2005, అక్టోబరులో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కి, 1992లో నేను అప్పటి ప్రధాని పీ.వీ.కి రామోజీరావు కుట్రల గురించి పెట్టినఫిర్యాదు గురించీ, తదనంతర కాలంలో రామోజీరావు మమ్మల్ని వేధిస్తున్న తీరు గురించి ఫిర్యాదు చేశాక నీటికష్టాలు పరాకాష్ఠకు చేరి టెలిఫోన్ బెదిరింపు దాకా, ఆపైన పోలీసు కేసుల దాకా వచ్చాయి. అదే ఫిర్యాదుని కవరింగ్ లెటర్ జతచేసి మే, 2006లో సోనియాగాంధీకి పంపాము. దాంతో మా పని పెనం మీదనుంచి పొయ్యిలో పడినట్లయ్యింది. నీటి వేధింఫుల స్థానాన్ని జీరోక్లాసు పిల్లల యూరినల్ వంటివి ఆక్రమించాయి. ఈ నేపధ్యంలో ఈ వివరాలన్నింటినీ, మొదటినుండీ, అంటే 1992 నుండీ వివరంగా సి.ఎం. కి అడ్రస్ చేస్తూ వ్రాసి [ఈసారి 13 పేజీల రిపోర్టు] శ్రీశైలం సి.ఐ.ని కలిసాము. ఇంతకు క్రితం సి.ఎం. నుండి మా ఫిర్యాదు తమకు Forward అవ్వటంతో మాదగ్గర రిప్లై స్టేట్ మెంట్ తీసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని, మేము పెడుతున్న ఫిర్యాదులు ముఖ్యమంత్రికి చేరుతున్నాయో, లేదో తెలియడం లేదని, అందుచేత తమ స్టేషన్ నుండి Forward చెయ్యమనీ వ్రాతపూర్వకంగా అభ్యర్ధించాము. దానికి ఆ సి.ఐ. “ఇప్పుడు రాజీవ్ గాంధీ హత్య గురించి మనం మాట్లాడితే, మనల్ని అందరూ పిచ్చివాళ్ళంటారు” అన్నాడు. [ఆ తర్వాత 2007, మార్చిలో అతడు నాగురించి ’పిచ్చి’ అనే రిపోర్టు వ్రాసి పైకి పంపాడని, కానిస్టేబుల్ మరియు మా విద్యార్ధుల తండ్రి అయిన సుధాకర్, మా స్కూలు గదిని శ్రీశైలం డి.ఈ.వో. క్యాన్సిల్ చేసినప్పుడు జరిగిన తల్లిదండ్రుల సమావేశంలో చెప్పాడు. అది ఎంత వరకూ నిజమో తెలియదు.]

నేను రాజీవ్ హత్య విషయమై రామోజీ హస్తం గురించి, 1992 లోనే, అప్పుడు కడప ఎం.పి.గా ఉన్న, ప్రస్తుత సి.ఎం.ని కలిసానని, తదుపరి వివరాలన్ని చెప్పాను. అవన్నీ ఇప్పటి ఫిర్యాదులో వ్రాసానని చెప్పాను. పీ.వీ.నరసింహారావు మా ఇంటికి ఐ.బి.అధికారులని పంపిన వైనం, నేను 1992 లో ప్రధాని కార్యాలయంలో ప్రధాని OSD నీ కలిసిన వైనం అన్నీ చెప్పి మరోసారి నా చేతిలోని ఫిర్యాదుకాపీని ముఖ్యమంత్రికి పంపవలసిందిగా అడిగాను. అతడు “పీ.వి.నరసింహారావు ఏంచేశారో మనకెవ్వరికీ తెలియదు. ఇప్పుడు అతణ్ణెవరూ ఏదీ అడగలేరు” అంటూ జోకు పేల్చాడు. నేనూ “అవును సార్! ఆయన దగ్గరికి వెళ్ళి ఎవరూ తిరిగి రాలేరు గదా!” అంటూ మరో జోకు పేల్చాను. చివరికి యస్.ఐ., సి.ఐ.లు కలిసి నాకు “చూస్తామమ్మా. ఒక Investigative Agency[?] గా మా ఎంక్వయిరీ మేం చేసుకుని అప్పుడు ఈ కాపీని సి.ఎం.కి పంపిస్తాము” అని చెప్పాడు. మేము సెలవు తీసుకుని వచ్చేసాము. వారం పదిరోజులు వేచి చూశాము. వాళ్ళు పంపిన దాఖలా గానీ, సి.ఎం. ప్రతిస్పందించిన దాఖలా గానీ లేవు. పైపెచ్చు క్రింది వారి దుర్భాషలు కొనసాగుతూనే ఉన్నాయి. దాంతో స్కూలుకు రెండురోజులు సెలవు ఇచ్చి, అగస్టు తొలివారంలో, హైదరాబాదు వెళ్ళి, సి.ఎం. ఇల్లు గ్రీన్ లాండ్ కి వెళ్ళాము. ఆరోజు జోరున వర్షం కురుస్తోంది. మేం వెళ్ళేప్పటికి సి.ఎం. ఇంటిలోనే ఉన్నాడు. అతడి పి.ఏ. కిరణ్ కుమార్ రెడ్డి సందర్శకులని రిసీవ్ చేసుకుంటున్నాడు. నేను నాచేతిలోని ఫిర్యాదు అతడి కిచ్చి, మౌఖికంగా, క్లుప్తంగా, అందులోని విషయాలు వివరించాను. దాదాపు 10 నిముషాలు పట్టింది. చివరగా సి.ఎం. అపాయింట్ మెంట్ ఇప్పించమని అడిగాను. అంతా విన్నాక అతడు “ఈ రిపోర్టు సి.ఎం.గారికి ఇస్తానమ్మా! మీరు చెప్పిందంతా కూడా సి.ఎం.కి బ్రీఫ్ చేస్తాను. ఆయన ఇది important గా తీసుకుని మిమ్మల్ని కలిస్తానంటే అపాయింట్ మెంట్ ఇస్తారు. అప్పుడు మీకు intimate చేస్తాము” అన్నాడు. అప్పుడే సి.ఎం.లోపల నుండి బయటకు వచ్చి వాహనంలో ఎక్కుతున్నాడు. మేం ఫిర్యాదు కిరణ్ కుమార్ రెడ్డికి ఇచ్చేసి వెనుదిరిగాము. ఇక చేసేది లేక, తరువాత రోజు శ్రీశైలం దారిపట్టాము.

తదుపరి, నెలైనా సి.ఎం. అపాయింట్ మెంట్ రాలేదు. ‘బహుశః అతడికి అది important గా అన్పించలేదు కాబోలు’ అనుకున్నాము. ఈ సంఘటనలన్నిటితో మాకు రాజశేఖర్ రెడ్డి, మన్మోహన్ సింగ్, సోనియాగాంధీ… వీళ్ళందరి వెనుకా రామోజీరావు ఉన్నాడన్న విషయం స్పష్టపడింది. దానికి తోడు దేశ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలన్నిటినీ పరిశీలిస్తూనే ఉన్నాము. ఈనాడు న్యూస్ కవరేజ్ ని కూడా గమనిస్తున్నాము. దేశానికి వ్యతిరేకంగా, కీడు మూడేటట్లుగా తప్పితే, ప్రజలకి మేలు చేకూరే విధంగా ఏమాత్రమూ లేని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వవ్యవహార తీరు మాకు బాగానే స్పష్టపడింది. దాంతో ఇంకొన్ని రోజులు పోయాక సి.ఎం.కి అడ్రెసు చేస్తూ వ్రాసిన ఫిర్యాదులోని అంశాలన్నిటినీ సోనియాగాంధీ పేర వ్రాస్తూ, 18 పేజీల సుదీర్ఘ ఫిర్యాదు తయారు చేశాము. అందులో చివరిగా 1992 నాటి నాదేశభక్తి తాలూకూ భావనని గుర్తించమని, ఇది సంచలనం కోసం నేను చేస్తూన్న ఫిర్యాదు కాదని వ్రాస్తూ “మీ వివాహానికి ముందు మీమాతృదేశమైన ఇటలీ పట్ల మీకు ఇలాంటి అనుభూతులు ఉండి ఉంటాయి కాబట్టి, భారతీయురాలిగా భారతదేశం పట్ల నాకున్న భావాలని అర్ధం చేసుకోగలరని ఆశిస్తాను” అని వ్రాసాను. ఇన్నిసార్లు ఇందరికి ఫిర్యాదులు వ్రాసినా స్పందించని వైనాన్ని ప్రశ్నిస్తూ “చూడబోతే మీ అనుచరులకు, మీకు, మీభర్తపట్ల ఉన్న దాని కంటే భారతప్రజలుగా మాకే మానాయకుడి [రాజీవ్ గాంధీ] మీద అభిమానం ఎక్కువగా ఉన్నట్లుంది” అని వ్రాసాను. ఆ కాపీని యధాతధంగా Coups on World లో ఉంచాను. చదువరుల సౌలభ్యంకోసం పైన ఉటంకించిన పేరాగ్రాఫులను ఎరుపురంగులో ముద్రించాను. ఫిర్యాదు పంపించాము. 15 రోజులు గడిచాయి.

ఇక లాభం లేదను కొని అదే ఫిర్యాదు కాపీని కవరింగ్ లెటర్ జోడించి, అప్పటి రాష్ట్రపతి APJ అబ్దుల్ కలాంకి 2006, సెప్టెంబరులో పంపించాము. తర్వాత స్కూలుకి దసరా సెలవులు వచ్చాయి. ఆ సెలవుల్లో గుంటూరులోని ఐ.బి.ఆఫీసుకి వెళ్ళాము. అక్కడి అధికారి “మీకు మా ఆఫీసు అడ్రెస్ ఎలా తెలుసు?” అనడిగాడు. ఆ ఆఫీసుకి ఎలాంటి బోర్డు ఉండదు. అందుకే అలా అడిగాడు. అంతక్రితం గుంటూరులో నేను ఎక్సల్ కాలేజీలో పనిచేస్తుండగా వారి ఆఫీసుకి ఎదురింట్లోనే మేం అద్దెకు ఉండేవాళ్ళం. అదీగాక 1992 లో మా ఇంటికి వచ్చిన ఐ.బి.అధికారులు ఇచ్చిన చిరునామాతో, అంతకు క్రితం, 1995 లో మేము ఒకసారి ఆ అఫీసుని సందర్శించి ఉన్నాము. అదే అతడికి చెప్పాము. 1992 నుండి అప్పటివరకూ జరిగిన విశేషాలని క్లుప్తంగా వివరించి చెప్పి ‘ఈనాడు రామోజీరావు వ్యవహారం, అతడు మమ్మల్ని వేధిస్తున్న తీరు, ఎంసెట్ కుంభకోణాల మూలంగా సమాజానికి జరుగుతున్న కీడు గురించి కేంద్రం దృష్టికి తీసుకువెళ్ళమని’ అభ్యర్ధించాము. ఇక చూస్కోండి! అక్కడి అధికారి రామోజీరావు డిఫెన్స్ లాయర్ స్థాయిలో తెగరెచ్చిపోయాడు. ‘నీటి వేధింపుని after all అన్నాడు. ‘తమకీ నీళ్ళు రావటం లేదని, ఆమాటకొస్తే, ఆ రోజు తామింకా స్నానం చెయ్యలేదనీ’ అన్నాడు. నీటి సమస్య ఒక్కరోజుది కాదని, అదెంత తీవ్రంగా ఉందో ఋజువు పత్రాలు చూపబోతే పట్టించుకోలేదు. సూర్యాపేట త్రివేణి కాలేజీ వారితో “నేను సమాంతరంగా నా ప్రైవేటు ట్యూషన్ హోం నడుపుకుంటాను అలా ఇష్టమైతేనే మీ కాలేజీలో జాబ్ ఆఫర్ అంగీకరిస్తాను” అన్న డీల్ గురించిన ప్రస్తావనలో “అలా ఏ కాలేజీ వాళ్ళు ఒప్పుకోరు. అలా అని వ్రాసుకున్న అగ్రిమెంట్ ఉందా మీదగ్గర?” అంటూ మమ్మల్ని నిలదీసాడు. సూర్యాపేటలో మాఇంటి ఓనర్, మాఇంటికి ఫర్నిచర్ తో సహా తాళం వేసి, మమ్మల్ని కట్టుబట్టలతో రోడ్డుమీదకి వెళ్ళగొట్టిన నేపధ్యంలో, ఆ అగ్రిమెంటు కాపీ ఆ ఇంట్లోనే ఉండిపోయింది. అంచేత “ఆకాపీ ప్రస్తుతం మాదగ్గర లేదు, ఇంత వరకూ ఎవ్వరు అడగలేదు ” అని చెప్పాను. “చూశారా! అలాంటప్పుడు మీమాట ఎలా నమ్మటం?" అన్నాడు. ‘నాదగ్గర ఉన్న డాక్యుమెంట్లు అక్కరలేదు. ఏదైతే లేదో, అది కావాలి!’ - ఇదే అతడి ధోరణి. అంటే పనిమాలా ఓ వ్యక్తి తన 14 ఏళ్ళ జీవితకాలాన్ని పనికిమాలిన ఫిర్యాదులతో వృధాచేసుకుంటారా? అయినా, ‘Customer is always correct’ అన్నది వ్యాపారరంగంలోని సూక్తి. అలాగే ‘Petitioner is always correct’ అన్నది ప్రభుత్వపాలనా యంత్రాంగంలో [Administration] రాజ్యాంగబద్దమైన సూక్తి.

1991 లో, నా ఫ్యాక్టరీకి వర్కింగ్ కాపిటల్ గా ఋణం ఇస్తున్న ఇండియన్ బ్యాంక్ లో, నేను కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాను. అప్పట్లో అంతర్జాతీయ మార్కెట్టులో లెడ్, యాంటిమెనిల ధరలు విపరీతంగా పెరిగాయి. నాకు MMTC నుండి మంత్లీ కోటా ఉండేది. అయితే టన్ను ధర నాలిగింతలు పెరగటంతో, నాకు బ్యాంకు వారిచ్చిన లోన్ లిమిట్ చాలలేదు. పెంచమంటే లంచాలు, మరికొన్ని గొంతెమ్మ కోర్కెల [?] కోసం బ్యాంకువారు కిమ్మనటం లేదు. రెడ్ టేపిజం చూపిస్తున్నారు. ఆ నేపధ్యంలో అప్పటికి Additional Secretary, Banking affairs గా ఉన్న కె.జె.రెడ్డి, ఐ.ఎ.ఎస్.ని ఢిల్లీ వెళ్ళి కలిసి ఫిర్యాదు చేశాను. మరుక్షణం స్పందించారు.[1992 తర్వాత ఈయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు.] తక్షణం ఫోన్ లో ఇండియన్ బ్యాంకు డైరెక్టరు బి.బి.షెట్టిని, నా సమస్య పరిష్కరించవలసిందిగా ఆదేశించారు. ‘ఎంతో ఇబ్బంది పడుతుంటే తప్ప, ఎవ్వరూ ఫిర్యాదుల వంటి చర్యలు తీసుకోరు’ అన్నది అక్కడి మౌలిక సూత్రం. ఫిర్యాదుదారుని, ఫిర్యాదులోని విషయాన్ని పరిశీలించగానే, వాళ్ళ అనుభవానికి, అవగాహనకి ఫిర్యాదులోని అంశం నిజమో, కాదో ఖచ్చితంగా వాళ్ళకి తెలిసిపోతుంది. విద్యార్ధులు ఫిర్యాదు చేసినప్పుడు అది నిజమో, ఊరికే చాడీలు చెబుతున్నాడో టీచర్ కి ఎలా అర్ధమవుతుందో, ఇదీ అంతే. ఇలాంటి అనుభవాలు నాకు 1992 ముందర కూడా ఉన్నాయి. నామిత్రుల, ఇతర పరిచయస్థుల అనుభవాలు కూడా నాకు తెలుసు. ఎక్కడైనా, ఎప్పుడైనా, అదే సూత్రం, “Petitioner is always correct” అన్నది! ముందు ఆ దృష్టితోనే వాళ్ళు విచారణ మొదలు పెడతారు. ఒకవేళ petitioner wrong అయితే అది బాహాటంగా విచారణలో తేలిపోతుంది. అంతేగాని అసలు విచారణే ‘Petitioner is wrong and the deponent is correct’ అన్నధోరణిలో ఎవరూ చేయరు. అది అసాధారణం.

అయితే ఐ.బి.అఫీసులో, నేను ఇలాంటి అసాధారణనే చూశాను. పైగా సదరు అధికారి, నాదేశభక్తి గురించి మాట్లాడుతూ “ఫిర్యాదు ఇవ్వటం ఎలా దేశభక్తి అవుతుంది? దానిని మీరు దేశభక్తిగా తెగఫీలయి పోతున్నారు. అసలేమిటి మీకు మీ ఫ్రెండ్ చెప్పిన విషయం? After all ఒక సబ్ ఎడిటర్ కి ఏంతెలుస్తాయి?" అంటూ తెగ వాదించాడు. వాదించాడు అనటం కంటే నన్నే ఇంటారేగేషన్ చేసాడని అనటం సబబునుకుంటా. నేను “అవునండీ ఒక సబ్ ఎడిటర్ కి తెలిసేది తక్కువే. అయితే అది సామాన్య పాఠకుల కంటే ఎక్కువేమరి. అంతేగాక ఆ సబ్ ఎడిటర్, ఈనాడు రామోజీరావు వ్యక్తిగత ఆడిటర్ కి సమీపబంధువైతే మరికొంచెం ఎక్కువే తెలుస్తుంది కదా!” అని గట్టిగా అన్నాను. ఇక ఆవిషయంలో, పాపం వాదన ఆపేసాడు. వెంటనే “అసలేమనుకుంటున్నారు రామోజీరావు అంటే? అతడు Perfect Business man. తెలుసా? ఎంత ధైర్యంగా అతణ్ణి claim చేస్తున్నారు మీరు?" అంటూ గద్దించాడు. “బయటపడేవరకూ అందరూ పెద్దమనుష్యులే లెండి” అన్నారు మావారు. దాంతో అతడు మారు మాట్లాడలేదు. అయితే విచిత్రం ఏమిటంటే సరిగ్గా వారం, పదిరోజుల తర్వాత ఉండవల్లి రచ్చతో మార్గదర్శి వ్యవహారం రోడ్డునపడింది. ఇప్పుడైతే రామోజీరావు విలువలు ఏపాటివో, అతడి ఈనాడు సినిమాపేజీలోని వలువల్లేని పడతుల బొమ్మలూ, పమిటలు లేని బ్రిసా, కళాంజలి వ్యాపారప్రకటనలు చెబుతూనే ఉన్నాయి. ఇంకా అతడి నిజస్వరూపం విశ్వరూపమెత్తి అందరకి కూడా కళ్ళు మిరమిట్లు గొల్పుతోంది, ఇంకా గొల్పనుంది. అంతేగాక సదరు అధికారి ఎంసెట్ కుంభకోణం గురించి “ఇవాళ్ళ రేపు ఇలాంటి కుంభకోణాలు మామూలే. ఇది అందరికీ తెలిసిన విషయమే” అన్నాడు.

ఈ వాదన అంతటితో, మాకు, సిబిఐ లాగే ఐబి కూడా కుర్చీబానిస అన్న విషయం అర్ధమైంది. కేంద్రంలో ఎవరు అధికారంలో ఉంటే వారి ఏజంట్లుగా సిబిఐ, ఐబి పనిచేస్తుందన్న వార్త పచ్చినిజమై మా ఎదుట నిల్చుంది. ‘దేశభక్తి గురించి మనం సోనియాగాంధీకి వేసిన వ్యంగ్యాస్త్రానికి జవాబు, ఐబి అధికారి నోట విన్నామన్నమాట’ అనుకున్నాము. సరే కానిమ్మని “ఒకే సార్! నా రిక్వెస్ట్ ఏమిటంటే – నా ఫిర్యాదుని మీరు కేంద్రం దృష్టికి తీసికెళ్ళగలరా?" అని సూటిగా అడిగాము. దానికి అప్పటివరకూ మాతో వాదించిన అధికారి [ఇతడి పేరు రంగన్న అని చెప్పుకున్నాడు] గాక, అతడి పైఅధికారి “సారీ అమ్మా! మాకు పైనుండి orders/assignments వచ్చినవే మేము take up చేస్తాము. మరేవీ మేము చెయ్యము” అన్నాడు. వాళ్ళ administration ప్రకారం, పైనుండి వచ్చిన orders/assignments మాత్రమే వాళ్ళు డీల్ చెయ్యవచ్చుగాక. మరి అలాంటప్పుడు క్రింది స్థాయిలో, అంటే జిల్లాస్థాయిలో ఆఫీసులు ఎందుకు? ఢిల్లీలోనే ఉంటే సరిపోతుందిగదా! Order/assignment ప్రకారం ఎక్కడికి వెళ్ళాల్సి వస్తే అక్కడికి వెళ్ళి వర్కు చేసివస్తే సరిపోతుంది కదా! మరి క్రిందిస్థాయిలో ఏదైనా దేశద్రోహమో, మరో కుట్రో, ప్రమాదమో జరుగుతుందనుకొండి. దాన్ని ఎవరు నిఘా వేసి గమనించి, పైస్థాయికి చేరవేస్తారు? రాముడి కాలం నుండి ఉన్న నిఘావ్యవస్థ అది కదా! చివరికి ప్రతీ పోలీసు స్టేషన్ లో కూడా సెర్చిపార్టీపేరుతో ఓ నిఘా వ్వవస్థ ఉంటుంది కదా! అసలు క్రింది స్థాయిలో జరిగే ద్రోహాలు గుర్తించి, పైకి చేరవేయటం అనే విధే వారికి లేకపోతే, మరి క్రింది స్థాయిలో కార్యాలయాలు, ఉద్యోగులూ, వారికి జీతభత్యాలూ ఎందుకు? అయినా అలా నిఘావేసి, లేదా దేశద్రోహుల గురించిన సమాచారం తమకు అందితే, పైకి చేరవేయటం ఐబి వంటి నిఘా సంస్థల విధుల్లో ఒకటి కాదా? వారికా స్ఫూర్తి లేదా? మరిదేమీ లేకపోతే, 1992 లో, నేను పీ.వి.కి రామోజీరావు గురించి ఫిర్యాదు ఇవ్వటానికి ముందు, మాజీ గవర్నరు కుముద్ బెన్ జోషిని, ఆ విషయంలో సాయం చెయ్యమని అడగటానికి వెళ్ళినప్పుడు, ఆవిడ “ నీ పేరు, అడ్రసు వ్రాసి ఇస్తావా, ఐ.బి. డిపార్ట్ మెంట్ కు పంపిస్తాను” అని ఎందుకు అన్నట్లు?

ఇవన్నీ ఆలోచిస్తూనే, నేను, “Okay Sir! Thank you” అంటూ లేచి వీడ్కొలు తీసుకోబోయాము. వెంటనే అతడు మమ్మల్ని కన్విన్స్ చేస్తూ “అలా కాదమ్మా! విషయం తెలుసుకోవటానికి మేము అలాగే డీల్ చేస్తాము. సరే! ఇంతదూరం వచ్చారు గదా! ఆ కంప్లైంటు ఓ కాపీ ఇవ్వండి. మేం పైకి పంపిస్తాము. చూద్ధాం ఏంజరుగుతుందో!” అన్నాడు. సరేనని ఓ కాపీ [అది సోనియా గాంధీకి వ్రాసిన ఫిర్యాదు జిరాక్స్ కాపీ] ఇచ్చి శ్రీశైలం తిరిగి వచ్చాము.

ఇదిజరిగిన నెలరోజులకి శ్రీశైలంలో ప్రైవేటు వారందరినీ గదులు కాన్సిల్ చెస్తారట అన్న పుకారు ఊళ్ళో బాగా షికారు చెయ్యటం మొదలుపెట్టింది. అంతకు ముందే అలాంటి వార్తలు కొన్ని వచ్చాయి. ఇంతలో జనవరి, 2007 ప్రవేశించింది. దాంతో పాటే మాకు గది కాన్సిల్ చేస్తున్నట్లు, వారంలోగా గది ఖాళీ చేసి అప్పగించాలని, నోటిసు ఇవ్వబడింది. అయితే ఇదే నోటిసు శ్రీశైలంలో మరో 100 మందికి కూడా ఇవ్వబడింది. ‘సరే! అందరికీ ఏమయితే అదే మనకీ అవుతుంది కానిమ్మని’ మేం చూస్తూ ఉన్నాము. తర్వాతి కాలంలో శ్రీశైలంలోని ప్రైవేటు వాళ్ళంతా [వాళ్ళల్లో కొందరు వివిధపార్టీలకి చెందిన రాజకీయనాయకులు ఉన్నారు.] కలిసి రాజకీయంగా గొడవచేశారు. మంత్రి జే.సి.దివాకర్ రెడ్డి వచ్చినప్పుడు అతడి దృష్టికి ఇది తెచ్చారు. అతడు ఈ.వో.ని చీవాట్లు పెట్టాడట. దాంతో ఆ గొడవ అలా మూతబడింది. అయితే ‘ఇది ఇప్పుడు చల్లారింది. తర్వాత ఆ వందమందినీ వదిలేసి కేవలం మా ఒక్కరి గది మీదకీ వస్తుంది!’ అని మాకు [sixth sense అనండి, అంతఃచ్ఛేతన హెచ్చరిక అనండి, అనుభవ పాఠం అనండి] అన్పించింది.

2007, జనవరి సంక్రాంతి సెలవుల్లో మేం విజయవాడ వెళ్ళి ఆంధ్రజ్యోతి ఎడిటర్ ని కలిసాము. అంతా విన్నాక ఆయన “The strength and the mode of the weapon can be determined by your enemy, but not by yourself. I think, మీరిక్కడ fail అవుతున్నారనుకుంటాను” అన్నాడు. నాకు అర్ధం గాక ఆమాటని ఒకటికి రెండుసార్లు చెప్పించుకొని, ’ఇంతకు నా కేసు ప్రచురించగలరా లేదా?’ అని అడిగాను. ‘తమకి అంత స్వాధికారం లేదని, హైదరాబాద్ లోని తమ హెడ్డాఫీసుకి అప్రోచ్ అవ్వమనీ’ చెప్పారు. “పోనీ మీరే పంపకూడదా? జిరాక్స్ కాపీ ఇస్తాను” అన్నాను. “లేదు మీరే హైదరాబాద్ వెళ్ళి కలవండి” అని చెప్పారు. చేసేది లేక వెనుదిరిగాను. పత్రిక వాళ్ళు స్పందించనందున చేసేది లేక మేం శ్రీశైలం తిరిగి వచ్చాము. అప్పటివరకూ దూర్భాషలాడుతూనే ఉన్న మా సత్రపు క్రింది అంతస్థువారు ఒక్కసారిగా మౌనం పాటించటం మొదలుపెట్టారు. అసలు సెలవులకి ఊళ్ళు వెళ్ళిన కొందరు రెండునెలలైనా తిరిగి రాలేదు. ఒకరిద్దరు ఉన్నాగానీ, నన్ను చూడగానే గభాలున లోపలికి తప్పుకోవటం మొదలుపెట్టారు. మాకు ఏమీ అర్ధం కాలేదు. గాలిలోనే భయపు వాసన వస్తోందా అన్నట్లుంది. ప్రాంగణం అంతటా ఓ నిశ్శబ్ధం, పరారీ వాతావరణం. ఆ తర్వాత ఈ పరిస్థితినే ఉటంకిస్తూ వాళ్ళందరి దగ్గరా సి.ఐ. స్టేట్ మెంట్లు తీసుకున్నాడనీ, తానే వాళ్ళని స్టేషన్ కి సి.ఐ. పిలుచుకు రమ్మనాడని, తానే తీసుకుపోయాననీ – మా విద్యార్ధుల తండ్రి, కానిస్టేబుల్ సుధాకర్ మార్చి, 2007 లో చెప్పాడు.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

1 comments:

బయటికి ఒకళ్ళ మీద ఒకళ్ళు బురద చల్లుకొంటున్నట్టు కనపడతారు కానీ లోపల అంతా ఒక్కటే.... సర్వం కణిక మయం...

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu