భారతదేశం! వేల సంవత్సరాల క్రితం నుండీ [ఇప్పటికి కూడా] ప్రకృతి సంపదలతో సహజ వనరులతో సర్వసమృద్ధమైనది. విపరీత వేగాలతో సుఖాన్ని జుర్రుకోవాలను కుంటే ఎన్ని వనరులన్నా భూమి ఒట్టిపోతుంది. అది నిజం, సహజం! సుఖానికీ సంతోషానికీ మధ్య ఉన్న సన్నని వ్యత్యాసాన్ని గ్రాహ్యతలోకి తెచ్చుకుని, పదార్ధ వాదానికీ భావ వాదానికీ సమతుల్యత పాటించగలిగిన ప్రాచీన భారతీయులకి, వేద వాజ్ఞ్మయం, ఉపనిషత్తులూ, ఇతిహాసాలు పరిపుష్టమైన సనాతన ధర్మాన్ని, దృక్పధాన్ని అలవరిచాయి.

ఆ దృక్పధం రీత్యానే భారతీయులు ప్రకృతిని ఆరాధించే తనానికి అలవాటు పడ్డారే గానీ ప్రకృతిమీద ఆధిపత్యం తెచ్చుకోవాలని ఆరాట పడలేదు. కాబట్టే ఈ నేలమీద వేల సంవత్సరాల క్రితం ప్రాకృతిక కాలుష్యమూ లేదు, మానసిక కాలుష్యమూ లేదు. సర్వప్రాణులనీ, ప్రకృతిలోని చెట్టు చేమల్నీ పిట్టాపుట్టల్నీ కూడా దేవతారూపాలుగా ఆరాధించటం, సమన్వయంతో జీవించటం... జీవికకు అవసరాల తీరితే ఆత్మోన్నతికి సాధన చేయటం - ఇదే లోకం! కాబట్టే వేల సంవత్సరాల ప్రాచీన చరిత్ర ఉన్న భారతీయులు, ఏ దేశం మీదికీ దండెత్తిన దాఖలాలు లేవు. అహింసాయుతమైన బౌద్దాన్ని ప్రచారించటానికి క్రీస్తుకు పూర్వమే, అశోకుడు తన పుత్రిక సంఘమిత్రని ఖండాతరాలకి పంపాడు గానీ, రాజ్య విస్తరణకు తన దండనాధులని పంపలేదు.

అయితే, దాదాపు 1200 ఏళ్ళక్రితం, ఎప్పుడైతే ఆఫ్ఘన్ ఇసుక పర్రల మీది నుండి సింధునదిని దాటి మహమ్మదీయులనబడే ఎడారి దొంగలూ, 1498 లో ఎప్పుడైతే యూరపు నుండి తెల్లవాళ్ళనే సముద్రపు దొంగలూ, భారతదేశంలోకి అడుగుపెట్టారో అప్పటి నుండీ ప్రాకృతిక కాలుష్యమూ, భావకాలుష్యమూ పెరిగిపోయాయి. దాదాపుగా 1200 ఏళ్ళకు పైగా పదార్ధవాదులూ, భోగవాంఛితులూ అయిన ముస్లిం రాజుల పాలనలోనూ, పరవంచనా చతురులైన ఆంగ్లేయుల పాలనలోనూ భారతీయులు చాలా నష్టపోయారు. పోగొట్టుకున్న భౌతిక సంపద, నష్టపరుచుకున్న భావ సంపదతో పోలిస్తే అల్పమైనది. పదార్ధ సంపద పోగొట్టుకున్నా, తిరిగి సంపాదించుకోవటం, సృష్టించుకోవటం సులభం. భావసంపద నష్టపోతే ఆ వెలితి పూడ్చుకోవటం అసాధ్యం కాదుగానీ కష్ట సాధ్యం.

ఇక అందులో 200 ఏళ్ళకు పైగా తెల్లవాళ్ళ పాలనలో అణిచివేతకు, ఆత్మన్యూనతకు యావద్భారత జాతి గురయ్యింది. ఈ విషయంలో తెలంగాణా ప్రజలది డబుల్ ధమాకా! వీళ్ళు నిజాం పాలనలో మరింత వంచితులూ, వ్యధార్తులూ! నిజాంల అకృత్యాలను గురించి, పీవీజీ ’లోపలి మనిషి’లో చదివాను. యండమూరి కాసనోవా లో చదివాను. కమిలి వంటి కథల్లో చదివాను. దాసి, ఒసే రాములమ్మ వంటి సినిమాల్లో చూశాను. ఆనాటి తెలంగాణా విమోచన పోరాట యోధుల మాటల్లో చదివాను. చిన్నతనంలో మా పెద్దల నుండి కొంత విని ఉన్నాను.

కొన్ని యదార్ధ సంఘటనల గురించి చదివినప్పుడు ఎంతో దుఃఖం, ఆక్రోశమూ కలిగాయి. ఆవేశం మితిమీరి నిస్సహాయతకీ దారితీసేది. చదివితేనే ఆవేశం, తరువాత నిస్సహాయత, నాకే అన్పించింది, అలాంటిది స్వయంగా అనుభవించిన తెలంగాణా ప్రజలకి ఎలా ఉండి ఉంటుంది? ఒకోసారి నమ్మశక్యం కానంత అమానుషంగా అన్పించేది. ముఖ్యంగా రజాకార్ల గురించి చదివినప్పుడు!

మన దొడ్లో పశువుల పాకలోని ఆవూ లేదా గేదెల శరీరం నుండి స్రవించే పాలూ పేడతో పాటు తోలూ మాంసమూ కూడా డబ్బుగా మార్చబడుతుంది. ఆయా పశువుల శ్రమనే గాకుండా వాటి సంతతిని కూడా ఆస్తిగా పరిగణిస్తాం. అయినా వాటితో అనుబంధం పెంచుకుని ప్రేమగా సాకుతాం. ఆదరంగా చూసుకుంటాం. నిజాంలు మనుషుల్ని ఈపాటి కూడా చూడరనీ, ఇంతకంటే భయంకరంగా ఉపయోగించుకుంటారని చదివినప్పుడు, అది జీర్ణం కావటానికి సమయం పట్టింది.

చదువుకునే రొజుల్లో ఏపీ దర్శన్ లో భాగంగా ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాలతో పాటు తెలంగాణా జిల్లాలలో కూడా పర్యటించాను. కానీ చిన్న వయస్సు రీత్యా నాకంతగా వ్యత్యాసం తెలియలేదు. అప్పటి నుండి నాకు తెలంగాణా స్నేహితులు ఉన్నారు. అయితే 2000 లో ఖమ్మం, వరంగల్ లని చూశాము. మూడేళ్ళపాటు నల్గొండ జిల్లా, సూర్యాపేటలో నివసించాము. తెలంగాణా జిల్లాల అంచునున్న నిజామాబాద్ నిర్మల్, అటునుండి బాసర దాకా చూసాను. మట్టి గోడలతో కూడిన పూరిళ్ళు, బక్కచిక్కిన నల్లటి దేహాలతో కూడిన మనుష్యుల్నీ చూసినప్పుడు, గుంటూరు విజయవాడ జాతీయ రహదారిపై రోడ్డు కిరువైపులా ఉన్న పెద్దపెద్ద పారిశ్రామిక షెడ్లూ, భవనాలు గుర్తుకొచ్చాయి.[ఇప్పుడు లేదుగానీ మా చిన్నప్పుడు గుంటూరు - విజయవాడ రోడ్డు మీద పొగాకు కంపెనీలలో ఆకుని గ్రేడింగ్ చేయటానికి వేలల్లో స్త్రీ కార్మికులు పనిచేసేవాళ్ళు. సాయంత్రం వేళ దాదాపు గంటసేపు ట్రాఫిక్కు ఆగిపోయేది. ఆ మహిళా కార్మికులు కదిలి పోయింతర్వాత మళ్ళీ బస్సులూ, కార్లూ బయలు దేరేవి.]

ఆదొక్కటే కాదు, ఏలూరు రామచంద్రాపురంల మీదుగా కోనసీమలో ప్రయాణిస్తుంటే రోడ్డు కిరువైపులా పచ్చని పొలాలూ, పిల్లకాలవలూ, కొబ్బరి చెట్టు ఉండటం గుర్తుకొచ్చింది. అవే గోదావరి, కృష్ణా నదులు, తెలంగాణా మీదుగా కోస్తాలోకి ప్రవేశిస్తాయని చిన్నప్పుడు చదువుకున్న సాంఘిక శాస్త్రం గుర్తుకు వచ్చి, రెండు ప్రాంతాలకీ ఉన్న భౌతిక వ్యత్యాసం గమనించి, ఆశ్చర్యం వేసింది. నదీ జలాలున్నా ఎందుకు తెలంగాణా అలా ఉండిపోయిందో అర్ధం కాలేదు.

తెలంగాణా గురించీ, నిజాంల నిరంకుశత్వం గురించీ, రజ్వీ గురించీ, MIM లు గురించిన వార్తాంశాలు పత్రికలలో చదివినప్పుడు వాటన్నిటి గురించి మరింతగా ఆలోచించేవాళ్ళం. చిన్నప్పుడు గోల్కొండ కోటనీ, అందులో రామదాసు చెరనీ చూశాను. శ్రీరామదాసు సినిమాలో రామదాసు చెరను చాలా పెద్దదిగా చూపారు. నిజానికి గోల్కొండ కోటలో రామదాసు చెర ఒకమనిషి నడుం ఎత్తగలిగేంత ఎత్తుకూడా ఉండదు. ప్రతీరోజూ శిక్షించటానికి బయటకు తెచ్చేవారు. మిగతా కాలమంత కూర్చొవాల్సిందే గానీ నిలబడగలిగేంత అవకాశం లేదు. అది గుర్తుకు వచ్చినప్పుడు తెలంగాణా ప్రజల దైన్యమూ గుర్తుకు వచ్చేది.

భారతంలో విరాటపర్వం ఆఖరి ఘట్టాలలో, ఉత్తరుని యుద్ద సామర్ధ్యాన్ని అంగీకరించని కంకుభట్టు[ధర్మరాజు] మీదికి పాచికలు విసురుతాడు విరటుడు. ఆయన నుదిటికి గాయమై రక్తం కారుతుంది. సైరంధ్రిగా అక్కడ ఉన్న ద్రౌపదీ దేవి చప్పున తన కొంగుతో ఆయన రక్తం నేలపై పడకుండా నివారిస్తుంది. అది చూసి ప్రశ్నించిన విరటుడితో "మహారాజా! సత్పరుషుని రక్తం ఎన్ని బిందువులు నేలమీద పడితే, అన్ని సంవత్సరాలు క్షామంతో ఈ దేశం అల్లాడుతుంది. మమ్మల్ని ఆదరించిన మీకూ, మీ దేశానికి, ఆ బాధ కలగకుండా ఉండేందుకు ఇలా చేసాను" అంటుంది.

దీన్నే మన పెద్దలు "మంచివాణ్ణి, ధర్మపరుణ్ణి బాధిస్తే, వారి కంట నీరు, రక్తమూ, నేల జారిన చోట ఈతి బాధలు కలుగుతాయి. కాబట్టి, ఏ వూరైతే ధర్మపరులని గౌరవిస్తుందో ఆఊరు పచ్చగా ఉంటుంది" అనేవాళ్ళు. ఒక విధంగా చెప్పాలంటే - డబ్బుకీ, అధికారానికీ, కండబలానికీ గాక, మంచితనానికీ, ధర్మ పరత్వానికీ భయపడేటట్లుగా, గౌరవం విధేయతా చూపేటట్లు సమాజాన్ని కట్టడి చేయటానికి ఇలాంటి నమ్మకాలు ఉపయోగపడేవి. ’మతం తొక్క, ధర్మం పరమతొక్క, వర్షాలు పడటానికి కారణం సైన్సు చెబుతుంది. ఈ నమ్మకాలకీ వర్షం పడటానికీ సంబంధం లేదు’ అనే రచనలు సమాజం పట్ల విషవృక్షాలై నేడు సమాజం ఈ స్థితికి వచ్చింది. దాంతో పాటు భూమీ వేడెక్కింది. ఇప్పుడెంతగా కోపెన్ హేగన్ లలో గొంతు చించుకు అరిచినా, గుండె బాదుకు ఏడ్చినా ఒనగూడే ప్రయోజనం మాత్రం సున్నా!

ఇక ఈ చర్చ వదిలి మళ్ళీ భారతం దగ్గరకీ, నమ్మకాల దగ్గరికీ వస్తాను. ప్రతీసారీ భారతం చదివినప్పుడూ, గోల్కొండకోటలోని శ్రీరామదాసు చెరా, తెలంగాణా దైన్యమూ రెండూ గుర్తొచ్చేవి. శ్రీరామదాసు చెరలోని వెతల దగ్గరి నుండీ ఇప్పటికి, ఎంతమంది పాలకులు మారినా [అప్పట్లో కులీ వంశీయులైన తానిషా, తర్వాత ఔరంగజేబు, ఆపైన నిజాంలూ, స్వాతంత్రానంతరం ప్రజాస్వామ్యపు రాజకీయ నాయకులూ] తెలంగాణా మాత్రం, ఆ సత్పరుషుని రక్తశ్రువాలనీ, దుఃఖశ్రువులనీ నివారించని ’కర్మఫలాన్ని’ అనుభవిస్తూనే ఉందేమో అనుకునేవాళ్ళం.

పూర్తిగా వ్యక్తిగతమైన ఈ అభిప్రాయానికి మేం రావడానికి మరికొన్ని అంశాలు కూడా దోపదపడ్డాయి. మూడు వందల పైచిలుకు సంవత్సరాల క్రితపు కంచెర్ల గోపన్న విషయంలోనే కాదు, శతాబ్ధాల తర్వాత కూడా తెలంగాణా వాళ్ళు సత్పురుషుల పట్ల చూపింది, చూపుతోంది ఈ అలక్ష్యమే! మొన్న మొన్న, వృద్దులైన స్వాతంత్ర సమరయోధులు పింఛన్ కోసం ఇప్పటి ధూర్త రాజకీయ నాయకులు కాళ్ళమీద పడటం చూసిందే![కొందరికైతే ఆ ఫించన్ కూడా రాలేదు. మరికొందరు పలుకుబడి ఉన్నవాళ్ళు వాళ్ళ పనివాళ్ళకు స్వాతంత్ర సమరయోధులుగా గుర్తింపులు ఇప్పించుకుని, రైల్వే ఏసీ కోచ్ లలో ప్రయాణించటాలు కూడా మాకు తెలుసు.] ఎవరి దాకో ఎందుకు?...ఇప్పుడింతగా ’తెలంగాణా...తెలంగాణా అత్మగౌరవం...తెలంగాణా ప్రజల వెనుకబాటుతనం’ అని ఎలుగెత్తి అరుస్తున్న ఈ కేసీఆర్,జి.వెంకటస్వామి, అమోస్, ఇతర సీనియర్ జూనియర్ నాయకులు పీవీజీ పట్ల చేసిందేమిటి?

తరతరాల నుండి తెలంగాణా వాడైన, తెలంగాణాలోనే పుట్టి పెరిగిన, నిజాం కబంధ హస్తాల నుండి తెలంగాణాకి విమోచనం కలిగించేటందుకు నెత్తురోడ్చి పోరాడిన పీవీజీ, తెలంగాణా నాయకుడు కాలేకపోయాడు. పుట్టిన గడ్డ ఆదరించకపోతే, ఎన్నికల్లో పోటీ చేయడానికి రాంటెక్ లూ, కురుక్షేత్రలూ, నంద్యాలలూ పోవలసి వచ్చింది. ఇది, ఇల్లూ వాకిలీ కోల్పోయి ఆ పంచనా ఈ పంచనా కాలం గడపవలసి రావడం వంటిది. ఉన్న ఇంటి నుండి కట్టుబట్టలతో వెళ్ళగొట్టబడి, బంధుమిత్రులు ఇళ్ళల్లో, తలదాచుకుంటూ నెలలపాటు గడిపిన మాకు, ఈ బాధ ఎలా ఉంటుందో అనుభవపూర్వకంగా తెలుసు. ఒక రాజకీయ నాయకుడికి కూడా స్వంత నియోజక వర్గం లేకపోతే ఇలాంటి బాధే ఉంటుంది. ఇప్పుడు రిజర్వేషన్ల రీత్యానో, మరో కారణంగానో, స్వంత నియోజక వర్గాలు వదిలి మరోచోట పోటీ చేయాల్సి వచ్చిన రాజకీయ నాయకులకి కూడా ఆ బాధ ఎలా ఉంటుందో అర్ధమయ్యే ఉంటుంది.

తెల్లవాళ్ళకీ, నిజాంలకీ కూడా వ్యతిరేకంగా పోరాడిన తెలంగాణా వీరుడు పీవీజీ, తెలంగాణా వాళ్ళకి నాయకుడు కాలేకపోయాడు. తాత తండ్రులు ఒరిస్సా నుండి వలసరాగా ఇక్కడ స్థిరపడిన కేసీఆర్ అపరనాయకుడైపోయాడు. ఇప్పుడు తెలంగాణా కోసం గొంతు చించుకు అరుస్తున్నా వెంకట స్వాములూ, అమోస్ లూ, రాంరెడ్డి దామోదర రెడ్డిలూ, జానా రెడ్డిలూ... ఎవ్వరికీ కూడా, 1998 లో కాంగ్రెస్ అధిష్టాన దేవత పీవీజీకి టిక్కెట్టు నిరాకరించి, అత్యంత అవమానకరంగా ఆయనని ఇంటికి పంపించిన రోజున, ఆయన తెలంగాణా బిడ్డడని అన్పించలేదు. తెలంగాణా ఆత్మగౌరవమూ గుర్తురాలేదు. చివరికి 2004 లో ఆయన దివంగతుడైనాక, ఈ ఇటలీ పెద్దమ్మ ఆయన పార్ధివ శరీరాన్ని సైతం అవమానించినప్పుడూ తెలంగాణా నాయకులెవరికీ నోరెత్తేపాటి దమ్ము కూడా లేకపోయింది.

అప్పటికి యూపీఏ ప్రభుత్వంలో కేసీఆర్ పోర్ట్ పోలియో లేని మంత్రిత్వం వెలగబెడుతున్నాడు కూడా! నిజాం ఎలాంటి వాడైనా సరే, మా నిజాం మాకు గొప్ప అన్న కేసీఆర్, మరి పీవీజీకి జరిగిన అవమానం గురించి ఎందుకు ఈరోజుకి కూడా మాట్లాడటం లేదు? ఇటలీ పెద్దమ్మ అంటే భయమా? ఇటలీ పెద్దమ్మంటే కాంగ్రెస్ వాళ్ళకంటే భయమో అనుకుందాం, మరి తెలంగాణా నాయకులకి ఎందుకు భయం!? అప్పుడు ఆత్మగౌరవం గుర్తుకు రాలేదా?

చివరికి పీవీజీ ప్రధాని పీఠం అధిష్టించిన తర్వాతనైనా, తెలంగాణాలోని ఏ నియోజక వర్గంలోని పార్లమెంటు సభ్యుడూ తన సీటుని ఖాళీ చేసి ఆయనకి ఇవ్వలేదు. నిజం చెప్పాలంటే ఇప్పుడు తెలంగాణా అంటూ గావుకేకలు వేస్తున్న కాంగ్రెస్ వృద్ద, యువనాయకులలో నూటికి తొంభైమంది రాజకీయ పునరావాసం కోసమే వగరుస్తున్నారు. అలాగని ’సమైక్యాంధ్ర’ అనే వాళ్ళు సచ్ఛీలురని నేను అనటం లేదు. తెలంగాణా వారిలో మాత్రం ’ఆ గడ్డపట్ల నిబద్దత లేదు, నిబద్దత ఉన్న నాయకుల పట్ల గుర్తింపు లేదు’ అంటున్నాను. అసలుకే ప్రజలందరికి ఉచిత పధకాలు అలవాటు చేస్తున్నచోట, తెలంగాణా నాయకులు ఆ ఉచిత పధకాలు మరింత ఆకర్షణీయంగా చూపిస్తున్నారు. అలాంటి రాజకీయనాయకులకి, ప్రజలకి కూడా, పీవీజీ ఫిలాసఫీ ఏమాత్రం రుచించదు.

కంచెర్ల గోపన్న అనబడే రామదాసు కాలం నాడే కాదు, అప్పటి నుండి ఇప్పటి దాకా కూడా, తెలంగాణా సత్పురుషుల రక్తాశ్రుతువులనీ, దుఃఖాశృవులనీ నివారించలేదు, నివారించే ప్రయత్నమూ చేయటం లేదు. ఆ ’కర్మఫలమే’ శతాబ్ధాల నుండీ, అధిక మోతాదులలో దశాబ్దాల నుండీ అనుభవిస్తోంది.

నిజానికి ఈ రకమైన కర్మఫలాన్ని యావద్భారత దేశమూ అనుభవిస్తూనే ఉంది. నమ్మకాలని నాశనం చేసుకుని, సత్పురుషులని, మంచివాళ్ళని వెతలపాలు చేసినందుకూ, ’ధర్మమా తొక్కా’ అని దుర్భాషలాడినందుకూ...! చేసిన కర్మ అనుభవింపచేయడానికి ప్రభుత్వాలకైతే కోర్టులూ, పసలేని చట్టాలూ, ప్రహసనాలతో నిండిన రాజ్యాంగాలూ కావాలి గానీ, భగవంతుడికి అవేవీ అక్కర్లేదు కదా! మరి కొంచెం విశాలంగా చూస్తే... ఈ రోజు వేడెక్కి భయపడెతున్న పుడమితల్లి కనబడుతోంది. సమస్త ప్రపంచప్రజలూ ఈ తిలా పాపానికి తలా పిడికెడు చేయుతనిచ్చిందే! ఆ కర్మ ఫలాన్నే అందరూ అనుభవిస్తున్నారు.

లోతుగా పరిశీలిస్తే - ఆద్యాత్మిక చింతనా, తాత్త్విక చింతనా లేని ఏ జాతి అయినా, ఏ దేశమైనా, ఏ సమాజమైనా చివరికి కుటుంబమైనా, వ్యక్తి అయినా... ఆర్ధికంగా వెలిగి ఆరిపోయాయి. ఒక్కక్షణంలో మండి ఆరిపోయే గడ్డిపోచ మాదిరిగా! గాఢమైన భావనలు, పరిపక్వమైన ఆలోచనా సరళి, ఆధ్యాత్మిక చింతన ఉన్నవాళ్ళే, ఒడిదుడుకులు తట్టుకుని నిలబడ్డారు. రెపరెపలాడినా సుదీర్ఘకాలం వెలిగే దీపపు ప్రమిద మాదిరిగా!

ఈ విషయంలో తెలంగాణా, మిగిలిన భారతీయులతో పోలిస్తే రెట్టింపుగా అణిచివేయబడింది. వందల సంవత్సరాల పాటు, సుఖభోగలాలసులైన ముస్లిం రాజుల పాలనలో, అందులోనూ 225 ఏళ్ళపాటు నిరంకుశులైన నిజాంల పాలనలోనూ, మగ్గిపోయిన తెలంగాణా... నిర్భాధ్యులైన తల్లిదండ్రుల పిల్లలు అణిగారిపోయినట్లు, ఆర్ధికంగా, అధ్యాత్మికంగా హీనస్థితికి దిగజారిపోయింది. సరైన దృక్పధం లేకపోవటమే దీనికి ప్రధాన కారణం. పిల్లలకి సరైన దృక్పధాన్ని తల్లిదండ్రులూ, గురువులూ నేర్పాలి. అలాగే ప్రజలకి ప్రభువులూ, మేధావులూ నేర్పాలి. ప్రభువులు స్వార్ధపరులూ, భోగలాలసులు అయితే... ప్రజలు మేధావులని గుర్తించనీ, గౌరవించనీ దశలో ఉంటే... ఆ ప్రాంతమూ, ప్రజలూ వెనకబడటం ఖాయం.

నకిలీ కణికుల జన్మస్థానమైన హైదరాబాదు సంస్థానం, నిజాంల స్వార్ధపాలన ఇందుకు ప్రధాన కారణం. ఇక నేటి నేపధ్యానికి వస్తే - తెలంగాణా ప్రజల వైఫల్యం, వాళ్ళు సరైన నాయకులని ఎంచుకోక పోవటంలోనే ఉంది. సరైన నాయకత్వాన్నే బలపరిచేటట్లయితే... పీవీజీని వెళ్ళగొట్టుకుని ఉండేవాళ్ళు కాదు, కేసీఆర్ ని నెత్తిన పెట్టుకునే ఉండేవాళ్ళు కాదు. నిజానికి ఇందుకు ప్రజలు బాధ్యులని అనలేం. ఎందుకంటే - నల్లమేక నలుగురు దొంగలు కథలోలా - పదే పదే అదే ప్రచారంతో, మీడియా, రాజకీయం కలిసి ’ఇదే ప్రజాభిప్రాయం’ అంటూ స్టాంపు వేస్తున్న చోట, సామాన్యుడి గొంతు ఎక్కడ విన్పిస్తోంది? ప్రజల బదులు పార్టీలు నాయకులూ, మీడియానే అన్నీ అనేస్తున్నాయి, అన్నీ చేసేస్తున్నాయి. తాజా ఉదాహరణ చూడండి.

నిన్నటి ఈనాడులో ’ఇలా చేస్తారని అనుకోలేదు’ అన్న శీర్షిక క్రింద, లోకసత్తా నాయకుడు జేపితో ప్రధాని మన్మోహన్ సంభాషణ గురించిన వార్త ప్రచురింపబడింది.

>>>పార్టీలు ఒకమాట చెప్పి మరో పని చేశాయి.
ప్రజల జీవితంతో ఆడుకున్నాయి.
తనను కలిసిన జేపీ ముందు ప్రధాని మన్మోహన్ ఆవేదన
సాంత్వన కోసమే నాటి నిర్ణయం.
చిదంబరం ప్రకటనపై పీఎం వివరణ

>>>న్యూఢిల్లీ న్యూస్ టుడే:పార్టీలన్నీఏకాభిప్రాయంతో ఉన్నాయనుకుని తెలంగాణా ప్రకటన చేశామని, ఒక మాట చెప్పి మరోపని చేస్తారని తమకుతెలియలేదని ప్రధాని మన్మోహన్ సింగ్ తనతో ఆవేదన వ్యక్తం చేసినట్లు లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ అన్నారు.

పార్టీలు ఒకమాట చెప్పి మరో పని చేసాయట. [ఇది నిజమే సుమా!] పార్టీలన్నీ ఏకాభిప్రాయంతో ఉన్నాయనుకుని తాము తెలంగాణా ప్రకటన చేశారట.

ఇతడి వాదన నిజమే అనుకుందాం. మరి తమ పార్టీలోనే ఏకాభిప్రాయం లేదు కదా? సీమాంధ్ర ఎం.ఎల్.ఏ.లు రాజీనామాలు చేసారు. నేతలు నిరాహార దీక్షలు చేస్తున్నారు. మరి తమ పార్టీలో ఏకాభిప్రాయం ఉందోలేదో చూసుకోలేదా? గురివింద గింజలాగా ఇతర పార్టీల ఏకాభిప్రాయం గురించి మాట్లాడటం గాకపోతే, అసలు స్వంత పార్టీలో ఏకాభిప్రాయం ఏది? ఆఖరికి రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా, విమానం దిగిన తరువాత గానీ సమాచారం లేదట. అతడే స్వయంగా పార్టీ సహచరులకు చెప్పాడు. మరి దీన్నేం అనాలి?

అసలు రాష్ట్ర వ్యాప్తంగా ఏ విషయలోనైనా, ప్రజాభిప్రాయం ఏమిటో, కేంద్రప్రభుత్వస్థానంలో ఉండి తమ అంచనా తమకి ఉండనవసరం లేదా? ’దేశంలో ఎక్కడేం జరుగుతోంది, ఏఏ అలజడులున్నాయి’, అన్న వివరాలు సేకరించే నిఘాసంస్థలు ఏం చేస్తున్నాయి? మాట్లాడితే ’అధిష్టానం అన్నీ గమనిస్తోంది’ అంటారు కదా?

"తొక్కలో ప్రజలు! వాళ్ళ అభిప్రాయానికి విలువేముంది? తొక్కలో పార్టీ సభ్యులు! ’ నోర్ముసుకు కూర్చోండి లేకపోతే పాత కేసులు తిరిగి తోడతాం, ఐటీ, సిబిఐ లని ఇళ్ళమీదికి తోలుతాం!’ అంటే నోర్మూసుకుంటారు. అసలు అధిష్టానం ఆగ్రహంతో ఉంది అని పత్రికలు వ్రాస్తే చాలు వాళ్ళే వణుకుతూ కూర్చుంటారు!" అనుకున్నారు కాబోలు!

అంతేకాదు, పార్టీలు ఏకాభిప్రాయం చెప్పి తరువాత మాట మార్చాయి. దీన్ని బట్టి చూసినా, ఏ పార్టీల నాయకత్వాలు కూడా ప్రజల అభిప్రాయాన్ని మన్నించటమూ లేదు, ప్రతిబింబించనూ లేదని స్పష్టపడటం లేదా? తెదేపా, ప్రరాపాలు సీమాంధ్ర ప్రజల నుండి ఇంతగా వ్యతిరేకత వస్తుందని ఊహించలేదు అంటూ’ ప్రత్యేక తెలంగాణా మీద తమ మాట వెనక్కి తీసుకున్నాయి. దీన్నిబట్టి చూసినా ప్రజాభిప్రాయాన్ని పార్టీల నాయకత్వాలు గానీ, మీడియా గానీ ప్రతిబింబించటం లేదన్నది నిజం! సమైక్యాంధ్ర ఉద్యమాన్ని వేరెవరో వెనక నుండి నడిపిస్తున్నారన్న వాదన ఉంది.

అదే నిజమైతే ఎవరు ఈ ఉద్యమాలని స్పాన్సర్ చేస్తున్నారు? వై.ఎస్.జగన్ అయితే ఖచ్చితంగా కాదు. ఎందుకంటే, అతడు డబ్బుపట్ల లోభాన్ని దాటలేడు. కాబట్టి మధుకోడాల మీద ఐటీ దాడులూ, గాలి గనుల మీద ఇక్కట్లు రాగానే, మరుక్షణం పరుగెత్తుకెళ్ళి, సకుటుంబ బంధుమిత్ర సమేతంగా కాంగ్రెస్ అధిష్టాన దేవత కాళ్ళమీద పడిపోయాడు. అలాంటి చోట, రోజుల తరబడి, శ్రీకాకుళం నుండి అనంతపురం చిత్తూరుల దాక, ఉద్యమాలని స్పాన్సర్ చేసేంత ధనపు దమ్ము అతడి జేబుకూ ఉండదు, గుండెకూ ఉండదు. అదీగాక... తెదేపా, ప్రరాపా పార్టీల వాళ్ళు ఇతడి క్రింద ఎందుకు పనిచేస్తారు? అసలేపార్టీలకీ చెందని [అంటే కార్యకర్తలు కాని] వారు రోడ్డెక్కుతున్నారు కదా!

తెలంగాణాలో జనాలు రోడ్డు మీది కొస్తే స్వచ్చందమూ, సీమాంధ్రలో అయితే స్పాన్సర్డ్ మూవ్ మెంట్స్ అనటం వితండం కాదా? తెలంగాణా సామాన్యుడికి ప్రత్యేక రాష్ట్రం వస్తే ఒరిగేదేమీ లేదు, నాయకులకి తప్ప! అందుచేత వాళ్ళకి నిర్లిప్తత ఉంటుంది. సీమాంధ్ర సామాన్యుడికి తెలంగానా వేరుపడితే హైదరాబాదు పోతుంది గనుక పోయే ఆర్ధిక సంబంధాలూ, మానసిక సంబంధాలూ ఉంటాయి. అందుచేత వాళ్ళకి ఆందోళన ఉంటుంది. హైదరాబాదు తెలంగాణా భాగం కాదంటే తెలంగాణా సామాన్యులు కూడా రోడ్డెక్కుతారు. మొత్తంగా ఇప్పుడు హైదరాబాదు కోసమే ఈ పోరాటం! అలాగాక సమైక్యాంధ్ర కోసమే ఉద్యమిస్తుంటే, అప్పుడు తెలంగాణా వారిని హేళన చేయరు కదా!

మరోమాట - కేసీఆర్ కీ, తెరాసకీ ప్రజల మద్దతే ఉంటే ఎందుకు గ్రేటర్ ఎన్నికల్లో పలాయనం చిత్తగించినట్లూ, సార్వత్రిక ఎన్నికల్లో ఎందుకు పరాజయం మూటగట్టుకున్నట్లు? ఈవీఎంల సాక్షిగా, ఇందులో తెరాస అగ్రనేత కేసీఆర్ కీ, కాంగ్రెస్ అధిష్టానానికి మధ్య ఒడంబడికలున్నాయి. దాన్నే మ్యాచ్ ఫిక్సింగ్ అని ఇతర పార్టీలు ఘోల్లుమంటున్నాయి.

ఏది ఏమైనా... ’పదకొండురోజుల సైలెన్ బాటిల్ తో నిరాహార దీక్ష చేసిన కేసీఆర్, అతడి ఆరోగ్యం గురించి ఆందోళన చెంది అర్ధరాత్రి ’రాష్ట్ర ఏర్పాటు షురూ’ ప్రకటన చేయించిన సోనియా, కలిసి నాటకం ఆడారు’ అన్నది నిర్వివాదం. నాటకమే గాకపోతే....కేసీఆర్ దీక్ష చేపట్టీ చేపట్టక ముందే అరెస్టు చేసి ఖమ్మం జైలులో, తదుపరి ఆసుపత్రికీ ఆపైన నిమ్స్ కీ ఎందుకు తరలించినట్లు? [1990 లో అద్వానీ రధయాత్రని అడ్డుకుని అరెస్టు చేయించిన వీపీ సింగ్ - ఇద్దరూ కలిసి దేశవ్యాప్త గొడవలకి తెరతీసారు. సరిగ్గా అదే స్ట్రాటజీ ఇప్పుడు కూడా! ప్యాకింగ్ మారుతుందే గానీ అదే పది స్ట్రాటజీలు!]

ఇప్పుడు నిరాహార దీక్షలు చేస్తున్న దేవినేని ఉమ,లగడపాటి, వై.ఎస్. వివేకా గట్రాల లాగే కేసీఆర్ నీ దీక్షా శిబిరంలో వదిలేయవలసిందిగా! అతడి ఆరోగ్యం గురించి గంట గంటకీ వైద్య బులిటెన్లూ, మీడియా హడావుడీ... ఎంత హంగామా నడిచిందో! మరి ఇప్పుడు నిరాహార దీక్షలు చేస్తున్న వారి ఆరోగ్యాలు అంత హంగామా సృష్టించటం లేదేమీ?

ఇక, తెలంగాణా వేర్పాటు ఉద్యమాలనీ, సీమాంధ్ర సమైక్య ఉద్యమాలనీ, వాటిల్లో రాజకీయ నాయకుల ప్రమేయాన్ని, మీడియా భాగస్వామ్యాన్ని పక్కన బెట్టి, కేవలం ప్రజల మనోగతాన్నే పరిగణించినా... ప్రజలేం కోరుకుంటున్నారు?

రెండు నెలల క్రితం కర్నూలు నగరం వరదల్లో అల్లల్లాడితే, సర్వస్వమూ కోల్పోయి కుదేలైన తోటి వారిని ఆదుకునేందుకు, సీమ - ఆంధ్రా - తెలంగాణా అన్న ప్రాంతీయ భేదం లేకుండా, అన్ని జిల్లాల ప్రజలు... ఆతృతతో, ప్రేమతో, ఐకమత్యంతో, లారీల నిండా దుస్తులూ, ధాన్యపు గింజలూ వేసుకుని పరుగెత్తుకు వచ్చారు. రెండునెలలు తిరిగేసరికి, సైలెన్ బాటిల్ నిరాహార దీక్షతో కేసీఆర్, రాష్ట్రాన్ని ముక్కలు చేసి పుట్టినరోజు కేకు ముక్కల్లా పంచివ్వగల సామ్రాజ్ఞి ననుకునే రాజకీయనాయకురాలు సోనియా కలిసి ఆడిన నాటకంలో - కన్నీటితో కొందరూ, కడుపు మంటతో కొందరూ, ఆక్రోశంతో కొందరూ, ఆవేదనతో కొందరూ కలిసి కొట్టుకుంటున్నారు.

ప్రకృతి తల్లి భీభత్సం ప్రజలందరిని కలిసి మెలసి ఉండేటట్లు చూస్తే, ఇటలీ తల్లి ప్రజలందరిని కొట్టుకునే స్థితికి తీసుకువచ్చింది.

నిన్నమెన్నటిదాకా కలిసిమెలిసి కష్టసుఖాలని పంచుకున్న ప్రజలని తన్నుకొమ్మన్న దెవరు? ప్రజలా? పాలకులా?

విభజించి పాలిస్తున్న వారి వికృతరూపం కాదా ఇది?

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

8 comments:

సమైక్య ఆంధ్ర ఉద్యమాన్ని డబ్బులతో నడిపిస్తున్నది లగడపాటి. అతను జగన్ కంటే ధనవంతుడు. అతను తన ఆస్తి 299 కోట్లు అని చెప్పుకున్నాడు. http://raamusoamu.blogspot.com/2009/12/true-face-of-lagadapati-lanco-raj-gopal.html

Q:- ఎవరు ఈ ఉద్యమాలని స్పాన్సర్ చేస్తున్నారు?
A:-వై.ఎస్.జగన్ & K.V.P.(SEEN LO VEELLU LENANTHA MAATHRANA VEELLA HASTHAM LEDANAKOODADU)

వాచాతీతమైన వేదనతో ఏం వ్రాయాలో తెలియడం లేదండీ. ధర్మం సంస్కృతి భాష ఆచారం సంప్రదాయం... అన్నీ వదలివేసికొని దిగజారిపోతున్నామే అని.

ఆచారప్రభవో ధర్మః ధర్మస్య ప్రభురచ్యుతః
అని కీర్తింపబడ్డ అచ్యుతుడే మనని వదలక రక్షించునుగాక.

చాలా సరిగ్గా చెప్పారు. ఎందుకూ పనికిరాని వెధవలకు కూడా ఢిల్లీ నగరంలో అంతిమ సంస్కారాలూ, వారి పేర సమాధులూ - కానీ మన దేశాన్ని అభివృధ్ధి పధంలో తారాజువ్వలా దూసుకుపోడానికి దోహదపడ్డ ఒక ప్రధాన మంత్రి పార్ధివ శరీరానికి మాత్రం అవమానం! ఆయన్ని అంతగా అవమానించిన ఆ ఇటలీ దేవత కాళ్ళ మీద ఈ వెధవలంతా పడుతున్నారు. ఆ మహానుభావుడికి, బహు భాషా పండితునికి, దేశం గర్వించదగ్గ ఒక దార్శనికుడికి అన్యాయం జరగడం చూసి, ప్రకృతే కోపించి నాడు సునామీ సృష్టించిందని నేను అనుకున్నాను! కానీ ఆ మహనీయుని జన్మభూమి కి కూడా మరి బాధలు తప్పవేమో. ప్రతీ ఒక్కరూ ఆయన్ని వేలెత్తి చూపే హక్కున్నట్లు, మొన్న ఈ మధ్య కూడా - అయోధ్యలో బాబ్రీ మసీదు కూలడానికి కూడా ఆయనే కారణమని పేపర్లలో స్టట్ మెంట్లు వస్తున్నప్పుడు కూడా ఈ నాటి ఒక్క తెలంగాణా నాయకుడూ మాట్లాడలేదు. ప్రతిపక్షమైనా, యన్. టీ. ఆర్ నయం. ఒక తెలుగు వాడు ప్రధాన మంత్రి అయ్యాడని, ఆయనకి పోటీ గా ఎవరినీ నిలబెట్టలేదు.

మీ వ్యాస పరంపర చదువుతుంటే, ప్రజలు ఇంకా ఎన్నాళ్ళు ఇలా మంద గొఱ్ఱెల్లాగా, పనికి మాలిన నాయకుల వెంట నడుస్తున్నారా ... అని బాధ కలుగుతోంది. ఇప్పటికైనా ప్రజలు మేల్కొని, మేము కలిసి సమస్యలన్నిటిమీదా పోరాడుతాం అని నినదిస్తే బాగుండు.

హైదరాబాదు - ఆంధ్ర ప్రదేశ్ గుండె లాటిది. తెలంగాణా విభజన పేరుతో, "తమ" ఊరు అనుకున్న దాన్ని వేరెవరికో ధారాదత్తం చేయడం సహజంగానే అందరికీ బాధ కలిగించే విషయమే. హైదరాబాదు ఎవ్వరి ఆస్తీ కాదు, అది ఉమ్మడి ఆస్తి. పైగా విడగొట్టలేని ఉమ్మడి ఆస్తి. బిడ్డలు గుండె ని పంచమంటే, ఏ తల్లి అయినా ఎలా కోసి ఇవ్వగలదు? తెలంగాణా పేరుతో ప్రజల్ని చాలా కాలం మభ్య పెట్టలేరన్న విషయం ఈ స్వార్ధ నాయకులకి ప్రజలే తెలియ జెప్పాలి.

ప్రవీణ్ గారు, యాష్ గారు,

నెనర్లు!

రాఘవ గారు,

మీ సహానుభూతికి నెనర్లు! దైవం మనల్ని రక్షించాలంటే మనం ధర్మాన్ని ఆచరించాలి. సందర్భానుసారం మంచి శ్లోకాలు వ్రాస్తారు. సంతోషంగా అన్పిస్తుందండి. మరోసారి నెనర్లు!
~~~~~~~~~
విరజాజి గారు,

మీ ఆవేదన సహేతుకమే! ఈ వ్యాసంలో ఇంకా నేను వ్రాసింది తక్కువేనండి. అనుభూతించినదైతే ఇంకా ఎక్కువ. ఆ స్థాయి ఈ ప్రజలు ఎప్పుడు అందుకుంటారో! వేచి చూడాల్సిందే. మీ అనుభూతిని పంచుకున్నందుకు నెనర్లు!

గుఱుసమానులు ఆదిలక్ష్మిగారికి నమస్సులు,
మీ సుదీర్ఘ టపాలా సమాహరాన్ని లెబుల్స్ గా విభజించినా వాటిని పి డీ ఎఫ్ లొకి మార్చి http://www.scribd.com/ లాంటీ చొట అందించవలసినదిగా మనవి, నా స్నేహితులకి అంతర్జాలం అందుబాటులొ లేని కారణంగా వారికి మీ అంత సరలంగా నేను చెప్పలెను, మీ వ్యాసాలు చదివిన తరువాత నా దృక్పదంలొ వచ్చిన మార్పు మటల్లొ చెప్పలెను అందుకు నేను ఎప్పటికి మిమ్మల్ని గుఱువుగా ఆరాధిస్థాను. అయితె నాకు తెలిసిన విషయాలు కనీసం నా స్నెహితులకైనా తెలియజెయలనుకుంటున్నాను. అందుకు కనీసం కొన్ని వ్యాసాలైన ఈ-పుస్తకాలూగా అందించాలని కొరుతున్నాను. మీకు సమయం దొరికినప్పుడే...

-రేణు కూమార్

రేణూ కుమార్ గారు,

త్వరలో తప్పకుండా చేస్తానండి. నిజానికి నా టపాలలో చర్చించే విషయాలు ఒక్క మాటలో చెప్పగలిగేవి కావు. వివరించటానికి ఎక్కువ సమయం తీసుకునే విషయాలు. చదివితేనే సమగ్రంగా ఉంటాయి. మీ ప్రయత్నానికి కృతజ్ఞతలు. మీ అభిమానానికి నెనర్లు!

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu