ఇటీవల మనరాష్ట్రంలో నదులు పొంగి కొన్ని ప్రాంతాల్లో వరద – బురద – దుర్గంధం ముంచెత్తాయి. ఇది మానవ తప్పిదం + ప్రకృతి వైపరీత్యం.

ఒకవైపు సహాయకార్యక్రమాలు, మరోవైపు వాటిపై రాజకీయ ఎత్తుగడలు. వరదలో సర్వమూ పోగొట్టుకున్న బాధితులు జీవితాన్ని పునః ప్రారంభించేందుకూ, మళ్ళీ బ్రతుకు పోరాటానికీ, సమాయత్తం అవుతున్నారు. ఈ విషయంలో భారతీయుల ఆత్మస్థైర్యానికి నిజంగా జేజేలు పలకాలి. బాధితుల కోసం ఎంతో మంది రిక్తహస్తాలు గాక వస్తుహస్తాలు చూపడం, విరాళాలతో ఆదుకోవటం చూస్తుంటే, ఎవరెన్ని కుట్రలు చేసినా ఈ జీవగడ్డపై మానవత్వాన్ని చంపలేరనిపిస్తోంది. అందుకే అన్నారేమో పెద్దలు భారతదేశం ‘కర్మ భూమి’ అని! ఇది నాణేనికి ఒక వైపు చిత్రం.

దీనికి సమాంతరంగా మరోవైపు రాజకీయ విచిత్రం ఉంది. వరద తాకిడిలో తాత్కాలికంగా, ‘రాష్ట్రముఖ్యమంత్రి సీటు రాజకీయం’ నెమ్మదించినా, మెల్లిగా మళ్ళీ ఊపందుకుంటోంది.

ఈ నేపధ్యంలో, వై.యస్. జగన్ శిబిరానికీ, కాంగ్రెస్ అధిష్టానానికీ మధ్య సాగుతున్న అంతర్లీన పోరు చాలా ఆసక్తికరమైనది.

ఇటు జగన్ శిబిరమూ, అటు కాంగ్రెస్ అధిష్టానమూ కూడా, ఈ విషయంలో ద్విముఖ వ్యూహం పాటిస్తున్నాయి. కాంగ్రెస్ అధిష్టానం – ఇంతకు ముందు తాము వై.యస్.కు సీన్ ఇచ్చినందునా, అతడి అకస్మిక మరణం తర్వాత తొలిరోజుల్లో, పరిస్థితులపై తమకింకా అవగాహన రాకముందు, వై.యస్.ని ‘దార్శినికుడనీ, మార్గదర్శి’ అనీ పొగిడినందునా, ఇప్పుడు చాలా జాగ్రత్త తీసుకుంటోంది. ముఖ్యమంత్రిగా రోశయ్యని తాత్కాలికంగా అనుకునీ, అంటూనూ, సీట్ లో కూర్చోబెట్టి, ఆనక అతడే పర్మినెంటు సీ.ఎం. అనేసింది. ఈ చర్య పూర్వాపరాలని గత టపాలలో వివరించాను.

ఇక జగన్ శిబిరానికి కళ్ళెం వేయటానికి అధిష్టానం పన్నిన ద్విముఖ వ్యూహం లో మొదటిది – వై.యస్.ని కీర్తించటం, అదీ రోశయ్య, మంత్రివర్గం చేత చేయించటం! ముఖ్యమంత్రి సలహాదారు పదవి నుండి కేవిపీ ని తొలగించకుండా, రోశయ్య వెంటపెట్టుకుని ఉండటం. దాంతో జగన్ శిబిరం,
i]. వై.యస్.ని రోశయ్య ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందనో,
ii]. వై.యస్.ని, అతడి సేవలనీ విస్మరించారనో
iii]. అతడి పధకాలని మూలన పెట్టారనో

ప్రచారించకుంటూ, ఇంతకు ముందు తాము[అధిష్టానం] వై.యస్.కు ఇచ్చిన ’సీన్’నీ, మీడియా ఇచ్చిన ’వై.యస్. దేవుడు’ ఇమేజ్ నీ వాడుకుని, తమను డామేజ్ చేయకుండా నిరోధించవచ్చు.

ఇందులో భాగంగానే, రాష్ట్రమంతా వరదబీభత్సంలో కొట్టుకులాడుతుండగా, హడావుడిగా, తిరుపతి దేవుడి ‘గడప’ అయిన ’కడప’జిల్లాని వై.యస్.రాజశేఖర్ రెడ్డి జిల్లాగా పేరుమారుస్తూ నోటిఫికేషన్ జారీ చేసారు.

ఇక అధిష్టానపు ద్విముఖ వ్యూహంలో రెండవ ఎత్తుగడ – ’అధిష్టానం జగన్ ని entertain చేయదు, చేయబోదు. రోశయ్యే ప్రత్యామ్నాయ ముఖ్యమంత్రి. కాబట్టి నోరు ఎత్తకుండా జగన్ శిబిర నిర్వాహకుల దగ్గర నుండి మద్దతుదారులంతా తమకి సరెండర్ కావాలన్న’ హెచ్చరికలు ప్రకటనలతోనూ, దినపత్రికలలో వార్తాంశాల లీకులతోనూ, చర్యలతోనూ ఇవ్వటం.

ఇందులో భాగంగానే వరద హడావుడిలోనే రోశయ్య ’సి’ బ్లాకులోకి ప్రవేశ పెట్టబడ్డాడు. [అచ్చం ఈనాడు Octo.3, 2009 తేదీ ‘ఇదీ సంగతి’ కార్టూన్ మాదిరిగా నన్నమాట] కాంగ్రెస్ స్పోక్స్ మెన్ లు మనీష్ తివారీ, జయంతీ నటరాజన్, అభిషేక్ సింఘ్వీ, గట్రాలు ఈ విషయమై విస్పష్టప్రకటనలు ఇస్తూనే ఉన్నారు. అప్పుడప్పుడూ వీరప్ప మొయిలీ – ఓసారి జగన్ శిబిరానికి అనుకూలంగానూ, మరోసారి జగన్ శిబిరానికి వ్యతిరేకంగానూ ప్రకటనలు ఇస్తుండటం, వేర్వేరు పత్రికలలో వేర్వేరు కథనాలతో ప్రచురింపబడుతోంది.

జగన్ కు చెందిన కంపెనీల మీదా, అతడి మద్దతుదారుల మీదా, అతడి సంస్థల్లో పెట్టుబడి పెట్టిన వారిమీదా ఇన్ కం టాక్స్ నోటిసుల జారీ కూడా ఇందులో భాగమే. ఈ వార్తని ఈనాడు అస్సలు కవర్ చేయకపోవటం ఇక్కడ గమనార్హం. ’మంత్రివర్గ విస్తరణ ఉంటుంది, జగన్ మద్దతుదారులకి పదవులు ఊడటం ఖాయం. వై.యస్. వ్యతిరేకులకు మంత్రిపదవులు నికరం’, వంటి వార్తల [పుకార్లు?] ప్రచారం జోరందుకోవటం కూడా, కాంగ్రెస్ అధిష్టానం జగన్ శిబిరం మీద ప్రయోగిస్తున్న మానసిక యుద్దతంత్రం లోనివే. ఇదేలాగంటే, ముందుగా ’పుకారు’ లాగా పేపరుకి లీక్ చేయటం, దాని మీద కదలికలు చూసుకుని, తరువాత దాన్నే నిజం చెయ్యటం లేదా ‘పుకార్లు’ అని కొట్టిపారేయటం!

అలాగే, జగన్ శిబిరం కూడా, తమకు చేతనైన, తమకు తెలిసిన గూఢచర్యంతో ద్విముఖ వ్యూహం అవలంబిస్తోంది. అందులో మొదటది – మాటల్లో, నామమాత్రపు చేతల్లో, అధిష్టానానికి విధేయత ప్రకటించటం! అందులో భాగంగానే ప్రకటనలు చేస్తోన్నారు. సభ్యత్వ నమోదు వంటి కార్యక్రమాలలో స్వయంగా పాల్గొంటున్నారు. ఖమ్మం ఫ్లెక్సీ చించివేత వంటి కార్యక్రమాలలో ఇటు జగన్ శిబిరం, అటు అధిష్టాన శిబిరమూ వేసిన ఎత్తుగడలు ఈ వ్యవహారానికీ హైలెట్ వంటివి.

ఇక జగన్ శిబిరపు ద్విముఖ వ్యూహంలో రెండవ ఎత్తుగడ ఏమిటంటే – తమ పట్టువీడని తనం స్థిరంగా చూపటం. సీ.ఎం. సీటుపై పట్టుబట్టి కూర్చొన్న సంకేతాలని పంపుతూనే ఉన్నారు.

అదాయపు పన్ను శాఖ నోటీసులు, మంత్రివర్గ విస్తరణ వార్తల [పుకార్లు?] నేపధ్యంలో, జగన్ శిబిరం కూడా తలవంచుకుని కూర్చోలేదు. నిజానికి ’అధిష్టానానికి ఎదురు తిరిగితే ఫ్యూజులు లేచిపోతాయ్’ అని, కాంగ్రెస్ లోని సీనియర్ మొదలు, ఈరోజు కొత్తగా సభ్యత్వం తీసుకున్న కార్యకర్త వరకూ అందరికీ తెలిసిందే! ఆపాటి జగన్ కీ, కేవిపీ కీ, జగన్ శిబిరానికీ తెలియదా? మరి ఏ ధైర్యంతో జగన్ శిబిరం ఈ ధిక్కరణ చూపుతోంది? ధిక్కరణే కాకపోతే, ప్రతీరోజూ రోశయ్య ప్రభుత్వానికి ప్రతికూలంగా జగన్ పత్రిక ’సాక్షి’ ఎందుకు వార్తలు వ్రాస్తోంది? తన తండ్రి వై.యస్. కైనా ‘అధిష్టానం ఇచ్చినందున అంత సీన్ కానీ, లేకపోతే ఏముందీ’ అని ఎందుకు అనుకోవటం లేదు? మరి ఏ దన్ను చూసుకుని తమ డిమాండ్ ని అంత స్థిరంగా చెప్పగలుగుతుంది?

ఇటు అధిష్టానాన్ని చూసినా – జగన్ శిబిరాన్ని అణిచి వేయడం అన్న దిశలో అంత ఆచి తూచి అడుగులు వేస్తోందేం? ‘ప్రజల్లో వై.యస్. పట్ల తెగ అభిమానం ఉంది’ అందుకని జాగ్రత్త తీసుకుంటోంది – అనటానికి లేదు. ఎందుకంటే ప్రజల పట్లే అంత పట్టింపు అధిష్టానానికి లేదు. ఇక అభిమానం మాట ఎంత? ఈ రోజు మీడియా అతణ్ణి ’దేవుడు’ అంది కాబట్టి, దేవుడు. మరణించిన ముఖ్యమంత్రి వై.యస్. అవినీతి వ్యవహారాలు ఓ నాలుగు బయటికి తీసి, నాలుగురోజులు ఊదరపెట్టి, అతణ్ణి ’అవినీతి దయ్యం’ అంటే అతడు ’అవినీతి దయ్యం’ అయిపోతాడు. అది తమచేతిలోని పని!

ఒకవేళ వై.యస్.అవినీతిని బయటకు తీస్తే, తమ కాంగ్రెస్ ప్రభుత్వమే అప్రతిష్ట పాలవుతుందను కున్నట్లయితే, మరి ఆదాయపు పన్ను శాఖ వారి చేత ఎందుకు నోటిసులు ఇప్పించినట్లు? ఆ విధంగా విషయం బయటకి వచ్చినప్పుడయినా వై.యస్. అవినీతి బయటకి వస్తుంది కదా?
మరెందుకు అంత జాగ్రత్త?

1. ముళ్ళమీద పడిన వస్త్రంని చిరగకుండా తీసుకోవాల్సినప్పుడు ఒక జాగ్రత్త ఉంటుంది.
2. ‘అద్దాలమేడలో నిలబడి ఎదుటి వాడి మీద రాయి వేస్తే, ఆ రాయి ముందు తమ మేడనే పగల గొట్టేస్తుంది’ అనుకున్నప్పుడు ఒక జాగ్రత్త ఉంటుంది.
3. ‘అలాగే తము అద్దాలమేడలో ఉన్నాం. ఎదుటి వాడిచేతిలో రాయి ఉంది. ఏమాత్రం తేడాపాడా వచ్చినా, వాడు రాయి విసరాడంటే తమ అద్దాల భవనం కాస్తా ముక్కలూ చెక్కలై కూర్చుంటుంది’ అనుకున్నప్పుడు ఒక జాగ్రత్త ఉంటుంది.

ప్రస్తుతం ఈ జాగ్రత్తలే కాంగ్రెస్ అధిష్టానంలో ఉన్నాయి.

అలాగే జగన్ శిబిరంలో కూడా, కాంగ్రెస్ అధిష్టానాన్ని లెక్కచెయ్యనితనం ఉండటానికి కారణం ఏమిటి? మాటల్లో, పైపైన ప్రకటనల్లో చూపిన విధేయత, చేతల్లో, సాక్షి వ్రాతల్లో లేదెందుకుని? కాంగ్రెస్ అధిష్టానపు జుట్టు తమ చేతిలో ఉందన్న ధీమా, లేదా వారి ఆయువు పట్టు తమకు తెలుసు అన్న దన్ను – ఎక్కడి నుండి వచ్చాయి?

మరోప్రక్క ఈనాడు వార్తల కవరేజి పరిశీలించండి.
రోశయ్య మంత్రివర్గ విస్తరణ, మార్పుచేర్పుల గురించి ప్రక్క పత్రికలలో వార్తలొచ్చాయి. ఈనాడు మాత్రం ’ఇదీ సంగతి’లో ఓ కార్టూన్ వేసి ఊరుకుంది. డీజీపీ యాదవ్ తదితర అధికారుల బదిలీల గురించి కొంత వ్రాసింది. దానికే భయపడి పోయి, మంత్రివర్గం, అధికారులు రోశయ్యకి విధేయులై పోయారన్నట్లు, దాంతో రోశయ్య బలోపేతం అయిపోయారంటూ ఓ కార్టూన్, ఓ శీర్షిక వ్రాసింది. మామూలుగా అయితే ఏ వార్తని అయినా, తాము ప్రచారం చేయదలిచిన దాన్ని – పెద్దపెద్ద శీర్షికలతోనూ, వివిధ శీర్షికలతోనూ, దాదాపు ప్రతీ పేజీలో వ్రాస్తుంది. అచ్చం వై.యస్.ని దేవుణ్ణి చేయటానికి శతవిధాలా ఎలా వ్రాసిందో అలా! విభిన్న శీర్షికలు, ప్రాసలూ, ఫోటోలు…. ఎలాగైనా కవర్ చేయనీ, పదేపదే వ్రాసేది మాత్రం తాను దేన్ని ప్రచారించదలుచుకున్నదో……దాన్నే! మొత్తంగా ఈనాడు దినపత్రిక చదవటం పూర్తి చేసే లోపల, పాఠకుడి బుర్రలో, ఈనాడు ప్రచారించదలుచుకున్న వార్త శిలాక్షరాల్లో స్థిరపడిపోతుందన్న మాట. ఈ విధంగా ’తను నంది అంటే నంది, పంది అంటే పంది’ అన్న ప్రచారం చేసుకోగలదు. అటువంటి ఈనాడు, ఇప్పుడు అనుసరిస్తున్న విధానం, అందులోని లొసుగులు చూడండి.

1. రాష్ట్రంలో వరదలొచ్చాయి. సహాయక చర్యలు ఎంత బాగా చేసినా, సహజంగా లోటుపాట్లు దొర్లుతాయి. అవి పట్టుకుని రోశయ్యని, ప్రభుత్వాన్ని ఏకటం లేదు. పైపెచ్చు రోశయ్య బలోపేతుడయ్యాడంటుంది.

ఈనాడు రామోజీరావు కాంగ్రెస్ వ్యతిరేకి కదా? వై.యస్.తో మార్గదర్శి Vs ఇడుపులపాయ వివాదంలో రోశయ్యకీ వాటా ఉంది కదా? పైపెచ్చు రోశయ్య, ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యల అనంతరం, సి.బి.సి.ఐ.డి. అధికారి కృష్ణరాజ్ దాడుల నేపధ్యంలో, ’రామోజీరావు అనే చిన్నవ్యాపారి, ఓ చిన్న పత్రిక పెట్టుకుని, ప్రభుత్వ అధికారులు, శాఖలు తనను విచారించకూడదంటే అదెలా కుదురుతుంది?’ అంటూ వ్యక్తిగతంగా కూడా తలపడ్డాడు కదా! మరి రోశయ్యని ఈనాడు రామోజీరావు విమర్శించకుండా పొగుడుతున్నాడేం?

2. ఈనాడు రామోజీరావు తెదేపా మద్దతుదారుడు. అసలా పార్టీకి వెనకితట్టు అండదండలూ, వెన్నుదన్నులూ అతడే అన్నది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు వరదల నేపధ్యంలో తెదేపానీ, చంద్రబాబు నాయుడినీ ప్రమోట్ చేసే ప్రయత్నం ఏదీ, ఈనాడు ఎందుకు చేయటం లేదు? 2009 ఎలక్షన్లప్పుడు ’కుర్రాడు అదరగొట్టాడు’ అంటూ జూ.ఎన్టీఆర్ గురించి, దాదాపు పత్రిక మొత్తం వివిధ శీర్షికలు పెట్టినట్లు, తెదేపా చేస్తున్న వరదసహాయాలను బ్రహ్మండంగా కవరేజ్ ఇవ్వచ్చు కదా? ఎందుకు ఇవ్వటం లేదు?

3. మొత్తంగా ఈనాడు వరదల వార్తలలో తలమునకలయింది. వరదల్నీ, బాధితుల కడగండ్లనీ పెద్దపెద్ద ఫోటోలతోనూ, ఫోటోలతోనూ, పెద్ద అక్షరాల్లో శీర్షికలతోనూ, పేపర్ నింపుకుంటూ, కధనాలకు కేటాయించిన స్థలం స్వల్పంగా ఉంది. అందులోనూ వరద బాధితులకి ఆత్మస్థైర్యం కలిగించేలా వ్రాసిందా అంటే అదీ లేదు. డ్యాములనీ, బాధలనీ ప్రముఖంగా ఫోటోలతో మరీ ప్రచారించింది.

వరదల వార్తలనీ, ఫోటోలనీ ప్రచురించటం తప్పని నేను అనటం లేదు. ‘ఈనాడు రామోజీరావుకు ప్రజల కడగండ్లపట్ల నిబద్దత ఏమీ లేదు’ అన్నది ఎత్తి చూపటమే ఇక్కడ నా ఉద్దేశం. కావాలంటే పరిశీలించి చూడండి. వరదల వార్తలకు తక్కువ మోతాదులోనూ, ఫోటోలూ శీర్షికలకు ఎక్కువ మోతాదులోనూ స్థలం కేటాయిస్తూ వ్రాసిన పత్రికలో, యధాతధంగా ’వసుంధర’ పేజీలో మాత్రం, రకరకాల తినుబండారాల రంగురంగు ఫోటోలతో కథనాలు ప్రచురించింది. ఓ ప్రక్క వరదలతో అల్లాడుతున్న ప్రజలకి, అలాంటి ఫోటోలతో కూడిన వంటల తయారీలు చదివితే, ‘మళ్ళీ ఎప్పటికైనా వీటన్నింటినీ ఆస్వాదించే రోజు వస్తుందా’ అన్న నైరాశ్యమూ, వ్యధా కలగవా?

అంతకంటే, గతంలో ఇలాంటి వరదల్లోనో, ప్రకృతి వైపరీత్యాల్లోనో చిక్కి, మళ్ళీ జీవితాన్ని పునర్నిర్మించుకున్న వ్యక్తుల గురించి, స్ఫూర్తి దాయకంగా వ్రాస్తే బాధితుల ఆత్మస్థైర్యం పెరుగుతుంది కదా? అలాగే గతంలోనూ, ఇప్పుడూ బాధితులకి అండగా నిలిచిన అధికారుల గురించి, సేవాతత్పరుల గురించి, విరాళాలిచ్చిన దాతల గురించి ప్రోత్సహకరంగా వ్రాస్తే అందరిలో ఓ ఉత్సాహం వెల్లివిరుస్తుంది కదా! ఇలాంటివేవీ వ్రాయకుండా….. కేవలం వరదలూ, కడగండ్లు ఫోటోలతో పేజీలు నింపటంలో ప్రజల పట్ల చూపిన నిబద్దత ఏమిటి? అదే వై.యస్. గురించి మీడియా మొత్తం అన్ని పేజీలలో రెండో తేదీ నుండి 14 తేదీ వరకూ వ్రాసిందే వ్రాసింది కదా!

అటువంటప్పుడు, అసలెందుకు ఈనాడు, కేవలం వరదల బాధల్ని మాత్రమే ఫోకస్ చేస్తూ, ’ఈరోజు గడిస్తే చాలు’ అన్నట్లు గడుపినట్లు? చాలా వార్తల్ని దాచి, పెంచి, తగ్గించి లేదా వక్రీకరించి వ్రాస్తూ, కాలం ఎందుకు గడుపుతున్నట్లు?

ఈ సందేహాలకు సమాధానం, ‘పైకారణంగా’ మనకి ఏమీ అర్ధంకాదు. ‘రాజకీయాలే అంత, ఏమీ అర్ధం కాదు’ అన్పిస్తుంది. అలాకాక, సమాధానం కావాలంటే, పైకి కనబడే కారణాలని గాకుండా జగన్ శిబిరం, అధిష్టానం మధ్య అంతర్లీనంగా సాగుతున్న గూఢచర్యపోరుని పరిశీలించాల్సి ఉంది.
నకిలీ కణిక వ్యవస్థ, అందులోని కీలక వ్యక్తి రామోజీరావు, అందులోనే భాగమైన కాంగ్రెస్ అధిష్టానంలతో కూడిన నెం.10 వర్గానికీ, నెం.5 వర్గానికీ మధ్య ’సందట్లో సడేమియా’ చేసిన వై.యస్., కేవిపీలు, అందుకు తగిన జాగ్రత్తలూ, ప్రత్యామ్నాయాలూ కూడా తీసుకున్నారు.

అంటే – ఒకవేళ ఏదైనా అటు ఇటు అయి, తమకేదైనా ప్రమాదం వచ్చినా, లేక నెం.5 వర్గాన్ని నమ్మించామంటూ నెం.10 వర్గాన్ని నమ్మిస్తూ పబ్బం గడుపుకుంటున్న తమ నాటకం బయటపడితే, అలాంటి ప్రమాదాన్ని దాటేందుకు కావలసిన జాగ్రత్తలు కూడా తీసుకున్నారు. అందులో భాగంగానే నెం.10 వర్గానికీ, నెం.5 వర్గాన్ని నమ్మించాల్సిన అవసరం గురించీ, ఆ నాటకం లో అధిష్టానపు పాత్ర గురించి తగినంత సమాచారాన్ని, సాక్ష్యాల్ని సేకరించి పెట్టుకున్నారు.

జగన్ శిబిరపు చేతిలో ఉన్న రాయి లేదా అధిష్టానపు జుట్టు ఇదే! ఈ సాక్ష్యాన్నే, తన ’సాక్షి’ మీడియా సంస్థ ద్వారా బయటపెడతానన్న బెదిరింపు రాయిని, అద్దాలమేడలో ఉన్న కాంగ్రెస్ అధిష్టానానికీ, రామోజీరావుకీ, నెం.10 వర్గానికీ చూపెడుతున్నారు. అందుకే ముళ్ళమీద వస్త్రాన్ని చిరగకుండా తీసే జాగ్రత్తనీ, అద్దాలమేడలో ఉండి ఎదుటివాళ్ళపై రాయి వేయకూడదన్న జాగ్రత్తనీ, కాంగ్రెస్ అధిష్టానమూ, ఈనాడు రామోజీరావు కూడా చూపిస్తున్నారు. అందుకే ఇటు జగన్ శిబిరమూ, అటు కాంగ్రెస్ అధిష్టానం [ఆ ముసుగులోనున్న నెం.10 వర్గమూ] కూడా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. రాజీ బేరాలు మాట్లాడుకుంటున్నారు.

ఇందులో మరో ఆసక్తికరమైన ఆంశం ఏమిటంటే, నెం.10 వర్గంతోనూ, నకిలీ కణిక వ్యవస్థతోనూ, అందులోని కీలక వ్యక్తి అయిన రామోజీరావు తోనూ, సోనియాగాంధీతోనూ, పోల్చుకుంటే జగన్ శిబిరంలోని ఎవరి గూఢచర్య అనుభవమైనా తక్కువే. కాలం కలిసి వచ్చినట్లుగా, నెం.5 వర్గమూ సహకరించినందున, వై.యస్. ఆడిన ’సందట్లో సడేమియా’ నాటకాన్ని తము నమ్మి ఇబ్బందుల్లో పడ్డాము గానీ, లేకుంటే వై.యస్. గారెల వంట వంటి గూఢచర్యం ఏమాత్రమూ ఫలించి ఉండేది కాదన్న విషయం నెం.10 వర్గానికీ, రామోజీరావు కీ, కాంగ్రెస్ అధిష్టానానికీ తెలుసు.

ఆ విషయమై జగన్ శిబిరానికి అవగాహన తక్కువ. అంతేగాక, వాళ్ళకి తెలిసిన గూఢచర్యమూ తక్కువే. తెలిసినది కేవలం గారెలవంట పాటి గూఢచర్యమే. అందుచేత, జగన్ శిబిరానికి, గూఢచర్యంలో ప్రధాన భాగమైన మానసిక యుద్దతంత్రం తెలియదు. తాము ఎవరినైతే లక్ష్యంగా ఎంచుకున్నారో ఆ వ్యక్తి [లేదా వ్యవస్థ లేదా దేశం] మీద, నకిలీ కణిక వ్యవస్థా, నెం.10 వర్గమూ ఎంతగా మానసిక వత్తిడిని కలగ జేస్తారంటే – ‘సామదాన బేధ దండోపాయాలని’ ఒక్కొక్కటి వందేసి రకరకాలుగా, ఒకేసారి, విడివిడిగా, రకరకాలుగా ప్రయోగిస్తారు. ఆ వత్తిడి, ప్రభావం, జీవితంలో నిజంగా ‘మాయ’ వంటిదే. దాన్ని దాటుకుని రావాలంటే, భగవద్గీతలో చెప్పినట్లుగా, భగవంతుడి దయ, వ్యక్తి సాధనా ఉండాల్సిందే.

ఈ నేపధ్యంలో, నకిలీ కణిక వ్యవస్థా, నెం.10 వర్గమూ, తము ప్రయోగించే మానసిక యుద్ధతంత్రంలో పడి, ‘జగన్ శిబిరం శిధిలమై పోకపోతుందా’ అన్న ప్రయత్నం చేస్తున్నారు. అయితే తమ ఆయువు పట్టువంటి సాక్ష్యాలు జగన్ శిబిరం చేతుల్లో ఉన్నాయన్న అంచనాతోనే, ఆచితూచి అడుగులు వేస్తున్నారు. అందుకే, అన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే, జగన్ తాలుకూ ’సాక్షి’ సంస్థమీద దాడి ప్రారంభించారు. అందులో భాగమే, జగతి పబ్లికేషన్స్ లో పెట్టుబడి పెట్టిన సంస్థల వారికి, ఆదాయపు పన్ను శాఖ నోటిసులు ఇవ్వటం! వై.యస్. కి సన్నిహితుడైన, గాలి జనార్ధనరెడ్డి తాలుకూ ఓబుళాపురం గనుల విషయం మళ్ళీ తెరపైకి తేవటం కూడా అందులో భాగమే. లేకపోతే వై.యస్. మరణానికి ముందు, తమకు తెలియదా ఎవరెవరు ఎంతెంత పెట్టుబడి ’సాక్షి’లో పెట్టారో?

‘తమకి ప్రత్యర్ధి మీడియా ’సాక్షి’ అన్న పిక్చర్ ఇస్తే, నెం.5 వర్గం నమ్మి దరిచేరుతుంది’ అనుకొని, ఆ నాటకంలో భాగంగా, రామోజీరావుతో వివాదాలు పడ్డ అతడి పుత్రుడు సుమన్ ఇంటర్యూ కూడా ’సాక్షి’లో ఇచ్చుకున్నారు. ఇప్పడదే సాక్షి ఏకు మేకు అయ్యింది. కాబట్టి మెల్లిగా సాక్షి నోరు ముయించాలన్నది వాళ్ళ ప్రయత్నం.

ఇటు జగన్ శిబిరం, కూడా ఆ విషయమై అంత తెలివితక్కువగా ఏం లేదు. కాకపోతే మానసిక యుద్ధతంత్రం తెలియనందున, ధైర్యం చాలటం లేదు. ‘ఒకసారి విషయం తెరమీదకి తెచ్చాక, ఏదేమౌతుందో ఎవరు చెప్పగలరు?’ అన్న భయం! ఇప్పటికి గూఢచర్యపు బలం, ఉధృతీ ఎంత ఎక్కువో తెలియటంతో ఏర్పడిన సంకోచం…. పాలతో మూతి కాలిన పిల్లి, మజ్జిగ ఊది తాగటం సహజమే కదా! కాబట్టి రాజీప్రయత్నాలు కొనసాగించటంపైన జగన్ శిబిరం దృష్టి కేంద్రీకరించింది.

ఈ విధంగా – కాంగ్రెస్ అధిష్టానం ముందున్న దారులు రెండు! ఒకటి, జగన్ శిబిరపు ఒత్తిడికి తలొగ్గడం. రెండోది జగన్ శిబిరాన్ని Over power చేయడం. మొదటిది చేస్తే, ఇక జగన్ శిబిరం అంతకంతకూ తమ పట్టుపెంచుకుంటూ పోతుంది. కోరికల జాబితానూ పెంచుకుంటూ పోతుంది. ఆ విధంగా నైనా తము, తమ స్ట్రాటజీ Expose అవుతాయి. అంచేత రెండో మార్గం తప్ప గత్యంతరం లేదు. ఇప్పుడు, దాదాపుగా అదే మార్గంలో ప్రయాణిస్తుంది.

అలాగే జగన్ శిబిరం ముందున్న దారులు కూడా రెండే! ఒకటి, అధిష్టానపు ఒత్తిడికి తలొగ్గడం. రెండోది వాళ్ళ గుట్టు బయటపెట్టటం. మొదటిది చేస్తే, ఇక తమకు భవిష్యత్తు ఉండదు. క్రమంగా కాంగ్రెస్ అధిష్టానం తమని మట్టి కలిపేస్తుంది. అంచేత రెండో మార్గం తప్ప గత్యంతరం లేదు.

ప్రస్తుతం కాంగ్రెస్ అధిష్టానానికీ, జగన్ శిబిరానికి మధ్య నడుస్తున్న అంతర్లీన పోరుఇదే!

ఇకపైన ఏంజరుగుతుందో వేచి చూడాల్సిందే!


మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

8 comments:

Extraordinary analysis...............
vinay

http://www.eenadu.net/story.asp?qry1=6&reccount=34

amma...maree ekkuvaindi..pratidaaniki ramoji rao e dorikada?..asalu india antha romoji rao chetilo unnattu cheputhunnaru..eenadu paper meeda meeruekuva ati negative publicity chesthunnaru ani pisthundi.Beautyfull mind ane film gurthukosthundi mee articles konni chusthey.meeku manchi analyzation power undi..kaani maree ekkuvaindanipisthundi...don't mind.chala rojulninchi blog follow avuthunna..konni bagunnai..konni ati ga unnai.just take it as a opinion.

మొత్తానికి చాలారోజులకి మొదటి కామెంట్ రాస్తున్నాను.

మన వాళ్ళేమీ అంత తక్కువ వాళ్ళు కాదండీ, ఐతే కొంత జ్ఞానం ఉంది. పక్క వాడికి లేదు నాకుంది అన్న ఆనందం, పక్క వాడికుంది నాకు లేదు అనే బాధా అందరికీ ఉన్నాయి.కాకపోతే ఉన్న పక్కవాడికి ఏదన్నా అయ్యి, వాడి ఆస్తి అంతస్తు ఏమీ అక్కరకు రాకపోతే ఎంతటి వాడికైనా వేదాంతం గుర్తొస్తుంది. అది ఎవరూ చెప్పక్కర్లేదు, ఈ కర్మ భూమి లో పుట్టిన అదృష్టం చేత అప్రయత్నంగా గుర్తొస్తుంది. అందుకే మన చేతనైన సహాయం చేద్దాం అని చేస్తున్నారు అని నా అభిప్రాయం. అందరూ అలా అని నా అభిప్రాయం కాదు. కానీ చాలామంది ఇలాంటి వాళ్ళే.

నిజంగా సహాయం చేస్తున్న వాళ్ళని అవమానించడం నా ఉద్దేశ్యం కాదు అర్ధం చేసుకోగలరు...

awesome analysis.
I am a fan now.

ramoji rao meeda elanti opinion ledu..ippudu mee blog chadivaaka meeru maree organized ga ramojirao ni blame chesthunnaranipisthundi..prati daaniki ramoji rao..enatadi??ela??news channels(Tv9) lone rajashekhar reddy choper gurinchi different opinions vachai kada.daaniki ramoji rao emichesthadu?edaina koddiga ati anipinchindi..emanukokandi..

అయాన్ గారు, రవి కిరణ్ గారు,

బహుశ మీరు క్రొత్తగా ఈ బ్లాగులోకి వచ్చిఉంటారు. మీకు రామోజీరావు గురించి బాగా అర్ధం కావాలంటే నా గత టపాలు చదవాలి. ఈ క్రింది లేబుల్లో చూడండి.

పీవీజీ - రామోజీరావు - మా కథ [42 టపాలు], కణిక నీతి [2], నకిలీ కణికుడు[5], నకిలీ కణికుడి వ్యవస్థ గురించి కొన్ని ప్రతిపాదనలు[21], నకిలీ కణికుడి వ్యవస్థ గురించి కొన్ని దృష్టాంతాలు[5], మీడియా మాయాజాలం[18] ఇవీ చదివితే రామోజీరావు తలా తోక కొంచెం కన్పిస్తాయి. ఇక మీ ఓపిక. అప్పటికీ మీకు సందేహాలు ఉంటే అప్పుడు వివరిస్తాను.

తమిళన్ గారు, అజ్ఞాత గారు, మనోహర్ గారు,

వ్యాఖ్య వ్రాసినందుకు, లింకు ఇచ్చినందుకు నెనర్లు!

*******

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu