మొన్నటి మా టపాకు వ్యాఖ్య వ్రాస్తూ, మిత్రులు ‘చంద-మామ’ గారు, ఆంధ్రజ్యోతిలో ప్రచురింపబడిన దిగువ వార్తని ప్రస్తావించారు. ‘చంద-మామ’ గారికి కృతజ్ఞతలతో ఈ టపా!

ముందుగా దిగువ వార్తని ఓ సారి పరిశీలించండి.

>>>ఇండియా గేట్

బిజెపి విభిన్న స్వరూపం
- ఎ. కృష్ణారావు

భారతీయ జనతా పార్టీ తీసుకునే కొన్ని నిర్ణయాలు చాలా విచిత్రంగా, వివాదాస్పదంగా ఉంటాయి. చాలా నిర్ణయాలను దాని సిద్ధాంతాలతో ముడిపెట్టలేం. ఇటీవల బిజెపి మద్దతుతో ప్రముఖ న్యాయవాది రాం జెఠ్మలానీ రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నిక కావడం ఇలాంటి నిర్ణయాల్లో ఒకటి. న్యాయవాదిగా ఆయన సామర్థ్యాన్ని ఎవ రూ ప్రశ్నించలేరు. కాని బిజెపికి ఇప్పుడు 87 ఏళ్ల రాంజెఠ్మలానీతో ఏం అవసరం వచ్చిందా అన్న విషయం ఆలోచించా ల్సి ఉన్నది.

గుజరాత్‌లో గత 8 సంవత్సరాల క్రితం జరిగిన వేలాది మంది ఊచకోతకు సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి వచ్చిన సమాన్లను సవాలు చేసే బాధ్యతను జెఠ్మలానీ తన భుజస్కంధాలపై వేసుకున్న తర్వాత బిజెపికి జెఠ్మలానీపై ప్రేమ కలిగి ఉంటుంది. విచిత్రమేమంటే ఆయన అంతకుముందు గుజరాత్ అల్లర్ల బాధితు ల తరఫున కేసులు వాదించారు. బా«ధితుల తరఫున వాదించేందుకు సీనియర్ న్యాయవాదులు ఎవరైనా ముందుకు రావల్సిందిగా సుప్రీంకోర్టు కోరినప్పుడు రాం జెఠ్మలానీ తనంతట తాను ముందుకు వచ్చారు.

ఒక ఎన్‌జిఓ తరఫున ఆయన గుజరాత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాదించారు. కాని అదే రాంజెఠ్మలానీ గత మార్చిలో మోడీ తరఫున వకా ల్తా తీసుకున్నారంటే ఆయనకూ బిజెపికి మధ్య ఏదో ఒక ఒప్పందం కుదిరిఉంటుందని అనుమానాలు వ్యక్తం చేసిన వారు లేకపోలేదు. తదనుగుణంగా రాంజెఠ్మలానీకి రాజ్యసభ నుంచి బిజెపి తరఫున సీటు వరించింది. రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజే సింధియా తన పార్టీ శాసన సభ్యులను జైపూర్‌లో అయిదు నక్షత్రాల హోటల్‌లో విడిది చేయించి వారికి అక్కడే సకల ఏర్పాట్లు చేయించి వారు మరో పార్టీ వైపు మొగ్గు చూపకుండా కాపాడుకున్నందువల్లనే రాంజెఠ్మలానీ విజయం సాధించగలిగారు.

పనిలో పనిగా ఈ ఎమ్మెల్యేలకు రాజనీతి సినిమా పైరేటెడ్ కాపీని తెప్పించి మరీ వినోదం కలిపించిన విషయం తెలిసిందే. ఈ సినిమా అక్రమంగా చూసినందుకు వారిపై కేసు పెడతానని సినిమా దర్శకుడు ప్రకాశ్ ఝా హెచ్చరించారు.. అయనా వారికేం భయం ఉద్దండ పిండమైన న్యాయవాది రాంజెఠ్మలానీ బిజెపి పక్షంలోనే ఉన్నారు కదా.. ఏదో రకంగా వారిని ఆయన ఈ కేసు నుంచి తప్పించగల చతురుడు. నరేంద్ర మోడీనే కాదు, ఐపిఎల్ కుంభకోణంలో ఇరుక్కున్న లలిత్ మోడీని కూడా కాపాడేందుకు రంగంలోకి దిగిన రాంజెఠ్మలానీ గతంలో ఏ కేసులు వాదించారన్న విషయంలో, ఏ విధంగా తమ పట్ల ప్రవర్తించారన్న విషయాన్ని పట్టించుకోవాల్సిన అవసరం బిజెపికి లేదు.

2004లో ఆయన అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయికి వ్యతిరేకంగానే లక్నోనుంచి పోటీ చేశారన్న విషయం బిజెపికి తెలిసిందే కదా.. అంతకుముందు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హంతకులను సమర్థిస్తూ ఆయన కోర్టుల్లో వాదించారన్న విషయం కూడా ఆ పార్టీకి తెలియని కాదు కదా.. సంచలనాత్మకమైన మార్కెట్ కుంభకోణాలకు పాల్పడిన హర్షద్ మెహతా, కేతన్ పరేఖ్ లాంటి వారిని, స్మగ్లర్లను, ముఠాకోర్లను.

అందరూ చూస్తుండగానే జెస్సికాలాల్ అనే మోడల్‌ను కాల్చి చంపిన మనుశర్మ అనే హంతకుడిని కాపాడేందుకు ప్రయత్నించింది కూడా ఆయనే నని బిజెపికి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు కదా.. అన్నిటికన్నా మించి పార్లమెంట్ దాడిలో నిందితుడైన పాకిస్తానీ టెర్రరిస్టు మహమ్మద్ అఫ్జల్‌ను ఉరితీయకూడదని కోర్టులో వాదించడమే కాక, పార్లమెంట్‌లో అప్జల్ ఉరి ని వ్యతిరేకించింది రాంజెఠ్మలానీయేనని భారతీయ జనతా పార్టీకి చెప్పే ప్రయత్నం చేయడం అమాయకత్వమే కదా..

అయినా భారతీయ జనతా పార్టీకి రాంజెఠ్మలానీ వంటి న్యాయవాదులకు అందలమెక్కించడం కొత్త కాదు. 15వేల మంది ప్రాణాలను బలిగొన్న యూనియన్ కార్బైడ్ కేసులో ఆ కంపెనీ తరఫున వాదించి వాయిదాల వాయిదాలు కోరి, ఆ కేసు 26 ఏళ్లు పట్టేందుకు కారణమైన మరో ప్రముఖ న్యాయవాది ఫాలి నారిమన్ కూడా బిజెపికి అంతరంగికుడే. భోపాల్‌లో కేసు విచారణ జరిగిన తొలి రోజుల్లో ఒక్క నారిమన్ మాత్రమే ఢిల్లీ నుంచి వెళ్లేలా చేసేందుకు యూనియన్ కార్బైడ్ కంపెనీ విమానం టిక్కెట్లనన్నీ తానే కొన్న సందర్భాలున్నాయని అప్పటి ప్రముఖ న్యాయవేత్త ఒకరు చెప్పా రు.

ఇటీవల నారిమన్ 'జ్ఞాపకాలు చెరిగిపోకముందే.. (బిఫోర్ మెమోరీ ఫేడ్స్ అవుట్)' అనే పుస్తకాన్ని రాశా రు. ఇందిరాగాంధీ హత్యకేసులో నిందితులను కాపాడేందుకు రాంజెఠ్మలానీ వంటి న్యాయవాదులు కేసు వాదించినప్పుడు తానెందుకు యూనియన్ కార్బైడ్ తరఫున వాదించకూడదని నారిమన్ ఈ పుస్తకంలో రాసుకున్నారు.

హత్యకేసులో నిందితులెవరో తేలేందుకు విచారణ జరగాల్సిన అవసరం ఉన్నది. కాని భోపాల్‌లో విషవాయువు లీకై 15వేలమంది మరణించిన దృశ్యాలు కళ్లముందున్నప్పుడు అందుకు కారణమైన ఆ కంపెనీ తరఫున వాదించి, కంపెనీ నిర్దోషిత్వాన్ని నిరూపించేందుకు ప్రయత్నించడం సరైనదేనా.. అది భారత ప్రజల తరఫున దుర్మార్గం కాదా.. అని ఎవరైనా ప్రశ్నించేందు కు ఆస్కారం ఉన్నది. అందునా నారిమన్ అంతకుముందు మానవ హక్కులకోసం పోరాడిన వారు.

ఎమర్జెన్సీని వ్యతిరేకించిన వారు. అలాంటి నారిమన్ యూనియన్ కార్బైడ్ ప్రలోభాలకు లొంగిపోవడం జీర్ణించుకోలేని విషయం కాదు. అందుకే బిజెపి ఆయనను బిజెపి రాజ్యసభకు నామినేట్ చేయడం, పద్మభూషణ్ లాంటి బిరుదులు ఇవ్వడం జరిగిందంటే ఆ పార్టీ గురించి కొంత ఆలోచించాల్సి ఉంటుంది. తనకు అప్పటి డిప్యూటీ ప్రధానమంత్రి అద్వానీ స్వయంగా ఫోన్ చేసి తనను రాజ్యసభకు నామినేట్ చేశారని తన ఆత్మకథలో రాసుకున్నారు. ఈ నేపథ్యంలో యూనియన్ కార్బైడ్ కేసులో సిబిఐ ఛార్జిషీటులో నిందితుడైన కేశవ్ చంద్ర మహేంద్రకు పద్మభూషణ్ అవార్డు వరించడం కూడా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు.

న్యాయవాదులు ఏ కేసులోనైనా వాదించవచ్చు కనుక వారి వృత్తికీ ప్రవృత్తికీ ముడిపెట్టరాదని వాదించే బిజెపి నేత లు ఉండవచ్చు కాని రాంజెఠ్మలానీ ఉదంతం బిజెపిలో ఉన్న ఒక గందరగోళాన్ని, నిస్సహాయతను సూచిస్తుంది. కేంద్రం లో కాంగ్రెస్ పార్టీ సారథ్యంలోని యుపిఏ ప్రభుత్వం ఎంత అస్తవ్యస్తంగా పాలిస్తున్నప్పటికీ, ఎన్ని తప్పులు చేసినప్పటికీ, యూనియన్ కార్బైడ్ వంటి ఉదంతాలు ఆ పార్టీ నిజస్వరూపాన్ని వ్యక్తం చేసినప్పటికీ బిజెపి దాన్ని గట్టిగా ప్రశ్నించలేని స్థితిలో ఉన్నదంటే ఆ పార్టీ నైతికతయే ప్రశ్నార్థకంగా మారిందని భావించవలిసి ఉంటుంది.

దేశ ప్రజలకు సంబంధించి ఒక ఘోరమైన అన్యాయం గురించి వాస్తవాలు వెల్లడవుతున్నప్పుడు ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బిజెపి ప్రజలను ఉద్యమించేందుకు పురికొల్పలేని ఒక అసమర్థ దుస్థితిలో ఉన్నదని చెప్పవలిసి ఉంటుంది. తాజాగా బీహార్‌లో జరిగిన బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలు ఆ పార్టీని ఒక విచిత్రమైన పరిస్థితిలోకి నెట్టివేశాయి. తమ కూటమి ముఖ్యమంత్రి అధికారంలో ఉన్న ఒక రాష్ట్రంలో కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నప్పుడు ఆ ముఖ్యమంత్రితోనే ఢీకొనేందుకు బిజె పి పూనుకోవడం ఆ పార్టీ వైఖరికి అద్దం పడుతుంది.

నిజానికి ఇలాంటి కార్యవర్గ సమావేశాలు సంబంధాలు బలపడేందు కు దోహదం చేయాలి కాని కూటమిలో ఉన్న ఒక ప్రధాన పార్టీ తప్పుకునే పరిస్థితికి సమావేశాలు దారి తీయడం ఆశ్చర్యకరం. ముందునుంచీ జనతాదళ్ (యు)కు చెందిన ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌తో కలిసి నరేంద్ర మోడీ క రచాలనం చేస్తున్న పోస్టర్లు అంటించడం, మోడీ తమ పార్టీ మంత్రులను ఆకాశానికెత్తడం, కావాలంటే తెగతెంపులు చేసుకోవల్సిందిగా సీనియర్ బిజెపి నాయకుడు యశ్వంత్ సిన్హా సవా లు చేయడం, ముఖమంత్రి రాష్ట్రంలో చేపడుతున్న యాత్రనుంచి తప్పుకోవాలని బిజెపి ఉప ముఖ్యమంత్రి సుశీల్ షిండే సహా మరికొందరు మంత్రులు నిర్ణయించడం, చివర కు క్యాబినెట్ సమావేశాల్నే బహిష్కరించాలని యోచించడం చిలికి చిలికి గాలివానగా మారింది.

చివరకు రాష్ట్రంలో వరద బాధితులకు నరేంద్ర మోడీ ప్రకటించిన నిధులను తిరస్కరించాలని నితీశ్ కుమార్ నిర్ణయించడంతో ఇక ఎన్‌డిఏతో జెడి(యు) తెగతెంపులు చేసుకోవడం తప్పదన్న అభిప్రాయాన్ని ఏర్పర్చింది. నిజానికి బిజెపితో సంబంధాలు కొనసాగించే విషయంలో జెడి(యు)కు ఎలాంటి అభ్యంతరం లేకున్నా నరేంద్ర మోడీ, వరుణ్ గాంధీ వంటి వివాదాస్పదమైన వ్యక్తుల విషయంలోనే నితీశ్ కుమార్ తన అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ వస్తున్నారు.

గుజరాత్ అల్లర్లకు కారకుడైన మోడీతో స్నేహసంబంధాల వల్ల తన ముస్లిం ఓటు బ్యాంకు దెబ్బతింటుందన్న భయం ఇందుకు కారణం కావచ్చు. కాని బిజెపి ఈ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించకుం డా, బీహార్‌లో మోడీకి పెద్ద పీట వేయడం సహజంగానే నితీశ్‌కు కోపం తెప్పించి ఉంటుంది. బహుశా బిజెపి బుద్ధి పూర్వకంగానే బీహార్‌లో నరేంద్ర మోడీని ఆకాశానికి ఎత్తి ఆయనకు ఎనలేని ప్రాధాన్యం కలిగించి ఉంటుంది.

వచ్చే ఏడాది బీహార్‌లో ఎన్నికలు జరుగనున్న రీత్యా మోడీని ప్రచార రంగంలోకి దించేందుకు ఆ పార్టీ వ్యూహరచ న చేస్తున్నట్లు కనపడుతోంది. బీహార్‌లోనే కాదు మహారాష్ట్ర లో శివసేనతో కూడా బిజెపి సంబంధాలు రోజురోజుకూ దెబ్బతింటున్నాయి. ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ ఆ పార్టీతో తెగతెంపులుచేసుకున్న విషయం తెలిసిందే.

కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం తప్ప ఏ పార్టీ స్వతంత్రంగా ప్రభుత్వం ఏర్పాటు చేయలేదన్న విషయం తెలిసినప్పటికీ బిజెపి ఒక్కో మిత్రపక్షాన్నీ వదులుకోవడం ఆశ్చర్యకరం. యుపిఏ-2 ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలో సాధించేందేమీ లేదని బిజెపి అధ్యక్షుడు నితిన్ గడ్కారీ బీహార్‌లో బిజెపి కార్యవర్గ సమావేశాల్లో అన్నారు. కాని ఈ ఏడాదిలో ప్రతిపక్షంగా, బలమైన పార్టీగా నిలదొక్కుకునేందుకు బిజెపి ఏం చేసిందో ఆయనే చెప్పాలి. (ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)


దేశ విభజన నాడు పాక్ నుండి భారత్ కు వలస వచ్చి, ఆనక ప్రముఖులైపోయిన సమూహంలో - ఒకడు రాంజెఠ్మలానీ! భారతదేశానికి వ్యతిరేకంగా ఏ కేసునైనా వాదించటానికి ఎల్లవేళలా సిద్దంగా ఉంటాడీతడు. చిత్రమేమిటంటే - ఒకే కేసులో.... ఒకసారి వాది తరుపునా, మరికొంత కాలం తర్వాత ప్రతివాది తరుపునా కూడా వాదించగల ‘దిట్ట’. అది చట్టబద్దం కావచ్చేమో గానీ, వ్యక్తిగతంగా ఏ పాటి ‘నీతి వంతమో’ సదరు న్యాయవాదికే తెలియాలి.

గమ్మత్తు ఏమిటంటే - ఇందిర హంతకుల తరుపునా, పార్లమెంటుపై దాడి కేసులో ముద్దాయి ‘అఫ్జల్ గురు’ ల తరుపునా వాదించిన ఈ న్యాయవాది, ప్రతీకేసు లోనూ భారత్ కు వ్యతిరేకంగా వాదించేందుకే సిద్దపడే ఈ న్యాయవాది, తనకు రాష్ట్రపతి పదవి ఇవ్వాల్సిందిగా ఎన్డీయే ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాడు.

అతడి దృష్టిలో .... భారత్ కు వ్యతిరేకంగా, కుట్రదారులకు అనుకూలంగా, తాను చేసిన సేవలకు, తనకు ముట్ట చెప్పవలసిన ‘కూలీ’ అది! ఆ డిమాండునే తెరపైన ఎన్డీయేనీ, ఆ విధంగా తెరవెనుక.... ఎన్డీయే యూపీఏ లని ఆడించే గూఢచర్య వ్యవస్థ యైన నకిలీ కణిక వ్యవస్థనీ డిమాండ్ చేశాడు.

"నువ్వు చేసిన సేవలకు అంత ఖరీదు లేదులే! మహా అయితే ఇదిగో ఈ రాజ్యసభ సీటు ఇస్తాం" అని భాజపా ద్వారా ఆ ‘కూలీ’ అతడికి ఇచ్చింది నకిలీ కణిక వ్యవస్థ!

లేకపోతే, అంత అడ్దదిడ్డంగా భాజపా ప్రవర్తిస్తుందా? అంత నగ్నంగా, అంత పచ్చిగా, అంత బహిరంగంగా, విలువలు వదిలేసి నిలబడి కనబడుతుందా?

చేసిన కర్మను అనుభవింప చేసే సువర్ణముఖి ఎదురుగా ఉంటే...
‘కన్నా?కాలా?’ స్ట్రాటజీలో చిక్కుకొని తప్పని సరి పరిస్థితి అయితే....
‘ఆత్మహత్యా సదృశ్య అసైన్ మెంట్’ ని నిర్వహించడం తప్పని సరి అయితే....
భాజపా అయినా ఏం చేస్తుంది? సోనియా అయినా ఏం చేస్తుంది?

కాబట్టే - రాంజఠ్మలానీ లకు రాజ్యసభ టిక్కెట్లు వస్తాయి, నారిమన్ లకు పద్మ అవార్డులొస్తాయి. [ఈ రాంజెఠ్మలానీని 1992 ద్వితీయార్దంలో ఢిల్లీలో రోడ్డు మీద జనాలు బాహాబాహీ కొట్టారు. జనం మధ్యలో నలుగుతూ, కళ్ళద్దాలు పప్పుపప్పు కాగా, బిగ్గరగా రోదించిన రాంజఠ్మలానీ విజువల్ ని, అప్పట్లో డీడీ వార్తల్లో చూశాను.]

రాంజఠ్మలానీ చరిత్ర ఇదయితే, ప్రముఖ న్యాయవాది ఫాలి నారిమన్ చరిత్రని ఆంధ్రజ్యోతి వ్రాసింది. సదరు నారిమన్, యూనియన్ కార్బైయిడ్ కు ‘పరమతొత్తు’ గా పనిచేసాడు. [ఇలాంటి పనులు చేసినందుకు బహుమానంగా పద్మ అవార్డులు గట్రా తెచ్చుకున్నాడన్న మాట!]

ఇక ఈ ఎన్డీయే యూపీఏలు... పార్లమెంట్ లోనూ, రాష్ట్ర అసెంబ్లీలలోనూ అరుచుకునేటప్పుడు....

ఉదాహరణకి -
ఎన్డీయే వాళ్ళు గనక, అఫ్జల్ గురు గురించి ఎత్తేరనుకొండి! అప్పుడు యూపీఏ వాళ్ళు, "ఆ ‘ఆఫ్జల్ గురు’ తరుపున వాదించిన రాంజఠ్మలానీ ని మీరే కదా నెత్తి కెత్తుకొని రాజ్యసభకు పంపించారు? ఇంకా మీరూ మాట్లాడతారా?" అంటారు. ‘అవును కదా!’ అనుకుని, పాపం బిజేపీ, తన గొంతు క్రమంగా తగ్గించేస్తుంది.

అలాగే యూనియన్ కార్బైయిడ్ గురించి మాట్లాడితే.... "ఆ నారిమన్ ని మీరు నెత్తికెక్కించుకోలేదా? ఇంకేం మాట్లాడతారు?" [యూపీఏ కైతే యూనియన్ కార్బైయిడ్ పాపమంతా పీవీజీదే!] అంటారు. ‘అవును కదా!’ అని, ఎన్డీయే తమ వాదనా పటిమని తగ్గించుకుంటుంది.

మరో ఉదాహరణ చెప్పాలంటే.... ఇప్పుడు కర్నాటన చట్టసభలో, గాలి గనుల గొడవల్లో, ఒకరి నొకరు అరుచుకుంటూ, భాజపా కాంగ్రెస్ ని "ఇప్పుడు కర్ణాటక గవర్నరుగా ఉన్న హెచ్.ఆర్.భరద్వాజ, అప్పట్లో న్యాయమంత్రిగా ఉండి, భోపోర్సు కేసులో ద్రోహి ఖత్రోచికి ఎలాంటి సాయం చేశారో దేశమంతా తెలుసు. అలాంటిది తగుదునమ్మా అంటూ, గవర్నరుని అంటూ, ఓ తెగ గోల చేస్తున్నాడు!? ఇంకా ఏం చెప్పొచ్చారు?" అంటున్నారు, చూడండి! అలాగన్న మాట!

ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ... కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనీష్ తివారి "రాజ్యాంగ బద్ద పదవిలో ఉన్న వారిపై వ్యాఖ్యలు చేస్తే ప్రజాస్వామ్యం ఏమైపోవాలి?" అంటూ సెలవిస్తున్నాడు. అసలు ప్రభుత్వ కుర్చీ వ్యక్తి అనే పదవి రాజ్యాంగంలో ఉందా? తమకి కావాలసినప్పుడు కావాల్సినట్లుగా వాడుకునేదే వాళ్ళ ‘రాజ్యాంగం’ కాబోలు!

ఇక ఇలాంటి ఎన్డీయేలనీ, యూపీఏలనీ ఏమనగలం? వీరా దేశాన్ని కాపాడేది?

ఇక్కడ ఓ పోలిక చెబుతాను.

మన పల్లెటూళ్ళల్లో, నాలుగు దారుల కూడళ్ళలో, ఆ వీధి కుక్కలు ఓ పది, ఈ వీధి కుక్కలు ఓ పది చేరి, ‘ఖయ్యి ఖయ్యి’ మని అరుచుకుంటూ ఉంటాయి. చెవులు చిల్లులు పడేలా మొరుగుతాయి. మనం అదిలించినా వాటికి పట్టదు. ఒక్కళ్ళుగా అదిలిస్తే కరిచినా కరిచేస్తాయి.

కాస్సేపలా ‘గ్యాంగ్ వార్’ నడిచాక, వేటి దారిన అవి పోతాయి. సరిగ్గా అలాగే, ఎన్నికల ప్రచార సభల్లోనూ, ఎన్నికయ్యాక అన్ని చట్టసభల్లోనూ, అన్ని పార్టీల వాళ్ళూ, చేస్తున్నది ఈ ‘గ్యాంగ్ వార్’ నాటకమే! అంతా అయిపోయాక, తమ జీత భత్యాలు పెంచుకోవటం వంటి, తమ స్వార్దప్రయోజనాలకు సంబంధించిన బిల్లుల్ని మాత్రం, చల్లగా ‘పాస్’ చేసుకుని చక్కా పోతుంటారు.

ఇంకా ఇది ప్రజాస్వామ్యమనీ,
వీళ్ళు ప్రజాప్రతినిధులనీ,
వీళ్ళు ప్రజల కోసం పనిచేస్తున్నారనీ,
ఫలానా ఫలానా సిద్దాంతం ప్రకారం ఈ రాజకీయాలు నడుస్తున్నాయనీ,
ఫలానా ఫలానా సూత్రాల ప్రకారం ఈ పత్రికలు వ్రాస్తుంటాయి అనే వాళ్ళకు ‘జిందాబాద్’ చెబుతూ....
వాళ్ళకే నా ఈ టపాని అంకితం చేస్తున్నాను.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

4 comments:

చాలా మంచి విశ్లేషన

ఈ రొజు పేపర్ చూసి, మీ టపాలలొ తొందరలొనే హెచ్.ఆర్.భరద్వాజ ప్రస్తావన ఉంటుంది అని అనుకున్నాను. నా ఊహ ను ఈ రొజే నిజం చేశారు.

ఈ రా. నా. లు ముష్టివాళ్ళతో సమానమనుకుంటే, ఓ బిషప్ హేటో రావాలంటారా?

పుట్టేడో, పుడతాడో, వస్తాడో, రాడో!

(ఆ కల్కి అయినా!)

తార గారు: నెనర్లండి!

సత్యేంద్ర గారు: నిజం సుమా! మీ వ్యాఖ్య చూసి నాకు సంతోషం వేసిందండి! నెనర్లు!

కృష్ణశ్రీ గారు: ఏక వ్యక్తిగా అయితే సందేహమే గానీ, సామూహికంగా అయితే సాధ్యమేనండి! పీవీజీ దానిని ప్రారంభించే నిష్ర్కమించారు.

లేనట్లయితే రాంజఠ్మలాని లాంటి వాళ్ళతో ఇప్పుడున్న స్థితిలో భాజపాకి పైకారణంగా అయితే ఏ ఉపయోగమూ లేదు. మరైనా ఎందుకు నెత్తిన పెట్టుకున్నట్లు? బహిర్గతంలో భాగం, సువర్ణముఖిలో భాగం, అంతే! ప్రజలలో రజం రగిలే వరకూ ఇది ఇంతే!

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu