భారతదేశం మీద దశాబ్దాలుగా జరుగుతున్న కుట్రకు స్వదేశంలో స్వదేశీ విదేశీ హస్తాలు, విదేశాల్లోని విదేశీ హస్తాలు ఎంతగా సహాయ సహకారాలందిస్తూన్నాయో సుస్పష్టంగా మన కళ్ళకి కట్టినట్లుగా కనబడుతోంది.

ఇందుకు తాజా సజీవ దృష్టాంతం చూడాలంటే నాలుగు రోజుల ముంబాయి ముట్టడి.

నాలుగు రోజులు గడిచేసరికి, రెక్కాడితే గానీ డొక్కాడని జనం రోడ్ల మీదకొస్తారు. బ్రతుకుపోరాటం మొదలుపెడతారు. అది సహజమే కాదు, అనివార్యం కూడాను. కానీ పత్రికలదీ, మీడియాదీ అలాంటి పరిస్థితి కాదు కదా! వారి వృత్తీ, భుక్తీ కూడా వార్తా సేకరణే కదా! మరలాంటప్పడు పత్రికలు చాలా మామూలుగా మరో రాజకీయ సంచలనాన్ని వెదుక్కొని, దాన్ని హైలైట్ చేస్తూ హైసరబజ్జాలూ లేదా ప్రజాదృష్టి హైజాకూలూ ఎందుకు చేస్తోంది?

ఎందుకు దీన్ని ప్రజాదృష్టి హైజాక్ అంటున్నానంటే ....

1. ముంబాయి ముట్టడి లో ప్రజలకి ఎన్నో సందేహాలున్నాయి. అది తీర్చుకోవడానికి మనం ముంబాయికీ, తాజ్ హోటల్ కీ వెళ్ళలేం. మన దైనందిన వృత్తివ్యాపారాలు, ఆర్థిక వనరులూ మనల్ని అనుమతించవు. అధవా వ్యయప్రయాసల కోర్చి మనం వెళ్ళినా, పరిశోధించడానికి అక్కడ మనకెవరూ అనుమతివ్వరు. మీడియాకైతే ఇలాంటి అవాంతరాలేవీ లేవు. వారి వృత్తి, భుక్తీ అది కనుక అనుమతులూ, ఆర్ధిక వనరులూ వారికి అడ్డుకావు. మరలాంటప్పడు ప్రజల ప్రాణాలు కాపాడ్డానికి ప్రాణాలు అర్పించిన మన జవాన్లకు అశ్రునివాళులూ, కన్నీటి కళాంజలులూ సమర్పించడంతో మన పని అయిపోయింది’ అన్నట్లు ఇక రాజకీయ పేలుళ్ళు అంటూ టాపిక్ మార్చేసాయేం? ప్రతీసారి ఇదే కదా జరుగుతుంది!

2. తొక్కలోది, ఓ అసమర్ధ ఇంటి మంత్రిని ఇంటికి పంపడానికి, అతడు అసమర్ధడని తెలుసుకోవడానికి ఇంతకాలం పట్టిందా కేంద్ర ప్రభుత్వ కుర్చీ వ్యక్తి అయిన నాయకురాలు నాగమ్మకి? ఇంకో 4 నెలల్లో ఎన్నికలు రానుండగా, దేశంలో ఈ నాలుగున్నరేళ్ళలో బొచ్చెడు సార్లు బాంబులు పేలి వందల ప్రాణాలు పోయాక ఈ ఇంటి మంత్రికి తన నైతిక బాధ్యత గుర్తొచ్చింది. అసలు ఒక నియోజకవర్గ ప్రజల ఆమోదమే పొందలేక ఓడిపోయిన సదరు వ్యక్తిని రాజ్యసభలో నుండి దొడ్డిదారిన తెచ్చి ఇంటి మంత్రిగా నిలబెట్టింది నాయకురాలు నాగమ్మ. ఎందుకంటే తన కాళ్ళమీదపడే విధేయత అనబడే ఏకైక అర్హత అతడికి దండిగా ఉంది కనుక. దాన్ని నిక్కచ్చిగా పేర్కొంటూ [సెప్టెంబర్ 13 న ఢిల్లీలో బాంబులు పేలినప్పడు సదరు ఇంటి మంత్రి ’తను ఎవడికీ జవాబుదారీ కాదని, తనకి అధిష్టానాపు ఆశీస్సులున్నాయనీ ఢంకా భజాయించి మరీ చెప్పడాన్ని బిత్తరపోయి చదివిన కోట్లాది పాఠకుల్లో నేనూ ఒకర్ని. ఇంకో జోక్ ఏమిటంటే సదరు క్రొత్తగా వచ్చిన ఇంటి మంత్రి చిదంబరం, ధరల బాంబులతో ప్రజల ప్రాణాలు పోతుంటే విసుగ్గా లేదా నిర్లజ్జగా లేదా నిర్భాధ్యతగా “ప్రపంచవ్యాప్తంగా ధరలు పెరుగుతున్నాయి. రాత్రికి రాత్రి ధరలు తగ్గించాడానికి నాదగ్గర మంత్రదండమేం లేదు” అన్నాడు.

రేపు మరో నాలుగు నగరాల్లో 40 బాంబులు పేలి ఓ 400 మంది మరణించీ, మరో 4000 మంది గాయపడ్డాక అంతే నింపాదిగా “ప్రపంచ వ్యాప్తంగా టెర్రరిజం పెరుగుతోంది. రాత్రికి రాత్రి టెర్రరిజం తగ్గించడానికి నాదగ్గరేం మంత్రదండం లేదు” అంటాడు కాబోలు.
లేదా తాపీగా “మరో మూడు నాలుగు నెలల్లో ధరలు తగ్గుతాయి” అన్నట్లుగా “మరో మూడు నాలుగు నెలల్లో టెర్రరిజం తగ్గుతుంది” అంటారేమే.

ఈ పాటిదానికి ముంబాయి ముట్టడిలో ఉగ్రవాదుల వెనుక ఉన్న మర్మాల్ని, రాజకీయ కుతంత్రాన్ని, దేశం మీద స్వదేశీ హస్తము, విదేశీ హస్తము కలిసి చేస్తున్న కుట్రనీ వదిలేసి, పతాక శీర్షికలు వ్రాయడం అవసరమా? రాజకీయ నాయకులు ఏది చెబితే అది వ్రాసి పత్రికల్ని అమ్ముకోవడమే పత్రికవిలువలా? నాయకులను మన తరుపున నిలదీసి అడిగే బాధ్యత మీడియాకు లేదా?

నిజంగా మీడియాకి చిత్తశుద్ధి ఉంటే సామాన్య ప్రజలమైన మనకే కలిగిన తార్కికపు సందేహాలు పరిష్కరించడానికి పరిశోధించదా?

ఈ ముట్టడి వార్తల్లో, జరుగుతున్న సంఘటనల్లో ఎన్ని లొసుగులు ఉన్నాయో మీరే గమనించండి.

i]. దాడిని తిప్పికొట్టి, ముష్కరుల్ని తుదముట్టించిన జవాన్లు, కమెండోలూ, సాక్షులుగా మిగిలిన బాధితులు స్వయంగా చెప్పారు - ఆ టెర్రరిస్టులు విచ్చలవిడిగా కాల్పులు జరిపి, విచక్షణారహితంగా మనుషుల్ని చంపిన ప్రతీ సారీ అల్లాహో అక్బర్ అని అరిచారనీ [ఇప్పటికీ టెర్రరిజం కి మతంతో ముడిపెట్టకూడదు సుమా]

ii]. ఆహోటల్లో గదులూ, వరండాలూ తమకి ఎంతో గజిబిజిగా ఉందనీ, టెర్రరిస్టులు ఎంతో మామూలుగా, తమకెంతో పరిచయమున్నట్లుగా కలియతిరిగారనీ,

iii]. ఎంత బ్లూప్రింట్ స్టడీ చేసినా అది అసాధ్యం. రెక్కీ నిర్వహించితే తప్ప సాధ్యం కాదు. ఏకంగా టెర్రరిస్టులు ఆ హోటళ్ళలో తమకు కంట్రోలు రూములని ఏర్పరుచుకొన్నారు. హోటల్ మేనేజిమెంట్ కో, సిబ్బందికో తెలియకుండా ఇదెలా సాధ్యం? ఎవరో టూరిస్టులు వచ్చి రూం లో దిగితే, వాళ్ళ గదికి ఎవర్ని బడితే వారిని అతిధిలుగా వచ్చి పోవడాన్ని, పెద్ద సూట్ కేసులో సంచులో ఇచ్చిపోవడాన్ని సిబ్బంది కళ్ళప్పగించి చూస్తూ ఉంటుందా? అంత మందు గుండు సామాగ్రి, మరణాయుధాల్ని ఎలా లోపలికి చేరవేసారు? కొన్ని పత్రికల్లో వార్తలొచ్చినట్లుగా ట్రైనీ ఛెఫ్ కూరగాయల్లో, సంచుల్లోనో అందించాడా? [ఒక్కడికి అది సాధ్యమా?] సామాన్యులం మనం హోటల్ లో దిగడానికి వెళ్ళితే మెటల్ డిటెక్టర్ లోంచి వెళ్ళాలి. మన లగేజి స్కానర్ లోంచి బయటికొస్తుంది. మరి టెర్రరిస్టులు ఈ అడ్డంకిని ఎలా అధిగమించారు? ఎవరి సహాయ సహకారాలతో అధిగమించారు?

తమ సిబ్బంది సహకారం ఏమాత్రం లేదని తాజ్ హోటల్ మేనేజ్ మెంట్ ప్రకటన జారీ చేసింది.మరలాంటప్పడు టెర్రరిస్టులు ముందుగా సిబ్బందినెందుకు చంపారు? ఏ రహస్యాలు వెలికి వస్తాయని చంపారు? అసలు మృతులు 170+ మందిలో హోటల్ సిబ్బంది ఎందరు?

ఇదంతా ఇలా ఉండగా, తమ అతిధుల్ని అంతగా చెకింగ్ చేయమని, అది వారికి అవమానంగా భావిస్తారని వి.ఐ.పి. లని శోధించమని హోటల్ ఒకదశలో చెప్పినట్లు వార్తలొచ్చాయి. అంటే సామాన్యులు మాత్రమే నేరం చేస్తారని వారి ఉద్దేశమా? అందుకే మనలాంటి సామాన్యుల్ని మాత్రం మెటల్ డిటెక్టర్ లతోనూ, లగేజ్ ని స్కానర్ లతోనూ శోధిస్తారు గానీ వి.ఐ.పి. లకి అలా శోధించరా? అంటే వి.ఐ.పి.లు నేరం చేయరా? అసలింతకీ వి.ఐ.పి. లంటే ఎవరూ? సమాజంలో పేరు, పలుకుబడీ, ప్రకటిత ముఖమూ[హోదా] కలవారా? అలాగైతే టెర్రరిస్టులు సెలబ్రిటీలు కారు గదా? మరివచ్చేటప్పడు సోదా మినహాయింపు ఎలా పొందగలిగారు? మంచి ఖరిదైన దుస్తులేసుకొస్తే వి.ఐ.పి.లైపోతారా? మరెలా లోపలికి చేరి, ఆయుధాలు చేర్చి, కంట్రోలు రూములు ఏర్పాటు చేసుకోగలిగారు కేవలం ఇద్దరు లేదా ముగ్గురు టెర్రరిస్టులు? రతన్ టాటా చెబుతున్నట్లు వెనక దారి నుండో, వంట గదిలో నుండో సిబ్బంది కంటపడకుండా హోటల్ లోకి రావడం సాధ్యమా?

iv]. అంతేకాదు, వందల కిలోమీటర్ల సముద్రప్రయాణం చేసివచ్చిన వెంటనే దాడికి తెగ పడటం మానవ మాత్రుడికి సాధ్యం కాదని, కమెండోలు చెబుతున్నమాట. మరివాటి పూర్వాపరాలేమిటి?

v]. అంతేకాదు, ఎ.టి.ఎస్. ఛీఫ్ హేమంత్ కర్కరే, ఏ.సి.పి. అశోక్ కామ్టే, ఎన్ కౌంటర్ స్పెషలిస్టు విజయ్ సలాస్కర్ - ముగ్గుర్నీ ఒకేవాహనంలో ప్రయాణిస్తూ, టెర్రరిస్టులు చేతికి నేరుగా చిక్కిపోయేలా నడిపిన వైర్ లెస్ మెసేజ్ లు వెనుక ఏమాజిక్ ఉంది? లేకుంటే ఇద్దరు ఐ.పి.యస్. లూ, ఒక ఇన్ స్పెక్టర్ ఒకే వాహనంలో ఒకేసారి ప్రయాణం చేయరు గదా? ఈ విషయంలో ప్రాణాపాయం నుండి బైటపడ్డ మరో పోలీస్ కానిస్టేబుల్ అరుణ్ జాదవ్ ని పలకరించి మరిన్ని వివరాలు ఎందుకు పత్రికలు తెలుసుకోవూ? లేదా ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయవూ? తెలుసుకొని ప్రజలకెందుకు తెలియజేయవూ? టాటా తన హోటల్ లోకి వచ్చిన మందుగుండు సామాగ్రి ఎలావచ్చిందో చెప్పకుండా, రోజుకో రకంగా చెబుతూ ప్రభుత్వం నిఘా వైఫల్యం వలననే ఈ దాడి జరిగినట్లు ఎదురు దాడి జరుపుతున్నాడు. దానికి పత్రికలు, ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఊరుకుంటున్నాయి? టాటా రోజు వారి సమాధానాలు వ్రాయడానికి పత్రికలు అవసరమా?

ఇవేవి చెయకుండా, తాము ప్రజాభిప్రాయానికి ప్రతినిధులమనీ, ప్రజాభీష్టానికి తలకెత్తుకున్న నిలువెత్తు నిజాయితీ స్వరూపాలమనీ ఈ పత్రికలూ, మీడియా ఎలా చెప్పకొంటున్నాయి? దీన్ని నిర్లజ్జ అందామా? మీడియా మాయాజాలం అందామా? కుట్ర అందామా?

vi]. ఇందులో మరో నిగూఢ మర్మం కూడా ఉందండీ! ఎప్పడైనా ఏవీర సైనికుడైనా వీరమరణం పొందినప్పడూ ఈ పత్రికలు వ్రాతలు ఎలా ఉంటాయంటే ‘ఏదో ఈ రోజుకి అతడు హీరో! ఎల్లప్పడు అయితే ఏ చిరంజీవో లేదా అమితాబ్ బచ్చనో మాత్రమే హీరో’! అన్నట్లుంటుంది. దీన్నీ పూరి జగన్నాధ్ ఇటీవలి పోకిరి సినిమాలో విలన్ పాత్రధారి ప్రకాష్ రాజ్ నోటివెంట హీరో అయిన ఐ.పి.యస్. అధికారి పాత్రకు చెప్పించాడు. “ఏమిస్తార్రా? నువ్వుఛస్తే? మీటరు రిబ్బన్ ముక్కలు ముక్కలుగా కత్తిరించి మూడుగంటలుంచి తీసేస్తారంతే. నీ ఇంటికో ఏభై వేల రూపాయల చెక్కు పంపిస్తారు. నువ్వొక్కడివే నావైపుండు. ఏం కావాలంటే అదిస్తా. ఎంత కావాలంటే అంతిస్తా” అంటాడు.

ఈ పత్రికలు వార్తలూ, టీవి దృశ్యమాలికలూ, మీడియా కవరేజ్ మొత్తం లో వాళ్ళ ఇంట్యూషన్ [వాళ్ళ అంతర్గత అభిలాష] పాఠకుల్లో టెర్రరిస్టుల పట్ల భయోత్పాతాన్ని, ప్రజల్లో పిరికితనాన్నీ నూరిపోయాలన్నట్లే ఉంటుంది. పోకిరి లాంటి సినిమాలు ఒకటి రెండే. వందల, వేలసినిమాల్లో ఫిర్యాదు చేసిన వాడు బడావిలన్ల చేతిలో నానాచావులు చచ్చినట్లు చూపించిన సినిమాలే ఎక్కువ. హీరో అన్యాయాన్ని ఎదిరించే క్రమంలో అన్నీ పోగొట్టుకొని, చివరి సీన్లో చావుతప్పి కన్నులొట్టబోయినట్లు, కష్టపడి న్యాయాన్ని గెలిపిస్తాడు. అందుకోసం పోరులో కుటుంబాన్ని, ఉద్యోగం లేదా వ్వాపారాన్ని, సమాజంలో హోదానీ అన్నిటినీ పోగోట్టుకుంటాడు. ఇలాంటి కధాంశంతో ఎన్ని సినిమాలు వచ్చియుంటాయో లెక్కలేదు. పత్రికల్లో వార్తలైతే ఈ రోజు ’హైదరా బాద్ లో ఓ గ్రూప్ టూ అఫీసర్ ని పట్టుకుంటే 500 కోట్లరూపాయలు అక్రమాస్తులు” అంటూ వార్తా, అతడి ఇల్లు, కార్ల ఫోటోలు ఆర్ఫాటంగా వేస్తారు. నాలుగు రోజుల తర్వాత అతడి సస్పెన్షన్ అంటూ ఓ మూల సింగిల్ కాలమ్ న్యూస్ వ్రాస్తారు. మరో రెండు నెలల తర్వాత అక్రమార్కులకే మళ్ళీ పట్టం అంటూ అతడి సస్పెన్షన్ రద్దు అయ్యి, పదోన్నతి పొందిన వైనాన్ని ఆసక్తికరంగా, ఆకర్షణీయంగా ప్రజల దృష్టిని ఆకర్షించేంత సైజులో వార్త వ్రాస్తారు.

వెరసి సినిమాలైనా, పత్రికలైనా ప్రజల్లోకి పంపించే సంకేతాలేమిటంటే “ఈ రోజుల్లో అన్యాయమే జయిస్తూంది. లంచగొండులదే రాజ్యం. డబ్బున్న వారిదే గెలుపు” అన్న స్లో పాయిజన్.

ఇందుకు ఉదాహరణలే మోత్యనాయక్ లూ, లాకర్లలో కరెన్సీ నోట్లకు చెదలు పట్టించిన బహుద్దూర్ లూ, సరసాదేవిలూ వగైరా వగైరాలు. ఇది నిజానికి ఈ మీడియామాయా నాణానికి ఒక ప్రక్కే. ప్రభుత్వం, రాజకీయ నాయకులూ కూడా ప్రతీ తప్పకీ ఒక రేటు, ప్రతీ ప్రమోషన్ కూ ఓ రేటు, ప్రతీ అసైన్ మెంట్ కూ ఓ రేటు తో, మీడియా పంపించే సంకేతాలని మరింతగా అలాంటి సంఘటనల్ని నిజం చేసి చూపిస్తారు. ఇక ఈ నైతిక దిగజారుడు తప్ప గత్యంతరం లేని స్ధితికి ప్రజల్ని తోసేయడానికి ఎటూ మీడియా దగ్గర ‘పదే పదే అదే ప్రచారం’ అన్న [స్ట్రాటజీ] తంత్రం ఉండనే ఉన్నది కదా!

ఉదాహరణకి ఈ నాటి సంఘటనే తీసుకొండి. ప్రజల ప్రాణాలు కాపాడటానికి, టెర్రరిస్టుని ప్రాణాలతో పట్టుకోవాడానికి టెర్రరిస్ట్ తూటాలకి గ్రేట్ వాల్ అఫ్ ఇండియా లాగా అడ్డం పడి వీర మరణం పొందాడు ఏ.యస్.ఐ. తుకారాం ఓంబ్లే. ఇతని బలిదానం వల్లనే కసబ్ అనే ఉగ్రవాది సజీవంగా పట్టుబడ్డాడు. ఈ కధనాన్నిఆంధ్రజ్యోతి నెట్ ఎడిషన్ స్ఫూర్తిదాయకంగా వ్రాసింది. మరో పత్రిక ఈనాడు తాపీగా 13 వపేజిలో మూలన సింగిల్ కాలమ్ లో వ్రాసింది. అదే ఈనాడు ‘అమితాబ్ బచ్చన్ తలక్రింద రివ్వాలర్ పెట్టుకొని నిద్రపోతాను’ అని తన బ్లాగ్ లో వ్రాసినది మాత్రం ప్రముఖంగా ప్రచురించింది. ప్రజలకు ఏది స్ఫూర్తిదాయకం అని లీడింగ్ పత్రిక ఈనాడు అభిప్రాయం?

వాస్తవానికి ప్రభుత్వం మీద ప్రజలు రగిలిపోతున్నారన్నది మనం అనుభూతిస్తున్న నిజం. ప్రకటితమౌతున్న నిజం. మరి ఈ నిజం పత్రికలకి, మీడియాకి ఎందుకు కన్పించటం లేదు? ఎందుకిలా అంటున్నానంటే ప్రజలలో రగులుతున్న జ్వాల పత్రికల్లో కంటే బ్లాగులోకంలో ఎక్కువ కన్పిస్తూంది, మనచుట్టు ఉన్న మనతోటి వారి మాటల్లో విన్పిస్తూ ఉంది గనుక.

Vii]. పైన చెప్పిన దృష్టాంతానికి మద్దతుగా మరో సజీవ ఉదాహరణ వ్రాస్తాను.

2001 లో పార్లమెంట్ పై ఉగ్రవాదులు దాడిచేసిన కేసులో, పట్టుబడ్డ అఫ్జల్ గురుని సుప్రీం కోర్టు మరణ శిక్ష వేసినా ఉదార హృదయం గల యు.పి.యే. ప్రభుత్వం ఇంతవరకూ అమలు చేయలేదు. ఇది మాత్రమే మనకు ఎక్కువ తెలుసు. కానీ పోయిన సంవత్సరం అంటే డిసెంబర్ 14 వతేది 2007 న ఆనాటి ఉగ్రవాదుల దాడి నుండి భారతదేశపు పరువూ మర్యాదా కాపాడ్డానికి ప్రాణాలర్పించిన మన రక్షణ సిబ్బందికి మనం అశ్రునివాళి అర్పించాం. విశేషమేమిటంటే ప్రభుత్వం కూడా కేవలం కన్నీటి కళాంజలి మాత్రమే అర్పించింది. కావాలంటే 14-12-2007న ఈనాడు వార్తపత్రిక లో ప్రచురితమైన వార్త లో ’మీ సంతాపాలు ఎవరిక్కావాలి?’ అంటూ మా బ్రతుకులు రోడ్డున పడ్డాయి, మమ్మల్ని పట్టించుకోండి అంటూ ఆ వీరుల కుటుంబ సభ్యులు ఆక్రోశించారు. దానిపై సుష్మా స్వరాజ్ స్పందిస్తూ “ప్రభుత్వం వారికేమీ చేయలేదని వారంటున్నారు. అదేనిజమైతే అది చాలా విచారించవలసిన విషయం” అని ఎంతో గంభీరంగా చెప్పింది. నిజానికి 2001 లో బి.జె.పి. కూటమి ఎన్.డి.ఏ. హయంలో దాడి జరిగితే 2004 వరకూ వారే అధికారంలో ఉన్నారు. ౩ ఏళ్ళల్లో వాళ్ళకీ తీరలేదు ఆవీరుల బుణం తీర్చుకోవడానికి. మరో 3 లేదా 4 ఏళ్ళయినా యు.పి.ఏ. ప్రభుత్వానికీ తీరలేదు వారి బుణం తీర్చుకోవడానికి. ఏరాయి అయితే నేం పళ్ళూడ గొట్టడానికి?

ఈ వార్తల్ని ప్రచురిస్తూ, ప్రచారిస్తూ మీడియా, “దేశం కోసం ఛస్తే ఒక రోజు అందరూ ’జోహరు’ అంటారు. మర్నాడే మరిచిపోతారు. తర్వాత రోడ్డున పడేది నీ కుటుంబమే!” అన్న సందేశాన్నే ప్రజలకు నూరిపోస్తూంది.

Viii]. ఇది మరింత స్పష్టంగా మనకు అర్ధం కావాలంటే మరో దృష్టాంతం చూడండి. ఆనాటి స్వాతంత్ర సమరయోధులు పింఛన్ల కోసం ఈనాటి అవినీతి రాజకీయ నాయకుల[ వీళ్ళకి పొట్టకూడా వంగనీయదు] కాళ్ళమీద పడ్డారు. ఎంత దయనీయం? నిజంగా ఇది మనకెంత సిగ్గుచేటు? ఆనాడు వారు యువకులు. తెల్లవాడు అయిన బ్రిటిషు వాడికి, వాడి మౌంటు బాటన్లూ లేదా వెల్లసీలూ [ఏ గోంగూర వైస్రాయి లైనా] తెల్లవాళ్ళు. వాళ్ళు శతృవులన్న స్పృహ పోరాట స్ఫూర్తిని రగిలిస్తూంది. పోరాటంతో స్వతంత్రం సంపాదించి వారసత్వంగా మనకిచ్చారు. అందునా తెలంగాణా పోరాట వీరులు ఒక్క తెల్లవాడికి మాత్రమే వ్యతిరేకంగా కాదు, కౄర, కుటీల నిజాములకూ వ్యతిరేకంగా పోరాడారు. అలాంటి వారు నేడు వయసుడిగిన వృద్దులు. ఆనాటి శక్తీ,సామర్ధ్యం ఇప్పడుండటానికి వాళ్ళు భారతీయుడు సినిమాలోని కమల్ హసన్ లు కాదు. అలా ఉండి ఉంటే ఈనాటికి ఒక్క నల్లతోలు వైస్రాయలూ [అంటే ప్రధానమంత్రిలూ, గృహ మంత్రులూ, కుర్చీ వ్యక్తులూ అన్నమాట. పొరబాటు కుర్చీ వ్యక్తి తెల్ల జాతీయరాలు లెండి] మిగిలి ఉండే వాళ్ళు కాదు. పోరాట స్ఫూర్తి పొందటానికి ఈనాడు అధికారంలో ఉంది శతృవులా కనబడే దోపిడి చేసిన తెల్లవాళ్ళు కాదు. మితృల్లా కనబడీ దగా చేస్తూన్న నల్లవాళ్ళు.

వారికి జరుగుతున్న అన్యాయాన్ని మీడియా వ్రాసేటప్పడు కూడా అదే సంకేతం - సత్యహరిశ్చంద్రుడు కథ మీది జోక్ లాంటి సంకేతం లేదా పోకిరి సినిమాలోని ప్రకాష్ రాజ్ సంభాషణ లాంటి సంకేతం. “ఏమిచ్చింది నీ దేశభక్తి నీకు” అనే సంకేతం? పరిశీలించి చూస్తే ఇదంతా పకడ్బందీ గా అమలు జరుపబడుతున్న కుట్రని నిరూపితమౌతుంది.

దానికి వీడియో టేపులు సాక్ష్యం అక్కర్లేదు. స్ధాయీ సంఘాల ఎంక్వయిరీలు అక్కర్లేదు.

జరుగుతున్న సంఘటనల్ని తార్కిక దృష్టితో విశ్లేషిస్తూ పరిశీలించండి.

నిజమేమిటో ఖచ్చితంగా అర్ధమైపోతుంది.

ఇది ముగించే ముందు మరో చిన్న విషయం:

సహారా ఇండియా కంపెనీ అధినేత సుబ్రతో సహారా, ముంబాయి ముట్టడిలో ప్రజల ప్రాణాలు కాపాడటానికి ప్రాణాలు కోల్పోయిన జవాన్లుకు, యోధుల కుటుంబాలకు మరో 10 సంవత్సరాలు లేదా వారి పిల్లలకూ 21 ఏళ్ళు నిండే వరకు ప్రతీనెలా వారి మూలవేతనానికి ఐదురెట్లు పంపిస్తామనీ అందుకు 50 కోట్ల రూపాయల దాకా కేటాయిస్తూన్నామనీ ప్రకటించింది. అదే ఫిక్కీ అయితే నానా మూలుగులు మూలిగి ఒక కోటి రూపాయలు కేటాయించింది. ఎంత వితరణ! ఎంత వితరణ!

ప్రభుత్వం తమకు సరిగా రక్షణ కన్పించలేదని రతన్ టాటా దగ్గరనుండి కొందరు పారిశ్రామికవేత్తల దాకా కినుక తెలిపారు. తాము లాభాలు సంపాదించుకొంటారు. తమ సంస్ధలకు ప్రభుత్వం రక్షణ కల్పించాలి. ప్రజా ధనం వినియోగించాలి. తము మాత్రం ప్రాణాలర్పించిన యోధుల గురించి కనీసం ఆలోచించను కూడా ఆలోచించదు.

ఔను మరి వాళ్ళు దేశాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తున్న మహాత్మాలు గదా![ న్యూయర్క్ టైమ్స్ పత్రిక ముకేష్ అంబానీన్ని మహాత్మా గాంధి స్ధాయి పాత్ర అతడిదంటూ ప్రశంసించింది. వార్త పూర్తి వివరణ కోసం ఈనాడు 18-06-‘08 వార్తని చూడగలరు]

ఇక బాలివుడ్ బాద్షాలు, తోలు తోక్కావుడ్ చక్రవర్తులూ అస్సలు కిక్కురమనరు. మరి వాళ్ళు కెరియర్ దావూద్ ఇబ్రహీం ల్లాంటి డాన్ ల చేతిలో ఉందని, స్కూలు పిల్లలా వాళ్ళకి ఈ హీరోలు ఫిర్యాదులు చేసుకుంటారనీ మనం సంజయ్ దత్, సల్మాన్ ఖాన్ టెలిఫోన్ టేపులు బైట పడ్డప్పడే తెలుసుకున్నాం గనుక ఇప్పడు క్రొత్తగా ఆశ్చర్యపోనక్కరలేదు. అయితే కోలివుడ్ లో ముంబాయి పోరాట యోధులకు నివాళి అర్పించటానికి చిన్న నటులు వచ్చారు కాని పెద్ద నటులకూ పాపం కుదరలేదు. ఇక్కడ తెలియటం లేదూ ఫిల్డ్ ను ఎవరు గ్రిప్ చేస్తూన్నారో?

అయితే రానున్న నూతన సంవత్సర వేడుకల్లో, పదిహేను నిమిషాల నృత్యానికి కోటిన్నర రూపాయలు తీసుకొంటున్న బిపాసా బసులూ, కత్రినాకైఫ్ లూ, 50 కోట్లు , 70 కోట్లు పారితోషికం లందుకుంటున్న హీరోలూ అస్సలు పలకటం కూడా లేదు.

వారికి వారే దిండు క్రింద రివాల్వర్లు పెట్టుకొని కాపాడు కోగలిగే హీరోలు కాబట్టి వారికి దేశం పట్ల బాధ్యత లేదు కాబోలు.

కానీ పత్రికలకి, మీడియాకి ఈ ముంబాయి సినిమా నటీ నటులకు తమ బాధ్యతనీ, నైతికతనీ గుర్తుచేసే బాధ్యత లేదా?

ఇలా జాబితా వ్రాస్తూ పోతే ఇంకా ఎన్నో వ్రాయాలి.

కొన్ని వ్రాసాను. మీరు పరిశీలించండి.

తదుపరి టపాలో మరికొన్ని విషయాలు.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

18 comments:

ఆది లక్ష్మి గారు,
మీ విష్లేషన చాలా బాగుంది.ఎ.టి.ఎస్ వారు అందరూ కట్టగట్టుకొని వెల్లిన విషయాన్ని గురించి పత్రికలు పట్టించుకోక పోవడం నిజంగా శోచనీయం.

Graet Job
చాలా బాగా చెపారు

Great Job

చాలా బాగా చెపారు

ముందుగా మీకు చేతులెత్తి మనస్పూర్తిగా నమస్కరిస్తున్నాను, గత వారం రోజులనుంచీ గూడుకట్టున్న ఆక్రోశం,వేదన,అసహనం, కొంతమంది మీదకలిగిన ఏహ్యభావం మనసులోంచి బయటకిపోక కొట్టుమిట్టాడుతున్నాను..నిజానికి దీనిమీద టపా కూడా మొదలుపెట్టాను, కానీ మీ టపా చూసిన తర్వాత ఆ అవసరం ఇక లేదనిపించింది, బహుసా నేను ఇంత బాగా రాయలేను కూడా..

ముంబైలో దాడి మొదలైనప్పటినుంచీ విరామంలేకుండా 36 గంటలు TVచానెల్స్ చూసిన నాకు టెర్రరిస్టులపై కలిగిన కోపం...ఈ TV మీడియా పైన కలిగిన ఏవగింపు,అసహ్యం ముందు నిలబడలేకపొయింది. ఒబెరాయ్ లో బ్రతికి బట్టకట్టినవారు ఆ బాధ,భయం నుంచి తేరుకునెలోపే..మీ అనుభవం ఏంటి, ఎలా బ్రతికారు, మిమ్మల్ని తీవ్రవాదులు కొరికార? కొట్టారా..అని వెంటపడి తరుముతున్న 'బర్ఖాదత్ 'ని చూసి ఒసే పనికిమాలిన ముండా ( క్షమించండి నిగ్రహించుకోలేను) నువ్వసలు మనిషి పుట్టుక ఎలా పుట్టావ్ అని అడగాలనిపించింది. మృతుల సంఖ్య ఇంకా పెరగలేదే అని భాదపడుతున్నట్టుగా..పదే పదే చనిపోయినవారి సంఖ్య అడుగుతూ అదికారులను విసిగించడం చూసినతర్వాత తీవ్రవాదులు వీళ్ళనెందుకు పట్టుకోలేదురా అని భాదపడ్డాను.

ఒక పక్క పుకార్లతో జనం బిక్కు బిక్కుమంటూ ఉంటే, అగ్నికి ఆజ్యంలాగా పుకార్లను కూడా బ్రేకింగ్ న్యూస్ అని ప్రతీ నిమిషం ప్రసారం చేసి జనాల్ని తీవ్రవాదులకంటే చిత్రవధ చేసారు.

ఇంకా పాఠం నేర్చుకోని ( నేర్చుకోలేని) ఈ నపుంసక ప్రభుత్వం మీడియ స్వయం నియంత్రణ పాటించాలని చెప్పి తన చేతకానితనాన్ని మరోసారి బయటపెట్టుకుంది.

ఇంకా ఎంతో చెప్పాలని వుంది...పేరుమోసిన TVమేధావులనందరినీ తనివితీరా బండబూతులు తిట్టాలని వుంది...సమయం లేక ఆపేస్తున్నాను.

ఈరోజు 'తీవ్రవాదులు ' ఎంత ప్రమాదకరమయినవారో ఈ ' మీడియా' అంత ప్రమాదాకరం అనడంలో అనుమానంలేదు.

What interest public need not necessarily be in public interest అనే మూలసూత్రాన్ని పత్రికలూ మీడియా మర్చిపోయాయి.

చాలా అద్భుతంగా వ్రాశారు మాష్టారూ. ప్రతీ అక్షరంతోనూ ఏకీభవిస్తాను.

లక్ష్మి గారు చాల ఓపిక గా వ్రాసారండి ధన్య వాదాలు.
సగటు తెలివితేటలు వుండి చుట్టు ప్రక్కల ఏమి జరుగుతుందో గమనించే మనకే ఇన్ని ప్రశ్నలు వుంటే ఇంక పత్రికా మేధావులకు ఎన్ని వుండాలి? ఎన్నున్నా దేశమేమౌతున్నా వ్యాపారవేత్తలకి(పత్రికాధిపతులంతా వ్యపార వేత్తలేకదా?) కావల్సింది డబ్బు,పత్రిక నడ్డు పెట్టుకొని సామ్రాజ్య విస్తరణ.మనిషి గా పుట్టి ఎంతటి దైవత్వము ఆపాదించుకొన్నా ఎదో ఒక లోపము వుండి తీరాలి.Idealogy theory మాత్రమె.ఆచరణ యోగ్యము కాదు.కాకపొతే ప్రతిదానిలోనూ నాకేంటి లాభం అనే అలోచనే ఇప్పుడు మన వ్యవస్తకు పట్టిన దరిద్రము.ప్రతిదీ డబ్బుతో ముడి పడి పోయింది. కనీసము దేశ భక్తిని,సార్వ
భౌమత్వాన్ని,తార్కిక అలో చనలను పాఠకుని మనసులలో రగిలించలేని నాడు పత్రికలు కరపత్రలే ఔతాయి.

వ్యాసం చాలా అద్బుతంగా ఉందండి.
మంచి పరిశీలనలు ఉన్నాయి.
చాలా ప్రశ్నలకు ఎంత ఆలోచించినా సమాధానాలు రావటం లేదు.
i could sense the grave situation.

>> అంతేకాదు, ఎ.టి.ఎస్. ఛీఫ్ హేమంత్ కర్కరే, ఏ.సి.పి. అశోక్ కామ్టే, ఎన్ కౌంటర్ స్పెషలిస్టు విజయ్ సలాస్కర్ - ముగ్గుర్నీ ఒకేవాహనంలో ప్రయాణిస్తూ, టెర్రరిస్టులు చేతికి నేరుగా చిక్కిపోయేలా నడిపిన వైర్ లెస్ మెసేజ్ లు వెనుక ఏమాజిక్ ఉంది? లేకుంటే ఇద్దరు ఐ.పి.యస్. లూ, ఒక ఇన్ స్పెక్టర్ ఒకే వాహనంలో ఒకేసారి ప్రయాణం చేయరు గదా?

>>అసలు మృతులు 170+ మందిలో హోటల్ సిబ్బంది ఎందరు?

>>విచక్షణారహితంగా మనుషుల్ని చంపిన ప్రతీ సారీ అల్లాహో అక్బర్ అని అరిచారనీ [ఇప్పటికీ టెర్రరిజం కి మతంతో ముడిపెట్టకూడదు సుమా] ..

నిజమే మీరన్నది. వీటికి సమాధానాలు దొరకవు. ఎంతో లోతైన విశ్లేషణ జరిగితే కాని ఇవి బయటకు రావు. మరి మన రాజకీయ నాయకులు జరగనిస్తారా ?

Very good post.Keep it on

బాగా రాశారు.

ఏమి కామెంట్ రాయాలొ అర్థంకావటం లెదండీ...నిజం మీరు రాసిన ప్రతి వాక్యం, ప్రతి అక్షరం నిజం ...దానికన్న మీలొని సంఘర్షణ నిజం నిజం నిజం...

కళ్లు చెమరతున్నాయి ఎమీ చెయ్యలెని నిస్సహయతతొ......

చాలా బాగా విశ్లేషించారు.

లాగిపెట్టి కొట్టినట్టు చెప్పారు !! అద్బుతం !! వచ్హె వారం లొ 5 రాష్ట్రల ఎన్నికల ఫలితాలు , క్రికెట్ మాచ్ లు ,మళ్ళీ మన రాష్ట్ర ఎన్నికలు, దేశ ఎన్నికలు తొ అందరూ అన్ని మర్చిపోతారు

అంతా ఆవేదనే.

ఒకటిమాత్రం నిజం "బాధ్యతా రాహిత్యం". అటు రాజకీయ నాయకులదైనా, ఇటు మీడియా దైనా.

బాగా రాశారండీ..
మీరు చెప్పిన జీరోలు, ఓ వారాం ఆగి..ముంబై బాధితులకోసం క్రికెట్టు ఆడతాం, ముంబై బాధితులకోసం స్టెప్పులు గెంతుతాం అంటూ వస్తారు...
అంతే కానీ ఇంత వరకు సంపాదించిన దానిలోంచి రూపాయి తీయరు....


ఊకదంపుడు

చదువుతున్నంతసేపూ జమదగ్నిలా రగిలిపోయాను,మాటలు తూటాల్లాగా పేల్చారు. కనీసం బ్లాగుల్లోనయినా మీలా రాస్తే బాగుంటుంది,అలాగే రాద్దాం! మీకు మాత్రం నా అభివందనాలు!!!

మీ ఆవేశం, ఆక్రోశం, ఆవేదన నాకు అర్ధమయ్యాయి. ఎందుకంటే ఇవన్నీ నేనూ అనుభవించాను కాబట్టి.
ఈ రోజు మీ ఆవేశం చూస్తూంటే 1992 లో, నాటి ప్రధాని శ్రీ పి.వి. నరసింహారావు గారన్న “Do not under estimate the strength and wisdom of our people” అన్న మాట గుర్తు కొస్తోంది.
మీ సందేహాలన్నిటినీ నా తదుపరి టపాల్లో తీరుస్తాను. ఇంతకంటే ఎక్కువ వ్రాయటానికి ఈ వ్యాఖ్య పెట్టె సరైన చోటు కాదు.
అలాగే నేను మాష్టారిని కాదండి. పంతులమ్మని. ఇది మావారి మెయిల్ కి అనుసంధానించిన బ్లాగు.
నాలాగే మీలోనూ ఉన్న ఆలోచన, ఆవేశం, ఆక్రోశం, ఆవేదన, వివేచన నా ఆత్మ స్ధైర్యాన్ని మరింత పెంచాయి. అందరికీ పేరుపేరునా కృతఙ్ఞతలు.

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu