సూర్యాపేటలో, మా కాలేజీలో మంచివిద్యార్థులు ఉండేవాళ్ళు. చురుకైన పిల్లలు శ్రమించేవాళ్ళు. పాఠం శ్రద్ధగా వినేవాళ్ళు. ఫోకాల్ట్స్ రొటేటింగ్ మిర్రర్ ఎక్స్ పెరిమెంటు లాంటిపాఠం కూడా, ఒకసారి వివరంగా చెప్పి, నోట్సు ఇచ్చి ’ఈ క్షణం assignment వ్రాస్తారా’ అంటే సిద్ధంగా ఉండేవాళ్ళు. అప్పటికి యాజమాన్యంతో గానీ, పిల్లలతో గానీ నాకు ఏ సమస్యాలేదు. మరోప్రక్క ఇంటి దగ్గరా ఆనందంగానే ఉండేది. కాలేజీకి దగ్గరలో ఇల్లు అద్దెకు తీసుకున్నాము. అయిదు నిమిషాల నడక దూరం. మేం ఉండేవీధిలో ఎక్కువగా ప్రింటింగ్ ప్రెస్ లు ఉండేవి. వైశ్యులెక్కువగా ఉండేవాళ్ళు. వాళ్ళంతా మమ్మల్ని ఎంతో ఆత్మీయంగా తీసుకున్నారు. మా ఇంటి యజమాని కూడా వైశ్యులే. పిన్నిగారూ, బాబాయ్ గారు అని పిలిచేదాన్ని. కాగితాల మీద ఎంతగా కులం మతం అన్న పట్టింపులులేవని ఎందరన్నా, వాస్తవ జీవితంలో అలా ఉండదు. అక్కడి వాళ్ళు కొంచెం మొహమాట పడుతూనే “మీరే కులం?స్వస్థలం ఎక్కడ? అత్తామామ లెక్కడుంటారు?" ఇలాంటి వివరాలు అడిగేవాళ్ళు. నేను రెడ్డి పిల్లననీ, మా వారు కమ్మకులస్థులనీ, మాది కులాంతర వివాహంమనీ చెప్పేదాన్ని. మరింత లోతుగా అడిగితే మాది ప్రేమ వివాహమైనందున, అటుపెద్దలూ, ఇటు పెద్దలూ ఎవరూ రారనీ, ఇంతక్రితం ఫ్యాక్టరీ నడిపి నష్టపోయినందున విద్యాబోధనలోకి వచ్చానని చెప్పాను. ఆ వీధిలో అందరూ మా పాపని బాగా ముద్దు చేసేవాళ్ళు. కాలేజీ నుండి ఇంటికి వస్తూనే నా బిడ్డ ఏ ప్రెస్ లో ఉందా అని చూస్తూ వచ్చేదాన్ని. ఎక్కడ నవ్వులు విన్పిస్తే అక్కడ నాకూతురున్నట్లే!

అప్పటి వరకూ నాకు తెలంగాణా ప్రాంతం పెద్దగా తెలియదు. [హైదరాబాదు బాగా తెలిసినా, అక్కడి నగర సంస్కృతిలో మిశ్రమసంస్కృతే తప్ప తెలంగాణాతనం నాకు కన్పించలేదు] సూర్యపేటలో తొలిసారి దసరా పండుగకి తెలంగాణాతనం చూశాను. బతుకమ్మల్ని పేర్చటం, పండుగనాటి సాయంత్రం ఊరందరూ పాలపిట్టని చూడటానికి పోవటం, మురుకుల వంటి పిండివంటలు నాకు తెగ నచ్చేసాయి. కోస్తా జిల్లాల్లో సంక్రాంతి మాకు తగని వేడుక. నెలరోజుల పండుగ. శ్రీరామనవమి కళల జాతర. అయితే ఈ ఉత్సవాలు, నేను స్కూలు చదువు దాటి కాలేజీ చదువుల కొచ్చేసరికి మెల్లిగా కనుమరుగు అయ్యాయి. నేను బాగా చిన్నతనంలో ఉండగా, దసరా సంబరాలు కొంచెం గుర్తున్నాయి. పులివేషగాళ్ళు, పగటి వేషగాళ్ళు వచ్చేవారు. నాకు నాలుగేళ్ళుండగా మా ఇంటికి దగ్గరలోని వీధి బడిలో పెద్దబాలశిక్ష చదువుకుంటున్నాను. ఆదుర్తి సుబ్బారావు గారి ‘తోడికోడళ్ళు’ సినిమాలో చూపినట్లు అబ్బాయిలు పూలవిల్లంబుల బొమ్మలూ, అమ్మాయిలు కోతిబొమ్మలూ [పుల్లకి కోతిబొమ్మ ఉంటుంది. తాడు తాగితే పైకి క్రిందికి ఆడుతుంది] పుచ్చుకొని, బడిలోని అందరు విద్యార్ధుల ఇళ్ళకీ వరుసగా తిప్పేవారు. మాష్టారికి దక్షిణా, పిల్లలకి మరమరాలు, పప్పూ బెల్లం పంచేవాళ్ళు. తెలుగు పద్యాలు ఇంటింట చెప్పించేవాళ్ళు. మా ఇంటికీ మాష్టారు, పిల్లలూ వచ్చినప్పుడు మానాన్నగారు మా మాష్టారికి పంచెల చాపు పెట్టారట.

‘పావలా పరకైతే పట్టేది లేదు
అర్ధరూపాయి ఇస్తేను అంటేది లేదు
పిల్లవాళ్ళకు చాలు పప్పు బెల్లాలు
అయ్యవారికి చాలు అయిదు వరహాలు’

అంటూ పాడిన పద్యాలు మాత్రం గుర్తున్నాయి. తర్వాత్తర్వాత దసరా పండగ అంటే క్యార్టర్లీ పరీక్షల తర్వాత వచ్చే 10 రోజుల సెలవులుగా మారిపోయాయి. అలాంటిది, సూర్యాపేటలో దసరాపండుగ మళ్ళీ చిన్నప్పటి రోజుల్ని గుర్తుకు తెచ్చింది. మా ఇంటి చుట్టుప్రక్కల గృహిణిలతోకలిసి బతుకమ్మ పేర్చటం నేర్చుకున్నాను. రెల్లుపూలు, గడ్డిపూలకి రంగులద్ది, బంతీచామంతుల్లాంటి పూలు, ఆకులు కలిపి ఎంతో ఆకర్షణీయంగా బతుకమ్మల్ని పేర్చారు. మా పాపకీ చిన్నబతుకమ్మని పేర్చి గుడిదగ్గరికి అందరితో కలిసి వెళ్ళాను. చదువుకున్నవాళ్ళు, చదువుకొని వాళ్ళు అని లేకుండా అందరూ ప్రసాదాలు ఇచ్చి పుచ్చుకుంటూ ‘ఇచ్చినమ్మా వాయనం, పుచ్చుకుంటినమ్మ వాయనం’ అంటూ, సద్దుల బతుకమ్మ అంటూ ఆ పండగ నాకు చాలా ఇష్టంగా అన్పించింది. పండుగరోజు సాయంత్రం దాదాపు ఊరంతా నిర్మానుష్యమై పోతుంది. అందరూ వూరి చివరికి పాలపిట్టని చూడటానికి అంటూ వెళ్తారు. ఆ రోజు పాలపిట్టని చూస్తే అదృష్టం వస్తుందట. జమ్మిచెట్టు దగ్గర ఆకులు తీసుకొని జేబుల్లో, పుస్తకాల్లో పెట్టుకుంటారు. అప్పటివరకూ నాకు ఇవన్నీ తెలియదు.

వాటన్నింటికీ నేను బాగా ఆనందించాను. మరోవైపు విద్యాబోధనలో సిలబస్ పూర్తి చేసుకొచ్చాను. ‘జనవరి మొదటి తేదీకల్లా సిలబస్ పూర్తి చేసి, కనీసం రెండుసార్లు రివిజన్ చెయ్యాలి’ అన్నది నా ప్రణాళిక. పిల్లలూ చురుకైన వాళ్ళు కావటంతో, వాళ్ళని బాగా ప్రోత్సహించాను. సబ్జెక్టు మొత్తం ఒక్కచేత్తో డీల్ చేస్తున్నాను. కనుక, మంచి ఫలితం తెచ్చుకుంటే భవిష్యత్తుకి ఢోకా ఉండదన్నది నా ఊహ. అందుకోసం నేను బాగా కష్టపడుతూ, పిల్లల్ని కష్టపెడుతూ ఉన్నాను. అప్పటికి ఊళ్ళో కూడా మా కాలేజీ పేరు మారుమ్రోగుతుంది. పిల్లలు కూడా నెల్లూరు, గుంటూరులలో చదువుకుంటున్నా తమ 10 వతరగతి క్లాస్ మేట్స్ తో ఎంసెట్ సిలబస్ పోల్చుకుంటూ తమ టీచింగ్ ఎలా ఉంది, అక్కడ టీచింగ్ ఎలా ఉన్నది కనుక్కొనేవాళ్ళు.

అప్పటికి డిసెంబరు మొదటివారంలో ఉన్నాము. నేను సీనియర్, జూనియర్ ఇంటర్ పిల్లలకి దాదాపు 90% సిలబస్ పూర్తి చేశాను. [ఒక్క ఛాప్టర్ మిగిలి ఉంది.] ఇంటర్ సిలబస్, ఎంసెట్ సిలబస్ కూడా దాదాపు 90% పూర్తయ్యింది. ఊళ్ళో కాలేజీకీ, నాకు పేరుబాగుంది. యాజమాన్యానికీ, నాకూ మధ్య చెప్పుకోదగిన గొడవలంటూ ఏంలేవు. నిజానికి సూర్యాపేటలోని ఈ కాలేజీ డైరక్టరు అత్తగారి ఇల్లు, గుంటూర్లో ఎక్సల్ కాలేజీ ఉన్న ప్రాంతంలోనే ఉండేది, అశోక్ నగర్ లో. అప్పుడు మా ఇల్లు కూడా అదే కాలనీలో. అతడి అత్తగారి ఇంటిప్రక్కన గల నా స్టూడెంట్స్, నాగురించి ఇచ్చిన మంచి రిపోర్ట్ కారణంగా కూడా అతడు తన పత్రికా ప్రకటనకి వచ్చిన ఇద్దరు లెక్చరర్స్ ని కాదని నన్ను ప్రిఫర్ చేసినట్లు అంతకు ముందు రోజుల్లో చెప్పడం జరిగింది. ఏవిధంగా చూసినా కాలేజీ యాజమాన్యం నాతో వివాదం పెట్టకునే అవకాశం లేదు.

అలాంటి స్థితిలో, హఠాత్తుగా కాలేజీ యాజమాన్యం డిసెంబరునెల మొదటి వారంలో salary కూడా ఇవ్వకుండా “మీరు పిల్లలకి చెబుతున్నది వాళ్ళకి అర్థం కావడం లేదట. స్టూడెంట్స్ ఫిర్యాదు చేస్తున్నారు. కాబట్టి మీ సర్వీస్ ఇక మాకు అవసరం లేదు. రేపటి నుండి మీరు కాలేజీకి రానవసరం లేదు” అని చెప్పింది. ఈ హఠాత్పరిణామానికి నేను విస్తుపోయాను. సిలబస్ దాదాపు పూర్తయ్యింది కాబట్టి రెమ్యూనరేషన్ ఎగ్గొట్టేందుకు కాలేజీ ఈ ఎత్తుగడ పన్నింది అనుకుందామన్నా, మరి తర్వాత సంవత్సరం అడ్మిషన్ల మాటేమిటి అని ఆలోచిస్తుంది కదా! అప్పుడు మహా అయితే నాకు ఓ 50 వేలు ఎగ్గొట్టగలదు. అంతకంటే నన్నుకొనసాగిస్తే వాళ్ళకొచ్చే ఆర్ధికలాభమే ఎక్కువ. అలాంటి పరిస్థితిలో ఈ పరిణామాన్ని అర్ధం చేసుకోలేక పోయాను. మనకి అర్ధమైనా, కాకపోయినా పరిస్థితులూ, కాలమూ ఆగవు కదా!

ఊరు గాని ఊరు. ఏం చెయ్యాలో తోచలేదు. చుట్టుప్రక్కల వాళ్ళు స్నేహంగా ఉన్నంతమాత్రన ఈ విషయంలో ఏం సాయం అడగ్గలం? సూర్యాపేటకి దగ్గర్లో ఉన్న కోదాడ మండలంలో నా బాల్య మిత్రుడున్నాడు. అతడికి తండ్రి గారి నుండి వారసత్వంగా వచ్చిన సినిమా హాలు, రైసుమిల్లూ వంటి భారీ ఆస్తులున్నాయి. తన మాటల్లోనే చెప్పాలంటే కోటీశ్వరుడు. ఇతడు నాకు ఆంధ్రప్రదేశ్ బాలల అకాడమీ నిర్వహించిన ఏపీదర్శన్ మిత్రుడు. అప్పట్లో నేను గుంటూరు జిల్లానుండీ ఆ కార్యక్రమానికి ఎంపిక అయితే, ఇతడు ఖమ్మం జిల్లానుండి ఎంపికయ్యాడు. స్వంతఊరు కోదాడ మండలంలోనిది. నన్ను అక్కా అని పిలిచేవాడు. అతనికి ఫోన్ చేసి, ఏంచెయ్యాలో సలహా చెప్పమనీ, వీలయితే సహాయం చెయ్యమని అడిగాను. సూర్యాపేటలో లోకల్ పంచాయితీలు చేసి తగవులు తీర్చేనాయకులు [వివిధపార్టీల వారు] ఉండేవారు. అలాంటి ఓ నాయకుడు మొరిశెట్టి సత్యనారాయణ [తెదేపా టౌన్ ప్రెసిడెంట్] కు నాగురించి చెబుతానని, వెళ్ళి కలవమని నా బాల్యమిత్రుడు చెప్పాడు. నేనూ, నాభర్తా వెళ్ళి, అతణ్ణి కలిసి విషయం వివరించాం. ఆ నెల జీతం కూడా ఇవ్వలేదని చెప్పాం. అతడు కనుక్కుంటానని చెప్పాడు. ఇంటికొచ్చేసరికి మా కాలేజీ డైరక్టరు బావమరిది, తానే అసలు డైరక్టరునంటూ, మరిద్దరు పెద్దమనుష్యుల్నీ, నా కొలిగ్స్ ఇద్దరినీ వెంటబెట్టుకొని వచ్చాడు. ఆనెల జీతం ఏడు వేలు ఇస్తామని, వెళ్ళిపొమ్మని చెప్పాడు. [అప్పటికి ఇంకా నాకు 52,000/- Rs. రావలసి ఉంది. 5 నెలల సర్వీసు ఉంది. 10% సిలబస్ పూర్తి చెయాల్సి ఉంది. రివిజన్ ఉంది.] అతడి ప్రపోజల్ ని నేను తిరస్కరించాను. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కావడానికి ఇంకా 5 నెలలుంది. సంవత్సరం మధ్యలో ఎక్కడ మళ్ళీ జాబ్ వెదుక్కోగలను? ఆ తర్వాత మొరిశెట్టి సత్యనారాయణ, నాభర్తని పిలిపించి 10,000/-Rs. ఇప్పిస్తానని, తిరిగి మాఊరికి వెళ్ళిపోవలసిందని చెప్పాడు. నా బాల్యమిత్రుడు ఈ విషయమై ఇక ఏం చెయ్యలేనని పరోక్షంగా సూచించాడు.

ఇక మా పరిస్థితి నిస్సహాయంగా మారింది. ఆ స్థితిలో నేను స్థానిక పోలీసు స్టేషన్ ని అప్రోచ్ అయ్యాను. మొత్తం వివరాలు వ్రాసి ఇచ్చి, ఇది సెక్షన్ 420 క్రిందికి వస్తుందో రాదో నాకు తెలియదు, మేం నాన్ లోకల్. నాకు హెల్ప్ చెయ్యండి అని అక్కడి సి.ఐ.ని రిక్వెస్ట్ చేశాను. అతడు ముస్లిం. రంజాన్ ఉపవాసం పాటిస్తున్నాడు. అతడంతా విని న్యాయం చేస్తానని హామీ ఇచ్చాడు. అయితే కాలేజీ డైరక్టరు రాజకీయనాయకులని ఆశ్రయించాడు. వారం గడిచింది. పోలీసు స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాము. ఇంతలో ఓరోజు పోలీసు స్టేషన్ కు మా కాలేజీ డైరెక్టరు, మొరిశెట్టి సత్యనారాయణ, ఇతరులు కలిసి వచ్చి ‘సరే 25,000/- రూ. ఇస్తాము. వెళ్ళిపొమ్మని’ అన్నారు. మాకేం చెయ్యాలో అర్ధంకాలేదు. నిస్సహాయంగా చూస్తూ ఊరుకోవాల్సి వచ్చింది. మర్నాడు 25,000/- రూ. ఇస్తారు, కేసు వెనక్కి తీసుకోవాల్సి ఉంది. అప్పటికి ఈ గొడవ ప్రారంభమై పదిహేను రోజులయ్యింది. రోజూ పోలీసు స్టేషన్ కి వెళ్ళటం, అక్కణ్ణుంచి గుడికి వెళ్ళటం. దేవుడు తప్ప ఇంకే దిక్కు లేదు. నిరాశ, నిస్పృహలు చుట్టుముడుతున్నా, దైవం మీద భారం వేసి మర్నాడు పోలీసు స్టేషన్ కి వెళ్ళాం. అప్పటికి అక్కడ మధుసూదన్ రావు అనే వ్యక్తి, మరొకాయన ఉన్నారు. తమని తాము మా కాలేజీ విద్యార్ధుల పేరెంట్స్ గా పరిచయం చేసుకున్నారు. వాళ్ళు నామీద, కాలేజీ యాజమాన్యం మీదా కూడా కేసు పెట్టారట. ఇది విని మొదట నేను మ్రాన్పడిపోయాను. తర్వాత తెలిసిందేమిటంటే, ఈ పేరెంట్స్ ఇద్దరూ, ముఖ్యంగా మధుసూదన్ రావు వాళ్ళ అబ్బాయిని కాలేజీలో చేర్చడానికి వచ్చినప్పుడు నాతో కూడా మాట్లాడారట. [అడ్మిషన్ల సమయంలో యాజమాన్యం మా చేతకూడా పేరెంట్స్ ని కౌన్సిల్ చేయించినందున, అప్పుడు నేను చాలామంది పేరెంట్స్ తో మాట్లాడాను. కనుక ప్రత్యేకించి ఇతణ్ణి గుర్తించలేకపోయాను.] ఈ పేరెంట్స్ కాలేజీ డైరక్టర్ని “పోయిన సంవత్సరంలో లాగా మధ్యలో లెక్చరర్లు వెళ్ళిపోరుగా” అని అడిగాడట. “ఈ లెక్చరర్స్ గుంటూరు నుండి వచ్చారండి. సంవత్సరం గ్యారంటీగా ఉంటారు. Terms నచ్చితే తర్వాతి సంవత్సరాలు కూడా కంటిన్యూ అవుతారు” అని కాలేజీ డైరక్టరు చెప్పాడట. ఈ పేరెంట్స్ నన్ను కూడా అడిగితే “నేను సంవత్సరం కాంట్రాక్టు మీద వచ్చానండి. బాగా చెబుతాం. రిజర్ట్ మంచిగా వస్తే అప్పుడు మీరూ, మా డైరెక్టర్ గారు, అందరూ కంటిన్యూ చెయ్యమనే అంటారు కదా! మేం ఎక్కడైనా జాబ్ చేసుకునేదే అయినప్పుడు, ఇక్కడ బాగా ఉంటే ఇక్కడే ఉంటాం కదా. ఏమయినా సంవత్సరం మధ్యలో మాత్రం ఎట్టిపరిస్థితిల్లో వెళ్ళిపోం” అన్నానట.

అదే అతడు వ్రాతపూర్వకంగా వ్రాసి, ‘పంపించి వేస్తామనడానికి కాలేజీ డైరెక్టరు ఎవరూ, వెళ్ళి పోతామనడానికి ఈ లెక్చరర్ ఎవరు? ఇద్దరు కలిసి సంవత్సరంపాటు మా పిల్లలకి చదువుచెబుతామని మాట ఇచ్చారు. అడ్వాన్సుగా ఫీజు మొత్తం కట్టించుకున్నారు. ఇప్పుడు మధ్యలో మమ్మల్ని పుట్టి ముంచుతారా? ఇది అన్యాయం’ అంటూ కేసు పెట్టాడు. ఆ క్షణం నాకైతే దేవుడు కనబడ్డాడనిపించింది. ఒక్కదెబ్బతో పరిస్థితి మొత్తం మారిపోయింది. స్థానిక రాజకీయనాయకులు తెరవెనకకి తప్పుకున్నారు. మొరిశెట్టి సత్యనారాయణ పోలీసు స్టేషన్ కి కొచ్చి కొంతలాబియింగ్ చేయటానికి ప్రయత్నించాడు. కుదరలేదు. పేరెంట్స్ ససేమిరా అన్నారు. ‘మా పిల్లల భవిష్యత్ ఏం కావాలి?’ అని అడిగారు. పోలీసు సి.ఐ. పేరెంట్స్ ని సమర్ధించాడు. మొత్తంగా ఆనాడు పోలీసు స్టేషన్ లో నాకు పూర్తిగా న్యాయం జరిగింది. రెండురోజుల్లో విషయం మొత్తం సెటిల్ అయ్యింది. అప్పటికప్పుడు నాకు రావలసిన ఆనెల salary ఇప్పించారు. తాజాగా అగ్రిమెంట్ వ్రాయించారు. ఎంసెట్ పరీక్ష వరకూ నేను క్లాసులు తీసుకునేటట్లు, యాజమాన్యం నాకు ప్రతినెల 9 తేదీ లోపల salary ఇచ్చేటట్లు వ్రాయించారు. నేను ఆ పేరెంట్స్ కీ, పోలీసు సి.ఐ., ఎస్.ఐ., ఇతర సిబ్బందికీ కృతఙ్ఞతలు చెప్పుకున్నాను. మళ్ళీ కాలేజీకి వెళ్ళటం మొదలు పెట్టాను. సి.ఐ. నాకు ఒక మాట చెప్పాడు “చూడండమ్మా. మీ పనే మిమ్మల్ని కాపాడుతుంది. పిల్లలకి చదువు చెప్పటంలో ఏమాత్రం ఆశ్రద్ధ చెయ్యకండి. ఈ గొడవలనీ మనస్సులో పెట్టుకోకుండా మీ పని మీరు చేయండి, ఏసమస్యలు రాకుండా వారం, పది రోజుల కొకసారి మధుసూదన్ రావు గారు మీ కాలేజీ వచ్చి వివరాలు కనుక్కుంటారు. మీ కేమయిన సమస్యలు ఉంటే ఆయనికి చెప్పండి” అని చెప్పాడు. రంజాన్ మాసంలో ఓ నిస్సహాయరాలికి న్యాయసహాయం చేసితీరాలి అన్న నిబద్దత కనబడింది నాకు అతడిలో. మనసారా కృతఙ్ఞతలు చెప్పుకున్నాను. నాకైతే సాక్షాత్తు భగవంతుడు అతడి నోట ఆమాట చెప్పించాడేమో అన్పించింది. ఆ తరువాత నెలరోజుల వ్యవధిలోనే అతడికి ట్రాన్స్ ఫర్ వచ్చింది.


ఆ తర్వాత కాలేజీ యాజమాన్యం నన్ను ‘ఎల్లిమీద మల్లి, మల్లి మీద పిల్లి’ వంటి సిల్లీ కారణాలతో విసిగించినా నేనవి పట్టించుకోలేదు. ఈ నేపధ్యంలో ఓరోజు మాకాలేజీ అటెండర్ ఏదో పనిమీద మా ఇంటికి వచ్చాడు. యాజమాన్యం ఏదైనా కబురు చెప్పమంటేనో, ఏదైనా పుస్తకాలు కోసమో అప్పుడప్పుడు అతడు మా ఇంటికి వస్తు ఉంటాడు. మా పాపని బాగా ముద్దు చేసేవాడు. అతడు మాఇంటికి వచ్చినప్పుడు టిఫిన్ లాంటివి ఇచ్చేదాన్ని. పండగ పబ్బాలప్పుడు చేసిన పిండివంటలు అతడి భార్యాపిల్లల కోసం ఇచ్చేదాన్ని. ఆరోజు అతడు “మేడం. నిన్న డైరక్టరు సార్ గుంటూర్లో మీరింతకు ముందు పనిచేసిన కాలేజీకి ఫోన్ చేసిండు. మీరింతకు ముందు ఎంసెట్ చెప్పారా లేదా అని అడిగాడు. ఆ ప్రక్క మీసారంటా. గంటసేపు ఫోనులో వాయించాడు. ముందు సిలబస్ అయ్యిందా లేదా అని అడిగిండింట. అయ్యిందని డైరక్టరు సార్ చెప్పిండు. ఇంక మీసార్, డైరక్టరు సారునీ, ఫోనులో గంటసేపు తిట్టిండు. సిలబస్ అంత చెప్పేదాకా తెలియలేదా ఆ అమ్మాయి ఎంసెట్ చెప్పగలగుతుందో లేదో అంటూ తెగ తిట్టిండంట. STD bill మస్తయ్యిందని సార్ గొణుక్కుంటుండు” అని అటెండరు చెప్పాడు. ఇవన్నీ సహనంగా భరించాను. ఒకే ధ్యాసగా చదువుచెప్పడంలో మునిగిపోయాను. సిలబస్ పూర్తి చేసి రెండుసార్లు రివిజన్ కూడా చేసాను. ఎంసెట్ సిలబస్ మాసార్ చలపతి రావుగారి పుస్తకంలోని దాదాపు 7000 ప్రశ్నలే గాక, రత్నం, వికాస్ వంటి ఏవేవో మెటీరియల్స్ students తెచ్చేవాళ్ళు. కాలంతో పందెం పెట్టుకొని మరీ ఫిజిక్స్ లెక్కలూ, ప్రశ్నలూ చేయించేదాన్ని. మొత్తానికి నాశక్తిమేరకూ, నాతృప్తి మేరకూ పనిచేసాము; పిల్లలూ, నేను కూడా! ఎంసెట్ పరీక్షకు ముందురోజు పిల్లలందరి నుండి విడ్కోలు తీసుకున్నాను. కాలేజీ యాజమాన్యం చివరి salary ఇస్తూ “అయ్యిందేదో అయ్యింది. ఇప్పుడు మీసంగతి మాకర్థమయ్యింది. మా సంగతి మీకు అర్థమయ్యింది. Next year continue చెయ్యండి” అన్నాడు. అప్పటికే వాళ్ళు నా సహనాన్ని పరీక్షించారు. చాలా విసిగించారు. అందుకే సున్నితంగానే అయినా నిర్మోహమాటంగా తిరస్కరించాను.

కాలేజీ యాజమాన్యం నాకు డబ్బు ఎగ్గొట్టి, పోలీసు స్టేషన్ లో గొడవ అయిన తర్వాత నేను ఇంటిదగ్గర ట్యూషన్లు చెప్పడం మొదలుపెట్టాను. మాధ్స్ ఎంసెట్ [దీప్తి పబ్లికేషన్] చెప్పెదాన్ని. తదుపరి సంవత్సరం సూర్యాపేటలో ఉండటమా, లేక గుంటూరు వెళ్ళిపోవటమా అని ఆలోచిస్తున్నాను. ఏ నిర్ణయమూ తీసుకోలేక పోయాము. పిల్లలకి కష్టపడి చదువు చెప్పాను. ఏ ఫలితం వస్తుందో తెలియదు. ‘గత సంవత్సరం ఎక్సల్ కాలేజీలో అలాగే పనిచేసాను. అక్కడ నాకుమంచి ఫలితం రాలేదు. అయితే భగవంతుడు నాకు ఆ కర్మఫలాన్ని మరో ఊర్లో [సూర్యాపేటలో] ఇచ్చాడు. అలాగే ఇప్పుడూ కష్టపడ్డాను. నిష్కామంగా మన పని మనం చేస్తే భగవంతుడి పని భగవంతుడు చేస్తాడు. నమ్ముకున్న వాళ్ళని నట్టేట ముంచడు గదా దేవుడు?’ అనుకున్నాము. సరే తిరుపతి వెళ్ళి వచ్చాక ఏవిషయమూ ఆలోచిద్దాం అనుకుని తిరుపతి వెళ్ళాము.

తిరిగి వచ్చేసరికి, అదే ఊర్లోని మరో కాలేజీ[Triveni] వాళ్ళు మాకోసం చాలా సార్లు తిరిగారని మా ఇంటి యజమాని చెప్పారు. మేం స్నానపానాలు ముగించే లోగా వాళ్ళు మళ్ళీ వచ్చారు. తమ కాలేజీలో పని చెయ్యమని ఆఫర్ చేశారు. ‘మీకు ఎంత కావాలంటే అంత ఇస్తాం. మీ terms చెప్పండి’ అన్నారు. మేం ‘ఆలోచించి చెబుతాం’ అన్నాం. వాళ్ళు విడిచిపెట్టలేదు. అప్పటికే క్రితం నేను పనిచేసిన కాలేజీ లోని ఓ విద్యార్ధినికి టాప్ 10 లోపల ర్యాంకు వస్తుందని ఆ కాలేజీ డైరెక్టరు చెప్పుకుంటున్నాడు. ‘పిల్లలు బాగా చదివారు. నేనూ బాగా చెప్పాను. మంచి రిజల్ట్ రావచ్చు’ అని మేమూ అనుకున్నాము. ఈ దశలో త్రివేణి కాలేజీ వాళ్ళు మమ్మల్ని బాగా ఒత్తిడి చెయ్యసాగారు. గత సంవత్సరం అనుభవం దృష్టిలో పెట్టుకొని “మేం ఇంటిదగ్గర ట్యూషన్లు చెప్పుకుంటాము. మీ కాలేజీలో రోజుకి 5 ఆవర్స్ తీసుకుంటాను” అంటూ సంవత్సరానికి లక్షరూపాయలు డిమాండ్ చేసాను. అంతేగాక ‘సంవత్సరం మొత్తం నాతో ఒక్క డైరెక్టరే డీల్ చెయ్యాలనీ, ఒకోసారి ఒక్కొక్కరు డైరెక్టర్ నంటూ terms మార్చకూడదని’ కండిషన్ పెట్టాను. ముందుగా 40,000/- రూ. Advance ఇవ్వాలనీ మిగిలిన 60,000/-Rs. నెలకు 5,000/-Rs. చొప్పున ఇవ్వాలనీ, అన్నీ అగ్రిమెంట్ లో వ్రాసుకొని పరస్పరం అంగీకరించాక అగ్రిమెంటు వ్రాసుకొని కాలేజీలో అడుగుపెట్టాను. ట్రయల్ క్లాసులు తీసుకుంటున్నాను.

ఇంతలో ఎంసెట్ రిజల్ట్స్ వచ్చాయి. నా విద్యార్ధుల్లో ఒకరికి ఇంజనీరింగ్ లో 126 ర్యాంకు వచ్చింది. [1999 EAMCET] ఆ సంవత్సరం ఫిజిక్స్ లో రెండు ప్రశ్నలు డిలీట్ చేశారు. ఆ విద్యార్ధినికి 48/48 మార్కులు వచ్చాయి. ఇంకా 40 మంది ఉన్న సెక్షన్ లో, 22 మందికి మంచిర్యాంకులు వచ్చాయి. అందరికీ ఫిజిక్స్ లో ఎక్కువ మార్కులు రావడమే ర్యాంకులు తెచ్చిపెట్టింది. అప్పటికి ఇంజినీరింగ్ లో 25,000 సీట్లే ఉండేవి. ఈ రిజల్టుతో ఒక్కసారిగా ఊరు మారుమోగిపోయింది.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

2 comments:

Chala baaga raasthunanru Aadi Lakshmi gaaru....

Mari Exel college lo Maths lecture GSR garu kooda oka partener kadha? athanu endhuku bayataku vachi GSR college pettadoo meeku thelusaa?


Nenu 98-99 Degree maths tution ki GSR gaari daggariki vellevadini,, Naaku thelisinatha varaku ithanu chaala manchivadu. Poor students ki thakkuva fees ki kooda tution cheppevadu. 99 tharuvatha degree tution cheppadam maanesaadu.

చంద్ర గారు,

ఎక్సెల్ లో GSR గారితో నాకూ పరిచయం ఉందండి. ఆయన JKC college నుండి వచ్చిన Maths Lecturer. మంచి వ్యక్తి. బాగా చెబుతారని పేరున్న వ్యక్తి. రాయపాటి శ్రీనివాస్ నుండి నేను రికమండ్ చేయించుకుంది ఈయనకే. నాకు క్లాసులు ఇచ్చేటప్పుడు కూడా నా పసిబిడ్డని దృష్టిలో పెట్టుకొని మరీ Time table వేసిచ్చాడాయన. తర్వాత ఎక్సెల్ నుండి బయటికొచ్చి GSR Institutions పెట్టుకున్నాడు. కారణాలు నాకు తెలియదు. అప్పటికే నేను సూర్యాపేట వెళ్ళిపోయాను.

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu