2007 లో.... ’మేము ఏదో వ్రాస్తున్నాం’ అన్న విషయం తెలిసినప్పటి నుండీ రామోజీరావు, ఈనాడు వార్తలూ, సోనియా వార్తలు ఎంత వేగం పుంజుకున్నాయో! ఇదెలా తెలిసిందంటే - 2007, డిసెంబరు చివరిలో మా కుటుంబ మిత్రుడు ఖాసీంతో స్నేహం తెగ తెంపులు చేసుకున్న తర్వాత, 2008 జనవరి నుండి మా పని ముమ్మరంగా సాగింది. ప్రతిరోజూ full time work గా ఉదయాన్నే స్నానపానాలు వంట వార్పు వంటి గృహకృత్యాలు ముగించుకుని 9.30 కల్లా వ్రాయడం ప్రారంభించేదాన్ని. నేను వ్రాయటం, మా పాప fair చేయటం, మా వారు టైపు చేయడం! ఇది దాదాపు అర్ధరాత్రి ఒంటిగంట వరకూ సాగేది.

నిజానికి మేము 2007, సెప్టెంబరు లోనే ఈ పని ప్రారంభించాము. రచనా ప్రణాళికని నిర్ణయించుకోవడానికే దాదాపు నెల పట్టింది. మాకున్న అవగాహనలో కొంత భాగాన్ని, ఆ విధంగా కాగితం మీద పెట్టేటందుకు హింట్స్ వ్రాసుకోవడం, విషయాన్ని కొన్ని శీర్షికలుగా విభజించుకోవడం గట్రాలతో వ్రాయడం మొదలు పెట్టాం. అయితే ఇవి ఏవీ మేము ఎవరితోనూ చర్చించలేదు. ఖాసీం కుటుంబంతో సహా!

మా పని మేము చేసుకుంటూనే, నవంబరు చివరిలో ఒకసారి ఢిల్లీ వెళ్ళి హోంమంత్రిత్వ శాఖలో ఫిర్యాదు ఇచ్చాము. డిసెంబరులో, చివరి ఫిర్యాదుగా ప్రధాని మంత్రి అపాయింట్ మెంట్ అడిగాము. దానికి జవాబుగా ఎంక్వయిరీకి ఒక సిబిసిఐడి ఆఫీసర్ వచ్చాడు. ప్రధానమంత్రి అపాయింట్ మెంట్ ఎందుకో కనుక్కోవటానికి వచ్చానని చెప్పాడు. చివరికి విడ్కోలు తీసుకుంటూ "అమ్మా! నేనయితే పాజిటివ్ గా రిపోర్ట్ వ్రాస్తాను. ఆపైన అధికారులు ఏంచేస్తారో నాకు తెలియదు" అని చెప్పాడు.

రేయిబవళ్ళు ఏమి వ్రాస్తున్నామో, టైపు చేస్తున్నామో తెలియటం లేదు గనుక, అది తెలుసుకోవాలన్న ఆత్రం, వేగమూ ఖాసీం కుటుంబంలో పెరగటం గమనించాము. మా ఆరునెలల పరిశీలనలో ఇదీ ఒక భాగమే. దాంతో మరింతగా మా మిత్ర కుటుంబం మా పట్ల నిర్వహిస్తున్న కార్యకలాపాలు నిర్ధారణ అయ్యాయి. ఫలితమే స్నేహం తెగతెంపులు. ఇక్కడ మీకు ఒక జోక్ చెబుతాను.

పాత సినిమా ’పాతాళ భైరవి’లో నేపాలీ మాంత్రికుడు ఎస్వీఆర్ "ఏంరా శిష్యా! ఆ బుల్ బుల్ [రాకుమారి] మనల్ని ఖుషి సేయదేంరా? మనకేం తక్కువరా? మనకీ బుల్ బుల్ కీ అడ్డమేమిరా?" అంటాడు. "గడ్డమే గురూ" అంటాడు అతడి శిష్యుడి స్థానంలోకి ఇన్ స్టాల్ అయిన అంజిగాడు. మాంత్రికుడు బిత్తరగా చూసి, గడ్డం దువ్వుకుంటూ "మరి మన మంత్ర శక్తులన్ని ఇందులోనే ఉన్నాయి కదరా?" అంటాడు. "అన్నిటి కంటే గొప్ప మంత్రశక్తి పాతాళా భైరవి మన చేతిలో ఉండగా ఈ చిన్నాచితకా మంత్రాలతో పనేమిటి గురూ?" అంటాడు శిష్యుడు.

దెబ్బతో గడ్డం గీచుకొని ట్రిమ్ముగా రెడీ అయి రాకుమారిని ప్రేమభిక్ష అడుగుతాడు మాంత్రికుడు. ఆ రంధిలో పడి, పాతాళ భైరవిని నమ్ముకుని, తన గడ్డంలోని మంత్రశక్తులన్నిటిని పోగొట్టుకుంటున్నానని గ్రహించడు. ఎప్పుడు పాతాళ భైరవి చేయి జారితే అప్పుడు, తానూ మంత్రాలేవీ లేని మామూలు మనిషై పోతానన్న రిస్క్ నీ పట్టించుకోడు.

సరిగ్గా అలాగే, మేము శ్రీశైలంలో ఉన్నప్పుడు మా విద్యార్ధుల తల్లిదండ్రులూ, ఇరుగుపొరుగులు. పూర్వ విద్యార్ధులూ, ఇతర మిత్రులూ పరిచయస్తులూ చాలామందితో మాకు స్నేహసంబంధాలూ మాటా మంతులు ఉండేవి. స్కూలు ఊడగొట్టి, ‘భవిష్యత్తు ఇబ్బందులు పాలవుతుంది’ అనే బెదిరింపు పెట్టి, మమ్మల్ని బ్రేక్ చేయాలనుకున్నాడు రామోజీరావు. అందుకోసమే మా గది కేటాయింపు రద్దు చేయబడింది. అప్పటికే బదిలీ పైన నంద్యాల చేరిన ఖాసీం మమ్మల్ని పిలవడంతో నంద్యాల చేరాం. శ్రీశైలంలో చాలామందితో మాటా మంతీ ఉన్నా ఇంటికి పిలిచి భోజనం పెట్టేటంత, వాళ్ళ ఇంటికి వెళ్ళి గదిపేటంత.... చనువూ, స్నేహం ఒక్క ఖాసీం కుటుంబంతో తప్ప ఎవరితోనూ లేదు.

’పాతాళ భైరవి’ పోలికతో చెప్పాలంటే.... ఇంత చనువూ దగ్గరితనం గల ఖాసీం కుటుంబంతో ఉన్న స్నేహంపై ఆధారపడి, రామోజీరావు, నేపాలీ మాంత్రికుడై పోయాడన్న మాట. అలాంటి ఖాసీంతో 2007 చివరిలో స్నేహాన్ని తుంచేసుకున్నాము.ముమ్మరంగా ఏదో వ్రాస్తున్నాము. అదేమిటో తెలుసుకునేటందుకు రామోజీరావు చేసిన విన్యాసాలు ఏ సర్కస్ కళాకారుడూ చేయలేడు.

నిజానికి బొమ్మ తిరగేస్తే ఈ పని [బ్లాగులో వ్రాయడానికి] కి శ్రీశైలంలో ఉంటే అస్సలు కుదిరేది కాదు. ఎందుకంటే - ఉదయం 5.45ని.లకు దినచర్య ప్రారంభమైతే దాదాపు రాత్రి 7.30 - 8.00 గంటల దాకా స్కూలుతోనే సరిపోతుంది. ఆదివారాలు, సెలవు దినాలు షాపింగ్ లాంటి వాటితో సరిపోతుంది. ఇక ఆలోచించుకోవటానికయినా, వ్రాయటానికైనా, రోజుకు మహా అయితే రెండు మూడు గంటలు మిగిలితే ఎక్కువ. అంతేగాక ఎవరో ఒకరు బ్లాగుని రిఫర్ చేస్తూ విషయం గురించి బాతాఖానీ పెట్టుకుంటే ఇక సమయం అస్సలు మిగలదు. అంతేగాక ఏమీ వ్రాయలనుకుంటున్నామో హింట్ కూడా అందుతుంది. అప్పుడు తదనుగుణంగా విన్యాసాలు చేయవచ్చు.

ఆ విధంగా ఏదీ జరిగిన మన మంచికే అన్న సూక్తి ప్రకారం నంద్యాల రావటం కూడా మంచికే జరిగిందన్న మాట. కాబట్టే మొత్తం విషయం బ్లాగులో పెట్టగలిగాము. నిజానికి నంద్యాల రావడానికి ముందు వరకూ, అసలు కంప్యూటర్ అవసరం మా జీవితాలలో ఉండదనుకున్నాము. మా స్కూలు స్థలం తక్కువ కాబట్టి, కంప్యూటర్ కొనమని ఎవరైనా అడిగితే, ఆ స్థలంలో ఇద్దరు విద్యార్ధులను కూర్చొబెట్టవచ్చు. అలాంటి చోట కంప్యూటర్ పెట్టటానికి స్థలం వృధా చేయటం ఎందుకని అనేవాళ్ళం.

మేము శ్రీశైలంలో గనక ఉంటే మా మొత్తం సమయం స్కూలుకే సరిపోయేది. అందుకని కూడా రామోజీరావు ఇప్పటికీ, కర్నూలు జిల్లా ఎడిషన్ లో శ్రీశైలం గురించి వ్రాస్తాడు. ఢిల్లీ వెళ్ళమని ఎలా చెప్తాడో, అలాగే ఉద్యోగానికి సంబంధించి శ్రీశైలం వెళ్ళమంటాడు. అక్కడయితే ఎంచక్కా చాలామంది ఉంటారు.... వేధించటానికైనా, సమాచారం చేరవేయడానికైనా!

నిజానికి 2005 లో మన్మోహన్ సింగ్ కి ’రామోజీరావు - రాజీవ్ గాంధీ హత్య - మాపై వేధింపు’ గురించి ఫిర్యాదు [పీవీజీకి ఇచ్చిన ఫిర్యాదుకి ఇది కొనసాగింపు] ఇచ్చినప్పటి నుండి.... ఈనాడు బాక్సుల్లో, వసుంధరలో డైరీ వ్రాయడం మంచిపని అని పదేపదే చెప్పబడింది. అన్నీ డైరీలో వ్రాస్తే, మునపటి లాగే తస్కరిస్తే చాలు, ఎంచక్కా అన్నీ తెలుస్తాయి. ఈ విధమైన ఇంట్యూషన్ రామోజీరావు ఈనాడు వార్తల్లో ప్రస్పుటంగా ఉండేది. అంతేగాక, ’అన్నీ మరిచిపోవడం’.... అంటే ’అల్జీమర్స్ వ్యాధి’ గురించి.... వసుంధరలోనూ, సుఖీభవలోనూ, ఆదివారం అనుబంధంలోనూ వచ్చేది. బొచ్చెడు సినిమాలలోనూ అల్జీమర్స్ ఆధారిత కథలుండేవి. మొదట్లో తెలియకపోయినా తరువాత బాగానే అర్ధం అయ్యింది.

డైరీలో గాకపోతే, కనీసం ఒక నోట్సులో నన్నా వ్రాయాలని, లేకపోతే మరిచిపోయే ప్రమాదం ఉందనీ మాకు ఊదర పెట్టబడింది. అయినా అప్పుడెప్పుడూ వ్రాయనిది, ఇప్పుడు అదే దినచర్యగా 2008లో వ్రాయడం రామోజీరావు ’నోటీసు’కి వచ్చింది. ఈ రకమైన సమాచారాన్ని సులభంగానే సేకరించగలరు. అయితే వ్రాస్తోందేమిటో తెలుసుకోవటం ఎలా? ఇంట్లోకి చొరవగా రాగల ఖాసీం కుటుంబంతో స్నేహం బంద్!

నంద్యాలలో మాకు మరెవ్వరితోనూ అంత చనువూ, స్నేహమూ లేదు. హలో అంటే హలో, అంతే! అప్పటికి మా ఇంటికి ప్రక్కనున్న రెండు వాటాలలోని కుటుంబాలు ఖాళీ చేసాయి. అంతలో ప్రక్క వాటాలోకి ఓ తమిళ కుటుంబం దిగింది. మామూలుగా మేము ఎవరితోనైనా కొంత పరిమితికి లోబడి సంబంధాలు నెరపుతాము. ’కొత్తగా వచ్చారు, రాష్ట్రేతరులు, పెద్దగా తెలుగు రాదు. అందునా మాకిష్టమైన తమిళనాడు రాష్ట్రం వాళ్ళు’ అన్న ఉద్దేశంతో ఆ గృహిణికి "ఏదైనా అవసరమైతే అడగమని" చెప్పాను.

ఉన్నట్లుండి ఈ తమిళ కుటుంబం ఓ రోజు మా ఇంటిలోనికి దూసుకు వచ్చేసారు. సరే, ‘అతిధులు కదా’ అని ఆదరంగా మధ్యగదిలో కూర్చొబెట్టి మాట్లాడుతున్నాము. అదే గదిలో కంప్యూటర్ ఉంది. అప్పటికి మా వారు టైపు చేస్తూ ఉన్నారు. ఆ తమిళులు వచ్చీరాని తెలుగులోనూ, ఆంగ్లంలోనూ మాట్లాడుతూ, వారిలో ఒకరు స్ర్కీన్ మీది matter ని చదవ ప్రయత్నస్తుండటంతో, మా వారు నవ్వుతూ ’sorry' చెప్పి సిస్టంని టర్న్ ఆఫ్ చేసారు.

నేనేదో నిమ్మరసం వంటి అతిధి మర్యాదలలో ఉన్నాను. మా వారు అతడి బావమరిదితో మాట్లాడుతూ ఉండగా, అంతలో అతడు మా పాప గదిలోకి వెళ్ళి ’నీ రూం బావుంది’ గట్రా మాట్లాడుతూ, హఠాత్తుగా ’ఏదీ నీ writing చూపించు’ అంటూ అప్పటి వరకూ ఆమె ఫెయిర్ చేస్తూ వ్రాస్తున్న నోట్స్ తీసుకున్నాడు. నేను కాగితాలు పిన్ కొట్టి వాటి మీద గీకేస్తే [వేగానికి నా చేతి వ్రాత అంతగా బాగుండదు మరి.], మా పాప దాన్ని నోట్సు లోకి fair చేసింది. అప్పటికి ఆమె ఆ నోట్సులో Coup on Indian Epics వ్రాస్తోంది. అతడు నాలుగైదు నిముషాలు తిరగేసి ఇచ్చేసాడు. వాళ్ళు వెళ్ళిన తరువాత, మొత్తంగా ఏమీ జరిగిందో అర్ధం అయ్యింది.

అయితే తరువాత నుండి ఈనాడు ఒక్కుమ్మడిగా... అంతర్యామిలోనూ, ఆదివారం సంపాదకీయాలలోనూ, భారతీయ ఇతిహాసాల గురించి ఎడతెరిపి లేకుండా వ్రాయడం మొదలెట్టింది. ఇదంతా చూసాక, తమిళ కుటుంబం మా నుండి బయటికి చేర వేసిన సమాచారం ఏమిటో, మాకు బాగానే అర్దమైంది. అప్పటికే అతి చనువు తీసుకున్నందున తరువాత ఆ తమిళ కుటుంబంతో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాము. రెండు నెలల లోనే మా ప్రక్క వాటా ఖాళీ చేసేసారు.

ఇక అప్పటి నుండీ, మా ఇంట్లో ఉన్న ’దివాకర్’ అనే శ్రీశైల విద్యార్ధి మీద, మా చుట్టుప్రక్కల వాళ్ళందరికీ ఒక్కసారిగా ప్రేమ పెరిగిపోయింది. ఈ దివాకర్ తండ్రి రాజశేఖర్ రెడ్డి [ఇతడినే వై.యస్.కి అలియాస్ చేసింది] మా గది కేటాయింపు రద్దు చేయబడినప్పుడూ, మాకు శ్రీశైలంలో గది వెదికెందుకూ చాలా ప్రయత్నాలు చేసినందుకు కృతజ్ఞతగా, ఆ పిల్లవాడిని మా ఇంట్లో అట్టిపెట్టుకుని ఒక సంవత్సరం పాటు చదువు చెప్పాము. ఆ పిల్లవాడిని మా ఇంటి యజమానుల పనివాడి దగ్గర నుండీ ప్రక్కింటి కారు డ్రెవరు వరకూ, అందరూ ముద్దు చేయటం, మాటికీ ’దివాకర్’ అంటూ కలవరించటం, మాకు గమనింపులోకి వచ్చింది.

మా పనుల్లో మేము ఉన్నప్పుడో, పిల్లవాణ్ణి ఆడుకోవటానికి పంపినపుడో, "ఓ చాక్లెట్ చేతబెట్టి, లేదా ప్రేమగా బుజ్జగించో, మీ మేడమ్/గీతక్క వ్రాస్తున్న పుస్తకం ఒకటి తెచ్చిపెట్టమంటే" పసివాడు, ఆ పిల్లవాడు తీసికెళ్ళి ఇవ్వడా? అలాగని పిల్లవాణ్ణి బయటకే పంపకుండా ఉంచలేం కదా? అయినా coups on world కోసం నేను వ్రాస్తున్న విషయం మీద, అంత ప్లే నడవటంతో మాకూ దానిపైన జాగ్రత్త హెచ్చింది.

శ్రీశైలం రాజశేఖర్ రెడ్డికి పోన్ చేసి, ఇక పిల్లవాణ్ణి తీసికెళ్ళండి అంటే - అతడు ఈరోజు రేపు అంటూ దాదాపు 20 రోజులు గడిపేసాడు.[అప్పటికే ఏప్రియల్ నెల] ఇటు చూస్తే పిల్లవాడు కూడా తల్లిదండ్రుల మీద బెంగ పెట్టుకున్నాడు. ఆ బెంగకు ఎడ్డెమంటే తెడ్డెం వంటి చర్యలు చేసేవాడు. పిల్లవాడు దాదాపు బ్రేక్ స్థితి. అదే చెప్పి, పిల్లవాడి చేత ఫోన్ చేయించినా, అతడు మరో పదిరోజులు వాయిదా వేస్తూ, అమావాస్య, పౌర్ణమో దాటే వరకూ మంచిరోజులేవని, [అదీ తమ పిల్లవాణ్ణి తమ ఇంటికి తీసికెళ్ళెందుకు] తమ గురువు గారు చెప్పాడని కుంటి సాకులు చెప్పాడు. నాకైతే చాలా కోపం వచ్చింది. మాకు ఇబ్బందిగా ఉందనీ, పిల్లవాడు బెంగ పెట్టుకున్నాడనీ ఎంత చెప్పినా వినడే!

ఇక లాభం లేదని మా పాపతో సహా బస్సెక్కించి పిల్లవాణ్ణి శ్రీశైలంలో దిగవిడిచి రమ్మన్నాం. మూడో రోజే, మా పాప తోనే పిల్లవాణ్ణి తిప్పి పంపుతానంటాడు. "అప్పటికి సంక్రాంతి సెలవులకి చూసుకున్న కొడుకుని వదిలి తల్లిమాత్రం ఎలా ఉంటుంది? పిల్లవాడికి మాత్రం తల్లీ, చెల్లీ నాన్నలతో ఉండాలని ఉండదా? మా పాపని మాత్రమే పంపించండి. దివాకర్ ని మీ దగ్గరే ఉంచుకోండి!" అని ఖరాఖండిగా చెప్పాల్సి వచ్చింది.


తర్వాతి నెలలో "మరుసటి సంవత్సరానికి ఇంకెక్కడైనా చేర్చుకోమని" చెబితే అతడు అస్సలు ఒప్పుకోలేదు. విషయం సూటిగా చెప్పేసాము. "మీకు ’రామోజీరావు’ కేసు తెలుసు కదా! దివాకర్ గాణ్ణి కాస్త ఉబ్బేసి....‘మీ మేడమో, గీతక్కొ వ్రాస్తున్న పుస్తకం తెచ్చిపెట్టు’ అంటే పిల్లవాడికేం తెలుసు? తీసికెళ్ళి ఇచ్చినా ఇస్తాడు. అదీగాక మా పనుల్లో మేముండి వాడికి చదువు చెప్పటమూ సాధ్యం కాదు. మేము నిద్రపోయేటప్పటికే రాత్రి ఒంటి గంట దాటుతుంది" అని ఎంతగానో చెప్పాల్సి వచ్చింది.

అదే సమయంలో పి. జనార్ధన రెడ్డి మరణించి, అతడి కుటుంబానికి ఎంఎల్ ఏ టిక్కెట్టు ఇస్తారో లేదో ననే తర్జన భర్జనలు నడుస్తున్నాయి. వై.యస్., విష్ణుకి టిక్కెట్టు రాకుండా అడ్డం పడతాడేమోననే వార్తలు వస్తున్న నేపధ్యంలో "మీ కొడుకు లాంటి వాడు కాదా?" అంటూ ఈనాడు హెడ్డింగ్ పెట్టింది. ఈ హెడ్డింగ్ తో పాటూ, ఇతర హెడ్డింగులతోనూ ఆ పిల్లవాణ్ణి తెచ్చు కోవాల్సిందిగా ఈనాడు తెగ చెప్పేసింది. దాంతో మాకు విషయం మరింత బాగా బోధ పడింది.

అప్పటికి మాకు తెలుగు బ్లాగులు చూడటం తెలుసు. తెలుగులో వ్రాయడం రాదు గనక కేవలం చదివేవాళ్ళం. వ్యాఖ్యలు వ్రాసేవాళ్ళం కాదు. బ్లాగ్లోకంలో యాసిర్ అనే ఒక బ్లాగరు, తన టపాలలో, ముస్లిం మతం గురించి గొప్పగా, హిందూమతం ఇతిహాసాల గురించి చులకనగా వ్రాయటం గమనించాము. అతడి ప్రొఫైల్ ఇతర వివరాలు గుర్తులేవు.

ఆ టపాల వ్యాఖ్యలలో ఇతర, ప్రముఖ బ్లాగరులు....

"అయ్యా యాసిర్ గారు, మీ మతం గురించి గొప్పగా చెప్పుకోండి. ఇతర మతాలు చెత్త అనకండి" అనీ....

"మీ మతంలో ఉన్న మంచి ఏదైనా చెప్పండి. మేమూ తెలుసుకొని ఆనందిస్తాం. అంతేగానీ, ఇలా ఇతర మతాలని దూషించకండి" అనీ.... చాలా ఓపికగా, సంయమనంగా వ్యాఖ్యలు వ్రాసి చెప్ప జూసారు. సదరు బ్లాగరు వినలేదు సరికదా, రెచ్చిపోయి మరీ టపాలు వ్రాసాడు.

అంతలో మరో కొత్త బ్లాగరు ‘వాసిర్’ అంటూ రంగ ప్రవేశం చేసి యాసిర్ టపాలని, అందులోని విషయాలని కౌంటర్ వేసేసాడు. కొందరు సదరు వాసిర్ ని "మీరు నిజంగా ముస్లిం కాదులే. మీరు ఫలానా కదా అన్నా! మాకు తెలిసి పోయింది" అన్నారు. మొత్తానికి ఆ వాసిర్ ఎవరో గానీ, యాసిర్ వ్రాతలకు రోసి, మిధ్యా పేరుతో ఎదురు దాడి చేసాడని మేమూ అనుకున్నాము.

మొత్తానికీ ఈ టపాఘాతాల యుద్దం హోరా హోరీగా నడిచి, రోజులు నెలలు గడిచాక, క్రమంగా యాసిర్, తర్వాత వాసిర్ అంతర్ధానమై పోయారు. ఈ రోజులన్నిటిలో కూడా, ఈనాడు భారతీయ ఇతిహాసాల గురించి ఎడతెగకుండా వ్రాస్తూనే ఉంది.

ఆ ’ఎరా’ లోనే భాజపా ’రామ సేతు’ issue ని ఎత్తుకుంది. దాన్ని పురస్కరించుకొని కరుణానిధి ’రాముడు తాగుబోతు’, అంటూ నానా విధంగా వదిరాడు. ఎన్నికల స్టంటుగా అవన్నీ నడిచాయి. ఎందుకంటే అప్పుడంతా అదిగో /ఇదిగో మధ్యంతర ఎన్నికలు రాబోతున్నాయి అనే ఉలికిపాట్లు నడిచాయి.

ఈ లోపున coups on world వ్రాయటం, టైపింగ్, కరెక్షనూ అన్నీ పూర్తయ్యాయి. దాన్ని వెబ్ సైట్ లో ఉంచాలని మా ప్రయత్నం. ‘ఆర్దిక వనరులు సమీకరించుకొనేందుకు మరికొంత సమయం పడుతుంది’ అనుకొని.... ఆ లోపున భట్టి విక్రమార్క కథలు గ్రాంధిక భాషలో ఉన్న పుస్తకం నుండి ఆంగ్లంలోకి అనువదించి వ్రాసాను. ఆరు సాలభంజికలు చెప్పిన కథలు వ్రాసాను. వాటి రిఫరెన్స్ తో వెబ్ సైట్ తెరిచే ప్రయత్నాలు ప్రారంభించాము. ఇంటర్ నెట్ లో సంప్రదించాము. లోకల్ గా అడిగాము.

ప్రతి లింక్ కు 500/- రూపాయలు అవుతుందని, మొత్తంగా 50 వేల రూపాయలు అడిగాడు ఓ డిజైనర్. [కంప్యూటర్ గురించి, మా అమాయకత్వం అంత లాభసాటిగా కనిపించింది కాబోలు!] చాలా ప్రయత్నాల తర్వాత బ్లాగు తెరవటం మంచిది అనిపించి బ్లాగు తెరిచాము. వెబ్ సైట్ కోసం ఎంక్వయిరీ చేస్తున్న రోజుల్లో.... ఈనాడులో ’ఆత్మకథ అమ్ముకోవడానికే! ’ అని వచ్చింది.

ఇంతలో ఓ రోజు, ఈనాడు మధ్య పేజీలలో బాక్సుకట్టి, ఫోటో తో సహా ’సోనియా ఉజ్జయిని మహంకాళి గుడిలో మొక్కు చెల్లించుకోవటం’ గురించిన వార్తాంశం వచ్చింది. మేమైతే నివ్వెర పడ్డాము. తర్వాత్తర్వాత తల్చుకు తల్చుకు నవ్వుకున్నాము.

భట్టి విక్రమార్కులకు స్వయంగా దర్శనమిచ్చి,
భూగర్భ నిధినిక్షేపాలిచ్చి ఉజ్జయినీ స్థాపించేటట్లుగా ఆశీర్వదించిన కాళీ మాత,
అటువంటి ఉజ్జయిని గుడికి,
శక్తి పీఠమూ, జ్యోతిర్లింగమూ కొలువైన ఉజ్జయిని గుడికి
ఉత్తుత్తి మొక్కు [మరో మాటలో చెప్పాలంటే దొంగ మొక్కు] తీర్చడానికి వెళ్ళినప్పటి నుండీ.... ఆ మహంకాళి, యూపీఏ ప్రభుత్వాన్నీ, సోనియా బృందాన్నీ వీరబాదుడు బాదుతోందని మేము జోకులు వేసుకుంటూ ఉంటాము.

ఎందుకంటే - ఆ తర్వాతే నకిలీ కణిక వ్యవస్థ, అందులోని కీలక వ్యక్తులు రామోజీరావు, సోనియాల పరిస్థితి పైకి కనిపిస్తూ మరింత ఇక్కట్లలోకి పడింది. అంతర్జాతీయంగా మాంద్యం దెబ్బ ముదర సాగింది. ఆ దెబ్బతో వీళ్ళు కన్న కలలు అన్నీ కల్లలు అయ్యాయి. గూఢచర్య ఇక్కట్లు, సాధారణ ఇక్కట్లు లాగా బాహాటంగా కనబడటానికి కొంత సమయం పడుతుంది. అదే గూఢచర్య దృష్టి ఉన్నవాళ్ళకది వెంటనే గ్రహింపు కొస్తుంది.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

2 comments:

వామ్మో దొంగలున్నారండీ చుట్టూ... మేము మా వాళ్ళ దగ్గర లేమని... వాళ్ళతో ఎన్ని రకాలుగా ఆడుకుంటున్నారో మీ బ్లాగు చూశాకే అవగతమూ, అర్థమూ అవుతోంది... మన చుట్టూ పిశాచాల వంటి మనుషులు ఉన్నారు.. పెద్ద సునామీ వచ్చి అందరినీ సమానం చేస్తే బావుంటుంది....

కృష్ణ గారు: మీ సహానుభూతికి నెనర్లు!

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu