ప్రపంచంలో, దేశంలో, మన వూళ్ళో ఏం జరుగుతుందో తెలియాలంటే... ఒక్కమాటలో చెప్పాలంటే వార్తలు తెలియాలంటే.... ఇప్పుడంటే టీవీ ఛానెళ్ళూ, అంతర్జాజం వంటివి కూడా ఉన్నాయి గానీ ఒకప్పుడు వార్తా పత్రికలు, రేడియో తప్ప మార్గాంతరం ఉండేది కాదు. అప్పటికి FM రేడియోలు కూడా లేనందున, ఆకాశవాణి మాత్రమే అందుబాటులో ఉండేది. ఆకాశవాణి కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి, అప్పట్లో దేశంపట్ల నిబద్దత, నిజాయితీ గల వారు ప్రభుత్వ పదవుల్లోనూ, ఉన్నతాధికారుల్లోనూ, ఉద్యోగుల్లోనూ ఎక్కువమంది ఉండేవారు కాబట్టి, ఆకాశవాణి వార్తలు[ఇప్పటి ప్రైవేటు మీడియా సంస్థల వార్తలతో పోలిస్తే] చాలా వరకూ వాస్తవాలనే చెప్పేవి.

ఇక రెండోవి వార్తపత్రికలు! అప్పటి పత్రికల స్ఫూర్తిపూరిత దేశ సేవ, ప్రజా సేవల గురించి గతటపాలలో ప్రస్తావించాను. ఈ టపాలో నేటి పత్రికల నెట్ వర్క్ గురించి వివరిస్తాను.

వార్తా పత్రికలలో వార్తలు సేకరించే విలేఖర్లు, న్యూస్ కంట్రిబ్యూటర్లు, ఇన్ ఛార్జిలు, ఉపసంపాదకులు, సంపాదకులు... అందరూ, ఆది సోమ అని లేకుండా, పండగ పబ్బాల్లేకుండా నిరంతరం పనిచేస్తారు. పీటీఐ నుండి, ఇతర సంస్థల నుండి తమకి అందిన సమాచారాన్ని, వివిధ ప్రాంతాల నుండి తమకి అందిన సంక్షిప్త సమాచారాన్ని, విశ్లేషించి, విపులంగా తిరగ వ్రాసే ఉప సంపాదకులు, ఇతర ఉద్యోగులు, పత్రికా కార్యాలయాలలో ఆదివారపు సెలవులు లేకుండా పనిచేస్తారు. మొత్తం సిబ్బందిలో కొందరు సొమ, కొందరు మంగళ... ఇలా వారపు సెలవులు[Weekly off] పుచ్చుకుంటూ, మొత్తానికి పత్రికా కార్యాలయం, ముద్రణాలయం మాత్రం వారమంతా, నెలంతా, సంవత్సరమంతా పనిచేస్తుంది. ప్రధాన పండగల నాడు తప్ప పెన్ను దించని శ్రమ వారిది. నిజంగా అభినందించ వలసిన శ్రమ, ఓపిక!

ఇక వార్తలు సేకరించే విలేఖర్ల, న్యూస్ కంట్రిబ్యూటర్ల శ్రమ మరింత ఎక్కువ. సంక్షిప్త వార్తల్ని విపులీకరించే ఉపసంపాదకాది ఉద్యోగులు, డెస్క్ ముందు ఫ్యాన్ క్రింద [లేదా ఏసీ గదుల్లో] కూర్చొని పనిచేస్తే... విలేఖర్లు, న్యూస్ కంట్రిబ్యూటర్లు రోడ్ల మీదపడి ఎండనకా, వాననకా పని చేయాలి. అంటే ప్రత్యక్ష కార్యరంగంలో అన్నమాట. ఎక్కడ ఏ సంఘటన జరిగినా వెళ్ళి కవర్ చేయటం, వ్యక్తులతో ఇంటర్యూలు[ముఖాముఖి] నిర్వహించటం వంటివన్నీ నిర్వహించాల్సిందే!

ఉపసంపాదకాది ఉద్యోగులైనా, విలేకర్లయినా, న్యూస్ కంట్రిబ్యూటర్లయినా... జర్నలిస్టు కావాలన్న కాంక్షతో అందుకు తగిన అర్హతల సంపాదించేటప్పుడు... ఉద్యోగ ప్రయత్నాలు చేసేటప్పుడు... ఎన్నో ఆశయాలు, ఆవేశాలు, ఆశలతో వస్తారు. అందరూ కాకపోతే కొందరైనా... జర్నలిస్టు అయితే అవినీతిని తమవంతుగా ఎదుర్కోవచ్చని, ప్రజలకి, దేశానికి ఏదో చేయవచ్చనీ, కలలు కంటూ ఆ రంగంలోకి వస్తారు.

అచ్చంగా... జీవితం గురించి ఎన్నో కలలతో ఆశలతో అత్తవారింట అడుగుబెట్టిన కొత్త కోడలు, ఖర్మకాలి అత్తమామలూ, భర్తా కట్న పిశాచాలైతే ఎంతగా బిత్తర పోతుందో, బెంబేలు పడుతుందో... జర్నలిస్టు అవతారం ఎత్తిన తొలినాళ్ళలో చాలామంది యువతీ యువకులు ఎదుర్కోనే స్థితి అదే! వివరంగా చెబుతాను.

ఉదయాన్నే కాఫీ కప్పుతో బాటు చేతిలోకి తీసుకున్న వార్తా పత్రికలో... ఒకప్పుటి ఈనాడులా... ఎన్నో వార్తలు, ఎన్నో విశేషాలు! ఎక్కడెక్కడో జరిగిన వింతలూ విడ్డురాలతో పాటు, నేరాలు, ప్రమాదాలు, ప్రముఖుల ప్రకటనలు, విశ్లేషణలు! అవన్నీ ముద్రించటానికి ప్రచురణాలయంలో కొందరుంటే... ఆయా వార్తలు సేకరించి పంపటానికి మరి కొందరుంటారు. ఇలా వార్తల్ని సేకరించే వారిని జర్నలిస్టులు/విలేకర్లు/రిపోర్టర్లు అని పిలుస్తుంటారు. సామాన్య ప్రజానీకం, అందర్నీ ఒకే దృష్టితో చూస్తుంది. అయితే మామిడిపళ్ళల్లో నూజివీడు పళ్ళు వేరన్నట్లు, విలేఖర్లు[జర్నలిస్టుల్లో]లో న్యూస్ కంట్రిబ్యూటర్లు వేరు. స్వల్ప భేదం తప్పితే ఇద్దరూ చేసేపని దాదాపుగా ఒకటే! అయితే వేతనాలు, ప్రతిఫలాలు మాత్రం వేరుగా ఉంటాయి.

ఉదాహరణకి ఈనాడు నెట్ వర్కునే తీసుకుందాం.[దాదాపుగా అన్ని పత్రికల నెట్ వర్కు ఇలాగే ఉంటుంది.] ఈనాడు, తను అపాయింట్ చేసుకున్న జర్నలిస్టులకి నెలవారీ వేతనంగా [చెప్పుకోదగినంత మొత్తమే] చెల్లిస్తుంది. న్యూస్ కంట్రిబ్యూటర్లకి మాత్రం, వాళ్ళు నెలలో పంపించిన వార్తలని, కాలమ్ x సెంటీమీటరు ప్రమాణంలో చెల్లిస్తుంది. మరో మాటలో చెప్పాలంటే న్యూస్ కంట్రిబ్యూటర్లు ఫ్రీ లాన్సర్ గా పని చేస్తున్నట్లు! ఇచ్ఛాపూర్వక లేదా ఔత్సాహిక పాత్రికేయులన్న మాట. వారికి, నెలలో తము వ్రాసిన వార్తలు ప్రచురింపబడేవి తక్కువే, దాంతో చెల్లింపబడే సొమ్ము కూడా తక్కువ గానే ఉంటుంది. ఎందుకంటే ఒక ఊరిలో చాలామంది న్యూస్ కంట్రిబ్యూటర్లు ఉంటారు కాబట్టి.

మీకు బాగా అర్ధం అయ్యేందుకు ఉదాహరణగా నంద్యాల [మునిసిపాలిటి] పట్టణాన్ని ఎంచుకుంటాను. నంద్యాలలో ఈనాడు పత్రిక కార్యాలయంలో ఇద్దరు[లేదా ముగ్గురు] జర్నలిస్టులు ఉంటారు. ఇక విద్య, సాంస్కృతిక విభాగం, క్రీడల విభాగం, నేర విభాగం, గ్రామీణ విభాగం, రాజకీయ విభాగం... ఇలా దాదాపు పది మంది దాకా న్యూస్ కంట్రిబ్యూటర్లు ఉన్నారు. ఇక చుట్టుప్రక్కల గ్రామాలకి చిన్నవైతే రెండింటికి ఒకరు చొప్పున, పాణ్యం వంటి పెద్ద గ్రామాలలో ఒకొక్కరు చొప్పున న్యూస్ కంట్రిబ్యూటర్లు ఉన్నారు.[శ్రీశైలంలోనూ అంతే! శ్రీశైలం ఆలయంగా పేర్కొంటూ ఒక న్యూస్ కంట్రిబ్యూటరు, ప్రక్కనే ఉన్న సున్నిపెంట గ్రామానికి శ్రీశైలం ప్రాజెక్టుగా పేర్కొంటు మరో న్యూస్ కంట్రిబ్యూటర్ ఉన్నారు. ఇతర పత్రిలన్నిటిది కూడా ఇదే తీరు.]

ఈ విధంగా చిన్న పట్టణమైన నంద్యాలకి దాదాపు పది మంది దాకా న్యూస్ కంట్రిబ్యూటర్లుంటే, ఇద్దరు జర్నలిస్టులు ఉన్నారు. ఇంత చిన్న ఊరిలో నెలంతా జరిగిన విశేషాలని, ప్రత్యేక సంఘటనలని, వార్తలుగా వ్రాసుకోవాలన్నా ఎన్నుంటాయని? అదీ దాదాపు పది విభాగాలుగా పంచుకుంటే ఒక్కొక్కరికి ఎన్ని వార్తలొస్తాయి? మహా అయితే రోజుకి రెండుమూడు వార్తలొస్తాయి. అదీ చిన్నచిన్న వార్తలొస్తాయి. ఎప్పుడో గానీ ప్రత్యేక కథనాలు[Special stories] వ్రాసే అవకాశం రాదు.

దాంతో న్యూస్ కంట్రిబ్యూటర్ల నెలసరి రాబడి రెండుమూడు వేల రూపాయలు కంటే ఎక్కువ ఉండదు. ఇవి రెండేళ్ళ క్రితపు లెక్కలు! ఇప్పుడేమైనా కాలమ్/సెంటీమీటరుకు వేతనం పెంచితే మరో వెయ్యి రూపాయలు వస్తూండవచ్చు. అందుచేత చాలామంది న్యూస్ కంట్రిబ్యూటర్ లు ఇతరత్రా వృత్తుల్లో ఉండి, పార్ట్ టైమ్ అన్నట్లు న్యూస్ కంట్రిబ్యూటర్లుగా పనిచేస్తుంటారు. అంటే స్థానిక స్కూళ్ళు లేదా కళాశాలలో బోధన/ బోధనేతర సిబ్బందిగా, ఇతర ప్రైవేటు సంస్థలూ/ప్రభుత్వ సంస్థల్లోనూ... ఇలాగన్న మాట. కొందరు న్యాయవాద వృత్తుల్లో ఉన్నవాళ్ళు కూడా న్యూస్ కంట్రిబ్యూటర్లుగా కొనసాగుతుంటారు.

నెలంతా తాము పంపిన వార్తాంశాలలో ఎన్ని ప్రచురింపబడ్డాయో లెక్కించుకొని వివరాలు పంపితే, వాటి తాలూకూ మూల వేతనానికి, ప్రయాణ ఖర్చుల వంటి ఇతర అలవెన్సులు కలిపి తదుపరి నెలలో చెల్లింపులు వస్తుంటాయి. బిల్లులు రావటంగా దానిని వాళ్ళు పిలుచుకుంటూ ఉంటారు. అదే పత్రికల వారి స్వంత జర్నలిస్టులైతే మూల వేతనం బాగా ఉంటుంది. పదివేలు, ఆపైన... అన్నమాట. 2007లో లెక్క ఇది. అలాగే పని లక్ష్యం[work target] కూడా ఉంటుంది. నంద్యాలలో అలాంటి వారు ఇద్దరు లేదా ముగ్గురుంటే శ్రీశైలం, సున్నిపెంటలకు కలిపి ఒకే ఒక్కరున్నారు. దాదాపు అన్ని ఊళ్ళల్లోనూ ఇంతే. ఊరు పెద్దదైతే మరికొందరు జర్నలిస్టులు ఉంటారు. ఊరు పరిమాణాన్ని బట్టి ఈ జర్నలిస్టుల, న్యూస్ కంట్రిబ్యూటర్ల సంఖ్య ఉంటుంది. పత్రికల స్వంత జర్నలిస్టులకి ’తము పంపిన వార్తలు ఆ నెలలో ఎన్ని ప్రచురింపబడ్డాయి’ అన్న మీమాంసలతో నిమిత్తం లేకుండా మూలవేతనం అందుతుంది. ఇతర అలవెన్సులూ ఉంటాయి.

ఇక న్యూస్ కంట్రిబ్యూటర్ల విషయానికి వస్తే... ఈ ఫ్రీలాన్సింగ్ గా పనిచేసే న్యూస్ కంట్రిబ్యూటర్లకి, తము పంపిన అన్ని వార్తలూ తము పంపినప్పుడే ప్రచురింపబడవు. కొన్ని చెత్తకుండీ పాలవుతాయి. అంటే అసలు ప్రచురింపబడవన్న మాట. కొన్ని పెండింగ్ ఉంచబడతాయి. పత్రిక యాజమాన్యాలకి కావాలనుకున్నప్పుడు లేదా పత్రికలో స్థలాన్ని మేనేజ్ చెయ్యాల్సి వచ్చినప్పుడు ఫీలర్ గానూ ప్రచురింపబడతాయి. ఒకోసారి ఎంతొ శ్రమించి, ఆసక్తితో కవర్ చేసి వ్రాసి, పంపించిన ఐటమ్ మర్నాడు పత్రికలో ప్రచురణలో కనబడక పోవటంతో సదరు న్యూస్ కంట్రిబ్యూటర్లు ఉసూరు మనటం కూడా జరుగుతుంటుంది. మొత్తానికి నెలంతా కలిపి సదరు పత్రిక రెండుమూడు వేల రూపాయలు వచ్చేటట్లు మాత్రమే చూస్తుంది. [2007 లెక్క ప్రకారం]

"మరి ఇంత తక్కువ రాబడి కోసం న్యూస్ కంట్రిబ్యూటర్లు ఎందుకు పని చేస్తుంటారు? పోనీ వృత్తి లేదా ప్రవృత్తి తాలూకూ సంతృప్తి ఉంటుందా అంటే అది ఉండదు కదా?" అనే సందేహం మనకి తప్పకుండా వస్తుంది. దానికి సమాధానం చెప్పే ముందు... న్యూస్ కంట్రిబ్యూటర్లు నుండి పత్రికల స్వంత విలేకర్లు, ఆపైన జిల్లా జోనల్ కార్యాలయాలు, ఆపైన ప్రధాన కార్యాలయాలలోని ఉపసంపాదక, సంపాదకాది పాత్రికేయులు, ఇతర ఉన్నతోద్యోగుల వరకూ పత్రికల నెట్ వర్క్ తాలూకూ పనితీరు ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలిద్దాం.

సాధారణంగా ఎవరికీ న్యూస్ కంట్రిబ్యూటర్లకీ, పత్రికల జర్నలిస్టులకి తేడా తెలియదు. అంతేగాక న్యూస్ కంట్రిబ్యూటర్లు కూడా తమని తాము జర్నలిస్టు/విలేకరులుగానే పరిచయం చేసుకుంటారు. లోతుగా తెలిస్తే తప్ప, ఇద్దరికీ వ్యత్యాసం ఏమిటో తెలియదన్నమాట. ఈ న్యూస్ కంట్రిబ్యూటర్లకి, జర్నలిస్టులకి జిల్లా కేంద్రాల్లో గానీ, జోనల్ కేంద్రాల్లో గానీ, పిరియాడికల్ గా సమీక్షా సమావేశాలు నిర్వహింపబడతాయి.

అప్పుడు ఎలాంటి వార్తలు సేకరించాలో, ఎలా సేకరించలో శిక్షణ ఇస్తారు. ఎలాంటి వ్యక్తులతో ఎలా టచ్ లో ఉండాలో వంటి కమ్యూనికేషన్ స్కిల్స్ , సమాచార మార్పిడి నైపుణ్యాలని ఎటూ ఉద్యోగంలో ప్రవేశించే ముందే శిక్షణ పొంది వస్తారు కదా! ఇక ఇలా పీరియాడికల్ గా నిర్వహించే సమీక్షా సమావేశాల్లో... న్యూస్ కంట్రిబ్యూటర్లలో ఎవరు ఎవరికి అనుసంధానంగా పని చేయాలో చెప్పబడుతుంది. అలాగే రాబోయే రోజులు/నెలల్లో ఏ విషయాల మీద ఎక్కువ ఫోకస్ చేయాలో చెప్పబడుతుంది. ఉదాహరణకి ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళ మీద గురిపెట్టాలి లేదా ఆరోగ్యశ్రీ అవకతవకలు లేదా దేవాలయాల్లో అభివృద్ది/అవకతవకలు... ఇలాగన్న మాట.

గమనించండి. అందుచేతనే ఒకో సందర్భంలో... ఒక్కసారిగా అన్ని జిల్లాలలో ఒకే విషయంపైన రచ్చ జరుగుతుంది. అన్ని జిల్లా ఎడిషన్లలో, ప్రధాన వార్తా సంచికలో ఒకే విషయంపై ఫోకస్ చేయబడుతుంది.

ఒక్కోసారి ఆయా న్యూస్ కంట్రిబ్యూటర్లకి, తము ఎవరికి అనుసంధానంగా పని చేయాలని చెప్పబడిందో వారి ద్వారా, తదుపరి రోజుల్లో ఫోకస్ చేయాల్సిన అంశాలు తెలియజేయ బడతాయి. అలాగే... న్యూస్ కంట్రిబ్యూటర్లు, [ఒకోసారి విలేకర్లు కూడా] అప్పుడప్పుడు స్థానిక అధికారుల, రాజకీయ నాయకుల అవినీతి గురించి, ఆయా ప్రాంతాల్లోని ప్రముఖ సంస్థల వ్యాపార అక్రమాలేవైనా ఉంటే వాటి గురించి, వార్తలు సేకరించి పంపిస్తారు. మరో మాటలో చెప్పాలంటే అలాంటివి పంపించవలసిందిగా పైనుండి ఆదేశాలూ రావటంతో అలాంటి వార్తాంశాలు సేకరించి పంపిస్తుంటారు. అయితే పత్రికా యాజమాన్యాలు మాత్రం ఆ అవినీతి వెలికితీత వార్తల్ని అప్పుడే ప్రచురించవు. తమకు ఎప్పుడు కావాలో అప్పుడు ప్రచురిస్తారు.

ఉదాహరణకి మరణించిన వై.యస్., ఇడుపుల పాయలో ప్రభుత్వ భూములు కలిగి ఉన్నాడన్న విషయం, 30 ఏళ్ళ తర్వాత ఈనాడు బయటపెట్టినట్లన్న మాట. అలాగే మరో ఉదాహరణ... తెలుగు పలకల విషయం గుర్తుండే ఉండి ఉంటుంది. స్కూళ్ళల్లో అలాంటి సంఘటనలు నిత్యం జరుగుతూనో ఉంటాయి. అవసరమైనప్పుడు మాత్రం బయటకు వస్తాయన్న మాట. మరో తాజా ఉదాహరణ చెప్పాలంటే మొన్న ఈనాడు, ప్రధాన వార్తగా, "ఆడపడచులకు ఆ ’గర్భ’శోకం" శీర్షిక క్రింద ప్రచురించిన వార్తాంశం లాగన్న మాట. అందులో గుంటూరులోని కార్పోరేట్ ఆసుపత్రులలో, ఆరోగ్యశ్రీ క్రింద చేసిన ఆపరేషన్లలో జరిగిన అవకతవకల గురించి ఫోకస్ చేసారు.

దాన్ని సద్దుమణిగించుకునేందుకు సదరు కార్పోరేటు ఆసుపత్రుల యాజమాన్యాలు మీడియా వారికీ, ఉన్నతాధికారులకీ, రాజకీయ నాయకులకి[అవసరాన్ని బట్టి స్థానికం నుండి మంత్రుల దాకా] డబ్బు పంపకం చేసుకోవాల్సి వస్తుంది. మీడియా సంస్థలు తమకి సొమ్ము అవసరం అయినప్పుడు ఇలా చేస్తుంటాయి. తమ వర్గపు మంత్రుల చేత తమకి కావలసిన పనులు చేయించుకునేందుకు, సదరు మంత్రులని సంతృప్తి పరచవలసినప్పుడు, ఇలా డబ్బు పంపిణీ [Money flow] చేయిస్తారన్న మాట. మామూలు పత్రికల యాజమాన్యాలు ఇదంతా చేయగలిగింది తక్కువ. గూఢచర్యం కూడా నిర్వహించే మీడియా సంస్థలు ఇదంతా తేలిగ్గా నిర్వహించగలవు. అలాంటి సంస్థల అధినేతలే ’కింగ్ మేకర్స్’ గా గుర్తించబడతారు.

దీన్ని మీకు చిన్న పరిమాణంలో చూపిస్తాను. అప్పుడు ఈ స్ట్రాటజీని స్పష్టంగా పరిశీలించడం సాధ్యమవుతుంది. అంతేకాదు, పైన నేను వివరించిన స్ట్రాటజీలని, మీడియా సంస్థల [గూఢచర్యం కూడా నెరిపే మీడియా సంస్థ] తాలూకూ దృష్టాంతపూరిత నిరూపణలని కూడా మీరు పరిశీలించవచ్చు.

శ్రీశైలం చిన్న ఊరు. దేవస్థానం ఉద్యోగులు, ప్రైవేటు వ్వాపారులు, యాత్రికుల సత్రాలూ, అందులో ఉద్యోగులు, వీరందరికి సేవలందించే పనివారు ఉండే చిన్న ఊరు. అయితే వచ్చిపోయే యాత్రికులతో నిత్యం కళకళ లాడే పుణ్యక్షేత్రం. అలాగే దేవాదాయ శాఖకు భారీగా ఆదాయం సమకూరే క్షేత్రం కూడా. శివరాత్రి, ఉగాది వంటి పండగల సందర్భాల్లో భారీగా ఆదాయ వ్యయ లావాదేవీలు నడుస్తాయి. ఇక శ్రీశైలం, సున్నిపెంటకి కలిపి ఈనాడుకి ఒక జర్నలిస్టు ఉన్నాడు. ఇద్దరేసి న్యూస్ కంట్రిబ్యూటర్లున్నారు. ఆంధ్రజ్యోతి, వార్త తదితర సంస్థలకి కూడా ఇలాగే న్యూస్ కంట్రిబ్యూటర్లు ఉన్నారు. శ్రీశైలం చిన్న ఊరైనందున అక్కడి విషయాలు అందరికీ త్వరగా తెలుస్తాయి.

శ్రీశైల దేవస్థానంలో ప్రసాదాల తయారీ పంపిణీ దగ్గరి నుండి దర్శనం టిక్కెట్లు, అభిషేకాది పూజల టిక్కెట్లు, టెంకాయల కాంట్రాక్టుల వేలం, కళ్యాణ కట్ట కాంట్రాక్టు, శిరోజాల కాంట్రాక్టు, కొబ్బరిచిప్పల వేలం, షాపుల వేలం వంటి అనేక వ్యవహారాలు నడుస్తుంటాయి. అందులో కొన్ని కోట్లాది రూపాయల భారీ విలువ కలిగి ఉంటాయి. యధాశక్తి వాటిల్లో అవినీతి కూడా నడుస్తుంటుంది. దేవస్థానానికి పెట్రోలు బంకు కూడా ఉంది. మళ్ళీ శ్రీశైల పర్వతం దిగే వరకూ[ఇటు డోర్నాల దాటే వరకూ, అటు మన్ననూరు వరకూ, అంటే అటు ఇటు దాదాపు 50KM వరకూ] ఎక్కడా పెట్రోలు బంకు లేనందున అక్కడి బంకులో పెట్రోలు, డీజిలు అమ్మకాలు భారీగా ఉంటాయి, వాటితో పాటే అవకతవకలు భారీగా ఉంటాయి. వీటన్నిటిలో పత్రికా విలేఖర్లు అంటే న్యూస్ కంట్రిబ్యూటర్లకు వారి వాటాలు వారికి [అంతో ఇంతో] వస్తుంటాయి.

అంతేగాక, అన్ని పత్రికల న్యూస్ కంట్రిబ్యూటర్ల కంటే ఈనాడు న్యూస్ కంట్రిబ్యూటర్ కు ఎక్కువ పలుకుబడి ఉంటుంది. ఎంత ఎక్కువ అంటే దేవస్థాన ఉద్యోగుల్లో ఈవో వంటి పై అధికారి దగ్గరి నుండి అటెండరు దాకా అన్నిస్థాయిల ఉద్యోగులూ, సదరు ఈనాడు న్యూస్ కంట్రిబ్యూటర్ కి అనుకూలంగా ఉండేంత! గతంలో శ్రీశైల దేవస్థానంలో చిరుద్యోగిగా పనిచేస్తూ, అవినీతిలో పట్టుబడి ఉద్యోగం కోల్పోయిన వ్యక్తి, తర్వాత ఈనాడు న్యూస్ కంట్రిబ్యూటర్ గా రూపాంతరం చెందాడు. ఇతడు శ్రీశైలం గ్రామంలో ప్రముఖవ్యక్తి, పలుకుబడి శక్తి అయిపోయాడు. అతడికీ దేవస్థాన ఈవోకీ మరింత సన్నిహిత సంబంధాలుంటాయి. ఎవరు ఉన్నాసరే! పాత ఈవో బదిలీ అయి కొత్త ఈవో వచ్చినా ఈ బంధం మాత్రం ధృఢమైనది. పరస్పర సహాయ సహకారాలు అనుశృతంగా నడుస్తాయి.

తరచుగా మందుపార్టీలు దేవస్థాన ఈవో,తదితర ఉన్నతోద్యోగులు, ఈనాడు న్యూస్ కంట్రిబ్యూటర్ కు [ఇతర ప్రముఖ పత్రికల కంట్రిబ్యూటర్లకు కూడా] ఇస్తుండే వారు. మందుతోపాటు మనీ కూడా!అదే ప్రజాశక్తి లాంటి చిన్న పత్రికల న్యూస్ కంట్రిబ్యూటర్లకు అంత సీను ఉండదు. మరింకేవో ప్రయోజనాలు కూడా ఇస్తుంటారు. అంటే సదరు ఈనాడు న్యూస్ కంట్రిబ్యూటర్ సిఫార్సు చేసిన వారికి దుకాణాల కాంట్రాక్టు, పారిశుధ్య కాంట్రాక్టు, ఒప్పంద ఉద్యోగాలు ఇవ్వటం, వేరే చోటినుండి దైవదర్శనానికి వచ్చిన న్యూస్ కంట్రిబ్యూటర్ల సంబంధీకులకి ప్రత్యేక దర్శనాలు... వంటివన్న మాట. ప్రతిఫలంగా ఈనాడు కంట్రిబ్యూటర్, సదరు ఈవో కృషి గురించి, దేవాలయ అభివృద్ధికి అతడు చేపడుతున్న పనుల గురించి పాజిటివ్ గా వార్తలు వ్రాస్తుంటాడు. చక్కని ఫోటోలతో కవర్ చేస్తుంటాడు. దేవాలయానికి దైవదర్శనార్ధం ప్రముఖులు వచ్చిన సందర్భాలలో కూడా చక్కని కవరేజి ఇస్తుంటాడు.

ఇవన్నీ, ఓ రకంగా, హైదరాబాదులోని దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయం వారికి, మంత్రి గారి పేషీకి చక్కని సంకేతాలిస్తాయి. "ఓహో! మన వాడు[ఈవో] అక్కడ చాలా చక్కగా మానేజ్ చేస్తున్నాడు" అన్నది అర్ధమైపోతుంది. దాన్ని బట్టి అవకతవకలలోని డబ్బు పంపకాలు జరపబడతాయి. అలాగే ఆయా అధికారుల పదోన్నతలు, బదిలీలు ఉంటాయి. అయితే అప్పుడప్పుడూ కొన్ని అవకతవకలూ, అవినీతి వెలుగు చూస్తుంటాయి. పత్రికల్లో ప్రచురణ అవుతాయి.

అదెలా జరుగుతుందంటే - రాష్ట్ర స్థాయిలో పత్రికాధిపతులకి అవసరంమైనప్పుడు, అవినీతి వెలికితీత అవసరమైనప్పుడు బయటకి వస్తుంటాయి. లేదా భక్తులు పెద్ద ఎత్తున గొడవ చేసినప్పుడు అవినీతి బయటకు వస్తుందన్న మాట. మరి ప్రజలలో పత్రికలు పలచన కాకూడదు కదా? ఎప్పటికప్పుడు న్యూస్ కంట్రిబ్యూటర్లకి దేవాలయంలో జరిగే అవకతవకల గురించి సమాచారం ఉంటుంది. అది పైకీ పంపుతుంటారు. [ఈ న్యూస్ కంట్రిబ్యూటర్లు సమాచారం పైకి పంపక పోయినా, పత్రికా యాజమాన్యానికి తెలుస్తుంది. అప్పుడు సదరు స్థానిక న్యూస్ కంట్రిబ్యూటర్లకి ఉద్యోగ ఉద్వాసన ఏర్పడుతుంది. కాబట్టి బుద్దిగా పంపిస్తుంటారు.] అయితే ప్రచురణ కోసం కాదు. కేవలం సమాచారం కోసం మాత్రమే. ఒక్కోసారి పైకి పంపకుండా తమ వద్దే ఉంచుకొని, పై నుండి ఆదేశాలు వచ్చినప్పుడు పంపిస్తుంటారు. వెరసి యాజమాన్యం, ఎప్పుడు తాము సదరు అవినీతి అవకతవకల గురించి ప్రచురించ దలుచుకుందో, అప్పుడన్న మాట.

ఇందులో గమనించాల్సిన అంశం ఏమిటంటే, అలాంటి సందర్భాలలో సదరు వార్తాంశం స్థానిక న్యూస్ కంట్రిబ్యూటర్ పేరిట, అతడు పంపితే ప్రచురింపబడినట్లుగా ఉండదు. జిల్లా కేంద్రం నుండో, ప్రాంతీయ[జోనల్] కేంద్రం నుండో ప్రత్యేక కవరేజి అయినట్లుగా ప్రచురింపబడుతుంది. "ఇదేమిటయ్యా?" అని దేవాలయాధికారి అడిగాడను కొండి. "ఏం చేస్తాం సార్! ఈ వార్త నేను పంపలేదు. పైనుండి వాళ్ళే వేసుకున్నారు" అన్న జవాబు స్థానిక న్యూస్ కంట్రిబ్యూటర్ ఇస్తాడు. "వాళ్ళకెలా తెలుస్తాయి ఇక్కడి విషయాలు?" అంటే "భలే వాళ్ళు సార్! మేము మాత్రమేనా? వాళ్ళ సోర్సులు వాళ్ళకుంటాయి సార్!" అని చెప్తారు.

వెరసి ’కర్ర విరగ కూడదు పాము చావకూడదు’ అన్నట్లు వ్యవహారం నడుస్తుంది. స్థానిక న్యూస్ కంట్రిబ్యూటర్లకూ, అధికారులకూ మధ్య సంబంధాలు చెడకుండా, ఇదంతా నేర్పుగా చక్కగా నిర్వహించబడుతుంది. ఏ డిపార్డుమెంట్ కథ అయినా, ఏ ఊరిలో అయినా, ఏ పత్రికా విలేఖరి కథ/న్యూస్ కంట్రిబ్యూటర్ కథ అయినా ఇంతే!
ఇంకా...
మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

వేణుగోపాల్ రెడ్డి మరణం ఆత్మహత్య అయ్యే అవకాశం ఎంత?

1]. ఉద్రేకం, ఉద్వేగం... నేతల ఉపన్యాసాలు, స్నేహితులతో చర్చలు కలిగించిన వేడి, [స్ఫూర్తి అనకూడదేమో. విధ్వంసం వైపు మళ్ళించే దాన్ని స్ఫూర్తి అనకూడదు కదా! ఆత్మహత్య విధ్వంసమే]... ఒంటరిగా కూర్చొని, రాత్రివేళ చదువుకుంటున్న పిల్లవాడిలో ఒక్కసారిగా ఉధృతమైన భావాల ఒత్తిడి కలిగితే ఆత్మహత్యకు పాల్పడ వచ్చేమో! అయితే అందుకోసం ముందుగానే పెట్రోలు లేదా కిరోసిన్ సమకూర్చుకొని ఉంటే మాత్రం[ఒంటరిగా?] ఆత్మహత్య చేసుకోవాలని కొన్నిగంటల ముందే నిర్ణయించుకుని ఉండాలి. లేదా ద్విచక్ర వాహనం లాంటిది ఏదైనా వాడుతుంటే దాన్లోని ఇంధనాన్ని తీసుకొని, ఒంటి మీద చల్లుకుని నిప్పంటించుకుని ఉండాలి. అయితే వాహనం అతడి ప్రక్కన ఉన్నట్లుగా ఇంత వరకూ ఏ వార్తల్లోనూ రాలేదు.

2]. ఏదేమైనా... వేణుగోపాల్ రెడ్డి ఉద్రికత్తకీ, ఉద్విగ్నతకీ, గురై రాష్ట్రసాధన కోసం ఆత్మహత్య చేసుకుని ఉండాలి.

నల్లని వన్ని నీళ్ళనీ, తెల్లని వన్ని పాలనీ అనుకోవడం తప్పితే, కనబడేదంతా నిజం కాదనీ, కనబడనిదంతా అబద్దమూ కాదని తెలియని పిల్లలు! నిండా పాతికేళ్ళు లేని, జీవితపు తొలిదశలో ఉన్న యువకులు, విద్యార్ధులు! రాష్ట్ర సాధన కోసమైనా సరే... ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? నాయకులు ’తెలంగాణా కు వ్యతిరేకంగా మాట్లాడితే నాలుకలు కోస్తాం’, ’తెలంగాణా కోసం తలలు నరుక్కుంటాం’ అంటూ హింసాత్మక వ్యాఖ్యానాలు, రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తే పర్యవసానం ఇలాగే ఉంటుంది. ఇలాంటి ఉద్రేకపూరిత ప్రసంగాలు చేసే కేసీఆర్ ని, తెలంగాణా సాధించేసాడనుకొన్న డిసెంబరు 9,10 తేదీలలో ’తెలంగాణా గాంధీ కేసీఆర్’ అన్న అనుచర నాయకులనీ, దానికి ప్రచారమిచ్చిన మీడియాని, సోనియా పుట్టిన రోజు కానుకగా ’తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు షురూ’ అంటూ ప్రకటనలిచ్చిన యూపీఏ ప్రభుత్వాన్ని , ముందస్తు దోషులుగా, విద్యార్ధి హంతకులుగా నిర్ధారించాలి.

ఒక్క హింసాత్మక సంఘటన జరిగినా, అప్పటికి ఉధృతంగా నడుస్తున్న స్వాతంత్ర సమరాన్ని ఆపివేసిన బాపూజీ ఎక్కడ? కేసీఆర్ ఎక్కడ? అహింసామూర్తి గాంధీజీని, ’తలలు నరక్కుంటాం, నాలుకలు కోస్తాం’ అంటూ నిరంతరం హింసని ప్రేరేపించే కేసీఆర్ తో పోల్చటం, ప్రచారించటం ఖచ్చితంగా మీడియా చేసిన నేరమే.

ఆంధ్రా పాలకులు, అదేదో బ్రిటీషు పాలకులు అన్నట్లు తమని దోచేస్తున్నారని, దగా చేస్తున్నారని పదేపదే అరుస్తూ వైషమ్యాలని రెచ్చగొట్టిన పరిణామం ఇది. చంద్రబాబుకి జేజేలు కొట్టిన కేసీఆర్, ఇప్పుడు ఇటలీ నాయికకి మోకరిల్లుతున్న కేసీఆర్, శతాబ్దాలుగా తెలంగాణాని అణిచివేసిన, నగ్నంగా హిందూ మహిళలని బతుకమ్మ ఆడించిన నిజాం నవాబులని ’మా నిజాం మాకు గొప్ప’ అనే కేసీఆర్, అతడి వాదనలని కొనసాగిస్తూ కోదండరాం లూ, రాంరెడ్డి దామోదర్ రెడ్డిలూ చేస్తున్న వాదనలలోని లొసుగులని తర్వాత పరిశీలిద్దాం.

వెరసి నాయకులు ఉద్రేకాలని, విద్వేషాలని ప్రేరేపించే ప్రకటనలు గుప్పిస్తే..., విద్యార్ధులని, యువకులని అహింసాపూరిత, స్ఫూర్తిదాయక ఉద్యమ బాటలో నడపటం గాకుండా హింసామార్గంలోకి మళ్ళిస్తే... జరిగేది విధ్వంసమే. ఆత్మహత్యలు వ్యక్తి హింసకూ, వ్యక్తిగత విధ్వంసానికి మరో రూపాలే!

శాస్త్రీయంగా చూసినా... మనిషి సంఘజీవి. నలుగురు నవ్వితే అప్రయత్నంగా చూస్తున్న వారిలో నవ్వురావటం, సమూహంలో ఉంటే ఒకే భావోద్వేగం వేగంగా అందరిలో విస్తరించటం సహజం. ’మాస్ హిస్టీరియా’గా ఒకప్పుడు మీడియా దీన్ని తెగ ప్రచారించింది కూడా! టీవిలో [అప్పటికి ప్రైవేటు ఛానెళ్ళు రాలేదు] డాక్యుమెంటరీలు కూడా ప్రసారమయ్యాయి. గ్రామీణ మహిళలు బాణామతి, మంత్రతంత్రాల భయంతో మూకుమ్మడిగా నేలపై బడిదొర్లటం వంటి మానసిక రుగ్మతల గురించి అప్పట్లో తెగ ప్రచారాలు నడిచాయి. మరీ ముఖ్యంగా దైవభక్తి విషయంలో, ఈ మాస్ హిస్టీరియా గురించి ప్రచారిస్తూ, మీడియా, ’ఈ ఉద్రేకం ఉన్మాదంగా రూపదిద్దుకొని, సామూహిక ఆత్మహత్యల దాకా పోతుందని’ కూడా అప్పట్లో వ్రాసింది.

అందులో నిజానిజాలు ఎంత ఉన్నా, సమూహంలో ఉన్నప్పుడు ఒకే భావోద్వేగం వేగంగా అందరిలోనూ విస్తరించేంత సంఘజీవి మనిషి - అన్నది మాత్రం అనుభవైక సత్యం!

నేతల రెచ్చగొట్టే ప్రసంగాలు, విశ్వవిద్యాలయ ఆవరణలో నెలకొన్న ఉద్రికత్తలూ పిల్లల్ని ఆత్మహత్యల వైపు పురికొల్పి ఉండవచ్చు. అదే ఉద్రేకం, క్రమంగా ఎక్కువ మందిని ఆక్రమించి ఆత్మహత్యల పరంపరకు పురికొల్పి ఉండవచ్చు. ఫలితం?... జీవితంలో ఇంకా ఏదీ అనుభవించని పిల్లలు పిట్టల్లా రాలిపోయారు. అవటానికి ఇవి ఆత్మహత్య కావచ్చు, రెచ్చగొట్టే వాదనలతో విద్యార్ధులని ఉద్రేక పరిచిన నాయకులూ, వాటిని ప్రచారం చేసిన వార్తా సంస్థలూ నిజమైన హంతకులు అని చెప్పాలి.

అయితే ఈ విషయానికి మరో కోణం కూడా ఉంది. మొన్న వై.యస్. మరణించినప్పుడు, రాష్ట్రంలో ఎవరు ఎక్కడ మరణించినా, మీడియా జాబితాలో అభిమానుల మరణంగా నమోదయ్యింది. క్రికెట్ స్కోరు స్థాయిలో రోజువారీ స్కోరు పత్రికలలో ప్రచారించబడింది. తీరా వై.యస్. కుమారుడు జగన్, తన తండ్రి అభిమానుల అత్మహత్యల పట్ల స్పందనగా, మృతుల కుటుంబాలని పరామర్శిస్తాననే సరికి... అప్పటికి మారిన రాజకీయ నేపధ్యాల దృష్ట్యా [ఈ పరిస్థితుల గురించి జగన్ శిబిరానికీ, కాంగ్రెస్ అధిష్టానానికి మధ్య అంతర్లీన పోరు టపాలలో వివరించాను] మీడియా, అప్పుడు బైటపెట్టిన వాస్తవం ఏమిటంటే - ఎడాపెడా, సహజ మరణాలని కూడా, అభిమానుల మృతి ఖాతాలోకి జమ చేసారని! అసలు టీవీ కూడా లేని వారు సైతం టీవిలో వార్తలు చూసి వత్తిడికి గురై, గుండె ఆగి మరణించినట్లుగా చెప్పబడిందని. [జగన్ పరామర్శల పాదయాత్ర మానుకోవటానికి ఇది కూడా ఒక కారణం.]

అదే మోస్తరులో... ఇప్పుడు సైతం... మీడియా... వ్యక్తిగత, ఇతర కారణాలతో మరణించిన విద్యార్ధుల వివరాలని కూడా ’తెలంగాణా కోసం ఆత్మహత్యల’ ఖాతాలో వేయటం లేదని గ్యారంటీ ఏమిటి? ఎందుకంటే - నిన్నమొన్న, వరదలొచ్చి, పూచికపుల్లతో సహా కొట్టుకుపోయిన కర్నూలు వరదబాధితులు, చిల్లుల గుడారాల్లో చలికి గజగజ లాడుతూ అయినా బ్రతుకు పోరాటం సాగిస్తున్నారే కానీ, నెలకి 200/- రూ. ల పింఛను రాదనే బెంగతోనూ, పింఛను ఇచ్చే ’దేవుడు వై.యస్.’ మరణించాడన్న బాధతోనూ, ఆత్మహత్యలు చేసుకున్న అభిమానుల్లాగా ప్రాణాలు తీసుకోలేదు. వాళ్ళు వీళ్ళు చేసిన, చేస్తున్న సాయంతోనే జీవనపోరాటం చేస్తున్నారు. అదీ జీవితంలోని వాస్తవికత! వై.యస్. మరణిస్తే అతడి కుటుంబ సభ్యులలోగానీ, బంధుమిత్రులలోగానీ ఎవరూ, కనీసం ఆసుపత్రిపాలుకూడా కాలేదు. అదీ జీవితంలోని వాస్తవికత!

అలనాడు దేశ స్వాతంత్ర సాధనకో, రాష్ట్ర సాధనకో కొందరు మహానుభావులు ప్రాణాలు ధారపోసారంటే - వారు ఉరిపోసుకునో, పెట్రోలు లేదా కిరోసిన్ ఒంటి మీద పోసుకునో చచ్చిపోలేదు. పోరాడి అసువులు బాసారు. అల్లూరి సీతారామరాజులాగానో లేక పొట్టి శ్రీరాములులాగానో! అంతే తప్ప ఆత్మహత్యలు చేసుకోలేదు.

కాబట్టి, ఎలా చూసినా ’అమాయక విద్యార్ధుల ఆత్మహత్యలు స్వార్ధ రాజకీయ నాయకుల చేతుల్లోని సమిధలు!’ అని చెప్పక తప్పదు. ఒక్కసారిగా వేణుగోపాల్ రెడ్డి మరణంతో వేడెక్కిన తెలంగాణా ఉద్యమం, నాలుగురోజులు తిరిగేసరికి జేఏసీల్లో ముసలం... రాజకీయ నాయకుల రాజీనామాల సాగతీత... పరస్పర నిందారోపణలు... తగవులతో... మెల్లిగా... ఎలా రూపం మారుతోందో ఇప్పడందరమూ నోరెళ్ళబెట్టి చూస్తున్నదే!

నిజానికి బారత స్వాతంత్ర సమరం సైతం, దశాబ్ధాల తరబడి, స్వాతంత్ర సమర యోధుల మధ్య ఐక్యతని దెబ్బతీస్తూ, వైషమ్యాలు రేగటం, అతివాదులూ మిత వాదులుగా నాటి స్వాతంత్ర పోరాటయోధులు విడిపోవటం... పరస్పర విమర్శలూ.. గట్రాలతో దేశ స్వాతంత్రసాధన ఏళ్ళుపూళ్ళు పట్టింది. భారత స్వాతంత్ర సాధన సుదీర్ఘకాలం పట్టటానికి గల అనేక కారణాలలో ఇదీ ఒకటి. దీని వెనక ఉన్నది నకిలీ కణిక వంశీయుల గూఢచర్యమే. అప్పటికి బ్రిటీషు వారి వెనుక చేరింది వారే!

అయితే తర్వాతి రోజుల్లో, దానికి బాపూజీని బాధ్యుణ్ణి చేసి ’గాంధీని తిట్టడం’ యువతరానికి ఫ్యాషన్ గా మారింది. అలా యువతరాన్ని మీడియా ఏమార్చింది. కాకపోతే, అప్పటికీ ఇప్పటికీ ఒకటే తేడా! నాటి స్వాతంత్ర సమరంలో అత్యధికులు నిస్వార్ధపరులు, నేటి తెలంగాణా పోరాట ఉద్యమంలో అత్యధికులు స్వార్ధపరులు. అంతే వ్యత్యాసం! నాడు నేడు ప్రయోగింపబడిన, బడుతున్న తంత్రం మాత్రం ఒకటే.[ఎందుకంటే నకిలీ కణికులకి తెలిసింది పదే స్ట్రాటజీలు గనుక.]

ఈ విధంగా... మెల్లిగా... తెలంగాణా ఉద్యమాన్ని, ’నేతల మధ్య అనైక్యత, పరస్పర నిందారోపణలు, అంతర్గత కలహాలు’ అనే పైకారణం[over leaf reasons]తో నీరుగార్చే ప్రయత్నం, సాగదీసే ప్రయత్నం ఈ సరికే ప్రారంభం కావటం కళ్ళముందున్నదే!

అటువంటప్పుడు... వేణుగోపాల్ రెడ్డి అనే విద్యార్ధి బలిదానం, ఆపై వరుసగా విద్యార్ధుల ఆత్మహత్యలతో ఒక్కసారిగా ఉద్యమం ఉవ్వెత్తున ఎందుకు ఎగిసి పడింది? నాలుగురోజులు గడిచే సరికి మళ్ళీ ఎందుకు మెల్లిగా చప్పబడే, సాగదీసే దిశలో ప్రయాణిస్తోంది? చల్లబడిన ఉద్యమాన్ని మళ్ళీ భగ్గుమనిపించేందుకే బలిదానాలు జరిగినట్లయితే ఆ మంట అలా ఉధృతంగా సాగుతూనే ఉండేది. నాయకులూ, మీడియా ఆ దిశలోనే ఉండేవాళ్ళు. ఆపకుండా ఆత్మహత్యల గురించే అరిచేవాళ్ళు.

అంతేగానీ - జేఏసీలో కాంగ్రెస్ ఉంటుంది, ఉండదు, ’తెలంగాణా ధూం ధాంలకు మేమే పైసలు ఖర్చుపెడుతుంటే, మమ్మల్నే తెరాస విమర్శించటమా’ అంటూ కాంగ్రెస్ అలకల లేఖలూ గట్రాలు జరగవు, జరిగినా మీడియా దాన్ని ప్రచారించకుండా దొర్లించేస్తుంది. అంతేగాక ఉద్యమం అన్న తరువాత ఆపాటి గొడవలు మామూలే అన్నట్లు మీడియా, రాజకీయ పార్టీలు ప్రచారించేవి. అలాగ్గాక, ఉద్యమం మళ్ళీ చప్పబడేవిధంగా ఎందుకు నడిపింపబడుతోంది? అంటే కేవలం కొన్నిరోజుల గల్లంతుకోసం విద్యార్ధుల ఆత్మహత్యల ఉపయోగపడ్డాయన్న మాట! ఎందుకలా?

ఈ ప్రశ్నకు జవాబు పరిశీలిస్తే... మన కళ్ళెదుట నిలబడే సత్యం కడు కఠోరమైనది, పరమ విభ్రాంతి కరమైనది!

తర్వాత తాము వెల్లడించబోయే, వై.యస్. హెలికాప్టర్ ప్రయాణంపై నివేదిక, సివిఆర్ సంభాషణల వివరాలలోని అవకతవకల నుండి ప్రజల దృష్టిని హైజాక్ [హైసరబజ్జా] చేయటానికి, విద్యార్ధుల బలిదానాలతో తెలంగాణా ఉద్యమం మరోసారి భగ్గుమనిపించబడింది. అంతే! కావాలంటే పరిశీలించండి.

జనవరి 18 వ తేదీ అర్ధరాత్రి దాటాక వేణుగోపాల్ రెడ్డి ఆత్మహుతి చేసుకున్నాడు. ఆ విషయం తెల్లవారు ఝామున వెలుగులోకి వచ్చింది. అప్పటికే పత్రికలు పాఠకుల చేతుల్లోకి వచ్చేసాయి. 19వ తేదీ టీవీలలో ఈ విషయం ప్రచారమయ్యింది. తర్వాత అంటే 20వ తేదీ, 21వ తేదీ పత్రికలలో పతాక శీర్షికలుగా విద్యార్ధి బలిదానం, తెలంగాణా ఉద్రిక్తత, ఉద్యమ ఉధృతుల గురించి వార్తలొచ్చాయి.

దీనికి సమాంతరంగా... 18వ తేదీ నాటి పత్రికల్లో 2009 సెప్టెంబరు2వ తేదీ వై.యస్. హెలికాప్టర్ ప్రమాదం గురించి, ఆర్.కె.త్యాగి అధ్యక్షతన గల డీజీసీఏ కమిటీ నివేదిక 15వ తేదీనే ప్రభుత్వానికి సమర్పించించారనీ, రెండ్రోజుల్లో వెల్లడి కావచ్చనీ ’తెలిసిందీ, సమాచారం’ తరహా వార్తలు వచ్చాయి. తదుపరి 21,22,23 తేదీలలో, పౌరవిమానయాన శాఖ అధికారిక వెబ్ సైట్ లో, డీజీసీఏ ఇచ్చిన నివేదిక ఉంచబడింది. ఇక అందులో చాలా అవకతవకలున్నాయని సాక్షి ఘొల్లుమంది.

సరిగ్గా... వై.యస్. మరణానికి సంబంధించిన డీజీసీఏ నివేదిక, అప్పటికి ఎన్నో సందేహాలున్న కాక్ పిట్ వాయిస్ రికార్డర్ లోని సంభాషణ గురించిన వివరాలని ప్రకటించాల్సిన సమయంలో....

అప్పటికే మెల్లిగా చల్లబడిన తెలంగాణా ఉద్యమం, విద్యార్ధుల బలిదానంతో మరోసారి ప్రజ్వరిల్లింది. మళ్ళీ మామూలుగా చల్లబడే దిశలో, సాగతీత దిశలో ప్రయాణిస్తోంది.

ఈ హైజాక్ కు ముందస్తు ప్రాతిపదికగా... ఈ నెల 7 వ తేదీన, ఎప్పుడో 2009 సెప్టెంబరు 2వ తేదీ వై.యస్. హెలికాప్టర్ ప్రమాదం జరిగిన మర్నాడే [సెప్టెంబరు 3వ తేదీనే] ఎక్కడో ఓ ఆన్ లైన్ పత్రిక ఎగ్జయిల్డ్... వై.యస్. హెలికాప్టర్ ప్రమాదానికీ, రిలయన్స్ అధినేట ముఖేష్ అంబానీ & వై.యస్.ల మధ్య చోటుచేసుకున్నKG బేసిన్ గ్యాస్ కేటాయింపు చర్చకీ సంబంధాన్ని ఊహిస్తూ, ఉటంకించిన వార్తని హఠాత్తుగా టీవీ5 ప్రచారించింది. గంటల వ్యవధిలో రాష్ట్రంలో రిలయన్స్ ఆస్థులపై దాడులు జరిగాయి. ఆపైన చాలా హడావుడీ జరిగింది. [ఇదంతా గత టపాలలో వివరించాను.]

అయితే ఈ సంఘటనలో తెర వెనుక కథ ఏమిటంటే - ఇప్పటికే నకిలీ కణిక వ్యవస్థకీ, నెం.10 వర్గానికీ, అందులోని కీలక వ్యక్తులైన రామోజీరావు, సోనియాలకి రాజకీయ నాయకుల మీద పట్టు కొంత సడలింది. అలాగే పోటీ వార్తాసంస్థల మీదా పట్టుసడలింది. ’పైసలే పరమావధి అని తాము నేర్పిన విద్యనే, ఇప్పుడు తమ అనుచర బానిస రాజకీయ నాయకులూ, అనుచర బానిస వార్తాసంస్థలూ, తిరిగి తమ మీదనే ప్రదర్శించటం’ నకిలీ కణిక వ్యవస్థకీ, నెం.10 వర్గానికీ పెనుకష్టంగా తయారయ్యింది. దాన్ని బ్యాలెన్స్ చేసే విన్యాసాలే ఇప్పుడు రకరకాల పైకారణాలతో[over leaf reasons తో] మన ముందు ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శింపబడుతున్నాయి.

ఈ నేపధ్యంలో, ఎవరి స్వార్ధం కోసం వారు [రాజకీయ నాయకులు తమ కెరీర్, ఇమేజ్, వ్యాపారాల కోసం, మీడియా సంస్థలు తమ రేటింగ్స్, తద్వారా వ్యాపారాల కోసం], ఎవరి అవగాహనా అవకాశాలని బట్టి వారు, తోకలు ఝాడిస్తున్నారు.

దాంతో, వై.యస్. మరణంపై, సీవీఆర్ సంభాషణలపై, డీజీసీఏ నివేదికలోని అవకతవకల గురించి ఆయా వార్తా సంస్థలు, ర్యాంకింగ్ పోటిల్లో పడి సంచలన ప్రచారం నిర్వహిస్తే... నిభాయించుకోవడం తమకి మరింత కష్టం. అందుకే ముందస్తు ’బెత్తం’గా ఎగ్జల్డ్ గందరగోళం నడపబడింది. ఉత్సాహం కొద్దీ దాన్ని ప్రచారించిన టీవీ5[దెబ్బలబ్బాయన్నమాట] వంటి సంస్థలూ, సంపాదకాది ఉద్యోగులూ న్యాయపరమైన కేసులు ఎదుర్కొన్నారు. జైళ్ళూ,బెయిళ్ళూ అనుభవించారు. ఏ విషయం నిర్ధారణగా తేలే వరకూ వై.యస్. మరణం పై ఎలాంటి వార్తలూ ప్రచారం చేయకూడదన్న షరుతులకు లోబడటం అనివార్యమైంది.

దెబ్బతో... తదుపరి వై.యస్. మృతి వ్యవహారంలో సాక్షి దినపత్రికది ఒంటరి గళం అయ్యింది. అదీ ’విభజించి’ వ్యవహారం నడిపింపబడిన తీరు! [ఎగ్జయిల్డ్ ప్రకరణం జరగనట్లయితే, ఈ పాటికి టీవీ ఛానెళ్ళన్నీ వేణుగోపాల్ రెడ్డి మృతి మీదా, డీజీసీఏ నివేదిక మీదా, రోజుల తరబడి ఎడతెగని చర్చోపచర్చలూ, సమీక్షలూ, వాదప్రతివాదనలూ ప్రసారం చేస్తూ ఉండి ఉండేవి.]

ఆ తర్వాత డీజీసీఏ నివేదిక బయటకి వచ్చింది. సాక్షి పత్రిక ఆ నివేదికలోని లొసుగుల గురించి ప్రచురిస్తూనే ఉంది. పెద్దగీత ముందు చిన్నగీతలాగా, తెలంగాణా ఉద్యమ బలిదాన భావోద్వేగ ప్రచారం ముందు, వై.యస్.మృతికి సంబంధించిన నివేదిక చిన్నదయ్యింది. ఇంకా ’సీబిఐ దర్యాప్తు నివేదిక రావాల్సి ఉంది’ అంటూ కొత్తపాట కూడా మొదలపెట్టబడింది. మరికొన్ని నెలలు గడుస్తాయి. సీబిఐ నివేదిక బయటికి వచ్చేనాటికి మరో సంచలనపు హైజాక్ సృష్టిస్తే సరిపోతుంది. ఎటూ ఈ హైజాక్ లతో మీడియా ఎలా తీసుకెత్తే అలా ప్రయాణించటం ప్రజలకి అలవాటయిపోయింది కదా!

వెరసి, మొత్తం విషయం పరిశీలిస్తే... మీడియా, కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు, అన్నిరాజకీయ పార్టీల నాయకులు కలిసి ఒక విషయాన్ని ఎలా హైజాక్ చేయవచ్చో చూపించారు. ఇక్కడ తెలియటం లేదా అందరూ ఒకే వ్యవస్థ క్రింద పని చేస్తున్న విషయం.

నిజానికి డీజీసీఏ నివేదికలోని సాంకేతిక అంశాలని ప్రక్కన బెట్టినా, సామాన్యుల లోకజ్ఞానానికి సైతం కనబడే అవకతవకలు చాలానే ఉన్నాయి.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

ముందుగా నేను ఓ విషయం స్పష్టం చేయదలుచుకున్నానండి. తెలంగాణా ఉద్యమ నాయకులైన కేసీఆర్ లని, నాగం జనార్ధన రెడ్డిలని, రాంరెడ్డి దామోదర రెడ్డిలని విమర్శిస్తున్నానంటే - దాని అర్ధం నేను లగడపాటి రాజగోపాల్ నో, జగన్ నో, పయ్యావుల కేశవ్ నో లేక అలాంటి సమైక్య ఉద్యమ నాయకులనో సమర్ధిస్తున్నానని కాదు.

ప్రస్తుతం ఏ పార్టీలో అయినా నిస్వార్ధ నాయకులు ఉన్నారని అనుకోవటం కష్టం. ’ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా, మంచివాళ్ళనంతా ఎప్పుడో తరిమి వేసారు’ అన్నది పచ్చినిజం. ఏ రాయి అయినా ఒకటే పళ్ళూడగొట్టేందుకు అన్నది, రాజకీయ నాయకుల గురించి నా నిశ్చితాభిప్రాయం. ఇది దృష్టిలో ఉంచుకుని నా విశ్లేషణని పరిశీలించగలరు.

~~~~~~~~~~~~~ ~~~~~~~~~~~~~~~ ~~~~~~~~~~~~~~

జనవరి 5న అఖిల పక్ష సమావేశం తర్వాత, నార్త్ బ్లాక్ లోపల ఏమేం చర్చించారో గానీ, తర్వాత రోజున గృహమంత్రి చిదంబరంతో విడివిడిగా ప్రరాపా, తెదేపా, తెరాసా, ఎంఐఎం గట్రా అన్నిపార్టీల ప్రతినిధులూ సమావేశం అయ్యారు. గృహ మంత్రితో ప్రత్యేక సమావేశాల తర్వాత ఎర్రపార్టీ వాళ్ళు, ప్రరాపా, తెదేపా వాళ్ళు ఢిల్లీ నుండి తిరిగి వచ్చేసారు. తెరాస సిద్దాంతకర్త జయశంకర్, రాద్దాంతకర్త కేసీఆర్ మాత్రం, ఢిల్లీలోనే పలువురు నాయకులని కలుస్తూ మంతనాలు జరుపుతూ వ్యూహాత్మక మౌనం అంటూ ప్రకటనలు గుప్పిస్తూ దాదాపు వారం రోజులు గడిపారు.

’జనవరి 5న తెలంగాణా ప్రకటన రాకపోతే ప్రళయమే, అగ్నిగుండమే, విధ్వంసమే’ గట్రా ప్రకటనలతో హోరుమంటూ జనవరి 3వ తేదీనే ఢిల్లీ వెళ్ళిన తెరాస నాయకుడు కేసీఆర్, దాదాపుగా బోరుమంటూ జనవరి 12న హైదరాబాదుకు తిరిగి వచ్చాడు. తనది వ్యూహాత్మక వ్యవహారసరళి/మౌనం అంటూ జేఏసీ ప్రక్కనా, దాదాపు రాంరెడ్డి దామోదర రెడ్డి, జాక్ కన్వీనర్ కోదండరాం ల వెనకాల ఉంటూ.... సంయుక్త ప్రకటనలూ, సమావేశాలూ నిర్వహిస్తున్నాడు.

ఇక శాంతి ర్యాలీలు మొదలయ్యాయి. తెలంగాణా ఇవ్వకుంటే అగ్నిగుండమే/ ప్రళయమే అన్న విద్యార్ధుల జేఏసీ, ఏమి చెప్పబడిందో గానీ, పరీక్షల తర్వాత తిరిగి ఉద్యమిస్తాం అన్నారు. ఆ తర్వాత కేసీఅర్ మేనల్లుడు హరీష్ రావు ప్రైవేటు విద్యాసంస్థల నుండీ, కుమార్తె కవిత సినిమా వారి నుండి భారీగా పైసల వసూళ్ళ కోసం బెదిరింపులు చేస్తున్నారనే మాట బయటకి వచ్చింది. ఈ లోపులో తెరాస సిద్దాంతకర్త జయశంకర్, క్రమంగా వార్తల్లో కనబడటం, వినబడటం మానేసాడు. తెలంగాణా ప్రాంతంలో, జంటనగరాల్లో, కేసీఆర్ కుటుంబసభ్యుల దందా గురించి ఓ ప్రక్క... కాంగ్రెస్ లోని, తెలంగాణా ఎంఎల్ఏలూ, మంత్రుల గురించి పార్టీ అంతర్గత వ్యవహారాలు[రాజీనామాలు వగైరా] ఓ ప్రక్క నడుస్తుండగా... మెల్లిగా శాంతియాత్రలూ నడుస్తూ... పరిస్థితి క్రమంగా చల్లబడుతుందేమో అన్పించే దశకు చేరింది.

హఠాత్తుగా జనవరి 18, సోమవారం రాత్రి, వేణుగోపాల్ రెడ్డి అనే ఎంసీఏ విద్యార్ధి ఆత్మహత్య కథనం, మృత శరీరంతో పరిస్థితి ఒక్కసారిగా భగ్గుమంది. అతడు బలిదానమే చేశాడో, బలి పశువే అయ్యాడో ఏదీ తేలకముందే... మీడియా, నాయకులూ కూడా హడావుడీగా ఆ సంఘటనని దొర్లించి తదుపరి చర్యల్ని వేగవంతం చేశారు. పరంపరగా విద్యార్ధుల ఆత్మహత్యలు ప్రారంభమయ్యాయి.

తరచి చూస్తే....

ప్రశాంతమైన కొలనులోకి - ’తెలంగాణా కోసం కేసీఆర్ దీక్ష’, ’రాష్ట్రప్రక్రియ షురూ’ ప్రకటన, గట్రా వరుసరాళ్ళలో మరో రాయి వేణుగోపాల్ రెడ్డి మరణం! అతడిది బలిదానమా, లేక అతడు బలిపశువా? అతడి మరణం ఆత్మాహత్యా లేక హత్యా? విద్యార్ధుల ఆత్మహత్యల పరంపరను వేగవంతం చేసిన ఈ సంఘటనలో నిజంగా ఏం జరిగి ఉంటుంది?

మీడియా కథనం ప్రకారం....

సూర్యాపేట మండలం దోసపహాడ్ గ్రామం నుండి జంటనగరాలకి వచ్చి నాచారంలో నివసిస్తోన్న కోటిరెడ్డి దంపతుల రెండో కుమారుడు వేణుగోపాల్ రెడ్డి. అన్న శ్రీనివాసరెడ్డి పరిశోధన విద్యార్ధి. వేణుగోపాల్ రెడ్డి చదువుల్లో చురుకైన వాడని, అందరితో కలిసిపోయే వాడనీ అతడి సహచర విద్యార్ధుల భోగట్టా. కమ్యూనిషన్ సిల్క్స్ ఎక్కువని కాలేజీ వాళ్ళ ఉవాచ. సున్నిత మనస్కుడనీ, తెలంగాణా గురించి తెగ చర్చించేవాడని, తరచూ ’తెలంగాణా వస్తుందా? రాదా?’ అని ప్రశ్నించే వాడనీ అతడి అన్న శ్రీనివాసరెడ్డి చెప్పాడట. ఇటీవల క్యాంపస్ ఇంటర్యూలలొ మహేంద్ర సత్యం కంపెనీలో ఉద్యోగం కూడా పొందాడు. తండ్రి నిజాం నవాబుకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడు.

ఇక సంఘటన పూర్వాపరాలివి.... తరచు క్యాంపస్ లాండ్ స్కేప్ లో కూర్చొని చదువుకోవటం అతడి అలవాటు. జనవరి 18 రాత్రి కూడా అలాగే వెళ్ళాడట. సాయంత్రం నాలుగు గంటలకి ఫోన్ చేసిన అన్నకి ఠాగూర్ ఆడిటోరియం సమీపంలో చదువుకుంటున్నానని చెప్పాడట. తర్వాత ఫోన్ చేస్తే[సమయం ఉటంకించబడలేదు] ఫోన్ తీయలేదట. తెల్లవారేసరికి కాలి శవమై కన్పించాడు. అతడి అన్న రాత్రి వచ్చి వెదికాడని ఓ పత్రిక, తెల్లవారు జామున వెదకటానికి వచ్చి తమ్ముడి శవం చూసాడని ఓ పత్రిక వ్రాసింది. ప్రక్కనే ఉన్న బ్యాగ్ లో స్వదస్తూరితో ’జై తెలంగాణా! తెలంగాణా రాదని చనిపోతున్నాను. సోనియా గాంధీ... తెలంగాణా ఇవ్వు’ [సోనియమ్మ అని ఓ పత్రిక, సోనియా గాంధీ అని మరో పత్రిక, సోనియా గాంధీ గారు అనీ మరో పత్రిక వ్రాసాయి.] అని వ్రాసిన సూసైడ్ నోట్ ఉందని వార్తలొచ్చాయి.

అయితే... వేణుగోపాల్ రెడ్డిది ’హత్య’ అయ్యే అవకాశం ఎంత?

1]. తనను తాను కాల్చుకోవడానికి అతడు ఏ ఇంధనం వాడాడు? పెట్రోలు అని కొన్ని పత్రికలలో, కిరోసిన్ అని కొన్ని పత్రికలలో వచ్చింది. ఏ ఇంధనమైనా, దాన్ని అతడు ఎలా తెచ్చుకున్నాడు? సీసాలోనా? క్యాన్ లోనా? అయితే ఆ పాత్ర[సీసా/క్యాన్] ఏమైంది? అతడి శరీరం దరిదాపుల్లో కాలి కరిగి పోయినా, సీసా లేదా క్యాన్ దాఖలా ఉండాలి కదా? దాని గురించి ఏ భోగట్టా లేదు.

2]. అతడి మరణం ఏ సమయంలో సంభవించింది? ఆ సమయంలో అక్కడెవరూ గమనించలేదా? ఎంత రాత్రి అయినా... యూనివర్శిటి క్యాంపస్ లో అసలు జన సంచారమే లేదా? వాచ్ మెన్ లూ గాని, ఎవరూ గాని, సంఘటనని చూసే అవకాశం ఉందా లేదా? అందునా రాత్రిపూట మంటల వెలుగు ప్రస్పుటంగా కన్పిస్తుంది కదా? ఎంతగా ఆవేశంలో ఆత్మహత్య చేసుకున్నా, మంటల ధాటికి తాళ లేక, వేణుగోపాల్ రెడ్డి కేకలు వేయటం, విలవిల్లాడటం చేస్తాడు కదా? అదీ ఎవరికీ విన్పించడం గానీ కన్పించడం గానీ జరగలేదా?

శరీరం కాలిపోతున్నప్పుడు వాసన వస్తుంది కదా? ఆ వాసన కూడా ఎవరికి రాలేదా? మర్నాటి తెల్లవారుఝామున జాగింగ్ కి వచ్చిన వాళ్ళు చూసిందే ప్రధమ గమనింపా? అదే సమయానికి ఓ రాజకీయ ప్రముఖుడు[దత్తాత్రేయ] కూడా వాకింగ్ కి అటువైపే రావటం కాకతాళీయమా, రోజు ఉన్నదేనా? కాకతాళీయంగా ఆ రోజు మాత్రమే అటు రావటం అయినట్లయితే - శవాన్ని తొలిగా గుర్తించినప్పుడు, మరే ’పొరబాటు’ జరగకుండా, సంఘటనని మానేజ్ చేయటానికి చేసిన ప్రయత్నం ఎందుకు కాకూడదు?

దత్తాత్రేయ శవాన్ని చూస్తున్నప్పుడు, ఒక పోలీసు, వేణుగోపాల్ రెడ్డి బ్యాగ్ ను తీసుకెళ్తుంటే దత్తాత్రేయే ఆపి, ఆ బ్యాగ్ ను సంఘటన స్థలంలో పెట్టించాడని ఆంధ్రజ్యోతి ఉవాచ. ఒక పోలీసు అలాంటి చర్య తనకు తానుగా తీసుకోడు, పైవాళ్ళ అనుజ్ఞ ఉంటే తప్ప! అలాంటప్పుడు... పోలీసు బ్యాగు[ఆధారాలు] తీసుకెళ్ళ ప్రయత్నించటం నిజమా? లేక పోలీసు బ్యాగ్ [ఆధారాలు] తీసుకెళ్ళటానికి ప్రయత్నించాడన్న పుకారు పుట్టించారా? ఏది నిజం?

3]. వేణుగోపాల్ రెడ్డి కుటుంబ నేపధ్యం చూసినా... తండ్రి నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన వాడు. అలాంటి వ్యక్తి కుమారుడు సహజంగా ధైర్యస్థుడే అవుతాడు గానీ, పిరికి వాడయ్యే అవకాశాలు తక్కువ. తామసమూ, పిరికి తనమూ ఒంటరిగా ఆత్మహత్యకు ప్రేరేపిస్తాయి. ధైర్యమూ, రజోగుణము ఉన్నవాడు పోరాటానికి ఉద్యమిస్తాడు. లేదా నలుగురి మధ్య ఉండి, ఆవేశం కట్టలు తెంచుకోగా ఆత్మహుతికి పాల్పడతాడేమో గానీ... నిరాశతోనూ, అపజయంతోనూ కృంగి పోయిన వాడిలాగా, ఒంటరిగా నిశిరాత్రి వేళ ఆత్మహత్యకు పాల్పడే అవకాశం చాలా తక్కువ.

4]. వేణుగోపాల్ రెడ్డి వ్యక్తిగత వివరాలు చూసినా... సున్నిత మనస్కుడు కావచ్చు గాక గానీ, నలుగురిలో కలివిడిగా ఉండే రకమని సహ విద్యార్ధులు చెబుతున్నారు. తరగతి గదిలోనూ చురుగ్గా ఉంటాడన్న మాట ఉంది. చదువులో ముందుండే వాడు కాబట్టి ఏకాగ్రంగా, ఒంటరిగా చదువుకోవడానికి ఇష్టపడవచ్చు. అలా ఒంటరిగా దొరికిన ’బలిపశువు’ కాకూడదని గ్యారంటీ ఏముంది? పోనీ తెలంగాణా వస్తే... తెలంగాణేతరులని పంపిస్తే... ప్రభుత్వ ఉద్యోగావకాశాలు దండిగా వస్తాయన్న ఆశో, తెలంగాణా రాకపోతే ఉద్యోగ పోటీలో నెగ్గుకు రాలేమన్న నిరాశో, కారణం అనుకునేందుకు వీల్లేదు. మహేంద్ర సత్యం కంపెనీలో ఇప్పటికే ఉద్యోగావకాశం పొంది ఉన్నాడు. బ్రతకలేననుకునే స్థితిలో ఉండే, ఋణగ్రస్తులైన రైతన్నల లేదా నేతన్నల పరిస్థితి కాదు అతడిది. ఎప్పుడూ తెలంగాణా గురించే చర్చించేవాడు అన్నది గట్టి కారణం కాబోదు.

ప్రస్తుతం ’కరెంట్ అఫైర్’ అదే అయినపుడు, అందరూ అదే చర్చిస్తారు. అందునా విద్యార్ధుల్లో అది హాట్ టాపిక్ అయినపుడు కూడా అది సహజం. తెలంగాణా వస్తుందా రాదా అని తారచు ప్రశ్నించినంత మాత్రాన కూడ ఆత్యహత్య చేసుకోవటానికి అదే కారణం అనుకోలేము. ఎందుకంటే ఇంత గొడవ జరుగుతున్నప్పుడు తెలంగాణా వస్తుందా రాదా అన్న కుతుహలమూ, ఉత్కంఠ ఎవరిలోనైనా ఉంటాయి. పిల్లవాడిలో ఆత్మహత్య టెండెన్సీ ఉందో లేదో, గతంలో ఎప్పుడైనా అలాంటి ఆలోచనలు చేసాడో లేదో, ఏ డాక్టరూ తేల్చకుండానే, అసలు సంఘటనని సరిగా పరిశోధించనివ్వకుండా, విద్యార్ధి నాయకుల ప్రేరేపణతో, విద్యార్ధి సంఘం, ఏకమొత్తంగా అక్కడే పోస్టుమార్టం నిర్వహించమని గొడవ చేయటం కూడా అనుమానస్పదంగానే ఉంది. అంతేగాక నాగం జనార్ధన రెడ్డి "వేణుగోపాల్ రెడ్డి బలిదానాన్ని వేరే రకంగా చిత్రికరిస్తే ఊరుకోనేది లేదు" అంటూ ముందే స్టేట్ మెంట్సు ఇస్తున్నాడు.

5]. వేణుగోపాల్ రెడ్డి సున్నిత మనస్కుడవటం చేత, రాష్ట్రభక్తితో ఉత్తేజితుడై, నియంత్రించుకోలేనంత ఆవేశానికి, ఆక్రోశానికీ గురై, తెలంగాణా కోసం పరితపించి, ఆత్మహత్య చేసుకున్నాడనుకుంటే - అంత రాష్ట్రభక్తి ఉన్న పిల్లవాడికి, ఈ ఉద్యమం ఎగిసిపడుతున్నప్పుడూ, పడక ముందూ కూడా, రాష్ట్రభక్తితో పాటు దేశభక్తి కూడా ఉండాలి కదా! అటువంటప్పుడు, సూర్యాపేట వాసి అయిన ఈ పిల్లవాడి స్వంత జిల్లా, నల్గొండ వాసుల ఫ్లోరోసిస్ వంటి సమస్యల పట్ల కూడా... బాధకీ, ఆక్రోశ ఆవేశాలకీ గురయ్యే ఉంటాడు కదా! వాటి గురించి అందరితో చర్చలు జరిపి ఉండే ఉంటాడు కదా! అలాంటి అంశాలేవైనా అతడి ’చిన్ని’ జీవితంలో ఉన్నాయా లేవా? ఎందుకంటే - రాష్ట్రం అన్నా, దేశం అన్నా మట్టికాదు మనుషులు కదా! తోటి మనుషుల బాధలూ, ఎముకలు వంకరపోయి క్షణక్షణ నరకాన్ని అనుభవిస్తున్న ఫ్లోరోసిస్ బాధితులూ, దారిద్ర పీడితులూ మనసుకి పట్టకుండా ఉండదు కదా!

6]. అసలు పోలీసులు, విద్యార్దులు, పచ్చిగా రెండు వైరి వర్గాలుగా మారిపోయాయి. విద్యార్ధులలో అసాంఘీక శక్తులు చేరాయన్నది పోలీసుల ఆరోపణ. అలాంటి రౌడీలు/అసాంఘీక శక్తులు తమపై రాళ్ళు రువ్వటంతో... తాము లాఠీలు, రబ్బరు బుల్లెట్లు ఉపయోగించాల్సి వస్తుందని పోలీసులు అంటున్నారు. గతంలో ఓయూ ఆవరణలో తెదేపా నాయకుడు నాగం జనార్ధన రెడ్డిపై జరిగిన దాడి సంఘటనలో, క్యాంపస్ లో అసాంఘీక శక్తులుండటం నిరూపితమైనదే! విద్యార్ధులు కూడా అప్పుడు దాన్ని అంగీకరించారు. కాబట్టి పోలీసుల ఆరోపణ సత్యం అయ్యే అవకాశం ఉంది.

7]. అయితే... పోలీసుల్లోని కొందరు మఫ్టీలో తమలో ఉండి, తమ అనుచర పోలీసులపై తామే రాళ్ళు రువ్వుకుని, ఆ నెపంతో తమపై లాఠీఛార్జీలూ, రబ్బరు బుల్లెట్లూ, భాష్పవాయుగోళాలు పేలుస్తున్నారని విద్యార్ధులు చేస్తున్న ఆరోపణ. ఇది మరీ ’జర్మన్ ఫీలాసపీ’లాగా ఉంది! అంత అవసరం పోలీసులకి ఏమిటి? ఆంధ్రా పోలీసులు లేదా ఆంధ్రా నాయకుల డబ్బుతో కొనబడిన పోలీసులు అలాంటి ఎత్తుగడలు పన్నుతున్నారనీ తెలంగాణా విద్యార్ధుల ఆరోపణ. మీడియా కెమెరాలు, సెల్ ఫోన్ కెమెరాలు, ఇతర వీడియోలు పరిశీలిస్తే రాళ్ళు రువ్వింది ఎవరో అందరికీ నిజం తెలుస్తుంది. మరి ఆ పని రాజకీయ నాయకులు గానీ, మీడియా గానీ ఎందుకు చేయటం లేదు?

8]. అటువంటప్పుడు... పోలీసులు వేణుగోపాల్ రెడ్డి మరణం వెనక మిస్టరీని ఛేదించకుండా ఉండేందుకు, విద్యార్ధులే పోలీసులని బనాయిస్తున్నారని ఎందుకు అనుకోకూడదు? విద్యార్ధులు అమాయకులే కావచ్చు గాక గానీ, విద్యార్థి నాయకులూ, వారిని నడుపుతున్న రాజకీయ నాయకులూ అమాయకులని అనుకోలేం గదా?

9]. వేణుగోపాల్ రెడ్డి ఆత్మహుతి సంఘటన విషయంలో మీడియా ప్రవర్తన కూడా వింతగానే ఉంది. మీడియా గానీ, రాజకీయ నాయకులు గానీ, ఆ పిల్లవాడి మృతి అనంతర వ్యవహారాలు మీద చేస్తున్న హడావుడి, అసలు ’ఆ సంఘటన ఎలా జరిగింది?’ అన్నదాని మీద చేయటం లేదు. ఎవరూ నిర్ధారణ చేయకుండానే, అతడి స్వదస్తూరితో అత్మహత్య నోట్ దొరికింది కాబట్టి అది ఆత్మహత్య అని ముద్ర వేసేసారు. ఆ సంఘటనని, మీడియా గబగబా దొర్లించేసి, తర్వాత ఉవ్వెత్తున ఎగసిపడిన ఉద్యమాన్ని, మొదలైన విద్యార్ధుల ఆత్మహత్యల పరంపరని, అర్జంటుగా తలకెత్తుకున్నారు.[వై.యస్. చనిపోయినప్పుడు, మీడియా అర్జంటుగా వై.యస్.ని దేవుడిని చేసినట్లు అన్నమాట] అసలు పిల్లవాడు ఎలా చనిపోయాడు? ’ఓ విద్యార్ధిని చంపి, బలిదానంగా చిత్రిస్తే ఉద్యమం ఊపందుకుంటుంది’ అన్న దురుద్దేశంతో, ఎవరైనా స్వార్ధపరులు, ఒంటరిగా దొరికిన ఓ పిల్లవాడిని బలితీసుకునే అవకాశం లేదని ఎలా చెప్పటం?

10]. ఎందుకంటే - తెలంగాణా కోసం వాళ్ళే చెబుతున్న ప్రకారం, 1969 నుండీ డిమాండ్ ఉంది. ఎన్నోసార్లు ఉద్యమాలు రేగాయి. చల్లారాయి. నాయకులు తమ స్వప్రయోజనాల కోసం, అవసరమైనప్పుడల్లా బ్యాంకు నుండి డబ్బు డ్రా చేసినట్లుగా తెలంగాణా అంశం బయటకి తీస్తున్నారు, మళ్ళీ లోపల పెట్టేస్తున్నారు.[వాళ్ళ భాషలో కోల్డ్ స్టోరేజ్ లో పెట్టటం.] ఇప్పుడు కూడా ఈ కేసీఆర్ దీన్ని ఎత్తుకుంది 2000లో. ఇప్పటికి పదేళ్ళుగా లేని ’కాక’ డిసెంబరు మొదటి వారంలో ప్రారంభమయ్యింది. అతడి సెలైన్ బాటిళ్ళ దీక్ష, కాంగ్రెస్ అధినేత్రి అత్యుత్యాహపు పుట్టిన రోజు కానుకతో, రివ్వున పైకి ఎగసిన ఆ మంట, జనవరి 5 తర్వాత చల్లారుతూ... పరీక్షలయ్యాక మళ్ళీ ఉద్యమిస్తాం అనే ప్రకటనల దాకా వచ్చింది.

అలాంటి నేపధ్యంలో... పరీక్షలకి సిద్దం అవుతున్న ఓ విద్యార్ధి, వేణుగోపాల్ రెడ్డి, హఠాత్తుగా నైర్యాశ్యానికి గురై ఆత్మహత్య ఎందుకు చేసుకున్నట్లు? ఇన్నాళ్ళు తెలంగాణా రాకపోతే... ఎదురు చూస్తునో, పోరాడుతూనో’ గడిపిన వాడు! పోనీ సభల్లో, నాయకుల ఉపన్యాసాలకి, ప్రక్కనున్న వారి జైజై నినాదాలకి, ఒక్కసారిగా ఉత్తేజితుడై ఆత్మాహుతి చేసుకున్నాడనుకోడానికీ లేదు. ఒంటరిగా... రాత్రిపూట... చదువుకోవడాని వెళ్ళి! ఇందులో అనుమానించడానికి ఏమీ లేదా?

11]. డాక్టర్లు కూడా క్యాంపస్ లోనే పోస్టుమార్టం నిర్వహించి ’ఆత్మహత్య’ అని చెప్పేసారట. [అలాగ్గాక మరోకటి చెబితే, తర్వాత వాళ్ళ శరీరాలకి పోస్టుమార్టమ్ మరెవ్వరో నిర్వహిస్తారు. అంత ఆవేశం, అనియంత్రణ అప్పుడు వారి చుట్టూ ఉంది.] ’కాల్చుకుని చనిపోయాడు’ అని చెప్పబడుతున్న వ్యక్తి దేహం.... మరొకరు ఇంధనం అతడి మీద పోసి నిప్పెట్టినా, తానే ఇంధనం మీద పోసుకుని నిప్పెట్టుకున్నా, ఒకేలా ఉంటుందా? పెనుగులాట ఏదైనా జరిగితే, ఆ దాఖలాలు కనిపించాయా లేదా? ఏ వివరమూ తేలకుండానే... ఒక హడావుడీ, వేగం ఎందుకు సృష్టించబడ్డాయి? విద్యార్ధులైనా, అంతగా ఎందుకు సంయమనం కోల్పోయారు?

వేణుగోపాల రెడ్డిది ఆత్మహత్య అయ్యే అవకాశం ఎంతో చర్చించేముందు మరొక్క వాస్తవం మీకు గుర్తు చేస్తాను.

1990 లో వీపీసింగ్ ప్రధానమంత్రిగా ఉండగా.... మండల్ నివేదిక - రిజర్వేషన్ల వ్యతిరేక, అనుకూల ఉద్యమాలు దేశవ్యాప్తంగా చెలరేగాయి. మన దేశ చరిత్రలో విద్యార్ధుల అత్యాహుతులు అప్పుడే ప్రారంభమయ్యాయి. విద్యార్దుల ఆత్మాహుతుల సంఘటనలలో, రాజీవ్ గోస్వామి issue దేశవ్యాప్తంగా మీడియాలో పెనుసంచలనం సృష్టించింది. అతడు రాజకీయ నేపధ్యం ఉన్న కుటుంబం నుండి వచ్చాడు. పెట్రోలు/కిరోసిన్ చల్లుకుని, అతడు ఆత్మహుతికి పాల్పడ్డాడు, ఆసుపత్రికి తరలించబడ్డాడు. అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా... మరికొన్ని ఆత్మాహుతులు జరిగాయి.

అయితే ’ఇంధనం చల్లుకుంటూ ఆత్మాహుతి నినాదాలు ఇచ్చిన విద్యార్ది ఒకరు కాగా, చివరికి కాలిపోయి మరణించిన విద్యార్ధి మరొకరు’ ఉన్న వీడియో తో కూడిన కథనం ఒకటి బయటికి వచ్చింది. విద్యార్ధుల గుంపులో చొరబడిన కొందరు కిరాయి వ్యక్తులు, విద్యార్ధుల్లా నటిస్తూ, కాస్త మెతకగా కన్పించే, బలమైన ధనిక కుటుంబ నేపధ్యం లేని విద్యార్ధుల ప్రక్కన నిలబడి, ఆత్మాహుతి నినాదాలు చేస్తూ, తమ మీద తామే ఇంధనం చల్లుకుంటున్నట్లుగా ప్రక్కనున్న వారిపై చల్లుతారనీ, గల్లంతులో మెల్లిగా వాళ్ళు ప్రక్కకు తప్పుకోగా, అప్పటికే ఇంధనం చల్లబడిన సదరు మెతక విద్యార్ధి ఒంటికి మరో కిరాయి వ్యక్తి నిప్పంటిస్తాడనీ కథనాలు బయటికి వచ్చాయి.

దాంతో దుమారం చెలరేగింది. అది నిజమేనని కొందరూ, సినిమాటిక్ కథలల్లారని కొందరూ అన్నారు. మీడియా మాత్రం హడావుడిగా విషయాన్ని దొర్లించేసింది. అప్పటికి ప్రభుత్వంలో ఉన్న వీపీసింగ్ ప్రభుత్వం కూడా, ఇతోధికంగా ఇందుకు సహకరించింది.

తదుపరి దశాబ్దాలలో, ఈ ప్రక్రియ సినిమాలలో విపరీతంగా చొప్పించబడింది. ఎంత ఎక్కువగా అంటే - భవిష్యత్తులో ఎవరైనా ఇదే అంటే... "ఆ ! ఇలాంటివి సినిమాల్లో బొచ్చెడు సార్లు చూశాం" అనేంతగా! నిజానికి... ఔటయి పోయిన స్ట్రాటజీని మరింత పలచన చేయటం కోసమే, తదుపరి దాన్ని సినిమాలలోనూ, నవలలోనూ, విపరీతంగా ఉపయోగించటం గూఢచర్య తంత్రాలలో ఒకటి. ఇక ఇందుకు కాంట్రాక్టులు పుచ్చుకోవటం వంటి కథంశాలతో ఎన్నో సినిమాలు [ఇటీవల వచ్చిన సూర్య నటించిన ’ఆరు’ అనువాద చిత్రంతో సహా] వచ్చాయి.

అయితే ఇలాంటి సంచలన సంఘటనకి తెరతీసిన రాజీవ్ గోస్వామి, అత్మహుతి అగ్ని ప్రమాద సంఘటన నుండి ప్రాణాలతో బయటపడటం గురించీ, తదుపరి పరిణామాలలో అతడి రాజకీయ కెరియర్ గురించి, మీడియా low light focus చేయటం ఇక్కడ గమనార్హం. అతడి పేరిట ఢిల్లీలో ఒక వీధి కూడా ఉంది సుమా!

ఇక పోతే, వేణుగోపాల్ రెడ్డి ది ’ఆత్మహత్య’ అయ్యే అవకాశం ఎంత?

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

ముందుగా ఓ పోలికతో నా విశ్లేషణ ప్రారంభిస్తాను.

ఓ కొలను ఉందనుకొండి. ప్రశాంతంగా ఉన్న నీరు. గాలికి కదిలే చిరు అలలు తప్ప పెద్దగా అలజడి లేదు. హఠాత్తుగా అందులో ఓ రాయి విసిరితే? అలలు ఎగసి పడతాయి. వరుసగా రాళ్ళు విసిరితే... అనుశృత అలజడి చెలరేగుతూనే ఉంటుంది.

సరిగ్గా ఇప్పుడు మన రాష్ట్రం పరిస్థితి ఇలాగే ఉంది. దాదాపు మూడు నెలల క్రితం తెలంగాణాలో మెహబూబ్ నగర్ జిల్లా, రాయల సీమలో కర్నూలు జిల్లా, కోస్తాలో విజయవాడ వరద బారిన పడితే, ప్రాంతాల కతీతంగా ప్రజలు కదిలి వచ్చి, కష్టాల్లో ఉన్న తోటి తెలుగువాళ్ళకి మేమున్నామంటూ అండగా నిలిచారు. అదే తెలుగువాళ్ళు... ఇప్పుడు రావణ కాష్టాల్లా విశ్వవిద్యాలయాలు మండుతుంటే... అందులో కట్టెల్లా జీవితపు తొలిదశలో ఉన్న పిల్లలు కాలిపోతుంటే... కన్నీటితో చూస్తున్నారు. ఎవరు ఈ చితి రగిల్చారు? నిశ్చయంగా రాజకీయ నాయకులే!

నిజానికి తెలంగాణా ఉద్యమం - దాని పర్యవసానంగా చెలరేగిన సమైక్యాంధ్ర ఉద్యమాల వెనుక గల అసలు కారణాలని పరిశీలించాలంటే - రెండు అంశాలని పరిశీలించాలి. ఒకటి రాజకీయ నేపధ్యం. ఇందుకు దాదాపు 10 నెలల ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళాలి. అంటే 2009 మే ఎన్నికల ముందు నాటికి. ఇక రెండోది గూఢచర్య నేపధ్యం. దీన్ని పరిశీలించాలంటే దాదాపు పదేళ్ళ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళాలి.

ముందుగా రాజకీయ నేపధ్యాన్ని, మీడియాకి, కాంగ్రెస్ అధిష్టానానికి, కేసీఆర్ కి, ప్రతిపక్షాలకి మధ్య ఉన్న ’మ్యాచ్ ఫిక్సింగ్’ ని పరిశీలిద్దాం.

మే, 2009 లో సార్వత్రిక ఎన్నికలతో బాటు, రాష్ట్ర అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరిగాయి. ఎంతగా EVM లని Tamper చేసినా, గెలిపోటములకు పైకారణాలు[ovre leaf reasons] కావాలి గదా? సరైన పైకారణాలు లేనట్లయితే - సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ గెలుపు గురించి - ప్రజలు అధిక ధరలని, దైనందిక జీవిత సమస్యలని కూడా విస్మరించి దేశ సమైక్యతనీ, భద్రతనీ దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ కు ఓటు వేసారనీ, భాగస్వామ్య పక్షాలు లెక్కచేయనట్లుగా, తీసిపారేసినట్లుగా ప్రవర్తించినందుకు కాంగ్రెస్ అధిష్టానంలో కసిరేగిందనీ, అందుచేత పట్టుదలతో గెలుపు సాధించిందనీ మీడియా చిత్రించినట్లు ఉంటుంది. [పాపం అమాయక ప్రజలు! దేశ సమైక్యత కోసం కాంగ్రెస్ కు ఓటు వేసారట. అందుకేనేమో ఇప్పుడు అదే కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్రాన్ని, ఆపైన దేశాన్ని ముక్కలు(చిన్నరాష్ట్రాలుగా) కొట్టే పనిలో ఉంది. మరో తమాషా ఏమిటంటే - ఎన్నికలేమైనా బాక్సింగ్ పోటీల వంటివా? కసి రేగి, పట్టుదల జోడించి, పదిదెబ్బలు ఎక్కువ కొట్టి గెలిచి కూర్చోడానికి? ఆ ప్రతిభ ధరల మీద చూపెట్టవచ్చు కద? ]

ఇలాంటి విశ్లేషణలని మీడియా[ఈనాడు తో సహా] మే 2009 ఎన్నికల అనంతరం ప్రచురించింది. అదేం కాదనీ, EVMల Tamparing అనీ బయటకి పొక్కడంతో అలాంటి విశ్లేషణలని అర్జంటుగా ఆపి, ’EVM లని ఎవరూ ఏం చేయలేరు’ అంటూ నవీన్ చావ్లాల చేత ప్రకటనలు గుప్పించి మరీ ప్రచారం ప్రారంభించారు. నిరూపించలేకపోతే కేసులు పెడతామని చెప్పారుకూడా![కేసులు లేవు గానీ, మొత్తంగా విషయం సద్దుమణిగించారు. అచ్చంగా ఓటుకు నోటు కేసులాగా!]

దానా దీనా విషయం ఏమిటంటే - ఎంతగా EVMలని Tamper చేసినా, గెలుపోటములకు పైకారణాలు కావాలి. అలాంటి పైకారణాల[over leaf reasons] కోసమే.... తెరాస అధినేత కేసీఆర్ కీ, కాంగ్రెస్ అధిష్టానం సోనియాకి మధ్య రహస్య ఒడంబడిక జరిగింది. [దీని గురించే చంద్రబాబు నాయుడు ’మ్యాచ్ ఫిక్సింగ్’ అంటు కొంచెం గొంతెత్తి మళ్ళీ ఎందుకో గమ్మున ఉండిపోయాడు.] ఆ ఒప్పందం ప్రకారం - కేసీఆర్, తెదేపా, ఎర్రపార్టీలు అంతా కలిసి ఏర్పాటు చేసిన మహా కూటమిని వీలైనంత నీరుగార్చాడు. ఎంతగా అంటే - నెలకి 1500/-రూ. నుండి 2000/- రూ.ల దాకా డబ్బు పంపిణీ వంటి ఆకర్షణీయ పధకాలని కూడా పైకారణంగా[over leaf reason] నిష్పలం చేయగలిగేంతగా నీరు గార్చాడు.

సీట్ల సర్ధుబాట్ల విషయంలో వీలయినంత తాత్సారం చేసి కాలయాపన చేసాడు. దాదాపు నామినేషన్ చివరిరోజులలో బేరం కుదుర్చుకున్నాడు. ఈ విషయంలోనూ తెదేపా నే మెట్టుదిగి వచ్చింది. టిక్కెట్ల కేటాయింపులోనూ, కేసీఆర్ టిక్కెట్లు అమ్ముకున్నాడన్న వివాదాలూ, ఎం.ఐ.ఎంకూ, కాంగ్రెస్ కూ అనుకూలంగా ఉండేటట్లు బలహీన అభ్యర్ధులని నిలబెట్టాడన్న వివాదాలూ బయటికి వచ్చాయి. ఇలాంటి రకరకాల ప్రయత్నాల[efforts] తర్వాత, తెరాస కేవలం 10 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ స్థానాలు గెలిచింది. మహా కూటమి ఓటమికీ, కాంగ్రెస్ గెలుపుకీ ఆ విధంగా పైకారణపు బాటలు వేయబడ్డాయి.

ఈ విధంగా చేయటం వలన తెలంగాణాలో కేసీఆర్ ప్రతిష్ఠ మసకబారుతుంది కదా? అందుకు ప్రతిఫలంగా - కేసీఆర్ తెలంగాణా కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టాలి. ఆ నాటకం రక్తికట్టాక తాను ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియని ప్రకటిస్తుంది. ఆ ప్రక్రియని యధాప్రకారం ఏళ్ళూపూళ్ళూ సాగదీస్తే చాలు. దాంతో కేసీఆర్ తెలంగాణా రాష్ట్రపిత, తెలంగాణా గాంధీ అయిపోతాడు. ’అమ్మా నిన్ను మరవదు ఈ గడ్డ’ అంటూ ఎదురు స్తుతిస్త్రోత్రాలతో సోనియా ఇమేజ్ నీ పెంచవచ్చు. ఎటూ బాకా ఊదేందుకు మీడియా ఉండనే ఉంది కదా? ఇదీ పధకం!

ఆ ప్రకారమే - కేసీఆర్, ఎన్నికలు ప్రభుత్వాల ఏర్పాట్లు పూర్తవ్వగానే సమాయత్తం అయ్యాడు. అయితే ఈ లోపున వై.యస్. తాలూకూ గడబిడ ప్రారంభమయ్యింది. అతడి హెలికాప్టర్ ప్రమాద మరణం, ఆపైన అభిమానుల మరణ మృదంగాలని మీడియా ఇతోధికంగా వాయించడం, వరదలు వగైరా ప్రకరణాలతో కేసీఆర్ తాత్కాలికంగా గమ్మునుండాల్సి వచ్చింది. అందుకే కొంతకాలం కేసీఆర్ ఎక్కడా కనబడలేదు, వినబడలేదు. ఎటూ పార్టీలోనూ అసమ్మతి ఉంది. ఏదో ఒకటి (లాబీయింగ్) చేస్తేనేగానీ మళ్ళీ అందరూ తన నాయకత్వానికి జిందాబాద్ కొట్టరు. ఎటూ విరామ సమయం లభించినందున పెండింగ్ పనులు + ఆరోగ్య పరీక్షలు చికిత్సలు చేయించుకున్నాడు.

కాంగ్రెస్ అధిష్టానాన్ని , బార్టర్ పద్దతి మాదిరిగా తన ఇమేజ్ పున:నిర్మాణం గురించి కేసీఆర్ ఎప్పుడడిగినా.... వై.యస్. మరణపు అంశమే ప్రస్తావనకు రావటంతో, కోపాన్ని, నాలుకనీ కూడా నిగ్రహించలేని కేసీఆర్, అక్టోబరు లో ’దిక్కుమాలిన సావు సచ్చిన వైయస్, పీనుగు రాకముందే రాజకీయాలు మొదలెట్టిన జగనూ’ అంటూ తిట్లు లంకించుకున్నాడు. ఆ వెంటనే తాను ఎక్కిన హెలికాప్టరు కూడా ఆకాశగమనంలో ’చుక్కలు’ చూపించించింది. అది యాదృచ్చికమో, వ్యూహాత్మకమో గానీ, దెబ్బకి కేసీఆర్ వేదాంతం మాట్లాడాడు. ఈ విషయమై అప్పట్లోనే టపాకాయలు పేల్చాను.

తర్వాత కొద్దిరోజులకే - తెలంగాణా కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తాను, తెలంగాణా తెచ్చుడో - కేసీఆర్ చచ్చుడో, జైత్రయాత్ర లేదా శవయాత్ర అంటూ ఓ ప్రక్క హెచ్చరికలు చేస్తూ, మరో ప్రక్క రాష్ట్రపతి దగ్గర నుండి గవర్నర్ , అన్ని పార్టీల నాయకత్వాల్నీ , అవసరం ఉన్నా లేకపోయినా ప్రక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా కలిసి, లాబీయింగ్ ఓ ప్రక్క నిర్వహించాడు. నవంబరు తొమ్మిదిన ప్రారంభిస్తానన్న నిరాహార దీక్ష, అలా సాగదీసి ఇలా సాగదీసి చివరికి నవంబరు 29 న ప్రారంభించాడు.

ఈ లోపున - ’నేను నిరాహార దీక్షకి కూర్చొంటాను. అటు ఇటు అవకుండా మీరు కమ్ముకు రండి’ అన్న ప్రయత్నలే చేసాడో, మరేం చేసాడో గానీ... అతడు ఈ లాబీయింగ్ నిర్వహిస్తున్న రోజుల్లోనే, ఎర్రపార్టీ నాయకుల దగ్గరి నుండీ కాంగ్రెస్ వాళ్ళ దాకా అందరూ, ’కేసీఆర్ చచ్చి సాధించేదే ముంది’ అంటూ ’జాగ్రత్తలు’ చెప్పారు.

అప్పటికే పలుమార్లు దీక్షలు ప్రారంభించటం, రెండురోజుల్లో లేచేయటం, పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామాలు చేయటం, కార్యకర్తలు బ్రతిమాలాడారంటూ విరమించుకోవటం, గట్రా నాటకాలు శృతి మించే చేసినందునా, మహాకూటమి భాగస్వామ్యంతో కాంగ్రెస్ గెలుపుకు దోహదం చేసినందునా తెలంగాణాలో అతడి ఇమేజ్ బాగా డామేజ్ అయ్యింది. కెరియర్ కూడా ఆశాజనకంగా లేదు. ఇక తప్పదన్నట్లు నవంబరు 29 న నిరాహారదీక్ష ప్రారంభించాడు. 1990 - 91 లో అయోధ్యలో రామమందిరం కోసం అద్వానీ రధయాత్ర చేపట్టడం, ఆ ఉద్రికత్తలని మరింత రక్తి కట్టిస్తూ వీపీ సింగ్, అద్వానీ అరెస్టు నిర్ణయం తీసుకోవటం లాగా, కేసీఆర్ ని కూడా వెంటనే అరెస్టు చేసి ఖమ్మం జైలుకీ ఆపైన ఆసుపత్రికీ తరలించారు.

రెండోరోజునే పళ్ళరసం తాగేసి కేసీఆర్ దీక్షకి బై కొట్టేసాడు. విద్యార్ధులు ఖస్సుమని లేస్తూ, ’తెలంగాణా రాకుండానే కేసీఆర్ దీక్ష విరమిస్తే మేం దీక్షకు దిగుతాం’ అంటూ అల్టిమేటం ఇచ్చేసరికి, సెలైన్ బాటిళ్ళతో [TPNతో] దీక్ష కొనసాగించాడు. నిమ్స్ డాక్టర్ల ప్రకటనలతో మీడియా దాన్ని మరింత రక్తికట్టించింది.

రాజకీయ కారణాలతోనూ, అంతర్లీనంగా ఉన్న గూఢచర్య కారణాలతోనూ, కాంగ్రెస్ అధిష్టానం, అత్యుత్సాహంగా తన పుట్టిన రోజు కానుకగా డిసెంబరు 9 న తెలంగాణా రాష్ట్రప్రక్రియ షురూ ప్రకటన ఇచ్చేసింది. సరిగ్గా ఇక్కడే కథ అడ్డం తిరిగింది! సమైక్యాంధ్ర ఉద్యమం రాజుకుంది. దాని వెనుక పైకారణాలూ, అంతర్లీన కారణాలూ ఏదైనా కావచ్చు గాక! ఒక్కసారిగా మాత్రం, అందరి పరిస్థితి ’ఏ నిముషానికి ఏమీ జరుగునో ఎవరూహించెదరూ’ అయిపోయింది.


ఈ రచ్చ పరాకాష్టకు చేరుకున్న దశలో విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అదృశ్యమూ, నిమ్స్ లో ప్రత్యక్షం గట్రా సన్నివేశాలతో TPN తో 30 ఏళ్ళపాటు ’సుఖంగా’ నిరాహారదీక్ష చేయవచ్చని బహిర్గతం అయ్యింది. ఆ తర్వాత కాంగ్రెస్ అధిష్టానం, యధాప్రకారం గృహమంత్రి చిదంబరం ముఖతః రెండో ప్రకటన చేయించింది. ’ఏకాభిప్రాయం తర్వాతే ఏదైనా ’ అన్నమాట తెరమీదికి వచ్చింది. దీనికి ముందు ’తెలంగాణా మీద మేం వెనుకకు తగ్గం, ముందుకీ వెళ్ళం’ వంటి ప్రకటనలు ఇస్తూ కాంగ్రెస్ ప్రకటన కర్తలు[అభిషేక్ సింఘ్వీ, మనీష్ తివారీ, షకీల్ అహ్మాద్, జయంతీ నటరాజన్ గట్రాలు], 'తాంబూలాలిచ్చాం తన్నుకు చావండి' అన్న అంకానికి తెరతీసారు.

అయితే కాంగ్రెస్ అధిష్టానికి ఎక్కడ పెను ఉపద్రవం కనిపించిందంటే - తెలంగాణా ఇస్తాము అంటే, భారతదేశంలోని మిగిలిన రాష్ట్రాల్లో 11 నుండి 13 లేదా15 దాకా ముక్కలు[విదర్భ, గూర్ఖాలాండ్ లాంటివి] లైన్లోకి వచ్చి నిలబడ్డాయి. ఆ విధమైన వేర్పాటు వాదానికి సమాంతరంగా సమైక్య వాదమూ తలెత్తితే....?

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండు విభాగాలై... వేర్పాటు, సమైక్యం అని సంఘర్షించుకుంటున్నట్లుగా, క్రమంగా యావద్భారత దేశం రెండు విభాగాలై కూర్చొంటుంది. అప్పుడు తెలంగాణా ఇవ్వటం అనే ప్రక్రియతో, దాన్నంతా ప్రారంభించినందుకు ప్రతిఫలంగా, కాంగ్రెస్ అధిష్టానం, అలనాడు దేశాన్ని విభజించి పాలించిన బ్రిటీషు వాళ్ళ స్థానంలో ప్రతిష్టితమౌతుంది. సమైక్యంగా ఉంటాం అన్న ఉద్యమాలతో, ఆయా రాష్ట్రాల ప్రజలు, అలనాడు దేశభక్తితో నినదించిన, దేశ స్వాతంత్రం కోసం, సమగ్రత కోసం పోరాడిన వారి స్థానంలోకి వస్తారు.

ఆ విధంగా తమ అసలు రూపం ఏమిటో సరిగ్గా బహిర్గత మౌతుంది. ఈ ఉపద్రవం అర్ధం కాగానే కాంగ్రెస్ అధిష్టానం వెనకడుగు మొదలెట్టింది. అయితే - ఇప్పటికి తామే అగ్గి ముట్టించి నందునా, ఎలా నియంత్రించుకోవాలో అర్ధం గాక, రకరకాల మార్గాలు అన్వేషించింది, అన్వేషిస్తోంది. అందులో భాగమే అఖిలపక్ష సమావేశాలు, ఏకాభిప్రాయ సాధన ప్రకటనలూ!

ఈ పరిణామాలలో... గూఢచర్యపు గుట్టు మట్లు, అధిష్టానపు బలహీనతలు రాజకీయ నాయకులలో ప్రచారమయ్యాయి. దాంతో కాంగ్రెస్ లోని వేర్పాటు వాదుల మీదా, సమైక్య వాదుల దాకా కూడా అధిష్టానపు పట్టు సడలింది. ఎంతగా అంటే - షోకాజ్ నోటీసులు, ’ఇలాగైతే అసెంబ్లీ ఎన్నికలకి వెళ్ళాల్సొస్తుంది’ అన్న బెదిరింపులూ, గవర్నర్ పాలన విధింపు బెదిరింపులూ కూడా ఉపయోగపడనంతగా! స్వంత పార్టీలో ఇలా ఉంటే, సహజంగానే ప్రతిపక్షాలకు చులకన అయిపోతారు కదా! మొత్తంగా కాంగ్రెస్ అధిష్టానాన్ని, ప్రతిపక్షాలనూ కూడా నడుపుతోన్న నెం.10 వర్గమూ, నకిలీ కణిక వ్యవస్థ పట్టుసడలింది.

ఫలితమే ఇప్పుడు మనం చూస్తున్న పరిణామాలు. దీన్ని గురించి వివరించే ముందు ఇప్పటి వరకూ వివరించిన పరిణామాలని ఒకసారి సమీక్షిద్దాం.

నవంబరు 29న నిరాహార దీక్ష ప్రారంభించిన కేసీఆర్, నిమ్స్ లో సెలైన్ బాటిళ్ళ సాక్షిగా దీక్ష కొనసాగించాడు. TPN తో 30 ఏళ్ళపాటు నిరాటంకంగా నిరాహారదీక్ష చేయ వచ్చునని, IB, RAW వంటి సంస్థలు అధీనంలో ఉన్న హోంశాఖ కూ, హోంశాఖామాత్యుడికి తెలియదా? అధిష్టానం అంత అమాయకంగా ఉందా? మరి ప్రణబ్ ముఖర్జీ "డిసెంబరు 9 నాటి పరిస్థితులనీ, కేసీఆర్ ఆరోగ్యస్థితినీ, ఒత్తిళ్ళనీ దృష్టిలో ఉంచుకుని ఆ ప్రకటన [తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు షురూ ప్రకటన] ఇవ్వాల్సి వచ్చింది" అని ఎలా అన్నట్లు? ఒక సామాన్య ఎంపీ అయిన లగడపాటికి తెలిసిన పాటి కేంద్ర మంత్రులకీ, కుర్చీ వ్యక్తికీ, తెలియక పోయిందా? ఇక్కడ తెలియటం లేదా కేసీఆర్ కీ, కాంగ్రెస్ అధిష్టానానికి మధ్య ఉన్న ’మ్యాచ్ ఫిక్సింగ్’?

విచిత్రంగా మీడియాకి, ప్రతిపక్షాలకి కూడా TPN గురించి తెలియదు కాబోలు! కేసీఆర్ ఆరోగ్యబులిటన్లు ప్రచురించిన మీడియా అతడి శరీరంలో సోడియం, పోటాషియం నిల్వలని గురించి కూడా వివరాలు ఇచ్చింది గానీ TPN గురించి అసలు కిమ్మనలేదు. లగడపాటికి తెలిసిన విషయం ప్రతిపక్షాలకు తెలియక పోయింది. TPN గురించి ప్రతిపక్షాలకి, మీడియాకి కూడా తెలియదా? లగడపాటి దాన్ని బయటపెట్టాక కూడా కేంద్రరాష్ట్రాలల్లోని ప్రతిపక్షాలు గానీ, జాతీయ రాష్ట్రీయ మీడియా గానీ కాంగ్రెస్ అధిష్ట్రానాన్ని నిలదీయ లేదేం? విమర్శించనూ లేదు. ఇక్కడ తెలియటం లేదా మీడియాకి, కాంగ్రెస్ అధిష్టానానికి, కేసీఆర్ కి, ప్రతిపక్షాలకి మధ్య ఉన్న ’మ్యాచ్ ఫిక్సింగ్’?

అంటే వెరసి వీళ్ళు అడుకుంటున్న రాజకీయ క్రీడలో సామాన్యులమయిన మనమే బలి పశువులం! విద్యార్ధులంతకంటే అమాయక, అవేశపూరిత బలిపశువులు!

ఇక్కడ ఓ కొసమెరుపు ఏమిటంటే - కాంగ్రెస్ వాడే అయిన విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఈ TPN డ్రామా నంతటినీ బహిర్గతం చేయటం. కాంగ్రెస్ అధిష్టానం దీనినంతటిని తొక్కిపడితే, లేదా లగడపాటిని అపితే, ఎవ్వరికీ TPN గురించి తెలిసేది కాదు. సెలైన్ బాటిళ్ళ దీక్ష కావలసినప్పుడల్లా కొనసాగించవచ్చు. అలాగాక వీళ్ళందరి డ్రామాని, మ్యాచ్ ఫిక్సింగ్ ని బహిర్గతం చేసే విన్యాసాలు, ఆత్మహత్యసదృశ్య అసైన్ మెంట్లు పరిశీలిస్తే.... కనబడేది నెం.5 వర్గపు పనితీరే! పరిశీలించండి!

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

1993 నుండి 1995 వరకూ మేము శ్రీశైలం పాతాళగంగ మెట్ల దారిలో ఓ చిన్న గుడిసెలో నివసించాము. ఒక్కరికి తప్ప అక్కడెవరికీ కరెంటు ఉండేది కాదు, మాక్కుడా! 1994 చివరి మాసాల్లో... ఉన్నట్లుండి ఒక్కసారిగా గంగ మెట్ల దారిలో ఉన్న గుడిసెలన్నిటినీ దేవస్థానం మరియు అటవీ శాఖ వాళ్ళు పీకించబోతున్నారన్న వార్త దావానలంలాగా చుట్టుముట్టింది. దాదాపుగా 150 - 200 గుడిసెలుంటాయి. బుట్టి నడుపుతూ, చేపలు పడుతూ, మేకల్ని పెంచుతూ, యాత్రికులని నదిలో షికారు తీసుకెళుతూ బ్రతికే వాళ్ళే అక్కడందరూ. ఎవరికీ చదువు సంధ్యలు రావు. దాదాపుగా అంతా వేలిముద్రల వాళ్ళే!

ఆ వార్తతో ఒక్కసారిగా అక్కడ సంచలనం రేగింది. భయాందోళనలు పుట్టాయి. తాతల కాలం నుండి అక్కడే ఉన్నామని, డ్యాం కట్టటానికి ముందునుండే అక్కడే ఉంటున్నామనీ చాలామంది అక్రోశించారు. గుంపులుగా చేరి చర్చించుకున్నారు. మల్లగుల్లాలు పడ్డారు. ఇంతలో "హైదరాబాదులో సంధ్యక్క ఉందంట. అందరం హైదరాబాదు వెళ్ళి కలిసి మాట్లాడితే సంధ్యక్క ఎట్లనైనా మన గుడిసెలు పీకేయకుండా ఆపిద్ది" అన్న ప్రచారం బయటికొచ్చింది. ఓ వారం పదిరోజుల గడిచే సరికి కార్యక్రమం నిర్ధారించబడింది. శ్రీశైలం ప్రాజెక్ట్ లో కాంట్రాక్టరు దగ్గర నుండి ఓ ఎర్రపార్టీ కార్యకర్త లారీని తీసుకొచ్చాడు. పొలోమని, ఇంటికి ఒకరిద్దరు చొప్పున దాదాపు లారీకి నిండుగా హైదరాబాదు వెళ్ళారు.

ఈ గొడవంతా మాకెందుకని, మేం నేరుగా శ్రీశైలం ఈవో దగ్గరికెళ్ళి మా గుడిసె పీకేయించవద్దని విజ్ఞాపన పత్రం ఇచ్చాము. అతడు ఆశ్చర్యపోయి అసలు అలాంటి ప్రణాళికే తమ వద్ద లేదనీ, అటవీ శాఖకి ఆ స్థలంలో ఎలాంటి అధికారాలూ లేవని, కాబట్టి గంగ మెట్ల దారిలోని గుడిసెలకి వచ్చిన ప్రమాదం ఏమీ లేదని చెప్పాడు. అంతేగాక కావాలంటే మాకు గుడి దగ్గర గది allot[అద్దె నెలకు60/- రూ.] చేస్తానన్నాడు. అప్పటి మా ఆర్ధికస్థితి పట్ల నమ్మకం లేక మేం ’మా గుడిసెలో మమ్మల్ని ఉండనిస్తే చాలు. అదే పదివేలు’ అనుకున్నాము. [అద్దె కట్టలేమన్న భయం కొద్దీ. పరిస్థితులు అలియాస్ రామోజీరావు ఏ స్థాయి లో మమ్మల్ని అప్పట్లో భయపెట్టాడో తెలుస్తుంది కదూ!] ఈవోకి కృతజ్ఞతలు చెప్పుకుని సెలవు తీసుకున్నాము.

ఆ మర్నాడు వార్తాపత్రికల్లో హైదరాబాదులో ఎర్రపార్టీ వాళ్ళ అధ్వర్యంలో భారీ సభ జరిగినట్లు వార్తలొచ్చాయి. మేం యధాలాపంగా చదివి వదిలేసాము. తర్వాత రోజు హైదరాబాదు వెళ్ళిన మాతోటి గుడిసె వాసులంతా తిరిగి వచ్చారు. వాళ్ళతో మాట్లాడాక మాకు అర్ధమయ్యిందేమిటంటే - వాళ్ళంతా కూడా ముందురోజు జరిగిన భారీ సభకి హాజరు పరచబడ్డారు. అయితే వీళ్ళు సంధ్యక్కని కలవ లేదు. వీళ్ళని తీసుకెళ్ళిన ఎర్రపార్టీ కార్యకర్తే సంధ్యక్కతో మాట్లాడాడట. ’సంధ్యక్క, అవసరమైతే ఈవో మీద అంతకంటే పైవారి మీదా కూడా వత్తిడి తెస్తామని’ చెప్పిందట. వాళ్ళంతా ఆమె పట్ల ఎంతో కృతజ్ఞతా భావంతో చెప్పారు.

సభ అయిపోయిన తరువాత, తిరుగుప్రయాణంలో ఆ ఎర్రపార్టీ అన్న వీళ్ళని వేరే లారీలో ఎక్కించాడు. ఆ లారీ వాడు వీళ్ళని మధ్యదారిలో వదిలేసి చక్కాపోయాడు. చచ్చీచెడీ బస్సుల్లో తిరిగివచ్చారు. హైదరాబాదు ప్రయాణంలో అగచాట్లు పడినా, సంధ్యక్క కారణంగానే తమ గుడిసెలు నిలబడ్డాయని వాళ్ళు సిన్సియర్ గా సుదీర్ఘకాలం[ఇప్పటికీ] నమ్మటం మాకు ఆశ్చర్యం కలిగించింది. వాళ్ళు అంతగా నమ్మటానికి కారణం తమని ఎక్కడా పైసా అడగలేదు. తమ కష్టానికి అన్నలే ఉచితంగా లారీని ప్రాజెక్ట్ కాంట్రాక్టర్ దగ్గర అడిగి తీసుకొచ్చారు. డీజీల్ కూడా వాళ్ళ ఖర్చే. అలాంటి చోట ’తమని ఎందుకు అన్నలు మోసం చేస్తారు?’ అన్నది వాళ్ళ లాజిక్. ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే - డీజీల్ ఖర్చు, లారీ ఖర్చు ప్రాజెక్ట్ కాంట్రాక్టరిది.

అసలు జరిగిందేమిటో తెలుసుకోవటానికి వాళ్ళకి చదువురాదు. అన్నల మీద వాళ్ళకున్న ’గురి’కి, ఇదీ విషయం అని చెప్పినా నమ్మరు. ఇప్పుడు వాళ్ళు గుడిసెలకి కరెంటు వచ్చింది. చేతుల్లోకి సెల్ ఫోన్లు వచ్చాయి. కలర్ టీవీలు వచ్చాయి. చదువులు రాలేదు. ఆలోచనలూ మారలేదు. దగా పడటమూ పోలేదు. ఎర్రపార్టీ వాళ్ళు, తామే పుకారు పుట్టించి, తామే ఉద్దరించేసారు.[కష్టం తామే కలిగించి, తామే ఆపద్భాంధవులు కావటం... పది స్ట్రాటజీలలో ఇదీ ఒకటి!]

అదంతా గమనించాక, ’సభలకి జనాలని సమీకరించటానికి ఇలాంటి పద్దతులూ ఉన్నాయన్న మాట’ అనుకున్నాము. ఇంకా 2009 ఎన్నికల్లోనే రోజుకూలి 150 - 250 రూ. + సారా పాకెట్టు + బిరియానీ పాకెట్టు ఇస్తే గాని జనాలు రావటం లేదని చదివి ’ఫర్వాలేదు. 14 ఏళ్ళు గడిచే సరికి ఆపాటి గడుసుదనం జనాలకి వచ్చింది కాబోలు’ అనుకున్నాము. ఉద్యమాల కోసమో, ఊరేగింపుల కోసమో, సభల కోసమో, సమావేశాల కోసమో, జనాలు దండిగా కనబడాలంటే - డబ్బిచ్చి తెచ్చుకునే కూలీలతో పాటు, పుకార్లతో భయాలు సృష్టించి లేదా ఆశలు పుట్టించీ [స్థలాలకీ పట్టాలిస్తారు గట్రా] పల్లెల నుండి ప్రజలని తరలిస్తారన్న విషయం అర్ధమయ్యింది. ఎటూ మద్దతుదారులు కొందరు, స్వచ్చందంగా వచ్చేవారు మరి కొందరూ ఉంటారు కదా!

మొత్తానికీ అలా పుకార్లతో, ప్రచారాలతో భయాల్నో లేక ఆశల్నో రేపటం చాలా సులభం అన్న విషయం మాకు ప్రత్యక్షంగా, అనుభవ పూర్వకంగా అర్ధమయ్యింది.

విచిత్రమేమిటంటే ఇప్పటికీ అక్కడి గుడిసె వాసుల్లో భౌతికంగా చిన్నచిన్న మార్పులు [సెల్ ఫోన్లు, కలర్ టీవీలు, గుడిసెలకి కరెంటు వంటివి] తప్ప పెద్దగా అభివృద్దేం లేదు. ఇప్పటికీ ఆ గుడిసె వాసుల నుండి ఒక్కడూ చదువుకొని సాంఘీకంగా, ఆర్ధికంగా మంచి స్థాయికి వచ్చిందీ లేదు. గుడిసెలూ మారలేదు. వారి ఆలోచనలూ మారలేదు. ఇప్పటికీ ఏ రోజు సరుకులు [బియ్యం, పప్పు గట్రా] ఆరోజు కొనుక్కుంటారు. జీవన స్థాయిలోనూ, ఆలోచనా సరళిలోనూ కూడా వారిలో మార్పేం లేదు.

అంతే కాదు ఇప్పటికీ వాళ్ళు తమ గుడిసెలు నిలబడి ఉండటానికి అన్నలే కారణం అని నమ్ముతారు.

అలా నాయకులని గ్రుడ్డిగా నమ్మే ప్రజలున్నంత కాలమూ, దగా చేసే నాయకులూ ఉంటారు. ఇటలీ నుండి ఇండియాకి వచ్చిన నాయకులైనా, పాకిస్తాన్ నుండి వచ్చి పరిపాలిస్తున్న నాయకులైనా, ఎన్టీయే లైనా, యూపీఏ లైనా... ప్రజల పట్లా, దేశం పట్లా, నిబద్దతా నిజాయితీ లేని నాయకులు నిరంతరం ప్రజలని మోసగిస్తూనే ఉంటారు. అందుకు ప్రాంతీయ భేదాలేవీ ఉండవు. బీహార్ ని బీహారీ అయిన లాల్ ప్రసాద్ యాదవ్ విడిచి పెట్టాడా? ప్రజలని దోచుకోవటమే కాదు, పశువుల దాణాని సైతం విడిచిపెట్టలేదు. తమిళునాడైనా, ఆంధ్రప్రదేశ్ అయినా... ఏ రాష్ట్రమైనా అంతే! ఈ పాటి దానికి ఆంధ్రా పాలకులు తమను అణచి వేస్తున్నారనో, తెలంగాణా నాయకులు దగా చేస్తున్నారనో అనుకోవటం దేనికి? ఏ రాయి అయినా ఒకటే పళ్ళుడగొట్టు కోవటానికి అన్నట్లు, రాజకీయ నాయకులంతా ప్రాంతాలకూ, పార్టీలకూ అతీతంగా, అవకాశాన్ని బట్టి సామాన్య ప్రజలని దగా చేస్తూనే ఉన్నారు.

ఇలాంటి నాయకులని నమ్ముతున్నంత కాలం బలిపశువులకీ, బలిదానాలకీ వ్యత్యాసం లేదు.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

హిందుమతం.
వేల సంవత్సరాలుగా, ఎవరెన్ని విమర్శలు చేసినా, ఎంత హేళన చేసినా, ఎన్ని కుట్రలు పన్నినా, ఎన్ని కాలుష్యాలని కలగలిపినా చెక్కుచెదరని హిమవగ్నగం.

ఎన్ని నదులు తనలో వచ్చి కలిసినా....
ఎన్ని తుఫానులు చెలరేగినా...
చెలియాలి కట్ట దాటని ధీర గంభీర సాగరం.
నిశ్శబ్ధంగా నినదించే సముద్రఘోష వంటిది హిందు సంస్కృతి.

అలాంటి సముద్రపు ఒడ్డున కొందరు ఇసుకలో, సముద్రపు అలల నురగలో కొట్టుకు వచ్చిన చిల్లర గవ్వల్నీ, పగిలిన శంఖాల్నీ ఏరుకుంటుంటే... మరి కొందరు ఆ ఆనంత జలరాశిలోకి దిగి, ఈతలు కొట్టి, లోతుల్లోకి మునిగి, మంచి ముత్యాలనీ, వెల లేని రత్నాల వంటి నిత్య సత్యాల్నీ అందుకుంటున్నారనీ, ఆస్వాదించి ఆనందిస్తున్నారనీ ’ఉషశ్రీ’ అంటారు.
అది నిజం!

సరస్సులోని బురద పూసుకునే వారు కొందరైతే, కలువలు కోసుకునే వారు కొందరు. ఎవరేది చూస్తారు, ఎవరేం చేస్తారు అన్నది ఆయా వ్యక్తుల దృష్టీని బట్టి, దృక్పధాన్ని బట్టి ఉంటుంది.

మరోరకంగా చెప్పాలంటే...

మనం చిన్నప్పుడు అక్షరమాల, గుణింతాలు నేరుస్తాం. ఆ తర్వాత వత్తులూ, చిన్న చిన్నపదాలు మెల్లిగా వాక్యాలు. ఆ తర్వాతే పద్యాలూ, కథలూ, వ్యాకరణాలూ, ప్రబంధాలూ! గణితమైనా అంతే! ముందు సంఖ్యలూ, కూడికలూ, తీసివేతలూ, హెచ్చవేతలూ, భాగహారాలు. తర్వాతే ఘాతాంకాలు, సంవర్గమానాలు, ఏది నేర్చినా. ఒకటో తరగతి తర్వాత 2,3,....అలా అలా పదో తరగతి. ఆపైన పీజీల దాకా, ఏ చదువైనా అంతే!
హిందూమతమైనా అంతే!

జనులందరికీ, అన్ని స్థాయిల వారికీ, వారి వారి స్థాయిని బట్టి అందుకునే విద్య వంటిది. ఆయా వ్యక్తుల మానసిక స్థాయిని బట్టి, పరిణతిని బట్టి, జన్మతః వారసత్వంగా వచ్చిన భావ సంపదని బట్టి, హిందూమతాన్ని వారు గ్రహించే తీరు ఉంటుంది. ఎవరైనా ఒకటో తరగతి నుండి పైతరగతుల్లోకి ప్రమోట్ అయినట్లుగా... సాధనతో పరిణతిని, పరిపక్వతని పెంచుకుంటూ పోవలసిందే!

అంతేగానీ ఒకటో తరగతి వాడు. తన అజ్జానం కొద్దీనో, తెలియని తనానికి అహంకారాన్ని జోడించుకునో, తన కంటే పై స్థాయి వాడిని నానా మాటలు అంటే ఎలా ఉంటుందో... హిందూమతం పైనా, హిందూ మతగ్రంధాల పైనా, విమర్శలు చేయటం అలా ఉంటుంది. దీన్ని సోదాహరణంగా వివరిస్తాను.

ముందుగా ఓ ఉదాహరణ చెబుతాను.

సూర్యాపేటలో ఎంసెట్ కోచింగ్ సెంటర్ నడుపుతున్న రోజుల్లో, ఓ రోజు క్లాసులో పిల్లలకి Quadrodic equations లో లెక్కలు చేయిస్తున్నాను. ఓ విద్యార్ధి "మేడం! 73 రావటం లేదండి" అన్నాడు. 73rd Problem అని అతడి ఉద్దేశం. ప్రక్కనే ఆడుకుంటున్న మాపాప [అప్పటికి ఆమెకి నాలుగున్నరేళ్ళు ఉంటాయి] "అయ్యో! 73 రాదా? 7 వేసి పక్కనే 3 వేయ్యాలి. అంతే!" అంది. ఆ పిల్లవాడు "అవునమ్మా! 73 రావటం లేదు" అంటూ అమాయకంగా ముఖం పెట్టి మా పాపని ముద్దు చేసాడు. అందరం ఒకటే నవ్వు కున్నాము.

ఆమె పసిది గనుక, అది కళ్ళకు కనబడుతున్న అమాయకత్వంతో కూడిన అజ్ఞనం కనుక, అందరం హాయిగా నవ్వుకుంటాం. అదే అహంకారంతో కూడిన అజ్ఞానంతో అవహేళన చేస్తే, క్రోధంతో అసహనంతో ఉడికి పోతాం. ఆ క్రోధపు స్థాయి కూడా ఆయా వ్యక్తుల్ని బట్టి ఉంటుంది. ఒకోసారి పరిణతి, పరిపక్వత స్థాయి ఎక్కువ ఉన్నవారు, ఉదాసీనంగానో, నిర్లిప్తతతోనో, అలాంటి అవహేళనలని పట్టించుకోరు. ’ఆశుద్దం మీద రాయి వేస్తే చింది మనమీదే పడుతుంది’ అనుకుని తప్పుకుని పోతారు.

అయితే... అశుద్దాన్ని, అశుద్దాన్ని నలుగురు తిరిగే బాటలో వేసిన వాళ్ళనీ ఉపేక్షించటం కూడా, ఓ పరిమితి[limit] దాటితే శ్రేయస్కరం కాదు. దేనికైనా ఓ పరిమితి ఉంటుంది కదా! అందుకే ’యుక్తాహార విహారస్య’ అన్నది గీత.

ఇక్కడో విశేషం ఏమిటంటే - ఇలా అశుద్దాన్ని వెదజల్లే వారి వాదనలనే తప్ప, ఆ వాదనలోని లొసుగుల్ని ఎత్తి చూపే వారి గళాలకి మీడియా మైకు ఇవ్వకపోవటం. అంటే ఫోకస్ చేయకపోవటం.

కాబట్టే, రామాయణ విషవృక్షాలకీ, రంగనాయకమ్మలకే వచ్చినంత ఫోకస్ కల్పవృక్షాలకీ, హిందూ మతగ్రంధాల సమర్ధకులకీ వచ్చేది కాదు. ఆ స్థితి ఇప్పుడూ ఉండటం చూస్తునే ఉన్నాం.

నిజానికి....

ఒకటో తరగతి పిల్లవాడు ఇంటర్ పిల్లవాడి లెక్కల నోట్సులోని Integrals నీ, Partial Derivatives నీ చూసి ’ఇవేం పిచ్చిగీతలు?’ అంటూ అవహేళన చేస్తే....?

ఇంటర్ పిల్లవాడు ఒకటో తరగతి వాణ్ణి చూసి, తానూ అవిదాటే వచ్చానన్న విషయం మరచి "ఇదేనా నీ స్థాయి?" అంటూ వెక్కిరిస్తే...? ఫలితం వైషమ్యాలే!

నిజం చెప్పాలంటే - ప్రసాదం కోసం గుడికి వచ్చినా, క్రమంగా మంచివైపుకీ, భగవంతుడి వైపుకీ ఆకర్షించబడతారు అన్నది అన్ని మతాలలోనూ ఉన్న ఆచరణే! అదే హిందూమతంలో అయితే... భాగవతంలోని రాసలీలలు, ఇతిహాసాలలోని స్త్రీ అంగాంగ వర్ణనలు, శృంగార వర్ణనలు కూడా అలాంటివే! గుడులలో ప్రాకారాల మీదా, గోపురాల మీదా ఉండే శృంగార భంగిమలతో కూడిన శిల్పాలు కాముకులని కూడా గుడుల వైపూ, క్రమంగా దైవం వైపూ ఆకర్షిస్తాయి. అందునా పూర్వపు రోజుల్లో పబ్బులూ, నీలిచిత్రాలూ, బూతుబొమ్మలు చూపే వెబ్ సైట్లూ ఉండేవి కావు కదా! [వేశ్యావాటికలున్నా చీకటి మాటున పోవలసిందే! అదీగాక వేశ్యలని entertain చేసేంత ధైర్యమూ, ధనమూ కూడా, కొందరికే తప్ప అందరికీ ఉండవు కదా!]

కాబట్టే ’కామి కానివాడు మోక్ష కామికాడు’ అనే సామెత కూడా ఉండింది.

ఈ విషయాన్ని స్పష్టపరుస్తూ, భాగవతం చివరిలో, ముసళ్ళ పండుగకు ముందర, శ్రీకృష్ణ నిర్యాణ ఘట్టంలో, తనను చూడ వచ్చిన గోపికలు శ్రీకృష్ణుడితో - గతంలో తామెంతో ఆనందంగా గడపటం గురించి ప్రస్తావించి ఆ భాగ్యం తమకు కరవైందని దుఃఖిస్తారు. గోపికలని ఓదార్చిన శ్రీకృష్ణుడు వాళ్ళకు జ్ఞాన బోధ చేస్తాడు. ఇది ఎలాంటిదంటే - చాక్లెట్ కోసం ఓ పిల్లవాడు మారాం చేస్తున్నాడనుకొండి. మనం ఏం చెప్పినా వాడి చెవికి ఎక్కదు. గొల్లుమంటూనే ఉంటాడు. వాడి స్థాయి అది. నాలుగు తగిలించినా ఏడుస్తునే ఉంటాడు. అప్పుడు మనం ఏం చేస్తాం? దాంతో మనం చాక్లెట్లు ఇచ్చేస్తాం. వాడి కోరిక తీరాక, అప్పుడు కౌన్సిల్ చేస్తాం. చాక్లెట్లు ఎక్కువ తింటే పళ్ళు పుచ్చుతాయనీ, అనారోగ్యం వస్తుందనీ మెల్లిగా నచ్చజెపుతాం. మెల్లిగా వాడి మనస్సులో మార్పు తెస్తాం.

ఇది ఆధునిక మానసిక వైద్యులూ ఒప్పుకునే విధానమే. అదే ఇతిహాసాల్లోని శృంగార వర్ణనలూ, గుడుల్లోని శిల్పాలూ చేసేవి. అదీగాక ఒకప్పుడు గుడులే సర్వవిద్యా కేంద్రాలు; లైంగిక విద్యతో సహా! విద్యనీ, జీవన కళనీ నేర్పేది కూడా అప్పట్లో మతం ఒక్కటే!

కాబట్టే, అన్నమయ్య, క్షేత్రయ్య, జయదేవుడి వంటి భక్త కవులు కొందరు భగవంతుడి పేరిట శృంగార కీర్తనలు వ్రాసి పాడారు. అలాంటి వాటి పట్ల కూడా ఎవరి స్పందన వారిది! అదీ ఆయా వ్యక్తుల స్థాయిని బట్టి, దృక్పధాన్ని బట్టి ఉంటుంది.

హిందూమతంలోని ప్రతికోణం ఎంతో పరిణతితో కూడినది అనటానికి ఒక ఉదాహరణ చెబుతాను. మనం గుడికి వెళ్ళినప్పుడు గుడి ప్రాకారాల నుండి మూల విరాట్టు దగ్గరికి వెళ్ళే సరికి చాలా దూరం ఉంటుంది. అది క్యూ లైను అవ్వచ్చు, లేదా గుడి పెద్దదిగా ఉండటం చేత అవ్వచ్చు. అలా ఉండటం ఎందుకంటే ఎంతటి వారికైనా తమ దైనందిక చర్యల తాలూకూ ఆలోచనలు దైవందర్శనం అప్పుడు చుట్టుముట్టకుండా, ప్రాకారం నుండి మూలవిరాట్టు దగ్గరికి వచ్చేసరికి దైవం చుట్టే ఆలోచనలు ఉండేటట్లు, ఏకాగ్రత కుదిరేటట్లు చేయటం కోసం. అంత పెద్ద గుళ్ళు ఉండేవి. ప్రాకారం నుండి దైవం దగ్గరికి వచ్చేసరికి క్రమంగా ఆలోచనలు దైవం చుట్టే తిరుగుతాయి. చిన్న గుడుల్లో అయినా ప్రదక్షిణానంతరమే దైవ దర్శనం చేసుకోవటంలో కూడా ఉన్నది ఈ అంతస్సూత్రమే. అంతగా మనిషి ఆలోచనా సరళి బట్టి,మనిషిని ఎలా దైవం దగ్గరికి తీసుకెళ్ళటమా అని ఆలోచించి తీర్చిదిద్దబడింది హిందూమతం.

సరే, ఇదంతా పక్కన బెడదాం. హిందూమతంలో, ఇతిహాసాలలో శృంగార వర్ణనలూ, అసంబద్ద పాత్రలూ ఉన్నాయనుకుందాం. అయితే అవొక్కటే ఉన్నాయా? మరింకే మంచి విషయాలూ లేవా? అదీ హిందూమతంలో మాత్రమే ఉన్నాయా? అయినా మంచి ఎక్కడ ఉన్నా గ్రహించటం, చెడు ఎక్కడున్నా విస్మరించటం విజ్ఞల లక్షణం అంటారు. అటువంటప్పుడు హిందూ ఇతిహాసాల్లోని చెడు[ఉంటే] వదిలేసి, మంచినే గ్రహిస్తే గొడవే లేదు కదా! అది వదిలేసి "ఇంత అంగాంగ వర్ణనలున్నాయి, ఇంత చెత్త ఉందీ!" అంటూ పనిగట్టుకుని మరీ గగ్గోలు చేయటం దేనికి?

దాదాపు రెండున్నర దశాబ్దాల క్రితం డాక్టర్ సి.ఆనందారామం వ్రాసిన ఇంద్రసింహాసనం’ అనే నవల చదివాను. అందులో నహుషుడు ఇంద్రపదవి చేపట్టటం, ఇంద్రాణి అయిన శచీదేవిని వాంఛించటం, ఆ క్లిష్ట స్థితిలో శచీ దేవి సమస్యలని ఎదుర్కొన్న తీరు, దానికి సమాంతరంగా అజ్ఞాతవాసంలో ద్రౌపదీ దేవి విరటుని అంతఃపురందాసిగా వ్యవహరిస్తూ ఇతరులలో స్ఫూర్తి నింపటం వగైరాలతో, భారత కథని ఆధునిక సామాజిక స్థితులకి అనువర్తిస్తూ రచయిత్రి చిత్రించింది. అందులో శచీదేవి పాత్ర, ఎమర్జన్సీ అనంతర ఓటమి నాటి రోజుల్లోని ఇందిరాగాంధీ సంఘర్షణని కొంత వరకూ ప్రతిబింబించిందన్న మాట కూడా ఆ రోజులలో విన్నాను. అలాంటి రచనల గురించి పెద్దగా చప్పుడూ ఉండదు. మెల్లిగా అలాంటి రచయిత/రచయిత్రులూ పెన్ డౌన్ అయిపోతారు. అదొక విచిత్రం ఇక్కడ.

ఇలాంటి కుయుక్తుల గురించీ, కుట్రల గురించీ, దౌష్ట్యపు వాదనల గురించీ, నా ఆంగ్లబ్లాగు Coups On World లోని Coups on Hindu Epics లో సుదీర్ఘమైన, సంపూర్ణమైన వివరణ వ్రాసాను. ఆంగ్లంలో వ్రాయటానికే నాకు చాలా సమయం పట్టింది. తెలుగులోకి అనువదించేందుకు సమయం దొరకటం లేదు.

ఇక ఈ టపా ముగించే ముందు మీతో నా సంతోషాన్ని పంచుకోవాలని వ్రాస్తున్నాను. ఇటీవల రంగనాయకమ్మ వారసుల వంటి కొందరు రచయితలు భారతంలోని పాత్రల మీద నవలలు రచించారు. అలాంటి వారిలో ఓ రచయితకి ఇటీవల కేంద్ర సాహిత్య పురస్కారం లభించింది. ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్నవారు భారతీయ సంస్కృతీ, దేశీయతల మీద కుట్రలు జరుపుతున్న వారికి అనుచరులు కావటాన, ఇలాంటి వారికే అవార్డులు రావటం అన్నది సహజ పరిణామం. ఈ నేపధ్యంలో మరోసారి అలాంటి రచనలకి సంచలనం అంటుకుంది.

ఆ మీదట విమర్శలూ, సమర్ధింపులూ పత్రికల్లోనూ, బ్లాగుల్లోనూ కూడా వచ్చాయి. ఎటూ మీడియా హిందూమత సమర్ధకులకి ఎక్కువ కవరేజ్ ఇవ్వదు గదా! అయితే బ్లాగ్లోకంలో కొందరు బ్లాగరులు, హిందూమత గ్రంధాలపై బురద చల్లే కుటిల యత్నాలని ఎదుర్కున్న తీరు నాకు చాలా నచ్చింది.

7 వ తరగతి పిల్లలకి హిందీలో ఓ పద్యం[దోహా] ఉంటుంది. వసంత ఋతువు కోకిల గానం చేస్తుంటుంది. తర్వాత వర్షాకాలం వస్తుంది. అప్పుడు కోకిల మౌనం వహిస్తుంది. వర్షాలకి నీళ్ళు నిండగా చెఱువులూ, దొరువుల్లో కప్పలు చేరి బెకబెక మంటూ దరువులు వేస్తుంటాయి. కోకిల మౌనం దాల్చినందునే కప్పలు గానం ప్రారంభించాయంటాడు కవి. అలాగే మేధావులు/మంచివారు మౌనం దాల్చగా మూర్ఖులూ/చెడ్డవారు తమ వాదనలతో సమాజాన్ని కాలుష్య పూరితం చేస్తారని పోలిక చెబుతాడు.

అందరూ చెడునీ, చెడు వాదనలని చూసి, "అశుద్దం మీద రాయి వేస్తే చింది మనమీదే పడుతుంది. ఎందుకొచ్చిన గొడవ? తప్పుకు పోతే సరి"అనుకుంటేనే... నిర్లిప్తత వహించి "ఎవరి పాపాన వాళ్ళే పోతారు" అనుకుంటూ ఉపేక్షిస్తేనే... పరిస్థితి ఇంత వరకూ వచ్చింది. హిందూమతం మీద బురద చల్లే హక్కు, మీడియా సాక్షిగా, చాలామందే పుచ్చుకున్నారు. మీడియా మైకు నివ్వక పోయినా, కనీసం ఈ బ్లాగ్లోకంలోనైనా అలాంటి కుటిల యత్నాలని కొందరు బ్లాగరులు ఎదుర్కున్న తీరు హర్షణీయంగా ఉంది. అలా ఎదుర్కున్న వారిలో నా కంటే పెద్దవారికి నా నమస్కృతులు. నా కంటే చిన్న వారికి నా ఆశీస్సులు.

ఈ దృశ్యం ఎవరి స్థాయిలో వారు యుద్దం చేస్తుంటే చూస్తున్నట్లుగా ఉంది. యతో ధర్మ తతో జయః అనిపిస్తోంది. అందరికీ మా జేజేలు!

అయితే ఒక చిన్న సవరణ! మనం సమస్యని గాక, సమస్య మూలాలని నాశనం చేయాలి. అప్పుడే యుద్దం సరైన రీతిలో ఉంటుంది. కాబట్టి హిందూఇతిహాసిక పాత్రలని తమ ఇష్టమొచ్చిన రీతిలో,తమ అరిషడ్వర్గాల సహితంగా చిత్రీకరిస్తూ ఆధునిక పోకడలు పోతున్న అపర ఆచార్యులనీ, రంగనాయకమ్మ వారసుల వంటి వారినీ, అలాంటి రచనలకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు ప్రదానం చేసిన వారినీ, చేయింపించిన వారినీ లక్ష్యంగా ఎంచుకోవటం మంచిది. అంతేగానీ ఆయా రచనలనీ, రచయితలనీ సమర్ధించే లేదా పొగిడే తోటి బ్లాగర్లతో వివాదాలు పడటం, మాటల తూటాలు పేల్చుకోవటం అనవసరం. వైషమ్యాలు పెరగటం మినహా ఒరిగేదేం ఉండదు. అది బ్లాగ్లోకంలో ఒకరికొకరు జాతర బొమ్మలు/జంటపీతలుగా తయారవటమే అవుతుంది.

యుద్దంలో శస్త్రాన్ని సంధించేటప్పుడు లక్ష్యాన్ని కూడా సరిగా నిర్ణయించుకోవడం ముఖ్యం కదా! తోటి బ్లాగర్లని విమర్శించటం ద్వారా, పరిధి కుదించుకుపోతుంది. అంతేకాదు మన విలువైన శక్తి, సమయం, ఆవేశం కూడా వృధా అవుతాయి. ఎవరైతే ఇటువంటి కుటిల రచనలని గొప్ప సాహిత్యలుగా బహుమతులు కట్టబెట్టారో, కట్టబెట్టించారో వాళ్ళని లక్ష్యంగా చేసుకోవటం ద్వారా, మన అభిప్రాయాన్ని చెప్పినట్లవుతుంది. బ్లాగుల ద్వారా మన గళాన్ని వినిపించినట్లవుతుంది. అలాగాక, తోటి బ్లాగర్లని కెలుక్కోవటంలో ఆనందం ఉందంటే, అది వారి ఇచ్ఛ.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

ఇప్పుడు కాదు, దశాబ్ధాల క్రితం నుండి రామోజీరావుకీ, ఈనాడుకీ, అంబానీలంటే అమిత ప్రేమే! 1980 లలో ధీరూబాయ్ అంబానీ తుమ్మినా, దగ్గినా ఈనాడుకి వార్తే! అప్పట్లో లార్సెన్ అండ్ టూబ్రో కంపెనీ బోర్డు పదవి విషయమై, దాదాపు పక్షం రోజులపాటు, ఈనాడు అర్థపేజీ కేటాయించి మరీ పెద్దపెద్ద శీర్షికలతో ధీరూబాయ్ అంబానీకి మద్దతు గానూ, అతడికి ఇమేజ్ ఇస్తూనూ వ్రాసి పారేసింది. ’ఈ రోజు ప్రపంచమంతా అటే చూస్తోంది’ అంటూనూ, ’అందరిలోనూ అదే ఉత్కంఠ’ అంటూనూ వ్రాసింది. 1989 - 90 లలో జరిగిన ఈ ప్రచారం చదివి, నాకు చాలా ఆశ్చర్యం వేసింది. 1992 లో ఈనాడులోని నా మిత్రురాలు చెప్పిన భోగట్టాతో అలాంటి వ్రాతలపట్ల ఓ అవగాహన వచ్చింది. 2005 తర్వాత వాటి తాలూకూ కార్యకారణ సంబంధం అర్ధమయ్యింది.

తర్వాత రోజుల్లో, ధీరూబాయ్ అంబానీ సదరు L&T ని వదిలేసుకున్నాడు లెండి. అప్పుడు ఈనాడు గప్పుచుప్పున ఉండిపోయింది. 2008 లో, ఆదివారం సంచికలో, అప్పటికి కీర్తిశేషుడైన ధీరూబాయ్ అంబానీ మీద ప్రత్యేక కథనం సమర్పిస్తూ, ఎన్నో ఉపమాన, ఉత్ర్పేక్ష అతిశయోక్తి అలంకారాలన్నీటినీ ఏర్చికూర్చి ఈనాడు వ్యాసం ప్రచురించింది.

అంతగా ఈనాడు రామోజీరావుకి అంబానీలు ఎంతో ’అయినవాళ్ళు’. ఇక ఈనాడు, అంబానీసోదరులు అనిల్, ముఖేష్ లలో ముఖేష్ వైపుకు ఎక్కువ మొగ్గు చూపుతుంటుంది. ఎంతగా అంటే మచ్చుకి క్రింది వార్త పరిశీలించండి.



పైన పేర్కొన్న న్యూయార్క్ టైమ్స్ విశ్వసనీయత గురించి, ఇటీవలే ఈనాడు, ఎగ్జయిల్డ్ పత్రిక కథనాన్ని ఉటంకిస్తూ TV 5 ప్రసారం చేసిన వై.యస్. మరణవార్త నేపధ్యంలో జరిగిన, రిలయన్స్ ఆస్థులపై దాడుల గురించి వ్రాస్తూ, జనవరి 8న, సదరు ’న్యూయార్క్ టైమ్స్’ దశాబ్దాల నుండి గొప్ప విశ్వసనీయత గల పత్రిక అని వ్రాసింది. అంత విశ్వసనీయ పత్రిక ఎంతగా ముఖేష్ అంబానీని, అహింసామూర్తి అయిన బాపూజీ తో పోల్చి, ఆకాశానికేత్తేస్తూ వ్రాసిందో మీరే పరిశీలించండి.

సామాన్యులు ఒక్కరుగా సాధించలేని స్వాతంత్రాన్ని, అందరిని సంఘటిత పరిచి, అహింసాపద్దతిలో బాపూజీ దేశ స్వాతంత్రాన్ని సాధించాడు. అదే అంబానీ సోదరులు, సామాన్యుడు స్వతంత్రంగా, ఆత్మగౌరవంతో, బ్రతకగల వ్యాపారాలని, ప్రభుత్వ సహకారంతో, లాబీయింగ్ తో ఊడగొడుతూ రిలయన్స్ ఫ్రెష్ లు, రిలయన్స్ మార్ట్ లు పెడుతున్నారు, ముందు ముందు రిలయన్స్ మంగలిషాపులు కూడా పెడతారట. సామాన్యుడు పెట్టుబడి పెట్టలేని పెద్దపెద్ద వ్యాపార సంస్థలు, తయారి సంస్థలు పెట్టాలి గాని, ప్రజలు పెట్టుబడిపెట్టగల చిన్నచిన్న వ్యాపారాలని మూతేయిస్తూ, తాము ఆ వ్యాపారాలు చేయటం ఎలాంటి దేశ సేవ? ఇది పక్కా దోపిడి మాత్రమే! ఈ రిలయన్స్ లాంటి వాళ్ళు, కిరాణా వ్యాపారంలోని రాకముందు కిరాణా దినుసుల ధరలు నేల మీదనే ఉండేవి. మాంద్యం పైకారణంగా[over leaf reason] చూపిస్తూ, నల్లబజారు వ్యాపారం జోరుగా నడుపుకుంటున్నారు.

ఇలాంటి ముఖేష్ అంబానీ, తమ్ముడు అనిల్ అంబానీ పై హత్యా ప్రయత్నాలు చేసాడని సాక్షాత్తూ అతడి తమ్ముడే ఆరోపించాడు. అదే కథనాన్ని ఎగ్జయిల్డ్ పత్రికా ఉటంకించింది. సాక్షి కూడా వ్రాసింది. అనిల్ హెలికాప్టర్ ఇంజన్ లో ఇసుక గట్రా ఉండటం గమనించి ఫిర్యాదు చేసిన సాంకేతిక ఉద్యోగి శవం, తదుపరి రెండు రోజుల్లోనే, రైలు పట్టాలపైన తేలింది. జనవరి 7 వ తేదీ రాత్రి, ఆంధ్రప్రదేశ్ లో జరిగిన రిలయన్స్ ఆస్థులపై దాడులని ముఖేష్ అంబానీ కూడా ’ఇది తమ వ్యాపార ప్రత్యుర్దులతో కలిసి పన్నిన కుట్ర’గా అభివర్ణించాడు. అలాంటి ముఖేష్ అంబానీకి మహాత్మాగాంధీతో పోలిక! బాపూజీ భారతదేశానికి దిశానిర్దేశం చేసినంతగా, ముఖేష్ అంబానీ భారతదేశ వ్యాపార ప్రపంచానికి దిశానిర్దేశం చేసాడట!

అంతగా, ఈనాడు ఒక్కటే గాక, దేశీయ అంతర్జాతీయ మీడియా కూడా ముఖేష్ అంబానీకి అంత సీన్ ఎందుకు ఇస్తాయో, ఏ ప్రయోజనాలను ఆశించి ఇస్తాయో ఈశ్వరుడికే తెలియాలి. ఇక అంబానీలు తమ భార్యలకి ఎంత విలువైన కానుకలిస్తారో ఈనాడు ఆదివారం అనుబంధంలో పలుమార్లు ఫోటోలతో సహా కథనాలు వ్రాసింది. అనిల్ అంబానీ తన భార్య టీనా అంబానీకి విలాసవంతమైన నౌకని కానుకగా ఇస్తే, అంతకంతే మరికొన్ని కోట్లరూపాయలు ఎక్కువ విలువైన విలాసవంతమైన విమానాన్ని , ముఖేష్ అంబానీ తన భార్య నీతా అంబానీకి కానుకగా ఇచ్చాడట. ’ఎంత గొప్ప ప్రేమ కానుకలో గదా!’ అంటూ ఈనాడు ముక్తాయించింది.

’ఎంత ఎక్కువ ఖరీదైతే అంత ఎక్కువగా ప్రేమ ఉన్నట్లన్న’ ప్రచారం సంగతి పక్కనుంచినా, తమ భార్యలకి లేదా ప్రియురాళ్ళకి ఆయా విలాస పురుషులు కానుకలిచ్చుకుంటే, ఆయా సెలబ్రిటీల గురించి పత్రికలు కథనాలు ఫోటోలు[కత్రినా కైఫ్ కి వజ్రాలు పొదిగిన వాచీలు గట్రా కానుకగా ఇచ్చిన సల్మాన్ ఖాన్ ల గురించి కూడా] ప్రచురించి పత్రికలు ఏవిధంగా ప్రజాసేవ చేస్తున్నట్లో వారికే తెలియాలి.

పైగా ఈ ప్రచారంలోనూ, ఆస్తుల్లోనూ, ప్రభుత్వ అండదండల్లోనూ కూడా అన్నదే పైచేయి అని తమ్ముడు వాపోతూ ఉంటాడు. అన్న ముఖేష్ చేస్తున్న, చేసిన వ్యాపార అక్రమాల గురించి బయటపెట్టినా కూడా, కేంద్రం కలిసి రాకపోయే సరికి, మెట్టు దిగొచ్చి "అన్నయ్యా! రాజీ పడదాం. అమ్మకి ఇంతకన్నా మంచి బహుమతి మరొకటి ఉండదు" అంటూ బహిరంగంగానే urge పెట్టుకున్నాడు. అయినా ఫలితం రాలేదు. నిజానికి వీరి తండ్రి ధీరూబాయ్ అంబానీ హయాంలో, లాబీయింగ్, లైజాన్ వ్యవహారాలన్నీ అనిల్ అంబానీయే చూసుకునే వాడన్న వార్తలున్నాయి. అయినా గానీ, అన్నదమ్ములిద్దరిలో అన్న వైపే, మీడియా దగ్గర్నుండి సోనియా దాకా మొగ్గు చూపటం ఇక్కడ గమనార్హం.

ముఖేష్ అంబానీ, పరస్పరం ప్రతిపక్షాలైన ఎన్టీయే కీ, యూపీఏ కీ కూడా గారాబు బిడ్డే. అంతేకాదు కాంగ్రెస్ అధినేత్రి సోనియాకీ, కాంగ్రెస్ వ్యతిరేకి రామోజీరావుకీ కూడా ముద్దుబిడ్డే. అదే ఇక్కడ విచిత్రం! ఇక్కడ తెలియటం లేదూ అన్నిటి వెనుకా, అందరి వెనకా ఒకే వ్యవస్థ ఉందన్న విషయం?

వేలకోట్ల రూపాయలు వెచ్చించి ముఖేష్ అంబానీ నిర్మిస్తున్న 26 అంతస్థుల విలాసవంతమైన నివాస భవనం గురించి మరికొన్ని ఆసక్తికరమైన కథనాలు ఈనాడు పీరియాడికల్ గా వేస్తూంటుంది. అతడి 26 అంతస్థుల ఇంద్రభవన నిర్మాణం, ముంబైలో, కొంతమేర వక్ఫ్ బోర్డు భూభాగంలోకి విస్తరించిందని, అందుకు తాము అనుమతించబోమనీ, పేల్చివేస్తామని, ఓ దశలో ముస్లిం ఉగ్రవాదుల అల్టిమేట్ విన్పించింది. తర్వాత డబ్బే చేతులు మారిందో, లాబీయింగే పనిచేసిందో, రెండూ కలిసి మరీ ప్రభావం చూపాయో గాని, మళ్ళీ ఏ ఊసూ బయటకి రాలేదు.

ఈ మొత్తం వెలుగు జిలుగుల వెనక, చీకటి మరకలు ఏమిటంటే - ముఖేష్ అంబానీకి కాంట్రాక్టు మీద అప్పచెప్పే నాటికి గోదావరి కృష్ణా బేసిన్ లో అపార గ్యాస్ నిక్షేపాలు, కాగితాల మీద ఇంకా బయటపడలేదు. ఇదెంత పకడ్బందీగా నడిచిన దోపిడి అంటే - అక్కడ నిక్షేపలున్నాయో లేవో చూసుకోకుండానే... కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, చట్టాలు సవరించి మరీ, అప్పటికి కాగితాల మీద ఉటంకించబడిన చమురు నిక్షేపాలని మాత్రమే దృష్టిలో ఉంచుకుని, ముఖేష్ అంబానీకి అనుమతి ఇచ్చాయి. తరువాత ముఖేష్ అంబానీ ’అదృష్టం’ కొద్దీ అక్కడ అపార గ్యాస్న్ నిక్షేపాలు వెలుగు చూసాయి. ఎంత నాటకీయ అదృష్టామో అంత అద్భుత రాజకీయ విన్యాసం అది. ఈ నేల, అందులోని విలువైన నిక్షేపాలు ఇక్కడి ప్రజల సొమ్ము కాదు. యూపీఏ లేదా ఎన్టీయే ప్రభుత్వాల, ప్రభుత్వాధినేతల గుత్తసొత్తు. కాబట్టే అప్పనంగా అంబానీలకు అప్పచెప్పారు.

అందునా ముఖేష్ అంబానీ ఎంత పవర్ ఫుల్ అంటే... జనవరి 7 రాత్రి అతడి ఆస్థులపైన దుండగులు దాడి చేసిన కొద్ది వ్యవధిలోనే అతడూ సీరియస్, కాంగ్రెస్ అధిష్టానమూ సీరియస్, ఆపైన ఆ ’రెండు పత్రికలు’ సీరియస్! గంటల వ్యవధిలోనే ముఖేష్ అంబానీ నుండి ఫోన్ వస్తే... వెంటనే లైన్ లోకి వచ్చిన ప్రధానమంత్రి, కాంగ్రెస్ అధినేత్రి! ఎంత అత్యవసర పరిస్థితులలోనైనా, ఏ రాష్ట్రముఖ్యమంత్రికయినా అంత సీన్ లేదు! సీనియర్ నాయకులయితే అధిష్టానం అపాయింట్ మెంట్ ల కోసం, ఫోన్ కాల్ కోసం పడిగాపులు పడాల్సిందే!

ముఖేష్ అంబానీ ఫోన్ రావడం ఆలస్యం, చక చకా ప్రభుత్వం కదిలింది. రాష్ట్రంలో ప్రతిపక్షనేత చంద్రబాబు, ఒక్క ఉదుటున మీడియా ముందుకు వచ్చాడు. సాలార్ జంగ్ మ్యూజియంలో టైమవ్వగానే బయటికొచ్చి గంటలు కొట్టి, లోపలికి వెళ్ళిపోయే బొమ్మలాగా, ఒక్కసారిగా బయటకు వచ్చి మీడియా ముందు ఆగ్రహం, ఆక్రోశం, ఆవేదన వెలిబుచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయాడు. అరెస్టులూ, బెయిళ్ళు అన్నీ అయిపోయాయి.

రెండు నెలలన్నది కాస్తా నాలుగున్నర నెలలు గడిచినా వై.యస్. హెలికాప్టర్ ప్రమాదపు కేసుని తేల్చలేదు. సంవత్సరం దాటినా అనిల్ అంబానీ హెలికాప్టర్ ఇంజన్ లోని లోపాల్ని గుర్తించిన ఉద్యోగి హత్య కేసు తేల్చలేదు.[మొదట ప్రమాదం అనీ, తర్వాత ఆత్మహత్య అనీ, ఆ తర్వాత హత్యగా పోలీసులు దీన్ని నమోదు చేసారు].ఇక సోనియా భర్త రాజీవ్ గాంధీ హత్య కేసయితే 18 ఏళ్ళయినా తేల్చలేదు.

అదే ముఖేష్ అంబానీ ఆస్తులపై దాడులనే సరికి మాత్రం ఆఘమేఘాల మీద, వార్తల్ని ప్రసారం చేసారన్న కారణంగా సంపాదకులని అరెస్టు చేసారు. ఎస్.ఎం.ఎస్. లిచ్చాడన్న కారణంగా వంశీ చందర్ లని అరెస్టు చేసారు. పార్టీ నుండి బహిష్కరణలూ చేసారు. అదీ ముఖేష్ అంబానీ పట్ల సోనియాకీ , మీడియాకీ ఉన్న శ్రద్ద!

రాష్ట్రంలో పదికోట్ల విలువ చేసే రిటైల్ సంస్థలున్న రిలయన్స్ కు రెండుకోట్ల రూపాయలు ఆస్థినష్టం సంభవించిందట.[బీమా వస్తుంది లెండి] రాష్ట్రంలో రిలయన్స్ ఎంత మందికి ఉపాధి కల్పిస్తుందో తెలుసా? పదివేల మందికి. గొప్పవిశేషంగా, దీన్ని గురించి చెప్పే మీడియా, ఇంతా చేసి రిలయన్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని కోట్ల రూపాయల వ్యాపారం నిర్వహిస్తుందో, అందులో ఎన్ని కోట్లు లాభంగా పొందుతుందో మాత్రం చెప్పదు. అంతేకాదు, ఎన్ని చిన్నవ్యాపారాలు మూతపడ్డాయో చెప్పదు. పదివేల మందికి ఉద్యోగమిచ్చి ఉద్దరిస్తోందని మాత్రం ఊదర పెడుతుంది.

ఈ వ్యవహారంలో మరణించిన వై.యస్. కీ, రిలయన్స్ అధినేతకీ మధ్య ఏం నడిచిందో ఇంకా వెలికి రావాల్సి ఉంది. అయితే ఇక్కడ కొసమెరుపు ఏమిటంటే - 1980 లలో, ఇందిరాగాంధీ హయాంలో... ప్రభుత్వం గానీ, మరెవ్వరు గాని, పత్రికల గురించి పల్లెత్తు మాట అన్నాసరే...
’పత్రికా స్వేచ్ఛ’ అంటూ గగ్గోలు పెట్టిన ఈనాడు,
’పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగిస్తే ప్రజాస్వామ్యాన్ని హత్య చేసినట్లే’ నని హుకరించిన ఈనాడు,
’ఇందిరాగాంధీ పత్రికల [మీడియా] నోరు నొక్కబోతోందని’ హోరెత్తించిన ఈనాడు,
ఈ రోజు తానే తోటి మీడియా సంస్థల మీద, విరుచుకు పడింది. జర్నలిస్టుల అరెస్టులని సమర్ధించింది.[అప్పట్లో ఈనాడుతో మరికొన్ని రాష్టీయ, జాతీయ పత్రికలు గొంతు కలిపాయి లెండి. ట్రెండ్ సెట్టర్ ని అనుసరిస్తాయి కదా!] అలాంటి ఈనాడు, ఒక్కసారి గాకపోతే ఒక్కసారి, మాట వరసకైనా, ’పత్రికా స్వేచ్ఛ’, ’మీడియా స్వాతంత్రం’ అననే లేదు సుమా! జర్నలిస్టులని బెదిరించ కూడదని, శిక్షించకూడదని అనలేదు. నిర్ధారించుకోకుండా అబద్ధాలు ప్రచారించారని ఖస్సుమంది. మరి ఇన్నాళ్ళుగా తాను చేసిందీ అదేగా? [ఎంతయినా అంబానీ నిధులు కంపానీ పేరుతో రామోజీరావు కుటుంబ వ్యాపార సంస్థ మార్గదర్శిలోకి మళ్ళాయి మరి!]

తాను చేస్తే శృంగారం, ఎదుటి వాడు చేస్తే వ్యభిచారం - ఇవే రామోజీరావు పాత్రికేయ విలువలు!

అసలింతకీ- ఇంతగా ముఖేష్ అంబానీని రక్షించుకోవలసిన అవసరం సోనియాకి, మీడియాకి ఎందుకు వచ్చినట్లు?

సెప్టెంబరు 2 వ తేదీ 2009 న జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో, ముఖ్యమంత్రి వై.యస్.కి, మరణానికి ముందు 18 నిముషాల సమయం ఇవ్వబడింది. ఈనాడు అప్పట్లో అయోమయాలు సృష్టిస్తూ వ్రాసిన వార్తాంశాలలో ఇది కూడా ఒకటి. ’ఆ 18 నిముషాలలో ఏం జరిగినట్లు?’ అన్న శీర్షికతో వ్రాసింది. ఆ వార్తే గనక నిజమైతే, ఆ 18 నిముషాలలో వై.యస్. మాట్లాడిన విషయాలు కాక్ పిట్ వాయిస్ రికార్డర్ లో ఉండాలి. 18 నిముషాలు గాకపోయినా, ప్రమాదంలో మరణించే ముందు వై.యస్. వాంగ్మూలం అందులో రికార్డయి ఉండాలి.

అందునా... తమ ప్రయోజనాల కోసం చంపటానికి, చావటానికి సిద్దపడే ఫ్యాక్షన్ కుటుంబం నుండి వచ్చిన వై.యస్., చావు ఖాయంగా ఎదుటనిలబడిందని అర్ధమయ్యాక, ఏయే విషయాలు వెలిగక్కాడో! అవి సజావుగా బయటికొస్తే.... అప్పుడు రిలయన్స్ అంబానీయే బయటకొస్తాడో, ఈనాడు రామోజీరావే బయటకొస్తాడో, అధిష్టాన దేవత సోనియానే బయటకొస్తుందో, లేక మరింకే విషయాలు బయటికొస్తాయో!?

అందుకోసమే... హెలికాప్టర్ ప్రమాద నివేదిక మీద, సివిఆర్ నివేదిక మీదా, డీజీసిఏ సీబిఐ లూ, కేంద్ర రాష్ట ప్రభుత్వాలు దోబూచులాడుతుండవచ్చు. అందుకోసమే రిలయన్స్ అంబానీని అర్జంటుగా ఆధినేత్రి సోనియా, ఈనాడు తరుపు మీడియా కాపాడుకుంటుండవచ్చు. కానట్లయితే, హెలికాప్టర్ ప్రమాదం వ్యతిరేక వాతావరణం కారణంగా సంభవించిందని ముందునుండి ప్రచారిస్తూ ఉన్నప్పుడు, ఆ విషయాన్నే బయటపెట్టేస్తే సరిపోతుంది కదా? మొత్తానికి ఏం జరగనుందో… వేచి చూడాల్సిందే!

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

కిటికీ లోనుండి బయటకు చూస్తున్నప్పుడు, ఆశాజీవి ఆకాశంలోని నక్షత్రాలని చూస్తాడట. నిరాశా జీవి నేల మీది బురదని చూస్తాడట.

సగం వరకూ నీళ్ళు నింపిన గ్లాసుని వర్ణించమంటే, ఆశాజీవి ’అర్ధ గ్లాసు నిండుగా ఉంది’ అంటే నిరాశా జీవి ’అర్ధ గ్లాసు ఖాళీగా ఉంది’ అంటాడట.

నిరాశావహ దృక్పధం కల వ్యక్తి ప్రతి అవకాశంలోనూ పది అవాంతరాలు చూస్తే, ఆశావహ దృక్పధం కల వ్యక్తి ప్రతి అవాంతరంలోనూ పది అవకాశాలు చూస్తాడట.

మన దృక్పధాన్ని బట్టి చూసే దృశ్యం ఉంటుందనీ, చూసిన దృశ్యాన్ని అర్ధం చేసుకునే తీరు ఉంటుందనీ, దాన్ని బట్టే మన ప్రవర్తనా సరళి ఉంటుందనీ... చెబుతూ, మన్నవ గిరిధర రావు గారు తన ’కాంతి రేఖలు’ పుస్తకంలో, పైన చెప్పిన పోలికలు వ్రాసి, మరో రెండు సంఘటనలు వ్రాసారు.

అవి మీ కోసం...

చావుకీ బ్రతుకుకీ మధ్య దూరం ఎంత?

సముద్రంలో ప్రయాణిస్తున్న నౌక ఒకటి ప్రమాదానికి గురై మునిగిపోయింది. మునిగిపోయిన వాళ్ళు మునిగిపోయారు. లైఫ్ బోట్లు దొరక బుచ్చుకున్న వారు ప్రాణాలు రక్షించుకున్నారు. ప్రయాణికుల్లో ఇద్దరికి లైఫ్ బోట్లు దొరకలేదు, లైఫ్ జాకెట్లూ దొరకలేదు. ఇద్దరూ ఈదడం మొదలు పెట్టారు. అంతూ దరీ లేని సాగరం! ఈది ఈది ప్రాణాల కడబట్టిపోతున్నాయి. వారిలో ఒకరికి ఇక ఆశ చచ్చిపోయింది. "మిత్రమా! ఇక ఈదలేను" అంటూ సొమ్మసిల్లిపోయాడు. మునిగిపోయాడు. రెండో వ్యక్తి నిరాశకి గురికాలేదు. ఈదుతూనే ఉన్నాడు. మరి మూడూ నిముషాలు గడిచే సరికి దూరంగా హెలికాప్టర్ కనిపించింది. మునిగిపోతున్న నౌక పంపిన ప్రమాద సంకేతాలని అందుకున్న వారు పంపిన రక్షణ హెలికాప్టర్ అది. రెండో వ్యక్తి రక్షింపబడ్డాడు.

"చావుకీ బ్రతుకుకీ దూరం ఎంత?" అని అతణ్ణి అడిగితే చిరునవ్వుతో "మూడు నిముషాలు" అంటాడు.

గెలుపుకీ ఓటమికీ మధ్య దూరం ఎంత?

దక్షిణాఫ్రికాలో ఓ బంగారు గనిని గుత్తకు తీసుకున్న ఓ వ్యాపారి. లాభసాటిగా ఉన్నంత వరకూ ఖనిజం తవ్వుకున్నాడు. ఇక ఒట్టి పోయిందని పించాక, గనిని చౌకగా మరో వ్యాపారికి గుత్తని బదలాయించాడు. రెండో వ్యాపారి గనిని తవ్వాడు, తవ్వాడు. ఎంత తవ్వినా మన్నూ మశానమే తప్ప బంగారు ఖనిజం దొరకనే లేదు. నిరాశ ఆవరించింది. అప్పటికి పెట్టిన పెట్టుబడే దండగ అన్పించింది. వదిలేసుకు వెళ్ళి పోయాడు. ఈ సారి మరో వ్యాపారి దాన్ని గుత్తకు తీసుకున్నాడు. అందరూ వారిస్తున్నా, నిరాశపరిచినా తవ్వకం ప్రారంభించాడు. ఇంకా అక్కడ బంగారు నిక్షేపాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెప్పారు. ఆ నమ్మకంతో, ఆశతో తవ్వాడు. మరో మూడగులు తవ్వే సరికి బంగారం బయటపడింది.

గెలుపుకీ ఓటమికీ ఎంత దూరం అని అతణ్ణి అడిగితే "మూడు అడుగులు" అంటాడు.

మన్నవ గిరిధరరావు గారు, పై రెండు సంఘటనలలో వ్యక్తుల పేర్లూ, స్థల కాలాలు కూడా ఉటంకించారు. నాకు గుర్తు లేనందున కేవలం సంఘటనలనే వివరించాను.

[1992 లో నేను ఓ సూక్తి విన్నాను. ’నిరాశా నిస్పృహల వలయం చుట్టుకున్నా ఆశని కోల్పోకూడదు’ అని! ఈ 17 సంవత్సరాల పోరాటం మాకు, పై సూక్తిని బాగా అర్ధం చేసింది.] జీవితంలో ఆశా నిరాశల ప్రభావం ఎంతగా ఉంటుందో మాకు అనుభవపూర్వకంగా తెలుసు. దిక్కూ దరీ తోచని క్లిష్టస్థితిలో ఉన్నప్పుడు, నిరాశ నన్నావరించిందో, చుట్టూ చీకటి తప్ప మరేం ఉండదు. ఎప్పుడైతే ఆశని ప్రోది చేసుకుని, నమ్మకాన్ని ధృఢపరుచుకుంటానో, అంతటి కష్టంలోనూ భగవంతుడు చూపేదారి స్పష్టంగా కనబడేది. దైవం మానుష రూపేణా అన్నట్లు, ఎవరో ఒకరు సహృదయంతో సాయపడేవాళ్ళు. మొత్తానికి కష్టం మాత్రం దాటుతాం! ఇలాంటి అనుభవాలు చాలామందికీ ఎదురై ఉంటాయి.

జరుగుతున్న మోసాల గురించి, కుట్రలను గురించీ, ఈ బ్లాగులోని టపాలు చదివి... అప్పుడప్పుడూ కొందరు జ్ఞాతలూ, తరచుగా ఎందరో అజ్ఞాతలూ ఎంతో నిరాశాపూరితంగా వ్యాఖ్యానిస్తుంటారు.

"అన్నీ దగాలే! అయినా ఏం చేయగలం?"

"ఎన్ని జరుగుతున్నా ఎవరు చేయగలిగిందీ ఏమీ లేదు!"

"ఈ జనం ఇలా ఉన్నంతకాలం అంతే! అన్నీ జరిగిపోతూనే ఉంటాయి"

"ఎవరెంత గోల పెట్టినా, ఎవరెంత మొత్తుకున్నా ఈ రాజకీయ నాయకులకి బుద్దిరాదు. అంతే! ఇలా కాలం గడిచిపోతూనే ఉంటుంది."

ఇలా! అజ్ఞాతల వ్యాఖ్యాలని ప్రచురించకుండా తిరస్కరిస్తూ ఉంటాము.

నిజానికి ఇది మనలో ప్రవేశపెట్టబడిన వ్యతిరేక ఆలోచనా విధానపు [Negative thinking] ప్రభావమే! నిరాశాపూరిత ఆలోచనా విధానం! ఇది ఇప్పుడు కాదు, శతాబ్ఠాల క్రితమే భారతీయులలో బుర్రలలో ఇంకించబడింది. ఆత్మన్యూనతతో మిళితం చేసి మరీ ఇంకించబడింది.

కాబట్టే స్వామి వివేకానంద "సింహాలు మీరు! గొర్రెల్లా మిగిలిపోకండి. గర్జించండి!" అన్నారు.

కాబట్టే ఎందరో స్వాతంత్ర సమరయోధులు భారతీయుల ఆత్మని తట్టిలేపి వారి ఆత్మశక్తిని వారికి గుర్తు చేసారు.

సాగర లంఘనానికి ముందు ఆంజనేయస్వామి శక్తిని ఆయనకే గుర్తు చేసినట్లుగా! అప్పుడుగానీ ఆకాశానికి ఎగరలేదాయన! [ఆంధ్రులకు వాళ్ళ శక్తి వాళ్ళకే తెలియదని, ఆంధ్రులు కూడా ఆంజనేయ స్వామిలాంటి వాళ్ళేనని మాజీ రాష్ట్రపతి శంకర దయాళ్ శర్మ గారు అప్పట్లో అన్నారు! ]

నిజానికి... ఇప్పటి పరిస్థితులలో, ఏం చెయ్యగలమో తర్వాతి విషయం! ముందు ఏం జరుగుతుందో తెలుసుకుంటే... అప్పుడు ఏంచెయ్యాలో స్ఫురిస్తుంది. పోయిన చోట వెదికితేనే పోగొట్టుకున్న వస్త్తువు దొరుకుతుందంటారు పెద్దలు! సమస్య తెలిస్తే పరిష్కారం తెలుస్తుంది. ఎందుకంటే పరిష్కారం లేని సమస్య ఉండదు గనక!

సమస్య పరిష్కారం పట్ల మనకి నిబద్దత ఉంటే పరిష్కారం తప్పకుండా స్పురిస్తుంది. కావలసిందల్లా ఆ పరిష్కారం కోసం సాధన చెయ్యగల దైర్యం! ఎందుకంటే ఇప్పుడు మన ముందున్న సమస్యలకి పరిష్కారం బయటి పరిస్థితులలో లేదు. మనలోనే ఉంది! ఎవరి చేతుల్లోనో లేదు. ఎవరికి వారి చేతుల్లోనే ఉంది. మన ఆలోచనా విధానం లోనే ఉంది. మన దృక్పధంలో ఉంది. మన మనస్సులో ఉంది.

భగవద్గీత ఈ విషయాన్ని ఎంతో స్పష్టంగా చెపుతుంది. దిగువ శ్లోకాలు పరిశీలించండి.

శ్లోకం:
ఉద్ధరే దాత్మ నాzzత్మానం నాత్మాన మవసాదయేత్
ఆత్మైవ హ్యాత్మనో బంధు రాత్మైవ రిపు రాత్మనః

భావం:
ఈ సంసారం నుండి యెవరికి వారే ఆత్మోద్దరణం చేసుకోవాలి గాని - పతనం కాకూడదు. ఆత్మకు ఆత్మయే బంధువు మరియు శత్రువూ కూడా అయివుంది.

శ్లోకం:
బంధు రాత్మాzzత్మన స్తస్య యే నాత్మై వాత్మనాజితః
అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాzzత్మైవ శత్రువత్

భావం:
నిగ్రహపరులకు ఆత్మ బంధువు గాను - నిగ్రహం లేనివారికి ఆత్మయే శత్రువుగానూ వుంటుంది.

[పై శ్లోకాలలో ’ఆత్మ’ని, శరీరాన్ని ఆశ్రయించుకుని ఉండేది గానూ, శరీరం నశించినా తాను నశించని ఆత్మగానూ కాకుండా... ఆత్మ విశ్వాసం, ఆత్మ నిగ్రహం వంటి పదాలలో self కు పర్యాయంగా వాడినట్లు... ఆలోచనల సముదాయానికి అంటే మనస్సుకి పర్యాయంగా పరిగణించవచ్చు. ఇది గీతా శ్లోకాల్ని మేము అర్ధం చేసుకున్నతీరు.]

మన ముందున్న సమస్య లేదా సమస్యలు... ఎంత జటిలమైనవైనా, ఎంత ద్వంద్వపూరితమైనా[Paradox], పరిష్కారం మాత్రం ఉండితీరుతుంది. ఈ విషయాన్ని మన ఇతిహాసాలు స్పూర్తిదాయకంగా వివరిస్తాయి.

భాగవతంలో ప్రహ్లాద చరిత్ర మనకందరికీ తెలిసిందే!

అందులో హిరణ్యకశ్యపుడు దానవరాజు. ’ఉగ్ర’ తపస్సు ఆచరించి మరణం లేకుండా వరం కోరతాడు. అది కుదరకపోయే సరికి పరస్పర విరుద్దాలతో, ద్వంద్వాలతో మరణం లేకుండా వరం పొందుతాడు.

రాత్రి గాని, పగలు గాని
ఇంట్లో గాని, బయట గాని
నేల మీద గాని, నింగిలో గాని
నీటిలో గాని, గాలిలో గాని
నరుల చేతిలో గాని, జంతువుల చేతిలో గాని
దేవతల చేతిలో గాని, రాక్షసుల చేతిలో గాని తనకు చావు రాకూడదు.
ఏ ఆయుధం చేతగానీ తనకు చావు రాకూడదు.

ఇదీ హిరణ్య కశ్యపుని కోరిక!
’ఇన్ని మెలికలూ, ద్వంద్వాలూ[Paradoxes] పెట్టాడు గనక తనకు చావురాదు’ అన్నది అతడి నమ్మిక!

అయితే భగవానుడు ద్వంద్వాతీతుడు.
’హిరణ్యకశ్యపుని చావు’ అనే సమస్యని ఆయన పరిష్కరించిన తీరు పరమాద్భుతమైనది, స్ఫూర్తిదాయకమైనది.
హిరణ్యకశ్యపుని కోరిక ప్రకారం......

రాత్రీ పగలూ గాని సంధ్యవేళ [సూర్యాస్తమయానికి, చంద్రోదయానికీ మధ్యవేళ]
ఇంటా బయటా గాని గడప మీద,
నేల మీదా ఆకాశంలోనూ కాని తన తొడల మీద,
నీటిలోనూ గాలిలోనూ కాని తన ఒడిలో,
నరుడూ మృగమూ గాని నరసింహ రూపంలో,
ఏ ఆయుధమూ కాని తన చేతి గోళ్ళతో,
హిరణ్యకశ్యపుని చీల్చి చెండాడి, పేగులు తీసి తన మెడలో ధరించి...

భీకరంగా, భీభత్సంగా దుష్ట శిక్షణ గావించాడు.
కారుణ్య వాత్సల్యాలతో శిష్టరక్షణ చేశాడు.

కాబట్టి ఏ పరిస్థితుల్లోనూ, ఎలాంటి సమస్యలని చూసీ భయపడవలసిన, బెంగపడవలసిన, నిరాశపడవలసిన అవసరం లేదు.
ధైర్యమూ, ఆశా వీడకుండా సాధన చేస్తే పరిష్కరించుకోలేని సమస్యా ఉండదు.

ప్రపంచమంతా పరిగణించే కొత్త సంవత్సరం 2010 లో మనకి వచ్చే తొలిపండగ, పంటల పండుగ, పెద్దపండగ అయిన సంక్రాంతికీ
మీ అందరి ఇళ్ళల్లో పాలు సిరులు పొంగాలని,
ఆనందాలు నిండాలని కోరుకుంటూ...

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

ముందుగా ఓ ఉదాహరణ!

ఓ హత్య జరిగిందనుకొండి. పోలీసుల, నేరపరిశోధకుల[CBCID, CBI etc.] పరిశోధన, పనితీరు ఎలా ఉంటుంది? ’హతుడెవరు?, ఎక్కడ ఎలా హత్య చేయబడ్డాడు?’ అన్నవి ఆరా తీస్తారు. హతుడికి ఇతరులతో ఉన్న సంబంధ బంధావ్యాలు, స్నేహాలు, డబ్బు లావాదేవీలు గురించి కూడా ఆరా తీస్తారు. హత్య జరిగిన విధానాన్నీ, ఆయుధాలనీ, సంఘటనా స్థలంలోని ఇతర ఆధారాలని[clues] సేకరిస్తారు. హత్యా సంఘటనకు ముందూ, వెనకా, జరిగిన ఇతర సంఘటనలనీ, వాటి మధ్య కార్యకారణ సంబంధాలని విశ్లేషిస్తారు. హత్యకు ఉపయోగించిన సాధనాలేమిటి, హంతుకులు కిరాయికి వచ్చిన వారా లేక హతుడి సంబంధీకులా అన్నదీ విచారిస్తారు.

అప్పుడు, హత్యకు పాల్పడే అవకాశం ఎవరెవరికి ఉందో[Motives] విశ్లేషిస్తారు. ఆ విధంగా అనుమానితుల జాబితా తయారు చేస్తారు. వారందరినీ హత్య కోణంలో, నేర నిర్ధారణ కోసమై, విచారిస్తారు. ప్రశ్నిస్తారు. వారు చెప్పిన సమాధానాలని, అందులోని లొసుగులనీ, స్థలకాలమాన పరిస్థితులనీ, ఇతర సాంకేతిక అంశాలని అన్నిటినీ దృష్టిలో పెట్టుకుని, నేరపు చిక్కుముడిని పరిష్కరిస్తారు. నేరస్థులెవరో నిగ్గు తేలుస్తారు.

ఇది ప్రపంచవ్యాప్తంగా పోలీసులు, నేర నియంత్రణ, పరిశోధనా సంస్థలు అవలంబించే శాస్త్రీయ విధానం. అంతే తప్ప , నేరం జరిగిన చోటా, నేరం జరుగుతూ ఉన్నప్పుడు లేక నేర ప్రణాళిక రచిస్తున్నప్పుడు, నిఘా కెమెరాలుంచి వీడియోలు, ఫోటోలు, సంభాషణల టేపులూ ఏ పోలీసులూ సేకరించలేరు. కొన్నిసార్లు సేకరించవచ్చు గాని, అన్ని నేరాలలో అది సాధ్యం కాదు. హత్యలైనా, దొమ్మీలైనా, దొంగతనాలైనా... ఇతర ఏ నేరాలైనా, పరిశోధనా తీరు ఇలాగే ఉంటుంది.

ఇప్పుడు, మీకు పైన చెప్పిన ఉదాహరణకు కొన్ని అనువర్తనలు చెబుతాను.

1998 - 99 విద్యా సంవత్సరంలో నేను సూర్యాపేటలో ఓ జూనియర్ కాలేజీలో పనిచేసాను. గుంటూరు నుండి ఒక సంవత్సరం కాంట్రాక్టు మీద పనిచేయటానికి వచ్చాను. కొంతసొమ్ము అడ్వాన్సుగా పుచ్చుకుని మరీ వచ్చాను. మంచి ఫలితం కోసం, త్వరగా సిలబస్ ముగించుకుని, కనీసం రెండుసార్లు రివిజన్ చేయించాలన్న ఉద్దేశంతో, డిసెంబరు 98 కల్లా సిలబస్ దాదాపు పూర్తి చేసాను. అప్పటికి కాలేజీ యాజమాన్యం, నాకు ఒప్పందం కుదుర్చుకున్న సొమ్ములో సగంపైన చెల్లించింది. [అడ్వాన్సు + నెలవారీ సొమ్ముతో కలిపి] ఇంకా ఏభైవేల పైచిలుకు ఇవ్వవలసి ఉంది. ఆ నెల జీతం చెక్కు ఇచ్చి , అది బౌన్స్ చేసి మరీ, యాజమాన్యం నాతో తగవు పెట్టుకుంది.

స్థానికేతరులం కాబట్టి అక్కడ మాకెవ్వరూ తెలియదు. ’ఏమీ చెయ్యలేక నిస్సహాయంగా ఊరుకుంటాము, మా ఊరుకు వెళ్ళిపోతాము’ అనుకున్నారేమో నోరు కూడా బాగా ఉపయోగించారు. ప్రక్కనే హుజూరు నగర్ లో ఉన్న నా బాల్యమిత్రుడి ద్వారా సూర్యాపేటలోని స్థానిక పెద్దల దగ్గర పంచాయితీకీ ప్రయత్నించాము. అలాగే పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశాము. దాదాపు 20 రోజుల పాటు కేసు సాగింది. కాలేజీ యాజమాన్యం స్థానిక నాయకుల దగ్గర పలుకుబడి ఉపయోగించింది. దాంతో మాకు అక్కడ న్యాయం జరగలేదు. స్థానిక సిఐ కి మొత్తం వివరించి న్యాయం చేయమని అర్ధించాము.

ఇంతలో, సూర్యాపేటలోని సదరు కాలేజీ విద్యార్ధుల తల్లిదండ్రులలో ఇద్దరు, పోలీసు స్టేషన్ లో "లెక్చరర్ ని సంవత్సరం మధ్యలో పంపించివేయటానికి యజమాన్యానికి గానీ, మధ్యలో చదువు చెప్పటం మానేస్తానని అనటానికి లెక్చరర్ కి గానీ, హక్కులేదని, ఎందుకంటే ఇద్దరూ కూడా పిల్లలకి సంవత్సరం వరకూ చదువు చెబుతామని హామీ ఇచ్చారని" యాజమాన్యం పైనా, నా పైనా కూడా కేసు పెట్టారు. అడ్మిషన్ల సమయంలో ఆ హామీ యాజమాన్యమూ ఇచ్చింది, మా చేతా ఇప్పించింది. దానికి నేను "సంవత్సరం మధ్యలో వెళ్ళిపోతానని నేను అనటం లేదండి. కానీ జీతం ఇవ్వక పోయినా పనిచేస్తానని నేను మీకు హామీ ఇవ్వలేదు కదా?" అన్నాను.

అప్పటి వరకూ పోలీసు అధికారులు పిలుస్తున్నా, ఏదో ఒక సాకుతో వాయిదా వేస్తున్న కాలేజీ డైరెక్టర్లు ఇక తప్పక పోలీసు స్టేషన్ కి తమ మందీ మార్భలం[లాయర్ + రాజకీయ నాయకులు] ని వేసుకుని వచ్చారు. విచారణ/పంచాయితీ ప్రారంభం అయ్యింది. ఇద్దరు సిఐలు, ఇద్దరు ఎస్.ఐ.లు, ఒక ASI కూర్చుని, ఆ కాలేజీ డైరెక్టర్ ని ప్రశ్నించటం మొదలు పెట్టారు.

అప్పటికి 20 రోజులుగా అతడికి పోలీసు అధికారులకి మధ్య ఫోను ద్వారా నడిచిన సంభాషణలనీ, పోలీసు కానిస్టేబుళ్ళతో పిలవనంపినప్పుడు అతడిచ్చిన సమాధానాలలో ఉన్న వైరుధ్యాలనీ గుచ్చి ప్రశ్నించారు. వాటిని సమర్ధించుకోలేక చివరికి అతడు ’అసలు లెక్చరర్ కి జీతం ఎగ్గొట్టాలన్న ఆలోచన తనకు లేదని, చెక్కు మీద పొరపాటున పొట్టి సంతకం పెట్టటంతో అది బ్యాంకులో తిరస్కరింపబడిందనీ, దాని మీదట నాకూ, తమకూ మధ్య అపార్ధాలు[communication gap] ఏర్పడ్డాయనీ’ చెప్పాడు.

దాంతో పోలీసు అధికారులు ’ఇన్నేళ్ళుగా కాలేజీ నడుపుతూ, ఆర్ధిక లావాదేవీలు నిర్వహిస్తూ, బ్యాంకులో తను పెట్టిన నమూనా సంతకం పొడవైనదో పొట్టిదో తెలియదా? ఇప్పుడు కొత్తగా పొరపాటుపడతారా? సరే! పొరపాటే పో! దిద్దుకోవటానికి 20 రోజులు పడుతుందా? అదీ క్లాసులు పోగొట్టుకుంటూ! డబ్బు ఇచ్చేస్తే సమస్య సాల్వ్ అయ్యేది కదా? అది వదిలేసి లాయర్ల వెంటా, రాజకీయ నాయకుల వెంటా ఎందుకు తిరిగినట్లు?’ అంటూ ప్రశ్నల పరంపర గుప్పించారు. చివరికి అతడు తప్పు ఒప్పుకున్నాడు.

విద్యాసంవత్సరం ప్రారంభంలో నమ్మకమూ, సుహృద్భావమూ కొద్దీ, అగ్రిమెంట్లు లాంటి వేవీ వ్రాసుకోలేదు. అప్పుడు తాజా అగ్రిమెంటు వ్రాయించి, సమస్య తీర్చారు. ఎక్కడా... పోలీసులు, కాలేజీ డైరెక్టరుని గానీ, అతడి తరుపున వచ్చిన వారిని గానీ గద్దించటం గానీ, బెదిరించటం గానీ చేయలేదు. లాజికల్ గా, కూల్ గా ప్రశ్నించారు. ఆ విధంగా పోలీసులు నేరనిరూపణ, విశ్లేషణ ఎలా చేస్తారో మాకు అనుభవ పూర్వకంగా మరోసారి అర్ధమయ్యింది. [ఇద్దరి సిఐల్లో ఒకరు ముస్లిం, ఒకరు క్రిస్టియన్. ఈ కేసు నడుస్తున్న రోజుల్లో అది రంజాన్ మాసం, నా కేసు క్రిస్ మస్ రోజు సెటిల్ అయ్యింది.]

సంవత్సరంన్నర తిరిగేటప్పటికి, అదే పోలీసు స్టేషన్లో, పోలీసులు నేరస్తులను కాపాడదలుచుకుంటే ఎలా ప్రవర్తిస్తారో కూడా అనుభవపూర్వకంగా తెలుసుకున్నాము. 2000 - 2001 లో సూర్యాపేటలోని మా ఇంటి యజమానురాలి వేధింపు గురించీ, ఎంసెట్ ర్యాంకు మోసాలపై మా ఫిర్యాదు అనంతర పరిస్థితుల గురించిన నా గతటపాలలో, మీరు ఆ వివరాలు చదివి ఉన్నారు.

ఇక మరో అనువర్తన చూడండి. నిన్న[జనవరి 11, 2010] ఈనాడు కర్నూలు ఎడిషన్ లోని వార్తాంశం:
>>>నంద్యాల గ్రామీణ, న్యూస్ టుడే: శిరువెళ్ల మండలం మహదేవాపురం గ్రామానికి చెందిన పన్నెండేళ్ళ బాలుడిపై అదే గ్రామానికి చెందిన ముగ్గురు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. గ్రామానికి చెందిన సంటెన్న తనపై అకారణంగా కులం పేరుతో దూషిస్తూ దుస్తులూడదీసి చెట్టుకు కట్టి కొట్టినట్లు బాధిత బాలుడు అతని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడిలో సంటెన్నతో నరహరి, నర్సి పాల్గొన్నట్లు తెలిపారు. బాలుడు తమ ఇంట్లో టీవీ చూడడానికి వచ్చి ఒంటరిగా ఉన్న బాలికపై బలత్కార యత్నానికి పాల్పడుతుండగా కేకలు వేయటంతో లోపలకు వెళ్లి చూసి నిర్ఘాంతపోయామని ఎదుటిపక్షం వారు పోలీసులకు ఫిర్యాదు చేసారు. తాము బాలుడ్ని పట్టుకుని మందలించి పంపామని చెబుతున్నారు. చిన్నారిని చెల్లిలా చూసుకున్నానని నిందితుడైన బాలుడు చెబుతున్నాడు. రెండు వర్గాల ఫిర్యాదులను స్వీకరించి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

పై వార్తలోని నేరాన్ని పోలీసులు ఎలా విశ్లేషిస్తారు? బాలుడు చెబుతున్న దాంట్లో నిజానిజాలెంత? ఎదుటి పక్షం[సంటెన్న] చెబుతున్న దాంట్లో నిజానిజాలెంత? అకారణంగా ఎవరైనా ఎవరినైనా దుస్తులూడదీసి చెట్టుకి కట్టి ఎందుకు కొడతారు? కులం పేరుతో ఎందుకు దూషిస్తారు? చెప్పబడుతున్న నేరం ఎక్కడ, ఎప్పుడు జరిగింది? ఆ సమయంలో నిందితులూ, భాదితుడూ కూడా అక్కడే ఉన్నారా మరెక్కడైనా ఉన్నారా? సదరు సంఘటనకి సాక్షులూ, సాక్ష్యాధారాలూ ఉన్నాయా?

ఎదుటి పక్షంగా చెబుతున్న సంటెన్న గట్రాల వాదనలో నిజమెంత? ’కులంపేరుతో దూషణ కేసు’ భయంతో మందలించి వదిలేసాం అని చెబుతున్నారా? మరింకెందుకైనా బాలుణ్ణి కొట్టి, ఇప్పుడు తమ ఇంటిలోని బాలికపై అత్యాచార యత్నం అని బనాయిస్తున్నారా? నిజానికి తమ ఇంటి ఆడపిల్లని ఎవరూ అల్లరి పెట్టుకోరు. ఆ ధైర్యంతోనే బాలుడు, అతడి తండ్రి తమను కులం పేరుతో దూషించారన్న కేసు పెట్టారా? లేక తమ ఇంట్లో టీవీ చూడటానికి రానిస్తే, ఆడపిల్లతో అసభ్యంగా ప్రవర్తించాడన్న కోపంతోనే కొట్టారా? బాలుడుగా చెప్పబడుతున్న పిల్లవాడి తీరు ఎలాంటిదీ? బాలికని చెల్లిలా చూసుకున్నానని అంటున్నాడంటే అసలు ఆ వయస్సుకి[12 ఏళ్ళకి] చెల్లిలా గాక మరోలా చూడొచ్చుననే ఆలోచన ఎలా తెలుస్తుంది? ఇవన్నీ గాక, ఇంకా ఏమైనా వేరే కారణాలున్నాయా అని కూడా ఆరాతీస్తారు.

ఇలా... అన్ని కోణాలలో పోలీసులు ఆలోచిస్తారు, విశ్లేషిస్తారు. రెండు వర్గాలనీ ప్రశ్నిస్తారు. ఇతర పరిస్థితులనీ, పరిసర వ్యక్తులనీ పరిశోధించి విచారిస్తారు. నిజాన్ని వెలికి తీస్తారు. అంతే తప్ప, నేరం జరిగిన ప్రతిచోటా నిఘా కెమెరాలు బిగించలేరు. వీడియోలు, ఫోటోలు, సంభాషణా టేపులూ సంపాదించలేరు.

ఈ చిన్న కేసునే దేశపు పరిమాణంలో చూస్తే... రాజీవ్ గాంధీ హత్య అయినా రాజశేఖర్ రెడ్డి మరణమైనా... ఎవరు చేశారు? ఎవరు చేయించారు? సహజంగా జరిగిందా? జరిపించబడిందా? ఇలా అన్ని కోణాలు పరిశీలిస్తారు. ఎవరికి మోటివ్స్ ఉన్నాయో విశ్లేషిస్తారు.

ఒక దృష్టాంతం పరిశీలించండి.

2008, జూలైలో అణుఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ యూపీఏ ప్రభుత్వానికి ఎర్రపార్టీవాళ్ళు మద్దతు ఉపసంహరించుకున్నారు. దరిమిలా జూలై 22 న పార్లమెంటులో యూపీఏ ప్రభుత్వం విశ్వాసపరీక్ష నెగ్గవలసి వచ్చింది. ప్రజలంతా ప్రత్యక్ష ప్రసారం చూస్తూండగా, సాక్షాత్తూ పార్లమెంటు హాలులో, ఓటుకు నోటు వివాదం డబ్బు కట్టలతో సహా ప్రత్యక్షమైంది. తమకు డబ్బు ఎరవేసి ఓటు కొనాలనుకున్నారని భాజపా ఎంపీలు ప్రకటించారు. తమపై బనాయిస్తున్నారని కాంగ్రెస్సూ, మిత్రపక్షాలూ వాదించాయి. చివరికి కిశోర్ చంద్రదేవ్ అధ్యక్షతన పార్లమెంటరీ కమిటీ వేసారు. ఓ అయిదారు నెలలు విచారణ చేసి, సదరు కమిటీ అదంతా ఉత్తుత్తి దేనంటూ పెద్ద రిపోర్టు ఇచ్చింది. అయితే సదరు కేసుని బనాయించారని చెప్పబడ్డ భాజపా ఎంపీలపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు సుమా!

అలాంటి కమీషన్లూ, కమిటీలు[జైన్, లిబర్ హాన్ గట్రాలన్న మాట] మానవమాత్రుడు జన్మలో చదవలేనన్నీ[50,000 పేజీలు] పేజీల కొద్దీ నివేదికలు ఇవ్వడం, వాటిపైన పార్లమెంటు సమర్పణకు ముందే లీకులు కావటం వంటి కొన్ని నాటకీయ పరిణామాలు రక్తి కట్టటం, తర్వాత తీరిగ్గా పార్లమెంటులో అంతే నాటకీయ చర్చజరగటం, మీడియా ప్రచారం... అన్నీ యధాప్రకారం జరిగిపోతాయి. ఆ ఖాతాలోనే కిశోర్ చంద్రదేవ్ నివేదికా వెళ్ళిపోయింది.[ఇవన్నీ చూసినప్పుడు నాకు రాజకీయనాయకులే సహజ నటులేమో అన్పిస్తుంది.అనవసరంగా సినిమా వాళ్ళ నటనకు అవార్డులు ఇస్తాం గానీ, రాజకీయనాయకులకి ఇవ్వాలి.]

అయితే, అప్పటికి తెదేపా ఎంపీలై ఉండి క్రాస్ ఓటింగ్ చేసి, తత్పలితంగా తెదేపా నుండి గెంటి వేయింపించుకుని, ఆనక కాంగ్రెస్ లో స్వాగత సత్కారాల సహితంగా చేరి, ఢిల్లీ ఏపీ భవన్ లో ’క్యాబినెట్ మంత్రి’ స్థాయి హోదా పదవిని పొందాడు మందా జగన్నాధం. ఇక కోటీశ్వరుడు డికే ఆదికేశవులు నాయుడు తితిదే ఛైర్మన్ పదవికి పొందాడు. యధేచ్చగా నడుస్తున్న పాసులు, అయ్యవారి అభరణాది ఆస్థుల అవకతవకల్లో యధాశక్తి వాటాలు మామూలుగానే అందుతాయి కదా?

జేయంయం నేత శిబూశోరెన్ అయితే, పత్రికాముఖంగానే, ’ యూపీఏ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేసి నిలబెట్టినందుకు జార్ఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చి, చేసుకున్న ఒప్పందాన్ని [బేరాన్ని] కాంగ్రెస్ తుంగలో తొక్కింది’ అని దుయ్యబట్టాడు. దాంతో కాంగ్రెస్ అధినేత్రి సోనియా, అప్పటి జార్ఖండ్ ముఖ్యమంత్రి మధుకోడాని తప్పించి శిబూశోరెన్ ని పీఠం ఎక్కించింది. తర్వాత ఉపఎన్నికలలో శిబూశోరెన్ ఓడిపోయాడు.[మొన్న ఎన్నికలలో గెలిచి సీఎం. అయిపోయాడు లెండి] ఏ సంబంధాలు బెడిసి కొట్టాయో గానీ, మధుకోడా అవినీతి బయటపడి ఇబ్బందుల్లో పడ్డాడు.

ఈ వ్యవహారంలో ముఖ్యంగా పరిశీలించాల్సింది ఏమిటంటే - ఓటు వేసినందుకు పదవులు ఇస్తామని ప్రమాణం చేసిన కాంగ్రెస్స్, దాని అధినేత్రి, ఆ ప్రకారమే పదవులూ ఇచ్చిన కాంగ్రెస్సూ, దాని అధినేత్రి డబ్బులు మాత్రం ఇవ్వరా? కళ్ళ ముందు కనబడుతున్న ఈ విషయాన్ని విశ్లేషించడానికి, పరిశోధించడానికి, సత్యాన్ని తెలుసుకోవటానికి కిశోర్ చంద్రదేవ్ ల కమిటీలు అవసరం లేదు. సీబిఐ లూ, సీఐడీలూ కూడా అవసరం లేదు. మీడియా ఈ విషయాలని దాచుకుంటూ... కాంగ్రెస్ నీ, దాని అధినేత్రి సోనియాని కాపాడుకుంటున్న తీరు గమనించినా, సామాన్యులకి సైతం విషయం అర్ధమౌతుంది.

[ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఏమిటంటే - 1996 కు ముందు పీవీజీ పార్లమెంటులో విశ్వాస పరీక్ష నెగ్గడానికి శిబూశోరెన్ కి పైకం ఇవ్వచూపారన్న కేసు! అలాగని స్వయంగా నిందారోపణ చేసిన శిబూశోరెన్! జేఎంఎం ముడుపుల కేసుగా మీడియా ప్రచారించిన కేసు! ముఖ్యమంత్రి పదవులిస్తానంటే ఎంపీగా తన పవిత్ర[?] ఓటును అమ్ముకున్న శిబూశోరెన్ ’మరింకేవో’ [డబ్బు + పదవులూ] ఇస్తానంటే ’ఎవరి మీదనైనా కేసులు బనాయించమన్న’ డీల్ కు ఓకే చెప్పడా? శిబూసోరేన్ ఎంతటి క్రిమినలో ఇప్పటికి బాగానే బహిర్గతమయ్యింది కదా! వ్యక్తిగత కార్యదర్శి హత్యకేసులతో సహా!

పీవీజీ మీద, ఎవరినైతే ఉపయోగించి విశ్వాసపరీక్షలో ఓటు కొన్నాడన్న అభియోగాన్ని, నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గమూ, అందులోని కీలక వ్యక్తులు రామోజీ రావు, అతడి సోదర తుల్య సోనియా మోపారో... అదే శిబూసోరెన్ కి.. పార్లమెంటులో... అలాగే విశ్వాస పరీక్షలో నెగ్గడానికి, ముఖ్యమంత్రి సీటు ఆఫర్ చేశారని నిరూపించబడటం, మీడియా యూపీఏ ప్రభుత్వాన్ని కాపాడిన తీరు, ప్రతిపక్షాలు గమ్మునుండటం ఇక్కడ ఆసక్తికరమైన అంశం. ఎవరెలాంటి వారో స్పష్టంగా బహిర్గతం చేసిన అంశం ఇది. అలాగే సోనియా బృందపు సువర్ణముఖిలో భాగం కూడా!]

ఈ విధంగా, 2008 విశ్వాసపరీక్షలో శిబూసోరెన్ ఓటు వ్యవహారంలో కిశోర్ చంద్రదేవ్ ఏం చెప్పినా,... మీడియా ఏమీ చెప్పక పోయినా... నేరం జరిగిందో లేదో... ఏ వీడియోలు, ఫోటోలూ, సంభాషణల టేపులూ అవసరం లేకుండా... ప్రజల విశ్లేషణకి, అర్ధమౌతూనే ఉంది. నిర్దారించుకోగలిగేంత స్పష్టంగా, సంఘటనాత్మకంగా నిరూపించబడింది. కాకపోతే చూడగల కన్ను, గుర్తించగలిగే ఓపిక సామాన్యులకి ఉండాలి. అంతే!

నవంబరు 26, 2008 కేసును పరిశీలించామంటే... తాజ్ హోటల్ లో పాక్ తీవ్రవాదులు దాడి. ఏకంగా తాజ్ హోటల్ లో కంట్రోలు రూం నే ఏర్పాటు చేసుకున్నారు. ఎవరు అంతగా వాళ్ళకి సహకరించారు? హోటల్ యాజమాన్యం ప్రమేయం లేకుండా, హోటల్ సెక్యూరిటీ కళ్ళుగప్పి అంత విధ్యంసాన్ని సృష్టించగల ఆయుధాలని లోపలికి ఎలా చేరవేయగలిగారు? ఇందులో వీడియో టేపులు బయటపడినా కసబ్ లు బుకాయించగలుగుతున్నారంటే, తాను మైనర్ నని ఓ రోజు, ఏ పాపం ఎరగని అమాయకుడననీ, సినిమా వేషాల కోసం వస్తే పోలీసులు పట్టుకుని కేసులో ఇరికించారని ఓ రోజూ అనగలిగేంత, తనకు సెంటు, బిర్యానీ కావాలని డిమాండ్ చేసేంత దన్ను అతడికి ఎవరు ఇస్తున్నారు? వీటన్నింటిని పోలీసులు విశ్లేషించటం లేదు.

అలా చూస్తే... భారతదేశమ్మీద జరుగుతున్న రాజకీయ, ఆర్ధిక, విధ్వంసక కుట్రలలో ’పెద్దవాళ్ళ అండ ద్రోహులకి ఉండటం’ సామాన్య ప్రజల కళ్ళెదుట నిలిచిన సత్యం. ఆ విధంగా ద్రోహులని రక్షిస్తున్న వారిలో కొందరు IAS, IPS అధికారులుండవచ్చు, కేంద్రరాష్ట్రప్రభుత్వాధినేతలుండవచ్చు, ప్రభుత్వ కుర్చీ వ్యక్తులుండవచ్చు, మీడియా సామ్రాట్టులూ ఉండవచ్చు. ఎవరి పాత్ర గురించీ, ఎవరూ, వీడియోలు, ఫోటోలూ, సంభాషణల టేపులూ వెలువరించలేరు.

ఏవిధంగా అయితే... ఒక నేరం జరిగినప్పుడు పోలీసులు, అక్కడే ఉండి పరిశీలించలేరో, అదే విధంగా... దేశం పట్ల జరుగుతున్న ఈ ద్రోహంలో, సామాన్యులు కూడా పరిశీలించలేరు.

ఏవిధంగా అయితే... పోలీసులు నిందుతులనీ, బాధితులనీ, ఆయా పరిస్థితులనీ, వాటి మధ్య కార్యకారణ సంబంధాలనీ, సంఘటనల ముందు వెనకలనీ, సంభావ్యతలనీ పరిశీలించి నేర విశ్లేషణా, నిర్ధారణా చేస్తారో... అదే విధంగా... ప్రజలూ ఆయా వ్యక్తులనీ, వారి మాటలనీ, చేతలనీ, పరిస్థితులనీ పరిశీలిస్తే ఎవరి చరిత్ర ఏమిటో, ఎవరి స్వభావం ఏమిటో కూడా విశ్లేషించనూ వచ్చు, నిర్ధారించుకోనూ వచ్చు.

నేరపరిశోధనలో, నేర నిర్ధారణలో, ఇది ప్రపంచమంతా అంగీకరించే శాస్త్రీయ విధానం!

పత్రికలైనా ఇలాగే విశ్లేషించి, కథనాలు వెలువరించాలి. కాకపోతే మీడియానే ప్రధాన కుట్రదారు గనక నిజాలు తొక్కిపట్టటం, తమకి కావలసిన విధంగా కథనాలు వెలువరించటం, ఏకవాక్య తీర్పులు చెప్పటం చేస్తుంది.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu