:
ఈ పాత్రలో కమల్ చూపిన క్రౌర్యం మేకప్ మేన్ వేసిన పిండి పొరల ముడతల్లోంచి ప్రస్పుటంగా కన్పిస్తుంది. ఎవరి పట్లా ఏమాత్రం Concern లేని కసాయితనం – గోవిందు అమాయకపు తెలుగు మిత్రుడు సాయిరాంనీ, పోలీసుల్ని, పోలీసు ఇన్స్ పెక్టర్ నీ, ఉత్తినే పిట్టల్ని కాల్చినట్లు కాల్చేశాడు. తనకి సాయం చేసారన్న Concern కూడా లేకుండానే డాక్టర్ ’సేతు’ని చంపేయమని మల్లిక షేరావత్ కి అసైన్ మెంట్ ఇచ్చాడు. మల్లిక షెరావత్ ని ఏనుగు విసిరేసినప్పుడు, గాయపడ్డ ఆమె హాస్పటల్ కు తీసికెళ్ళమని అర్ధిస్తుంది. నిర్ధాక్షిణ్యంగా కాల్చేసాడు. ఎందుకంటే ఇక ఉపయోగపడదు. పైగా హాస్పటల్ కెళితే పట్టుబడుతుంది. నిజాలు బయటికొస్తాయి. విషయమేమిటంటే ఈమెను పాస్ పోర్ట్ తదితర సౌకర్యాల కోసం చర్చిలో పెళ్ళి చేసుకుంటాడు ఈ ఫ్లెచ్చర్డ్. డబ్బుకోసం, ఆ క్రిమి ఉన్న డబ్బాకోసం ఎన్నిప్రాణాలనైనా తీసిన నిర్ధాక్షణ్య ఫ్లెచ్చర్డ్ చివరికి తన ప్రాణాలని కూడా అంతే నిర్ధాక్షణ్యంగా తీసుకున్నాడు. చివరికి పొందిందేమిటి?

9]. బలరాజ్ నాడార్:
’రా’ అఫీసర్! ప్రభుత్వధికారినన్న పొగరు తప్ప మెదడే మాత్రం లేని పాత్ర. పక్కా రెడ్ టేపిజం చూపిన పాత్ర. మనిషిలో అలసత్వాన్ని, పటాటోపాన్ని చూపిస్తున్న పాత్ర. దీన్ని గురించి ఇంతకంటే చెప్పుకోవడానికి ఏమీ లేదు.

10]. జార్జి బుష్:
ఈపాత్ర Nacl అంటే ఉప్పని కూడా [అంటే అంత సింపుల్ విషయాలు కూడా] తెలీనంతటి గ్రేట్ రాజకీయనాయకులకి ప్రతీక. అంటే గొప్పస్థానాల్లో ఉన్న వాడికి అన్ని తెలుస్తాయని చెప్పలేము.

ఇలా మనిషిలోని అన్ని భావాలని ఈ పాత్రలు ప్రతిబింబిస్తాయి.

ఈ సినిమాలో ఇంకా చెప్పుకోవాల్సిన పాత్రలు మరికొన్ని ఉన్నాయి. వాటిల్లో

లక్ష్మి:
రంగరాజనంబి భార్య లక్ష్మి. ప్రాణాలు నిలబెట్టుకోవటానికి ఏపేరైతే నేం శివుడైతేనేం, విష్ణువైతేనేం అంటుంది. “8 అక్షరాలైతే నేమిటి? 5 అక్షరాలైతే నేమిటి? ఓ మూడక్షరాలు తగ్గించుకొని పలకండి” అంటుంది. ఈ పాత్రకు మరుజన్మేమో అన్పిస్తూ అదే పోలికలతో ఉండే కృష్ణవేణిబామ్మ మనుమరాలులక్ష్మి పాత్ర, ఈ స్థితికి పరిణామ స్థితిని చూపుతుంది. ఈ లక్ష్మి గోవిందరాజస్వామి ఉత్సవ విగ్రహాన్ని కాపాడటానికి లైఫ్ రిస్క్ తీసుకుంటుంది. కదిలే రైల్లోకి ఎక్కేస్తుంది. ఇసుక రౌడీలను ఎదుర్కొంటుంది. ఫ్లెచ్చర్డ్ ఆ బొమ్మని విసిరేసినప్పుడు “అమ్మో పెరుమాళ్ళు!” అంటూ పైకి పరుగులు పెడుతుంది. తన ప్రాణాలు లెక్కచేయదు. ఒక నమ్మకం పట్ల పట్టుదల పెరిగే తీరుని ఆ పాత్ర మన కళ్ళముందు ఆవిష్కరిస్తుంది.

రంగరాజనంబి భార్య లక్ష్మిలో రాజీపడే ధోరణి ఉంటుంది. నంబి మానసిక స్థితికి ముందు స్థితిలో ఈ పాత్రస్థాయి ఉంటుంది. తరువాత బామ్మ మనుమరాలులక్ష్మిలో నంబిలో కన్పించిన పట్టుదల కన్పిస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే నంబి భార్య 1వతరగతిలో ఉన్నప్పుడు నంబి రెండవ తరగతిలో ఉన్నట్లు, బామ్మ మనుమరాలుగా ఆమె రెండవ తరగతిలోకి వచ్చేటప్పటికి, గోవిందుగా అతడు 3వ తరగతికి వచ్చినట్లు కనబడతారు. Ultimate గా పుణ్యకోటి చదివే మానవత్వపు తరగతికి Promote కావాల్సిఉంది.

మల్లిక షెరావత్ పాత్ర :
డబ్బుకోసం ఏమైనా చేసే, పాకిస్తానీ అమ్మాయి. అప్పుడే పరిచయమై, ముక్కుముఖం తెలీని, తనను చూసి చొంగ కార్చిన డాక్టర్ సేతుని అంతే కవ్విస్తూ సన్నని చువ్వతో గుండెల్లో, గొంతులో చులాకీగా పొడిచి పారేసిన అతి చలాకీ భామ. ఏం బావుకుంది? తమ డబ్బే సర్వం అనుకొని ఫ్లెచ్చర్డ్ ఇచ్చిన ఆసైన్ మెంట్ చేసింది. అదే అనుకొని, గాయపడిన ఆమెని ఆసుపత్రికి తీసికెళ్ళమని అర్ధిస్తున్నా వినకుండా, ఫ్లెచ్చర్డ్ కూడా కాల్చి చంపేసాడు. ఆమెదీ పరుగే. అతదిదీ పరుగే. ఎప్పడది దాటి గెలుపు బాట పట్టాలో!

డాక్టర్ సేతు:
ఉన్నతమైన సాంకేతిక సంస్థ ఛీఫ్ పదవి నుండి డబ్బు, అది అందించే స్వర్గసుఖం అనుకుంటూ ఏ ద్రోహానికైనా ఒడిగట్టాడు. అమ్మాయే స్వర్గం అనుకున్నాడు. ఆ అమ్మాయే అతణ్ణి చంపి డస్ట్ బిన్ లో పారేయించింది. చివరికి అతడి శవం, దేశం గాని దేశంలో గార్బేజిలో తేలింది. అంటే అదే అతడి స్వర్గమా?

లూక భర్త సురేష్ :
గోవింద్ తన ఇంటికి సపోర్ట్ కోసం వస్తే సేతుకి ఫోన్ చేసి సమాచారం ఇస్తాడు, "ఎందుకు? ఎందుకిలా చేసావ్? డబ్బు కోసమేనా? అసలు మనిషవేనంటరా నువ్వు?" అంటూ గోవిందు నిలదిస్తే “మనిషినో కాదో కానీ, నీలా మూర్ఖుణ్ణి కాదు” అంటాడు. అంటే ఫ్లెచ్చర్డ్ [మాజీ సి.ఐ.ఏ., కార్పోరేట్ కంపెనీల ఏజంటుగా ఆ కథలో వర్ణింపబడ్డాడు.] లాంటి వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడితే మూర్ఖత్వం, [వాళ్ళతో లాలూచీపడితే లౌక్యం?] అన్నట్లుంటుంది అతడి వాదన. అయితే అతడు బుద్ధిగా ఫోన్ చేసి గోవిందు తమ ఇంటికి వచ్చాడన్న విషయం చెప్పినందుకు [మిత్రద్రోహానికి ఒడిగట్టి మరీ] పొందిన బహుమతి మృత్యువు. ఇది చూసినప్పుడు గీతా శ్లోకం

శ్లోకం :
హతోవా ప్రాప్స్యసే స్వర్గం జిత్వావా భోక్ష్యసే మహీం
తస్మా దుత్తిష్ఠ కౌన్తేయ యుద్దాయ కృతనిశ్చయః

భావం:
అర్జునా! యుద్ధంలో మరణిస్తే స్వర్గం పొందుతావు. గెలిస్తే యీ భూలోక రాజ్యాన్ని అనుభవిస్తావు. కనుక, యుద్ధం చేయాలనే దృఢనిశ్చయం గలవాడవై, లే.
గుర్తుకు వస్తూంది.

[పోరాడి – చచ్చి స్వర్గమో, గెలుపో వచ్చేదాక పోరాడు. అంతేగానీ దుష్టుడితో లౌక్యపు రాజీలు పడవద్దు, అది నీచమైన చావుని ఇస్తుంది.]

ఇక ఈ కథని వదిలేసి చిత్రీకరణతీరు, నటీనటుల కళాకౌశలం, దర్శకప్రతిభ, కథాస్ర్కిప్టురచయితల నైపుణ్యం గురించి నాకంటే మన బ్లాగు మిత్రులు ఇంకా బాగా వివరించారు. ఇప్పుడిక అది అప్రస్తుతం.

అయితే కమల్ నటనని మాత్రం మరోసారి శ్లాఘిస్తాను. ఇక ఈ కథలో కొసమెరుపు ఏమిటంటే

WTC పై 11/9 దాడుల తర్వాత ప్రపంచమీడియాలో విస్తృతంగా ఆంత్రాక్స్ గురించి ప్రచారమయ్యింది. అదేదో రసాయనిక పొడి పోస్టుల్లోనూ, పార్శిళ్ళలోనూ వస్తుందనీ, విప్పి తాకిన వారు దాని బారినబడి రోగగ్రస్తులై మరణిస్తారని! సినిమా కథలో చూపిన రసాయన క్రిమి అలాంటిదో కాదో తెలీదు గాని, ఆ క్రిమి ఫ్లెచ్చర్డ్ మ్రింగటం, అతడి బాడీ నుండి ఆక్రిమి బయటకు రావటం, అది గాలిలో వృద్ది చెందటం, అది చూసి బలనార్ నాడర్ లాంటి ’రా’ ఆఫీసర్ హెలికాప్టర్ లో పారిపోవటం, ఆపైన సునామీ రావటం – ఇవన్నీ మాత్రం సినిమాలో హైలెట్.

సునామీ చూపిన తీరు అద్భుతంగా అన్పించింది నాకు. ఆ సినిమాలో సునామీ రసాయనిక క్రిమి బారినుండి ప్రజల్ని కాపాడిందో, లేదో గానీ, చిత్రంగా 2004 లో క్రిస్మస్ మరునాటి సునామీ తర్వాత మాత్రం ప్రపంచంలో ఆంత్రాక్స్ వార్తలు లేవు.

ఏ సీతా కోక చిలుక రెక్కల చప్పడుకి ఏది కారణమో, ఏది పర్యవసానమో మరి!

ఇక ముగించే ముందు మరోమాట…..

నిన్న [Feb.14,09] తెలుగు లలితకళాతోరణంలో నంది ఫిల్మ్ అవార్డులు ప్రదానం ప్రత్యక్షప్రసారం సప్తగిరిలో చూశాను. ఆ వేదిక మీద మిమిక్రీ ఆర్టిస్టులు జనాల్ని నవ్వించడానికి నానా ఫీట్లు చేయడం చూశాను. డైలాగ్, అభినయం, స్టేజీపై హంగులున్నా కూడా జనాలకి నవ్వు బదులు విసుగు తెప్పించారు. అది చూస్తే అన్పించింది మన బ్లాగులలో ఉన్న నైపుణ్యం అంతా ఇంతా కాదని! కేవలం వ్రాతలతోనే వ్యంగోక్తుల్నీ, పేరడీలని, హాస్యవిశ్లేషణల్నీ, పోలికల్నీ వ్రాసి కడుపుబ్బా నవ్విస్తున్నారు. కాబట్టి మనమంతా గట్టిగా జేజేలు చెప్పేసుకోవచ్చు మన బ్లాగ్లోకానికి.

అందుకే మరోసారి చెబుతున్నాను – తెలుగు బ్లాగురులందరికీ జేజేలు.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

6 comments:

ఇలా రాస్తున్నందుకు ఏమీ అనుకోవద్దు. కానీ శీర్షిక చూసి నేను ఈ వ్యాసంలో విషయం ఉందనుకున్నాను. కానీ నిరాశ పరిచారు. భగవద్గీత కళ్ళతో అంటూ మొదలుపెట్టారు కాబట్టి ఏదో ఒకటి రెండు సందర్భాలలో ఆ శ్లోకాలు చెప్పినట్టున్నారు.

బాగుందండి.
నిజం. బ్లాగుల్లోని మేధావుల ముందు సినిమా వాళ్ళు పనికిరారు. ఇక నుండి బ్లాగుల్లోంచే కధావస్తువు తీస్కొవచ్చు దర్శకులు.

కమల్ హాసన్ కూడా మీ లాగే ఆలోచించాడన్నది నా నమ్మకం. అంటే డిటో అని కాదుగానీ, ఇంచుమించుగా ఇదే దాని థాట్ ప్రాసెస్. ఊరికే సూపర్ ఫిషియల్ గా కనిపింఛే స్టోరీ అయితే కాదు. అంటే ముందు 10 అనుకోలెదట - తరువాత యాడ్ చేసుకున్నరట.


“భారత దేశంలోకి అల్లా, క్రీస్తు ప్రవేశించక ముందే, కొట్టుకోవడానికి మరే దేవుళ్ళు లేక ముందే, శివవిష్ణువులిద్దరూ రెండు వర్గాలై తమ భక్తుల రూపంలో కొట్టుకున్నారని” - ఈ వాక్యం మీ స్టైల్లో మీరు వాడారు- నేను కొంత పొడిగిస్తా.

సర్లెండి, మిగిలిన విషయాలు నే రాసుకుంట.

i am no more Anonymous ; but still kamal doesn't know me....so i am Anonymous :)

నేను ఇంత లోతుగా చూడలేదు. మేకప్ ముసుగులో కమల్ ఫీలింగ్స్ కనపడలేదు లేకుంటే ఫ్లెచర్,లూకా, ముస్లిం పాత్ర ఇంకా రక్తి కట్టేవి.

లూకా సోదర పాత్ర

i agree with manohar...........
edo 10 characters cheddam annanta tapana tappite acting ledu............

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu