ప్యాకింగ్ మారిన బ్రిటీష్ దోపిడి వ్యాపారమే నేటి కార్పోరేటిజం! ఎలాగంటే - పార్టీల కతీతంగా నేతలంతా క్యూకట్టి మరీ, ఎకరా రూపాయకీ, వందరూపాయలకీ బడా బాబులకి కట్టబెట్టిన సెజ్ లని పరికించండి. దేశాభివృద్ది పేరుతో భూమిని సెజ్ ల కిచ్చారు. సదరు సెజ్ లలో, భారత రాజ్యాంగం అంగీకరించిన కార్మిక చట్టాలేవీ చెల్లవు.

సెజ్ యాజమాన్యపు ఇచ్ఛానుసారం పనిగంటలూ, కార్మిక వేతనాలూ ఉంటాయి. అంతేకాదు ఆయా సెజ్ లలో ఉత్పత్తి అయిన సరుకు ఒక యూనిట్ నుండి మరొక యూనిట్ కి పంపబడితే, కొత్త నిర్వచనాల ప్రకారం ‘ఎగుమతి’ చేసినట్లేనట! కనీసం సరుకు విదేశాలకి ఎగుమతి చేయబడితే, విదేశీ మారక ద్రవ్యం వంటి దేశ ప్రయోజనాలన్నా నెరవేరతాయి.

మరో వైపు సెజ్ లకి భూమితో సహా మౌలిక వసతులూ, ముడి సరకులూ కూడా చౌకగా కట్టబెడతున్నారు. శ్రమ దోపిడి చేసుకునేందుకు ఈ ప్రత్యేక ఆర్దికమండళ్ళు[Special Economic Zone] కి, తమవైన ప్రత్యేక చట్టాలతో కూడిన రాజ్యాంగం ఉన్నట్లే! ఎంత కన్నాలతో కూడినది అయినా, భారత రాజ్యాంగం, సెజ్ లలో వర్తిందట మరి! ఎటూ ఈ సెజ్ లలో తయారయిన వస్తువుల విక్రయ ధర, ఆయా యాజమాన్యాలే నిర్ణయించుకుంటాయి కదా! మరింత సమాచారం కోసం ‘కడలి తరంగం’ బ్లాగులో చూడగలరు.

ఇది ప్యాకింగ్ మారిన బ్రిటీష్ నాటి వ్యాపార దోపిడి గాక మరేమిటి? విచిత్రం ఏమిటంటే - ఈ సెజ్ లతో కార్మికుల బ్రతుకులను మరింత దిగజార్చింది కమ్యూనిస్ట్ దేశమైన చైనా! సెజ్ ల తాలూకూ సంపూర్ణదోపిడి కూడా, ఇప్పటికే చైనాలో పూర్తిస్థాయిలో నడుస్తోంది. ఇది చెప్పటం లేదా.... ఏ ఇజమైనా నిజం కాదని, దగాకు మరో రూపమేనని!

అన్నిటి వెనకా ఉన్నది నకిలీ కణిక వ్యవస్థ గనకే.... ఏ దేశమైనా, ఏ ఇజమైనా.... ఇదే నడుస్తోంది!

ఇక సెజ్ ల విషయాన్ని ప్రక్కన బెడితే...

కార్పోరేట్ వ్యాపారం కోసం సృష్టించే మరికొన్ని మోజుల్ని పరిశీలిద్దాం!

మీడియా ముకుమ్మడిగా ఎత్తుకుందంటే దేన్నైనా హిట్ చెయ్యగలదు. అచ్చం డిజైనర్ చీరలు, దుస్తులూ, చెప్పులూ లాగా! ఒక్కసారిగా అన్ని పత్రికలూ హోరెత్తిస్తే, ఎటు చూసినా డిజైనర్ వస్త్రాలే అయిపోయాయి చూడండి, అలాగన్న మాట! ఇక ఈ మోజుల దృక్పధాన్ని, ఎంతగా ప్రజలలో ప్రవేశ పెడతారంటే -

కొన్ని సబ్బులకి, మాయిశ్చరైజర్లకీ టీవీలో వచ్చే వాణిజ్య ప్రకటనలని గమనించండి. ఓ చిన్నారి, మరో చిన్నారి దృష్టి నుండి, తాము వాడుతున్న సబ్బుని దాచేసి, తర్వాత తల్లి దగ్గరికి పరుగెట్టుకెళ్ళి "మమ్మీ! నువ్వు కూడా రాహుల్ వాళ్ళ మమ్మీలా మారిపో మమ్మీ!" అంటుంది. కాబట్టి ఫలానా సబ్బు లేదా షాంపూ లేదా మరో సౌందర్య ఉత్పత్తి వాడమని మారాం చేస్తుందన్న మాట!

ఇది విదేశాలలో [మన దేశంలో కూడా] ఎంత దూరం పోయిందంటే - పిల్లలు మన ఇంట్లో కార్పోరేట్ కంపెనీల ప్రతినిధుల్లా పనిచేస్తున్నారని నిపుణులు ప్రకటించారు. వస్తువు ఎలాంటిదైనా, అది తమకు సంబంధించనదైనా కాకపోయినా, చిన్నారులు, ఫలానా బ్రాండు వస్తువులే కొనాలని తల్లిదండ్రులని డిమాండ్ చేస్తున్నారట. ఫలానా కంపెనీ కారు లేదా మొబైల్ లేదా కంప్యూటర్ గట్రా కొనాలని.

టీవీ యాడ్స్ ప్రభావమూ, సహధ్యాయులతో పోటి మనస్తత్వమూ ఇందుకు కారణాలట. దాంతో కార్పోరేట్ కంపెనీలు, ఇప్పుడు తమ అమ్మకాల కోసం, పిల్లల మీద దృష్టి కేంద్రీకరించేయనీ, తమ వాణిజ్య ప్రకటనలన్నీ పిల్లల మనస్తత్వం మీదే గురిపెడుతున్నాయనీ నిపుణులు అభిప్రాయపడ్డారు. 2008, జనవరి ఒకటో తేదీన ‘మన ఇంట్లో ఇతరుల ఏజంట్లు’ శీర్షికన ఈనాడులో పూర్తి వివరాలతో ఇదంతా ప్రచురితమైంది కూడా!

ఇక ఇలాంటి వ్యాపారంలో ఏపాటి విచక్షణ ఉంటుంది? బాల్య చాపల్యమే వ్యాపార ముడి సరుకు కావటమే కదా ఇది!? ఇదేదీ కార్పోరేటిజంకి పట్టదు. కావాల్సింది వ్యాపారాభివృద్ది మాత్రమే! దాని మూలంగా సమాజంలో, ఏ విధమైన శారీరక మానసిక రుగ్మతలు పెరిగినా వాళ్ళకి అనవసరం. "అవన్నీ ఆలోచిస్తే సంపాదించలేరు. ఫలానా కంపెనీ ఈ రకపు వ్యాపారం చేయక పోతే మరొకరు చేస్తారు" అంటూ కొంతమంది, సదరు కార్పోరేట్ సంస్థల్ని వెనకేసుకు రావటం కూడా కద్దు.

విషయం ఏమిటంటే - ఆ ఫలానా వాళ్ళు ఎవరైతే వాళ్ళే ఈ విమర్శకు పాత్రులు. అంటే - ఈ రకపు వ్యాపారం రిలయన్స్ చేస్తే రిలయన్స్ నీ, మరో xyz కంపెనీ చేస్తే ఆ కంపెనీని ఉద్దేశించిన విమర్శ తప్ప, ఈ విశ్లేషణలో, నా వ్యక్తిగత అభిమానమో, అసహ్యమో.... ఏ కంపెనీ పట్లా లేవని గమనించగలరు.

ఇక ఇలా సృష్టించబడే మరో రకపు ట్రెండ్ లను గమనించండి. ప్రజా దృక్పధంలో ప్రవేశపెట్టే ట్రెండ్ లు.... ఫలానా వస్తువు[సెల్లో, బైకో] లేదా ఫలానా బ్రాండు వస్తువో కలిగి ఉండటం [పరువుకి] ప్రిస్టేజ్ కి సంబంధించినది. ఫలాన వస్తువు లేకపోవటం పరువు తక్కువ, కొండొకచో అవమానం కూడా." పదే పదే అదే ప్రచార వ్యూహంతో, ఇలాంటి కుహనా భావనలు సమాజంలోకి చొప్పించబడ్డాయి. దాంతో అధికశాతం ప్రజలు.... వస్తువునీ, వస్తువినిమయాన్ని ఆస్వాదించటం మరిచిపోయారు. వస్తువు కలిగి ఉండటం మీదే వాళ్ళ శ్రద్దంతా!

ఖరీదైన విలాస వస్తువులు ఇంట ఉండి, ఆనందించే తీరిక లేకుండా, క్షణం ఇంట ఉండలేనట్లుగా పరుగులెత్తే జీవితంలో మిగిలేదేమిటి? నీతా అంబానీ, 26 అంతస్థుల విలాస నివాసభవనం కలిగి ఉండినా, కారులో కునుకు తీయాల్సిన బ్రతుకు గడిపినట్లే! కడుపునిండా తిండి, కంటి నిండా నిద్ర, మనసు తీరా ఆత్మీయులతో కబుర్లు... ఇవేవీ లేని జీవితంలో, సంపద ఉండీ ఉద్దరించేదేముంది?

ఇలా....‘వస్తువుని కలిగి ఉండటమే ప్రతిష్ఠకు నిదర్శనం’ అనే భ్రమలు పెరిగి.... సదరు వస్తువుల్ని సమకూర్చుకోలేక పోయినపుడు, అభం శుభం తెలియని కొందరు పిల్లలు, భావోద్రేకపూరితులై యువకులూ.... నిరాశానిస్పృహలకీ, ఆత్మన్యూనతకీ గురికావటం కూడా జరుగుతోంది. తాము కోరిన సెల్ ఫోన్ తండ్రి కొననందుకు, బైక్ కొననందుకు ఆత్మహత్యలు చేసుకున్న పదేళ్ళ పిల్లల నుండి, ఇరవై ఏళ్ళ యువకుల గురించి, ఎన్నో వార్తలు అప్రధాన్య అంశాలుగా వెళ్ళిపోతుంటాయి.

భావాలని, బంధాలని, అనుభూతుల్ని ఆనందించటం మాని, కేవలం వస్తువులూ, ద్రవ్యమూ, డబ్బే ఆనందదాయకమనుకొని, ఎండమావుల వెంట పరుగు పెడుతున్న పరిణామ ఫలితం ఇది!

జీవితంలో ఆకలి కేకలు వేసే వేళ, అనుభూతులకి విలువ లేదు.

అలాగే అనుభూతించని చోట సంపద సమకూడినా వ్యర్ధమే!

జీవితంలో పగలూ రాత్రి ఎంతో.... అనుభూతులూ అనుబంధాలూ, సిరిసంపదలూ అంతే!

భావవాదమూ, పదార్ధ వాదమూ రెండూ తగినంత పరిమితిలో ఉన్నప్పుడే మనిషి జీవితం సుఖదాయక మౌతుంది.

దాన్నే గీత
‘యుక్తాహార విహారస్య’ అంటుంది.

ఈ సత్యాన్ని ప్రజలు గుర్తించగలిగే వాళ్ళు ఒకప్పుడు! ఇప్పుడది.... నకిలీ కణికుల గూఢచర్య వ్యూహాల కారణంగా, పదేపదే అదే ప్రచారం హోరులో మరుగున పడింది.

ఎప్పుడైతే ప్రజలు.... సత్యమూ, నిజాయితీ, జ్ఞానమూ, విలువలూ, క్రమశిక్షణతో కూడిన జీవనసరళే, జీవితానికి అంతిమ గమ్యమని గుర్తిస్తారో.... అప్పుడు సమాజంలోని ఈ చెడు అంతరిస్తుంది.

ఎందుకంటే - ‘మంచిగా బ్రతకటం, ధర్మం పాటించడం, సత్యం పలకడం అంటేనే మట్టి గొట్టుకు పోవడం’ అని నకిలీ కణిక వ్యవస్థ ప్రచారించింది. గూఢచర్య బలంతో దృష్టాంతపూరితం చేసింది. నీతి నిజాయితీలతో బ్రతక ప్రయత్నించిన వాడు, ఉన్నది ఊడగొట్టుకుని, దారిద్ర్యపు బారిన పడటాన్ని సంఘటనాత్మకం చేసి, మీడియా ద్వారా మరింత ఫోకస్ చేసి ప్రజలని ప్రభావపరిచింది. "ఇవాళా రేపూ చెడుకే రోజులు!" అంటూ చెవినిల్లు కట్టుకు చెప్పి మరీ, ప్రజా దృక్పధాన్ని ప్రభావపరిచింది.

నకిలీ కణికులు తరాల తరబడి, శతాబ్దాల తరబడి, మానవ జాతి మీద ప్రయోగించిన కుట్రలో ‘ప్రజా దృక్పధాన్ని ప్రభావపరచటం’ అన్నది ప్రధాన అంశం!

అందుకోసం మోజులు సృష్టించటం, భ్రమలు కల్పించటం, ఏదైనా చేసారు, చేస్తున్నారు. మరికొన్ని ఉదాహరణలు....!

కార్పోరేట్ కంపెనీల వ్యాపారం కోసం సృష్టించబడిన ‘వాలంటైన్స్ డే’ ఇలాంటి వాటిల్లో ఒకటి! టీవీల్లో, పత్రికల్లో వార్తాంశాలుగా, ప్రత్యేక శీర్షికలుగా హోరెత్తించి చేసుకునే వ్యాపారాలు కోట్లలోనే! పూలబొకేలు, గులాబీలు, గ్రీటింగ్ కార్డులు, మిఠాయిలు, కేకులూ, చాక్లెట్లూ... చల్లగా వజ్రపు టుంగరాలు, నగా నట్రాల వంటి గిప్టులూ!

ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి మోజులలో, ఎందరు అమాయక లేత వయస్సు బాలబాలికలు నలిగిపోతున్నారో, ఈ వ్యాపారులకి అనవసరం! ఏటికేడాది మీడియా మళ్ళీ మళ్ళీ హోరెత్తిస్తూనే ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఆ రోజున ఇన్ని కోట్ల గులాబీలు అమ్ముడయ్యాయనీ, ఇన్ని టన్నుల చాక్లెట్లు హాంఫట్ అయ్యాయనీ, తెగ ఊరించి వ్రాసేస్తుంది. "ఆ ‘దినం’ జరుపుకోక నువ్వే నష్టపోయావు. అందరూ తెగ బావుకున్నారు" అన్నట్లు పాఠకులకి/ప్రేక్షకులకి, ఎవరికి వాళ్లకి ‘తలంటు’ పోసేస్తుంది.

ప్రజల నుండి ఎన్ని విమర్శలు వచ్చినా వ్యాపార సంస్థలకి పట్టదు. ఎందుకంటే - ప్రభుత్వం స్పందించి ఆటంకపరిస్తే తప్ప, విమర్శల వల్ల తమకొచ్చే నష్టం ఏదీ లేదు. పార్టీలకతీతంగా ప్రభుత్వాలూ, మీడియా సంస్థలూ, తమ జేబులో బొమ్మలే అయినప్పుడు, తమ కొచ్చే కష్టమూ, నష్టమూ ఏముంది? ఎటూ గూఢచర్యమిళితమై, మీడియా అధినేతలూ, ప్రభుత్వాధినేతలూ, కార్పోరేట్ అధినేతలూ... ఈ వ్యాపారంలో ఎవరి వాటా వాళ్ళు పుచ్చుకుంటున్నారు కదా? ఇంత విస్తారమైనది ఈ ఆర్దికపరమైన కుట్ర!

ఇలాంటి తాజా ఉదాహరణ అక్షయ తృతీయ! ఈ పండగ గురించి గానీ, ఆ రోజు బంగారం కొనే సెంటిమెంటు గురించి గానీ, ఎప్పుడూ ఎక్కడా చదివి ఉండలేదు, విని ఉండలేదు. ఇటీవల కాలంలో కార్పోరేట్ బంగారు నగల షోరూంలు వచ్చాక, అక్షయ తృతీయ గురించి అనూహ్య ప్రచారం వచ్చింది. ‘అక్షయ తృతీయ రోజున బంగారం కొంటే, లక్ష్మీ దేవికి మన మీద అనుగ్రహం కలిగి మన ఇంటికి వస్తుంది’- అనే నమ్మకం, ప్రజల్లో కలిగి తెగ కొనేస్తున్నారంటుంది మీడియా! అమ్మకాలు నడిచాయంటాయి వర్తక సంస్థలు!

ఒకప్పుడు, ప్రజల ముఖ్యంగా హిందువుల గుడ్డి ఆచారాల గురించి, మూఢనమ్మకాల గురించి గర్జించిన హేతువాద సంఘాలు, జన విజ్ఞాన వేదికలూ, ఈ కొత్త నమ్మకాల గురించి ఎందుకు కిమ్మనరో వాళ్లకే తెలియాలి.

ఇలాంటి మెగా మోజు మరొకటి ఏమిటంటే -

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

9 comments:

హేటువాదానికి, సెజ్ లకు ముడివేసి మీ అగ్రవర్ణాల అభిజాత్యం మరోమారు చూపుకున్నారు.అసలు మీకు హేటువాదం అంటే తెలుసా?

అనానిమస్ గారూ ,
ఆవిడ ముడి వేసింది హేతువాదానికి, సెజ్ లకి కాదు . అక్షయ తృతియాకి , హేతువాదానికి. మీరు స్పందించాలంటే దాని మీద స్పందించండి చూద్దాం

మరి హెడ్డింగ్ అలా వుందే? హెడ్డుకు బాడీ కి తేడావుందన్న మాట! ఈనాడు ఆన్లైన్ పత్రిక ఎడిటర్ గాగాని పనిచేశారా?
అక్షతృతీయ లాంటి నమ్మకాలవల్ల సామాన్యులకి ఒరిగిందేమీ లేదు. బలిసిన ఎన్.ఆర్.ఐ లు , అవినీతి పరులను ఇంకో అవినీతి బిజినెస్ గాళ్ళు పిండుకుంటామంటే, హేటువాదులెందుకు కిమ్ అనాలి?

Its true..

JVV - fights on only few issues.. (eg:-Fish

Prasadam)

కొంతమంది హేతువాద ప్రముఖులు, వారి పిల్లలు దేశీయ/అంతర్జాతీయ మీడియా రంగం లో ఉన్నారు. ఇలా మీరు చెప్పిన "అక్షయ తృతీయ రోజున బంగారం కొంటే, లక్ష్మీ దేవికి మన మీద అనుగ్రహం కలిగి మన ఇంటికి వస్తుంది" అనేదాని మీద వారు వ్యతిరేక ప్రచారం చేప మందు మీద గలభా చేసినట్లు ఆరోపణలు చేస్తే, బంగారు, వజ్రాల వ్యాపరస్తుల నుంచి టి.వి., న్యుస్ పేపర్లకు వచ్చె ప్రకటనలు రావు. వ్యాపారం దేబ్బ తింట్టుంది. అదే చేప మందుకి బత్తిన సోదరులు ప్రకటనలు ఇవ్వరు కనుక వారి మీద దాడికి దిగితె మీడియా వారికి వచ్చె నష్టం ఎమీ లేదు. పైగా చేప మందు వారిపై ఎదురు దాడి దిగిన వారిని మీడీయా వారు కవర్ చేస్తారు. దానితో హేతువాదులకు పేరుకి పేరు, సంగం లో గుర్తింపు వస్తాయి. పైసా ఖర్చు లేకుండ ఇంత పేరు ప్రఖ్యాతులు హేతువాదులకు లభిస్తున్నాది కదా!ఇంత అనాలిసిస్ చేస్తారు, ఈ మాత్రం తెలియదా? :-)

అక్షయ తృతీయనాడు దానం చెయ్యమన్నారు. ఏదీ కొనమనలేదు. బహుశా బంగారం దానం చేస్తే దైవానుగ్రహం కలుగుతుందని పూర్వీకుల భావమేమో తెలియదు. బంగారం కొంటే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందనే ఈ ప్రచారం ఎలా బయలుదేరిందో !

మొదటి అజ్ఞాత గారు: అలా అంటారా?
రెండవ అజ్ఞాత గారు: కృతజ్ఞతలండి.
మూడవ అజ్ఞాత గారు: మీ అభిప్రాయం మీరు చెప్పారు. నెనర్లు.
రామ నరసింహ గారు: మీరు చెప్పింది నిజమేనండి!:)
నాలుగవ అజ్ఞాత గారు: అక్షయ తృతీయ నాడు బంగారం దానం చేస్తే మంచిది అన్న ప్రచారం మీడియా ఇవ్వమనండి చూద్దాం. అప్పుడెంత కిక్కో!
ఐదవ అజ్ఞాత గారు: నిజమే సుమా! :))

మన చుట్టూతా ఉన్న వర్తక స్వామ్యపు దిగంబర నృత్యాన్ని emperor'''s new clothes కావని తెల్లపరుస్తూ మీరు చాలా చక్కగా రాశారు. క్రిస్తమసు పండగకి కూడా బహుమతులిచ్చి పుచ్చుకోవడమనే అచారం ఒక నూరు సంవత్సరాల పూర్వం ప్రపంచంలో ఎక్కడా లేదని ఎంత మందికి తెలుసు? Valentines Day పేరున స్త్రీ పురుష ప్రేమికులు పూలని హతం చేసి ఖరీదైన బహుమతులు మార్చుకునే ఆచారం పూర్వం లేదనీ, దాన్ని St Valentine అనే ఒక క్రైస్తవ సాధువు పుట్టినరోజు పరంగా చేస్తారనీ మన దేశస్థులైన అజ్ణాన దివాంధాలకెంత మాత్రం తెలుసును? ఏదో విధంగా మనలో ఆత్మన్యూనతని ఆపాదించి, మన చేత డబ్బు ఖర్చు పెట్టించడమే పనిగా పెట్టుకుంటాయి వ్యాపార సంస్థలు: పుట్టిన రోజులు, పెళ్ళిరోజులు, పండగలు, "తల్లి దినం", "తండ్రి దినం", "బాస్ దినం", "సెక్రటరీ దినం", ...ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతీ మానవ సంబంధానికీ ఒక ప్రత్యేక దినాన్ని సౄష్టించడమే కాకుండా, అందుకు ఖరీదైన చెత్త అంతా కొనమని ప్రోద్బలం చేస్తున్నయి ప్రపంచమంతటా వ్యాపార సంస్థలు.

ఈ అక్కరలేను వస్తువులు కొనడం కోసం అందరమూ మళ్ళీ అవే కార్పరేటు సంస్థల్లో కూలీలుగా కుదుర్కుని రోజులు వెళ్ళదీస్తుంటాము. సంపాదనలు, వస్తు వినిమయం రెట్టించినంత మాత్రాన మనిషి అత్మానందం రెట్టించదు. కార్పరేషన్లలో పని చేసిన కొద్దీ, మనిషి తనవాళ్ళ నుండీ మరింత దూరమౌతున్నాడు. అందుకు పరిష్కారంగా మళ్ళీ అదే కార్పరేట్ విషవలయంలో పరిభ్రమిస్తున్నాడు. కుటుంబ సాన్నిహిత్యం, స్వంత కష్టం, స్వావలంబన నుండీ వచ్చిన వస్తూతపత్తి, సత్యము, దయ, ప్రేమ, కవలసినంతగా మాత్రమే సంచయము (కూడ బెట్టడం) - ఇవీ మహాత్ముల ఆదేశాలు. ఇందుకు వ్యతిరేకమైనదంతా స్వత్రంత్రసిద్ధి తర్వాత మనం నేర్చిన, మనకు పనికిరాని వస్తు,. ధన వ్యామోహం.

- తాడేపల్లి హరికృష్ణ

హరికృష్ణ తాడేపల్లి గారు: చక్కగా చెప్పారు. కృతజ్ఞతలు. మీరు పంచిన అభిప్రాయాలకి నేను వ్రాసిన వ్యాఖ్య చాలా చిన్నది. నెనర్లు! :)

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu