నిన్నటి వరకూ పరిశుభ్రమైన ఆవాసాల్లో నివసిస్తూ, పోష్ గా ఉండే కార్యాలయ భవనాల్లో పనిపాటలు నిర్వహించుకున్న జపనీయులు, ఈ రోజు..... బురదలో, మురుగులో, గుక్కెడు నీళ్ళు, గుప్పెడు తిండీ లేక అల్లడుతూ, అణు ధార్మికతను తలుచుకుని భీతిల్లుతూ బ్రతుకు తున్నారు.
కూలిన శిధిలాల్లా, కుప్పతొట్టెల్లా ఉన్న పరిసరాల్లో..... కన్నబిడ్డల శవాలని వెదుక్కుంటున్న తల్లిదండ్రుల్నీ, కన్న వాళ్ళ జాడ కోసం రోదిస్తున్న పిల్లల్నీ చూస్తుంటే, హృదయం తరుక్కుపోతుంది.
శుభ్రమైన పరిసరాల్లో, క్రమబద్దమైన దినచర్యతో బ్రతకడం మాత్రమే తెలిసి ఉన్న వాళ్ళకి, ఒక్కసారిగా ఋరదలో, మురుగులో, మురికిలో బ్రతకటం.... ఎంత ప్రాణాంతకంగా ఉంటుందో, దుర్భరంగా ఉంటుందో మాకు అనుభవపూర్వకంగా తెలుసు. 2009 వరదల సందర్భంలో, కర్నూలు జిల్లా వాసులకీ తెలుసు, అది చూసిన వాళ్ళకీ తెలుసు.
భూకంపం, సునామీ జపాన్ ని అతలాకుతలం చేసి, ఎనిమిదడుగులు ఆవలికి నెడితే, వరుస బెట్టి పేలుతున్న అణు విద్యుత్ కేంద్రాలు, అత్యంత భీతి గొల్పుతున్నాయి. నాటి ప్రపంచ యుద్ద సమయంలో హిరోషిమా నాగసాకిల మీద పేలిన అణుబాంబు స్థాయిలో గాకపోయినా నష్టం మాత్రం తక్కువేం కాదు.
[1986లో సంభవించిన చెర్నోబెల్ ప్రమాదం – అణువిద్యుత్ కేంద్రాన్ని భూస్థాపితం చేసినా, అణు ధార్మికత వెలువడకుండా కట్టుదిట్టం చెయ్యటం ‘శాశ్వత ప్రాతిపదిక’ అని నిరూపించింది. 1979లో త్రీమైల్ ఐలెండ్ దుర్ఘటన తర్వాత, అమెరికాలో అణువిద్యుత్ కేంద్రాల ఊసే లేదు.
అమెరికా, తమ దేశంలో అణువిద్యుత్ కేంద్రాల స్థాపన చేసుకోవటం లేదు గానీ, భారత్ సహా పలు దేశాలని మాత్రం అందుకు ప్రోత్సాహిస్తుంది. తనది గాక పోతే కాశీదాకా డేకమనటం అంటే ఇదే!]
ఈ నేపధ్యంలో భారత ప్రధాని మన్మోహన్ సింగ్, “మన దేశంలో ఉన్న అణుకేంద్రాల కొచ్చిన ప్రమాదం ఏదీ లేదు, అవి భూకంపాలకు దుర్భేద్యంగా నిర్మించబడ్డాయి” అని సెలవిచ్చాడు. “2004లో వచ్చిన సునామీ, 2001లో వచ్చిన బుజ్ భూకంపం, దాన్నే నిరూపించాయి’ అని ముక్తాయించాడు కూడా!
ఏతావాతా..... అణువిద్యుత్ కేంద్రాలకు అనుమతులిచ్చే రాజకీయ వ్యాపారంలో, వెనుకడుగు వేసేది లేనే లేదని తేల్చి పారేసాడు భారత ప్రధాని! ఎంత కట్టుదిట్టమైన రక్షణ ఏర్పాట్లతో నిర్మించినా, అణు విద్యుత్ కేంద్రాల స్థాపన ప్రమాదకరమే అని నేటి జపాన్ నిరూపించింది.
అలాంటి చోట భారత్ లో!? అందునా కార్యనిర్వహణలో ప్రైవేటు సెక్టార్ లో గానీ, పబ్లిక్ సెక్టార్ లో గానీ, ఎంత అలసత్వం ఉంటుందో, మనకి, భోపాల్ యూనియన్ కార్బయిడ్ సాక్షిగా తెలుసు. అవేవీ మన్మోహన్ సింగ్ కళ్ళకి కనబడవు.
ఒక వేళ ఖర్మకాలి ఏదైనా అయితే, ఆనక, సీవీసీ థామస్ విషయంలో చెప్పినట్లు ఓ ‘సారీ’ చెప్పేసీ, “ముందుగా దీని గురించి నాకు సమాచారం లేదు. ఫలానా శాఖ వివరాలు పంపలేదు. బాధ్యత మాదే!” అనేస్తే సరిపోతుందని సదరు మేధావి తెలివి కావచ్చు!
బహుశః జపాన్ ప్రధానులు కూడా (వారూ వీరని లేకుండా) ఇలాగే ప్రకటించి ఉంటారు, ముక్తాయించీ ఉంటారు.
ఇకపోతే..... జపాన్ విద్యుత్ అవసరాల్లో 34% అణువిద్యుత్తే తీరుస్తుందట!
విద్యుచ్ఛక్తి, మనిషికి అవసరం.
జీవితంలో..... సౌకర్యానికి, పనిలో సౌలభ్యానికి..... తప్పనిసరిగా అవసరం.
అది అభివృద్ధికి చిహ్నం. మరింత అభివృద్ధికి మార్గం.
అయితే..... అవధుల్లేని అభివృద్ధి, అవసరమా?
అమ్మపాలు పాపాయి పెరుగుదలకి అవసరం. అయితే అమ్మపాలు చాలవు, రొమ్ముకోసి కూరొండుకు తిందాం’ అనేంత అభివృద్ధి అవసరమా? [భూమితల్లి విషయంలో మనిషి ప్రవర్తన ఇలాగే ఉంది.]
అంతస్థుపై అంతస్థు... ఒక దానిపై ఒకటి గుండ్రంగా తిరిగేటట్లు అపార్ట్ మెంట్ల.....తో ఋర్జ్ ఖలీఫాలంత అభివృద్ధి.....!
గంటకి నాలుగొందల ఇరవయ్యో అరవయ్యో కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే బుల్లెట్ ట్రెయిన్ లంత అభివృద్ధి....!
మార్కెట్లలోకి పదిహేను రోజులకో, నెలకో..... [వస్తువుల] కొత్త మోడళ్ళు విడుదల చేసేంత అభివృద్ధి......!
అవసరమా?
ఇవన్నీ నడిచేది విద్యుత్ తోనే! అందుకోసం తొలచాల్సింది భూగర్భాన్నే!
కడుపు డొల్ల అయ్యాక.....
పుడమి తల్లి హృదయాక్రోశం వెల్లడయ్యేది..... భూకంపం లాగానే!
భూమాత గుండెమంట వెల్లడయ్యేది.... అగ్ని పర్వతపు విస్పోటనం లాగానే!
అవని తల్లి అశృధార వెల్లడయ్యేది...... జలప్రళయపు విలయం లాగానే!
పిజ్జాలు, ఛీజ్ బర్గర్, నేతి పాయసాలు, చికెన్ మసాలా లతో, ఆహారమూ అవసరాన్ని దాటి, విలాసమైపోయాక, పనుల్లోయంత్ర సౌలభ్యం అదనపు కొవ్వుని ఒంట్లో కొలువుంచాక, ఒబెసిటీని తగ్గించుకునేందుకు ఏసీ జిమ్ లు కావాల్సివచ్చేంతగా విద్యుత్ మనిషికి అవసరమై పోయింది.
అందుకోసం భూమాతని వేడెక్కిస్తున్నాం.
అవని గర్భాన్ని తొలిచేస్తున్నాం.
అణువుల్ని బద్దలు కొడుతున్నాం.
ఇంతగా కూర్చున్న కొమ్మ నరుక్కునేంత, అమ్మ రొమ్ము కొరుక్కుతినేంత.... అభివృద్ధి, అవసరమా?
‘ఓ ప్రక్క జపాన్ ప్రకృతి ఉత్పాతానికి గురై, ప్రజలు దైన్య స్థితిలో ఉంటే, మరో ప్రక్క మాటలతో తూట్లు పొడుస్తున్నాను’ అనుకుంటారేమో!
మనదేశంలో అణువిద్యుత్ కేంద్రాలు వద్దనీ, అణు ఒప్పందాలు అవసరం లేదనీ మనమెంత అరిచి గీపెట్టినా..... 2008లో యూపీఏ ప్రభుత్వం, ఏదీ చెవి పెట్టకుండా, ఉరుక్కుంటూ వెళ్ళి, అణుఒప్పందాలు కుదుర్చుకుంది చూడండి....
మన పరిస్థితి ఎలాంటిదో, 1970ల్లోనే అణువిద్యుత్ కేంద్రాలు ఏర్పాటు చెయ్యబడినప్పుడు జపనీయుల పరిస్థితీ అంతే!
మనకి చెప్పినట్లే ‘ఇన్ని లక్షల ఉద్యోగాలొస్తాయి..... ఇంతింత అభివృద్ధి జరిగి అర చేతిలోకి వైకుంఠం వచ్చిపడుతుంది’ అని చెప్పి ఉంటారు శ్రీమాన్ ప్రధానమంత్రులూ, కుర్చీ వ్యక్తులూ, యువరాజులు!
ఆ హోరులో..... సామాన్యుల ఘోష.... కార్పోరేట్ల వ్యాపార ఝుంఝూమారుతంలో గడ్డి పోచలు కొట్టుకుపోయినట్లుగా కొట్టుకుపోతాయి.
ఎందుకంటే – అణు విద్యుత్ కేంద్రాల, బుల్లెట్ ట్రెయిన్ల ఉత్పత్తి సంస్థలూ, నిర్వహణా సంస్థలూ..... అన్నీ వ్యాపార మయమే అయి ఉండే చోట.... కార్పోరేట్ వ్యాపార దిగ్గజాలే ప్రపంచ వ్యాప్తంగా ప్రభుత్వాలన్నిటినీ శాసిస్తున్నాయి గనక! ఇది సుదీర్ఘ కాలంగా, నిరాఘాటంగా నడుస్తోన్న దోపిడి గనక!
సదరు వ్యాపార దిగ్గజాల (దిగ్గజాలు కాదు, సాక్షాత్తూ దుష్ట రాక్షసులే వీళ్ళల్లో అత్యధికులు) జేబులు నింపడం కోసం, ప్రభుత్వాధినేతలే లాబీయిస్టులై పనిచేసి పెడతారు. మీడియా అధినేతలు ప్రచారం చేసి పెడతారు. అంతా కలిసి దోపిడికి, దగాకి ఆకర్షణీయమైన పాజిటివ్ కాప్షన్ లు పెడతారు.
ఉదాహరణకి జపాన్ సంగతే తీసుకొండి.
‘గంటకి ఇన్ని వందల కిలోమీటర్ల వేగంతో వెళ్ళే బుల్లెట్ ట్రయిన్లతో జపాన్ అభివృద్ధి కళ్ళు మిరమిట్లు గొల్పుతుందని’ మీడియా ప్రశంసిస్తుంది, ప్రచారించింది.
జపనీయులు వర్క్ హాలిక్ లూ, సాంకేతిక నేర్పురులనీ హోరెత్తించింది. ప్రపంచ ఆధునిక వినిమయ వస్తూత్పత్తిలో జపాన్ దే అగ్రస్థానమంటూ ర్యాంకింగులిచ్చింది.
అయితే ఆ వస్తూత్పత్తి కంపెనీలన్నీ ప్రైవేటు వనే నిజం ప్రచారించదు. సదరు వ్యాపార సంస్థల్లో పనిచేస్తూ, నిరంతర పని విధానంలో ముంచి వేయబడి.... మొదట్లో ఇప్పుడు మనం ప్రతిఘటిస్తున్నట్లు ఎదురు తిరిగినా..... కాలగతిలో ఒకటి రెండు తరాలు మారేటప్పటికి అలవాటు పడి.... ఇప్పుడు షిప్టుల కొద్దీ పని చేయటం తప్ప మరేమీ చెయ్యలేని అసహాయ స్థితికి నెట్టబడిన జపనీయుల జీవిత పరిణామాలని..... ‘జపనీయులు వర్క్ హాలిక్’ లనే పాజిటివ్ కాప్షన్ మాటున మాయం చేస్తుంది.
నిజమే, జపనీయులు వర్క్ హాలిక్ లు!
ఎంత వర్క్ హాలిక్ లంటే.... షిష్ట్ ల కొద్దీ పనిచేసి.... డ్యూటి దిగి ఇంటికెళ్ళేందుకు గంటల కొద్దీ రైళ్ళల్లో ప్రయాణం చేసి..... అంత పొడవాటి ప్రయాణం గనుక అందులోనే కునుకేసి.... ఇల్లు చేరి పెళ్ళాం బిడ్డల ముఖాలు చూసి మరో రెండు గంటలు గడిపితే, మళ్ళీ డ్యూటీకి వెళ్ళేందుకు ప్రయాణం కావాల్సినంతగా వర్క్ హాలిక్ లు!
నిలబడి నిద్రపోవటానికి కూడా అలవాటు పడిపోయారు వాళ్ళు. అదే వాళ్ళ ప్రత్యేకతగా చెబుతుంది జపాన్ కి విదేశీ మీడియా. అందులో భారత్ మీడియా కూడా ఉందండోయ్! ఇలాంటి పరిస్థితి మన భారత్ లో పూనే టూ ముంబై రెళ్ళల్లో కూడా చూడవచ్చు.
‘ఎందుకంతగా గంటల కొద్దీ పొడవాటి ప్రయాణాలు చేయడం?’ అనుకుంటారేమో! అదేమీ వాళ్ళకి సరదా కాదు. పని చేసే చోటుకు దగ్గరలోనే నివాసం ఉండాలంటే, ధరలు (ఇళ్ళ ధర లేదా అద్దె దగ్గరి నుండి జీవన వ్యయం దాకా) అందుబాటులో లేక, దూరంగా నివాసాలని ఎంచుకోవడం వాళ్ళకి అనివార్యం అయ్యింది.
ఈ ప్రయాణ కాలాన్ని తగ్గించడానికే అక్కడ వేగపు రైళ్ళని ప్రవేశ పెడుతుంటాయి మరికొన్ని వ్యాపార సంస్థలు. అన్నిటిలో నుండీ వ్యాపారావకాశాలని అన్వేషిస్తే..... పనిచేసే చోటుకు దగ్గరలోనే పనిచేసే వారి నివాస ప్రాంతాలుండే విధంగా అవకాశాలు అన్వేషింపబడవు, ఖరీదు ఎక్కువైనా, వేగంగా వెళ్ళగలిగే అవకాశాలు అన్వేషింపబడతాయి. అప్పుడు ఎక్స్ ప్రెస్ వేలు, ఆకాశ రైళ్ళూ సృష్టింపబడతాయి.
ఇక ఆ రెండు మూడు గంటల కాలానికి ఇంటికెళ్ళి బావుకునేది ఏముంది అనుకుని..... క్రమంగా వంధ్యత్వం పెరిగిపోయి, లేదా వివాహం మీద, సంతానాన్ని పొందడం మీదా ఇచ్ఛ కోల్పోయి, గడిపేస్తున్న జపాన్ వాసుల సంఖ్య తక్కువేమీ కాదు.
అంతగా జీవితేచ్ఛ కోల్పోయి, రక్తమాంసాలున్న రోబోలుగా మిగిలి పోతున్నారు. ఇక్కడ ఇప్పటి విద్యావిధానం లాగానే, నాలుగైదు దశాబ్దాల క్రిందటే అక్కడి విద్యా విధానం ‘ఉద్యోగులన బడే పనిచేసే రోబోలని’ సృష్టించే పని తలకెత్తుకుంది. సమర్ధంగా నిర్వహించి ‘వర్క్ హాలిక్’లని తయారు చేసింది.
ఇదీ అక్కడ ‘పని సాంప్రదాయం’గా మీడియా ప్రచారించే విషయం వెనుకనున్న చేదు నిజం! అంతగా పాజిటివ్ కాప్షన్ లు పెట్టటం మీడియాకే చెల్లు. ఆకర్షణీయమైన ఆ పాజిటివ్ కాప్షన్ ల వెనుక ఉంది శ్రమ దోపిడే! అదే జపాన్ లో నడిచింది, ఇప్పుడు చైనాలో నడుస్తోంది, ఇప్పుడిప్పుడే భారత్ లోకీ.... చొచ్చుకు వస్తోంది, వచ్చింది.
ఇదంతా మీకు నమ్మశక్యం గాకుండా ఉందా?
జపాన్ అభివృద్దికి ఒక సూచికగా దిగువ ఫోటోను చూడండి.
సూటూ బూటూ వేసుకుని, జనాలని రైళ్ళల్లోకి తోస్తున్నారు గనుక, ఇంగ్లీషులో స్టైల్ గా ‘పుషర్స్’ అంటారేమో గానీ, అచ్చ తెలుగులో అయితే ‘తోపుడు గాళ్ళు’ లేదా ‘నెట్టుడు దారులు’ అనాలి!
పై విషయంలోనే పాజిటివ్ వెతుక్కుంటే తక్కువ మెయింటినెన్స్ తో రైల్వేలు లాభాలు గడించాయని చెప్పవచ్చు. అలాగే పుషర్స్ గా ఉద్యోగవకాశాలు కల్పించబడ్డాయని చెప్పవచ్చు. ఈ అవధుల్లేని అభివృద్ధిలో సగటు జపనీయునికి సౌఖ్యం సున్నానే అని నిరూపితమవుతుంది.
మరెవ్వరి భర్తలో తమ భార్యలకి విలాసవంతమైన విమానాలు, నౌకలూ లేదా దీవులూ కానుకగా ఇచ్చేటందుకు, ఉరుకులూ పరుగుల మీద రైళ్ళల్లో ప్రయాణించాలంటే..... కొన్ని సెకన్లు మాత్రమే ఆగే స్టేషన్ లలో తీరుంబావుగా ఎక్కాలంటే ఎలా కుదురుతుంది?
అందుకే ప్రయాణికుల్నీ కట్టకట్టి, లోపలికి నెట్టి, కూలేసి లేదా కుక్కేసి.... ప్యాక్ చేసి పంపిస్తే సరి!
ఇప్పుడు చెప్పండి!
రక్తమాంసాలున్న రోబోలు కాదా మరి!
ఇప్పటికైనా మేలుకోకపోతే..... అదే శ్రమ దోపిడి శ్రమ సంస్కృతి (వర్క్ హాలిక్) పేరుతో ప్రపంచ వ్యాప్తమై, బ్రతుకు లుప్తమై పోతుంది.
అందుకే... అవధుల్లేని అభివృద్ధి మనకి అవసరం లేదు.
ఎందుకంటే అభివృద్ధి కొందరికే!
శ్రమ దోపిడి మాత్రం సగటు ప్రజలందరిది!
మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!