ఒకసారి, శ్రీశైలంలో అభిషేకపూజల టిక్కెట్లలో గోల్ మాల్ జరిగింది. శిరోజాల వేలం విషయంలో కూడా! పెట్రోలు బంకులో మీటర్ రీడింగులో తప్పులు రావటం గురించి యాత్రికులు గొడవ చేయటంతో విషయం రచ్చకెక్కింది. స్థానిక ఉద్యోగులలో వ్యక్తిగత కోపావేశాలు, పంపకాలలో వైషమ్యాల కారణంగా కూడా కొన్ని అవకతవకలు పేపర్ కెక్కాయి. ఆయా సందర్భాలలో న్యూస్ కంట్రిబ్యూటర్ల వ్యవస్థ ఎలా పనిచేస్తుందో మాకు స్పష్టంగా గోచరమయ్యింది. అన్ని పత్రికల న్యూస్ కంట్రిబ్యూటర్ల మధ్య సంబంధాలు, సమాచార మార్పుడులు ఉంటాయి. ఒకరి మీద ఒకరు వ్యంగ్యోక్తులు విసురుకుంటూ "ఫలానా వాడు మరీ చౌకగా సమాచారం అమ్మేస్తున్నాడు" అనుకోవటం కూడా గమనించాము.

శ్రీశైలంలో, ముస్లిం వ్యక్తికి దేవాలయ ప్రధాన ద్వారం ప్రక్కన Art Emporium ని allot చేసిన విషయంలో దేవాదాయ అధికారులు, న్యూస్ కంట్రిబ్యూటర్లు, స్థానిక వ్యాపారుల మధ్య సమీకరణాలు మరింత బాగా అర్ధమయ్యాయి. అప్పట్లో స్థానిక పత్రికలలో వార్తాంశాలు రావటం, తదుపరి పరిణామాలు, వాటిపై చర్చలు జరగటం పరిశీలించాము. అలాగే మరో సందర్భంలో స్థానిక చిరుద్యోగి ఒకరు [ఇతడు దేవాదాయ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘానికి ఉపాధ్యక్షుడట!], తన అవినీతిపై ఆరోపణలు పత్రికలలో రావటాన్ని సవాలు చేస్తూ, తన వాదనని కరపత్రాలలో ముద్రించి గుడి ముందు పంచి పెట్టాడు. ఆ సందర్భంలో... పత్రికలలో వార్తలు రావటాన్ని ఉటంకిస్తూ, ’ఇలాంటివి తనకి కొత్త కాదనీ, అవి తననేమి చేయలేవని ’ సోదాహరణంగా చెప్పాడు. అంటే ఎప్పుడెప్పుడు తన అవినీతిపై పత్రికలలో వార్తలొచ్చాయో, అయినా తన ఉద్యోగానికి, కెరీర్ కి ఢోకా లేకపోవటం అన్నమాట. అదంతా చూసి మేము విస్తుబోయాము.

ఇదంతా ఆలోచిస్తున్నప్పుడు, ఈనాడు ప్రధాన కార్యాలయంలో ఉపసంపాదకురాలిగా పనిచేస్తున్న నా మిత్రురాలు, 1991లో చెప్పిన విషయం గుర్తుకొచ్చింది. అప్పట్లో యధాలాపంగా చెప్పుకున్న ముచ్చట్లలో దొర్లిన విషయం ఇది. ఆ రోజామె తమ ఛైర్మన్ రామోజీరావు పీరియాడికల్ గా నిర్వహించే మీటింగుల గురించి చెబుతూ "ఈ రోజు మా ఛైర్మన్ so and so రిపోర్టర్ ని "ఏం? ఈ మధ్య సీఎంతో మందుపార్టీలు ఎక్కువై పోయినట్లున్నాయే?" అన్నాడే కళ్ళెగరేస్తూ!" అంది. అప్పటికి సీఎం నేదురుమల్లి జనార్ధన రెడ్డి. దాంతో మా గుంపులోని మరో స్నేహితురాలు "అదేమిటి? రిపోర్టర్స్ కి సీఎంలతో మందుకొట్టేంత సీనా?" అంది. నేను "అది తెలిసీ మీ ఛైర్మన్ ఊరుకుంటాడా?" అన్నాను. నా ఈనాడు మిత్రురాలు నవ్వేసింది.

మరో సందర్భంలో "మా ఛైర్మన్ లో రసపుటిక్ పవర్ లాంటిదేదో ఉందే! మీటింగ్ కి ముందు, నెక్ట్స్ వీక్ లో ఫలానా విషయం మీద ఫలానా రకంగా వ్రాయలాట అని విన్నప్పుడు ఒక్కోసారి అలా వ్రాయకూడదనిపిస్తుంది. అదే మీటింగ్ లో, మా ఛైర్మన్ దాని గురించి చెప్తుండగా మీటింగ్ అయ్యేసరికే ఇక విరగరాసేయాలనిపిస్తుంది" అంది.

అప్పట్లో అవన్నీ యధాలాపంగా విని వదిలేసాను. 2005 తర్వాత, వాటి గురించి ఆలోచిస్తు, విశ్లేషిస్తున్నప్పుడు ఆ నెట్ వర్క్ లోని కార్యకారణ సంబంధాలు అర్ధమయ్యాయి. సీఎంలూ, మంత్రులూ ప్రముఖ పత్రికల, వార్తాసంస్థల రిపోర్టర్లతో సత్సంబంధాలు నడపటం ఇప్పుడందరికీ తెలిసిందే! ఆ విధంగా సీఎంలకీ, మంత్రులకి ఇతర పెద్దలకీ, పత్రికాధిపతులకీ మధ్య వార్తాహరత్వం [కొరియర్ షిష్] కూడా నడపబడుతుందన్న మాట. మరో మాటలో చెప్పాలంటే అది పైస్థాయిలో జరిగే మీడియా మాఫియా పని తీరు అయితే, న్యూస్ కంట్రిబ్యూటర్లతో జరిగేది క్రింది స్థాయిలో మీడియా మాఫియా పనితీరు.

వందల కోట్ల రూపాయల టర్నోవర్ గల కార్పోరేట్ కాలేజీల యాజమాన్యాలతో, రామోజీరావు టర్మ్స్ ఏమిటో... ఎంసెట్ టాప్ ర్యాంకర్లతో ఫోటోలూ, ప్రచురణలూ తెలియచెపుతుంటాయి. ప్రతీ సంవత్సరం శ్రీచైతన్య బీఎస్ రావుతో ఫోటోలు దిగే రామోజీరావుకి ఎంసెట్ ర్యాంకుల్లో ఎన్ని అవకతవకలు జరుగుతున్నాయో తెలియదా? IIT ర్యాంకుల్లో జరుగుతున్న అవకతవకలు తెలియవా?ఇటీవలే కోర్టు ద్వారా పోరాడిన ఓ తండ్రి IIT ర్యాంకుల విషయంలో జరుగుతున్న మోసాల గురించి పత్రికల్లో వెల్లడించిన వివరాలు పత్రికాధిపతులకు తెలియవనుకోలేం కదా!

>>>ఐఐటీల గుట్టు రట్టు

ఆర్టీఐతో పారదర్శకతపై రాజీవ్‌ పోరు

ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఐఐటీ)ల్లో సీట్ల ఎంపిక ప్రక్రియను సజావుగా నిర్వహిస్తున్నారా? అంటే నీళ్లు నమలాల్సిందే! 19 ఏళ్ల సంచిత్‌ ఉదంతాన్ని చూస్తే ఐఐటీలపైనా నీలినీడలు కనిపిస్తాయి. 2006లో ఐఐటీలకు జరిగిన ఉమ్మడి ప్రవేశ పరీక్షల్లో (జేఈఈ) 224 మార్కులు సాధించిన సంచిత్‌ను కాదని.. 154 మార్కులు తెచ్చుకున్న మరో విద్యార్థికి కౌన్సెలింగ్‌ అవకాశం లభించడం దీనిని బలపరుస్తోంది.

ఎందుకిలా జరిగిందంటూ సంచిత్‌ తండ్రి రాజీవ్‌కుమార్‌(50) అన్ని ఐఐటీల డైరెక్టర్లకు లేఖలు రాశారు. ఎవరి నుంచీ ప్రతిస్పందన కానరాలేదు. డీఆర్‌డీఓ మాజీ శాస్త్రవేత్త, ఐఐటీ ఖరగ్‌పూర్‌లో కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌లో ప్రొఫెసర్‌ అయిన రాజీవ్‌కుమార్‌.. ఐఐటీ ఎంపిక జాబితాలో పారదర్శకతను ప్రశ్నిస్తూ సుదీర్ఘపోరుకు తెరలేపింది అప్పుడే.

కటాఫ్‌ మార్కుల విషయంలో అనుసరిస్తున్న విధానం వివరాలు తెలపాలంటూ ఆర్టీఐ కింద దరఖాస్తు చేశారు. 2006 ప్రవేశపరీక్షతో సంబంధం ఉన్న అధికారుల వివరాలతో పాటు ప్రశ్నపత్రానికి సమాధానాలను తెలపాలని అభ్యర్థించారు.

అధికారులు సమాధానం చెప్పకుండా దాటేశారు. సబ్జెక్టుల వారీగా కటాఫ్‌ మార్కులు, వాటి కన్నా ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులు ఎందరు అని ప్రశ్నిస్తూ.. రాజీవ్‌కుమార్‌ 2007 జనవరిలో మరో అప్పీల్‌ చేశారు. ఎట్టకేలకు కోరిన సమాచారాన్ని అధికారులు ఆయనకు అందజేశారు. ఆ సమాచారాన్ని విశ్లేషించడంతో.. కటాఫ్‌మార్కుల నిర్థారణలో ఉన్న లోటుపాట్లు బహిర్గతమయ్యాయి.

ఈ కారణంగానే సంచిత్‌ సహా 993 మంది విద్యార్థులకు కౌన్సెలింగ్‌ అవకాశం దక్కలేదని గ్రహించారు. దాంతో రాజీవ్‌కుమార్‌ కోల్‌కతా హైకోర్టును ఆశ్రయించారు. అది ఇంకా కోర్టులో పెండింగ్‌లో ఉంది. ఆ తరువాత ఆయన ఐఐటీకి ఎంపికైన విద్యార్థుల వ్యక్తిగత వివరాలను సేకరించారు. ప్రవేశపరీక్షలో పాలుపంచుకున్న ఐఐటీ ప్రొఫెసర్ల పిల్లలు ఎందరో ఐఐటీకి ఎంపికయ్యారని ఆరోపించారు.
ఈ అంశాలను మీడియా ప్రజల ముందుకు తీసుకురావడంతో.. కటాఫ్‌ విధానంపై ఐఐటీలు ముందుగానే వెల్లడించక తప్పలేదు. పరీక్షలకు ముందుగానే తమ వెబ్‌సైట్లలో ఆ వివరాలను పొందుపరుస్తున్నాయి. ఐఐటీ ఖరగ్‌పూర్‌లోనే ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నా.. ఏడాదిన్నర పాటు సమాచారాన్ని అందించకుండా తొక్కిపెట్టారని రాజీవ్‌ వాపోయారు.

అయినా ఆర్టీఐ సహకారంతో దానిని సాధించగలిగాననే సంతృప్తి ఆయనలో వ్యక్తమవుతోంది. ఈ ఏడాది ఆర్టీఐ జాతీయ అవార్డులకు నామినీగా ఎంపికైన ఆయన తన పోరాటాన్ని ఇంకా విరమించలేదు. ఏడాది పాటు జవాబు పత్రాలను భద్రపరచాలన్న నిబంధనలకు ఖరగ్‌పూర్‌ ఐఐటీ ఎలా నీళ్లొదిలింది? ఐఐటీ ప్రొఫెసర్ల పిల్లలే ఎప్పుడూ ఎలా ఎంపికవుతున్నారు? అని ప్రశ్నలు సంధిస్తున్నారు.


ఈ వార్తాంశం మీద ఏపాటి ఫోకస్ చేసాయి పత్రికలు? ఈపాటి చిన్నవార్తని ఈనాడు పత్రికైతే అసలు ప్రచురించనే లేదు.

1992 కి ముందరి రోజుల్లో, ఓసారి... రాష్ట్రంలో బైరేటిస్ గనుల వ్యవహారంలో ఈనాడుకీ, వై.యస్. రాజశేఖర్ రెడ్డికీ మధ్య వైషమ్యం నడిచింది. అప్పట్లో ప్రతీరోజూ ఈనాడు పత్రిక ప్రత్యేక స్థలం కేటాయించి మరీ, పెద్దపెద్ద అక్షరాల్లో, ప్రాసతో కూడిన శీర్షికలతో, తెగరాసి పారేసింది. ఆ తర్వాత రాజకీయ రాజీ కుదిరింది. ఆ సందర్భంలో ఆ వార్తలు వ్రాసిన ఉప సంపాదకుణ్ణి[నాగభైరవ వీరబాబు] ఈనాడు ఉద్యోగం లోంచి తొలగించింది. ఎదిరి వర్గపు అహం సంతృప్తి కోసమన్న మాట!

ఆ తర్వాత అతడికి ఒంగోలు దగ్గరి గుళ్ళాపల్లిలో జూనియర్ కాలేజీ పెట్టుకోవటానికి సహాయసహకారాలందించాడు రామోజీరావు.[సదరు వీరబాబు సినీ సంభాషణల రచయిత నాగభైరవ కోటేశ్వరరావుకు స్వయానా కుమారుడని విన్నాను.] ఆ తదుపరి సంవత్సరాలలో ఓసారి ఇంటర్ మీడియట్ & ఎంసెట్ లలో రాష్ట్ర టాప్ టెన్ ర్యాంకులలో ఒకట్రెండు ర్యాంకులు నాగభైరవ జూనియర్ కాలేజీకి వచ్చాయి. ఆ దెబ్బతో ఒంగోలు కూడా విద్యాకేంద్రం అయిపోయింది. ఎంసెట్ ర్యాంకుల అవకతవకల తీరు బాహాటం అయ్యాక, ఆయా వ్యవహారాలూ అర్ధమౌతున్నాయి కదా?

అదీ పాత్రికేయ విలువలు, మానవీయ విలువలు, నీతి నిజాయితీలు అంటూ ఘూర్ణల్లే పత్రికాధిపతుల నిజరూపం!

ఇక న్యూస్ కంట్రిబ్యూటర్లు, రిపోర్టర్లు, ఇన్ ఛార్జిల మధ్య వ్యవహార సరళి ఎలా ఉంటుందో - మచ్చుకి కొన్నిఉదాహరణలు చెబుతాను.

చాలాసార్లు, న్యూస్ కంట్రిబ్యూటర్లు పంపిన వార్తలన్నీ ప్రచురింపబడవు. అయితే క్రింది స్థాయిలో న్యూస్ కంట్రిబ్యూటర్లకు, వాళ్ళ కమిట్ మెంట్స్ వాళ్ళకుంటాయి. దాంతో కొన్ని వార్తల ప్రచురణ వారి గౌరవమర్యాదలకి ముడిపడతాయి. కొన్ని వార్తలు ప్రచురణ వారికి అనివార్యమై ఉంటాయి. దాంతో ఆయా వార్తల ప్రచురణకి, న్యూస్ కంట్రిబ్యూటర్లు ఇన్ ఛార్జీల వంటి తమ పైవారిని సంతృప్తి పరుస్తుంటారు. వారికి బహుమతులివ్వటం, శ్రీశైలం వంటి ప్రదేశాలలో అయితే... ఇన్ ఛార్జీల, సంపాదకుల, బంధుమిత్రులు దైవదర్శనానికి వచ్చినప్పుడు దగ్గరుండి దర్శనాలు చేయించడం వంటి వన్న మాట. దానికి బదులుగా ఇన్ ఛార్జీలు కూడా, న్యూస్ కంట్రిబ్యూటర్లకి తమకి చేతనైన సహాయాసహకారాలందిస్తారు. దాని ప్రకారం డబ్బు పంపిణీలు, ఇతర ఉపయోగాలు నెరవేర్చబడతాయి. ఇలాంటి చిన్నచిన్న విషయాలు పత్రికా యాజమాన్యం పట్టించుకోదు. ఆ విధంగా ఎవరి అహాన్ని వారు సంతృప్తి పరుచుకోవాటాన్ని చూసి ఊరుకుంటుంది. ఈ రకంగా పత్రికారంగంలో, అవినీతి వ్యవస్థీకృతం అవుతుంది.

ఇలాంటిదే మరొక విషయం: ఇందుకు చిన్న పట్టణమైన నంద్యాలనే ఉదాహరణగా తీసుకుందాం. మొన్నటి ఎన్నికలలో [2009] వార్తాపత్రికలలో [పెయిడ్ న్యూస్], డబ్బులు పుచ్చుకుని అభ్యర్ధుల గురించి పాజిటివ్ గా వార్తాంశాలు, కథనాలు వ్రాయటం జరిగింది కదా! దానిమీద, తరువాత తీరిగ్గా PTI వారు ఆందోళన చెంది, కొన్ని మార్గదర్శకాలు రూపొందించాలనుకుంటున్నారట. అదే మోస్తరులో నంద్యాలలోని కొన్ని సంస్థల గురించి, కొందరు వ్యక్తుల గురించి ప్రత్యేక వార్తాంశాలు, కథనాలు వ్రాయబడతాయన్న మాట.

నంద్యాలలో కేశవ రెడ్డి విద్యాసంస్థలు అలాంటివే! [దాదాపు ఏ ఊళ్ళో అయినా ఇదే కథ] ఇక్కడి స్థానిక విద్యా విభాగం, సాంస్కృతిక విభాగం, క్రీడల విభాగపు న్యూస్ కంట్రిబ్యూటర్లు కేశవరెడ్డి స్కూలులో చదువుసంధ్యల గురించి, స్కూల్ డే పండగలు తదితర సందర్భాలలో పిల్లల నృత్యగీతాల గురించి, ఆటల్లో కేశవరెడ్డి విద్యార్ధుల ప్రతిభ గురించి, చివరికి వారి అంతర్గత పోటీల వివరాలు సైతం... దాదాపు రోజు వారీ వార్తల్లా వ్రాసి పంపిస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో ఎప్పుడైనా స్థానిక పత్రికాఫీసు ఇన్ ఛార్జి, సంబంధిత న్యూస్ కంట్రిబ్యూటర్ పైన "ఏమిటయ్యా ఇది? ఇవేమైనా రోజువారీ వార్తలా? మరీ ఇలా ప్రతీరోజూ ఒక్కరి గురించే బాకా ఊదుతుంటే పత్రిక పరువుపోతుంది" అంటూ చికాకు పడి అలాంటి వార్తల్ని కట్టడి చేసారనుకొండి.

న్యూస్ కంట్రిబ్యూటర్ ఈ విషయాన్ని మామూలుగా కేశవరెడ్డి సంస్థల వారికి ఉప్పందిస్తాడు. అప్పుడిక సదరు విద్యాసంస్థ వారు ఈ పట్టణ పరిధి దాటి జిల్లా ఇన్ ఛార్జి నుండో, ఆపైన ప్రాంతీయ ఇన్ ఛార్జి నుండో సహకారం తెచ్చుకుంటారు. దాంతో తదుపరి అదే విద్యాసంస్థ తాలూకూ వార్తాంశం పైనుండి ప్రచురింపబడుతుంది. అంతేగాక స్థానిక పత్రికాఫీసు ఇన్ ఛార్జికి, పైనున్న ఇన్ ఛార్జి నుండి ’షంటింగ్ ’ వస్తుంది. "కొంచెం చూసుకుని పోవాలయ్యా! మనకీ యాడ్స్ రావాలి కదా!" అన్న సవరణ వస్తుంది.

ఇలాంటి కొన్ని అనుభవాల తర్వాత సదరు స్థానిక పత్రికాఫీసు ఇన్ ఛార్జి పరిస్థితులకి అలవాటు పడిపోతాడు. లేదా అసహనాన్ని అణుచుకోవడానికి అలవాటు పడతాడు. ఆ స్థానంలో న్యూస్ కంట్రిబ్యూటర్లున్నా, ఇన్ ఛార్జిలున్నా పరిస్థితి ఇదే!

అంతగా బలం చూపెట్టుకున్నాక సదరు విద్యా సంస్థ వారికి అహపు సంతృప్తి కలుగుతుంది. జిల్లా లేక ప్రాంతీయ ఇన్ ఛార్జికీ అహమే గాక, ఆర్ధికంగానూ సంతృప్తి కలుగుతుంది. పాపం! వ్యతిరేకించిన స్థానిక పత్రికాఫీసు ఇన్ ఛార్జికి మాత్రం, అసంతృప్తి కలుగుతుంది. అయితే... ఎప్పుడైనా, పత్రిక యాజమాన్యం, ఈ కార్ఫోరేట్ విద్యాసంస్థకి ఒక ఝలక్ ఇవ్వాలనుకున్నప్పుడు... తద్వారా అలాంటి వారిపై తమ పట్టు చూపెట్టుకోవాలనుకున్నప్పుడు... [అప్పుడు పట్టు పెరగటంతో పాటు డబ్బు ప్రవహిస్తుంది లెండి. అది ఓ సంకేత భాషగా చలామణిలో ఉంది.] అంతకు క్రితం స్థానిక పత్రికాఫీసు ఇన్ ఛార్జికి సవరణలు చెప్పిన జిల్లా ఇన్ ఛార్జి, ఇప్పుడు కేశవరెడ్డి విద్యాసంస్థల గురించి నెగిటివ్ గా వ్రాయాలన్న ఆదేశం ఇస్తాడు. ఆ విధంగా, స్థానిక పత్రికాఫీసు ఇన్ ఛార్జి అహం అప్పుడు సంతృప్తి పరచబడుతుంది.

ఇక చూస్కోండి! అప్పటి దాకా అణచుకున్న అయిష్టత, అసహనాలు పురివిప్పుకోగా, వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని, సదరు విద్యాసంస్థ అవకతవకల గురించి విరగ వ్రాసేస్తాడు. ఇన్ వాల్వ్ మెంటుతో వ్రాసి పారేస్తాడు. అప్పుడు వార్తాంశపు రచయిత నుండి పాఠకులకి ’భావం’ సరిగ్గా ప్రసారమౌతుంది. వెలుగుతున్న దీపమే మరో దీపాన్ని వెలిగించినట్లు! అవి చదివిన పాఠకులకి, సదరు పత్రిక వాళ్ళు, కార్పోరేట్ సంస్థల దోపిడినీ, అవినీతిని, అవకతవకలని సరిగ్గానే వెలికి తీసినట్లు అన్పిస్తుంది. అవి మనస్సు కెక్కిన పాఠకులు, పత్రికలు అవినీతికీ కొమ్ముకాస్తోన్నాయని ఎవరైనా అంటే, "అదేం లేదే? మొన్న ఫలానా కార్ఫోరేట్ సంస్థ గురించి ఎన్ని విషయాలు బయటికి తీసారు?" అంటూ వాదిస్తారు కూడా!

ఇంత పకడ్బందీగా, వ్యవస్థీకృతంగా, అంచెలంచెలుగా అన్ని స్థాయిలలో అవినీతి నడిపించబడుతుంది. తమ నెట్ వర్కు తాలూకూ ఈ రకపు పనితీరుతో, పత్రికా సంస్థలు, ఎక్కడికక్కడ, ఏ సమయానికి కా సమయంలో, సమాజంలో చెప్పుకోదగిన వ్యక్తులందరి చిట్టా పద్దులన్నీ తమ ’లైబ్రరీ’లో నిల్వ చేసుకుంటాయి. అవసరమైనప్పుడు ఉపయోగించుకుంటాయి. మరోమాటలో చెప్పాలంటే ఎక్కువ మంది న్యూస్ కంట్రిబ్యూటర్లను [విద్య, క్రీడలు గట్రా వేర్వేరు విభాగాలకు వేర్వేరుగా] నియమించటం కూడా ఇందుకే. ఎంత ఎక్కువమంది ఉంటే నెట్ వర్క్ లో వర్కింగ్ పాయింట్స్, అంత ఎక్కువ ఉంటాయి. అలాగే వారు సేకరించే సమాచారమూ ఎక్కువగానూ, ఖచ్చితమైనది గానూ ఉంటుంది.

అంతేగాక, మీడియా ముసుగు వేసుకున్న నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గమూ, అందులోని కీలక వ్యక్తి రామోజీరావులు, సమాజంలో అవినీతి మరకలు, నేరచరితలూ ఉన్నవారినే పై స్థానాలలోకి ఎదగనిచ్చారు. మరో మాటలో చెప్పాలంటే - స్వయంగా తామే పైకి తెచ్చి పైస్థానాల్లో ప్రతిష్ఠించారు. ఆ అవినీతి మరకల్నీ, నేర చరితల్నీ బహిర్గతం కాకుండా కాపాడుతామన్న భరోసాతో, అలాంటి వాళ్ళని అత్యధిక మోతాదులో ఉపయోగించుకోవచ్చు. వాళ్ళెప్పుడైనా తోక ఝాడించారా?, అప్పుడు తీరిగ్గా ఆయా వ్యక్తుల అవినీతినీ, నేరాల్నీబయటికి తీస్తామని హెచ్చరిస్తే చాలు, దెబ్బకి వాళ్ళు ’సరెండర్’ అయిపోతారు.

ఏకారణంగానైనా తామే వాళ్ళని వదిలించుకోవాల్సివస్తే, అప్పుడూ ఆయా వ్యక్తుల అవినీతినీ, నేరాల్నీ బయటికి తీస్తే దెబ్బకి చచ్చురూకుంటారు. అంటే భౌతికంగా చచ్చిపోతారని కాదు, కెరీర్ పరంగా తెరమరుగైపోతారన్నమాట. అందుకోసం కూడా, మీడియా, సమాజంలో చెప్పుకోదగిన స్థానంలో ఉన్న [తమ టార్గెట్ ఉన్న] వ్యక్తుల చిట్టాపద్దులన్నీ సేకరించి, తమ ప్రత్యేక ’లైబ్రరీ’లో నిల్వ చేసుకుంటారు. అంతగా మీడియా మాఫియా, అవినీతిని నడిపిస్తోంది. ఈ గూఢచర్యం ఏమీ తెలియని ఉదయం పత్రిక వారు, విజ్ఞాన్ రత్తయ్య [సుప్రభాతం] లాంటి వాళ్ళు ’ఈ పాటి గారెల వంట మనం చేయలేమా’ అనుకుని పత్రికలు పెట్టి, దెబ్బతిన్నారు.

నమ్మశక్యం గాకపోయినా ఇది సత్యం! కావాలంటే ఓ దృష్టాంతం పరిశీలించండి. 2000 - 01లో, కేంద్రంలో ఎన్ డీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు... రక్షణ శాఖలో అవినీతి అవకతవకలు జరగటాన్ని తెహల్కా డాట్ కాం అనే సంస్థ వారు String operation చేసి మరీ బయటపెట్టారు. పర్వవసానాల్లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన బంగారు లక్ష్మణ్ పదవికూడా కోల్పోయాడు. ఆ తర్వాత తెహల్కా డాట్ కామ్ పేరు మార లేదు గానీ, యాజమాన్యం మాత్రం పలుమార్లు చేతులు మారింది. ఎన్నో ఒడిదుడుకులకి లోనయ్యింది. ఈ నేపధ్యంలో, ఇటీవల, సదరు డాట్ కాం యాజమాన్యం, నేటి మీడియా పరిస్థితి గురించి చెబుతూ, భారతదేశంలో మీడియా రంగం మొత్తం, ’అయిదు సంస్థల చేతుల్లో ఉందని ’ ఉంటంకించింది. ఈ వార్త ఇటీవల పత్రికలలో వచ్చింది. ’ఇప్పటికి అయిదు సంస్థలని తేలాయి, వాటి వెనుక కూడా ఒకటే వ్యవస్థ ఉందని మరెప్పటికి తేలుతుందో ’ అని టపాకాయ కూడా అప్పుడే పేల్చాము.

అంతగా... మీడియా... మాఫియాగా మారి అవినీతిని వ్యవస్థీకృతంగా నడుపుతోంది. ప్రభుత్వాలను నిలబెట్టగలిగే, కూలదోయగలిగే స్థితినీ కలిగిఉంది. పొద్దున చదివి మధ్యాహ్ననికి మరిచిపోయే పత్రికలూ, నిరంతరం నట్టింట ఘోష పెట్టే నిరంతర వార్తా స్రవంతులని ప్రవహింపజేసే టీవీ ఛానెళ్ళు, ఇదంతా మన కళ్ళెదుటే నిర్వహిస్తున్నా కూడా, వాళ్ళు చెప్పిందే నిజమని నమ్ముతూ ఉంటారు సామాన్య ప్రజలు. ఎందుకంటే - పూర్వం మునులకి ఎంత ప్రాముఖ్యత ఇచ్చామో, ఇప్పుడా స్థానం మీడియాకి ఇచ్చాం కాబట్టి. "ఈతడు ముని. సర్వసంగపరిత్యాగి. పది ప్రదేశాలు తిరిగిన వాడు. ఏది చెప్పినా మన మంచి కోరి నిస్వార్ధంగా చెబుతాడు" అని మునులని, తపస్వులను ఆ రోజుల్లో నమ్మే వాళ్ళు. ఆధునిక కాలంలో మీడియా గురించి "వాళ్ళు మనం వెళ్ళలేని ప్రదేశాలకి వెళ్తారు. వార్తలు సేకరిస్తారు. ఏది చెప్పినా ప్రజా ప్రయోజనం కోరి, నిస్వార్ధంగా చెబుతారు" అనుకొని నమ్ముతుంటాం. ఈ నమ్మకాన్నే సొమ్ము చేసుకుంటూ... నాటి మునుల స్థానాన్ని, నేడు ఈ మీడియా ముష్కరులు ఆక్రమించారు.

స్వాతంత్ర సమర సమయంలో, స్వాతంత్రానంతర తొలి దశాబ్దాలలో, మీడియా నిబద్దత కలిగి ఉండటంతో కూడా ప్రజలు దాన్ని నమ్ముతున్నారు. అయితే నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గం... ఎక్కడైతే ఓటమి చెందారో అక్కడి నుండే తమ ప్రయత్నం పునఃప్రారంభించారు. కాబట్టే, ఈ సారి ప్రధాన కుట్రదారులు మీడియా ముసుగు వేసుకున్నారు. దీన్ని గురించి గతటపాలలోనూ వ్రాసాను, నా ఆంగ్ల బ్లాగు Coups on World లోనూ వివరంగా వ్రాసాను.

ఇంతగా అవినీతిని ప్రోది చేసి, పాదులు చేసి, పెంచిపోషించే... వీళ్ళా అవినీతిని ఎండగట్టేది, బయటపెట్టేది? నేతి బీరకాయలో నెయ్యి అయినా ఉంటుందేమో గానీ, మీడియా సముద్రం ఉందని చెప్పిన చోట కనీసం తేమ కూడా ఉండకపోవటం ఇప్పటికి చాలా సార్లు గమనించాం.

ఇక ఈ టపా ముగించే ముందు - ఇంత తక్కువ రాబడి ఉన్నా, వృత్తి లేదా ప్రవృత్తి రీత్యా సంతృప్తి కూడా లేకపోయినా, న్యూస్ కంట్రిబ్యూటర్లు ఎందుకు పని చేస్తున్నారు? ఎందుకంటే - పత్రికా సంస్థ యాజమాన్యం, తక్కువ వేతనం ఇస్తూ, ’జనాల మీద పడి దండుకో’మంటుంది. బ్లాక్ మెయిలింగ్ [అంటే నెగిటివ్ గా వ్రాయకుండా ఉండటం.] ప్రధాన ఆదాయ వనరు. పాజిటివ్ గా వ్రాయటంతో బహుమతులు, డబ్బు వాటాలు, ఏర్పరుచుకున్న సంబంధాలతో తమ వారికి ఉద్యోగాలు, బదిలీలు, పధోన్నతులు ఇత్యాది ప్రయోజనాలు [favours] ఉంటాయి. ఇలాంటి అనేక ’ఉపయోగాలు’ ఉండటంతో, ’జీతం కన్నా గీతం’ ఉన్న ఉద్యోగంగా భావించి, ఎక్కువమంది న్యూస్ కంట్రిబ్యూటర్ లుగా పనిచేస్తుంటారు.

తొలి నాళ్ళల్లో... ’జర్నలిస్టు అయితే ఏదో చేసేయవచ్చు’ అనుకొని, నిజాయితీగా నిజమైన ఆవేశాలతో ఆశయాలతో ఆ వృత్తిలోకి వచ్చిన వాళ్ళు మొదట బిత్తర పోతారు. అచ్చంగా ఆశలతో కలలతో, కట్నపు దురాశ గల అత్తింట అడుగుపెట్టిన కొత్తకోడలి లాగానే! మొదట్లో సర్ధుకు పోయేందుకో నిలదొక్కుకునేందుకో, ఎదురు తిరిగేందుకో ప్రయత్నిస్తారు. కొన్నాళ్ళకు దేనికో దానికి [సర్ధుకుపోవడానికో, నిలదొక్కుకోవడానికో] అలవాటు పడతారు. తర్వాత... ఇష్టమైతే అవినీతిలో అల్లుకుపోతారు. కష్టమైతే అందులో ఇమడలేక ఆ వృత్తి నుండి బయటకొచ్చేసి ఇతర వృత్తులు చేపడతారు. రానురాను, ఇక అలాంటి వాళ్ళే అటువైపు ఆకర్షింపబడటం సహజం కదా! కాబట్టే ఇప్పుడు మీడియా సంస్థల్లో పైస్థాయిలో ఉన్న కొందరు సీఈఓ లు, ఛీఫ్ లూ, హెడ్డులూ, అవినీతిలోనూ, అనైతికతలోనూ మహా నేర్పరులన్న వార్తలు వినిపిస్తున్నాయి.

నిజానికి మీడియాలో ఆ విధమైన అవినీతిని, జీర్ణించుకోలేక, బయటికొచ్చేసిన వాళ్ళల్లో కొందరు ఇతర వృత్తుల్లో సంతృప్తి పడటమో, సర్ధుకుపోవటమో చేస్తారు. కొందరికి నిస్సహాయతతో కూడిన బాధ వెన్నాడుతూనే ఉంటుంది. కొందరు "పోనీ! ఆ బురదలో లేక పోవటమే పదివేలు" అనుకొని మనశ్శాంతి పొందుతారు.

మరికొందరు వృత్తిని వీడనూ లేరు, అలాగని ఆ అవినీతి రొచ్చుని సహించనూ లేరు. నిజంగా పాపం వారి సంఘర్షణ బాధకరమే. ఇలాంటి వారిలో కొందరు, యాజమాన్యంపై కరుడు గట్టిన ద్వేషం, తమ నిస్సహయతపై అసహనం, తొలినాటి తమ ఆశలూ ఆవేశాలతో కూడిన తమ వ్యక్తిత్వం నలిపివేయబడిందన్న ఉక్రోషం, ఆక్రోశం వంటి తీవ్ర భావోద్రేకాలని, చాలాకాలం అణచుకున్నందున, మనోవికారాలకి [పర్వెర్షన్స్ కి] గురవుతారు. అలాంటి వారి వ్రాతలూ, వార్తా ప్రసారాలూ కూడా అవే ప్రకోపాలతో నిండి ఉంటాయి. ఇలాంటి వారిలో కొందరికి, అవకాశం వస్తే, అప్పటి దాకా తాము ద్వేషించిన ఆయా సంస్థల యజమానులని కలాలతో, గళాలతో చీల్చి చెండాడుతారు.

చాలాకాలం పాటు తక్కువ జీతాలతో, ఇతరత్రా పట్టుతో, తమని అణచి ఉంచిన ఈనాడు లో నుండి, సాక్షి పత్రిక పుట్టిన తొలినాళ్ళలో, మంచి జీతంతో కూడిన ఆఫర్ రాగానే చాలామంది ఈనాడు విడిచి వచ్చి, సాక్షిలో వాలి, కలాలకి పదును పెట్టేసారు. 1992 కు ముందర ’ఉదయం’ పత్రిక పెట్టినప్పుడు ఇలాగే జరిగింది గాని, తర్వాత నిలదొక్కుకోలేక ’ఉదయం’ అస్తమించింది.

అదే ఇప్పుడైతే... నెం.5 వర్గం తాను బయటకు రాకుండానే, ’దొంగలు దొంగలు తన్నుకుని గుట్టు రట్టు చేసుకోవటం’ అనే గూఢచర్య తంత్రాన్ని ప్రయోగించి నందున, ఈనాడు Vs సాక్షిలు, పరస్పర విమర్శలతో చాలా విషయాలు బహిర్గతం అయ్యాయి. ఆ విధంగా మీడియా సామ్రాట్టు తన ’సువర్ణముఖి’లోని అంశాలని అనుభవించాడు, అనుభవిస్తున్నాడు.

అయితే అప్పుడే ఈ కథ అయిపోలేదు. ఇంకా తేట తెల్లం అయ్యే వరకూ వేచి చూడాల్సిందే!

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

2 comments:

సాక్షి వచ్చినా నిరంతరం యె.సం.రాజశేఖరరెడ్డి గుఱించే వ్రాసి వ్రాసి పెద్దగా ఈనాడుకు పోటీ ఇవ్వలేకపోతున్నాడు. ఈనాడు కూడ పైకి పెద్దగా ఈ ధోరణి పట్టించుకున్నట్టు కనిపించదు. కానీ రాజశేఖరుడి మృతి విషయమై వీడనీ వాడనీ రిలయన్సుపై ఏదో ఉప్పందించి పాపం సాక్షివారిని దారుణంగా దెబ్బతీసిన వైనం చూస్తే అన్ని విషయాలూ ఎంత జాగ్రత్తగా గమనిస్తున్నారో తెలుస్తుంది. బహుశా రాజశేఖరుడు సాక్షి పెట్టించడానికి కూడా ఇదే కారణం అయ్యుంటుంది. అంతే కదండీ?!

రాఘవ గారు : దీని మీద పూర్తి వివరం తరువాత వ్రాస్తానండి.

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu