ముందుగా ఓ పోలిక!
ఎక్కువగా రాంగోపాల్ వర్మ వంటి దర్శకుల సినిమాలలో ఇలాంటి సన్నివేశాలు చూస్తుంటాం!
ఉదాహరణకి కొందరు వ్యక్తులు ఓ గచ్చకాయ రంగు అంబాసిడర్ , మరో తెల్ల అంబాసిడర్ మీద ప్రయాణిస్తూ, ఒకరి నొకరు తరుముకుంటున్నారనుకొండి. విశాలమైన రహదారి పైన, ఇతర వాహనాల రాకపోకలున్నా, ఈ రెండు కార్ల ఛేజింగు దశ, దిశ స్పష్టంగానే కనబడతాయి. గచ్చకాయ రంగు అంబాసిడర్, తెల్ల అంబాసిడర్ ని తరుముతోందనుకుందాం.
ఇంతలో ఏ కారణం చేతనైనా, ఈ రెండు కార్లు, ప్రధాన రహదారి నుండి ప్రక్కకి మళ్ళి, సందుగొందుల్లోకి ప్రవేశించాయనుకొండి. అప్పుడు వాటి ప్రయాణపు దశ, దిశ స్పష్టంగా గోచరించవు. ఒకోసారి అసలు వేటి దారిన అవి ప్రయాణిస్తున్నట్లుగా కూడా అన్పిస్తుంది. ఎవరిని ఎవరు తరుము తున్నారో అర్దం కాదు.
మళ్ళీ ఆ రెండు కార్లు ప్రధాన రహదారి [Main Road] మీదికెక్కితే... అప్పుడు వాటి దశ, దిశ మళ్ళీ స్పష్టంగా గోచరిస్తాయి. అప్పుడు చూస్తే, ముందు ప్రయాణిస్తున్న దారిలోనే, అవి మరికొంత ముందు కెళ్ళి... వేగంగానో, మెల్లిగానో [చాలా సందర్భాల్లో వేగంగానే] ప్రయాణించటం తెలుస్తుంది. అంతే కాదు, మరింత స్పష్టంగా ఎవరు ఎవరిని తరుముతున్నారో తెలుస్తుంది.
ఇక ఈ పోలిక అనువర్తన ఏమిటంటే -
వై.యస్. హెలికాప్టర్ ప్రమాదం జరిగిన వారం తర్వాత ప్రారంభమైన జగన్ శిబిరం, కాంగ్రెస్ అధిష్టానాల మధ్య నడుస్తున్న అంతర్లీన పోరు ఇలాంటిదే!
మధ్యలో... జగన్, అధిష్టానానికి విధేయత ప్రకటిస్తూ "అమ్మ చెప్పింది అమ్మకిమ్మని" అంటూ, పులివెందుల అసెంబ్లీకి వై.యస్. విజయలక్ష్మి చేత నామినేషన్ వేయించినా...
అలాగే, జగన్ అధిష్టానానికి విధేయత ప్రకటిస్తూ, వై.యస్. మరణానంతర సీఎల్పీ సమావేశపు మొక్కుబడిలో, రోశయ్యని నాయకుడిగా ప్రతిపాదించినా...
సమాంతరంగా, జగన్ అధిష్టానానికి అవిధేయత ప్రకటిస్తూ, సాక్షి పత్రికలో రోశయ్య ప్రభుత్వాన్ని విమర్శించినా ...
అవన్నీ సందుగొందుల్లో ప్రయాణాలే!
అదే విధంగా జగన్ విషయమై...
కాంగ్రెస్ అధిష్టానం తరుపున కేంద్రంలో వీరప్ప మొయిలీ, అహ్మద్ పటేల్ వంటి అధిష్టానపు అనుచరులు నాటకీయ సన్నివేశాలు నడిపినా...
అభిషేక్ సింఘ్వీ, మనీష్ తివారీ, జయంతీ నటరాజన్ వంటి అధికార ప్రతినిధులు రకరకాల పత్రికా ప్రకటనలు గుప్పించినా....
రాష్ట్రంలో రోశయ్య, కేకే, డీఎస్, పాల్వాయి, వీహెచ్ ల వంటి వృద్దనేతలు వంతుల వారీగా ‘హల్ చల్’ నిర్వహిస్తూ రోజు కో ప్రకటన, వారానికో మాట పడంచినా....
పబ్లిక్ గా కనిపించకుండా జగన్ కు పార్టీలో పట్టును ఊడగొడుతూ, దెబ్బలు కొట్టినా...
అలాగే అధిష్టానం గాలి గనుల మీదకి ప్రభుత్వాధికారులని పంపినా...
అవన్నీ కూడా సందుగొందుల్లో ప్రయాణాలే!
తొమ్మిది నెలల తర్వాతయినా, ఎన్ని సందుగొందులలో తిరిగినా, ప్రధాన రహదారి మీద.... జగన్ శిబిరం, కాంగ్రెస్ అధిష్టానం ల ఛేజింగ్... అదే దిశలోనూ, మరింత తీవ్ర దశలోనూ ఉంది.
గత టపాలోని ఈ క్రింది పేరా పరిశీలించండి.
[అధిష్టానం ముందున్న దారులు రెండు! ఒకటి, జగన్ శిబిరపు ఒత్తిడికి తలొగ్గడం. రెండోది జగన్ శిబిరాన్ని Over power చేయడం. మొదటిది చేస్తే, ఇక జగన్ శిబిరం అంతకంతకూ తమ పట్టుపెంచుకుంటూ పోతుంది. కోరికల జాబితానూ పెంచుకుంటూ పోతుంది. ఆ విధంగా నైనా తము, తమ స్ట్రాటజీ Expose అవుతాయి. అంచేత రెండో మార్గం తప్ప గత్యంతరం లేదు. ఇప్పుడు, దాదాపుగా అదే మార్గంలో ప్రయాణిస్తుంది.
అలాగే జగన్ శిబిరం ముందున్న దారులు కూడా రెండే! ఒకటి, అధిష్టానపు ఒత్తిడికి తలొగ్గడం. రెండోది వాళ్ళ గుట్టు బయటపెట్టటం. మొదటిది చేస్తే, ఇక తమకు భవిష్యత్తు ఉండదు. క్రమంగా కాంగ్రెస్ అధిష్టానం తమని మట్టి కలిపేస్తుంది. అంచేత రెండో మార్గం తప్ప గత్యంతరం లేదు.
ప్రస్తుతం కాంగ్రెస్ అధిష్టానానికీ, జగన్ శిబిరానికీ మధ్య నడుస్తున్న అంతర్లీన పోరుఇదే!]
ఇప్పటికీ... అధిష్టానం, జగన్ శిబిరం, ఇద్దరిదీ రెండో మార్గాన్ని ఎంచుకున్న స్థితి!
ఈ నేపధ్యంలో, ఈ బ్లాగులో గత ఏడాది, వై.యస్.ఆర్. మృతి తర్వాత [10, అక్టోబరు, 06 నవంబరు లలో] వ్రాసిన నాలుగు టపాలలో, వీరి అంతర్లీన పోరు పూర్వ పరిస్థితులని విశదీకరించాను. మరోసారి పరిశీలించాలంటే....
1].జగన్ శిబిరానికీ, కాంగ్రెస్ అధిష్టానానికీ మధ్య సాగుతున్న అంతర్లీన పోరు – 01 [ద్విముఖ వ్యూహం][Oct. 10, 2009]
2].జగన్ శిబిరానికీ, కాంగ్రెస్ అధిష్టానానికీ మధ్య సాగుతున్న అంతర్లీన పోరు – 02 [పిల్లిదూరే కంతలో ఎలుక దూరదా సత్తెయ్యా!] [Nov.03, 2009]
3].జగన్ శిబిరానికీ, కాంగ్రెస్ అధిష్టానానికీ మధ్య సాగుతున్న అంతర్లీన పోరు – 03 [ఎవరు ఎవరికి దాసోహం అన్నారు?] [Nov.05, 2009]
4].జగన్ శిబిరానికీ, కాంగ్రెస్ అధిష్టానానికీ మధ్య సాగుతున్న అంతర్లీన పోరు – 04 [ఏకాంత భేటీ వరకూ…] [Nov.06, 2009]
ఇక ఇప్పుడు `ఈనాడు Vs సాక్షి పత్రికల నడుమ మీడియా పోరు'గా రూపాంతరం చెందిన, కాంగ్రెస్ అధిష్టానం Vs జగన్ శిబిరాల నడుమ సాగుతున్న అంతర్లీన పోరును విశ్లేషించాలంటే....
ముందుగా పైకారణం[over leaf reason] లోని కొన్ని వైరుధ్యాలను, విచిత్రాలనూ పరిశీలించాల్సి ఉంది. అవి నిజంగా ఆసక్తికరమైనవి, ఆశ్చర్యకరమైనవి కూడా!
ఆయా వైరుధ్యాలనీ, విచిత్రాలనీ పరిశీలించే ముందు, ఒక చిన్న వివరణ!
నేను ఈ టపాలలో, ఈనాడు రామోజీరావునీ, సోనియానీ విమర్శిస్తున్నానంటే అర్దం - సాక్షినీ, జగన్ నీ సమర్దిస్తున్నానని కాదు.
అధిష్టానపు అకృత్యాలని, అబద్దాలనీ ఎత్తి చూపుతున్నానంటే అర్ధం - జగన్ సచ్ఛీలుడనీ కాదు.
ఈ వ్యవహారంలో... సోనియా, రామోజీరావుల సంయుక్త హస్తాన్నీ, కుట్ర స్వరూపాన్నీ ఎత్తి చూపడమే నా ఉద్దేశం!
మరోమాట ఏమిటంటే - పోల్చి చూస్తే... ఈ దేశానికీ, దేశ ప్రజలకీ... మరణించిన వై.యస్.ఆర్, అతడి కుమారుడు జగన్, చంద్రబాబు నాయుడు ల వంటి రాష్ట్ర రాజకీయుల కంటే... సోనియా, రామోజీరావుల బృందమే పెద్ద శతృవులు!
ఎంతగా ప్రజాధనం దోచుకుతిన్నారన్నా... చంద్రబాబులూ, వై.యస్. జగన్ లూ దేశాన్ని అమెరికాకి తాకట్టు పెట్టలేరు. పాక్ కి పాదాక్రాంతం కాలేరు.
అవకాశం వస్తే అందరూ రామోజీరావులే కావచ్చు గాక! ఆ అవకాశం... చంద్రబాబు నాయుడికీ, జగన్ లకీ రాక పోవటమే వాళ్ల అదృష్టం! అదృష్ట దురదృష్టాలు పూర్వ జన్మ సుకృత దుషృతాలని పెద్దలంటారు. ఏదేమైనా... అంతటి అవకాశం చంద్రబాబులకీ, జగన్ లకీ రాకపోవటమే ఇక్కడ ముఖ్యమైన అంశం!
ఒక వేళ చంద్రబాబు నాయుళ్ళూ, జగన్ లూ గనక... సోనియా, రామోజీరావుల స్థానంలో ఉండి ఉంటే,
సోనియా, రామోజీరావుల స్థాయిలో ఈ దేశానికి, సామాన్య ప్రజానీకానికీ, ధర్మానికీ హాని చేయగలుగుతుంటే,
అప్పుడు వాళ్ళే ప్రధమ శతృవులై ఉండేవాళ్ళు.
ఆయా వ్యక్తుల కుట్ర భాగస్వామ్యం వారిని ‘శతృవు’ అనే మెట్ల మీద, వారి వారి స్థానాల్లో నిలిపింది. అదే విధంగా వారి వారి సువర్ణముఖినీ అనుభవింప చేస్తుంది.
ఏతావాతా విషయమేమిటంటే - కాంగ్రెస్ అధిష్టానం సోనియాతో... చంద్రబాబులూ, జగన్ లూ వంటి రాష్ట్ర రాజకీయుల్ని పోల్చి చూస్తే... దేశానికి కీడు చెయ్యడంలో సోనియాదే ఫస్ట్ ర్యాంకు!
కాబట్టి, ఈ దేశానికి ప్రధమ శతృవు సోనియా, ఆమెకు అండదండా అయిన రామోజీరావులే! [రామోజీరావుకీ, సోనియాకీ మధ్య సంబంధ బాంధ్యావ్యాలేమిటో నా గత టపాలలో వివరించాను.]
మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!
కొత్తపల్లి పత్రిక డిసెంబరు సంచికలో నా కథ! – జారు బాబూ!
-
జారు బాబూ!
కొత్తపల్లి పత్రిక అక్టోబరు సంచికలో ఇచ్చిన బొమ్మకు స్పందన.
రచన, చిత్రం: Y. గీతా ప్రియ దర్శిని, ఇంటర్మీడియట్,నంద్యాల.
రామ్ నగర్ లో ఒక పిల్లల ...
15 years ago