ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు పరిపాలన పేరుతో చేస్తోంది ప్రజాదోపిడినే అయినా, ఓర్చుకుంటూ వేచి చూస్తున్న సామాన్యుల మీద పీవీజీకీ, నెం.5 వర్గానికీ ఎంతో నమ్మకం!

సరిగ్గా ఈ అంశం మీదే నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గమూ, అందులోని కీలక వ్యక్తులకీ.... నెం.5 వర్గానికీ మధ్య మేధో యుద్దం నడుస్తోంది.

ఎలాగో వివరిస్తాను.

ధర్మ సంస్థాపన చేయాలంటే - దుష్ట శిక్షణ ఒక్కటే సరిపోదు. శిష్టరక్షణ కూడా చేయాలి. సాక్షాత్తూ గీత కూడా మనకి ఇదే చెబుతుంది.

పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం
ధర్మ సంస్థాపనార్ధాయ సంభవామి యుగే యుగే

కాకపోతే ఇది కలికాలం గనుక, ధర్మ సంస్థాపన కోసం భగవంతుడు ఏకరూపంగా అవతరించలేదు. సత్యదేవతలూ తమ సౌందర్య సామర్ధ్యాలకి తలా తిలాంశం ఇచ్చి తిలోత్తమని సృష్టించినట్లుగా.... పీవీజీ వంటి అసామాన్య మేధావి చేత ప్రారంభించబడి, సమీకరించబడి రూపుదిద్దుకున్న నెం.5 వర్గం రూపేణా, ధర్మ సంస్థాపనకి భగవంతుడు పూనుకున్నాడు.

ఇక ‘ధర్మ సంస్థాపన’ అనే ఆశయాన్ని స్వచ్ఛందంగా భుజానికెత్తుకున్న నెం.5 వర్గం, దుష్టుల్ని శిక్షించటం, శిష్టుల్ని రక్షించటం అనే ప్రక్రియని ఎలా నిర్వహిస్తుందో పరిశీలిస్తే....

దుష్టశిక్షణ విషయంలో నెం.5 వర్గం అప్రతిహతంగా, నిరాఘాటంగా పని చేసుకుపోతోంది. ఎందుకంటే - నకిలీ కణిక వ్యవస్థ తాలూకూ గూఢచర్య నెట్ వర్క్ ని చేజిక్కించుకున్నది గనక, అందులో నుండే గూఢచర్య పట్టు సాధించింది గనుక. సమాచార మార్పిడితో టాంపరింగ్ దగ్గరి నుండి ఆత్మహత్యా సదృశ్య అసైన్ మెంట్లని ఇవ్వగల పట్టు అది! జాతర బొమ్మలు/జంట పీతల్ని పరస్పరం ప్రయోగించి, వివాదాలతో బహిర్గతాలు, తత్ఫలితాలుగా సువర్ణముఖిలు విధిస్తున్న పట్టు అది!

నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గంలోని ఏజంట్లందరినీ [కీలక వ్యక్తులతో సహా] ఆయా వ్యక్తుల స్వయంకృత దౌష్ట్యానికి తగినంతగా శిక్షిస్తోంది. నకిలీ కణిక వ్యవస్థ పూర్తిగా నిర్వీర్వమై, లేశమాత్రం మిగల కుండా తుత్తునియలు అయ్యేంత వరకూ ఇది కొనసాగుతుంది. ఇది ఎవ్వరూ ఆపలేనిది! ఎవ్వరి సహాయ సహకారాలూ లేకుండానే నెం.5 వర్గం నిర్వహించగలిగినది!

ఇక్కడ ఓ ఉదాహరణ ఇస్తాను.

ఒక చిన్న పూరిపాకని బుల్ డోజర్ తో ఢీ కొన్నామనుకొండి. క్షణంలో కుప్పకూలి తుంది. అదే ఓ పెద్ద భవంతినైతే! అలాంటి కొన్ని క్షణాలు, నిముషాలు, గంటలు అవసరమౌతాయి. అలాగే చిన్న తాటాకుల పందిరిని కూలిస్తే, ఆ కూల్చివేత క్షణాల్లో మన కంటి ముందే పూర్తియినట్లుంటుంది. అదే ఓ కిలో మీటరు పొడవున్న తాటాకుల పందిరను కోండి. ఓ వైపు నుండి కూలుతూ వస్తున్నా, పూర్తిగా కూలటానికి తగినంత సమయం పడుతుంది.

నకిలీ కణిక వ్యవస్థ తాలూకూ గూఢచర్య నెట్ వర్క్ అలాంటిదే! నిర్మించటానికి నకిలీ కణిక వ్యవస్థ అనువంశీయులకి 350 సంవత్సరాలు పట్టినప్పుడు, కూల్చటానికి కొన్ని సంవత్సరాలైనా పట్టదా?ఎంతగా, నిర్మాణం కంటే విధ్వంసం సులభతరమైనదైనా! అదీగాక సదరు గూఢచర్య వలయాన్ని, నకిలీ కణిక అనువంశీయులు, ప్రజలకి అవగాహన రానివ్వకుండా నిర్మించారు. అదే వలయాన్ని ప్రజలకి అవగతమయ్యే విధంగా కుప్పకూల్చడానికి, కనీసపాటి సమయం ఖచ్చితంగా పడుతుంది కదా! ఇప్పడదే జరుగుతోంది.

కాకపోతే తమ పట్టు, ఆధీక్యత కుప్పకూలిపోతున్నదన్న విషయం, ప్రజల అవగాహనకి అందకుండా ఉంచేందుకు మీడియా, రాజకీయ , బ్యూరాక్రాట్లు, కార్పోరేట్ రంగాలతో గల తమ ఏజంట్లతో.... నకిలీ కణిక వ్యవస్థ, నానా రకాలుగా సర్కస్ ఫీట్లు చేస్తోంది. గమనించి చూడండి.

ఒక చిన్న ఉదాహరణ చెబుతాను. ఐపీఎల్, ఎంసిఐ, ఖుష్బూపై కేసుల ఎత్తివేత, నోటుకు ఓటు... ఇలా లెక్కలేనన్ని అవకతవకలు, స్కాంలు, వివాదాలు!

"ఆ! ఏముంది? ఎన్ని స్కాంలు, అవకతవకలు వెలుగు చూసినా ఏముంది? మళ్ళీ అన్నీటినీ ఎక్కడికక్కడ మూసుకుంటారు. ఇదంతా ఇలా జరిగి పోతూనే ఉంటుంది" అని చాలామంది నిట్టూరుస్తుంటారు. కానీ, అలా మూసుకోవడానికి ఆయా వ్యక్తులకి, ఏజంట్లకి డబ్బులు కారతాయి. ధనమే వాళ్ళ బలం అయినప్పుడు, డబ్బు ఖర్చయి పోవడం వాళ్ళకి చిన్న శిక్ష కాదు. అదే పూర్తి శిక్షా కాదు. శిక్షల ప్రారంభం, అంతే! కోర్టుల గురించి ’కోర్టులో గెలిచినవాడు ఇంటికెళ్ళి ఏడుస్తాడు, ఓడిన వాడు కోర్టులోనే ఏడుస్తాడు’ అనే వాళ్ళు. అలాంటిదే ఈ అవకతవకల వివాదాల నుండి బయటపడేవాళ్ళ స్థితి!

ఉదాహరణకి ఐపీఎల్ నే తీసుకుందాం. లలిత్ మోడి ’నేను తప్పుకోను’ అన్నాడు. అతణ్ణి మెడలొంచి పదవి నుండి తప్పుకోడానికి ఒప్పించడానికి ’కొంత ఖర్చవుద్ది మరి!’ ఎందుకంటే - ఇంతక్రితం ఫ్రాంచైజిలు ఎలాట్ కావడానికి, మ్యాచ్ ఫిక్సింగ్ లకి, గట్రాలకి అతడు సహాయ సహకారాలు అందించాడు. లలిత్ మోడిని ‘నీ అవకతవకలు బయట పడ్డాయి తప్పుకో’ అంటే నోట్లో వేలేసుకుని ‘సరే’ అనడు. ’అవకతవకలు చెయ్యనిదెవ్వరు? నన్నొక్కడ్నే గిలెటిన్ వేస్తానంటే ఒప్పుకోను. ఎవరెవరికి వాటాలు ఇచ్చానో, అందరివో కొందరివో బండారాలు బయటపెడతా’ అంటాడు. అలా పెట్టకుండా, గమ్మున తప్పుకునేందుకు మరికొంత ముట్టజెప్పక తప్పదు.

ఒకప్పుడు అంటే తమకి పూర్తి పట్టు ఉన్నప్పుడూ, తమకు ఎదురేలేనప్పుడు, అంతదాకా పరిస్థితులే ముంచుకొచ్చేవి కాదు. ఎవరైనా, ఏమాత్రమైనా తోక ఝాడిస్తే చాలు, వాళ్ళ తాలూకూ ‘చీకటి తప్పుల్ని బయటికి తీస్తాం’ అనే చిన్న హెచ్చరికకే గగ్గోలు పడి ’సరెండర్’ అయిపోయేవాళ్ళు. అప్పటి గ్రిప్ అది. ఇప్పటి పరిస్థితి అది కాదు గదా! శశీ ధరూర్ కూడా మంచి ఉదాహరణే!

ఇవేవీ మీడియా బయటపెట్టదు. పైగా "ఎక్కడి వక్కడ గప్ చిప్ అయిపోయాయి. ఏమైనా చెడుకే ప్రభావం ఎక్కువ. డబ్బున్న వాళ్ళు ఏ అవకతవకలు చేసినా అన్నీ మామూలుగా చప్పబడతాయి" అన్న పిక్చర్ ఇస్తుంది. అవి నమ్మి చాలామంది నిరాశతో నిట్టూరుస్తుంటారు. కానీ ఈ బహిర్గతమైన వ్యవహారాల కారణంగా, ఎలాంటి అవకతవకలు జరగగలవో మనకి తెలియకుండానే మన మనస్సులో నాటుకుపోతుంది. మన వ్యవస్థ ఎంత లోపభూయిష్టమో మన అంతఃచ్ఛేతనకి అర్ధమవుతుంది. ఆ విధంగా మనకి తెలియకుండానే అవగాహన కల్పించబడుతున్నది.

అయితే మీడియాకి, మీడియా ముసుగు వేసుకున్న నకిలీ కణిక వ్యవస్థలోని కీలక వ్యక్తులకి ఇది బెంగనీ, భయాన్నీ ఫుట్టిస్తోంది. ఎందుకంటే - ఇంకా చాలాకాలం దీన్ని నిభాయించుకోగల స్థితి లేదు గనక! పొడవైన పందిరి కూలుతోందన్న విషయం ఎన్నాళ్ళు దాచగలరు? మొదట్లో తెలియక పోయినా, కుప్పకూలటం వేగమందుకున్నాక, అంత్యదశకు చేరాక, అందరికీ కనబడుతుంది కదా! ఆ పందిరి క్రింద ఉన్నవాళ్ళకి మనకంటే ముందుగానే అర్ధమౌతుంది మరి!

ఇక - ‘డబ్బు ఖర్చయినంత మాత్రానా ఏమౌతుంది? నకిలీ కణిక వ్యవస్థలోని కొందరు ఏజంట్ల అవకతవకలు బయటపడి, వారి డబ్బు ఖర్చవుతుండ వచ్చు గాక. అది మరో ఏజంట్లకే కదా చేరుతుంది? ఒక అల్మారా నుండి తీసి మరో అల్మారాలో పెట్టినట్లు! అంత మాత్రానికే వాళ్ళ నెట్ వర్క్ బలహీన పడినట్లు ఎలా అవుతుంది?’ - అనే సందేహం రావచ్చు.

ఖచ్చితంగా బలహీన పడుతుంది. ఏజంట్ల బలం డబ్బు, పరపతి గల స్థానం! అవి రెండూ జారిపోతే సదరు ఏజంట్లు బలహీన పడతారు. ఒకరికి ఒకరై, ఎక్కువమంది ఏజంట్లు బలహీన పడితే నెట్ వర్క్ బలహీన పడుతుంది. ఒకో స్తంభం కూలితే చివరికి పందిరి కూలినట్లు! చివరికి ఏ ఏజంట్ అయినా... తమ సీనియర్ ఏజంట్లు ఎలా డబ్బు, పరపతి కోల్పోయారో అర్ధమైతే, ఎవరు డబ్బులిస్తే వాళ్ళకి అనుకూలంగా పనిచేయడం మొదలు పెడతాడు. లేదా తమ ఏజన్సీ తరుపున పని చేసినా కూడా, ఎక్కువ మొత్తాన్ని డిమాండ్ చేస్తాడు. ఆ విధంగా ఏజంట్ల మీద తమ పట్టు లేకుండా పోతుంది.

మనం డబ్బుని పెద్దనోట్లలో దాచుకున్నామను కోండి. వంద అవసరం వచ్చి వెయ్యినోటు మార్చామనుకొండి. తర్వాత చూసుకుంటే మిగిలిన 9 వందలూ చెల్లాచెదురుగా ఖర్చయినట్లుంటుంది. ఎటూ గాకుండా వృధాగా వెయ్యి అయిపోయింది అన్పిస్తుంది.

ముద్రసుద్రగా ఒక ఏజంటు దగ్గర ఉన్న ధనబలం.... అవకతవకలు బయటపడి, అవి మూసుకునేందుకు పంపకం చేయబడితే, వెయ్యి నోటు చిల్లరగా మారి ఖర్చయిపోయినట్లే? ఓటుకు నోటు బయట పడిన రోజు.... ఎందరి డబ్బు ఎన్ని చేతులు మారిందో! అదంతా మూసుకునేందుకు కిశోర్ చంద్రదేవ్ మొదలు, ఎందరి జేబులు బరువెక్కాయో! వెరసి కోర్టులో గెలిచిన వాడు ఇంటి కెళ్ళి ఏడ్చినట్లు, ఎందరు లోపల్లోపల కుళ్ళికుళ్ళి ఏడ్చారో ఎవరు లెక్క గట్టగలరు? కళ్ళక్రింద కట్టిన నల్ల చారికలకు నిజాలు తెలియాల్సిందే! ఆనక మేకప్ వేసుకుని నవ్వాల్సిందే!

ఇది - నకిలీ కణిక వ్యవస్థ తాలూకూ గూఢచర్య నెట్ వర్క్ ని కూలగొట్టటంలో ఒక వ్యూహం మాత్రమే! ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. ఈ విధంగా దుష్టుల్ని శిక్షించటానికి నెం.5 వర్గానికి ఎవరి అవసరమూ లేదు.

ఇక శిష్టుల్ని రక్షణ విషయానికొస్తే...!
ఎవరు శిష్టులు? ఇంకెవరు, సామాన్యులే!
ఈవీఎంల పుణ్యమాని ఎన్నికల ఫలితాలతో ప్రమేయం లేకపోయినా, పోలింగ్ రోజున బారులు తీరి ఓట్లు వేసేందుకు తప్ప మరెందుకు అవసరం లేని సామాన్యులు!
పన్నులు ఎంతగా వేసినా, కిమ్మనకుండా చెల్లించే సామాన్యులు!
నల్ల బజారులో ధరలు విపరీతంగా పెరిగినా ఓర్చుకునే సామాన్యులు!
తమ జీవితాలు, కోరికలు, మోజులు, అవసరాలు, ఆరోగ్యాలు.... అన్నీ వ్యాపార వస్తువులై, మొత్తంగా తామే కార్పోరేట్ కంపెనీలకు వ్యాపార వనరులుగా మారిపోయినా, బ్రతికేస్తున్నామనుకునే సామాన్యులు!

ఇందులో ప్రభుత్యోద్యోగులు భాగం కాదు. వాళ్ళకి జీతాలు ఏటికేడాది పెరుగుతాయి. ఇతర భత్యాలూ అందుతాయి. ఇబ్బడిముబ్బడిగా అక్రమార్జనా ఉంటుంది. ప్రజాదోపిడిని నిర్వహించాల్సిందీ, పన్నులు పిండీ, అవకతవకల నిర్వహణలో సహకరించీ, ఒకప్పటి బ్రిటీషు వాళ్ళకి సాయపడ్డ పాలెగాళ్ళలాగా, ప్రభుత్వనేతలకి దోపిడి పనిచేసి పెట్టాల్సింది వీళ్ళేనయ్యె! అందుకే ప్రభుత్వాధికారులలో ‘అత్యధికులు’ సామాన్యులు కారు.

అలాగే సామాన్యులలో ప్రభుత్వాధినేతలూ, రాజకీయ నాయకులూ భాగం కాదు. వాళ్ళు నిశ్చయంగా ప్రజాదోపిడి దొంగలే! కార్ఫోరేట్ కంపెనీలు సామాన్యులు కారు.

వెరసి ప్రైవేట్ రంగాలలో శ్రమదోపిడి కి గురవుతున్న వారు, ఉపాధిరంగాలలో అంతంత మాత్రపు ఆదాయ మార్గాలతో బ్రతుకు వెళ్ళదీస్తున్న వారూ, వ్యవసాయం అంటూ తరాలుగా సంక్రమించిన రైతు హోదాని వదల లేక కునారిల్లుతున్న వాళ్ళు, ప్రభుత్యోద్యోగాల్లో ఉన్నా విలువలొదులు కోలేక కేవలం జీతం రాళ్ళతోనే బ్రతుకుదాం అనుకునే వాళ్ళు, సామాన్యులుగా మిగిలిపోయారు. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే జీతం తప్ప, గీతం రాని ప్రతి ఒక్కరూ సామాన్యులే!

ఇక...ఇలా... నిర్భాద్యులైన తల్లిదండ్రులు గాలికొదిలేస్తే, బిక్క ముఖం వేసిన పిల్లల్లాగా, నిస్సహాయంగా మిగిలిపోయిన సామాన్యులు శిష్టులే! వీళ్ళనెలా రక్షించడం?

నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గంలోని ఏజంట్లతో పోల్చుకున్నా, నెం.5 వర్గంలో శ్రమిస్తున వారితో పోల్చుకున్నా, ఈ శిష్టులు [సామాన్యులు] అసంఖ్యాకులే! అలాంటి చోట ఎవరు ఎవరిని రక్షించగలరు? ఎలా రక్షించాలి? అసలెందుకు రక్షించాలి? ఏం? ఈ ధరిత్రి, నెం.5 వర్గానిదైనట్లే అందరిదీ కాదా? ఈ సంస్కృతి, ఈ ధర్మం, ఈ మానవత్వం సామాన్యులకి చెందదా? సామాన్యులకి ఏ బాధ్యతా లేదా?

అందుకే... సామాన్యులు తమని తాము గౌరవించుకున్నప్పుడే.... ఆ దేశమూ, జాతి గౌరవింపబడతాయనీ, సామాన్యులు తమని తాము ఉద్దరించుకున్నప్పుడే....ఆ దేశమూ, జాతీ ఉద్దరింపబడతాయనీ గత టపాలలో వ్రాసాను.

అలా జరగాలంటే సామాన్యులలో ఉండాల్సింది ఆత్మగౌరవమూ, సంకల్పమూ, ధైర్యమూ, మేధస్సులే! సామాన్యులు అసమర్ధులు కాదు. పిరికి వాళ్ళు కాదు, అవగాహన చేసుకోలేని మూర్ఖులూ కాదు. కానీ నకిలీ కణిక వ్యవస్థ, ఇన్నాళ్ళు ప్రయోగించిన ‘మీడియా ప్రచార మాయజాలపు’ వలలో చిక్కుకొని.... కణిక నీతిలోని తొలి వాక్యం "శతృవుని నాశనం చేయాలనుకున్నప్పుడు ముందుగా వాళ్ళు ఉత్సాహ ధైర్య మంత్రాంగాలని నాశనం చెయ్యాలి!" అన్న వ్యూహానికి గురై.... నిర్వేదంతో, నిరాశా వాదంతో, నిరుత్సాహంతో, నిట్టూర్పులు విడుస్తూ, ఎదిరించే ధైర్యం లేదనుకున్న పిరికి తనంతో, తమో గుణంతో నీరసించి ఉన్నారు.

నిజం తెలిస్తే నిప్పు కణికలౌతారేమోనన్న భయంతోనే.... నకిలీ కణిక వ్యవస్థ, మీడియా, ప్రభుత్వం, కార్ఫోరేట్ రంగాల సహాయంతో, సామాన్యుల బ్రతుకుని పరుగుల వలయంలోకి నెట్టింది. అందుకోసమే నిరంతరం పన్నులు, సంచలనాలు, మోజులూ, క్రేజులూ, వివాదాలు, కుహనా ఉద్యమాలతో సామాన్యుల్ని అతలాకుతలం చేస్తోంది.

ఏమాత్రం సమయం లభించినా సామాన్యులు ఆలోచిస్తారు. ఆలోచిస్తే నిజం తెలుస్తుంది. నిజం తెలిస్తే తమ మోసం అర్ధమౌతుంది. ఆ అవగాహన కలిగితే ఇక తమ దోపిడి ఎలా సాగేటట్లు? అందుకే ఎప్పటికీ సామాన్య ప్రజలకి సత్యం తెలియకూడదు అనే లక్ష్యంతోనే మీడియా, ప్రభుత్వమూ పనిచేస్తుంది. ప్రభుత్యోద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడకూడదు. అది రూలు. దోపిడి, దగా తెలిసినా నోరెత్త కూడదు. ఉద్యోగులు స్వచ్ఛందంగా నోరెత్తకుండా ఉండేందుకు జీతం కన్నా ఎక్కువగా లంచాలు దండుకోనిస్తుంది.

రాజకీయ నాయకులు, మ్యాచ్ ఫిక్సింగులో భాగంగా అవకతవకలు బయటపెట్టుకుంటారు, ధరల మీద ధర్నాలు చేస్తారే గానీ, అమీ తుమీ తేల్చుకునే దాకా నిలబడరు. కంత గురించి అందరికీ చెప్పేస్తే రేపు తాము అందులో దూరే అవకాశం పోతుందనుకునే తోడుదొంగలే అంతా!

అలాంటి చోట, మీడియాని గమనించండి. ఏ అవకతవకల గురించి అయినా, అనివార్యమై బయటపడినా, బయటపెట్టినా... గోల చేస్తుంది కానీ అంతుతేల్చుకునేంత గోల చెయ్యదు. తర్వాత తీరిగ్గా ‘ఎక్కడిదక్కడ గప్ చుప్ అయిపోయింది. అవినీతికే బలం ఉంది’ అన్నట్లే ప్రచారిస్తుంది.

ప్రజలని చైతన్య పరిచే ప్రయత్నంగానీ, జరుగుతున్న వ్యవహారాలపై ప్రజలకి పూర్తి అవగాహన కల్గించే ప్రయత్నం గానీ, మీడియా చేయదు.

ఐపీఎల్ నేపధ్యంలో.... ’దుష్టశిక్షణ - శిష్టరక్షణ’ విషయమై నెం.5 వర్గపు పనితీరు ఎలా ఉంటుందో, దృష్టాంతపూరితంగా వివరిస్తాను.

శశిధరూర్, సునందా పుష్కర్ ద్వయం, లలిత్ మోడీకి జారత బొమ్మై, ట్విట్టర్ సాక్షిగా కొట్టుకోవటం, ఒకరి గుట్టు మరొకరు విప్పుకోవటంతో ప్రారంభమై, సంచలన వివాదం చెలరేగింది. దెబ్బతో ఐపీఎల్ లో పెట్టుబడులు పెట్టిన బడాబాబుల నలుపు తెలుపు డబ్బుల దగ్గరి నుండీ, మ్యాచ్ ఫిక్సింగుల మాయలూ, బెట్టింగ్ బేరాలూ, దుబాయ్ దారులూ, దావూద్ ఇబ్రహీంల చేతులూ బయటికొచ్చాయి.

పార్లమెంటు దద్దరిల్లాక, రెండు జాతర బొమ్మలూ [ధరూర్, మోడీలు] పదవులు కోల్పోయారు. అంతే! ఎక్కడి గొడవ అక్కడే సద్దుమణిగింది. ఇలా అంతా ’గప్ చుప్’ అయిపోవడానికి ఎందరి ధనపు సంచులకి ఎన్ని కన్నాలైనా పడి ఉండవచ్చు గాక! మొత్తానికీ గొడవైతే చల్లారింది. ఇలా డబ్బు కారిపోవడం.... దుష్టశిక్షణలో ఓ భాగం మాత్రమే!

మరి శిష్ట రక్షణ?

సామాన్య ప్రజలు క్రికెట్టుని ఆదరిస్తేనే ప్రత్యక్ష ప్రసారాల దగ్గరి నుండి వాణిజ్య ప్రకటనల దాకా, స్టేడియంలలో వ్యాపారాల దగ్గరి నుండి క్రికెటర్లు బ్రాండ్ అంబాసిడర్లుగా వస్తు విక్రయాల దాకా నడుస్తుంది. అలాంటి చోట, ఆ ఆట గెలుపోటములూ మ్యాచ్ ఫిక్సింగ్ లతో ముందే నిర్ణయింపబడతాయనీ, ఆటగాళ్ళు ఆట ఆడటం గాక ఆటని అభినయిస్తారనీ తెలిసినా.... క్రికెట్టే ఏకైక క్రీడా వినోదం అనేంతగా అందులో మునిగి పోతే.... అలాంటి వాళ్ళని ఎవరు కాపాడాలి? ఎందుకు కాపాడాలి?

మ్యాచ్ గెలుపోటములు మీద బెట్టింగ్ నడిస్తే.... ఎవరు గెలిస్తే/ఓడిపోతే ఎంత లాభమో లెక్కలు వేసి, ఆ విధంగా గెలుపోటములు నిర్ణయింపబడతాయని తెలిసినా... "ఏమైతేనేం! మ్యాచ్ చూస్తుంటే ’కిక్కు’ వస్తోంది కదా?" అనుకుంటే - అది వ్యవసపు స్థాయికి చేరినట్లే!

లేనట్లయితే కనీసం "అరే! ఎవరు గెలవాలో ముందే నిర్ణయించుకొని, సీరియస్ ముఖాలు పెట్టీ, సిక్సర్లు కొట్టీ, చెమటోడ్చి గెలినట్లో/ఓడినట్లో విరగనటించి.... ఆటని కాదు, డ్రామాని పండిస్తున్నారే నటఆటగాళ్ళు! ఇంత తెలిసినా, ఎవరు గెలుస్తారో నని ఊపిరి బిగపట్టి, రోజంతా టీవీ ముందు కూలబడి చూడటమా?" అనుకోకపోవటం అంటే - తెలిసి తెలిసీ, తమని వెర్రి వెంగళప్పలని చేస్తున్నా పట్టించుకోకపోవడమే!

’ఇంత వెర్రివాళ్ళలాగా కన్పిస్తున్నామా మనం?" అనే రోషం గుర్తుకు రావటం లేదంటే ఆత్మాభిమానం లేకపోవటమే!

"అయితేనేం! కిక్కుంది" అనుకోవటమంటే, వ్యసనాన్ని అతిక్రమించలేకపోవటమే! ఆత్మ నిగ్రహం లేనితనం అది!

సామాన్యప్రేక్షకుడికి ఆత్మాభిమానం గుర్తులేనప్పుడు, ఆత్మ నిగ్రహం లేనప్పుడు... వాళ్ళని ఎవరు ఏ దగాల నుండి కాపాడగలరు?

"అంతగా క్రికెట్టుకీ, టీవీకీ బానిసలమా? క్రికెట్టు గాక పోతే ఇక ఆటలే లేవా? లేదూ, మ్యాచ్ ఫిక్సింగులతో కూడిన దొంగ ఆటని చూడటం కంటే, స్వయంగా క్రికెట్టునో, మరో ఆటనో ఆడి వినోదించలేమా?" అనుకోవటం లేదంటే - మీడియా వెదజల్లిన ’భజ్జీ, మాస్టర్ బ్లాస్టర్, జార్ఖండ్ డైనమైట్, ధనాధన్ ధోనీ" గట్రా మోజులతో కూడిన ప్రచారపు మత్తులో జోగటమే అది!

అంతగా ఉన్మత్తులైన వారిని.... ఎవరు మాత్రం ఏ మోసాల నుండి, దగాల నుండీ కాపాడ గలరు?

ఒక ఉదాహరణ చెబుతాను. ఇటీవల ఆర్టీసీ ఛార్జీలు పెంచారు. ఎర్రపార్టీలతో సహా ప్రతిపక్షాలు ప్రకటనలు గుప్పించాయి. ప్రజలు కూడా నిరసన తెలిపారు. ప్రభుత్వం పట్టించుకోలేదు. అయితే... హైద్రాబాద్ నుండి వివిధ జిల్లాలకీ బస్సు సర్వీసుల్లో ప్రయాణికుల సంఖ్య [ఆక్యూపెన్సీ నిష్పత్తి] పడిపోయింది. దాంతో ఆర్టీసీ ఛార్జీలని తగ్గించుకొంది. ఎక్స్ ప్రెస్ బస్సులని ఆర్డనరీ రేటుకు తీసుకు వెళ్ళటానికి ’మెరుపు’ అనే సర్వీసుని ప్రవేశపెట్టింది. ప్రయాణికులు పెరగటంతో అదే నిర్ణయం గ్రామీణ రూట్లకి కూడా వర్తింప చేయనుంది. ఈ వార్త అప్రధాన అంశంగా ప్రచురింపబడింది.

ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెరిగే సరికి, ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలెంచుకున్నారు. అవి ఆటోలు కావచ్చు, జీపులు కావచ్చు. నిజానికి ఆర్టీసీ రేట్లు పెంచగానే ఈ ఆటోలు, జీపుల వాళ్ళు కూడా రేట్లు పెంచుతారు. కానీ ప్రయాణికుల వ్యతిరేకతని పట్టించుకుంటారు. అవకాశాన్ని బట్టి, అవసరాల మేరకు బేరసారాలు నడుస్తాయి. దాంతో ఆర్టీసీకి ప్రయాణికుల వ్యతిరేకత Avoidance రూపంలో వచ్చింది. రద్దీ తగ్గే సరికి ఛార్జీలు తగ్గించుకుంది. ఇందు కోసం ప్రయాణికులు రాజకీయ పార్టీలతో కలిసి ధర్నాలు చెయ్యలేదు. బస్సుల్నీ తగల బెట్టలేదు. కానీ తమ ప్రతిఘటనని చూపించారు. అసంఘటింగానే! అందరూ ఏకమై కాదు, ఎవరికి వారుగానైనా సరే! అయితే అందరూ ఒకేసారి!

ఇలాంటిదే మరో ఉదాహరణ! గత సంవత్సరంలో కందిపప్పు ధర వంద రూపాయలకి పాకినప్పుడు... హైదరాబాద్ లోని ఓ అపార్ట్ మెంట్ వాసులకు సంబంధించిన వ్యవహారం ఇది. సదరు అపార్ట్ మెంట్ లోని వారంతా కలిసి, తమ కాలనీ లోని సూపర్ మార్కెట్ ని Avoid చేసి, అందరి తరుపునా కొందరు, కందిపప్పుని హోల్ సెల్ దుకాణం నుండి భారీ మొత్తంగా కొనుగోలు చేసారు. దాంతో వాళ్ళకి కొంత చౌకగా పప్పు అందింది. ఇదీ వార్తా పత్రికలలో, అప్పటిలో వచ్చిన అప్రధాన వార్తాంశమే.

దీన్నే మరికొంత విస్తరిస్తే....అలాంటి అపార్ట్ మెంటులో ఉండేవాళ్ళకైనా గ్రామాలతో సంబంధాలుంటాయి. సమిష్టిగా అందరి తరుపున కొందరు, నేరుగా రైతుల నుండి కందులు కొనుగోలు చేసి, ఏ మిల్లులోనో పప్పు చేయించుకుంటే - అందుకయ్యే ఇతరత్రా ఖర్చులన్నీ కలుపుకున్నా, దళారీల మధ్య వర్తిత్వాన్ని నివారించ వచ్చు. వాళ్ళ లాభల బారి నుండి బయటపడవచ్చు. ఇది ఖచ్చితంగా రైతుకీ, వినియోగదారుడికీ కూడా ప్రయోజనకరమౌతుంది. నేరుగా ‘రైతు - వినియోగదారుడు’ లాభపడే మార్గం! దీనికి ప్రభుత్వం ఏవిధంగా అడ్డం గొట్టగలదు? ఇలాంటి ప్రత్యామ్నాయాలకి కావాల్సింది ప్రజలలో చైతన్యమే!

ఇలాంటిదే ఇంకో ఉదాహరణ. ముంబై దాడులకి ముందు, సరాసరి నెలకి ఒకటి చొప్పన బాంబుపేలుళ్ళు జరుగుతుండేవి. అదే ముంబైదాడులప్పుడు, యావత్ భారత దేశం ఒక్కసారిగా మండిపడింది. ఎక్కడా ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాలు జరగలేదు. కానీ అందరూ అసంఘటితంగానే మండిపడ్డారు. దాంతో తరువాత నుండి నెలకొకటి చొప్పున బాంబుదాడులు ఆగిపోయాయి. అంటే ప్రజాగ్రహానికి, పాకిస్తాన్ భయపడిందా? యూపీఏ ప్రభుత్వం భయపడిందా?

స్వామీ వివేకానంద ‘స్వామి - శిష్య సంభాషణలు’లో - "తిరుగుబాటు చేసేది ఏదైనా చైతన్యమే! ఒక చిన్న చీమను చంపడానికి ప్రయత్నించి చూడు. తన ప్రాణాన్ని రక్షించుకోవడానికి అది కొంచెం ఎదురు తిరుగుతుంది. ఎక్కడ పోరాటముందో, ఎక్కడ తిరుగుబాటుందో, అక్కడ జీవలక్షణముంది. అక్కడ చైతన్యం అభివ్యక్తమౌతున్నది" అంటారు.

పోరాడని వాడు, తిరుగుబాటు ప్రకటించని వాడు.... చైతన్యరహితుడూ, జీవన్మృతుడూ మాత్రమే! భగవంతుడు కూడా, చైతన్యం కనబరిచిన సజీవులకే సహాయం చేస్తాడు గానీ, నిర్జీవులకి కాదు గదా! నెం.5 వర్గమైనా అంతే!

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

1 comments:

మీ టపాల పరంపరలో ఇది ఒక ఆణిముత్యం!

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu