సోనియా గాంధీకి, ఆమె తాలూకూ గూఢచార ఏజన్సీలకి [నకిలీ కణికవ్యవస్థ, మరియు సి.ఐ.ఏ.లు] గల ‘అసమదీయులకు అన్నీ అందివ్వటం, తసమదీయులని చావచితక్కోట్టటం’ అన్న ఈ లక్షణం ఇప్పటికీ చాలాసార్లు నిరూపితమయ్యింది. పీవీ నరసింహారావు పట్ల, ఆయన మరణానంతరం కూడా, ఆయన పార్ధివ శరీరాన్ని సైతం అవమానించేంత ఇరుకు మనస్తత్వం, తీవ్రభావోద్రేకాలూ గల ఈ ఇటలీ వనిత, రాజీవ్ హంతక ముఠా సభ్యురాలు నళిని పట్ల అయితే, అమిత ఔదార్యం చూపగల విశాల హృదయం గలది. అటువంటి ఈ సోనియాగాంధీ రాజకీయ నైపుణ్యం, హుందాప్రవర్తనల గురించి ఈనాడు ఈరోజు[17/05/09] ప్రచురించిన వార్తలు చూడండి. మరికొన్ని ఇతర వార్తలు కూడా!

[>>పడిలేచిన కెరటం:
ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెదుక్కోవాలన్న సూత్రాన్ని కచ్చితంగా అమలుచేసి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గట్టిగా ఉనికిని చాటుకుంది. బలహీనపడిన రాష్ట్రాలన్నింటిలోనూ పుంజుకుని జాతీయపార్టీగా తన పూర్వపు బలాన్ని సాధించుకోగల్గింది. ఈ సార్వత్రిక ఎన్నికల్లోనూ ఏకైక పెద్ద పార్టీగా ఆవతరించడమే కాక 2004 ఎన్నికల కంటే ఎక్కువ స్థానాల్లో విజయబావుటా ఎగురవేయడం ఆషామాషీగా సంభవించిన పరిణామం కాదు. జాతీయ పార్టీ ముసుగులో ఉన్న ప్రాంతీయపార్టీ అని పడిన ముద్రను తుడిచేసుకుని పూర్వవైభవాన్ని సాధించడం వెనుక పార్టీ నిర్మాణాత్మక కృషి ఉంది.

>>ఎలా సాధ్యమైంది:
కాంగ్రెస్. ఈ ఐదేళ్లపాటు ఓ పక్క సంకీర్ణప్రభుత్వానికి నేతృత్వం వహిస్తూనే అంతర్గతంగా ఉన్న లోపాలను సరిదిద్దుకుంటూ వచ్చింది. రాష్ట్రాల వారీగా పార్టీ వ్యవస్థపై అధినాయకత్వం దృష్టిసారించింది. బాధ్యతలను వికేంద్రీకరించింది. పనితీరు ఆధారంగా నాయకులను ఎదగనిచ్చింది. చెదిరిపోయిన కార్యకర్తలను ఏకతాటిపై నడిపించి కదిలిపోయాయనుకున్న పునాదులను పటిష్టం చేసుకుంది. ఓ పక్క హస్తినలో పార్టీ అధినేత్రి సోనియాగాంధీ పార్టీ వ్యవహారాలన్నింటినీ సమన్వయ పర్చుకుంటూ యంత్రాంగానికి దిశానిర్దేశం చేయగా మరోవైపు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటిస్తూ కార్యకర్తల్లో ముఖ్యంగా యువకార్యకర్తల్లో ఉత్తేజాన్ని నింపి పునాదుల్ని పటిష్టం చేశారు. అధిష్టానం ప్రతిరాష్ట్రానికి పర్యవేక్షుల్ని నియమించి అక్కడ లోటుపాట్లను ఎప్పటికప్పుడు తెలుసుకుని వాటిని సరిదిద్దుకుంటూ వచ్చింది.

>>మిత్రబేధంతో పెరిగిన కసి:
పొత్తుల్లో సీట్లు తక్కువ ఇవ్వచూపి యూపీఏ పక్షాలు తనను చిన్నచూపుచూడడంతో కాంగ్రెస్ లో కసి పెరిగింది. 80 లోక్ సభ స్థానాలున్న ఉత్తరప్రదేశ్ లో గడిచిన రెండు దశాబ్దాల్లో పార్టీకి బాగా నష్టం వాటిల్లింది. ఈ రాష్ట్రంలో సమాజ్ వాది పార్టీ, బీఎస్పీ, భాజపాలు వర్గాలవారీగా ఓటుబ్యాంకును సొంతం చేసుకున్నాయి. ఈ ఎన్నికల్లో సమాజ్ వాదీతో పొత్తుకు అంగీకరించినా….15 సీట్లు మించి ఇవ్వబోమని ఎస్పీ తెగేసి చెప్పడంతో పార్టీలో పట్టుదల పెరిగింది. అక్కడ అన్నిస్థానాల్లోనూ పోటీ చేయాలని కీలక నిర్ణయం తీసుకుని సత్తా చాటింది. 2004 ఎన్నికల్లో కేవలం 12.5% శాతం ఓట్లతో 9 స్థానాలకే పరిమితమైన పార్టీ ఈసారి చతుర్ముఖ పోరులోనూ 21 స్థానాలను కైవసం చేసుకుంది. జార్ఖండ్ లో ఆర్జేడీతో తెగ తెంపులు చేసుకుని జేఎంఎంతో కలిసి పోరాడింది. ఇక్కడ ఆశించిన ఫలితాలు రాకపోయినా కార్యకర్తల్లో నైతిక స్థైర్యం నింపడంతో విజయం సాధించింది.

మహారాష్ట్రలోనూ పార్టీ యంత్రాంగం చెదిరిపోకుండా కాపాడుకోగల్గింది. కాంగ్రెస్ కుటుంబానికే చెందిన శరద్ పవార్ ఎన్సీపీ పేరుతో వేరుకుంపటి పెట్టుకున్నా పొత్తుపెట్టుకుని గణనీయమైన స్థాయిలో విజయాలు నమోదు చేసుకుంది. భాజపా – శివసేన కూటమి దూకుడిని ఎదుర్కొని కూడా 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమికి 22 స్థానాలు దక్కాయి. అందులో కాంగ్రెస్ వాటా 13. ఈ సారి 17 స్థానాల్లో విజయబావుటా ఎగరవేసింది.]

ఇది పరిశీలిస్తే తెలియటం లేదూ ‘ఈనాడు రామోజీరావు కాంగ్రెస్ వ్యతిరేకి’ అన్నమాట ఎంత అబద్దమో? అది స్వయంగా అతడే, సాక్షాత్తూ కోర్టుకి, వ్రాతపూర్వకంగా మరీ ఇచ్చిన అఫీడవిటు. మరి అలాంటప్పుడు ఇప్పుడెలా ఈ కాంగ్రెస్ అధినేత్రిని భుజాల మీద మోస్తున్నాడు? మొన్న అంటే[15/05/09] సైతం, కులదీప్ నయ్యర్ ఈనాడులో ఉపసంపాదకీయం వ్రాస్తూ, `సోనియాగాంధీ రాహుల్ గాంధీని యువనేతగా ప్రజల్లోకి తీసికెళ్ళటంలో విఫలమయ్యింది’ అని వ్రాసాడు. అదే విషయమై, హఠాత్తుగా ఈరోజు, ఈనాడు ‘రాహుల్ ‘యువ’జపం’ అంటూ కాంగ్రెస్ రాకుమారుడిని ఆకాశానికి ఎత్తేస్తూ, వార్త సమీక్ష వ్రాసింది. ఇలా చూసినా స్పష్టంగా తెలుస్తోంది - ఈనాడు రామోజీరావు కాంగ్రెస్ వ్యతిరేకి కాదు; దేశంపట్ల నిబద్దత గల ఇందిరాగాంధీ, పీవీ, రాజీవ్ గాంధీల వంటి వారికి వ్యతిరేకి అని. ఎవరైతే తన కుట్రలని వ్యతిరేకిస్తారో, ఎదుర్కోప్రయత్నిస్తారో వారికి వ్యతిరేకి. తన కుట్రకు మద్దతుదారులైన వాళ్ళపట్ల మహా రక్షకుడు. అదే ఇక్కడా ప్రతిఫలిస్తోంది.

ఏది ఏమైనా ఎన్నికల ఫలితాలకు ఇప్పుడు `ఈనాడు’ సరికొత్త భాష్యాలు చెబుతోంది. కులమతాలకు అతీతంగా, డబ్బు పంపిణీలకు అతీతంగా ప్రజలు దేశ సుస్థిరతను తలచి, విఙ్ఞత చూపి కాంగ్రెస్ కు ఓట్లు వేసారట. బిజెపి అసలు దేశాన్ని కాపాడలేదని భయపడ్డారట. మరి యూపిఏ హయాంలో జరిగిన వివిధ నగరాల్లోని బాంబుదాడుల్నీ, ముంబాయి దాడినీ ఎలా మరిచిపోయారు? కోర్టులోనే వేళాకోళంగా, యావద్భారతీయుల్ని చూచి ఎకసెక్కంగా నవ్వుతున్న కసబ్ ని ఎలా మరిచిపోయారు? [తనకు న్యాయవాదిని నియమించేవరకూ కసబ్ ఘోల్లుమంటూనే ఉన్నాడు. చంపెయ్యమని అర్ధించాడు. తర్వాత ఏ స్ట్రాటజీ మారిందో, ఏ భరోసా వచ్చిందో, ఏ సమాచారం అందించబడిందో గానీ, కసబ్ ఇక పట్టశక్యం గాకుండా ఉన్నాడు. తనింకా మైనరే నన్నాడు. అత్తర్లు, వార్తాపత్రికలూ కావాలన్నాడు. పనిలోపనిగా జైల్లో అతడికి తందూరి చికెన్ లూ పెడుతున్నారు. ఏసీలూ, వాటర్ కూలర్లు కూడా ఇవ్వాలనీ జైలు అధికారులు యోచిస్తున్నారట.]

ప్రజలకి దేశ సుస్థిరత పట్ల ఉన్న నిబద్దత, విఙ్ఞత వాళ్ళకి మరింకే సమస్యల గురించి ఆలోచించనివ్వకుండా కాంగ్రెస్ కి ఓట్లు వేసేట్లు చేసిందట. ఎంత చక్కని భాష్యం? వాళ్ళ అభివృద్ది పధకాలు చూసి ఆకర్షితులై ఓట్లు వేసారట. అంతటి ఆకర్షణ సభలకి జనాలని రప్పించలేకపోయిందేం? నగదు బదిలీ వంటి జనాకర్షక పధకాలని కూడా, ప్రజలు తిరస్కరించి మరీ, దేశ సుస్థిరతకు ఓటేసారట. అంతగా దేశం ప్రజలకి పడితే వీరి ఆటలు ఇంతకాలం ఇలా సాగుతూ ఉండేవా? [చేదుగా ఉన్నా ఇది నిజం]

మొత్తానికి, క్రికెట్లో మ్యాచ్ ఫిక్సుంగులతో గెలుపోటములు నడిస్తే, ప్రేక్షకులు, క్రీడాభిమానులూ మాత్రం అమాయకంగా బెట్టింగులు కట్టుకుంటూ, ఆపైన ఫలానా ఆటగాడు ఫలానా ఓవర్లో పొరబాటు చేశాడనో, పిచ్ అచ్చిరాలేదనో, టాస్ గెలిచినప్పుడే పొరబాటు నిర్ణయం తీసుకున్నారనో, మరో `x’ అనో, `y’ అనో కారణాలు వెదుక్కుంటారు చూడండి, సరిగ్గా అలాగే ఉన్నాయి ఇప్పుడు ఎన్నికల ఫలితాలపై పత్రికలు వ్రాస్తున్నా సమీక్షలు. అంటే ఏమీ లేదు, మనందరం గుడ్డివాళ్ళమని, తాము చూపిన ’ఏనుగు’ అనే శరీర భాగాల వంటి సమీక్షలు తడుమూతూ, ఓడిపోవటానికి గెలవటానికి తాము చెప్పిన కారణాలను నమ్మవలసిందని చెబుతున్నాయి. మరో ఉదాహరణ చెప్పాలంటే ఎంసెట్లో ర్యాంకు ఫిక్సింగ్ లు నడుస్తుండగా, ఈ సారి పేపరు బాగా లేదనో, లేదా అందులో ఫలానా సబ్జెక్ట్ మన పిల్ల/పిల్లవాడు సరిగా చెయ్యలేదనో, వాతావరణం బాలేక పిల్లలు ఇబ్బంది పడ్డారనో, అదృష్టం కలిసి రాలేదనో, కాలేజీ వాళ్ళు సరిగా చెప్పలేదనో, మనవాళ్ళు సరిగ్గా చదవలేదనో కారణాలు వెదుక్కుంటాం చూడండి, ఇదే అంతే.

అసలు మతలబు మరింకోచోట ఉండి ఉండాలి. లేకపోతే మరీ ఇంతగా, దాదాపు నూటికి 98% సోనియాని ధిక్కరించిన వారు మట్టికరవటం, పాదలపై బడి దాసోహం అన్నవారు గెలిచి గట్టెక్కడం ఎలా సాధ్యం? ఓటు యంత్రాలు ఎలాక్ట్రానిక్ వి. ఇప్పటి అధునాతన టెక్నాలజీ ’తాడిని తన్నేవాడుంటే వాడి తల తన్నే వాడుంటాడు’ అన్నట్లు ఉంది. ఏం? ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలలో ఏ లొసుగు ఉండే అవకాశం నూటికి నూరు శాతం లేదా? ఇది ఖచ్చితంగా ప్రజలిచ్చిన జస్టిస్ చౌదరి తీర్పేనా? మరైతే ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలతో, శివగంగైలో, చిదంబరం రీకౌంటింగ్ తో, ఎలా మూడు వేల పైచిలుకు మెజారిటీతో గెలుపొందాడు? మళ్ళా ఓట్లు లెక్కించమని ప్రత్యర్ధి అడిగితే ఎన్నికల అధికారి ’జాంతానై’ అన్నాడట. అసలలాటి సహకారం కోసమే గదా నవీన్ చావ్లాల వంటి ఎన్నికల కమీషనర్లని అంచెలంచెలుగా పైకి తెచ్చుకునేది? ఇవే ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు, అంత నికార్సయనవి అయితే, మొన్న రెండవదఫా ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ లోని ఓపోలింగ్ కేంద్రంలో[వెలుగోడు మండలం మోతుకూరు] ఏపార్టీకి ఓటరు ఓటు వేసినా కాంగ్రెస్ కే లైటు వెలుగుతుందని ఫిర్యాదు రావటంతో, జరగాల్సినంత రాధ్ధాంతం జరిగాక రీపోలింగ్ నిర్వహించాల్సిన పరిస్ధితి వచ్చింది. విదేశాల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు ప్రక్కనబెట్టి, మళ్ళీ బ్యాలెట్ పత్రాల పద్దతికి మళ్ళటం గురించి కూడా వింటున్నాం. మళ్ళీ బ్యాలెట్ పత్రాల ఓటింగ్ లో ఉండే రిగ్గుంగూ, బ్యాలెట్ పెట్టెలు గల్లంతవ్వటం గట్రా మతలబులు ఉంటాయనుకోండి. అయినా ఎలక్ట్రానిక్ వస్తువులనూ, కంఫ్యూటర్ అనుసంధానిత విధానాలను manipulate చేయటం ఎంత సులువో ఐ.టి. వారికి వేరుగా చెప్పనవసరం లేదు. ఈ manipulate అన్నది ఒక వ్యక్తి, ఒక పార్టీ చేయ లేదు. అదే సి.ఐ.ఏ. లాంటి ఏజన్సీ అయితే? ఈ ఎలక్ట్రానిక్ యంత్ర పరికరాల తయారీ సంస్ధలను ప్రభావితం చేసి, సామాన్యులకి చూడటానికి full proof గానో fool proof గానో, మొత్తానికి పకడ్బందీ యంత్రాలుగా కనబడేట్టు చేయగలదు. తమ మీడియా ద్వారా ప్రపంచాన్ని నమ్మించనూ గలదు.

అందుచేత `tampering of electronic voting machines’ అన్న సంభావ్యతని కొట్టిపారేయకూడదు. అసలీ ప్రయోజనం కొరకే 2004 ఎన్నికలకు ముందు E.V.M. లని ప్రణాళికాబద్దంగా ప్రవేశపెట్టబట్టటం జరిగింది. మరి ’ఈ విషయాన్ని ప్రతిపక్షాలెందుకు గగ్గోలు చేయవు?’ అంటారేమో! ఏ రాజకీయ ప్రతిపక్షనేతకు అంత ధైర్యం ఉంది? ఎవరు నోరెత్తి విషయం బయటపెడితే, వాళ్ళని స్వంత పార్టీ కూడా వదిలేస్తుంది. ఇంటాబయటా, పార్టీ లోపలా బయటా అందరూ ఏకాకిని చేస్తారు. నకిలీ కణికుడు, అతడి వ్యవస్థ కత్తిగట్టి మరీ వ్యవస్థీకృతంగా వేధిస్తారు. కాబట్టి ఎవరికి అంత ధైర్యం ఉంటుంది? అసలుకే రాజకీయ రంగంలో, కొన్ని దశాబ్ధాలుగా, మాటల్లో ఉపన్యాసాల్లో నాయకత్వ పదాలు, లక్షణాలూ చూపిస్తూ, చేతల్లో కట్టుబానిసత్వం ఉన్నవాళ్ళే, ఎదిగి పైకొచ్చారయ్యె. అలాంటివాళ్ళని మాత్రమే నకిలీ కణిక వ్యవస్థ ఎదగనిచ్చింది. నిజంగా ధైర్యమూ, నిజాయితీ, నిలదీయగల తెగువా, మొదలైన నాయకత్వ లక్షణాలున్న వాళ్ళని తొలిదశల్లోనే అణిచిపారేసింది.

ఇక్కడ మరోకారణం కూడా ఉండే అవకాశం ఉంది. రామకృష్ణ పరమహంస చెబుతారు - ఓ చోట జనమంతా దాహార్తితో, ఆకలితో, ఎండవేడిమితో అలమటించి పోతుంటారు, అంతా ఎడారి. చుట్టుప్రక్కల నీటి జాడలేదు, నీడా లేదు. ఆ గుంపులోని ఓ వ్యక్తి, కాస్త ప్రయత్నమూ బలమూ కూడదీసుకుని, మరింత కష్టపడి ముందుకు నడిచాడు. కొంతదూరం పోయాక అతడికి ఓ ఎతైన గోడ కన్పించింది. ఎక్కి చూసాడు. గోడకు ఆవల ఫలపుష్పభరిత తరువులతో, తటాకాలతో, చలువరాతి మండపాలతో ఉన్న మనోహరమైన ఉద్యానవనం ఉంది. ఆ వ్యక్తి అటునుండి అటే, దొరికింది అవకాశం అనుకుని, గోడదూకి తోటలోకి పోలేదు. వెనుదిరిగి, జనాల్ని, దారి తెన్నుతెలియక అలమటిస్తున్న తోటివారిని చూశాడు. వెనుదిరిగి వచ్చాడు. అందరికీ గోడవతల ఉన్న తోట గురించి చెప్పి, తనతో తీసికెళ్ళె ప్రయత్నం చేశాడు. ఈ ప్రపంచంలో సత్యం గురించి, ఆత్మతత్త్వం గురించి, మోక్షం గురించి చెప్పే మునులు, మహానుభావాలు అలాంటి వారే అంటారు శ్రీరామకృష్ణ పరమహంస.

నారదనీతికి విపర్యయమే నేటి రాజకీయ తంత్రం [political Strategy] అన్నట్లు, మంచి వాటికి విపర్యయమే కదా, నకిలీ కణికుడూ, అతడి వ్యవస్థా అమలు చేస్తారు? కాబట్టి ఇలా సత్యపు బాటకీ, ముక్తి దారినీ చూపే మహానుభావులకి విపర్యయ స్ట్రాటజీ ఇక్కడ అమలు అవుతుంది. అదేమిటంటే – ఓ చోట కొందరు ప్రజలున్నారు. ముందటి కథలోని బాధలే వీరివి కూడా! ఇంతలో ఓవ్యక్తి ముందుకు నడిచాడు. గోడ కనబడింది. దానికో కన్నం ఉంది. అందులోంచి దూరి లోపలి నుండి పళ్ళు, ఫలహారాలు, తెచ్చుకుని గమ్మున ఉన్నాడు. ఎవరికీ చెప్పలేదు. తనకి కావలసినప్పుడల్లా కన్నంలో దొంగలా దూరటం, దొరికినవి తెచ్చుకోవటం. ఇదంతా మరొకడు చూశాడు. వాడూ దగ్గరికొచ్చి, కన్నం గమనించి దూరాడు. వాడూ ఇతరులకి చెప్పలేదు. చెబితే అందరూ పోటాపోటీపడితేనో? తన అవకాశాలూ తగ్గిపోవా? ఇలా కన్నం చూసిన ప్రతివాడు, ‘అందులో దూరే అవకాశం తనకీ రాకపోతుందా? గోల చేసి అందరి దృష్టి దాని మీద పడేలా చేయటం ఎందుకు’ అని గప్పుచుప్పున ఉన్నాడు. కన్నంలో దూరే అవకాశం కోసం వేచి ఉన్నాడు. అవినీతి చేయగల అవకాశాలూ, చదువుల్లో ర్యాంకు ఫిక్సింగులూ మొదలైనవి ఇలాంటి కన్నాలే. ఆ అవినీతికి సహకరించే వారంతా ఇలాంటి కన్నపు దొంగలే.

కాబట్టి ప్రస్తుత విపక్షరాజకీయ నేతలలో కొందరు, ‘ఎందుకొచ్చిన గొడవ? చెబితే మన అవకాశాలు పోతాయి’ అని పెదవి విప్పక పోవచ్చు. లేదా ‘ఎందుకొచ్చిన గొడవ? నోరు విప్పి చెబితే ఒంటరి పోరై ఛస్తాం. వేధించి చంపుతారు’ అనుకుని భయపడి ఊరుకోనూ వచ్చు. ఇక్కడో విషయం గుర్తుకు తెచ్చుకోవటం సందర్భోచితం. 2004 ఎన్నికల ఫలితాల తర్వాత, తనకి మరీ 50 సీట్లు రావటంతో ఉండబట్టుకోలేక, తెదేపా నేత చంద్రబాబు నాయుడు EVM ల గురించి నిందాపూర్వకంగా మాట్లాడుతూ, వాటిల్లో ఏదో మతలబు ఉందనీ, బ్యాలట్ ఓటింగే మంచిదనీ అన్నాడు. అంతలోనే ఏమయ్యిందో, ఇక గమ్మున ఉండిపోయాడు. రాజకీయ నాయకులు కాస్త తోకలు ఝాడిస్తే ప్రమోద్ మహాజన్ లని చంపేందుకు సోదరుడు ప్రవీణ్ మహాజన్ లు పుట్టుకొస్తారు. లేదా హెలికాప్టరు విమాన ప్రమాదాలు ఏర్పడతాయి. లేదా రోడ్లపైన మావోయిస్టులు మందుపాతరలు పేలుస్తారు. ఇది గ్రహించిన రాజకీయ నాయకులు తప్పని సరిగా గూఢచార సంస్థలకు విధేయులై ఉంటారు.

గత టపాల్లో, మార్చి 19 వతేది 2009 న సి.ఐ.ఏ. ఛీఫ్ భారతసందర్శన తర్వాత స్ట్రాటజీ మారిపోయిందనీ, ఓడిపోవటం తప్పని సరైనప్పుడు మరింత ఘోరంగా ఓడిపోవాలన్న స్ట్రాటజీ అమలు జరపబడుతోందనీ, ఏంజరుగుతుందో వేచి చూడాల్సిందేనని వ్రాసాను. ఇప్పుడు ఫలితాల వచ్చాయి గనుక నా పరిశీలనలు, విశ్లేషణ, మీముందు ఉంచుతున్నాను.

ఈ ఎన్నికల ఫలితాల వెనుక ఉన్న స్ట్రాటజీ ఇది – సి.ఐ.ఏ.ఛీఫ్ భారత్ సందర్శన తర్వాత, మీడియా ట్రెండ్, రాజకీయ భాగస్వాముల ట్రెండ్ మారిపోయింది. సోనియాగాంధీని, యూపిఏ కూటమినీ, లాలూ, పాశ్వాన్ గట్రాలు ’ఛల్’ అన్నారు. ఇంకా చాలామందే తలెగరేసారు లేదా తోకలు ఝాడించారు. మీడియా కూడా యధాశక్తి సోనియాగాంధీ పని ఇక అయిపోయిందనీ, యూపిఏకి ఇవే చివరి రోజులనీ, ఇతోధికంగా ప్రచారించింది. తీరా అంతా అయ్యాక, అసలు పతాక సంఘటనకి ముందు, హఠాత్తుగా, అనూహ్యంగా పరిస్థితి మారిపోయిందనీ, లేదా ఫలానా వ్యక్తి రాత్రికిరాత్రి చక్రం తిప్పాడనీ, లేదా చాణిక్యం నడిపాడనీ, లేదా రాత్రికి రాత్రి అద్భుతం జరిగిపోయిందని, ఊదరబెడుతూ, మీడియా అప్పటి వరకూ తాను ప్రచారించిన దానికి విరుద్ధాన్ని ప్రతిష్టించగలదు. ఇది కూడా ఓ స్ట్రాటజీ అని గత టపాల్లోనే వ్రాసాను. అది కూడా ఈ ఫలితాల విషయంలో అమలు జరుపబడింది. కానీ దానికంటే పెద్ద స్ట్రాటజీ ఇక్కడ మరొకటుంది. అదేమిటంటే – ఏజంటు బలహీనపడిందనీ, తమ బలం తగ్గిపోయిందనీ గూఢచార ఏజన్సీ పిక్చర్ ఇస్తుంది. అది నిజమేననుకొని ఎవరెవరు తోకలు ఝాడిస్తారో చూస్తుంది. ఆ తర్వాత ఝాడించిన ఆ తోకల్ని మొదలంటా నరికేస్తుంది. ఈ అనుభవంతో, దెబ్బకి భవిష్యత్తులో ఎప్పుడైనా వాళ్ళు అలాంటి స్థితే వచ్చినా, ఒకవేళ నిజంగానే ఆయా ఏజంటూ, లేదా ఏజన్సీల బలం తగ్గిపోయినా, అనుచరగణం తోకలు ఝాడించకుండా, చచ్చినట్లు చాలా కాలం పడుంటారు. ఈ లోపున మళ్ళీ ఏజంటు, ఏజన్సీ కూడా బలం పుంజుకుంటాయి. తమకు గ్రిప్ ఉన్నప్పుడే, లేనట్లు పిక్చర్ ఇచ్చి, ఎవరెవరు ధిక్కారధోరణి చూపిస్తారో గమనించి, తర్వాత వాళ్ళందరి పీచమణిస్తే, అది తమకి ఎప్పుడైనా గ్రిప్ తగ్గిన స్థితిలో కూడా అక్కరకొస్తుంది.

సరిగ్గా ఈ స్ట్రాటజీనే ఎన్నికల కోడ్ మొదలయ్యాక, సి.ఐ.ఏ. ఛీఫ్ భారత్ సందర్శనకు వచ్చిపోయాక, సోనియా గాంధీ విషయంలో అమలుచేయబడింది. అందులో భాగమే ఆంధ్రప్రదేశ్ వ్వవహారం కూడా! ఎంతైనా రాజశేఖర్ రెడ్డి, సోనియాగాంధీకి అభిమాన పాత్రుడు కదా? అందుకే ‘ఈనాడు’ అంత నాటకీయంగా తన ప్రచారం కొనసాగించింది. ఎన్నికల ఫలితాలకు ముందు కాంగ్రెస్ పట్ల దాని వ్రాతల్నీ, నిన్న ఫలితాల ప్రకటన తర్వాత ఈనాడు వ్రాతల్నీ గమనించి చూడండి. అంతా మీకే బోధపడుతుంది. ‘ఎంతగా కాంగ్రెస్ వ్యతిరేకి అయినా, గెలిచిన వారిపట్ల ’జై’ కొట్టటం లౌక్యం కదా! అదే అతడూ చేస్తున్నాడు అన్నీ తప్పుబడితే ఎలా?’ అంటారేమో! ఈకాంగ్రెస్ వ్యతిరేకి, ఈనాడు రామోజీరావు 1977 ఎమర్జన్సీ అనంతర ఎన్నికలలో ఓడిపోయిన ఇందిరాగాంధీ, తిరిగి 1979 ఎన్నికలలో గెలుపొందినప్పుడు ఇదే లౌక్యాన్ని ప్రదర్శించలేదు మరీ! ఆ గెలుపుకి రంధ్రాన్వేషణలు చేశాడు. 1984 ఎన్నికల్లో ఇందిర సానుభూతి ప్రభంజనంతో ప్రతిపక్షాలన్నీ గాలికి కొట్టుకుపోయిన గడ్డిపోచల్లా ఎగిరిపోయినప్పుడూ, రాజీవ్ గాంధీకి, ఇలా సోనియాగాంధీకి కొట్టినట్లు ‘జై’ కొట్టలేదు.

నిజానికి తమ ఈ స్ట్రాటజీ ని గాని, EVMల Tampering ని గానీ, ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు కుల, మత ప్రాతిపదికన ఓట్లు చీలతాయనీ, చీలవనీ, ఒకోసారి ఒకో మాదిరి వ్రాతలు వ్రాసాయి పత్రికలు. టీవీలదీ అదే దారిలెండి. ఎవరి సర్వే రిపోర్టులు వారివి కావడం వెనుక సైతం, ఉన్నది ప్రజలకి జరుగుతున్నది ఏమిటో అర్ధం కాకూడదన్న ప్రయత్నమే. అందుకే పత్రికలు, టీవీలు ఇత్యాది మీడియా తన [credibility] విశ్వసనీయతని పణంగా పెట్టి మరి, ‘తన ఇష్టం వచ్చిన వార్తలు పత్రికలు వ్రాసాయి తప్ప నిజాలు వ్రాయలేదు’ అన్న నిందకి ఒడిగట్టాయి. ఆంధ్రప్రదేశ్ లో చిరంజీవిలాంటి బలిగొర్రెని [scapegoat] బరిలో దించింది ఇందుకే. కాబట్టే రామోజీరావు, చిరంజీవి రాజకీయ రంగప్రవేశం చేసే వరకూ తెగ ఇమేజ్ ఇచ్చాడు. ‘చిరంజీవి రైలు ఇప్పుడొస్తుంది అప్పుడొస్తుంది’ అంటూ ఉత్కంఠభరితంగా వార్తలు వ్రాసాడు. చివరికి చిరంజీవి తండ్రి వెంకట్రావు మరణిస్తే పరామర్శలకు సైతం వెళ్ళాడు ఎంతో హృదయవైశాల్యంతో. అంతే హృదయ వైశాల్యంతో రోడ్డుప్రమాదంలో గాయపడ్డ జూనియర్ ఎన్టీఆర్ ని ఒకటికి రెండు సార్లో మూడుసార్లో పరామర్శించి వచ్చాడు లెండి. ఒకప్పుడు ఈ మీడియా [మొఘలు] చక్రవర్తి, ముఖ్యమంత్రులు హాజరయ్యే సభలకి సైతం హాజరయ్యే వాడు కాదు. ఎవరైనా అతణ్ణి కలవటానికి రావలసిందే. అతడి తరుపున పూలదండలూ, పుష్పగుచ్ఛాలూ పట్టుకుని అతని ప్రతినిధులు పనులు చక్కబెట్టేవాళ్ళు. సరే, విషయాంతరం వదిలేసి మళ్ళీ విషయంలోకి వద్దాం.

అంతగా చిరంజీవి రాజకీయ రంగప్రవేశాన్ని ప్రోత్సహించిన ‘ఈనాడు రామోజీరావు’, తీరా చిరంజీవి రాజకీయ రంగప్రవేశం చేశాక అడ్డంగా ముంచేసాడు. కనీసం పాతికేళ్ళ వయస్సున్న కుర్రనటుడు జూనియర్ ఎన్టీఆర్ కి ఇచ్చినంత ప్రాధాన్యత, ఇమేజ్ కూడా చిరంజీవి కి ఇవ్వలేదు. అతడి రాజకీయ కెరియర్, కేవలం ఓట్లు చీల్చడానికి మాత్రమే ఉపయోగపడింది. పోలింగ్ సరళిని, ఫలితాలని అర్ధంచేసుకోవడంలో కొంత అయోమయాన్ని, గందరగోళాన్ని సృష్టించడానికి ఉపయోగపడింది.

ఇక్కడ మనం మరో విషయం పరిగణనలోనికి తీసుకోవచ్చు. అమెరికా అధ్యక్షఎన్నికల్లో ఓసారి [నాకు గుర్తుండి 2004 ఎన్నికల్లో] టీవీల్లో ముఖాముఖి చర్బాకార్యక్రమంలో డెమోక్రాట్ అభ్యర్ధి పదేపదే నిట్టూర్పు విడిచాడట. అది ఆత్మవిశ్వాస లోపాన్ని సూచిస్తుందని మీడియా ప్రచారించటంతో, సదరు అభ్యర్ధి ఓడిపోయాడట. ఇలాంటి మీడియా జిమ్మిక్కులు, అనూహ్య ఫలితాలు పాశ్చాత్యదేశాలలో సర్వసాధారణాలు. ఎటొచ్చీ భారతదేశంలోనే, ఇటివలే వెలుగుచూస్తున్నాయి. ఇలాంటి నేపధ్యంలో ఎన్నికల ఫలితాలు ఎటువంటి మతలబులకి గురి కాలేదని ఎవరైనా ఖరాఖండిగా అనగల అవకాశం ఉందా?

కొన్ని కార్పోరేట్ కాలేజీలలో లెక్చరర్లకి ఇచ్చే జీతభత్యాల కంటే పటాటోప ప్రకటనలే ఎక్కువ. ఎవరైనా లెక్చరర్, అదంతా నిజమనుకుని, మేనేజ్ మెంటు పట్ల ‘నా టిచింగ్ అవసరం మీకూ ఉంది’ అన్న డీల్ చూపెట్టాడనుకొండి. వెంటనే మేనేజ్ మెంటు ’తొక్కలోది నువ్వు చెప్పే చదువుకు మాకు మార్కులు, ర్యాంకులు వస్తున్నాయనుకుంటున్నావా? మా దారులు మాకున్నాయమ్మా!’ అన్న ధర్మవరపు సుబ్రమణ్యం మార్కు డీల్ చూపెడతాయి. చివరికి ఇప్పుడు రాజకీయ నాయకులు, కార్యకర్తల, అభ్యర్ధుల పరిస్థితి కూడా అక్కడికే వచ్చింది. ఏవిధంగా అయితే కార్పోరేట్ కాలేజీలు, సహజంగా ర్యాంకులు తెచ్చుకోగల విద్యార్ధులని పరిగణించుకుని, మిగిలిన ర్యాంకులకి ఫిక్సింగు చేసుకుంటాయో, అలాగే గూఢచార ఏజన్సీలు కూడా గెలుపు గుర్రాలు పరిశీలించుకుని, మిగిలిన సీట్లకు ఫిక్సుంగు చేసుకుంటుంది. ఆ గెలుపు గుర్రాలలో నిజంగానే ప్రజాసేవ చేసిన నాయకులూ ఉండొచ్చు, డబ్బు దండిగా ఖర్చు పెట్టే నాయకులూ ఉండొచ్చు.

ఈవిధంగా ప్రజల చేత, ప్రజల కొరకు నడపబడుతున్న ప్రజాస్వామ్యం, ప్రజల ప్రమేయం లేకుండానే ప్రజానాయకులని ఎన్నుకుంటుంది. అంతగా ప్రజాస్వామ్యం పరిహాస పాత్రమయ్యింది. ప్రజాస్వామ్యం పేరిట దోపిడి ఒక్కటే కాదు, పరాయి పాలన ప్రత్యక్షంగా వేళ్ళూనుకుంది. లేకుంటే సి.ఐ.ఏ.లూ, అమెరికా రాయబారులు భారతదేశ ఎన్నికల వ్వవహారంలో వేలు పెట్టగలరా? ఎన్నికల ప్రచార ఘట్టంలో, ఎర్రపార్టీ వాళ్ళు, అమెరికా నాటి రాయబారి మల్ ఫోర్డు తమని ఓడించేందుకు ముస్లింలతో మంతనాలు జరుపుతున్నాడని ఆరోపించటం దీనికి నిదర్శనం కాదా? అమెరికా నేటి తాత్కాలిక రాయబారి పీటర్స్ బర్లీ ఆంధ్రప్రదేశ్ లోని రాజకీయ నాయకులతో [చంద్రబాబు, చిరంజీవి వగైరాలతో] సమావేశమై ఏవో మంతనాలు చేశాడన్న వార్తలు ఇందుకు నిదర్శనం కాదా?

ఎలా చూసినా, ఏ పేరుతో పిలిచినా, ఏ దేశమైనా, ఏ ప్రభుత్వమైనా, ప్రపంచవ్యాప్తంగా నడుస్తోంది ఒకే దోపిడి. భారతదేశంలో ప్రజాస్వామ్యం పేరుతో దోపిడి. అమెరికాలో కాపిటలిజం పేరిట దోపిడి. ఒకప్పుటి రష్యాలో, ఇప్పటి చైనాలో కమ్యూనిజం పేరిట దోపిడి. ఒకప్పుడు ప్రపంచమంతా బ్రిటీషు రాజరిక వ్యవస్థ పేరుతో దోపిడి. ఇంకొన్ని దేశాలలో ఇస్లాం పేరుతో దోపిడి. ఏ పేరైతేనేం? ఇది చెప్పటం లేదా అందరినీ, అన్నిటినీ నడుపుతోంది ఒకే వ్యవస్థ, ఒకే గూఢచార వలయం అని? అయినా ప్రపంచం సంగతి తర్వాత. ముందు మనదేశం సంగతి చూసుకుంటే – ఇది ప్రజాస్వామ్యమా? ఓటేసిన ప్రజలూ, పోటీచేసిన అభ్యర్ధులు కూడా విస్తుపోయిన ’అనూహ్య’ ఫలితాలు నిజమా? ఇది భారత దేశమ్మీద ప్రత్యక్షంగా సి.ఐ.ఏ. పాలన.

ఇక ఇప్పుడు ఎవరు కాపాడగలరు ఈ హిందుదేశాన్ని క్రిస్టియన్ దేశంగానో, ముస్లిం దేశంగానో మారిపోకుండా? ఎవరు కాపాడగలరు హిందూ సంస్కృతినీ, మతాన్నీ, జీవన సరళిని నాశనం కాకుండా?

నిజానికి ప్రమాదంలో పడింది కేవలం భారతదేశం ఒక్కటే కాదు. ప్రపంచదేశాల భవితవ్యం కూడా! ప్రమాదంలో పడింది కేవలం భారతీయ సంస్కృతి, హిందూమతం, జీవనసరళి మాత్రమే కాదు. మొత్తంగా మానవత్వమే ప్రమాదంలో పడింది. ప్రజల పేరిట, ప్రజలతో నిమిత్తం లేని ప్రజాస్వామ్య ప్రభుత్వాలు చేసే చట్టబద్ద దోపిడి, చట్టాల్ని దోపిడికి అనుకూలంగా సవరించి మరీ చేసే దోపిడి నిరవధికంగా, వ్యవస్థీకృతంగా కొనసాగుతుంది.

ఇప్పటికీ, ఇందుకు దారితీసిన పరిస్థితుల గురించి సిద్దాంతాలు చెప్పుకుంటూనో, లేక మార్పురావాలి అని నిట్టూర్పులు విడుస్తూనో, లేక మార్పు రాదు ఇంతే ఈ పరిస్థితులు అని ఆవేదన చెందుతూనో, కాలయాపన చేస్తూ, చేతులు కాలాక ఆకులు పట్టుకుందామన్నా కుదరదు. ఎందుకంటే అప్పటికి ఆకులు కూడా కార్పోరేట్ కంపెనీల సూపర్ మార్కెట్లలో మాత్రమే అమ్మడానికి దొరుకుతాయి గనుక. [ఇది వ్యంగ్యంకోసం అతిశయోక్తిగా అనటం లేదు, నిజంగా అంటున్నాను. ఎందుకంటే మన ఊళ్ళల్లో దొరికే ఆముదం కేజీ 40/-Rs., హైదరాబాదులో సూపర్ మార్కెట్లలో కేజీ 350/-Rs. అయ్యింది. ఇది 2001 లెక్క]

నిజానికి ఈ భూమ్మీద పుట్టిన ప్రతీప్రాణికీ స్వేచ్ఛ ఉంది. రూసో తన Social Contract లో చెప్పినట్లు ‘Man is born free. But everywhere he is in chains’. ప్రతీరోజూ దగాపడుతూ, ప్రతీక్షణం అవినీతితో రాజీ పడుతూ, లౌక్యం పేరుతో అంతో ఇంతో, ప్రత్యక్షంగానో పరోక్షంగానో, అవినీతిలో భాగం పంచుకుంటూ, నిస్తేజంగా, నిస్సత్తువగా, నిరాసక్తంగా, బ్రతుకు ఈడుస్తూ…. చివరికి మన ఇంటికి మనమే పరాయి వాళ్ళం, మన దేశానికి మనమే పరాయి వాళ్ళం, మనకి మనం కూడా ఏమేలూ చేసుకోలేం. అప్పడిక జీవితానికి మిగిలే అర్ధం ఏముంది? అర్ధమే లేని చోట పరమార్ధం ఏముంటుంది?

నిజం చెప్పేవాడు, అబద్దాలాడేవాణ్ణి నిలదీయగలడు. తప్పుచెయ్యని వాడు, చేసిన వాణ్ణి నిలదీయగలడు. ఈ పరిస్థితిని నియంత్రించేందుకే నకిలీ కణిక వ్యవస్థ ప్రజాజీవితంలోకి అవినీతిని హద్దులు లేనంతగా ప్రవేశ పెట్టింది. ఒకసారి ఆ రొంపిలో దిగబడ్డవాడు ఇక దుర్భలుడే అవుతాడు. ధర్మహీనుడు ఎవరినీ నిలదీయలేడు, ఏదీ సాధించలేడు. అందుకేనేమో వివేకానందుడు “మీరు దుర్భలురు కాదు, సింహాలు మీరు. గొర్రెలు కాకండి” అని నినదించాడు. ఒక్కసారి ఇది స్ఫురిస్తే ప్రతిమనిషి జూలు విదల్చుకున్న సింహాంలా లేచి నిలబడి, ఈ దగాలని, మోసాలని, కుట్రలనీ నిలదీయగలుగుతాడు. అప్పుడు ఎందరు సి.ఐ.ఏ. ఏజంట్లయినా, ఐ.ఎస్.ఐ. ఏజంట్లయినా, నకిలీ కణీకుడైనా నాశనం కాక తప్పదు.

కావలసిందల్లా స్థైర్యం, ధైర్యాలే!

ఇలాంటి ప్రజాస్వామ్యం గురించి ఏం మాట్లాడుకోగలం?

గొంగట్లో తింటూ వెంట్రుకలేరినట్లు గాకపోతే!

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

6 comments:

media ne control chestunnadi okri gelupu otamini.........eppudu maarataaro............
meeku enta opikandi baabu.............

imta pedda write up rasinamduku meeku hats off.

I received completely negative ones as వాళ్ళ అభివృద్ది పధకాలు చూసి ఆకర్షితులై ఓట్లు వేసారట. when i tried to discuss this strategy with my friends.....

they are not even ready to think about this. they simply say arogyasri sort of things made congresss win.

మనోహర్ గారు,

అది మీడియా ప్రచారపు గొప్పదనం. మనం మనం కామని నమ్మించగలదు. అందుకే పెద్దలంటారు అనుభవం అయితే గానీ తత్త్వం బోధపడదు అని.

మనోహర్ గారు,

మరో మాట. ఈ విషయంలో కూలంకషంగా తెలుసుకోనిదే అసలు ఏదీ అర్ధం కాదు. ఇక ఆమోదించేదెక్కడ? కనుక మీ అనుభవం సహజ పరిణామమే. అయినా ఆరోగ్యశ్రీ గట్రా రాష్ట్రంలో ఉంది గానీ, కేంద్రంలో లేదు కదా!

మీరన్నది నిజమే, కూలంకషంగా తెలుసుకోకుండా చెయ్యడానికి మన మీడియా చాలా చక్కగా ప్రయత్నిస్తోంది. మన వాళ్ళు కూడా ఆ ఉచ్చులో సులభంగా పడుతున్నారు. పిటీ ఏంటంటే చాలా మంది చదువుకున్న వాళ్ళు ఈ విధమైన ఆలోచనలోనే ఉన్నారు.

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu